అందరి ముందే స్వాతిని చెంపదెబ్బలు కొట్టాడు! | Sakshi
Sakshi News home page

అందరి ముందే స్వాతిని చెంపదెబ్బలు కొట్టాడు!

Published Fri, Jul 1 2016 6:19 PM

అందరి ముందే స్వాతిని చెంపదెబ్బలు కొట్టాడు! - Sakshi

చెన్నై: గతవారం నుంగంబాకం రైల్వేస్టేషన్‌లో దారుణ హత్యకు గురైన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని ఓ వ్యక్తి చెంపదెబ్బలు కొట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే దుండగుడు స్వాతిని ఐదుసార్లు చెంపదెబ్బలు కొట్టాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

చెన్నైలో స్వాతి నివసించే ప్రాంతంలోనే నివసించే డీ తమిళరసన్ తాజాగా ఈ ఘటన గురించి వివరించారు. జూన్ మొదటివారంలో స్వాతిని వెంటాడుతూ వచ్చిన ఓ వ్యక్తిని రైల్వే స్టేషన్‌లో ఆమెను పలుసార్లు చెంపదెబ్బలు కొట్టాడని తెలిపారు. ‘స్వాతి ఆ దెబ్బలను మౌనంగా భరించింది. అతడిని ఏమాత్రం ప్రతిఘటించలేదు. ఆ తర్వాత మౌనంగా రైలెక్కి వెళ్లిపోయింది’ అని తమిళరసన్ చెప్పారు. అయితే, స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి, ఆమెను కిరాతకంగా చంపిన ఒక్కడే కాకపోవచ్చునని ఆయన చెప్పారు. స్వాతిని చంపిన వాడు నల్లగా ఉన్నాడని, చెంపదెబ్బలు కొట్టిన వ్యక్తి మాత్రం తెల్లగా కనిపించాడని తెలిపారు.

స్వాతిని గత శుక్రవారం చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట గత మే నెల నుంచి స్వాతిని వెంటాడుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోను గురువారం  చెన్నై పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

Advertisement
Advertisement