ఓటుకు కోట్లు కేసులో రాజీ లేదు | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో రాజీ లేదు

Published Wed, Nov 2 2016 1:03 AM

ఓటుకు కోట్లు కేసులో రాజీ లేదు

కొమ్మినేని శ్రీనివాసరావుతో నిజామాబాద్‌ ఎంపీ కవిత
మనసులో మాట

పాలన ప్రజల వద్దకు వెళ్లాలి అంతే కాని ప్రజలు నావద్దకు రావడం ఏమిట న్నది కేసీఆర్‌ సిద్ధాంతం. ప్రజల బాధలు తీరిపోవడం కిందిస్థాయిలో జరిగి పోవాలి. అంతేకానీ, సమస్యల పరిష్కారం కోసం అక్కడి నుంచి ఖర్చులు పెట్టుకుని సీఎంని కలవడానికి హైదరాబాద్‌కు రావలసిన పనిలేదనే ఉద్దే శంతోటే చిన్న జిల్లాలను ఆయన ఏర్పాటు చేశారు.

రాజకీయాల్లో పదవులు, వారసత్వాలు శాశ్వతం కావని, ప్రజలకు ఏం చేశామన్నదే వాళ్లు మనల్ని గుర్తుపెట్టుకునేందుకు గీటురాయి అని నిజామాబాద్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంటున్నారు. తెలంగాణలో దొరల పాలన, కుటుంబ పాలన సాగుతోందంటున్నవారు నెహ్రూలు, గాంధీల నుంచి బాబుల దాకా సాగుతున్న చరిత్రను చూసి మాట్లాడాలని ఆమె ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసు లీగల్‌ వ్యవహారం. దాని పద్ధతిలో అది నడుస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు తేలు తుందో చెప్పలేమన్నారు. చంద్రబాబు ఎందుకు హైదరాబాద్‌ వదలి వెళ్లారన్నది వారి సమస్యే కానీ టీఆర్‌ఎస్‌ సమస్య కాదన్నారు. అన్ని ఫిరాయింపులూ ఒకటి కాదని, తెలంగాణలో బలమైన శక్తిగా టీఆర్‌ఎస్‌ నిలబడాలనే భిన్న వర్గాల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని సమర్థించుకున్నారు. తెలంగాణ నేపథ్యం తెలియనివాళ్లలాగా విమర్శ చేస్తున్న కోదండరామ్‌ వైఖరి పట్ల ఉద్యమకారులుగా బాధపడుతున్నామే తప్ప ఆయనతో శత్రుత్వం లేదని, టీఆర్‌ఎస్‌కు ఆయన సహజమిత్రుడన్నారు. ఏపీతో రాజకీయంగా కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఏ పరిస్థితుల్లోనూ పోల్చుకోకూడదని ఎంపీ కవిత మనసులో మాటలో చెప్పిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...

సాక్షి పాఠకుల తరపున స్వాగతమండీ. మీ చిన్న నాటి అనుభవాలు చెప్పండి?
ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు మీకు, సాక్షి టీవీ వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు. చాలా తక్కువమంది అదృష్ట జాతకుల్లో నేనొకరిని అని చెప్పవచ్చు. బాల్యం నుంచి మహిళల వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించే కుటుంబంలో పుట్టాను. నేనూ, అన్న... తొలినుంచి స్వతంత్ర వ్యక్తిత్వంతో పెరిగాం.

మీకు బాగా సంతోషం కలిగించిన ఘటన ఏది?
పెద్దకొడుకు పుట్టినప్పుడు ఆ సన్నివేశం అలా గుర్తుండిపోయింది. ఆ అనుభవం తొలిసారి కదా. అదొక సుందర క్షణం.

బాగా బాధ కలిగించిన సన్నివేశం ఏది?
నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. తనకు గుండెపోటు  వచ్చింది. చాలా బాధేసింది. తర్వాత నాన్న దీక్ష చేసినప్పుడు కూడా భయంకరమైన హింస. ఒకవైపు ఉద్యమంలో చిన్న వయసు పిల్లలు చనిపోవడం, నాన్న అరెస్టు కావడం, ఉద్యమం ఏమవుతుందో తెలీదు. అలాంటి సమయం శత్రువులకు కూడా రాకూడదు.

తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర?
2006 డిసెంబర్‌లో కేసీఆర్‌ తొలిసారి రాజీనామా చేసిన రోజే నేను తొలిసారిగా బయటకు వచ్చాను. అప్పుడే తెలంగాణ పల్లెల్లో పేదరికం చూసి చాలా ప్రభావితం అయ్యాను. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని రకాలుగా చదువుకుని మనం ఇంట్లో కూర్చుంటే ఎలా? మనమే ఏదో ఒకటి చేయాలి అనే ఉత్తేజం వచ్చింది.

కేసీఆర్‌ పాలనపై మీ అభిప్రాయం?
అయనలోని అంకితభావం నాకు నచ్చుతుంది. ప్రజలకు తాననుకున్నది చేయాల నుకోవడం, అమలు చేయడంలో నిబద్ధత వల్లే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కొంత జాప్యం జరిగినా కమిట్‌మెంట్‌ వల్లే 90 శాతం పనులు ఆయన చేయగలిగారు. తెలంగాణ వచ్చాక 3 సంవత్సరాలకు నిరం తర కరెంటు ఇస్తానని చెప్పారు. కరెంటు వంటి క్లిష్టతరమైన విషయాన్ని అర్థం చేసు కుని, మూడే మూడు నెలల్లో 24 గంటల కరెంటు ఇచ్చారు.

బ్రహ్మదేవుడు కూడా బాబును కాపాడలేడన్న కేసీఆరే రాజీపడ్డారా?
కాంప్రమైజ్‌ అని నేననుకోను. ఒక వేళ నిజంగా అంత సీరియస్‌ టాక్‌ ఉంటే దాన్ని మేం పెద్ద విజయం కిందే భావిస్తాం కదా. కొన్ని కేసులు లీగల్‌ ఇష్యూలుగా మనం ప్రారంభించేంత వరకే మన చేతిలోఉంటాయి. చేసింతర్వాత లీగల్‌ వ్యవహారాలు ఎలా సాగుతుంటాయో మీకు తెలుసు. మనం తొందరపెట్టినంత మాత్రాన కొన్ని కేసులు పరిష్కారం కావు. తొందర పెట్టనంత మాత్రాన పరిష్కారం కాకుండా ఉండవు. లీగల్‌ క్రమంలో కేసు ఎప్పుడు తేలుతుందో తెలీదు కదా. ఆ కేసులో ఇబ్బందిలో ఉన్నది మా ప్రత్యర్థే కదా.. వాళ్లను రక్షించుకుని మేం సాధించేదేముంది? పైగా అలాంటి తెరవెనుక చర్యలు కేసీఆర్‌ ఎప్పుడూ చేయరు. బాబు ఎందుకు హైదరాబాద్‌ వదలి వెళ్లారన్నది ఆయన సమస్య. నిజానికి ఆయన అక్కడికి వెళ్లటం అనేది మంచిది. అక్కడ ప్రజలకు దగ్గరగా పాలన ఉంటుంది. అక్కడే ఉంటే పాలన మరింత వేగంగా జరుగుతుంది.

ఫిరాయింపులు అనైతికమా కాదా? సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది మరి?
తెరాస ఎన్నికల్లో గెలిచాక పెట్టిన తొలి ప్రెస్‌ మీటింగులోనే ఇవ్వాళ్టినుంచి మేం ఫక్తు రాజకీయ పార్టీగా ఉంటాంమని కేసీఆర్‌ చెప్పారు. ఎందుకంటే, తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తి అవసరం ఉంది. అది తెరాసే కావాలి. తెలంగాణలో ఒక శక్తి బలంగా ఎదిగి అభివృద్ధి చెందితే చూడలేని శక్తులు కూడా ఉన్నాయి. రాష్ట్రం ఇలాగే ఉండాలి. వీళ్లు అల్లాడుతూనే ఉండాలి. మేం రాజ్యం ఇలాగే చేస్తూనే ఉండాలి అనే కాంక్ష చాలామందికి ఉంది. ఇలాంటి వారందరినీ మేం అదుపు చేస్తూ బలమైన పార్టీగా ఎదిగితేనే రేపు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్షగా ఉంటుంది.

