శశికళకు పన్నీర్ సెల్వం సవాల్ | Sakshi
Sakshi News home page

శశికళకు పన్నీర్ సెల్వం సవాల్

Published Wed, Feb 8 2017 10:59 AM

శశికళకు పన్నీర్ సెల్వం సవాల్

పార్టీ కార్యకర్తలు కోరుకుంటే ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాను తాను ఉపసంహరించుకుంటానని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ వర్గానికి ధైర్యం ఉంటే వాళ్లు కూడా తమ బలం నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు. తన బలమెంతో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదని, అదేదో సభలోనే చూపిస్తానని ఆయన అన్నారు. బుధవారం ఉదయం ఆయన తన నివాసంలో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.మైత్రేయన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ కేడర్, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే లక్ష్యమని, తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎప్పుడూ పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయలేదని చెప్పారు. ప్రస్తుత పరిణామాలతో బీజేపీకి ఎలాంటి సంబధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తనవెంట 70 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారని, తగినంత సమయం ఇస్తే మరింతమంది వెంట వస్తారని, తన బలం నిరూపించుకుంటానని అన్నారు. 
 
జయలలిత తనకు దేవతతో సమానమని, ఆమె అడుగు జాడల్లోనే నడుస్తానని పన్నీర్ సెల్వం అన్నారు. ఆమె మరణంపై తమకు అనుమానాలున్నాయని, అమ్మ మృతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నంతకాలం శశికళ తప్ప పెవరూ ఆమెను చూడలేదు, మాట్లాడలేదని గుర్తు చేశారు. అమ్మ చూపిన బాటలోనే డుస్తానని, పార్టీ పటిష్ఠత కోసమే పనిచేస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీకి విధేయుడినేనని అన్నారు.
Advertisement
Advertisement