చీడపీడలను తట్టుకునే శక్తినిస్తుంది! | Sakshi
Sakshi News home page

చీడపీడలను తట్టుకునే శక్తినిస్తుంది!

Published Wed, Jun 11 2014 10:57 PM

చీడపీడలను తట్టుకునే శక్తినిస్తుంది! - Sakshi

పాడి-పంట: పంటలకు అవసరమైన ప్రధాన పోషకాలలో నత్రజని, భాస్వరం ఎరువుల గురించి గతంలో తెలుసుకున్నాం. వీటితో పాటు పంటలకు పొటాషియం అవసరం కూడా ఎంతో ఉంది. ఇది పంటకు చీడపీడల్ని తట్టుకునే శక్తినిస్తుంది. మరెన్నో ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో పొటాషియం వినియోగంపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, డాక్టర్ బి.పి.వర్ధని (వీరిని కార్యాలయ పనివేళల్లో ఫోన్ నెం. 1100, 18004251110లో సంప్రదించవచ్చు) అందిస్తున్న సూచనలు...
 
 ఎప్పుడు-ఎంత వేయాలి?
 ఏ పైరు అయినా దాని పంటకాలం పూర్తయ్యే వరకు పొటాషియం ఎరువును గ్రహిస్తూనే ఉం టుంది. అయితే పంట చురుకుగా ఎదిగే దశలో నూ, గింజలు తయారయ్యే దశలోనూ పొటాషి యం అవసరం ఎక్కువగా ఉంటుంది. పంటకు తొలి దశలో సుమారు 30%, ఆ తర్వాత సుమా రు 70% పొటాషియం ఎరువు అవసరమవుతుం ది. కాబట్టి బరువు నేలల్లో సిఫార్సు చేసిన పొటా ష్ మోతాదు మొత్తాన్నీ దుక్కిలో లేదా దమ్ములో వేసుకోవాలి. లేకుంటే విత్తనాలు విత్తేటప్పుడు లేదా మొక్కలు నాటేటప్పుడు వేయాలి. తేలిక నేలలైతే పొటాషియం ఎరువును 2-3 దఫాలుగా యూరియాతో కలిపి వేసుకోవచ్చు. మిరప, బంగాళదుంప, కాఫీ, నిమ్మ, ద్రాక్ష, పొగాకు పంటలకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (ఎస్‌ఓపీ) ఎరువు వేయాలి. మిగిలిన పంటలన్నింటికీ మ్యురేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) వేసుకోవాలి.  సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా కూడా పంటకు పొటాష్ ఎరువును అందించవచ్చు. అయితే వాటిలో పొటాషియం శాతం కొంత తక్కువగా (0.5% నుంచి 1.8% వరకు) ఉంటుంది. ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో, ద్రవ రూపంలో పొటాష్ ఎరువును మార్కెట్ చేస్తున్నాయి.
 
 లోపిస్తే ఏమవుతుంది?
 పొటాషియం ఎరువు లోపిస్తే ముందుగా ముదురాకుల్లో ఆ లక్షణాలు కన్పిస్తాయి. ఆకులు అంచు ల వెంబడి ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. అవి క్రమేపీ పసుపు రంగుకు మారి కాలినట్లు కన్పిస్తాయి. చివరికి ఆకంతా మాడినట్లు కన్పిస్తుంది. కాండం బలహీనంగా ఉంటుంది. మొక్కల్లో ఎదుగుదల ఉండదు. అవి గిడసబారి పొట్టిగా, పొదల మాదిరిగా కన్పిస్తాయి.
 
 ప్రయోజనాలెన్నో...
 పొటాషియం ఎరువు వల్ల పంటలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఎరువు మొ క్కల్లో జరిగే జీవ రసాయనిక క్రియల్ని నియంత్రిస్తుంది. ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియ వల్ల ఉత్పత్తి అయిన పిండి పదార్థాలను మొక్కలోని ఇతర భాగాలకు చేరుస్తుంది. పత్ర రం ధ్రాలు తెరుచుకోవడానికి-మూసుకోవడానికి, ఎంజైములను క్రియాశీలకం చేయడానికి దోహదపడుతుంది. వర్షాభావ పరిస్థితులు, చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవడానికి కూడా పొటాషియం ఎరువు ఉపకరిస్తుంది.
 