అక్కడ చంద్రబాబూ ఇక్కడ కేసీఆర్‌ కూడా అదే పని చేశారు. తేడా ఏమిటి?
మేం బాబుతో పోల్చుకోదల్చుకోలేదు. మా పోలిక ఎప్పుడూ అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంతో ఉండాలనుకుంటాను. ఏపీతో రాజకీయంగా కాని, అభివృద్ధి విషయంలో కానీ ఏ పరిస్థితుల్లోనూ పోల్చుకూకూడ దని భావిస్తున్నా. మనం ఇద్దరం కూడా ఇంకా బాగున్న వారితో పోటీ పడితే రెండు రాష్ట్రాలుగా ఇద్దరమూ ఎదుగుతామని నా ఆలోచన.

బాబు పాలన ఇప్పుడెలా ఉంది?
నాన్న ఒక సభలో ఇలా చెప్పారు. మాటలు చెప్పే సమయం కాదు పని చేయవలసిన సమయం ఇదని. మేం అలాగే పని చేసుకుపోతు న్నాము. ప్రజలు ఫలితాలు చూస్తారు. ఆ దృష్టితోనే బాబుమీద వ్యాఖ్యానించన వసరం లేదు కానీ ఏపీ ఒక రాష్టంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కోదండరామ్, కేసీఆర్‌ ఇప్పుడెందుకు దూరంగా ఉంటున్నారు?
ప్రాథమికంగా కోదండరామ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మనిషి కాదు. కేసీఆరే స్వయంగా ఆయనను తీసుకొచ్చి జేఏసీకి చైర్మన్‌గా చేశారు. ఉద్యమంలో కలిసి పనిచేశాం. ప్రభుత్వం వచ్చాక కలిసి పనిచేయాలా వద్దా అనేది ఆయా వ్యక్తులు, సంస్థల నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుంది. మావైపు నుంచి పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని కోదండ రామ్‌పై ఎవరికీ వ్యతిరేకత లేదు. తెలంగాణను చాలాకాలంగా నిర్లక్ష్యం చేసారు. రైతుల భూములకు నీళ్లు లేవు. వసతులు లేవు. కరెంటు, మోటార్లు, బోర్లు ఏవీ లేవు. దీర్ఘ కాలంగా జమ అవుతున్న కష్టాలు అని కూడా తెలుసు. తెలిసి కూడా ఈ రెండేళ్లలో ఏమీ చేయలేదని ఏమాత్రం అవగాహన కూడా లేని వారిలాగా కేవలం రాజకీయ విమర్శ చేస్తున్నట్లనిపించడంతో ఉద్యమకా రులంతా బాధపడ్డారు. ఇదేంటి తెలంగాణ నేపథ్యం తెలియని వాళ్లలాగా మాట్లాడు తున్నారు అనే తప్ప మరొకటి ఏం లేదు.

కేసీఆర్‌ కోదండరామ్‌కు ఎందుకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు?
అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు సమస్య. ప్రభుత్వం సమస్య లను పరిష్కరిస్తుందా లేదా అనేది తొలి ప్రశ్న. కోదండరామ్‌ సర్‌ చెప్పిన వంద విష యాల్లో మేం ఎన్ని చేయగలమో అవన్నీ చేస్తున్నాం. అందులో అనుమానమే లేదు. కానీ వారు కూడా ఒక రాజకీయనేతగా విమర్శ చేస్తే వారి స్థాయిని తగ్గించుకోవడమే అవు తుంది తప్ప  మరొకటి కాదు. కోదండరామ్‌తో మాకు వైరం ఏముంటుంది. ఆయన మాకు సహజ మిత్రులు. కాదని వారనుకుంటే మేమేం చేయలేం.

చివరగా.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చే సందేశం?
తెలంగాణ ప్రజలకు సాక్షి టీవీ ద్వారా  నేను చేసే అభ్యర్థన ఏమిటంటే, కేసీఆర్‌ కానీ, టీఆర్‌ఎస్‌ పార్టీ కానీ అహర్నిశలు తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తి, సంస్థ. మనమనుకుంటున్న పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. కొంత ఆలస్యం అవు తున్నా, అది మన అలసత్వం కాదు. సాంకేతికంగా సమస్యలు ఉండవచ్చు. కాని తెలం గాణ ప్రజలకోసం పనిచేసే పార్టీగా ఇంతవరకు మీరెలా ఆదరించారో ఇకముందు కూడా మీరు కేసీఆర్‌తో, టీఆర్‌ఎస్‌తో నిలబడాలని కోరుకుంటున్నాను.

(కవితతో ఇంటర్య్వూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి)

https://www.youtube.com/watch?v=oD1t-sowVuU

Advertisement
Advertisement