'ధోనీ' దుమ్మురేపుతున్నాడు! | Sakshi
Sakshi News home page

'ధోనీ' దుమ్మురేపుతున్నాడు!

Published Sat, Aug 13 2016 4:06 PM

'ధోనీ' దుమ్మురేపుతున్నాడు! - Sakshi

అతను ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ట్రెయిన్‌ టికెట్‌ ఎగ్జామినర్‌గా పనిచేసిన ఓ మాములు యువకుడు.. మొదట్లో క్రికెట్‌ అంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ, ఫుట్‌బాల్‌ ఆటలో గోల్‌కీపర్‌గా మంచి నైపుణ్యముంది. అదే అతన్ని అనుకోకుండా క్రికెట్‌ వైపు అడుగులు వేయించింది. వికెట్‌ కీపర్‌గా అంది వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను.. ఇప్పుడు యూత్‌కు స్ఫూర్తిమంతంగా నిలిచాడు. దేశం గర్వించే క్రికెటర్‌గా, రెండు ప్రపంచకప్‌లు అందించిన గొప్ప కెప్టెన్‌గా ఎదిగాడు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతనే.. 'మిస్టర్‌ కూల్‌' మహేంద్రసింగ్‌ ధోనీ! అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని.. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలను ధోనీ ప్రస్తానాన్ని..  బయటి ప్రపంచానికి తెలియని ఆయన అన్‌టోల్డ్‌ స్టోరీని తెలియచెప్పేందుకు త్వరలో రాబోతున్నది 'ఎంఎస్‌ ధోనీ'- ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా.

ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ట్రైలర్‌ను విడుదలచేసిన 36 గంటల్లోనే కోటికిపైగా మంది దీనిని వీక్షించారు. ఈ సినిమాలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించాడు. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా ఫాక్స్‌ స్టూడియో సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. మూడు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో దాదాపు 90లక్షలమందికి చూడగా.. ఫేస్‌బుక్‌లో దాదాపు 10లక్షలకుపైగా దీనిని వీక్షించారు. సెప్టెంబర్‌ 30న ఈ సినిమా విడుదల కానుంది.    
 

Advertisement
Advertisement