భర్తను వదలి.. ఫేస్బుక్ ప్రేమికుడి కోసం | Sakshi
Sakshi News home page

భర్తను వదలి.. ఫేస్బుక్ ప్రేమికుడి కోసం

Published Wed, Aug 10 2016 3:12 PM

భర్తను వదలి.. ఫేస్బుక్ ప్రేమికుడి కోసం - Sakshi

యువతీ యువకుల మధ్య  ఫేస్బుక్ పరిచయాలు ప్రేమగా మారి, వివాహబంధంతో ఒక్కటయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే మరికొందరు వివాహబంధాన్ని వీడి ప్రేమికుడు/ప్రేమికురాలి కోసం పారిపోయిన సంఘటనలూ ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్లో రెండో రకం ఘటన జరిగింది.

ఓ యువతికి మూడేళ్ల క్రితం నాసిక్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహమైంది. ఫేస్బుక్ ద్వారా ఆమెకు ఇటీవల ఉత్తరాఖండ్లోని లోహఘాట్కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతను ఢిల్లీలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నెల 10న వివాహిత (25) తన భర్తను వదలి ప్రియుడి దగ్గరకు పారిపోయింది. ఆమె వెళ్తూ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకెళ్లింది.

భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఉత్తరాఖండ్లోని చంపావత్లో ప్రేమజంట ఉన్నట్టు  గుర్తించారు. నాసిక్ పోలీసులు చంపావత్ వెళ్లి వివాహితను గుర్తించి వెనక్కు తీసుకునివచ్చారు. కాగా విషయం తెలుసుకుని ఆమె ప్రియుడు పరారయ్యాడు.

Advertisement
Advertisement