 పంటలు ముంపుకు గురైనప్పుడు నేలలో ఇనుప ధాతువు అధికమవుతుంది. దీనివల్ల కలిగే నష్టాన్ని పొటాష్ తగ్గిస్తుంది. అంతేకాదు... నత్రజని ఎరువును అధికంగా వాడడం వల్ల కలిగే దుష్ఫలితాలను కూడా కొంత వరకు నివారిస్తుంది. మాగాణి పొలాల్లో తెట్టు, పాచి పేరుకుపోకుండా నిరోధిస్తుంది. వివిధ పంటలకు వేసే నత్రజని, భాస్వరం, గంధకం వంటి పోషకాలు సమర్ధవంతంగా వినియోగమయ్యేలా పొటాష్ దోహదపడుతుంది.
 
 ఏ పైరుకు ఎలా ఉపయోగం?
 ఆహార ధాన్యపు పంటల్లో మొక్కల కాండం గట్టి పడాలంటే పొటాష్ ఎరువు వాడాల్సిందే. అంతేకాదు... పొటాష్ ఎరువును తగిన మోతాదులో వేస్తే పైరు చేనుపై పడిపోదు. గింజలు పూర్తిగా నిండుతాయి. దృఢమైన, బరువైన గింజలు ఏర్పడతాయి. దుంప జాతి పంటల్లో పిండి పదార్థం ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. చెరకు పంటలో పంచదార శాతం, రస నాణ్యత పెరుగుతాయి. పప్పు జాతి పైర్లలో నత్రజని స్థిరీకరణకు పొటాషియం తోడ్పడుతుంది.  
 
 మొక్కల్లో నూనె పదార్థాలు, పిండి పదార్థాలు తయారు కావడానికి పొటాష్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నూనె గింజల పంటల నుంచి అధిక నూనె శాతం పొందాలంటే ఈ ఎరువును తప్పనిసరిగా వాడాలి. పండ్ల తోటల్లో పొటాష్ ఎరువు వినియోగం వల్ల పండ్ల పైతోలు దృఢంగా, బలంగా తయారవుతుంది. పండ్లు ఒరిపిడిని తట్టుకోగలుగుతాయి. వాటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. దూర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు.
 
 జీవన ఎరువు రూపంలో...
 మార్కెట్‌లో జీవన ఎరువు రూపంలో పొటాషియం మొబిలైజర్లు లభిస్తున్నాయి. ఇవి భూమిలో మొక్కలకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెస్తాయి. ఈ జీవన ఎరువు ప్రటూరియా ఆర్షారియా అనే బాక్టీరియా రూపంలో దొరుకుతోంది. కొన్ని బాసిల్లస్ జాతుల్ని దీనితో కలిపి మిశ్రమంగా తయారు చేస్తున్నారు. రెండు కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి, ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. ప్రధానంగా నూనె గింజల పంటల్లో దీని ప్రభావం బాగా కన్పిస్తుంది.
 
 నేల బాగా తడిసిన తర్వాతే...
 రుతుపవనాలు ప్రవేశించే ముందు కురిసే వర్షాలను ఆసరాగా చేసుకొని వర్షాధార పంటలు వేయకూడదు. నేల పూర్తిగా తడిసిన తర్వాత... అంటే 50-75  మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై న తర్వాత మాత్రమే పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి వర్షాధార పంటలు విత్తుకోవాలి. ఈ లోగా విత్తనాలు, ఎ రువులు, పురుగు మందులు సేకరించుకోవాలి. కాగా తేలిక నేలల్లో పత్తి, సోయాచిక్కుడు పం టల్ని వర్షాధారంగా సాగు చేయకూడదని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement