దుర్దినం: స్పీకర్‌కు జగన్ లేఖ | Sakshi
Sakshi News home page

దుర్దినం: స్పీకర్‌కు జగన్ లేఖ

Published Fri, Feb 14 2014 4:10 AM

దుర్దినం: స్పీకర్‌కు జగన్ లేఖ - Sakshi

లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని, ప్రజాస్వామ్యానికి ఇదొక దుర్దినమని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకసభలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ స్పీకర్‌తో భేటీ సందర్భంగా జగన్ ఒక లేఖ ఇచ్చారు. ‘బిల్లును ప్రవేశపెట్టిన తీరు పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. సభ ఎజెండాలో తెలంగాణ అంశం లేదు. బిజినెస్ లిస్ట్‌లో లేదు. ఇలా ముందుగా తెలుపకుండా బిల్లు ప్రవేశపెట్టడమైందని చెప్పడం పార్లమెంట్ సంప్రదాయం కాదు. పార్లమెంట్ సంప్రదాయాల పరిరక్షకులుగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే వ్యక్తిగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లుగా మీరు అంగీకరించొద్దు.
 
 ఇది సాంకేతికంగా బిల్లు పెట్టినట్టు కానేకాదు. సభ్యులకు ముందస్తు సమాచారం లేకుండా ఇలా బిల్లు పెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. పైగా బిల్లును ప్రవేశపెట్టకుండానే ‘ప్రవేశపెట్టాం’ అని చెప్పుకుంటున్నారు..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. బిల్లుకు అవుననో, కాదనో చేతులెత్తకుండానే బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం సమంజసం కాదని వివరించారు. ఈ వాదనను పట్టించుకోని స్పీకర్ బిల్లును ప్రవేశపెట్టినట్లేనని చెప్పడంతో జగన్ అక్కడినుంచి వాకౌట్ చేశారు. సస్పెండయిన ఎంపీలు లేఖలిస్తే తీసుకోబోమంటూ జగన్ ఇచ్చిన లేఖను కూడా స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది. దీంతో అదే లేఖను స్పీకర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా జగన్ మరోమారు పంపారు.
 
 తొలి ఎంపీ జగనే
 తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టామని యూపీఏ సర్కారు చెప్పుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. బిల్లును ప్రవేశపెట్టడంపై గురువారం సభలో అందరికంటే ముందుగా లేచి అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంపీ ఆయనే.

Advertisement

తప్పక చదవండి

Advertisement