Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page
Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy Comments After Election Results
పేదల గొంతుకై నిలుస్తాం: వైఎస్‌ జగన్‌

ఏం జరిగిందో తెలియదు కానీ, ఏం చేసినా, ఎంత చేసినా ఇంకా 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. కచ్చితంగా గుండె ధైర్యంతో నిలబడి మళ్లీ ఇక్కడి నుంచి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండటం కొత్తకాదు. పోరాటాలు చేయడం అంతకన్నా కొత్తకాదు. ఈ ఐదు సంవత్సరాలు తప్ప నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపాను. రాజకీయ జీవితంలో ఎవ్వరూ చూడని కష్టాలు అనుభవించాను. ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొంటాం. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు.. అని అనొచ్చు. కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాను. మంచి చేయడానికి మాత్రం కచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటాం. వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌లెస్‌ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది. పెద్దపెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. ఈ కూటమిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకు, పవన్‌ కళ్యాణ్‌కు, అందరికీ కూడా వాళ్ల గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా, నా ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికీ, ప్రతి కార్యకర్తకూ, ప్రతి వలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చి స్టార్‌ క్యాంపెయినర్‌గా నాకు తోడుగా నిలబడిన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడా ఏ పేదవాడికీ దక్కని ప్రయోజనాలు.. అవినీతికి తావు లేకుండా, నేరుగా వారి గుమ్మం వద్దకే తీసుకువెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకిలా జరిగిందో తెలియడం లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరుగుతుందని, ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ.. అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. వారికి మంచి చేయాలనే తపనతో అడుగులు వేశాం. 31 లక్షల ఇంటి పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చాం. వాటిలో 22 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం. మరి ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు’ అన్నారు. ‘66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే సంక్షేమాన్ని పంపించే వ్యవస్థను సైతం తీసుకువచ్చాం. గతంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తున్న చాలీచాలని పెన్షన్‌ నుంచి.. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దాదాపు కోటీ 5 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాటా తప్పకుండా అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉంటూ.. ఆసరా, చేయూతతో తోడున్నాం. సున్నా వడ్డీతో సైతం అండగా నిలిచాం. మరి ఆ కోటీ ఐదు లక్షల అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్కచెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియదు’ అని అన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. పిల్లల చదువుల కోసం పరితపించాం ‘పిల్లల చదువుల కోసం ఏ తల్లీ, తండ్రీ ఇబ్బంది పడకూడదని మొట్టమొదటి సారిగా పూర్తి ఫీజు ఇస్తూ అండగా నిలవడం ద్వారా చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఏటా దాదాపుæ 12 లక్షల మందికి మంచి చేశాం. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమయ్యిందో తెలియదు. 54 లక్షల మంది రైతలన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయం అందించే కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. అంతగా రైతన్నకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం గానీ, సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత ఇన్సూ్యరెన్స్, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చే కార్యక్రమం చేశాం. మరి ఆ అరకోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు. ఆటోలు, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లు ఇబ్బంది పడకూడదని వారికి అండగా నిలుస్తూ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాం. పుట్‌పాత్‌ల మీద చిన్న చిన్న ఇడ్లీ దుకాణాలు, వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాపడుతూ వాళ్లకు తోడుగా నిలిచాం. నా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు అండగా ఉంటూ చేదోడు ఇచ్చాం. ఇన్ని కోట్ల మందికి మంచి చేసి, ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అంటే చెత్త బుట్టలో పడేసే డాక్యుమెంట్‌ కాదు, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మొట్టమెదటి రోజు నుంచీ భావిస్తూ.. ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అక్కచెల్లెమ్మల ఇళ్లకు తీసుకెళ్లి చూపించి మీరే టిక్‌ పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పని చేశాం. ఇంటి వద్దకే సేవలు ఎప్పుడూ జరగని విధంగా, పేదరికం పోవాలంటే.. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అవసరం అని ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లతో సైతం యుద్ధం చేసి పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావడమే కాకుండా, ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రను కూడా మార్చాలని టోఫెల్, ఐబీ లాంటి కలలు కన్నాం. ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చి.. వివక్ష, కరప్షన్‌ లేకుండా ప్రతి ఇంటికీ సేవలందించాం. దాదాపు రూ.2.70 లక్షల కోట్లు ఇంటి వద్దకే అందించగలిగాం. ఎప్పుడూ చూడని మార్పులను తీసుకు రావడమే కాకుండా విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని, ఊహించని మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. మహిళా సాధికారత అంటే ఇదీ అని, సామాజిక న్యాయం అంటే ఇదీ అని ప్రపంచానికి చూపించగలిగాం. ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి చేసిన తర్వాత ఆ అభిమానం ఏమయ్యిందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదు’ అంటూ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ తన స్పందనను ముగించారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు.

Unexpected results in Lok Sabha elections Reduced NDA strength
తగ్గిన ఎన్డీఏ బలం.. పవర్‌ ఖాయం! హ్యాట్రిక్‌!

న్యూఢిల్లీ: పాలక ఎన్డీఏ కూటమి పదేళ్ల జోరుకు బ్రేకులు ఎన్డీఏ సారథి బీజేపీ దూకుడుకు ముకుతాడు విపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం కూటమి సారథి కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు వెలువరించారు. గత రెండు ఎన్నికల ఆనవాయితీకి భిన్నంగా బీజేపీని ఈసారి మెజారిటీకి ఓ 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది. దాంతో నరేంద్ర మోదీ శకం మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితిలో పడింది. ఎన్డీఏ కూటమి కూడా కనాకష్టంగా మెజారిటీ మార్కు 272ను దాటింది. 2019లో 353 సీట్లు రాగా ఈసారి 293కే పరిమితమైంది. మరోవైపు 2019లో కేవలం 52 సీట్లతో కుదేలైన కాంగ్రెస్‌ బలం ఈసారి దాదాపు రెట్టింపైంది. 99 సీట్లలో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్‌ సారథ్యంలో ఇండియా కూటమి కూడా అంచనాలకూ మించి రాణించింది. 233 సీట్లు కైవసం చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అనూహ్యంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 62 సీట్లు నెగ్గిన పార్టీ ఈసారి ఏకంగా సగానికి సగం సీట్లు కోల్పోయి 33కే పరిమితమైంది. గత ఎన్నికల్లో చతికిలపడ్డ అఖిలేశ్‌ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ అక్కడ 38 స్థానాలతో దుమ్ము రేపింది. పశ్చిమబెంగాల్లో కూడా బీజేపీ అంచనాలను అందుకోలేక 12 స్థానాలతో సరిపెట్టుకుంది. మమతా సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ 29 సీట్లతో సత్తా చాటింది. స్మృతీ ఇరానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఓటమి చవిచూశారు. ఈసారి లోక్‌సభ ఫలితాలను ఏ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే కూడా ప్రతిఫలించలేకపోవడం విశేషం. మొత్తమ్మీద కేంద్రంలో పదేళ్ల ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి తిరిగి నిజమైన సంకీర్ణ శకానికి తెర లేచింది. విపక్ష కూటమి కూడా పదేళ్ల తర్వాత గణనీయ శక్తిగా రూపుదిద్దుకుంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో అధికారంపైనా కన్నేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి...! ఆకట్టుకున్న ఇండియా కూటమి ఏడు విడతల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ జూన్‌ 1తో ముగియడం తెలిసిందే. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఎన్డీఏ కూటమి ఆధిపత్యం 300లోపు స్థానాలకు పరిమితం కాగా ఇండియా కూటమి తొలి రౌండ్‌ నుంచే అనూహ్య రీతిలో ముందంజ వేసింది. క్రమంగా పుంజుకుంటూ 200 స్థానాలు దాటేసింది. చూస్తుండగానే 233కు చేరి పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచింది. ప్రధాని మోదీ వారణాసిలో తొలి రౌండ్లో వెనకబడ్డారు! చివరికి ఆయన నెగ్గినా మెజారిటీ మాత్రం బాగా తగ్గింది. 2019లో 4.79 లక్షల మెజారిటీ రాగా ఈసారి లక్షన్నర పై చిలుకుతో సరిపెట్టుకున్నారు. బీజేపీలో మోదీ కంటే కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. మరోవైపు రాహుల్‌గాంధీ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ భారీ విజయం సాధించారు. ఆయనకు కేరళలోని వాయనాడ్‌లో 3.64 లక్షలు, యూపీలోని రాయ్‌బరేలీలో 3.9 లక్షల మెజారిటీ రావడం విశేషం. కీలక రాష్ట్రాల్లో బీజేపీ కుదేలు కీలకమైన యూపీలో ఈసారి బీజేపీకి ఏకంగా 29 సీట్లకు కోత పడింది! మహారాష్ట్రలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి 48 స్థానాల్లో 2019లో 43 సీట్లు ఒడిసిపట్టిన ఎన్డీఏ ఈసారి కేవలం 17కు పరిమితమైంది! బీజేపీ బలం 23 నుంచి ఏకంగా 10కి తగ్గింది. అక్కడ కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య 1 నుంచి ఏకంగా 13కు పెరిగింది. దాని భాగస్వాములైన శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ (ఎస్‌పీ) 7 సీట్లు గెలుచుకున్నాయి! బిహార్లోనూ ఎన్డీఏకు 9 సీట్లకు కోతపడింది. బీజేపీ 12, భాగస్వాములు జేడీ(యూ) 12, ఎల్జేపీ(ఆర్‌వీ) 5 సీట్లలో నెగ్గాయి. 2019లో క్లీన్‌స్వీప్‌ చేసిన రాజస్తాన్‌ (25)లో కూడా బీజేపీకి ఈసారి 11 సీట్లకు కోత పడింది. కర్నాటకలోనూ పార్టీ బలం 25 నుంచి 17కు తగ్గింది. బెంగాల్లో 6 స్థానాలు తగ్గాయి. మరో క్లీన్‌స్వీప్‌ రాష్ట్రం హరియాణా (10)లోనూ ఈసారి బీజేపీ ఐదే గెలిచింది. మధ్యప్రదేశ్‌లో మాత్రం మొత్తం 29 సీట్లూ నెగ్గి క్లీన్‌స్వీప్‌ చేసింది. గుజరాత్‌లో ఒక్కటి మినహా 24 సీట్లు గెలుచుకుంది. తూర్పు రాష్ట్రం ఒడిశా బీజేపీ నెత్తిన పాలు పోసింది. అక్కడి 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 20 దక్కాయి! ఏపీలో కూడా ఎన్డీఏ కూటమికి 21 సీట్లు దక్కాయి. తెలంగాణలోనూ 2019లో 4 సీట్లలో నెగ్గిన బీజేపీ ఈసారి 8 స్థానాలు గెలుచుకుంది. అయితే కేరళలో తొలిసారి బోణీ కొట్టినా తమిళనాట మాత్రం సున్నా చుట్టింది. మరోవైపు ఇండియా కూటమి కీలక రాష్ట్రాల్లో దుమ్ము రేపింది. తమిళనాట మొత్తం 39 స్థానాలూ కూటమి ఖాతాలోనే పడ్డాయి! యూపీలో 2019లో కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకున్న ఎస్పీ ఈసారి ఏకంగా 37 సీట్లు ఒడిసిపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం కూడా 1 నుంచి 7కు పెరిగింది. బెంగాల్లో టీఎంసీకి 7 సీట్లు, బిహార్లో కూటమికి 9 స్థానాలు పెరిగాయి. రాజస్తాన్లో 2019లో సున్నా చుట్టిన కాంగ్రెస్‌ ఈసారి 8 సీట్లు నెగ్గింది. హరియాణాలోనూ 5 స్థానాలు దక్కించుకుంది. కర్నాటకలో పార్టీ స్థానాలు ఒకటి నుంచి 8కి పెరిగాయి. ఓట్ల శాతం ఇలా... బీజేపీ ఈసారి 36.58 శాతం ఓట్లు సాధించింది. ఇది 2019తో పోలిస్తే 0.72 శాతం తక్కువ. 2019 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా పార్టీ ఓట్ల శాతం తగ్గిపోవడం విశేషం. కాంగ్రెస్‌ ఓట్ల శాతం మాత్రం 19.46 నుంచి 21.22కు పెరిగింది. యూపీలో దుమ్ము రేపిన సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 2.55 నుంచి 4.59కు పెరిగింది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఓట్లు మాత్రం 2.04 నుంచి 1.58కు తగ్గిపోయింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్ల శాతం 4.06 నుంచి 4.38కు పెరిగింది. జేడీ(యూ) ఓట్ల శాతం 1.45 నుంచి 1.25కి తగ్గింది. ఆప్‌ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కు పెరిగింది. దక్షిణాదిన తమిళనాడులో పాలక డీఎంకే ఓట్ల శాతం 2.34 నుంచి 1.82కు తగ్గింది. హస్తినలో నంబర్‌గేమ్‌! మోదీ కాళ్ల కిందకు నీళ్లు? ఆయనపై ఎన్డీఏలో అభ్యంతరాలు జాతీయ మీడియాలో వార్తలు దేశవ్యాప్తంగా సాధించిన అనూహ్య ఫలితాలతో జోష్‌లో ఉన్న ఇండియా కూటమి ఏకంగా కేంద్రంలో అధికారంపై కన్నేసినట్టు వార్తలొస్తున్నాయి! ఈ దిశగా జేడీ(యూ)తో పాటు పలు ఇతర ఎన్డీఏ భాగస్వాములతో ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని సమాచారం. ఎన్డీఏ కూటమి సుస్థిరత కోసం పలు ఇండియా కూటమిలోని పక్షాలతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీలతోనూ బీజేపీ పెద్దలు ఇప్పటికే జోరుగా సంప్రదింపులకు సాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద హస్తినలో జోరుగా నంబర్‌గేమ్‌ సాగుతోందంటూ వస్తున్న వార్తలతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా రంజుగా మారాయి. ఎన్డీఏనే వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రధానిగా మోదీ అభ్యర్ధిత్వానికి జేడీ(యూ) వంటి భాగస్వామ్య పక్షాలు సుతరామూ అంగీకరించకపోవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి! ఈ నేపథ్యంలో హస్తినలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 18వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) ఎన్డీఏ 291 (రంగు మార్చాలి. లేదంటే ఎన్డీఏ, ఇండియా కూటమి పక్కపక్కన విడిగా పెట్టుకోవాలి) బీజేపీ 241 టీడీపీ 16 జేడీ(యూ) 12 శివసేన 7 ఎల్జేపీ (ఆర్‌వీ) 5 జనసేన 2 జేడీ(ఎస్‌) 2 ఆరెల్డీ 2 ఎన్సీపీ 1 అప్నాదళ్‌ 1 ఏజీపీ 1 యూపీపీఎల్‌ 1 ఏజేఎస్‌యూపీ 1 హెచ్‌ఏఎం(ఎస్‌) 1 ఇండియా కూటమి 233 కాంగ్రెస్‌ 99 ఎస్పీ 37 టీఎంసీ 29 డీఎంకే 22 శివసేన (యూబీటీ) 9 ఎన్సీపీ (ఎస్‌పీ) 7 ఆర్జేడీ 4 సీపీఎం 4 ఆప్‌ 3 జేఎంఎం 3 ఐయూఎంఎల్‌ 3 సీపీఐ 2 సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌) 2 ఎన్‌సీ 2 వీసీకే 2 ఆరెస్పీ 1 కేసీ 1 ఆరెలీ్టపీ 1 బీఏడీవీపీ 1 ఎండీఎంకే 1 ఇతరులు 17 వైఎస్సార్‌సీపీ 4 మజ్లిస్‌ 1 అకాలీదళ్‌ 1 ఏఎస్‌పీకేఆర్‌ 1 వీఓటీపీపీ 1 జెడ్‌పీఎం 1 ఎస్‌కేఎం 1 స్వతంత్రులు 7

Congress and BJP won 8 seats each Lok Sabha Election 2024
Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్‌కు చెరో '8'

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్‌ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. ఓడినవారిలో నామా నాగేశ్వర్‌రావు, మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్‌ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్‌ మాత్రమే తమ సీట్లను నిలుపుకొన్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పట్టు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్‌సభ సీట్లనూ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్‌సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. పట్టుపెంచుకున్న ఇరు పార్టీలు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ.. ఈసారి తన బలాన్ని 8 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్‌ కూడా 3 సీట్ల నుంర్టీచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి.. ఆ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలే గెలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి సమ ఉజ్జీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ ఒక్క లోక్‌సభ సీటు గెలవలేదు. గత, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివీ.. పార్టీ 2014 2019 2024 కాంగ్రెస్‌ 2 3 8 బీజేపీ 1 4 8 ఎంఐఎం 1 1 1 బీఆర్‌ఎస్‌ 11 9 0 నల్లగొండ: రికార్డు స్థాయి మెజారిటీ నల్లగొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ తమ పట్టు నిలుపుకొంది. కౌంటింగ్‌ ఆద్యంతం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపారు. చివరికి ఏకంగా రికార్డు స్థాయిలో 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి: అంతా తొలిసారి ఎంపీలే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తమకు ఉన్న పట్టును కాంగ్రెస్‌ పార్టీ మరోసారి నిలుపుకొంది. భువనగిరి లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తొలిసారిగా ఎంపీలు అయినవారే కావడం విశేషం. నాగర్‌ కర్నూల్‌: మళ్లీ ‘చేతి’కి.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌పై గెలుపొందారు. మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలవడం గమనార్హం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. పెద్దపల్లి: మళ్లీ కాంగ్రెస్‌ ఖాతాలోకి.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌పై విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) మనవడు, చెన్నూర్‌ ఎమ్మెల్యే జి.వివేక్‌ తనయుడే గడ్డం వంశీకృష్ణ. ఈయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. వరంగల్‌: పార్టీ మారి పోటీచేసినా.. 2009లో జరిగిన పునర్విభజనలో వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్‌ గెలవగా తర్వాత వరుసగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌పై 2,20,339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కావ్యకు బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అరూరి రమేష్‌ కూడా ఎన్నికల ముందే బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరి పోటీ చేయడం గమనార్హం. మహబూబాబాద్‌: సెగ్మెంట్‌ చరిత్రలో అధిక మెజారిటీ మహబూబాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పి.బలరాంనాయక్‌ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు. 1957 నుంచీ కొనసాగిన మానుకోట పాత పార్లమెంట్‌ స్థానంలోగానీ, 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలోగానీ.. ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్‌ తరఫున ఇదే లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన బలరాంనాయక్‌ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. ఈసారి మళ్లీ గెలిచారు. ఖమ్మం: ఆద్యంతం కాంగ్రెస్‌ ఆధిక్యమే.. తొలి రౌండ్‌ నుంచి చివరిదాకా కాంగ్రెస్‌ ఆధిక్యమే కొనసాగింది. చివరికి 4,67,847 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 18 ఎన్నికల్లో.. ప్రస్తుతం రామసహాయం రఘురాంరెడ్డి సాధించిన మెజారిటీయే రికార్డు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్‌ పెంచుకుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 20,488 ఓట్లే రాగా.. ఈసారి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు 1,18,636 ఓట్లు సాధించారు. జహీరాబాద్‌: ఇక్కడా హస్తం హవా ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. సురేశ్‌ షెట్కార్‌ ఇదే సెగ్మెంట్‌ నుంచి 2009లో ఎంపీగా గెలిచారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన బీబీ పాటిల్‌ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే జరిగింది. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ మూడో స్థానంలో నిలిచారు. నిజామాబాద్‌: పోటాపోటీ మధ్య కమలానికి.. ఇందూరు గడ్డపై మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ కొనసాగిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను.. అరవింద్‌కు బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్‌ రూరల్‌లలో ఆధిక్యత వచ్చింది. జీవన్‌రెడ్డికి జగిత్యాల, నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ సెగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది. కరీంనగర్‌: పట్టు పెంచుకున్న జాతీయ పార్టీలు తొలి నుంచీ బీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో జాతీయ పార్టీలు పట్టుపెంచుకున్నాయి. ఇక్కడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 4,98,276 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,79,258 ఓట్లు రాగా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. క్రితంసారితో పోలిస్తే 86,840 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు 3,59,907 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్‌కు 1,80,649 ఓట్లు అదనంగా వచ్చాయి. ఈసారి బీఆర్‌ఎస్‌కు 2,82,163 ఓట్లు వచ్చాయి. 1.25 లక్షలకుపైగా ఓట్లు తగ్గాయి. మహబూబ్‌నగర్‌: కౌంటింగ్‌ ఆద్యంతం ఉత్కంఠ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి డీకే అరుణ 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన డీకే అరుణ లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఈ లోక్‌సభ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి: దేశంలోనే పెద్ద సెగ్మెంట్‌.. తొలిసారి బీజేపీ విజయం దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్‌సభ సెగ్మెంట్‌ మల్కాజిగిరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌లో ప్రముఖ నేతగా కొనసాగి, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈటల తొలిసారి ఎంపీ అయ్యారు. చేవెళ్ల: కొండా వశం చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన 2014లో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల సెగ్మెంట్‌లో ఏకంగా 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మెదక్‌: గులాబీ కంచుకోటలో కమలం బీఆర్‌ఎస్‌ పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉన్న మెదక్‌లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌పై గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్‌రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కంటే సుమారు 35 వేల ఓట్లు తక్కువగా వచ్చిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆదిలాబాద్‌: మళ్లీ కమలమే! ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో కమలం పార్టీ మళ్లీ వికసించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కౌంటింగ్‌ తొలుత ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నా.. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. చివరికి నగేశ్‌ గెలిచారు. హైదరాబాద్‌: ఐదోసారి లోక్‌సభకు అసదుద్దీన్‌ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో తన ప్రచార, వ్యవహార శైలితో జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన మాధవీలత ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయ్యారు. 2019లో 2.82 లక్షల ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్‌ గెలవగా.. మెజారిటీ మరో 50వేలకుపైగా పెరిగింది. సికింద్రాబాద్‌: ఓట్లు మరింత పెంచుకున్న బీజేపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో బీజేపీ తన ఓట్లశాతాన్ని మరింత పెంచుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో బీజేపీకి 42.05 శాతం ఓట్లురాగా.. ఈసారి 45.15శాతం వచ్చాయి.

Political pundits say that the reasons for the success of the TDP alliance are not clear
అంతుచిక్కని ఫలితం..!

సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 99% అమలు చేశారు. ఐదేళ్లుగా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. పారదర్శకంగా అర్హులందరికీ నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేసి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు. జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించి.. గ్రామ, వార్డు సచివాలయాలు–వలం­టీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ.. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ యువతకు దన్నుగా నిలిచారు. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన అందించిన సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలికారు. సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలలో నిర్వహించిన సిద్ధం సభలకు లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలకు ఊళ్లకు ఊళ్లు జనం కదలివచ్చి సంఘీభావం తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల్లో నిర్వహించిన రోడ్‌ షోలకు కిలో మీటర్ల పొడవున జనం బారులు తీరి.. మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండుటెండలో జగన్‌ సభలకు జనం పోటెత్తారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చినా.. సిద్ధం సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచార సభల్లో.. ‘మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటు వేసి ఆశీర్వదించేందుకు మీరంతా సిద్ధమా’ అని జగన్‌ పిలు­పునిస్తే.. మేమంతా సిద్ధం సిద్ధం.. అంటూ లక్షలాది మంది ప్రజలు పిడికిళ్లు బిగించి నినదించారు. కానీ.. వైఎస్సార్‌సీపీకి దక్కాల్సిన ఎన్నికల ఫలితం టీడీపీ కూటమికి దక్కడ­ం­పై రాజకీయ విశ్లేషకులు నివ్వెరపోతున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల సమస్య దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ రూ.800 కోట్లతో తాగునీటి పథకం, కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం, కిడ్నీ వ్యాధుల చికిత్సకు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిరి్మంచినా.. పలాస నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రూ.8 వేల కోట్లతో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరంలలో పూర్తి చేశారు.గతే­డాది నుంచే ఆ ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యా­యి. కానీ.. ఆ ఐదు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఓడి­పోవడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. మూలపేట, కాకినాడ, రామాయపట్నం, మచిలీపట్నం నియో­జకవర్గాల్లో రూ.25వేల కోట్లతో పోర్టులు నిరి్మస్తున్నారు. కానీ.. ఆ పోర్టులు ఉన్న నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ గెల­వక పోవడంపై రాజకీయ పండితులు నివ్వెరపోతున్నారు.కంచుకోటల్లోనూ కూటమి పాగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలు వైఎస్సార్‌సీపీకి కంచుకోటలుగా నిలుస్తూ వస్తున్నాయి. కానీ.. ఈ ఎన్నికల్లో ఆ కంచుకోటల్లోనూ ఎన్నడూ లేని రీతిలో టీడీపీ గెలుపొందడటంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ నిలవా­ల్సిన చోట్ల టీడీపీ కూటమి నిలవడంపై ఆశ్చర్యపోతున్నారు. వైఎస్సార్‌సీపీకి దక్కాల్సిన ఫలితం టీడీపీకి దక్కడానికి కారణాలు అంతుచిక్కడం లేదని రాజకీయ పండితులు వాపోతున్నారు. ఇటీవల యాక్సెస్‌ మై ఇండియా చర్చలో ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మాట్లాడుతూ మహిళలు, గ్రామీణులు భారీ ఎత్తున జగన్‌కు మద్దతుగా నిలిచారని చెప్పడం.. ఎన్‌డీటీవీ ప్రణయ్‌ రాయ్‌ కూడా పలు సందర్భాల్లో గ్రామీణులు, మహిళలు, మైనార్టీ లు జగన్‌కు అండగా ఉన్నారని స్పష్టం చేసిన నేపథ్యంలో ఫలి­తాలు ఇలా వెలువడటం సర్వత్రా ఆశ్చర్యపరుస్తోంది.

Analysis Of Ap Election Wins And Losses
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?

మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో ఉండడం.. ఆర్థికంగా పరిపుష్టమైన వనరులు ఉండడం.. అన్ని వ్యవస్థల నుంచి సహకారం అందడం వంటి అంశాలు టీడీపీకి కలిసివచ్చాయి. టీడీపీ+జనసేన+బీజేపీల గెలుపునకు గల కారణాలను విశ్లేషిస్తే.. టీడీపీ ఎక్కువగా ప్రచారం చేసిన అంశాలు:లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ వల్ల మీ భూములు కొట్టేస్తారని బాబు పదే పదే ప్రకటించడంసూపర్‌ సిక్స్‌ పేరుతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఏపీలో ప్రకటించడంవైఎస్సార్‌సిపి ప్రకటించిన ప్రతీ హామీకి అదనంగా కలిపి తామిస్తామని చెప్పడంవలంటీర్ల వ్యవస్థను ముందు తప్పుబట్టిన వాళ్లే.. తర్వాత వాలంటీర్లకు 5వేల వేతనం బదులు పదివేలిస్తామని ప్రకటించడంఅమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా నిలబెడతామని చెప్పడంమెగా డీఎస్సీతో పాటు ప్రతీ ఏటా జాబ్‌ కాలెండర్‌ ఇస్తామనడం2014లో రైతు రుణమాఫీ తరహలో పెన్షన్‌ను ఏకంగా రూ.4000 చేస్తామనడం50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని ప్రకటించడం

The EVM were changed
ఈవీఎంనే మార్చేశారు

మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారు. ఇందులోనూ ఓట్లు తప్పులతడకగా చూపాయి. ఓట్లలో తేడా ఉండ­టంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పారు. చివరకు ఈ ఈవీఎం పార్లమెంట్‌ నియోజకవర్గానిదని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. దీంతో అధికారులు వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించారు. ఇది బయటపడిన సంఘటన మాత్ర­మే. బయటకు తెలియని ఇటువంటి ఈవీఎం మారి్పడి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. మంగళవారం మడకశిర అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బిట్‌ కళాశాలలో జరి­గింది. ఒక గదిలో లోక్‌సభ ఓట్లు, పక్క గదిలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం పిల్లిగుండ్లు 131 పోలింగ్‌ బూత్‌ పార్లమెంట్‌ ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్‌ వద్దకు తీసు­కొచ్చారు. ఇందులో బీఎస్పీ అభ్యర్థికి 414, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 5, టీడీపీ అభ్యర్థికి 349 ఓట్లు వచ్చినట్లు చూపింది. వైఎస్సార్‌సీపీకి బలమున్న గ్రామంలో ఓట్లు మరీ తక్కువగా రావడంతో అనుమానం వచి్చన రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు వైఎస్సార్‌­సీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ద్వారా ఆర్‌వోకు ఫిర్యాదు చేయించారు. దీంతో దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి చివర్లో పరిష్కారం చూపుతామని ఆర్‌వో చెప్పారు. కౌంటింగ్‌ చివరలో టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో పక్కన పెట్టిన ఈవీఎం సంగతి తేల్చాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్కప్ప పట్టుబట్టారు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు పరిశీలించగా పార్లమెంట్‌కు సంబంధించి­న­దిగా తేలింది. తప్పును గుర్తించిన అధికారులు తీరిగ్గా ఆ పోలింగ్‌ బూత్‌కు సంబంధించి అసెంబ్లీ ఈవీఎం తీసుకువచ్చారు. అది అసలు ఓపెనే కాలేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో చివరకు వీవీ ప్యాట్‌ స్లిప్పులు తీసుకొచ్చి లెక్కించారు. అందులో టీడీపీకి 349 ఓట్లు, వైఎస్సార్‌సీపీకి 414 ఓట్లు వచ్చాయి. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఈవీ­ఎం మారిన సంగతి బయటపడకుండా, పార్లమెంటు ఈవీఎం ఓట్లే లెక్కించి ఉంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 414 ఓట్లకు బదులు 5 ఓట్లే వచ్చి ఉండేవి. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంపై అనుమా­నాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎం తెచ్చారు. అది కూడా ఓపెన్‌ కాకపోవడం అనుమానాలను మరింత బల­పరుస్తోంది. ఇలా ఈవీఎం మారిన ఘటన ఒక్కటే బయటపడింది. ఎవరికీ తెలియకుండా రాష్ట్ర­వ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారి­పోయాయి, వాటిలో ఎన్ని లెక్కలు తేడాలు­న్నా­యన్న అనుమానాలు వ్యక్త­మ­వుతున్నాయి. ఈవీ­ఎం మారిపోవడం, అసెంబ్లీ ఈవీఎం తెరుచుకోకపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్కప్ప చెప్పారు. ఇలా ఈవీఎంలపై అనుమా­నం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదు వస్తే 5% వీవీ ప్యాట్‌ స్లిప్పు­లను లెక్కించాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచి్చంది. ఈ ఎన్నికల్లో ఆది నుంచి పలు వివాదాలు చోటు చేసుకోవడం, ఇప్పుడు మడకశిరలో ఈవీఎంనే మార్చే­సిన తీరుతో ఓట్ల లెక్కింపుపై అనుమానాలున్న అభ్యర్థు­లు ఈసీకి ఫిర్యాదులు చేయడానికి సిద్ధపడుతున్నారు.

Modi Claims Victory For His Alliance In India General Election
మూడోసారి NDA కూటమి అధికారం చేపట్టబోతుంది: ప్రధాని మోదీ

2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ సంబరాలు నిర్వహించింది. ఈ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.మోదీ మాట్లాడుతూ దేశం గర్వించేలా ఎన్నికల్ని నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ మంత్రం గెలిచింది. మూడసారి అధికారంలోకి రాబోతున్నామన్న మోదీ.. ఈ విజయం 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని కార్యకర్తలకు అభినందనలు. జమ్మూ కాశ్మీర్‌ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. అరుణాల్‌ ప్రదేశ్‌, సిక్కింలో కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకుపోయింది. ఒడిశాలో కూడా అద్భుత ప్రదర్శన చేశాం. మూడో సారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీగడ్‌,ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌. కేరళలో తొలిసారి బీజేపీ ఒకసీటు గెలిచింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి గెలిచిందని మోదీ తెలిపారు.

Market Meltdown: Rs 31 lakh crore wiped off as poll verdict trend sends Sensex plummeting over 4390 poin
మార్కెట్‌ అల్లకల్లోలం

లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్‌డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్‌ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్‌ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్‌ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్‌ పోల్స్‌ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్‌ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్‌–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్‌ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్‌ఈసీ 24 శాతం, పీఎఫ్‌సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్‌ఈఎల్‌ 19%, హెచ్‌ఏఎల్‌ 17%, ఓఎన్‌జీసీ, మజ్గావ్‌ డాక్‌ 16%, రైల్‌టెల్, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా 14%, ఆర్‌వీఎన్‌ఎల్‌ 13%, ఐఆర్‌సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్‌ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్‌ బ్యాంక్, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్‌ఈ ఇండెక్స్‌ 16%పైగా క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకెక్స్‌ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్‌ఎంసీజీ.. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్‌ గూడ్స్, విద్యుత్‌ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ, శ్రీరామ్‌ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్‌ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్‌ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్‌ 6–2 % మధ్య జంప్‌ చేశాయి.అదానీ గ్రూప్‌ బేర్‌.. అదానీ గ్రూప్‌ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్‌ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్‌ 20 శాతం దిగజారగా.. గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌ప్రైజెస్, టోటల్‌ గ్యాస్, ఎన్‌డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్‌ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్‌ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది.

Attacks by TDP ranks during victory celebrations
విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణుల దాడులు

సాక్షి నెట్‌వర్క్‌ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ–జనసేన శ్రేణులు మంగళవారం విజయోత్సాహంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేశారు. గుంటూరులోని మంత్రి విడదల రజిని కార్యాలయం, పల్నాడు జిల్లాలో ఓ సచివాలయంతోపాటు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణమండపాన్ని ధ్వంసం చేశారు.విజయవాడలోని వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్‌ను తొలగించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి ఊరేగింపులు చేయరాదని, బాణాసంచా కాల్చరాదని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎంత ప్రచారం చేసినా టీడీపీ–జనసేన శ్రేణులు ఎక్కడా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ దాడులు జరిగాయంటే..» ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ముఖ ద్వారం, గేట్‌ను టీడీపీ నేతలు జేసీబీతో కూల్చివేశారు. ఈ ముఖ ద్వారం, గేట్‌ను గ్రామానికి చెందిన దాత ముప్పా సుబ్బారావు కుటుంబ సభ్యులు ముప్పా రోశయ్య పేరు మీద 2010లో సుమారు రూ.5 లక్షలతో పాఠశాలకు వీటిని నిర్మించారు. అనంతరం టీడీపీ నేత­లు గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు, బీసీ కులా­నికి చెందిన పెరుగు మాల్యాద్రి ఇంటిని కూల్చ­డానికి జేసీబీని తీసుకొచ్చి గొడవకు దిగారు. దీంతో మాల్యా­ద్రితోపాటు అతని భార్య ఆదిలక్ష్మి అడ్డుకో­వడంతో టీడీపీ నేతలు వారిపై దాడికి ప్రయ­త్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. జెడ్పీ పాఠ­శాల ముఖ ద్వారాన్ని కూల్చివేసిన జేసీబీని పోలీస్‌­స్టేషన్‌కు తరలించారు. అయితే, తెలుగు తమ్ముళ్లు దాని నెంబర్‌ ప్లేట్‌ను తొలగించడం గమనార్హం. » పల్నాడు జిల్లా కొండూరులో టీడీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండాలతో గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలోకి వెళ్లగానే కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వచ్చి మీ ఓట్లు ఇక్కడలేవు కదా వెళ్లి గ్రామాల్లోనే ప్రదర్శనలు చేసుకోండి అనడంతో గొడవలు ప్రారంభమై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీకి చెందిన పోతిపోగు సమాధానం, బండారు వందనం, బుర్రి పుల్లయ్య, పోతిపోగు దేవయ్య, పోతిపోగు యాకోబు, పోతిపోగు మణమ్మ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను అచ్చంపేట పీహెచ్‌సీకి తరలించారు. కోనూరులోను ఇదే పరిస్థితి నెలకొంది. విజయోత్సవం పేరుతో టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో దాడులు నిర్వహించడంతో పలువురు గాయపడ్డారు. బందరులో రాళ్ల దాడి..కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు పార్లమెంట్‌ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, బందరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కార్యకర్తలు పెద్దఎత్తున వాహనాలపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుండే ప్రాంతాలకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇలాగే రెచ్చగొట్టారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతిఘటించేందుకు యత్నించారు. కొంతమంది సీనియర్‌ నేతలు కార్యకర్తలను సముదాయిస్తుండగా కూటమి కార్యకర్తలు కొడాలి నాని అనుచరుల కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో కూటమి కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మద్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల విసురుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.కొవ్వూరులో విధ్వంసం..ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో టీడీపీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోనూ విధ్వంసం సృష్టించారు. 144 సెక్షన్‌ ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు కార్యాలయానికి మోటార్‌ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి అక్కడున్న రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు వారిస్తున్నా వారిని గెంటేసి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వైఎస్సార్‌సీపీ ప్రచార రథంతో పాటు ఇన్నోవా కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సుమారు 50 మంది యువకులు పది ని­మిషాల పాటు భయానక వాతావరణం సృష్టించారు. ఆ స­మయంలో వెంకట్రావు కుటుంబ సభ్యులందరూ కార్యా­లయంలోనే ఉన్నారు. టీడీపీ దాడితో వారు తీవ్ర భయాందో­ళన చెందారు. అక్కడ నుంచి టీడీపీ శ్రేణులు బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని మెప్మా కార్యాలయం తాళాలు పగులగొట్టి అందులోని కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. కార్యాలయంలోని రికా­ర్డులన్నింటినీ బయటకు విసిరేశారు. టీడీపీ హయాంలో ఇదే కార్యా­లయంలో అన్న క్యాంటీన్‌ నడిచేది. తాను అ­న్ని పా­ర్టీల వారితో స్నేహ భావంతో ఉంటానని, ఇలాంటి వి«­టద్వంసం తానెన్నడూ చూడలేదని తలారి వెంకట్రావు అన్నారు. » పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్ల వద్ద బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మండలంలోని మండపాక గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు ఇంటిముందు వీరు బాణసంచా కాల్చడంతో ఆ నిప్పురవ్వలు పడి ఇంట్లోని దుప్పట్లు, ఇతర సామగ్రి దగ్థమయ్యాయి. » ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. దీంతో పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో పలు­వురు టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ల రెక్కలు విరిచి ద్విచక్ర వాహనాలకు కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. రాప్తాడు నియోజ­కవర్గం రామగిరి మండలంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్‌­సీపీ నేత జయచంద్రారెడ్డి కారును పరిటాల సునీత అనుచరులు ధ్వంసం చేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా వైఎస్సార్‌సీపీ నాయకులు, సానుభూతి­పరులను ఇళ్ల వద్దకెళ్లి కవ్వించి కొందరిని గాయపరిచారు. టపాసులు పేల్చి ఇళ్లపైకి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయం ధ్వంసం..గుంటూరు ఎన్టీఆర్‌ స్టేడియం సమీపంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘మండలి’ విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్తూ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఫర్నిచర్, కంప్యూటర్‌ సామాగ్రి ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బూతులు తిడుతూ కార్యాలయంలోని మొత్తం సామగ్రి పగులగొట్టారు. » చిత్తూరు నగరంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాన్ని ధ్వంసంచేసి, పెట్రోలు పోసి నిప్పంటించారు. మార్కెట్‌ హరి అనే వ్యక్తికి చెందిన రూ.కోటి విలువైన సిగరెట్‌ స్టాకు గోదాముకు నిప్పంటించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా ఉన్న కన్నన్‌ నాయకర్, మండీ ప్రభాకర్‌రెడ్డి, ప్రసన్నకు చెందిన హోటళ్లను, బేకరీలను నేలమట్టం చేశారు. పూతలపట్టులోని పాలకూరులో వైఎస్‌ విగ్రహాన్ని కూలదోశారు. ఎగువ పాలకూరు, బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో దళితుల ఇళ్లలోకి చొరబడి వారిపై దాడులు చేయగా పలువురు గాయపడ్డారు. పూతలపట్టు నయనంపల్లెలో కిరణ్‌ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లెలో కృష్ణమూర్తి యాదవ్‌ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త జేసీబీను అపహరించి, అతని ఇంటి ప్రహరీనే కూల్చేశారు.» పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎండుగుంపాలెం బీసీ కాలనీలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు, గొడ్డళ్ళలో ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి ట్రాక్టర్‌కు కట్టి ఎన్‌ఎస్‌పి కాలువ వద్దకు ఈడ్చుకెళ్లారు. పోలీసులు ధ్వంసమైన విగ్రహా­న్ని యథాస్థానానికి చేర్చారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలకు ఫ్యాన్లు కట్టి ఈడ్చుకెళ్లారు. పోలీసుల ఆంక్షలున్నా బాణాసంచా కాల్చి భయభ్రాంతులకు గురిచేశారు. తూబాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు రోడ్ల మీద పసుపు నీళ్లు చల్లారు. » గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూల్చేశారు. గ్రామానికి చెందిన దుర్గారావు అనే నేత ట్రాక్టరుతో గుద్దించి విగ్రహాన్ని కూల­గొట్టాడు. అతని కోసం వెతుకుతున్నారు. గ్రామస్తులు అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. » గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా సోదరుడు కర్నుమా ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అద్దాలను టీడీపీ శ్రేణులు పగలగొట్టి దాడికి యత్నించారు. కౌంటింగ్‌ సందర్భంగా కర్నుమా నాగార్జున యూనివర్శిటీకి వచ్చి అనంతరం కుటుంబ సభ్యులతో కారులో గుంటూరు బయల్దేరారు. టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసు­కొచ్చి రాళ్లు, కర్రలతో కారుపై అద్దాలు పగలగొట్టి దాడికి యత్నించారు. కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. కర్నుమా కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. » పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ వైఎస్సార్‌సీపీ నాయకురాలు, గ్రామ సర్పంచ్‌ చికిలే మంగతాయారు ఇంటి సమీపంలోకి రాగానే కూటమి అభిమానులు తారాజువ్వలు వేస్తూ, మోటార్‌ సైకిళ్ల సైలెన్సర్లను తొలగించి భీకర శబ్దాలతో నానా హంగామా చేశారు. ఇదే సమయంలో పెదపేటకు చెందిన యువకులతో టీడీపీ–జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఘర్షణలకు పాల్పడ్డా­రు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. » అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దాదాపు పదిమంది గ్రామ సచివాలయానికి చేరుకుని విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించారు. కిటికీ అద్దాలను పగలగొట్టారు. కంప్యూటర్‌పై నీళ్లు పోశారు. ప్రింటర్‌ను, బాత్‌రూమ్‌ డోర్లను పగలగొట్టారు. సచివాలయంపైన ఉన్న సింథటిక్‌ ట్యాంకు పైపులను ధ్వంసం చేశారు. సుమారు రూ.50 వేల మేర నష్టపరిచారు. ఇదే గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడిచేశారు.» ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో ఓ పెట్రోలు బంకుతోపాటు దాని యజమాని ఇంటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడిచేసి రాళ్లు రువ్వారు. దీంతో ఆ యజమాని, మండల వైస్‌ ఎంపీపీ అయిన వేమూరి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. » ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఒక కూల్‌డ్రింక్‌ షాపు వద్ద వైఎస్సార్‌­సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఎన్నికల ఫలితాలపై వాగ్వి­వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కూల్‌డ్రింక్‌ సీసాలతో దాడి చేసుకున్నారు.ఈ దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ లక్కాబత్తుల సిద్ధిరాజు, లక్కాబత్తుల సురేష్, బిరుదుగడ్డ కిరణ్, అల్లాడ సురేష్, లక్కాబత్తుల జాన్‌బాబు, బిరుదుగుడ్డ కల్యాణ్, డీజే రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కవర్‌ చేస్తున్న ఒక విలేకరి సెల్‌ఫోన్‌ను లాక్కుని అతడిని గాయపరిచారు. మరోవైపు.. ఇక్కడి కూటమి కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిమిత్తం ఎస్సై సతీష్‌తో ఘర్షణకు దిగారు.» ఇదే జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి, అంబర్‌పేట, సూరప్పగూడెం, కురెళ్లగూడెం, భీమడో­లు తదితర గ్రామాల్లోనూ గొడవలు చోటుచేసు­కు­న్నా­యి. పోలసానిపల్లిలో జనసేన కార్యకర్తలు విజయో­త్సవ ర్యాలీ చేసుకుంటూ ఎంపీటీసీ అంబటి దేవీ నాగేంద్రప్రసాద్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, ఎంపీటీసీ కుమా­రుడు, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అధిక సంఖ్యలో ఉన్న జనసేన కార్యకర్తలు ఎంపీటీసీ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులపై దాడిచేశారు. వారి దుస్తులను చించివేశారు. అలాగే, అంబర్‌పేట రైతుభరోసా కేంద్రంలోకి చొరబడిన టీడీపీ కార్యకర్తలు రూ.1.50 లక్షల విలువైన కంప్యూటర్, íప్రింటర్లు, ర్యాక్‌లు, కుర్చీలను ధ్వంసం చేశారు. సిబ్బంది ఎంత వారించినా టీడీపీ కార్యకర్తలు వినలేదు.విడదల రజిని కార్యాలయం అద్దాలు ధ్వంసం..గుంటూరులో టీడీపీ శ్రేణులు ఎన్నికల విజయోత్సవంలో భాగంగా పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరి వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు నినాదాలు చేసి కార్యాలయంపై రాళ్లు విసిరారు. అక్కడున్న పోలీసు సిబ్బంది వారిని వారించినా లెక్కచేయకుండా కార్యాలయం అద్దాలను పగులగొ­ట్టారు. కార్యాలయం షట్టర్లు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసు అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను చెదర­గొట్టారు. అయినా టీడీపీ కార్యకర్తలు పోలీసులను లెక్కచేయకుండా కార్యాలయంపై రాళ్లు విసిరారు. » పల్నాడు జిల్లా కొచ్చర్ల సచివాలయంపై మంగళవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. ఇరు పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కర్రలు, గడ్డపార్లతో సచివాలయంపై దాడిచేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం లోపల ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసంచేసి సర్పంచ్‌ కుర్చీని బయటపడేసి తగల­బెట్టారు. లోపలున్న కంప్యూటర్‌ను, ఇతర సామ­గ్రిని ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం పైకెక్కి టీడీపీ జెండాను ఏర్పాటుచేశారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయంపైకి రావడంతో సచివాలయ సిబ్బంది పరుగులు తీశారు. పోలీసులు వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. » ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్సార్‌ పేరును టీడీపీ నేతలు తొలగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీడీపీకి సానుకూలంగా ఫలితాలు రావడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ వద్దకు వెళ్లి, మెయిన్‌ గేటు వద్ద ఉన్న పేరును కాళ్లతో తన్ని ఊడగొట్టడంతో పాటు, భవనం పైకెళ్లి పేరులోని వైఎస్‌ అక్షరాలను తొలగించారు. ఆ స్థానంలో ఎన్‌టీ అక్షరాలను పెట్టారు. » పల్నాడు జిల్లా వినుకొండ కారంపూడి రోడ్డులోని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణ మండపాన్ని మంగళవారం కొంతమంది అల్లరి మూకలు రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. కళ్యాణ మండపంలోని అద్దాలను పగలగొట్టడమే కాకుండా అక్కడున్న కారును కూడా కాళ్లతో తన్నుతూ సుమారు అరగంటసేపు విధ్వంసం సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలపై కల్యాణ మండపంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టి వెళ్లిపోయారు. దీంతో అక్కడ సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు.

