అక్షర తూణీరం
ఆ రోజుల్లో ఫియట్ కారంటే గొప్ప. పీఎస్ చారి అని మా ఆఫీసు పెద్ద సారువాడుండే వాడు. చాలా రూల్స్ మనిషి. ఈయన పెద్ద వట్టివేళ్ల తడి కండీ అని పనులమీద వచ్చి వెళ్లేవారు వ్యాఖ్యానించేవారు. గీరు నామంతో, ఖద్దరు కట్టుతో చారి చాలా నిరాడంబరంగా కనిపించేవారు. ఎప్పుడూ తడుపుతూ ఉంటే గానీ వట్టివేళ్ల తడిక సుఖంగా పనిచెయ్యదు, చారి కూడా అదే బాపతని ఒకాయన వివరించాక మర్మం నాకు బోధపడింది. ఇట్లాంటి వారికి గొప్ప చిక్కు ఏంటంటే, గడ్డితిని సంపా యిస్తారు గాని సుఖంగా ఏ భోగమూ అనుభవించలేరు. సర్వీస్ ఉండగా భయం. దిగిపోయాక్కూడా భయమే. ఎవడైనా ఓ ఆకాశరామన్న ఉత్తరం రాస్తాడేమోనని. ఉన్నట్టుండి చారి ఫియట్ కారులో ఆఫీసుకు వచ్చాడు. అంతా నివ్వెరపోయారు. ఎవరూ విస్తుపూర్వక ప్రశ్నలు సంధించకముందే, చారి ఫియట్ వృత్తాంతాన్ని వివ రించాడు.
డీలర్ దగ్గర ఖాళీగా పడి ఉందిట. టైర్లు, సీట్లు ఎలుకలవల్ల హరించాయిట. ఉద్యమ వేళ అద్దాలు వడ గళ్లుగా నేలపై రాలాయిట. డీలర్ని అడిగితే, మీరు అడి గారని చెబుతున్నా నాలుగువేలిచ్చి తీసికెళ్తారా అని అడిగాట్ట! ఫియట్ కారు ఆయన జీవితాశయమని లోగడే చారి పలుమార్లు చెప్పారు. సరేనని తెగించి వాయిదాల పద్ధతిలో తీసుకున్నాట్ట. సీట్లు మిసెస్ చారి కుట్టిందిట. కొడుకు పాత టైర్లు సేకరించి, స్వయంగా ఫియట్కి రంగులు, హంగులు కూర్చాడట. మొత్తం ఐదువేల ఆరువందల పన్నెండు రూపాయలు అయిం దని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు చారి.
చారి చెప్పిన తీరులో ఒక నిజాయితీ ధ్వనించింది. అయినా నమ్మశక్యం కాలేదు. మొన్న మన ప్రియతమ నేత స్థిర చరాస్తులు ప్రకటించగానే నాటి మా చారి గుర్తొచ్చారు. విశాలంగా, సర్వ సదుపాయాలతో ఇల్లు కట్టుకోవడం సంతోషమేగానీ మరీ మూడుకోట్లు అప్పు చేయడమేమిటని మావూరి రచ్చబండ జాలిపడింది. దాదాపు అర్ధ శతాబ్ది రాజకీయ జీవితం, పెళ్లినాటికే మంత్రిపదవి, ఆ తర్వాత సరేసరి. అందరికీ తెలిసిందే. ప్రజల కోసం జీవితం ధారపోస్తున్న నాయకుడు, పైగా వయసు మీద పడింది కూడా. ‘ఇప్పుడు రుణభారం పెట్టుకోవడమా పాపం’ అంటూ ఒకరిద్దరు పెద్ద మను షులు బాధపడ్డారు. ఏముంది మనమంతా తలా పావలా వేసుకున్నా బిల్డింగ్ లేచిపోతుందని ఒకాయన లెక్క తేల్చాడు.
ఉన్నట్టుండి మావూరి సర్పంచ్కి ఆవేశం వచ్చింది. నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నానుగందా. నే కూడా నా ఆస్తులు డిక్లేర్ చేస్తున్నా రాసుకోండ్రా అంటూ లేచి నిలబడ్డాడు. పాత పెంకుటింటితో మొదలుపెట్టి, చింకి చాపలు, విరిగిన ఎడ్లబండి, తుప్పట్టిన బోరింగు గొట్టాలు, ఒట్టిపోయిన గేదె దూడతో సహా చెప్పు కుంటూ వెళ్లాడు. రచ్చబండ మీది నలుగురూ వాటి వాటి ధరలు నిర్ణయించి చెబుతుంటే, ఓ కుర్రాడు అంకెలు కూడుకున్నాడు. పదివేల చిల్లరకు వచ్చింది మొత్తం. సర్పంచ్ ఒక్కసారి తేలుకుట్టినట్టు అరిచాడు. మా మాంగారు అలకల్లో ఇచ్చిన సైకిల్రోయ్ అనగానే, వేసుకో పన్నెండు రూపాయలన్నారు పెద్దలు. సర్పంచ్ ససేమిరా అన్నాడు. ఆ సైకిల్లో బోలెడు సెంటిమెంట్లు న్నాయి. కనీసం ఒక లక్షన్నా పడాల్సిందే అంటూ వాదించాడు. మొత్తానికి మా సర్పంచ్ ఆస్తుల ప్రకటనైతే అయి పోయింది.
శ్రీరమణ
# Tag
Related news
-
టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లుటీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిరణ్కుమార్రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు! అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు. సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లుబీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి. థామస్ ఆస్తి రూ.124 కోట్లు టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్పై 2017లో చెన్నై సెండియం పోలీస్స్టేషన్లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్స్టేషన్లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు. నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లునెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది. వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లుటీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి. -
చంద్రబాబు, లోకేశ్ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్లోనే ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్ షేర్ల విలువే రూ.1102 కోట్లు చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్కి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు. అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గించి చూపారు చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు. 10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్కి గిఫ్ట్గా రాసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు. రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 1. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొడుకు లోకేశ్తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 2. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్ హౌస్). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. లోకేశ్ స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 2. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. బ్రాహ్మణి స్థిరాస్థులు 1. హైదరాబాద్ మాదాపూర్లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 3. హైదరాబాద్ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 4. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొడుకు దేవాన్ష్తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. దేవాన్ష్ స్థిరాస్థులు 21. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు. -
సుజనా చౌదరికి షాక్
సుజనా చౌదరికి షాక్ -
Hema Malini Assets Worth: హేమమాలిని ఆస్తులు వంద కోట్లకు పైగానే..
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నటి హేమమాలిని..ఉత్తరప్రదేశ్లోని మధుర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీ బరిలో నిలిచారు. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తి సుమారు రూ. 123 కోట్లుగా తెలిపారు. అయితే రూ. 1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. నటనను తన వృత్తిగా తెలిపిన హేమమాలిని.. అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా తెలిపారు. అలాగే తన భర్త, నటుడు ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. నటన, పెన్షన్, వడ్డీలు ఆయన ఆదాయవనులుగా తెలిపారు. అఫిడవిట్ ప్రకారం హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవు. వీరి చరాస్తుల్లో మెర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, అల్కాజార్, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 13.5 లక్షల నగదు ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో రూ. 43 లక్షల నగదు ఉన్నాయి. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని బీజేపీ తరపున మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. చదవండి: అవును! నేను అన్నది నిజమే..బోస్పై కంగన మరో ట్వీట్ వైరల్ -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది)
Related News by category
-
దీనికి జవాబు లేదా బాబూ?
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కు వచ్చిపడింది. ముస్లిం మైనారిటీలకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ అగ్రనేత ఒకరు ప్రకటించడం ఇందుకు కారణం. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఈ ప్రకటనను ఖండించకపోవడం ముస్లిమ్ మైనారి టీలు గమనిస్తున్నారు. అందుకే ఇప్పటికే అరకొ రగా ఉన్న ముస్లిమ్ల మద్దతు తమ పార్టీ పూర్తిగా కోల్పోతుందని టీడీపీ భయపడుతోంది.ఇటీవల ఓ బహిరంగ సభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లిమ్ మైనారిటీలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్లను తప్పుపట్టారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిమ్ల రిజ ర్వేషన్లను రద్దు చేస్తామని తెగేసి చెప్పారు. లోక్ సభకు ఇప్పటికే జరిగిన రెండు విడతల పోలింగ్లో బీజేపీకి నిరాశే ఎదురైనట్లు సంకేతాలుఅందుతున్నాయి. దీంతో కులాలకతీతంగా యావత్ హిందూ ఓటు బ్యాంకును కమలం పార్టీ వైపు మళ్లించడానికి బీజేపీ అగ్రనేతలు ముస్లిమ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారని భావిస్తున్నారు.ముస్లిమ్ల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి 2005లో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ సచార్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు సభ్యులున్న సచార్ కమిటీ 2006లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లిమ్లు 14 శాతం ఉన్నారు. అయితే అధికార యంత్రాంగంలో ముస్లిమ్ల శాతం కేవలం 2.5 శాతం మాత్రమే. దళితులు, ఆదివాసీల కంటే దారుణ పరిస్థితుల్లో ముస్లి మ్లు ఉన్నారు. చదువు లేకపోవడమే ముస్లిమ్ సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ప్రధాన కారణమని జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కుండబద్దలు కొట్టింది. ముస్లిమ్ సమాజం మేలు కోసం మొత్తం 76 సిఫార్సులు చేసింది ఈ కమిటీ. అయితే వీటిలో అమలుకు నోచుకున్నవి అతి తక్కువ. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లిమ్ల జీవితాల్లో వెలుగులు నింపడానికి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. విభజన తరువాత కూడా ఆంధ్రప్ర దేశ్లో ముస్లిమ్లకు నాలుగుశాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నా చంద్ర బాబు నోరు మెదపకపోవడం విడ్డూరం. నెత్తి మీద టోపీ పెట్టుకుని... ముస్లిమ్లతో ఆత్మీయ సమావేశాలంటూ సందడి చేసే చంద్రబాబు అసలు రంగు బయటపడింది. వాస్తవానికి రాయలసీమలో ముస్లిమ్ మైనా రిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కర్నూలు,నంద్యాల, కడప, రాయచోటి, కదిరి లాంటి అనేక ప్రాంతాల్లో గెలుపు ఓటములను ప్రభా వితం చేయగల స్థాయిలో ముస్లిమ్లు ఉన్నారు. రాయలసీమే కాదు కోస్తా జిల్లాల్లో కూడా వీరి జనాభా భారీగానే ఉంది. గుంటూరు తూర్పు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావు పేట, చిలకలూరిపేట, విజయవాడ పశ్చిమం, బందరు, పెడన వంటి అనేక ప్రాంతాల్లో కూడా ముస్లిమ్ మైనారిటీలు అభ్యర్థుల జయాపజయా లను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు.అటువంటి ముస్లిమ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటే తెలుగుదేశం నిశ్శబ్దంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిమ్ల రిజర్వే షన్ రద్దు ఖాయం అని ముస్లిమ్లు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ముస్లి మ్లు పోలింగ్ నాటికి జగన్కి జై కొడతారని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.ఎస్. అబ్దుల్ ఖాలిక్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్మొబైల్: 63001 74320 -
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు ఏకస్వామ్య కంపెనీలకు అప్పజెప్పాలన్నది వారి ఆలోచన. ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటు వేయడమంటే, ప్రైవేటీకరణకు ఓటు వేయడమే. కానీ నిరుపేదలకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. మన దేశ భవిష్య త్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది. ఉద్యోగస్థులు మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలోచించకుండా ప్రైవేటీకరణకు, మత తత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదుకదా, మానవీయ విలువలు కూడా బతకవు.ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు నాయుడు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దేశంలోని మొత్తం కేంద్ర ప్రభుత్వ కంపెనీలను, అతి పెద్దదైన రైల్వేతో సహా ప్రైవేట్ ‘మోనోపలి’ (ఏకస్వామ్య) కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం కేవలం సూపర్వైజ్ చెయ్యాలనేది ఆరెస్సెస్/బీజేపీ సిద్ధాంతం. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను కూడా క్రమంగా రద్దు చెయ్యాలన్నది వారి సిద్ధాంతం. నరేంద్ర మోదీ ఓబీసీ పేరుతో ప్రధానమంత్రి అయ్యారు కనుక గత పదేండ్ల పాలనలో వాళ్ళు రిజర్వేషన్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ రిజర్వేషన్ వ్యతిరేక విధానం రిజర్వేషన్ ద్వారా కాక జనరల్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి నచ్చ వచ్చు కూడా. కానీ విద్యా అసమాన వ్యవస్థ ఉండగా రిజర్వేషన్లు ఎత్తేస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని చాలామందికి అర్థం కాని విషయం. దేశంలోని ఉత్పత్తి కులాలు రిజర్వేషన్లు రద్దు చెయ్య డాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి.బీజేపీతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్ట మొదట ప్రైవేట్ స్టీల్ కంపెనీకి అప్పజెప్పే అతిపెద్ద స్టీల్ కంపెనీ ‘విశాఖ ఉక్కు’. ఆ తరువాత బీజేపీ తెలంగాణలోని బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి అతిపెద్ద కంపెనీలను ప్రైవేట్ గుజరాతీ, ముంబై కంపెనీలకు అమ్మకానికి పెడుతుంది. బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని సంస్థల్లో దొడ్డిదారిన ఏ సెలక్షన్ కమిటీని ఫేస్ చెయ్యకుండా అధికారులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను సైతం నియమిస్తోంది.ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బీజేపీకి ఓటు వేయడమంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటు వేయడమే. చంద్ర బాబు 2014 నుండి 2019 వరకు చూపిన స్వతంత్రతను కూడా చూపలేడు. ఆయన పూర్తిగా బీజేపీ ఏమి చెబితే అది చెయ్యాల్సిందే. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటేస్తే ముందు ప్రైవేటీకరణ సమస్యను కొని తెచ్చుకుంటారు.బీజేపీ ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టారు ఎంప్లాయిమెంట్ను అమెరికా మోడల్లోకి మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తల రచనలు చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. ఆంధ్రప్రదేష్ సుదీర్ఘ తీర ప్రాంతం గల రాష్ట్రం. విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ–పోర్టులను అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్మెంట్ మొత్తాన్ని ప్రైవేట్ సెక్టా రుకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నది. ఈ పని ఇప్పటికే ఎయిర్పోర్టుల విషయంలో చేశారు. దేశంలోని పెద్ద, పెద్ద ఎయిర్పోర్టులన్నిటినీ ప్రైవేటు మేనేజ్మెంట్కు – అదీ పెద్ద పెద్ద మోనోపలి కంపెనీలకు అప్పజెప్పారు. ఇక్కడి ఉద్యోగాలన్నీ ప్రైవేట్ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే. అక్కడ పెద్ద ఉద్యోగాలన్నీ పెద్ద కంపెనీల బంధువులకు మాత్రమే వస్తాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడి ఎవరైనా ఉద్యోగం తెచ్చుకునేది అక్కడ ఉండదు. కమ్మ, రెడ్డి కులాలకు కూడా పెద్ద ఉద్యోగాలు రావు.ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని తీరాన్నంతా అభివృద్ధి చేసుకుంటే అది ముంబైకి మించిన నగరమయ్యే అవకాశ ముంది. కోల్కతా కూలిపోతున్న నగరం. ఇటు చెన్నై దేశపు చివరి మూలన ఉంది. దానికి ఇంకా అభివృద్ధి అవకాశం తక్కువ. ఇంగ్లిష్ విద్యలో ఆదివాసులు, దళితులు, బీసీలు, ఇతర బీద పిల్లలు చదువు కుంటే వైజాగ్ నగరాన్ని అత్యాధునిక నగరంగా మార్చే అవకాశం వారికొస్తుంది. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ విద్య నాణ్యంగా కొన సాగితే అడవుల్లోని ఆదివాసులు పక్షులుగా ఎదిగి విమానాలుగా మారుతారు. వారికి ఎంత పోడు భూమి ఇచ్చినా, ఎంత పంట సహాయం చేసినా ఒక్క తరంలో అడవి నుండి విశాఖ నగరంలోకి, అక్కడి నుండి అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోలేరు. అయితే ఈ ఆదివాసులకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. ప్రైవేట్ సెక్టారు వీరికి అవకాశాలివ్వదు. వారిని ఉన్నత ఉద్యోగాల్లోకి రానివ్వదు. ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన ఇంగ్లిష్ విద్య ఈ ఆదివాసుల్లో కొనసాగితే, 20–30 సంవత్సరాల్లో అమెరికాలో నల్లజాతీయులను మించిన మేధా వులు ఆదివాసుల నుండి వచ్చి విశాఖ పట్టణాన్ని ప్రపంచ నగరంగా మారుస్తారు. ఈ ఆదివాసుల నుండి ఎంతోమంది ఎలాన్ మస్క్లు వచ్చే అవకాశముంది. ఇటువంటి మార్పు భారతదేశపు గుజరాతీ క్యాపిటలిస్టులకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్కు ఏ మాత్రం ఇష్టం లేదు. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటువేసి గెలిపించే ప్రయత్నం చేస్తే వ్యవస్థనంతా గుజరాత్–ముంబై క్యాపిటలిస్టులకు అప్పజెప్పడమే.భారతదేశం అమెరికా కాదు, యూరప్ కాదు, ఆస్ట్రేలియా కాదు, కెనడా కాదు. ఇది 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశం. దీన్ని చిన్న దేశం అని ఎందుకు అంటున్నానంటే భూపరిమాణంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో పోలిస్తే ఇది చాలా చిన్న భూమి కలిగిన దేశం. ఈ దేశ జనాభా ఇంకా ముందు, ముందు పెరుగుతుంది. ఆధునిక సైన్స్ను ఇంగ్లిష్ భాషతో ముడేసి గొప్ప, గొప్ప శాస్త్ర పరిశోధనల ద్వారానే మనం ఇంతమందికి తిండి, బట్ట, ఇల్లు ప్రపంచంలో తలెత్తుకుని బతికే ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలం. అందుకు భావితరాలు – ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, ఓబీసీలు – ఇంగ్లిష్లో చదువుకొని ప్రపంచ జ్ఞానాన్ని సాధించకుండా ఈ దేశానికి మనుగడ ఉండదు. మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది; అన్ని రకాల ఎంట్రన్స్లను, కోచింగ్లను రద్దు చేసి నేరుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, విద్యార్థి శ్రమ గౌరవ పనుల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నత చదువులకు పోవడంలో ఉంది. అమెరికా, యూరప్ ఇదే చేస్తాయి. బీజేపీ, చంద్రబాబు ఇటువంటి విద్యకు పూర్తిగా వ్యతిరేకం. కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఏ కులస్థులైనా మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలో చించకుండా ప్రైవేటీకరణకు, కుల తత్వానికి, మత తత్వానికి, వర్గ తత్వానికి ఓటు వేసుకుంటే సమాజంలో తిరుగుబాటు మొదలైతే దేశం కుప్పకూలుతుంది.భారతదేశపు ప్రైవేట్ రంగం అమెరికాలో, యూరప్లో ఉన్నట్టు మానవతా విలువలతో ఏర్పడినది కాదు. గ్రామాల్లో రైతులను, కూలీలను దోచుకొని వారితో బడిలో, గుడిలో ప్రేమతో పెరిగిన మనుషులుగా కాక మేం కులానికి ఎక్కువ, మేం కంచం–మంచం పొత్తును అంగీకరించం అనే వారి చేతిలో పెరిగింది. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు కుష్ఠు రోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఒక ఆశ్రమం కట్టించి ఆదుకున్నట్టు చూశామా! అమెరికా తెల్లజాతి ధనవంతులు, నల్లజాతి స్త్రీలను తమ ఇంట్లో వంట మనిషిగా పెట్టుకొని వారి పిల్లలను చదివించి మేధావులను చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. నల్లవారికి ప్రత్యేక స్కూళ్ళు, కాలేజీలు పెట్టి ముందు చదివించింది తెల్లజాతి పెట్టుబడిదారులు. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు దళితుల కోసం, ఆదివాసుల కోసం ఒక్క స్కూలు కట్టి చదివించారా!అందుకే దిక్కులేని రోడ్డుమీద బతికే పిల్లల్ని దగ్గరకు తీసి ‘నిన్ను ఇంగ్లిష్ మీడియం బడిలో చదివిస్తాన’ని హామీ ఇచ్చిన వ్యక్తిని దింపేసి నారాయణ స్కూలును వెనుక ఉండి నడిపించే వ్యక్తికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్యం కాదు గదా మానవ విలువలే బతకవు. అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేను చెప్పే ఈ మాట గురించి ఆలోచించండి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచ వ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో... మే డే వచ్చింది. సకల దేశాల జాతుల మతాల, కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మే డే. 19వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఇంగ్లండ్ కేంద్రంగా యూరప్ అమెరికా లలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది.ఆవిరి యంత్రం, జౌళి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మర మగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ అమలులోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టు బడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితుల మధ్య 18 – 16 గంటల పని నుండి 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మే డేగా ప్రసిద్ధి చెందింది. 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు (ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ) సింగార వేలు ఎర్రజెండాను ఎగరవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మే డేను జరపడం కొనసాగుతూ వస్తున్నది. రష్యాలో మేడే ఉత్సవాల్లో అక్కడి కమ్యూనిస్ట్ నాయకులు 8 పని గంటల డిమాండ్తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్లను చేర్చడాన్ని లెనిన్ నిరసించినాడు. మే డే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్లు చేర్చ డాన్ని లెనిన్ వ్యతిరేకించారు. మే డే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన చెప్పారు.ఆ తర్వాత కాలంలో మే డే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాల్లో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీ భావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, వలసవాద అణచివేత వ్యతిరేకత, రాజకీయార్థిక సంఘాలు ఏర్పర చుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని.మే డే రాజకీయ చరిత్ర ప్రాముఖ్యాన్ని రూపుమాపేందుకు అమెరికా బూర్జువా సంస్కరణ వాద, అవకాశవాద సంఘ నాయ కులు మే డే నాడు ప్రదర్శనలు కాకుండా సెలవు రోజు అయిన ఆది వారం జరపాలని 1890 లోనే నిర్ణయించారు. ఇటువంటి కుట్ర తోనే అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అవకాశవాద నాయకులు మే డేకు ప్రతిగా సెప్టెంబర్ ఒకటిని లేబర్ డేగా నిర్ణయించారు. అమెరికన్ ప్రభుత్వ కుట్ర పూరితంగా మే మొదటి తేదీని బాలల ఆరోగ్య దినంగా ప్రకటించింది.భారతదేశంలో మతోన్మాద అనుబంధ కార్మిక సంఘం అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ మే డేని గుర్తించకుండా ‘విశ్వ కర్మ దినం’ జరుపుతు న్నారు. మే డేకు ఉన్న వర్గ స్వభా వాన్ని మొద్దుబార్చడానికి మే డే రాజకీయ స్వభావాన్ని దెబ్బతీయ డానికి ప్రభుత్వాలు, వివిధ సంస్కరణ వాద అవకాశవాద ట్రేడ్ యూనియన్లు మే డేను రికార్డింగ్ డ్యాన్సులతో పండుగలుగా జరుపుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మే నెల మొదటి రోజున ప్రపంచ కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీలు అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు.శ్రామిక ప్రజల దోపిడీకి, అణచివేతకు, మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలనే మే డే చారిత్రక పిలుపును శ్రామిక వర్గం ఎత్తి పట్టాలి.కార్మిక వర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి!ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!! – జంపన్న ‘ మార్క్సిస్ట్–లెనినిస్ట్ నాయకుడు(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే) -
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన చంద్రబాబు 2009లోనైనా గెలవాలని లెక్కకు మిక్కిలి హామీలనిచ్చారు. అయినా ఓడారు. 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ల పొత్తుతోపాటు, ఎడాపెడా హామీలనిచ్చి గెలిచారు కానీ వాటిని అమలు చేయటంలో విఫలమయ్యారు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడారు. అందుకే ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! ఈసారి మళ్లీ ఎలాగైనా గెలవాలని బడ్జెట్తో నిమిత్తం లేకుండా హామీలను గుప్పిస్తు న్నారు. అలా కాదంటే, దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంతవుతుందో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి.చరిత్ర మొదటిసారి విషాదంగా, రెండవసారి ప్రహసనంగా పునరావృతమవుతుందంటాడు కార్ల్ మార్క్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల హామీలను చూస్తే ఆ మాట గుర్తుకు వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన ఆయన 2009లోనైనా గెలవాలని లెక్కకు అందనన్ని హామీలనిచ్చారు. అయినా ఓడారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 2019లో ఓడిన ఆయన 2024లోనైనా గెలిచి తీరాలనుకుంటూ తిరిగి ఉచితాల హామీలను కుప్పలుతెప్పలుగా ఇస్తున్నారు. ఆయనలోని ఈ లక్షణాన్ని గమనించినందుకే 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు ‘ఆల్ ఫ్రీ బాబు’ అని పేరు పెట్టారు.2009 ఎన్నికల ప్రచారం నాటి ఒక జ్ఞాపకం ప్రస్తుత సందర్భంలో మళ్ళీమళ్ళీ గుర్తుకు వస్తున్నది. అప్పుడు చంద్రబాబు ప్రతి సభలో తన ఉచిత హామీలను ఒక దానిని మించి మరొకటి ప్రకటిస్తుండే వారు. దానిపై రాజశేఖరరెడ్డి కూడా ప్రతి సభలో, ‘‘చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అయిపోయారు. అన్నీ ఫ్రీగా ఇస్తారట. నమ్ముతారా?’’ అని ప్రజలను నేరుగా అడిగేవారు. అందుకు జవాబుగా ప్రజల నుంచి ‘‘నమ్మం, నమ్మం’’ అనే కేకలు పెద్ద ఎత్తున వినిపించేవి. చివరకు చంద్రబాబు అన్నన్ని హామీలిచ్చి కూడా రెండవసారి ఓడిపోయారు. ఇందులో చెప్పుకోవలసిన విశేషం మరొకటి ఉంది. తనవైపు నుంచి తాను కూడా 2004లో కొన్ని హామీలిచ్చిన రాజశేఖరరెడ్డి, 2009లో కొత్తగా దాదాపు ఏమీ ఇవ్వలేదు. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, మరికొన్ని హామీలను బడ్జెట్ భరించలేదని చెప్పటం అందుకు కారణ మని అప్పుడు విన్నాము. దానితో రాజశేఖర రెడ్డికి చంద్రబాబు హామీలు అలవికానివనీ, కేవలం ఎన్నికలలో గెలిచేందుకు ఉచితాల వర్షం కురిపిస్తున్నారనీ అర్థమైంది. అప్పుడు, తన ప్రచారానికి కొత్త హామీలను కాకుండా 2004–2009 మధ్య కాలపు తన సమర్థవంతమైన పాలనను, దానిపట్ల ప్రజలకు కలిగిన విశ్వాసాన్ని ఆధారం చేసుకోదలిచారు. ఈ ఆలోచన, అందుకు అనుగుణమైన ప్రచారం పనిచేశాయి. ఫలితం తెలిసిందే.రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిందేమిటో చూడండి. 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ల పొత్తుతో గెలిచిన చంద్రబాబు, అటువంటి పొత్తు ఉండి కూడా, ఏ పొత్తూ లేని జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఎడాపెడా హామీలు ఇవ్వవలసి వచ్చింది. కానీ వాటిని అమలు చేయటంలో విఫలమై, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడి పోయారు. తన పాలన ప్రజలను మెప్పించి ఉంటే, ఈ రెండవసారి పొత్తులు ఉన్నా లేకున్నా గెలవాల్సింది. కానీ అది జరగకపోగా, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. మరొక విధంగా చెప్పాలంటే, అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! తెలుగునాట ఎన్నికల చరిత్రలో ఇటువంటి అప్రతిష్ఠ సంపాదించిన నాయకుడు మరెవ్వరూ లేరు. తన 2004 నాటి ఎన్నికల ఓటమిని గమనిస్తే ఈ మాట మరింత బాగా అర్థమ వుతుంది. ఎన్నికలకు కొద్దిముందు తిరుపతి వద్ద ఆయనపైన నక్స లైట్ దాడి జరిగింది. ఆ స్థాయి గల ఒక నాయకునిపై అంత తీవ్రమైన దాడి జరగటం అదే మొదలు, అదే ఆఖరు. అటువంటపుడు తన పట్ల చాలా సానుభూతి రావలసింది! అయినప్పటికీ అందువల్లగానీ, తన పాలనా ప్రతిష్ఠవల్ల గానీ గెలవగలననే నమ్మకం ఏర్పడని చంద్రబాబు, ముఖ్యంగా రైతుల కోసం, గ్రామీణుల కోసం డజన్ల కొద్దీ వరాలు ప్రకటించారు. అయినా గెలవలేదు.ఎన్టీఆర్ ఉదంతాన్ని అట్లుంచినా, చంద్రబాబుకు సామాన్య ప్రజల సంక్షేమం కోరే నాయకునిగా ఎన్నడూ పేరు లేదు. అధికారానికి వచ్చిన కొత్తనుంచే అప్పటి ఆర్థిక సంస్కరణలను ఎంతో ఉత్సాహంగా భుజాన వేసుకున్న ఆయన తనను తాను సీఈఓగా చెప్పుకొన్నారు. సంస్కరణలకు దేశంలో అందరికీ మించిన పతాకధారి అయ్యారు. ఆ విషయంలో మన్మోహన్ సింగ్ను సైతం మించిపోయి దేశ విదేశాల లోనూ పేరు సంపాదించి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్లకు ప్రీతి పాత్రు డయ్యారు. కానీ ఆ క్రమంలో వ్యాపార వర్గాలకు ఎంత దగ్గరయ్యారో సామాన్య ప్రజలకు అంత దూరమయ్యారు. లోగడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత ఎన్టీఆర్ అమలుపరచిన సంక్షేమ పథకాలను తగ్గించి వేశారు లేదా రద్దుపరచారు. అందుకే ప్రజల విశ్వాసం కోల్పోయి 2004లో పరాజయం పాలవగా, ఆ పరిణామం ప్రజలను సంతోషపెట్టింది. కనీసం ఆర్థిక సంస్కరణలకీ, ఇండియా వంటి వెనుకబడిన సమాజంలో ప్రజా సంక్షేమానికీ మధ్య సమతులనాన్ని పాటించాలనే విజ్ఞత అయినా తనకు లేకపోయింది. అందువల్లనే ఈ 21వ శతాబ్దంలో జరిగిన నాలుగు ఎన్నికలలో (2004, 2009, 2014, 2019) మూడింట ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అయిదవ ఎన్నికను ఎదుర్కొంటున్నారు. తన ఆర్థిక సంస్కరణలు, పరిపాలన గొప్పగా ఉండి ఉంటే ప్రతిసారీ గెలవవలసింది! అది కూడా పొత్తుల కోసం చూడకుండా.ప్రతిసారీ తన ప్రత్యర్థులను మించి ఎడాపెడా హామీలు ఇస్తున్నారంటేనే చంద్రబాబు బలహీనత అర్థమవుతున్నది. మరొక వైపు 2014లో వలె గెలిచినపుడు అయినా సదరు హామీలను ఎంత మాత్రం అమలుపరచక విఫలం కావటాన్ని బట్టి అవి బడ్జెట్తో, ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేనివని తెలిసిపోతున్నది. అవి అలవిమాలినవని ముందుగా గ్రహించలేనివాడు కాదాయన. అయినప్పటికీ ఆ పని చేశా రంటే, 2014లో, 2019లో చేసి, ఇపుడు 2024 కోసం తిరిగి చేస్తున్నా రంటే, ఆయన ఉద్దేశమే ప్రజలను మోసగించటమనుకోవాలి. ఏమి చేసైనా సరే అధికారం సంపాదించాలన్నమాట!అదే పని చేసి తలమీదకు తెచ్చుకున్న రెండు ప్రభుత్వాల ఉదాహరణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొరుగునే ఉన్నాయి. ఒకటి కర్ణాటక, రెండు తెలంగాణ. రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ మితి మీరిన హామీలనిచ్చింది. అవి బడ్జెట్ శక్తికి మించిపోగలవని ఆర్థిక వేత్తలు ముందుగానే హెచ్చరించారు. అయినా పెడచెవిని పెట్టిన కాంగ్రెస్ ప్రజలను మభ్యపుచ్చి అధికారాన్నయితే సంపాదించింది గానీ, హామీలను అమలుపరచలేక ఏడాది తిరగకముందే తలకిందులవు తున్నది. ప్రజలలో నిరసనలు రెండు రాష్ట్రాలలోనూ మొదలయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఈసారి ఇచ్చిన హామీలకు ఏటా సుమారు లక్షన్నర కోట్లు అవసరం కాగలవన్నది ఒక అంచనా. అది నిజం కాదని తెలుగుదేశం అధ్యక్షుడు చెప్పదలచుకుంటే, తన హామీలలో దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంత అవుతుందో, రాష్ట్ర బడ్జెట్తో పోల్చినపుడు పరిస్థితి ఏమిటో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి. అది నిజాయితీగల పద్ధతి అవుతుంది. ప్రజలు విజ్ఞులని స్వయంగా చంద్ర బాబు తరచూ గంభీరంగా ప్రకటిస్తుంటారు. ఒక నాయకుని గత పాలనలో ప్రజలకు కలిగే అనుభవం కూడా విజ్ఞతలోకి వస్తుంది.అందువల్ల, చంద్రబాబు గురించి ప్రజల గత కాలపు నిరాశలను, అప నమ్మకాలను మరచిపోయేటట్లు చేయాలంటే, ఆయన ఈ వివరాలు వెంటనే ప్రకటించాలి. లేనట్లయితే, ఆయనకు 2009లో రాజశేఖర రెడ్డి పెట్టిన ‘ఆల్ ఫ్రీ బాబు’ పేరును ప్రజలు తిరిగి గుర్తు చేసుకోగలరు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
మేమంతా ‘సిద్దం’ బస్సు యాత్రముగింపు సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒకమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరగతిని ఆలోచనలో పడేసింది. “ఈ సభ నుంచి మీరు మీ ఇళ్ళకు వెళ్ళాక, మీ కుటుంబ సభ్యులు అందరూ పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని ఎవరికి వోటు వేయాలోమీరు చర్చించుకోండి...” అన్నారు.ఈ మాట విన్నాక, ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఇన్నాళ్ళూ “నా వల్ల మేలు జరిగితే నాకు వోటు వేయండి” అని చెప్పిన సిఎం, ఇప్పుడు అదే మాటను మీ కుటుంబంలో అందరూ ఒక మాట అనుకొని ఒక నిర్ణయానికి రండి, అని దీన్ని ఒక ‘హోమ్లీ ఎఫైర్’గా మార్చారు. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి వెళ్ళడానికిఇంకా మూడు వారాలు సమయం ఉండగా ఆయన ఇటువంటి కొత్త పని వాళ్లకు అప్పగించారు. వినడానికి ఇది సాదాసీదా ప్రకటనగా ఉన్నప్పటికీ, ‘పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని...’ అనిఅనడం ద్వారా జగన్ దీన్ని ఒక ఇంట్లో మూడు తరాలు కలిసి కూర్చుని చేసే నిర్ణయంగా మార్చారు.కొన్ని కుటుంబాలు ఒక నిర్ణయం తీసువడం అంటే, ఎక్కడో పనిచేస్తూ ‘పోలింగ్’ రోజు ఊళ్లోకి వచ్చేవారి పిల్లలతో‘ఫోన్’లోమాట్లాడి కూడా కావొచ్చు. జగన్ చెప్పాడు- “కొన్ని కొంచెం మాత్రం పెంచి ఇంతకు ముందు ఇచ్చినవన్నీ మళ్ళీ ఇస్తాడంట...” అనేది అ చర్చలో కీలకం అవుతుంది. అయితేవారి‘నిర్ణయం’ ఏమిటి? అనే విషయం వద్దకు వచ్చేసరికి.మూడు తరాల్లో కూడా యువతరం (ఎమర్జింగ్ జెనరేషన్) ఏమనుకుంటున్నది అనేదిప్రధానం అవుతున్నది.నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువతరం తమ ఆర్ధిక ప్రయోజనాన్ని మించి మరీ,సామాజిక కోణంలో రాజకీయ స్పృహను పెంచుకుంటున్న తీరు ఈ ఎన్నికల్లోస్పష్టంగా కనిపిస్తున్నది.ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొందరు విశ్లేషకులు ఈ పార్టీకి నాయకులు తప్ప ‘కేడర్’ లేదు అనేవారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ తర్వాత ఆ ఖాళీ చాలావరకు నిండింది. అయితే, ఏప్రెల్ చివరి వారంలో ఈ పార్టీకి ఉన్న అదృశ్యశక్తి ఏమిటో విశాఖ జిల్లా భీమిలి‘సోషల్ మీడియా వారియర్స్’ సదస్సులో దృశ్యమానం అయింది. ఇన్నాళ్ళూ జగన్ కోసం స్వచ్చందంగా పనిచేసినఅదృశ్య ‘కేడర్’ ఇది. అభిమానమే అర్హతగా తలుపులు లేని పుష్పక విమానమిది. ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవి రెండు రకాల యుద్దాలు అంటారు తత్వవేత్తలు.ఒకటి-'టెరిటోరియల్ బ్యాటిల్' మరొకటి-'ఐడిలాజికల్ బ్యాటిల్'. దీన్నేజగన్-‘పేదల కోసం పెత్తందార్లతో తన ప్రభుత్వం చేస్తున్న యుద్ధం’అంటారు.కావొచ్చు కూడా మరిఅటువంటప్పుడుఒక ప్రాంతం కోసం నాయకుడు తనను తానుకట్టేసుకోవడం రెండవ రకం యుద్ధం అయితే కావొచ్చు.అదలా ఉంచి స్వచ్చందంగా ‘సోషల్ మీడియా వారియర్స్’ఈ పార్టీని ఇలా ‘వోన్’ చేసుకోవడానికి మూడుకారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి- తమ సామాజిక వర్గాల వారు చిన్నదో పెద్దదో ఏదో ఒక రాజకీయ పదవితో ఈ ప్రభుత్వంలో గుర్తింపును పొందడం.రెండు- సంస్కరణలు వల్ల పరిపాలన వ్యవస్థ వారి సమీపానికి రావడం. మూడు- మొదటి ఐదేళ్లలోనే ‘రియాల్టీ’గా కనిపిస్తున్న2019 ఎన్నికల వాగ్దానాలు. వీటిని మించి విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా రూపాంతర (ట్రాన్ఫార్మింగ్) దశలో ఉన్నప్పుడు,తమ కొత్త రాష్ట్రం ఎలా ఉండాలి? అనే భావన, దాన్ని వాస్తవం చేసే నాయకుడు ఎవరు? ప్రభుత్వం ఏది? అనే విషయంలో యువతఇప్పుడుపూర్తి స్పష్టతతో ఉంది. రేపటి వారి అవసరాలు,వారి పిల్లల అవసరాలు వారికీ ప్రధానం. వాటివెనుక- ఆర్ధికం సామాజికం సాంస్కృతికం ప్రాంతీయం ఇన్ని అంశాల నేపధ్యాలు ఉన్నాయి.ఎన్నికలు అనేసరికి తమ పార్టీల ప్రాధాన్యతల ఎంపికలో ‘కన్ఫ్యూజన్’కు గురి అవుతున్నది ఎవరు? వాటిని నిజాయతీగా అర్ధం చేసుకుంటున్నది ఎవరు?అనేది వాళ్లకు ఇప్పుడు పూర్తిగా అర్ధమయింది. ఎన్నికల ముందు ‘సీట్ల’ కోసం జరిగిన కొందరి పార్టీల మార్పు, నిరుపేదలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నాలను పబ్లిగ్గా అవహేళన చేస్తున్న తీరు, వారి దృష్టిని దాటిపోయేవి కాదు. అటువంటివి వాళ్లకు ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. అందుకే, కేవలం పార్టీ పట్ల రాజకీయ అభిమానం ఉంచుకోవవడమే కాకుండా,నాయకుడి పట్ల యువత దాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే తీరులో మునుపు ఎన్నడూ మనం చూడనివ్యక్తీకరణ ఒక‘హై వోల్టేజ్’ దేహభాషగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ కసి వెనుక ఉన్న కారణాల కోసం చూసినప్పుడు, రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. మొదటిది- ప్రభుత్వం నుంచి అందే మేలు ఏదైనా నిర్ణయాధికారం స్థానిక ఆధిపత్య వర్గాల చేతిలో నుంచి ఇప్పుడు అది సాంకేతికం అయింది. ఊళ్ళోని గ్రామ సచివాలయాల సిబ్బంది, ‘వాలంటీర్ల’ వద్దకు ‘ఆన్ లైన్’లోఅది చేరువయింది. దాన్ని ఆక్షేపిస్తూ ఏదొ వంకతో అ సేవలను నిలపాలనే వర్గాల నైజం కూడా అర్ధమయింది. జరుగుతున్న ‘యుద్దం’లో నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువత ఇది తమ నిశబ్దవిజయం అనుకొంటున్నారు. రెండవది- గడచిన ఇరవై ఏళ్లుగాచిన్న’బ్యాగ్’ భుజాన వేసుకుని కాళ్ళకు చక్రాలు కట్టుకుని, దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడికిజీవిక వెతుక్కుంటూవెళ్ళాము. ఇక ముందు మాకు ఈ తిరుగుడు తగ్గాలి. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో కుటుంబం అంతా కనీసం సమీపంగా కలిసి జీవించే పరిస్థితి రావాలిఅనేది వారి ఆకాంక్ష. ఇప్పుడు వున్నఈ- ‘ఫీల్ గుడ్’ వాతావరణంతో పాటుగా,వేగవంతమైన అభివృద్ధి కోసం ఇప్పటికే సిద్దమయిన ‘లాజిస్టిక్స్’, వాటికితోడుగావిస్తరిస్తున్న మౌలిక వసతుల వల్లఇకముందు ఉపాధి అవకాశాలు ఇక్కడే మెరుగవుతాయనికొత్త పార్టీ ప్రణాళిక చూశాక వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement