Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ap: Bjp Distanced From The Alliance Manifesto
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్‌, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ   టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.​మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Sakshi Guest Column On Chandrababu Politics
‘ఆల్‌ ఫ్రీ బాబు’ పునరాగమనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన చంద్రబాబు  2009లోనైనా గెలవాలని లెక్కకు మిక్కిలి హామీలనిచ్చారు. అయినా ఓడారు. 2014లో బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ల పొత్తుతోపాటు, ఎడాపెడా హామీలనిచ్చి గెలిచారు కానీ వాటిని అమలు చేయటంలో విఫలమయ్యారు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడారు. అందుకే ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! ఈసారి మళ్లీ ఎలాగైనా గెలవాలని బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా హామీలను గుప్పిస్తు న్నారు. అలా కాదంటే, దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంతవుతుందో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి.చరిత్ర మొదటిసారి విషాదంగా, రెండవసారి ప్రహసనంగా పునరావృతమవుతుందంటాడు కార్ల్‌ మార్క్స్‌. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల హామీలను చూస్తే ఆ మాట గుర్తుకు వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన ఆయన 2009లోనైనా గెలవాలని లెక్కకు అందనన్ని హామీలనిచ్చారు. అయినా ఓడారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఓడిన ఆయన 2024లోనైనా గెలిచి తీరాలనుకుంటూ తిరిగి ఉచితాల హామీలను కుప్పలుతెప్పలుగా ఇస్తున్నారు. ఆయనలోని ఈ లక్షణాన్ని గమనించినందుకే 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆయనకు ‘ఆల్‌ ఫ్రీ బాబు’ అని పేరు పెట్టారు.2009 ఎన్నికల ప్రచారం నాటి ఒక జ్ఞాపకం ప్రస్తుత సందర్భంలో మళ్ళీమళ్ళీ గుర్తుకు వస్తున్నది. అప్పుడు చంద్రబాబు ప్రతి సభలో తన ఉచిత హామీలను ఒక దానిని మించి మరొకటి ప్రకటిస్తుండే వారు. దానిపై రాజశేఖరరెడ్డి కూడా ప్రతి సభలో, ‘‘చంద్రబాబు ఆల్‌ ఫ్రీ బాబు అయిపోయారు. అన్నీ ఫ్రీగా ఇస్తారట. నమ్ముతారా?’’ అని ప్రజలను నేరుగా అడిగేవారు. అందుకు జవాబుగా ప్రజల నుంచి ‘‘నమ్మం, నమ్మం’’ అనే కేకలు పెద్ద ఎత్తున వినిపించేవి. చివరకు చంద్రబాబు అన్నన్ని హామీలిచ్చి కూడా రెండవసారి ఓడిపోయారు. ఇందులో చెప్పుకోవలసిన విశేషం మరొకటి ఉంది. తనవైపు నుంచి తాను కూడా 2004లో కొన్ని హామీలిచ్చిన రాజశేఖరరెడ్డి, 2009లో కొత్తగా దాదాపు ఏమీ ఇవ్వలేదు. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, మరికొన్ని హామీలను బడ్జెట్‌ భరించలేదని చెప్పటం అందుకు కారణ మని అప్పుడు విన్నాము. దానితో రాజశేఖర రెడ్డికి చంద్రబాబు హామీలు అలవికానివనీ, కేవలం ఎన్నికలలో గెలిచేందుకు ఉచితాల వర్షం కురిపిస్తున్నారనీ అర్థమైంది. అప్పుడు, తన ప్రచారానికి కొత్త హామీలను కాకుండా 2004–2009 మధ్య కాలపు తన సమర్థవంతమైన పాలనను, దానిపట్ల ప్రజలకు కలిగిన విశ్వాసాన్ని ఆధారం చేసుకోదలిచారు. ఈ ఆలోచన, అందుకు అనుగుణమైన ప్రచారం పనిచేశాయి. ఫలితం తెలిసిందే.రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిందేమిటో చూడండి. 2014లో బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ల పొత్తుతో గెలిచిన చంద్రబాబు, అటువంటి పొత్తు ఉండి కూడా, ఏ పొత్తూ లేని జగన్‌మోహన్‌ రెడ్డిని ఓడించేందుకు ఎడాపెడా హామీలు ఇవ్వవలసి వచ్చింది. కానీ వాటిని అమలు చేయటంలో విఫలమై, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడి పోయారు. తన పాలన ప్రజలను మెప్పించి ఉంటే, ఈ రెండవసారి పొత్తులు ఉన్నా లేకున్నా గెలవాల్సింది. కానీ అది జరగకపోగా, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. మరొక విధంగా చెప్పాలంటే, అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! తెలుగునాట ఎన్నికల చరిత్రలో ఇటువంటి అప్రతిష్ఠ సంపాదించిన నాయకుడు మరెవ్వరూ లేరు. తన 2004 నాటి ఎన్నికల ఓటమిని గమనిస్తే ఈ మాట మరింత బాగా అర్థమ వుతుంది. ఎన్నికలకు కొద్దిముందు తిరుపతి వద్ద ఆయనపైన నక్స లైట్‌ దాడి జరిగింది. ఆ స్థాయి గల ఒక నాయకునిపై అంత తీవ్రమైన దాడి జరగటం అదే మొదలు, అదే ఆఖరు. అటువంటపుడు తన పట్ల చాలా సానుభూతి రావలసింది! అయినప్పటికీ అందువల్లగానీ, తన పాలనా ప్రతిష్ఠవల్ల గానీ గెలవగలననే నమ్మకం ఏర్పడని చంద్రబాబు, ముఖ్యంగా రైతుల కోసం, గ్రామీణుల కోసం డజన్ల కొద్దీ వరాలు ప్రకటించారు. అయినా గెలవలేదు.