వైద్య విద్యార్థిని బలవన్మరణం | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థిని బలవన్మరణం

Published Tue, Jan 9 2018 9:25 AM

3 students commited to suicide in warangal districts - Sakshi

కాశిబుగ్గ : ఎంబీబీఎస్‌లో బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు మిగిలిపోవడంతో మనస్తాపానకి గురైన ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్‌ పుప్పాలగుట్టలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్‌ 9వ డివిజన్‌ పుప్పాలగుట్టలో ఇండియన్‌ హైస్కూల్‌ ప్రతినిధి వన్నాల గోవిందరాజు కుమార్తె విద్య(21) హైదరాబాద్‌లోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కాగా 20 రోజుల క్రితం సెలవుల నిమిత్తం వరంగల్‌కు వచ్చింది. కాగా రోజువారీగా తల్లి ఉమ స్కూల్‌కు వెళ్లిపోగానే విద్య ఇంటి తలుపు గడియ వేసుకుంది. కాసేపటికి తండ్రి గోవిందరాజు ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎంతసేపటికీ తీయలేదు. దీంతో ఆయన స్థానికుల సాయంతో తలుపులను పగలకొట్టి చూడగా విద్య ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేతా రోదించారు. కాగా చదువులో వెనుకబడిపోతున్నందునే విద్య మనోవేదనకు గురైనట్లు తెలిసింది. అర్బన్‌ జిల్లా ప్రైవేట్‌ పాఠశాలల ప్రతినిధులతోపాటు కార్పొరేటర్‌ సోమిశెట్టి శ్రీలతప్రవీణ్, స్థానిక నాయకులు ఎల్‌.శ్రీనివాస్‌ తదితరులు గోవిందరాజును పరామర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తన్నట్లు మిల్స్‌కాలనీ ఎస్సై రామకృష్ణ తెలిపారు.

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య
రైల్వేగేట్‌: రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వరంగల్‌ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ పాపయ్యపేట చమన్‌కు చెందిన గద్దల ప్రసన్నరాజు(25) సోమవారం వరంగల్‌–కాజీపేట మధ్య రైల్వేట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రసన్నరాజు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకన్నాడని సీఐ వివరించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు వివరించారు.   

పురుగుల మందు తాగి విద్యార్థిని ..
టేకుమట్ల: చదువుకోవడం ఇష్టం లేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గర్మిళ్లపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మొగిళి గంగమల్లు–సారమ్మల కూతురు కోమల(17) కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుకోవడం ఇష్టంలేక ఇటీవలే గర్మిళ్లపల్లికి వచ్చి తల్లితో కలిసి పత్తి ఏరేందుకు వెళ్లోంది. ఫీజు చెల్లించాక కాలేజీకి వెళ్లకుండా పనికి రావడమేంటని తల్లిదండ్రులు మందలించడంతో కోమల తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగింది. దీంతో అపస్మరక స్థితికి చేరుకున్న కోమలను కుటుంబ సభ్యులు వెంటనే చిట్యాలలోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడతో వరంగల్‌ ఎంజీఎంకు తరలిస్తుండగా మృతిచెందింది.

Advertisement
Advertisement