వాన నీటిని ఒడిసి పడదామా...! | Sakshi
Sakshi News home page

వాన నీటిని ఒడిసి పడదామా...!

Published Thu, Jul 10 2014 10:16 PM

వాన నీటిని ఒడిసి పడదామా...! - Sakshi

పాడి-పంట

జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల్లోకదలిక కారణంగా గత రెండు మూడు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోతే అది కాలువలు, వాగులు, నదుల్లో కలిసి చివరికి సముద్రం పాలవుతుంది. వాన నీటిని వివిధ పద్ధతుల ద్వారా నిల్వ చేసుకొని, అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటే రైతుకు సాగు నీటి కష్టాలే ఉండవు. సాగు నీటి వినియోగం, సంరక్షణపై రైతులు తగిన శ్రద్ధ వహిస్తే బెట్ట పరిస్థితుల్లోనూ పంటకు నీరు అందించవచ్చు. ఈ నేపథ్యంలో వర్షపు నీటి నిల్వపై కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయు పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.నిర్మల అందిస్తున్న సూచనలు...

ఎందుకు నిల్వ చేయాలి?

వివిధ వనరుల ద్వారా వునకు లభిస్తున్న నీటి లో 80% వరకు పంటలకు వినియోగమవుతోం ది. అయితే వివిధ కారణాల వల్ల ఇందులోనూ 35-40% వృథా అవుతోంది. అన్ని నీటి వనరులకు వర్షపు నీరే ఆధారం. దానిని నిల్వ చేసుకొని, సకాలంలో వినియోగించుకోలేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది.
 భూమి పైన పడుతున్న వర్షపు నీటిలో కొంత లోపలి పొరల్లోకి వెళుతుంది. కొంత ఆవిరవుతుంది. వుట్టిలో ఇంకిన నీరే పంటలకు ప్రధాన ఆధారవువుతుంది. కాబట్టి ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూమిలోకి ఇంకిపోయేలా చేయుటంతో పాటు తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయకపోతే వర్షపు నీటితో పాటు విలువైన భూమి పైపొర మట్టి, మనం వేసే పోషకాలు కూడా కొట్టుకుపోతాయి. ఫలితంగా కొన్నేళ్లకు ఉత్పాదకత తగ్గి, దిగుబడులు గణనీయంగా పడిపోతాయి. పంట భూమి నిస్సారమవుతుంది.

ఇలా చేయండి

ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి భూమిని లోతుగా దున్నితే వర్షపు నీరు లోపలికి బాగా ఇంకుతుంది. దీనివల్ల మొక్కల వేర్లు లోపలి పొరల్లోకి చొచ్చుకుపోరుు ఎక్కువ నీటిని, పోషకాలను గ్రహిస్తారుు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ పైరు వెంటనే నీటి ఎద్దడికి గురికాదు. పొలంలో వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రదేశంలో గుంత తవ్వుకోవాలి. దానిలోకి చేరిన వాన నీటిని అవసరమైనప్పుడు పంట పొలానికి వాడుకోవాలి. గుంత వైశాల్యం తక్కువగా, లోతు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే నీరు ఆవిరి కాదు. 3-4 మీటర్ల లోతు, 35-40 మీటర్ల పొడవు, అంతే వెడల్పు ఉండేలా గుంతను తవ్వుకోవాలి. గుంతలోని నీరు ఇంకిపోకుండా అడుగున, నాలుగు వైపులా టార్పాలిన్ షీట్ వేయాలి. సూర్యరశ్మికి నీరు అవిరి కాకుండా గుంత పైభాగాన్ని కూడా కప్పాలి. అలాగే కొండ లోయులు, గుట్టల వుధ్య కందకాలు తవ్వి గట్లను ఏర్పాటు చేసుకుంటే నీటి ప్రవాహ వేగం తగ్గి, కొంత నీరైనా నిల్వ ఉంటుంది.

మెట్ట ప్రాంతాల్లో...

మెట్ట ప్రాంతాల్లో వర్షపు నీటిని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన అతి సులభమైన పద్ధతి కాంటూరు సేద్యం. 2-7% వాలు ఉన్న భూములకు ఇది బాగా అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో వర్షపు నీరు ప్రవహించే వాలుకు అడ్డంగా గట్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. నేల కోతకు గురికాదు. నీటి ప్రవాహ వేగం తగ్గి, భూమిలోనే ఇంకిపోతుంది. వర్షపు నీటిని పంట భూమిలో ఇంకిపోయేలా చేయాలంటే వాలుకు అడ్డంగా దున్నాలి.

వర్షపు నీటిని మళ్లిస్తే...

భూమిపై పడిన వర్షపు నీరు వృథా కాకుండా దానిని బావులు, కుంటల్లోకి మళ్లించాలి. దీనివల్ల సాగు నీటి సవుస్యలు చాలా వరకు తీరతాయి. అంతేకాక బావులు, కుంటల్లో భూగర్భ జల మట్టం పెరుగుతుంది కూడా. అలాగే ఇంటి పైకప్పు నుంచి పడే నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించాలి. దీనివల్ల బోరు బావుల్లో నీటి లభ్యత పెరుగుతుంది. చిన్న చిన్న పిల్ల వాగుల సమీపంలో ఓ మోస్తరు గుంతలను తవ్వాలి. వర్షాలు పడినప్పుడు ఆ వాగుల్లోని నీటిని గుంతల్లోకి పంపితే చుట్టుపక్కల ఉన్న బావులు రీచార్జ్ అవుతాయి.

నేలను బట్టే నిల్వ

నేల ఏ మేరకు నీటిని నిల్వ చేసుకోగలదనేది దా ని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. తేలిక నే లల కంటే సారవంతమైన నేలలే ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగలుగుతాయి. భూమిలో చేరిన నీరు మొత్తం మొక్కలకు అందుబాటులో ఉం డదు. ఎందుకంటే నేలలో ఇంకిపోయిన నీటిలో ఎక్కువ భాగం లోపలి పొరల్లోకి చేరుతుంది. దానిని మొక్కలు గ్రహించలేవు. అందుబాటు లో ఉన్న నీటినే క్రవుం తప్పకుండా గ్రహిం చడం వల్ల నీటి లభ్యత తగ్గి మొక్కలు వాడిపోతాయి. కాబట్టి నీటిని ఒకేసారిగా మొక్కలకు ఇవ్వకుండా అవసరాన్ని బట్టి దఫదఫాలుగా అందిస్తే దిగుబడులు బాగుంటాయి.    

 
 

Advertisement
Advertisement