Reasons For Ysrcp Defeat In Ap Elections
ఎదురుగాలి ఎందుకంటే?

గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించిన వైఎస్సార్‌సిపికి ఈ సారి అనూహ్యమైన ఫలితాలను చవి చూసింది. సంక్షేమం, అభివృద్ధి అన్న రెండు అంశాలతో ఎన్నికలకు వెళ్లిన వైఎస్సార్‌సిపి తాను అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ ఫ్యాన్‌కు ఎదురుగాలి వీచింది.వైఎస్సార్‌సీపీ ఓటమికి కారణాలు:వైఎస్సార్‌సిపికి వ్యతిరేకంగా మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వస్తే.. వాటికి తోడ్పాటుగా మిగతా పార్టీలు మారడంకూటమి ఇచ్చినన్ని హామీలు ఇవ్వలేకపోవడం, నెరవేర్చలేని హామీని ఇవ్వలేనని చెప్పడంల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ మీద కూటమి నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టలేకపోవడంసచివాలయాలు ఏర్పాటు చేసి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్న విమర్శను ఎదుర్కోలేకపోవడంకరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోవడంపార్టీలు, వర్గాలు అన్న తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు ఇవ్వడం, ఎన్నికల వేళ సంక్షేమంపై ఎక్కువగా ఆధారపడడంఅందరికీ ఇవ్వాలన్న తాపత్రయమే తప్ప.. వాటిని ఓటు బ్యాంకుగా మార్చుకోలేకపోవడంసామాజిక సమీకరణంలో భాగంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంమూడు రాజధానుల ఏర్పాటు విషయంలో న్యాయపరమైన పరిధులు దాటలేకపోవడం

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement