Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

సాయంత్రం 4.25 గంటలకు కాకినాడ జిల్లా  పిఠాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార  సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
ఢిల్లీ అండతో.. అడ్డుకుంటున్నారు: సీఎం జగన్‌

లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్, రిజిస్ట్రేషన్లపై ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మొన్ననే విశాఖలోని రుషికొండలో భూములు కొన్నాడు. దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్లిద్దరినీ అడుగుతున్నా. భూములు కొన్నప్పుడు మీకు ఒరిజనల్‌ రిజిస్టర్డ్‌ డీడ్స్‌ ఇచ్చారా? లేక జిరాక్స్‌ కాపీలు ఇచ్చారా? రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న 9 లక్షల మందికి మనం ఒరిజినల్‌ రిజిస్టర్డ్‌ డీడ్స్‌ ఇస్తే.. జిరాక్స్‌ కాపీలు ఇస్తున్నారని, వాళ్ల భూములను జగన్‌ కొట్టేస్తున్నాడంటూ దారుణంగా దుష్ప్రచారాలు చేస్తున్న వీళ్లంతా అసలు మనుషులేనా?– చిలకలూరిపేట, పిఠాపురం సభల్లో సీఎం జగన్‌సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: వివిధ పథకాలతో నేరుగా లబ్ధి చేకూరుస్తూ మీ బిడ్డ బటన్లు నొక్కిన డబ్బులు అవ్వా­తాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు అందకుండా చంద్రబాబు కూటమి ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి దుర్మార్గంగా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్‌ దాకా వీళ్లకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రజల గొంతు నొక్కేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ప్రజలకు మంచి చేసేందుకు మీ బిడ్డ బటన్లు నొక్కుతూనే ఉన్నాడని, ఇప్పటికి 130 సార్లు బటన్లు నొక్కాడని గుర్తు చేశారు. అలాంటి రొటీన్‌గా జరుగుతున్న కార్యక్రమాన్ని 57 నెలలకే అడ్డుకుని గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ‘రెండు నెలల క్రితం వరకు నేరుగా ఇంటివద్దకే వచ్చి అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చేవారు. ఆ పెన్షన్‌ వల్ల ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందోనని కుట్రపూరితంగా వలంటీర్లను అవ్వాతాతల ఇంటికి వెళ్లకుండా అడ్డుకుని వారి ఉసురు పోసుకుంటున్నారు. ఏ ప్రభుత్వాన్నైనా 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటిది మన ప్రభుత్వాన్ని 57 నెలలకే గొంతు పట్టుకుని పిసికే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్ము అందకుండా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి అడ్డుకుంటున్నారు. ఈ డబ్బులు ఎన్నికలు అయిపోయాక ఇస్తారట! పోలింగ్‌ ముగిసిన మర్నాడు 14వ తారీఖున ఇస్తారట! ఇది కుట్ర కాదా? అయినా ఫర్వాలేదు. నాకు కావాల్సింది నా అక్కచెల్లెమ్మల మొహాల్లో సంతోషం. వారి పిల్లల చదువులకు మంచి జరగడం నాకు కావాలి. నాకు కావాల్సింది రైతన్నల మొహాల్లో సంతోషం. నాకు కావాల్సింది ఇదే! వాళ్లు నొక్కుతున్నది మీ బిడ్డ గొంతు కాదు.. నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, పిల్లల గొంతులనే. జగన్‌ ఎలాంటివాడో నా అక్కచెల్లె­మ్మలు, అవ్వాతాతలు ఐదేళ్లుగా ఏటా చూస్తూనే ఉన్నారు. మీ బిడ్డ తప్పు చేయలేదు. మీ జగన్‌ మీ కోసం బటన్లు నొక్కాడు. ఇవి ఎన్నికల కోసం నొక్కిన బటన్లు కావు’ అని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని స్పష్టం చేశారు. పెత్తందార్లతో జరుగుతున్న ఈ యుద్ధంలో మీ జగన్‌ పేదల పక్షాల పోరాడుతున్నాడని గుర్తు చేశారు. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైందని, మీ బిడ్డ ప్రభుత్వం మళ్లీ రాగానే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళామందిర్‌ సెంటర్, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి గడపకూ 59 నెలలుగా అందిన పథకాలు, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించేందుకు ఫ్యాన్‌ గుర్తుకే రెండు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పైశాచిక ఆనందం..ఈ మధ్య అత్యంత హేయంగా జరుగుతున్న కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తోంది. ఢిల్లీ నుంచి వాళ్లకున్న రికమండేషన్లు, అధికారంతో మొన్నటి వరకూ అవ్వాతాతలకు ఇంటికొచ్చి ఇచ్చిన పెన్షన్లను దారుణంగా ఆపించారు. ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అగచాట్లు పడుతుంటే చంద్రబాబుకు, ఆయన కూటమికి ఎంత శాడిస్టిక్‌ ప్లెజర్‌ (పైశాచిక ఆనందం)? ఈ కుట్రలు ఇంకా కొనసాగిస్తూ మీ బిడ్డ 60 నెలల పాలన పూర్తి కాక ముందే 57 నెలలకే గొంతు నొక్కుతున్నారు.గీతమ్మను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తా..నాకు అక్క లాంటి వంగా గీతమ్మను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించండి. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి పిఠాపురానికి పంపిస్తానని మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తున్నాడు. మీ కోసం, మీ అభివృద్ధి కోసం పంపిస్తా. మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కను గెలిపించండి. నా పక్కనే డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా. కూటమి ప్రలోభాలకు మోసపోవద్దని మీ అందరినీ సవినయంగా కోరుతున్నా. జరుగుతున్న మంచి కొనసాగేలా మీ బిడ్డ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి.దత్తపుత్రుడికి ఎందుకు ఓటేయకూడదంటే..పిఠాపురంలో పోటీ చేస్తున్న ఈ దత్తపుత్రుడికి ఎందుకు ఓటు వేయకూడదో కూడా చెబుతా. 2014లో ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ కలసి ఉన్నప్పుడు.. గద్దెనెక్కాక బాబు హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే ఆయనకు ఆ కత్తి అందించిన వీళ్లకు భాగస్వామ్యం లేదా? ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి మేనిఫెస్టో ఇచ్చాడు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పారదర్శకంగా పథకాలను అందిస్తుంటే ఏటా రూ.70 వేల కోట్లు ఖర్చు అవుతోంది. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఏకంగా రూ.1.05 లక్షల కోట్లు ఏటా ఇస్తానని నమ్మబలుకుతున్నాడు. అది సాధ్యం కాదని ఆ కూటమికీ తెలుసు. తెలిసి తెలిసీ అదే చంద్రబాబుకు మళ్లీ కత్తి అందించి రైతన్నలను పొడవండి.. పిల్లలను పొడవండి.. అక్కచెల్లెమ్మలను పొడవండి.. అవ్వాతాతలను పొడవండంటున్నాడంటే ఈ మనిషి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి.కార్లు మార్చినట్టుగా..ఐదేళ్లకొకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ పెద్దమనిషిని అక్కచెల్లెమ్మలు ఎవరైనా నమ్ముతారా? ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మరి అదే మూడోసారీ, నా­లు­గోసారీ అంటే అది అలవాటు కాదా? ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏ అక్కచెల్లెమ్మయినా కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి తమకు సాయం చేయమని అడగగలరా? అసలు ఈ పెద్ద మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఉంటాడా? ఆ మధ్య జలుబు చేస్తే అప్పటికప్పుడు హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక, భీమవరం అయిపోయాయి. ఇప్పుడు పిఠాపురం వంతు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి.

Sakshi Editorial On TDP Political Alliance And Yellow Media
పౌర సమాజమా... పారాహుషార్‌!

అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్‌. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్‌. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్‌. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్‌ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్‌ మీటర్ల పాయిజనస్‌ గ్యాస్‌ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్‌ వెపన్స్‌ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్‌ కంట్రీస్‌ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్‌ రోగ్స్‌ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్‌ ది హెడ్‌ క్వార్టర్స్‌. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్‌కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్‌ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్‌’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్‌లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్‌ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్‌ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్‌ విజిట్‌ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ అనే నల్ల చట్టాన్ని జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్‌ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్‌పుట్‌ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్‌కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్‌ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్‌ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్‌ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్‌ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్‌ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్‌ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్‌బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్‌ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్‌ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి

BRS Leader KCR About His National Politics
ప్రధాని రేసులో ఉంటా!: కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రధానిగా పనిచేసే అవకాశం వస్తే వంద శాతం రేసులో ఉంటానని.. అవకాశం వస్తే వదులుకునేంత అమాయకుడిని కాదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలను కొనసాగిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అందరినీ సంప్రదించి.. తనకున్న రాజకీయ సంబంధాలు, శక్తి, తెలివిని రంగరించి ప్రాంతీయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ఏదో ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టిస్తామన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలిచితీరుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ 9 చోట్ల మూడో స్థానంలో ఉందని.. బీజేపీ రెండో స్థానంలో ఉన్నా బీఆర్‌ఎస్‌కు చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు. 16 రోజుల పాటు నిర్వహించిన ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ముగియడంతో శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె.కేశవరావు పార్టీని వీడటంతో ఆయన స్థానంలో రాజ్యసభ ఎంపీ కేఆర్‌.సురేశ్‌రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్‌కు లేఖ ఇస్తున్నా. జాతీయ రాజకీయాల్లో మా పార్టీ తరఫున ఆయన కీలక ప్లేయర్‌గా ఉంటారు. ఈ అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేయాలని అక్కడి నేతలు కోరుతున్నారు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అక్కడా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ పేరిట పోటీచేసి గెలుస్తాం. హైదరాబాద్‌ గొంతు కోస్తే సహించరు.. కేంద్ర పాలిత ప్రాంతం పేరిట హైదరాబాద్‌ గొంతు కోస్తే తెలంగాణ ప్రజలు సహించరు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వంటివారు కూడా దేశానికి రెండో రాజధాని కావాలని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ వంటి పిచ్చివాళ్లకు స్థానమిస్తే హైదరాబాద్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్‌ తెలంగాణ సొంతం.. ఎన్నటికీ వదులుకోబోం. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌ బీజేపీలో చేరతాడని కాంగ్రెస్‌ నేతలే అనుమానిస్తున్నారు. 26 నుంచి 33 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు రెడీగా ఉన్నామని మాతో అంటున్నారు. కారు షెడ్డుకు వెళ్లిందంటున్న రేవంత్‌రెడ్డి.. మా ధాటికి రేపు ఎక్కడికి పోతాడో చూద్దాం. పనులు, పైరవీల కోసమే కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రళయ గర్జన చూస్తారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేదు.. ప్రభుత్వంలో వందల మంది అధికారులు ఉంటారు. అందులో ఒకరైన రాధాకిషన్‌రావు ఎవరు? ఫోన్‌ ట్యాపింగ్‌కు సీఎంకు ఏం సంబంధం? గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వం ఉండదు. నిఘా విభాగం నుంచి ప్రభుత్వం కేవలం సమాచారం మాత్రమే కోరుతుంది. ట్యాపింగ్‌ పూర్తిగా పోలీసు విభాగం అంతర్గత విషయం. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ ప్రకారం.. హోంశాఖ కార్యదర్శి అనుమతితోనే ట్యాపింగ్‌ జరుగుతుంది. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు రైతు భరోసా, ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్, నాలుగు విడతల డీఏ విడుదల వంటివి ఉండగా రైతులకు రూ.40 వేల కోట్ల రుణమాఫీ సాధ్యం కాదు. ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు రేవంత్‌ చేస్తున్న ప్రయత్నం సఫలం కాదు. మేం ఎంతో ఆలోచించి ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. భాష విషయంలో రేవంత్‌ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రేవంత్‌ ఓటుకు నోటు దొంగ, బ్లాక్‌ మెయిలర్, భూ కబ్జాకోరు. ఆయన చేతకానితనంతోనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ప్యారగాన్‌ చెప్పులు లేని కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు. ఆరు నెలల పాలనలో ఆరోగ్యం, విద్యుత్, వ్యవసాయ, చేనేత తదితర రంగాల్లో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైంది. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ముంచుతుంది..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. లక్ష మంది రేవంత్‌లు వచ్చినా బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టలేరు.. కేసీఆర్‌ అంటే తెలంగాణ చరిత్ర. నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం తెచ్చా. కేసీఆర్‌ గుండెల్లో తెలంగాణ.. తెలంగాణ గుండెల్లో కేసీఆర్‌ ఉంటరు. గెలుపోటములు పక్కన పెడితే తెలంగాణ ఎమోషన్‌ కేసీఆర్‌. 65 లక్షల మంది సభ్యత్వం కలిగిన మహా సముద్రం లాంటి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టడం లక్ష మంది రేవంత్‌లు వచ్చినా సాధ్యం కాదు. కేసీఆర్‌ను గిల్లి పడేస్తం అనుకునే వాళ్లు పిచ్చివాళ్లు. మోదీ దుర్మార్గాలు పెరిగాయ్‌..ప్రధాని మోదీ దుర్మార్గాలు పెరిగిపోయాయి. ఆయన గోబెల్స్‌ మాదిరిగా అవసరాన్ని బట్టి మాట్లాడుతారు. నాలుక మడతేయడం ఆయనకు వచ్చినంతగా ఎవరికీ రాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేవుడి పేరిట ఓట్లు కొల్లగొట్టే పార్టీ బీజేపీ. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా.. అసమానతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు అందరికీ న్యాయం జరగాలి. ఎస్సీ రిజర్వేషన్లు 15% నుంచి 19 శాతానికి పెంచాలి. అల్పాదాయం ఉన్న ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మోదీ సృష్టించిన రాజకీయ కుట్ర. నేనూ, కేజ్రీవాల్‌ మోదీకి కంటిలో నలుసులా తయారయ్యాం. మోదీ కుడి భుజం బీఎల్‌ సంతో‹Ùను అరెస్టు చేసేందుకు వెళ్లినందునే.. నా కూతురు కవితను టార్గెట్‌ చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేం ఈ కుట్రలను ఎదుర్కొంటాం.

TDP Leader Chandrababu Fake Promises Of Manifesto
బాబూ.. నీ హామీల అమలు ఎలా సాధ్యం?

(సాక్షి, అమరావతి): మేనిఫెస్టో సహితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీలకు మొదటి సంవత్సరంలోనే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా అరవై ఐదువేల కోట్లు. అంటే... రూ. 1.65 లక్షల కోట్లు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు రాష్ట్ర ఆదాయం ఎంత? అన్ని లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందా అంటే? ఈ ప్రశ్నలకు ఆర్థిక నిపుణులనెవరిని సమాధానమడిగినా అలాంటి ఛాన్సే లేదని స్పష్టంగా చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం అధికారమే లక్ష్యంగా నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చేశారు. ఎందుకంటే వాటిని అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి నోటిమాటగా యధేచ్చగా ప్రజలకు మాయ హామీలు ఇచ్చేశారు. ప్రజలను మోసం చేయడం, వంచించడం ఈ వృద్ధ నేతకు వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఈ ఎన్నికల్లోనూ అదే లైను ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయన ఇచ్చి­న హామీలు, ఇతర ఖర్చులు, ఎంత వరకు అప్పు చేయవచ్చు వంటి విషయాలను పరిశీలించిన నిపుణులు చంద్రబాబు హామీలు అమలు చేయడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. ఆ వివరాలు చూస్తే... చంద్రబాబు కాపీ కొట్టి ప్రకటించిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, పింఛన్లు వంటి వివిధ పథకాలకు 2024–2025 సంవ­త్సరంలో రూ.1.65 లక్షల కోట్లు అవసరమనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇక 2029 సంవత్సరానికి అది రూ.1.76 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇక వీటితో పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు, మూలధన వ్యయం ఎలాగూ ఉండనే ఉంటుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలు, ప్రభుత్వం అప్పులపై కట్టాల్సిన వడ్డీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు చేయాల్సిన ఖర్చు, ఇతర బిల్లులు, చెల్లింపులు వంటివన్నీ కలిపి ఏడాదికి రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. 2024–2025­లో ఇందుకోసం రూ.2.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే, 2029 నాటికి అది రూ.2.85 లక్షలకు కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తంగా ఐదేళ్లలో రూ.12.23 లక్షల కోట్లు ఇందుకోసం అవసరమవుతుంది. మొత్తంగా చంద్రబాబు ప్రకటించిన పథకాలు, ప్రభుత్వ ఖర్చు కలిపి 2024–2025లో రూ.3.75 లక్షల కోట్లు అవసరమని అంచనా. 2028–29 నాటికి అది రూ.4.61 లక్షల కోట్లకు ఎగబాగనుంది. ఇంత ఖర్చును భరించే సామర్థ్యం రాష్ట్రానికి సాధ్యమయ్యే అవకాశమే లేదని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఖర్చు 3.75 లక్షల కోట్లయితే... ఆదాయం రూ.2.03 లక్షల కోట్లేప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలన్నీ కలిపి 2025లో రూ.2.03 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉంది. 2029 నాటికి ఈ ఆదాయం రూ.2.82 లక్షల కోట్లు పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటంటే ఆదాయ–వ్యయాల మధ్య తేడా గరిష్ఠంగా 10–12 శాతం వరకూ ఉన్నా పర్వాలేదు. పరిస్థితి గాడి తప్పకుండా ఉంటుంది. పన్నుల వసూళ్లలో సమర్థతను పెంచుకోవటం, వ్యయాన్ని పక్కాగా నియంత్రించుకోవటం వంటి చర్యలతో ఈ మాత్రం వ్యత్యాసాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆదాయ – వ్యయాల మధ్య తేడా మరీ ఎక్కువగా ఉంటే చేతులెత్తేయటం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు హామీలను బట్టి చూసినపుడు ప్రభుత్వ ఆదాయానికి.. పథ­కాలు, ఇతర ఖర్చులకు మధ్య వ్యత్యాసం 2024–­2025 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్లు ఉంటుంది. 2028–2029 నాటికి అది రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇంత డబ్బును సమకూర్చుకోవాలంటే అప్పులు దొరికే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, లేదా ఉద్యోగుల జీతభత్యాలను పూర్తిగా నిలిపేయటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి చేయలేని పక్షంలో పథకాలను అమలు చేయటం మానేయాలి. అంటే... అయితే మేనిఫెస్టో­ను చెత్తబుట్టలో పడేసి జనాన్ని మోసం చెయ్యాలి... లేదంటే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల వంటి తప్పనిసరి వ్యయాలను ఎగ్గొట్టాలి. ఇది అరాచకానికి దారి తీస్తుందనేది నిపుణుల మాట. ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పులు తెస్తారా?తాజా లెక్కల ప్రకారం చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పు తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది. ఈ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో 10.5 శాతాన్ని దాటేస్తాయి. అది కూడా ఆయా సంవత్సరాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తారు అని ఊహిస్తేనే. అలాకాకుండా వృద్ధి రేటు తగ్గితే పరిస్థితి మరింత అధ్వాన్నం. అసలు ఇంత అప్పు తేవడం నిజంగా సాధ్యమా అంటే కానే కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయి అప్పు చేయలేదు. కాగ్‌ లెక్కలు, ఆర్‌బీఐ అంచనాలు, రాష్ట్ర బడ్జెట్‌ పత్రాలన్నింటినీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2019–2024 మధ్య సగటున రూ.44 వేల కోట్లకు మించి అప్పులు చేయలేదు. జీఎస్‌డీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 3 శాతానికి మించి అప్పు చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ అనుమతించదు. ఆ పరిమితిని పూర్తిగా ఉపయోగించుకుని... కేంద్రం అనుమతించిన మేరకు గరిష్ఠంగా అప్పులు తెచ్చినా తొలి ఏడాదే ఇంకా రూ.1.13 లక్షల కోట్లు కావాలి. ఐదేళ్లలో రూ.5.40 లక్షల కోట్లు సమకూరిస్తేనే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదురుతుంది. ఇవికాకుండా అమరావతి నిర్మాణం ఖర్చు మరో రూ.1.09 లక్షల కోట్లు. మొత్తం కలిపి రూ.6.50 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కడుతున్న పన్నుల్ని నాలుగు రెట్లు పెంచి, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అయిన కాడికి అమ్మేస్తే కొంత మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. అంటే ప్రజలపై నాలుగు రెట్ల పన్నుల్ని చంద్రబాబు పెంచుతారా? లేకపోతే చంద్రబాబు హామీల అమలు కోసం ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అమ్మేస్తారా? ఇవేమీ సాధ్యమయ్యే అవకాశమే లేదు. అంటే చంద్రబాబు హామీలు అమలు చేయడానికి ఏమాత్రం ఛాన్సే లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. గతంలో రుణమాఫీ హామీని అమలు చేయకుండా ఎగ్గొట్టినట్టే ఈ హామీలను తుంగలో తొక్కడం తప్ప బాబుకు వేరే ఆప్షన్‌ లేదని, ఆయనను నమ్మి ఓటేస్తే జరిగేది అదేనని వారు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ సంగతులన్నీ జనానికి తెలుసు. ఎలాగంటే... బాబు ట్రాక్‌ రికార్డు అలాంటిది మరి. అందుకే అలవికాని హామీలిచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు.

Jagan Mohan Reddy Vs Chandrababu Naidu in Andhra pradesh
మీ ఓటు దేనికి?

సీఎం జగన్‌ వ్యక్తిత్వంసీఎం వైఎస్‌ జగన్‌ నిజాలే మాట్లాడతారు. అబద్ధాలు చెప్పరు. చేయగలిగిందే చెప్పడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దాన్ని నిలబెట్టు కోవడం కోసం ఎందాకైనా పోరాటం చేయడం.. జనంతో మమేకమవడం సీఎం జగన్‌ విధానం. మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. ప్రైవేటు జీవితం అంటూ సీఎం జగన్‌కు లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే విధానం. తన తండ్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ వార్త విని తాళలేక గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాం«దీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి.. 16 నెలలపాటు జైల్లో అక్రమంగా నిర్బంధించినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సీఎం జగన్‌ వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేశారు.ప్రతిపక్ష నేతగా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో 14 నెలలపాటు ప్రజల్లోనే గడిపారు. అధికారంలోకి వచ్చాక.. రోజువారీ పరిపాలన.. సమీక్షలు, ప్రజలతో మమేకమవడం.. మిగిలిన సమయం కుటుంబంతో గడపడం సీఎం దినచర్య. కుటుంబ రాజకీయాలకు సీఎం జగన్‌ వ్యతిరేకం. వీటి వల్ల అనవసరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది సీఎం జగన్‌ నిశి్చతాభిప్రాయం.చంద్రబాబు వ్యక్తిత్వంమచ్చుకైనా నిజాన్ని చెప్పకపోవడం.. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా నిజం చేయవచ్చునన్నది చంద్రబాబు విధానం. సెల్‌ ఫోన్‌ను నేనే కనిపెట్టా.. కంప్యూటర్‌ను నేనే తెచ్చా.. హైదరాబాద్‌ను నేనే కట్టా.. అంటూ బీరాలు పలకడమే అందుకు నిదర్శనం. ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడం.. ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో సహకరించిన కుటుంబ సభ్యులు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారితోపాటు ఎవరినైనా నమ్మించి నట్టేట ముంచడం చంద్రబాబు నైజం.వారసత్వ రాజకీయాలకు.. కుటుంబ రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు. సర్పంచుగా కూడా గెలవని తన కుమారుడు నారా లోకేశ్‌ను 2017లో ఏకంగా మంత్రిని చేసి.. నాలుగు కీలక శాఖలను కట్టబెట్టారు. వియ్యంకుడు బాలకృష్ణను హిందూపురం శాసనసభ స్థానం.. లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ను విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించారు.

vanga geetha speech in pithapuram public meeting
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం

పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. .. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు.

Why Is Chiranjeevi Not Campaigning For Pawan Kalyan
పిఠాపురంలో ప్రచారం.. చిరంజీవి అందుకే వెనకడుగు వేశారా?

జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎందుకని ప్రచారం చేయడం లేదు? ఆయన పిఠాపురం వస్తారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా తన తమ్ముడు మంచి వాడని చెబుతూ చిరంజీవి ఒక వీడియా క్లిపింగ్ ను విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆయన పిఠాపురం వచ్చి ఎందుకని ప్రచారం చేయడం లేదన్నది ఇపుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్న సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి నేరుగా వచ్చి ప్రచారం చేయడానికి జంకారని అంటున్నారు.2019 ఎన్నికల్లో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుండి పోటీ చేశారు. రెండు నియోజక వర్గాల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జనసేన కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. అటు పవన్ కల్యాణ్ కూడా రెండింట్లో గెలిచిన తర్వాత ఏ నియోజక వర్గానికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసి పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్ ప్రభంజనంలో పవన్ కు ఎదురు గాలి తగిలేసింది. పోటీచేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి చెందారు. దాన్ని జనసేన నేతలు అవమానంగా భావించారు. ఓటమిని చాలా కాలం పాటు పవన్ జీర్ణించుకోలేకపోయారు. చాలా పెద్ద షాకే కొట్టింది పరాజయం.తన ఓటమికి కారణాలపై పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని శ్రేయోభిలాషులు అప్పట్లోనే సలహా ఇచ్చారు. రెండు చోట్ల ఓడినా పవన్ కల్యాణ్ కొంతకాలానికే కేంద్రంలోని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత జనసేన-బిజెపిల జట్టులోకి టిడిపిని తీసుకురావడానికి బిజెపి అగ్రనేతలతో పదే పదే చర్చలు చేశారు.ఈ సందర్భంగానే ఆయన ఆ పార్టీ అగ్రనేతల నుండి తిట్లు తినాల్సి వచ్చింది కూడా. వాటన్నింటినీ భరిస్తూనే మొత్తానికి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. టిడిపి,బిజెపిలతో జట్టు కట్టడంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యి తీరాలని పవన్ పంతంగా ఉన్నారు.ఈ సారి కూడా భీమవరం నుండి పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే ఎందుకో కానీ ఆయన దాన్ని వదులుకున్నారు. తమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పిఠాపురం నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే నామినేషన్ వేశారు. పవన్ కల్యాణ్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. నియోజక వర్గంలో ఆమెకు మంచి పేరు ఉండడంతో పాటు ఇంటింటా పరిచయాలు ఉన్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కు గట్టి పోటీ ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పిఠాపురంపైనే దృష్టి సారించారు. తనకు మద్దతుగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లచేత ప్రచారం చేయించారు. అదే విధంగా జబర్దస్త్ టీం కూడా పవన్ తరపున ప్రచారం చేస్తోంది.అందరూ చేస్తున్నారు కానీ పవన్ కల్యాణ్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలే అన్నాయి. ఈ నెల 5న ప్రచారానికి వస్తారని ముందుగా అన్నారు. ఆ తర్వాత లేదు లేదు 10 తేదీన వస్తారని అన్నారు. అయితే చివరకు చిరంజీవి పిఠాపురం వచ్చి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అలాగని పూర్తిగా ప్రచారం చేయకపోతే పవన్ కల్యాణ్ ఫీల్ అవుతారు కాబట్టి పవన్ గెలిస్తే మంచి చేస్తాడంటూ ఒక వీడియోలో చిరంజీవి తన సందేశాన్ని రికార్డు చేసి విడుదల చేశారు. అదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి ఎందుకు డ్రాప్ అయ్యారన్న అంశంపై చర్చ జరుగుతోంది.విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం చిరంజీవి పిఠాపురం వచ్చి రోడ్ షో నిర్వహించి పవన్ కల్యాణ్ గెలుపు కోసం విస్తృతంగానే ప్రచారం చేయాలని ముందుగా అనుకున్నారట. అయితే ఆ తర్వాత పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన ఆరా తీస్తే వంగా గీత విజయం ఖాయమని తేలిందట. తాను నేరుగా వచ్చి ప్రచారం చేసినా పవన్ గెలిచే పరిస్థితి లేదని తేలడంతోనే ఊరికే ప్రచారం చేసి తన పరువు తీసుకోవడం ఎందుకని చిరంజీవి భావించారని అంటున్నారు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ పార్టీ కోసం తిరిగారు కాబట్టి.. పవన్ కల్యాణ్ పార్టీ కోసం తాను ప్రచారం చేయకపోతే బాగుండదని అందరూ అనడంతో ప్రచారం చేద్దామనుకున్నారట. కనీసం పవన్ పోటీ చేసే నియోజక వర్గానికే ప్రచారాన్ని పరిమితం చేయాలనుకున్నారట. తీరా పవన్‌కు విజయవకాశాలు లేవని సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి ప్లాన్ మార్చి వెనకడుగు వేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీన్ని మెగా అనుచరులు కొట్టి పారేస్తున్నారు. చిరంజీవి వీడియో క్లిపింగ్‌కే పరిమితం కావడంతో పవన్ కల్యాణ్‌లోలోన గుర్రుగా ఉన్నారని అంటున్నారు

Election Campaign Has Ended In The Telugu States
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

సాక్షి, విజయవాడ/హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.ఏపీ, తెలంగాణలో మైక్‌లు మూగబోయాయి. ఎల్లుండి(సోమవారం) పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఏపీవ్యాప్తంగా 26 జిల్లాల్లో 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ విధుల్లో 5,26,010 మంది సిబ్బంది పాల్గొంటారు. పోలింగ్‌ కోసం 1.60 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు.ఏపీలో పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 74. 70 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ నిర్వహించనున్నారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 454 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడనున్నారు.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడనున్నారు.ఏపీ: రేపు పోలింగ్ కేంద్రాలకు చేరనున్న ఈవీఎంలు26 జిల్లాల్లో 46,389 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కి ఏర్పాట్లు12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపురాష్ట్ర వ్యాప్తంగా 34,651 పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలతో వెబ్ కాస్టింగ్ కి ఏర్పాట్లుసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా74.70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్25 లోక్ సభ నియోజకవర్గాల్లో 454 మంది ఎంపీ అభ్యర్థుల పోటీ417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ2,154 మంది పురుష అభ్యర్థులు, 231 మహిళా అభ్యర్థులు పోటీఏపీలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 4 కోట్ల 14 లక్షల 1887 మంది ఓటర్లుఏపీలో మహిళా ఓటర్లే అధికంఓటు హక్కు వినియోగించుకోనున్న 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మహిళా ఓటర్లుఓటు హక్కు వినియోగించుకోనున్న 2 కోట్ల 3 లక్సల 39వేల మంది పురుష ఓటర్లుఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లుసోమవారం 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగింపురంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో 4 గంటలకు ముగియనున్న పోలింగ్ఎన్నికల విధులకు 5 లక్షల 26 వేల మంది సిబ్బందిని నియమించిన ఎన్నికల కమిషన్పోలింగ్ నాడు ఉదయం 7 గంటలలోపు మాక్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలుఅన్ని నియోజకవర్గాల్లోనూ అమలులోకి వచ్చిన 144 సెక్షన్48 గంటల పాటు మద్యం షాపులు, బార్లు మూసివేతరాజకీయ పార్టీల బల్క్‌ మెసేజ్ ల ప్రచారాన్ని నిషేధించిన ఈసీప్రచారానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వెల్లిపోవాలని పోలీసుల ఆదేశంపోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు భారీగా బందోబస్త్ ఏర్పాటు చేసిన ఈసీఏపీ పోలీస్ తో పాటు తమిళనాడు, కర్నాటక, ఏపీఎస్పీ, ప్రత్యేక దళాలు మోహరింపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన ప్రచార పర్వంరాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులురేపు రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని అనుమతిచ్చిన ఈసీ13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుసికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 45 మంది అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలు రాష్ట్రంలో మోహరింపుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు-1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు

Ksr Comments On The Difference In The Governance Of YS Jaganmohan Reddy And Chandrababu Naidu
చంద్రబాబు కొత్త రాగం.. మరో డ్రామాకు పచ్చ బ్యాచ్‌ రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి రంగం సిద్దమైంది. ఒక రకంగా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌మోహన్‌ రెడ్డికి మళ్లీ ఓటు వేయవలసిన అవసరం ఉందా? లేదా? అన్నదే కీలకమైన చర్చ. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ ఐదేళ్లు చేసిన కార్యక్రమాలు, విపక్ష నేతగా చంద్రబాబు అనుసరించిన విధానాలు, ఇద్దరి మధ్య ఉన్న వత్యాసాలు, ప్రజల పట్ల వీరికి ఉండే నిబద్దత, చెప్పిన మాటపై నిలబడే తత్వం మొదలైనవన్నీ ప్రజల ముందుకు పరీక్షకు వస్తాయి. వీటన్నిటిని ఆలోచించి ఓటర్లు ఒక నిర్ణయానికి వస్తే సముచితంగా ఉంటుంది.⇒ బహుశా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి చర్చించుకుంటున్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చర్చ జరుగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, చంద్రబాబుల మధ్య ఉన్న తేడా గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక విశ్వసనీయతకు నిలువుటద్దంగా కనిపిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అన్న పదమే తన నిఘంటువులో లేనట్లు ప్రజల ముందు నిలబడుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు అబద్దాలు చెప్పడం చాతకాదు.. చంద్రబాబుకు నిజాలు చెప్పడం చాతకాదు అంటే ఆశ్చర్యం కాదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన మనిషి అయితే చంద్రబాబు నాయుడు మానిప్యులేషన్స్, మానేజ్‌మెంట్‌ నైపుణ్యం ద్వారా ఎదిగిన వ్యక్తి.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు పేదల పట్ల అపారమైన అనురక్తి ఉందని పలుమార్లు రుజువైంది. తన పాదయాత్రలో కానీ, ముఖ్యమంత్రి అయ్యాక తన టూర్‌లలో కానీ ఆయన పేదలు, వృద్దులు, అనారోగ్యానికి గురైనవారిని దగ్గరకు తీసుకునే తీరు ఇందుకు అద్దం పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే పెత్తందార్లకు ప్రతినిధిగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత పేదలకు ఇవ్వరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ఎప్పుడూ, ఎక్కడా అనుచితంగా వ్యవహరించలేదు. వ్యాఖ్యలు చేయలేదు. పైగా వారందరిని నా.. నా.. నా.. అని పిలుచుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నించారు.⇒ నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే పవిత్ర ఆలయంలోకి వచ్చి ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. మత్స్యకారుల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వాగ్దానం ఇస్తే నిలబెట్టుకోవడానికి తాపత్రయపడతారు. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత అసలు ఆ వాగ్దానం తానెప్పుడు చేశానన్నట్లు మాట్లాడతారు. అవసరమైతే అన్ని హామీలు ఎక్కడ అమలు చేస్తామని ప్రశ్నిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తను మంచి చేశానని అనుకుంటే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలకు పిలుపు ఇస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్లను బెదిరించి ఓటు అడుగుతారు. తాను వేసిన రోడ్డు మీద నడుస్తారు.. తాను ఇచ్చిన టాయిలెట్ వాడతారు.. ఇంకొకరికి ఎలా ఓటు వేస్తారు? అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరుస్తారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఉన్న రాజధాని 29 గ్రామాలలోని తన వర్గం వాళ్లకు, తన పార్టీ వారికి ఎలా ఉపయోగపడాలా? అని ఆలోచిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిది రియల్ డెవలప్ మెంట్ విజన్ అయితే చంద్రబాబుది రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ విజన్. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముప్పై ఒక్క లక్షలమందికి ఇళ్ళ స్థలాలు, ఇరవై లక్షల ఇళ్లునిర్మించడం ద్వారా సుమారు పది లక్షల కోట్ల సంపదను పేదవారికి సృష్టిస్తే, చంద్రబాబు అమరావతిలో కొద్దివేల మందికి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా కోట్ల రూపాయల సంపద సృష్టించి, అదంతా ఏపీకోసమే అని బుకాయిస్తారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత' రాష్ట్రం కష్టాలలో ఉంది.. నేను అది చేయలేను.. ఇది చేయలేను.. నేను చాలా కష్టపడుతున్నాను.." అంటూ ఇలాంటి సానుభూతి మాటలు చెప్పలేదు. తాను చేయగలిగింది చేసుకుంటూ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. అదే చంద్రబాబు విభజిత ఏపీలో తన ఐదేళ్ల పాలనలో నిత్యం రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉంది.. తాను ఇరవైనాలుగు గంటలు శ్రమిస్తున్నాను.. ప్రజలు సహకరించాలి.. విరాళాలు ఇవ్వాలి. రాజధానికి ఇటుకలు కొనాలి.. అంటూ ఎప్పుడూ ఆయన ఏడుపుకొట్టు మాటలు మాట్లాడి ప్రజలను విసిగించేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల అభివృద్ది ద్వారా మూడు ప్రాంతాలు వికసించాలని చెబుతారు. చంద్రబాబు ఒక్క అమరావతి గ్రామాలలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడైనా రాజధానులపై తన అభిప్రాయాన్ని ఒకే రకంగా చెబుతారు. అదే చంద్రబాబు అయితే ఒక్కోచోట ఒకరకంగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కలల రాజధాని అమరావతిని రక్షించడానికే వచ్చారని చంద్రబాబు విజయవాడ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. విశాఖ, తిరుపతి ప్రాంతాలలో మాత్రం అమరావతి ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తెచ్చి దానిపైనే కట్టుబడి ఉండి ప్రజలందరికి ఇళ్ల వద్దే సేవలు అందించారు. చంద్రబాబు వలంటీర్లపైన నీచమైన విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని అంటారు. పైగా పదివేల రూపాయల వేతనం ఇస్తానని మభ్య పెట్టే యత్నం చేస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఎంత వ్యయం అవుతుందో స్పష్టంగా వివరించారు. చంద్రబాబు పొరపాటున కూడా తన హామీలకు ఎంత వ్యయం అయ్యేది చెప్పకుండా జనాన్ని మాయ చేయాలని చూస్తారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి తాను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చినదానికన్నా మూడు రెట్లు అదనంగా ఇస్తానని ప్రజలను నమ్మించాలని చూస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన 2019 మానిఫెస్టో, కొత్త మానిఫెస్టో చూపించి తాను ఏమి చేసింది వివరించుతారు. చంద్రబాబు ఎప్పుడూ 2014 నాటి మానిఫెస్టో ఊసే ఎత్తరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎవరిని దూషించరు. ఉదాహరణకు చంద్రబాబుతో కుమ్మక్కై సోనియాగాంధీ దారుణమైన అక్రమ కేసులు పెట్టించినా ఎన్నడూ ఆమెను ఒక్క మాట అనలేదు. అలాగే ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలే కోరుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అని అంటారు. చంద్రబాబు మాత్రం తాను జాతీయ నాయకుడనని భ్రమపడుతుంటారు.⇒ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక విమానాలలో తిరిగి మోదీకి పోటీగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కడతారు. కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ను గాలికి వదలివేస్తారు. మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఎలుతాడని అంటారు. విదేశాలలో సైతం మోదీ వల్ల పరువు పోయిందని చెపబుతారు. కానీ మోదీనే మళ్లీ ప్రధాని అయ్యేసరికి యుటర్న్ తీసుకుని కాళ్లావేళ్లపడి ఆయనతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు మోదీ విశ్వగురు అయ్యారని పొగుడుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను చేసిన అభివృద్దిని పూర్తి స్థాయిలో చెప్పుకోరు. ఉదాహరణకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ తయారి ప్లాంట్, బద్వేల్ లో సెంచరీ ప్లై వుడ్ ప్లాంట్, విశాఖలో అదానీ డేటా సెంటర్.. ఇలా అనేక పరిశ్రమలు వచ్చినా ఆయన రోజూ ప్రచారం చేసుకోరు. కానీ చంద్రబాబు మాత్రం అసలు పరిశ్రమలే రాలేదని, అభివృద్ది లేదని డబాయించి ప్రచారం చేస్తుంటారు.⇒ ఆయన టైమ్‌లో వచ్చిన ఒక్క కియా ప్లాంట్‌నే ఎల్లవేళలా ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు టైమ్ లో ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే యత్నం జరగలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక పెద్ద ఆస్పత్రి, నిపుణుల నియామకం, పరిశోధనతో పాటు 700 కోట్లతో శుద్ది చేసిన సురక్షిత నీరు సరఫరా స్కీమ్ అమలు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తానిచ్చిన వాగ్దానాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు ఇస్తే, చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. అందులో కూడా అత్యధికం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెట్టిన స్కీములనే కొనసాగించి అదనంగా మరింత ఇస్తానని చెబుతారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేదల విద్యకు, ప్రభుత్వ స్కూళ్ల బాగుచేతకు ప్రాధాన్యం ఇస్తుంటే, చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెబుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దితే, చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. విద్య, వైద్యం ప్రైవేటు రంగానికి అప్పగించి వారికి లాభాలు సమకూర్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో వచ్చినన్ని స్కీములు, కొత్త వ్యవస్థలు మరే ముఖ్యమంత్రి తీసుకు రాలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం వంటివి తీసుకువస్తే చంద్రబాబు ఎన్నడూ ఆ దిశగా యోచించలేదు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనకు అంత విజన్ ఉంది.. ఇంత విజన్ ఉంది అని గొప్పలు చెప్పుకోకపోయినా, అనేక వ్యవస్థలను సృష్టించి తన విజన్ ఏమిటో ప్రజలకు తెలియచేశారు. చంద్రబాబు తనకు 2020 విజన్, 2037 విజన్ అంటూ ఆయా చోట్ల కాపీ కొట్టిన విషయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ తాను చాలా గొప్పవాడినని భ్రమపడుతుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను తీసుకు వచ్చిన స్కీములన్నిటిని ఆయనే చెప్పలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో, అంత సంఖ్యలో పథకాలు తెచ్చి అమలు చేసి తన సమర్థత ఏమిటో ఏపీ ప్రజలకు చూపించారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, తదితర స్కీముల ప్రస్తావన వస్తే ఠక్కున వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తుకు వస్తారు. కానీ చంద్రబాబు తనది ఫలానా స్కీము అని చెప్పుకునే పరిస్థితి లేదు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లపాటు ప్రశాంతంగా పాలన సాగితే, చంద్రబాబు కక్షపూరిత పాలన అని, విధ్వంసం అని, వినాశనం అని దుర్మార్గ ప్రచారం చేస్తుంటారు. తన టైమ్‌లో అమరావతి పేరుతో ముప్పై ఐదు వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని విధ్వంసం చేస్తే మాత్రం అది గొప్ప విషయం అని ఊదర గొడుతుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒకరకంగా స్వయం ప్రకాశం అయితే చంద్రబాబు ఎవరో ఒకరిపై ఆధారపడి పదవిలోకి వస్తుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కష్టాలు, నష్టాలకు ఓర్చి, పెద్ద, పెద్ద రాజకీయ తిమింగలాలను ఎదుర్కుని నిలబడితే, చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, కూటమి ఎత్తులు, జిత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుంటారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక కష్ట జీవి అయితే, చంద్రబాబు కష్టపడుతున్నట్లు నటించే జీవి అని చెప్పాలి. అబద్దాలు ఆడడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇష్టపడరు. చంద్రబాబు అలవోకగా అబద్దాలు ఆడగలరు. అసత్యాలను సృష్టించగలరు. అందుకు ఉదాహరణే లాండ్ టైటిలింగ్ చట్టంపై లేనిపోని ఒక మోసపూరిత కల్పిత వదంతులను సృష్టించి జనంలోకి వదిలారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ప్రత్యర్థులను కూడా దూషించరు. చంద్రబాబు ప్రతి చోట తన ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను నోటికి వచ్చినట్లు దూషిస్తుంటారు. అదే టైమ్‌లో తనను ఎవరైనా ఏదైనా అంటే ప్రజల కోసం పడతానంటూ కొత్త డ్రామా ఆడుతారు. రాజకీయ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరితో నైనా కలవడానికి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానకి సిగ్గుపడరు. అంతకు ముందు బండబూతులు తిట్టుకున్నా, ఏ మాత్రం ఫీల్ కారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యవస్థలు, లేదా వ్యక్తుల మేనేజ్‌మెంట్ తెలియని వ్యక్తి అయితే, చంద్రబాబు అచ్చంగా వ్యవస్థలు, మీడియాను మేనేజ్ చేసే నిపుణుడుగా పేరొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల మనిషి.. చంద్రబాబు మీడియాపై ఆధారపడే మనిషి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను ఓడించలేమని భయపడే చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీలతో పొత్తుపెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం ధైర్యంగా తన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని జనంతోనే తన పొత్తు అని ధైర్యంగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మధ్య వయస్కుడైతే, చంద్రబాబు 75 ఏళ్ల వృద్దుడు. ప్రజలు తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all