ఎన్టీఆర్‌ ఉదంతాన్ని అట్లుంచినా, చంద్రబాబుకు సామాన్య ప్రజల సంక్షేమం కోరే నాయకునిగా ఎన్నడూ పేరు లేదు. అధికారానికి వచ్చిన కొత్తనుంచే అప్పటి ఆర్థిక సంస్కరణలను ఎంతో ఉత్సాహంగా భుజాన వేసుకున్న ఆయన తనను తాను సీఈఓగా చెప్పుకొన్నారు. సంస్కరణలకు దేశంలో అందరికీ మించిన పతాకధారి అయ్యారు. ఆ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ను సైతం మించిపోయి దేశ విదేశాల లోనూ పేరు సంపాదించి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లకు ప్రీతి పాత్రు డయ్యారు. కానీ ఆ క్రమంలో వ్యాపార వర్గాలకు ఎంత దగ్గరయ్యారో సామాన్య ప్రజలకు అంత దూరమయ్యారు. లోగడ నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు, తర్వాత ఎన్టీఆర్‌ అమలుపరచిన సంక్షేమ పథకాలను తగ్గించి వేశారు లేదా రద్దుపరచారు. అందుకే ప్రజల విశ్వాసం కోల్పోయి 2004లో పరాజయం పాలవగా, ఆ పరిణామం ప్రజలను సంతోషపెట్టింది. కనీసం ఆర్థిక సంస్కరణలకీ, ఇండియా వంటి వెనుకబడిన సమాజంలో ప్రజా సంక్షేమానికీ మధ్య సమతులనాన్ని పాటించాలనే విజ్ఞత అయినా తనకు లేకపోయింది. అందువల్లనే ఈ 21వ శతాబ్దంలో జరిగిన నాలుగు ఎన్నికలలో (2004, 2009, 2014, 2019) మూడింట ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అయిదవ ఎన్నికను ఎదుర్కొంటున్నారు. తన ఆర్థిక సంస్కరణలు, పరిపాలన గొప్పగా ఉండి ఉంటే ప్రతిసారీ గెలవవలసింది! అది కూడా పొత్తుల కోసం చూడకుండా.ప్రతిసారీ తన ప్రత్యర్థులను మించి ఎడాపెడా హామీలు ఇస్తున్నారంటేనే చంద్రబాబు బలహీనత అర్థమవుతున్నది. మరొక వైపు 2014లో వలె గెలిచినపుడు అయినా సదరు హామీలను ఎంత మాత్రం అమలుపరచక విఫలం కావటాన్ని బట్టి అవి బడ్జెట్‌తో, ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేనివని తెలిసిపోతున్నది. అవి అలవిమాలినవని ముందుగా గ్రహించలేనివాడు కాదాయన. అయినప్పటికీ ఆ పని చేశా రంటే, 2014లో, 2019లో చేసి, ఇపుడు 2024 కోసం తిరిగి చేస్తున్నా రంటే, ఆయన ఉద్దేశమే ప్రజలను మోసగించటమనుకోవాలి. ఏమి చేసైనా సరే అధికారం సంపాదించాలన్నమాట!అదే పని చేసి తలమీదకు తెచ్చుకున్న రెండు ప్రభుత్వాల ఉదాహరణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పొరుగునే ఉన్నాయి. ఒకటి కర్ణాటక, రెండు తెలంగాణ. రెండు చోట్ల కూడా కాంగ్రెస్‌ పార్టీ మితి మీరిన హామీలనిచ్చింది. అవి బడ్జెట్‌ శక్తికి మించిపోగలవని ఆర్థిక వేత్తలు ముందుగానే హెచ్చరించారు. అయినా పెడచెవిని పెట్టిన కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపుచ్చి అధికారాన్నయితే సంపాదించింది గానీ, హామీలను అమలుపరచలేక ఏడాది తిరగకముందే తలకిందులవు తున్నది. ప్రజలలో నిరసనలు రెండు రాష్ట్రాలలోనూ మొదలయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఈసారి ఇచ్చిన హామీలకు ఏటా సుమారు లక్షన్నర కోట్లు అవసరం కాగలవన్నది ఒక అంచనా. అది నిజం కాదని తెలుగుదేశం అధ్యక్షుడు చెప్పదలచుకుంటే, తన హామీలలో దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంత అవుతుందో, రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చినపుడు పరిస్థితి ఏమిటో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి. అది నిజాయితీగల పద్ధతి అవుతుంది. ప్రజలు విజ్ఞులని స్వయంగా చంద్ర బాబు తరచూ గంభీరంగా ప్రకటిస్తుంటారు. ఒక నాయకుని గత పాలనలో ప్రజలకు కలిగే అనుభవం కూడా విజ్ఞతలోకి వస్తుంది.అందువల్ల, చంద్రబాబు గురించి ప్రజల గత కాలపు నిరాశలను, అప నమ్మకాలను మరచిపోయేటట్లు చేయాలంటే, ఆయన ఈ వివరాలు వెంటనే ప్రకటించాలి. లేనట్లయితే, ఆయనకు 2009లో రాజశేఖర రెడ్డి పెట్టిన ‘ఆల్‌ ఫ్రీ బాబు’ పేరును ప్రజలు తిరిగి గుర్తు చేసుకోగలరు.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

Lucknow Super Giants win over Mumbai Indians
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం (ఏప్రిల్‌ 30) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు అదరగొట్టారు.డూ ఆర్‌ డై లా జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు ముంబైకి చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు కూడా రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. దాంతో పాయింట్ల జాబితాలో లక్నో మూడో స్ధానానికి చేరింది. ఇక ప్లే ఆఫ్‌ అవకాశాలు ముంబై జట్టు దాదాపు కోల్పోయింది.స్కోర్లు: ముంబై 144/7, 145/6(19.2 ఓవర్లు)ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్

Congress Workers Protest At Amethi Congress Office
ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన

ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కంచుకోట అమేథీ లోక్‌సభ అభ్యర్ధి ఎవరనేది స్పష్టత రాలేదు. అయితే అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూసి విసిగిపోయిన కార్యకర్తలు అమేథీ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యలయం బయట అభ్యర్ధిని ప్రకటించాలని ప్లకార్డ్‌లతో నిరసన చేపట్టారు.  అమేథీ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ నేత,   కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్మృతి ఇరానీ 4,68,514 ఓట్లు సాధించగా, రాహుల్ గాంధీ 4,13,394 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఈ సారి ఎన్నికల్లో మరోసారి తాను గెలుస్తామంటూ స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ఆమె తన నామినేషన్‌ దాఖలు చేశారు.  అయితే కాంగ్రెస్ మాత్రం ఆ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేయలేదు. అమోథీ, వయనాడ్‌ ఈ రెండు స్థానాల్లో ఒకచోటే గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, ఇద్దరూ పోటీ చేస్తారని, అమేఠీ నుంచి రాహుల్‌, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని ఇలా రకరకాలుగా కాంగ్రెస్‌ వర్గాల నుంచి లీకులు కొనసాగుతున్నాయి.మరో రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతుండగా.. సహనం కోల్పోయిన కార్యకర్తలు తమ లోక్‌సభ స్థానానికి అభ్యర్ధిని ప్రకటించాలని ఆందోళన చేపట్టడం ఆసక్తికరంగా మారింది. 

Sakshi Editorial On Prajwal Revanna Deve Gowda
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం

దేశమంతా నివ్వెరపోయిన వివాదం ఇది. ఘన కుటుంబ వారసత్వం... దేశంలోని అత్యున్నత ప్రజా ప్రాతినిధ్య వేదికైన పార్లమెంట్‌లో సభ్యత్వం... ఇవేవీ మనిషిలోని మకిలినీ, మృగాన్నీ మార్చలేక పోయిన విషాదం ఇది. మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడూ, ఆయన తదనంతరం కర్ణాటకలో హసన్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన యువకుడూ అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ నిస్సహాయులైన పలువురు స్త్రీలతో సాగించిన బలవంతపు లైంగిక చర్యల వ్యవహారం సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది. ఏప్రిల్‌ 26 నాటి లోక్‌సభ పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఆ వికృత వీడియోలు వందల కొద్దీ బయటకు రావడం సొంత కుటుంబపార్టీ జేడీ(ఎస్‌)ను సైతం ఆత్మరక్షణలో పడేసింది. అన్నిటికీ మించి సామాన్యులకు రక్షకులమంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే చివరకు భక్షకులుగా తయారవుతున్న రాజకీయ విలువల పతనానికి ఈ వ్యవహారం మరో నగ్నసాక్ష్యంగా నిలిచింది. 2019 నుంచి 2022 మధ్య పలుమార్లు తనను ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగికంగా బలవంతం చేశారంటూ బాధితురాలు ఒకరు ఆరోపించారు. పనివారి నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగినుల దాకా పలువురితో ఈ మాజీ ప్రధాని మనుమడు ఇంట్లో, ఆఫీసులో ఇలానే వ్యవహరించారట. వాటిని స్వయంగా రికార్డ్‌ చేసి, బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వచ్చారట. దాదాపు 3 వేల వీడియోలతో కూడిన ఆ వికృత చర్యల పెన్‌డ్రైవ్‌ ఇప్పుడు బయటపడింది. నిజానికి, ప్రజ్వల్‌ అకృత్య వీడియోల కథ కొత్తదేమీ కాదు. ఆయన వీడియోలు అనేకం కొన్నేళ్ళ క్రితమే బయటకొచ్చాయి. వాటి ప్రచురణ, ప్రసారాల్ని అడ్డుకొనేందుకు ఈ 33 ఏళ్ళ యువనేత అప్పట్లోనే కోర్టుకెళ్ళారు. మీడియా చేతులు కట్టేస్తూ హైకోర్టు నుంచి నిషేధపుటుత్తర్వులు తెచ్చుకున్నారు. తీరా ఇప్పుడు ఓ బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో మరోసారి తేనె తుట్టె కదిలింది. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొంది. ఈ మురికి చేష్టల కేసుపై ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుచేసింది. ప్రజ్వల్‌ వివాదంలో రాజకీయాలున్నాయనే మాట వినిపిస్తున్నది అందుకే!వీడియోలు అయిదేళ్ళ పాతవనీ, బాధిత మహిళలకు న్యాయం చేసే ఉద్దేశమే నిజంగా ఉంటే, ఈ పార్లమెంట్‌ సభ్యుడి లైంగిక దుష్ప్రవర్తనపై సాక్ష్యాలు చాలాకాలంగా ఉన్నా కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కార్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రస్తుత ఎన్నికల సమయంలోనే ఈ అస్త్రం ఎందుకు బయటకు తీసింది? ఇవీ బీజేపీ ప్రశ్నలు. బాధితురాలు కేసు పెట్టడం, వీడియోల వివాదాన్ని మీడియా బట్టబయలు చేయడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నది అధికార కాంగ్రెస్‌ జవాబు. ఆరోపణల పర్వమెలా ఉన్నా, నిందితుడు ప్రజ్వల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జెడీ(ఎస్‌), అలాగే దానితో పొత్తుపెట్టుకున్న బీజేపీలు నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పలేదు. బీజేపీ అగ్రనేత – సాక్షాత్తూ కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా సైతం ఈ వివాదాస్పద వీడియోలను ఖండిస్తూ, నారీశక్తినే తాము బలపరుస్తున్నామని మంగళవారం వివరణనివ్వాల్సి వచ్చింది. ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణ విడిగా ఉంటారనీ, తమ కుటుంబంతో సంబంధం లేదనీ నిందితుడి బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి అనాల్సి వచ్చింది. ఈ సెక్స్‌ వీడియోల వివాదం ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా చూడాలనే తాపత్రయం తెలుస్తూనే ఉంది. చివరకు, ‘సిట్‌’ దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించడం అనివార్యమైంది. ప్రజ్వల్‌ రేవణ్ణ కేసు ఏదో నూటికో, కోటికో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. రాజకీయ బలిమిని చూసుకొని కన్నూమిన్నూ కానని కొందరు... బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడుతున్న కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ బడాబాబులు అధికారాన్నీ, హోదానూ అడ్డుపెట్టుకొని ఈ కేసుల నుంచి ఒంటి మీద దుస్తులు నలగకుండా బయటకు వచ్చేస్తున్నారు. మహిళా రెజ్లర్లతో లైంగికంగా అనుచిత రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కేసు అంతర్జాతీయంగానూ వార్తల్లో నిలిచినా, ఇప్పటి దాకా అతీగతీ లేదు. బాధితులకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. సందీప్‌ సింగ్, ఖజన్‌ సింగ్‌ లాంటి పలువురు నేతల కేసుల కథ కూడా అంతే. గమ్మత్తేమిటంటే, గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్వల్‌ హైకోర్ట్‌ ‘గ్యాగ్‌’ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని, దర్జాగా గడిపేశాడు. సిగ్గుమాలిన నేరచర్యలు యథేచ్ఛగా కొనసాగించాడు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టడంతో కష్టాలు తప్పలేదు. పోలింగైన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఉడాయించాడు.  ప్రజ్వల్‌ వ్యవహారశైలి, అతని వీడియోల పెన్‌డ్రైవ్‌పై స్థానిక బీజేపీ నేత ఒకరు గత డిసెంబర్‌లోనే తన పార్టీని అప్రమత్తం చేశారు. జేడీ(ఎస్‌)తో పొత్తునూ, హసన్‌లో ప్రజ్వల్‌ అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించారు. అన్నీ తెలిసినా బీజేపీ ముందుకెళ్ళి పొత్తు కొనసాగించడం, ప్రజ్వల్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినాయకత్వం స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరం. నారీశక్తికి వందనమంటూ కబుర్లు చెప్పి, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తంటాలు పడే పార్టీలు, ప్రతినిధులు ఆడ వారికి ఇస్తున్న అసలైన గౌరవం అంతంత మాత్రమే. పితృస్వామ్య భావజాలంతో స్త్రీని భోగ వస్తువుగా చూసే సంస్కృతి నుంచి ఇవాళ్టికీ మన సమాజం, నేతలు బయటపడనే లేదన్న చేదు నిజం పదే పదే రుజువవుతోంది. చివరకు తాజా లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం సైతం 15 శాతం లోపలే అన్నది మన మహిళా సాధికారత మాటల్లోని డొల్లతనానికి నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అధికారం మాటేమో కానీ, ముందుగా వారిని సుఖభోగ యంత్రాలుగా భావించడం మాని, మనుషులుగా గుర్తించాలి. ప్రజ్వల్‌ సహా కళంకిత నేతల్ని కఠినంగా శిక్షించడం ఆ క్రమంలో తొలి అడుగు.  

Dk Shivakumar Asks Amit sha Why Bjp Is In Alliance With Jds
‘‘జేడీఎస్‌తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్‌ ప్రశ్న

బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు. సెక్స్‌ స్కాండల్‌ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్‌తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్‌ షా చెప్పాలి’అని డీకే డిమాండ్‌ చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్‌ కార్తిక్‌ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు.

Perni Nani Comments On Tdp And Janasena Manifesto
దొంగ హామీల ‘చంద్రబాబు’.. బీజేపీకి అర్థమైపోయింది: పేర్ని నాని

సాక్షి, మచిలిపట్నం: చంద్రబాబు, పవన్‌ చెప్పే మాటలు అమలయ్యేవి కావని బీజేపీకి అర్థమైపోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘అరచేతిలో వైకుంఠం చూపించే మాటలని కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడు. కూటమి మేనిఫెస్టోలో కనిపించింది మూడు కాదు.. రెండు ఫొటోలే. కూటమి సర్కస్‌ మొదలైంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారు?’’ అని  పేర్ని నాని ప్రశ్నించారు.‘‘2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు.. ఇప్పుడెందుకు కలిశారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయి. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్‌ నెరవేర్చారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే:⇒బాబూ...నీలో నిజాయితీ ఉంటే 2014 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశావో చెప్పు⇒జగన్‌ మేనిఫెస్టో విడుదల చేసిన తీరు చూడండి. 2019లో నా మేనిఫెస్టో ఇదిగో.. దీనిలో 99 శాతం నేను అమలు చేశానని ధైర్యంగా చెప్పారు.⇒రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ..ఎన్ని ఇబ్బందులున్నా ఏటా రూ.71 వేల కోట్లు నేను పేదల కోసం ఖర్చు పెట్టానని చెప్పారు.⇒రెండు గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం చెప్పిన చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ అదేమీ చెప్పలేకపోయాడు. ⇒చంద్రబాబునాయుడు నిజంగా నిజాయితీపరుడైతే 2014లో మూడు పార్టీలు కలిసి సంతకం పెట్టి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమేమి అమలు చేశాడో చెప్పాల్సింది. ⇒ఇళ్లు లేని ప్రతి పేదవానికీ 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాం..ఎవరికన్నా ఇచ్చాడా? ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు? ⇒ఇంట్లో ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తాను అన్నాడు. ఎంత మందికి చేశారు? ⇒డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తీసుకున్న రూ.14వేల కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తాం అన్నారు. చేశారా? రైతులకు రూ.85 వేల కోట్ల అప్పులను తీర్చి బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా తెప్పిస్తానన్నారు. ఎంత మందికి చేశారు?⇒పాత మేనిఫెస్టో చూపించి ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడారా?⇒అదే ముగ్గురం మేం మళ్లీ వస్తున్నాం...ఇన్ని హామీలిచ్చాం..ఇన్ని నెరవేర్చాం..మళ్లీ హామీలు ఇస్తున్నాం..అని చెప్పే సత్తా లేకపోయింది⇒ఇదే మోసగాళ్లు ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా మనం చూశాం⇒ఇప్పుడొచ్చి నేను పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఉద్దరిస్తానంటున్నాడు. 2014–19 మధ్యలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఎవరు? ⇒పంచాయతీల్లో సర్పంచ్‌లు, పాలకవర్గం ఉండగా..అధికారమంతా జన్మభూమి కమిటీలకు ఇచ్చి ఏ పథకం కావాలన్నా వారు టిక్‌ పెడితేనే కాని ఇవ్వకుండా ఆ పంచాయతీలను సర్వనాశనం చేసింది ఎవరు?మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు?⇒నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే బీజేపీతో కలిశాను అని చంద్రబాబు చాలా గర్వంగా చెప్పాడు. ⇒ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి నువ్వేం ఇచ్చావ్‌..? ⇒ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్‌ ఇచ్చావా? విభజన హామీల గురించి ఏమైనా రాశావా? ⇒కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఏమైనా రాశావా? విశాఖ స్టీల్స్‌ను అమ్మేయకుండా నిలబెడతాం అని ఏమైనా రాశారా? ⇒మరి మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు? ⇒కేవలం అధికారం కోసమే మీరు ముగ్గురు జట్టు కట్టారు. ⇒ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీ మేనిఫెస్టోలో ఏముంది? ⇒2019లో మీరంతా తిట్టుకున్నారు కదా.? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు కదా!⇒మీకు మీరే ఒకర్ని ఒకరు దొంగలు అన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు?⇒అదేమంటే జనం కోసమే మేం ముగ్గురం కలిశాం అంటారు. మీరిచ్చిన మేనిఫెస్టోలో జనం కోసం ఏముంది? ⇒జగన్‌ అమ్మ ఒడి రూ.15వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.20వేలిస్తానంటాడు. ⇒జగన్‌ మహిళలకు చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా పెంచి ఇస్తానంటాడు. ⇒జగన్‌ మత్స్యకారులకు రూ.10 వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.15వేలు ఇస్తానంటాడు.⇒ ఇదే హామీలను 2014లో కూడా ఇచ్చారు కదా? అవేమయ్యాయి? ⇒ ఈ మేనిఫెస్టోలో 90 శాతం జగన్‌ గారి మేనిఫెస్టోను కాపీ కొట్టారు. 10 శాతం కర్నాటకలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కాపీ కొట్టారు.⇒జగన్‌  ఆదాయం గురించి చెప్పిన విధంగా మీకు చెప్పే దమ్ముందా? ⇒ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత..నేను ఖర్చు పెట్టింది ఎంత అని స్పష్టంగా జగన్‌  చెప్పారు. ⇒ ఇన్ని కష్టాలు పడి జగన్‌ గారే రూ.71 వేల కోట్లు ఏటా ఖర్చు చేశారు. ⇒ మీ మేనిఫెస్టో ప్రకారం ఏటా రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాలి. ⇒ 2014లో మూడు సెంట్లు స్థలం ఇస్తానని ఇవ్వకుండా..ఇప్పుడు రెండు సెంట్లు అంటున్నాడు. ⇒ జగన్‌ గారు 31 లక్షల మందికి స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్‌ను గుర్తుపెట్టుకుంటారో అని రెండు సెంట్లు ఇస్తానంటున్నారు. ⇒ పాత మూడు సెంట్లు సంగతి ఏంటి? అది కూడా కలిపి ఐదు సెంట్లు ఇస్తావా? ⇒ పాత మూడు సెంట్లు బాకీ ఉన్నావు కదా? డ్వ్రాక్రా అక్క చెల్లెమ్మలకు రూ.14వేల కోట్లు బాకీ ఉన్నావు కదా? ⇒ నీ మూలంగా పచ్చగా ఉన్న డ్వాక్రా సంఘాలు నాశనం అయ్యాయి కదా?సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రమేమన్నా అక్షయపాత్రా?⇒సరే హామీలిచ్చారు. ఈ హామీలకు ఎంత ఖర్చు అవుతుందని ఖర్చుల వివరాలు కూడా చెప్పాలి కదా? ⇒రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంత ఉంది? నువ్విచ్చిన హామీలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావ్‌? దొంగనోట్లు ముద్రిస్తావా? ⇒అప్పు తీసుకురాను అంటున్నాడు. మరి అప్పు తేకుండా రాబడి ఎంత?⇒ ఈ రోజుకీ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్‌ ఉద్యోగుల పెన్షన్‌ కలిపి ఏటా రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతోంది.⇒రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పుల ఇన్‌స్టాల్‌మెంట్లు, వడ్డీలు అన్నీ కలిపి ఏటా రూ.55 వేలు కట్టాలి.⇒నీకు నిజాయితీ ఉంటే ఎంత ఆదాయం వస్తుంది..ఎలా ఖర్చు చేస్తావు అనేది చెప్పాల్సింది. ⇒అదేమంటే నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఆ సంపదలో నుంచి పథకాలు అమలు చేస్తాడట. ⇒సంపద సృష్టించాలంటే అదేమన్నా అక్షయపాత్రా? లంకెబిందెలా? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ⇒ ఈ పథకాలన్నీ అమలు చేయడానికి నువ్వు డబ్బెక్కడి నుంచి తెస్తావో ప్రజలకు చెప్పాలి కదా? ⇒ 2014లో ఎలాగైతే పచ్చి దగా, మోసం చేశావో..మళ్లీ ఈ మేనిఫెస్టోను అదే దగాతో విడుదల చేశావు.ఎన్డీయేకి 400 సీట్లు దేనికీ..? ఎవరి పౌరసత్వాలు తీసేయబోతున్నారు?:⇒ఎన్డీయేకి 400 సీట్లు కావాలట. దేనికోసం? ఎంత మందిని కాల్చుకు తినడానికి? ⇒ మైనార్టీలను ఈ దేశంలో లేకుండా తరిమేస్తారా? అత్యధిక మెజార్టీ దేనికి మీకు? ⇒ అత్యధిక మెజార్టీ ఇవ్వడం వల్ల మీరు ఏమేం చేయబోతున్నారు? ⇒ ఎవరివైనా పౌరసత్వాలు, ఓట్లు తీసేయబోతున్నారా? ఏం దుడుకు చర్యలు చేయడానికి 400 సీట్లు అడుగుతున్నారు? ⇒ మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ⇒ నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు జన్మలో ఒక్కసారి కూడా జరగలేదు.⇒ ఎంత సేపు మోసం, దగా. అవసరం ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించడం..అవసరం తీరాక తగలబెట్టేయడం. ⇒ మనిషి అన్నాక వంద మాటలు చెప్తే కనీసం 90 మాటలన్నా అమలు చేయాలి కదా? ⇒ మనిషి అన్నాక కనీసం విశ్వసనీయత ఉండాలి కదా? ⇒ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, బీజేపీ లాంటి వల్లే కదా..దేశంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకుల విలువ పోతున్నది? ⇒ అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా చెప్తారు అనే భావన ప్రజల్లో ఉన్నది మీలాంటి వాళ్ల వల్లనే.⇒ జగన్‌ పథకాలు అమలు చేయడానికి నువ్వెందుకు బాబూ?:⇒ మీ మేనిఫెస్టో అన్నీ జగన్‌ గారి పథకాలే కదా? జగన్‌ గారి పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా? జగనే ఉన్నాడుగా..!⇒ మొన్నటి వరకూ వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తున్నారు..మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు తలుపులు కొడుతున్నారు అన్నారు. ⇒ వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తాం అన్న వాళ్లు ఇప్పుడు వాళ్లను కొనసాగిస్తాం..పదివేలు గౌరవ వేతనం ఇస్తాం అంటున్నారు. ⇒ మీకు అధికారం ఇస్తే వాలంటీర్‌ వ్యవస్థను ఏం చేస్తారో జనానికి తెలియదా? ⇒ ఈ రోజు చంద్రబాబుకు కొత్తగా ముస్లింలు, మైనార్టీలపై ప్రేమ వచ్చేసింది. ⇒ నీ ఐదేళ్ల పరిపాలనలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు.⇒ అధికారంలో ఉంటే రాజ్యాధికారంలో మైనార్టీలకు వాటా ఇవ్వవు. ⇒ ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలకు సంక్షేమం చేసేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు.⇒ 2014 మేనిఫెస్టోలో రజకులు, మత్స్యకారులను ఎస్సీలుగా, బోయలను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా చేస్తానన్నాడు. ఎవరినన్నా చేశాడా? ⇒ ఎస్సీ వర్గీకరణ  చేస్తానంటూ మాల, మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.⇒ 1999 నుంచి ఢిల్లీలో చక్రం తిప్పాను అంటావు..ఎస్సీల వర్గీకరణ చేశావా? ⇒ మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ఎస్సీల వర్గీకరణ చేస్తానంటున్నాడు.⇒ మొన్నటి వరకూ రజకులకు ఇస్త్రీ పెట్టె ఇస్తానన్నాడు..ఇప్పుడు కరెంట్‌ ఇస్త్రీ పెట్టె ఇస్తాడట.⇒ మొన్నటి వరకూ వడ్డెరలకు డ్రిల్లింగ్‌ మిషన్‌ ఇస్తానన్నాడు. ఇప్పుడు కరెంట్‌ డ్రిల్లింగ్‌ మిషన్‌ ఇస్తాడట. ⇒ చేనేతలకు మరమగ్గాలు ఇస్తాడట. మరి యాదవులకు కూడా కరెంట్‌ గొర్రెలను ఇస్తావా?⇒ ఎంత సేపూ వెనుకబడిన వర్గాలు చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా కులవృత్తులు చేసుకుంటూనే ఉండాలా? ⇒అసలు ఈ వెనుకబడిన వర్గాలకు చదువు ఎందుకు చెప్పించవు? ⇒ఇంగ్లీషులో చదువు చెప్పించి మీ జీవితాలు బాగుచేస్తానని చెప్పాలి కదా? ⇒ నాయీ బ్రాహ్మణులకు అంతకు ముందు కత్తెర్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు ట్రిమ్మర్లు ఇస్తాడట. ⇒వాళ్లకు నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించి దమ్ముగా పెద్దింటి పిల్లలతో పోటీ పడేటట్లు చేయాలి కదా?⇒ఎందుకు ఒక్క రోజన్నా జగన్‌ గారిలా ఆలోచించలేకపోతున్నావ్‌..?నీలో నిజాయితీ ఉంటే నీ దగా మేనిఫెస్టోకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు:⇒బుర్రకథ బ్యాచ్‌లా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, బీజేపీ తయారయ్యాయి. ⇒ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటారు. ⇒ చంద్రబాబును నేను చాలెంజ్‌ చేస్తున్నా. నిజంగా నువ్వు నిజాయితీ గల రాజకీయ నాయకుడివైతే నా సవాల్‌ను స్వీకరించు.⇒ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? నువ్వు చెప్పిన ఈ దగా మేనిఫెస్టోకు ఖర్చు ఎంతవుతుందో చెప్పాలి. ⇒ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పే నిజాయితీ నీలో ఉందా?⇒అందుకే నువ్వు పింఛన్‌ 4వేలు ఇస్తానన్నా..జగన్‌ 3,500 ఇస్తానంటే జనం జగన్‌వైపే ఉన్నారు. ⇒ 4వేలు చెప్పినా ఇచ్చేది లేదని వాళ్లకి స్పష్టంగా తెలుసు.⇒ జగనంటే ఐదు పదుల నడుస్తున్న నమ్మకం. ⇒ ఈ బుర్రకథ బ్యాచ్‌ అంటే ఏడున్నర పదుల తిరుగాడే అపనమ్మకం. ⇒ మనకు వయసు ఎంత వచ్చిందనేది కాదు..ఒక్క రోజన్నా నిజాయితీగా బతికామా అన్నదే చూడాలి..⇒ దమ్ముగా జగన్‌ గారిలా దీనికి ఎంత ఖర్చు అవుతుందో నిజాయితీ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా. ⇒పేదల్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారానే పోతుందనేది జగన్‌ గారు గట్టిగా నమ్ముతారు.⇒ అందుకే ఆయన చదువు మీద దృష్టి పెట్టి నాణ్యమైన చదువును అందిస్తున్నారు.⇒ అందుకే ఇప్పటి వరకూ విద్యపై జగన్‌ గారు రూ.73వేల కోట్లు ఖర్చు చేశారు.⇒ నిజాయితీగా గత ఐదేళ్లలో నేనేం చేశానో మళ్లీ అదే చేస్తాను అని జగన్‌ చెప్తున్నాడు. దానికి ఎంత గుండె ధైర్యం కావాలి? ⇒ మోసం చేయడానికి ధైర్యం అవసరం లేదు. ఏ వెదవైనా మోసం చేయగలడు.⇒ అమ్మ ఒడి గతంలో కంటే నేను రెండు వేలు పెంచగలను అని చెప్తున్నాడు. చెప్తే నిజాయితీగా అమలు చేయాలి కదా?మోసం చేయడం కంటే చచ్చిపోవడం మేలన్నారు జగన్‌..!:⇒ పింఛన్‌ రూ.3,500 ఒకే సారి చెప్పు అంటే లేదంటే లేదన్నాడు జగన్‌.⇒ దమ్ముగా నేను రూ.3,500 వేలే ఇవ్వగలను. అది కూడా రెండు విడుతల్లో పెంచుతాను అని ఖచ్చితంగా చెప్పాడు.⇒ మోసం చేసే మాటలు చెప్పడం కంటే చచ్చిపోవడం మేలన్నాడు. అలాంటి మోసపు మాటలు నేను చెప్పను అన్నాడు.⇒  అలా చెస్తే ప్రజలు నమ్మకం పెంచుకుంటారు. జగన్‌ చెప్తే చేస్తాడని ఆశలు పెంచుకుంటారు. అలా మోసం చేయలేను అన్నాడు.⇒  ఈ రాష్ట్రంలో 80 శాతం కుటుంబాలకు మేలు జరిగేలా నేను పరిపాలన చేశానని జగన్‌ చెప్తున్నారు. ⇒ మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని కూడా దమ్ముగా చెప్తున్న నాయకుడు వైఎస్‌ జగన్‌. ⇒ చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా? 2014–19లో తానే పరిపాలన చేశాడో అదే పరిపాలన తెస్తానని చెప్పే ధైర్యం, దమ్ము ఉందా? ⇒ 2014–19 మధ్య ప్రజలు మీకు అధికారం ఇస్తే మేం దిక్కుమాలిన పరిపాలన చేశాం అని మీ నోటితో మీరే సాక్ష్యం చెప్తున్నారు.⇒ 2014లో కోటి పేద, మద్యతరగతి కుటుంబాలున్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు..లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.⇒ ఎంత మందికి ఇచ్చారు..కోటి ఉద్యోగాలు ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అయినా ఇచ్చాడా? ⇒ నీ కొడుకు లోకేశ్‌కు ఉద్యోగం ఇచ్చుకున్నావు తప్ప ఎవరికి ఇచ్చావ్‌? ⇒ మళ్లీ ఇప్పుడు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాను..లేదంటే 3వేల నిరుద్యోగ భృతి అంటున్నాడు.⇒ అతని మేనిఫెస్టో అంతా పాపాల పుట్ట.. అసత్యాల బొంత.  

Allu Arjun Pushpa 2 First Single Release Date and Time Revealed
పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్.. రిలీజ్‌ టైమ్ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ను ప్రకటించారు మేకర్స్‌.మే 1వ తేదీన ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్‌ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్‌ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.  S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024

Supreme Court Shock To Enforcement directorate in liquor case
కేజ్రీవాల్‌ అరెస్టు: ఈడీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి తొలిసారి షాక్‌ తగిలింది. కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను ఆదేశించింది. లిక్కర్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం అక్రమమని కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్‌30) విచారించింది. అంతకుముందు కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి  వాదనలు వినిపించారు. లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ కమ్యూనికేషన్స్‌ ఇంఛార్జ్‌ విజయ్‌నాయర్‌ను ఈడీ 2022లో అరెస్టు చేసిందని, కేజ్రీవాల్‌ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు.ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనేదానిపై క్లారిటీ లేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని చెప్పారు. అయితే ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్‌ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి మొదట్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని, తర్వాతే మాట మార్చారని వాదించారు.    

Team India T20 World Cup Squad Announced
టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ‍ప్రకటన.. స్టార్‌ ఆటగాళ్లకు దక్కని చోటు

కరీబియన్‌ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్‌ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్‌, అర్ష్‌దీప్‌ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్‌పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న  రింకూ సింగ్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపియ్యాడు.  శుభ్‌మన్‌ గిల్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ కూడా ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎం​పియ్యారు.టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రాట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement