Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Yellow Gang Plans Attacks On Votes counting day
అంతకు మించి అరాచకం!

సాక్షి, అమరావతి: ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చ ముఠాలు ఈ కుట్రలకు పదును పెడుతుండటం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. పోలింగ్‌ సంద­ర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్ప­డిన టీడీపీ రౌడీ మూకలు ఓట్ల లెక్కింపు రోజు మరింత బరి తెగించేందుకు పథకం రూపొందించి­నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటివరకు పోలీ­సులు అరెస్ట్‌ చేసిన వారితోపాటు అదుపులోకి తీసు­కున్న వారిలో 75% మంది టీడీపీకి చెందిన­వారే కావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలకు అద్దంపడుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అలజడులు రేకెత్తించడం, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టించేందుకు భారీ కుట్రలకు తెర తీశాయి. పచ్చ ముఠాలు, అల్లరి మూకలు విసురుతున్న సవాల్‌ను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్‌ సందర్భంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కార్డన్‌ – సెర్చ్‌ ఆపరేషన్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు శాఖసోదాలు నిర్వహిస్తోంది. నేర చరితులను అదుపులోకి తీసుకుంటోంది. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలను, రికార్డులు లేని వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది. బదిలీలతో అల్లరి మూకల అరాచకం..రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకలు యథేచ్చగా విధ్వంస కాండకు తెగబడ్డాయి. చంద్రబాబు, పురందేశ్వరిఈసీపై ఒత్తిడి తెచ్చి పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పన్నాగాన్ని అమలు చేశారు. ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులు, రాడ్లతో విరుచుకుపడటంతోపాటు బాంబు దాడులకు కూడా తెగబడి బీభత్సం సృష్టించాయి.గూండాగిరీ అంతా పచ్చముఠాదేపోలింగ్‌కు ముందు, అనంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినవారిని గుర్తించి పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఎన్నికల ముందు నమోదైన కేసులతో ప్రమేయం ఉన్న 1,522 మందిని గుర్తించి కొందరిని అరెస్ట్‌ చేసింది. మిగిలిన వారికి 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. వీరితో దాదాపు 1,300 మంది టీడీపీ వర్గీయులే కావడం గమనార్హం. ఇక పోలింగ్‌ రోజు దాడులు, ఘర్షణల కేసుల్లో ప్రమేయం ఉన్న 2,790 మందిని గుర్తించగా కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చారు. పోలింగ్‌ రోజుల అరాచకాలకు తెగబడ్డ వారిలో దాదాపు 2,400 మంది టీడీపీకి చెందిన వారే కావడం ఆ పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 85 మందిపై హిస్టరీ షీట్లను తెరవగా వీరిలో 58 మంది టీడీపీ వర్గీయులే ఉన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించగా మరో ఇద్దరిని జిల్లాల నుంచి బహిష్కరించారు. పోలీసుశాఖ గత మూడు రోజులుగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్‌ – సెర్చ్‌ ఆపరేషన్ల ద్వారా విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎటువంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేసింది. 482 లీటర్ల సారాయి, 3,332 లీటర్ల అక్రమ మద్యం, 436 లీటర్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలకు తెగబడే ప్రమాదం ఉన్నందున పటిష్ట బందోబస్తు కల్పించారు. 350 స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలకు కేంద్ర బలగాలు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు, సివిల్‌ పోలీసులు 24/7 మూడంచెల భద్రతతో పహరా కాస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు బాడీ వార్న్‌ కెమెరాలను సమకూర్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద వెయ్యికి పైగా అధునాతన ఫేస్‌ రికగ్నైజేషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్‌), ఎస్పీ/ పోలీస్‌ కమిషనర్లు పాసులు జారీ చేసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు వచ్చిన అధికారులు, సిబ్బంది వివరాలను నమోదు చేస్తున్నారు. వీడియోగ్రఫీ ద్వారానే లోపలికి అనుమతిస్తున్నారు. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను అనుసంధానిస్తూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పటిష్ట నిఘా కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల చుట్టూ ఫ్లడ్‌ లైట్లను అమర్చారు. స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రదేశానికి 2 కి.మీ. పరిధిని రెడ్‌ జోన్‌గా ప్రకటించి డ్రోన్లు, బెల్లూను ఎగురవేయడాన్ని నిషేధించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రాలకు సురక్షితంగా తరలించే ప్రక్రియను ఖరారు చేశారు.అమలులో నిషేధాజ్ఞలుస్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలున్న నగరాలు, పట్టణాల్లో ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ వరకూ పోలీసు శాఖ నిషేధాజ్ఞలను విధించింది. 30 పోలీస్‌ యాక్ట్, సెక్షన్‌ 144 అమలులో ఉంటాయని ప్రకటించింది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కర్రలు, కత్తులు, రాడ్లు, ఇతర ఆయుధాలతో సంచరించకూడదని హెచ్చరించింది. పెట్రోల్‌ బంకుల్లో విడిగా పెట్రోల్, డీజిల్‌ విక్రయించకూడదని ఆదేశించింది. అసత్య వార్తలు, ఫేక్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయకూడదని పేర్కొంది.ప్రజలు సహకరించాలి: డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాఅసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. సంయమనం పాటించాలి. చట్టవ్యతిరేక, అసాంఘిక శక్తుల కదలికల గురించి టోల్‌ ఫ్రీ నంబర్లు 100, 112లకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమివ్వాలి.కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టంఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఈసీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. రాష్ట్రంలో 33 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. లెక్కింపు త్వరగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ప్రతిపాదించారు. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత 15 రోజుల వరకు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగనున్నాయి.

Rain Forecast for next 3 days In Andhra Pradesh
దారి మళ్లనున్న తుపాను!

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను దారిమళ్లి, రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లనుంది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులనుబట్టి అది బంగ్లాదేశ్‌ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పనుంది. ఈనెల 22న (బుధవారం) నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 24 నాటికి వాయుగుండంగా, ఆపై తుపానుగాను బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. తొలుత వాయుగుండం వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుపానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన ఉంటుందని పేర్కొ­న్నాయి. అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి అదే దిశలో బంగ్లాదేశ్‌ వైపు వెళ్తుంది. దీని ఫలితంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తీరానికి మధ్య బంగాళాఖాతం సుమారు వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంటే రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే వాయుగుండం/తుపాను బంగ్లాదేశ్‌ వైపు మళ్లుతుండడం వల్ల దాని ప్రభావం ఏపీపై ఉండదు. అదే మధ్య బంగాళాఖాతంలో కాకుండా వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉంటే రాష్ట్రంలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మళ్లీ కొన్నాళ్లు అధిక ఉష్ణోగ్రతలు..రాష్ట్రంలో వారం రోజులుగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వడగాడ్పులు కూడా తగ్గాయి. తాజా అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను గాలిలో తేమను బంగ్లాదేశ్‌ వైపు లాక్కునిపోతుంది. దీనివల్ల మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు 3 – 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మూడు రోజులు తేలికపాటి వానలుప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Telangana Govt appointed IAS Officers as VCs for 10 universities
ఐఏఎస్‌లే ఇన్‌చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్‌ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్‌ చాన్స్‌లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూ­నివర్సిటీకి ఒక్కో ఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పద­వీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీ­లు ఇన్‌చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సెర్చ్‌ కమిటీలు వేసినా.. వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్‌ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్‌ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. భారీగా పైరవీలు షురూ.. వైస్‌ చాన్స్‌లర్‌ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్‌లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు. రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లా­కు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్‌ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్‌ అయిన ప్రొఫెసర్‌ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

KKR Big win over Sunrisers Hyderabad in Qualifier1
కోల్‌కతాకే ‘ఫైనల్‌’ సత్తా

ఈ సీజన్‌లో 7 సార్లు ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నాలుగుసార్లు 200 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసింది. ఎనిమిదోసారి మాత్రం ‘సన్‌’ బృందం రైజింగ్‌ కాలేదు. కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ పూర్తి ఓవర్లు ఆడకుండానే 159 పరుగులకే కుప్పకూలింది. రెండో క్వాలిఫయర్‌ ఉందన్న ధీమానో లేదంటే ఓడినా పోయేదేం లేదన్న అలసత్వమో గానీ హైదరాబాద్‌ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సులువుగా ఫైనల్‌ దారి చూపారు. ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడిన కోల్‌కతా ముందుగా బంతితో సన్‌రైజర్స్‌ను కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో మెరిపించి 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించేసి దర్జాగా నాలుగోసారి ఐపీఎల్‌ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. అహ్మదాబాద్‌: ‘ప్లే ఆఫ్స్‌’ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఇంకో అవకాశం కోసం ఎదురుచూడకుండా ఐపీఎల్‌ 17వ సీజన్‌లో నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్‌ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. లీగ్‌ దశలో భీకరమైన ఫామ్‌ కనబరిచిన సన్‌రైజర్స్‌ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడింది. ఫైనల్‌ బెర్త్‌ కోసం ఆ జట్టు రెండో క్వాలిఫయర్‌ కోసం నిరీక్షించనుంది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్‌ త్రిపాఠి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, హెన్రిచ్‌ క్లాసెన్‌ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అనంతరం కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (24 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (28 బంతుల్లో 51 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సన్‌రైజర్స్‌ బౌలర్ల భరతం పట్టి మూడో వికెట్‌కు కేవలం 44 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. గతంలో కోల్‌కతా జట్టు 2012, 2014లలో టైటిల్‌ సాధించి, 2021లో రన్నరప్‌గా నిలిచింది. ఆది నుంచే కష్టాల్లో... అసలైన మ్యాచ్‌లో స్టార్క్‌ బంతితో నిప్పులు చెరిగాడు. రెండో బంతికే ట్రవిస్‌ హెడ్‌ (0)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అభిషేక్‌ శర్మ (3)ను కూడా సింగిల్‌ డిజిట్‌కే వైభవ్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి (9), షహబాజ్‌ (0)లను స్టార్క్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. దాంతో సన్‌రైజర్స్‌ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది.మెల్లిగా ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్న సమయంలో 8, 9, 10 ఓవర్లు సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌కు ఊరటనిచ్చాయి. హర్షిత్‌ వేసిన 8వ ఓవర్లో రాహుల్‌ త్రిపాఠి సిక్సర్‌తో 12 పరుగులొచ్చాయి. నరైన్‌ తొమ్మిదో ఓవర్లో త్రిపాఠి బౌండరీ బాదితే... క్లాసెన్‌ 6, 4 కొట్టడంతో 18 పరుగుల్ని రాబట్టుకుంది. రసెల్‌ పదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్‌ కొట్టడంతో మరో 12 పరుగులు రావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ 92/4 స్కోరు చేసింది. వరుణ్‌ దెబ్బతో.... ఇంకేం ఓవర్‌కు 9.2 రన్‌రేట్‌తో గాడిలో పడుతోందనుకుంటున్న తరుణంలో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి దెబ్బకొట్టాడు. అతను వేసిన 11వ ఓవర్లో త్రిపాఠి బౌండరీతో జట్టు స్కోరు 100కు చేరింది. కానీ ఆఖరి బంతికి క్లాసెన్‌ అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కాసేపటికే 5 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, సన్విర్‌ (0), సమద్‌ (16), భువనేశ్వర్‌ (0) ఇలా నాలుగు వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్‌ 126/9 స్కోరు వద్ద ఆలౌట్‌కు సిద్ధమైపోయింది. ఈ దశలో కెపె్టన్‌ కమిన్స్‌ (24 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. అదరగొట్టిన ‘అయ్యర్‌’లు బౌలింగ్‌లోనూ హైదరాబాద్‌ తేలిపోవడం, ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో నైట్‌రైడర్స్‌కు లక్ష్యఛేదన మరింత సులువైంది. ఓపెనర్లు గుర్బాజ్‌ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్‌ నరైన్‌ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. 67 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క వికెట్టు పడలేదు. వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.4 ఓవర్లలోనే కోల్‌కతా స్కోరు వందకు చేరింది. లక్ష్యంవైపు చకచకా పరుగులు తీసింది. వెంకటేశ్‌ 28 బంతుల్లో, శ్రేయస్‌ 23 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వెంకటేశ్, శ్రేయస్‌ ధాటికి కోల్‌కతా 38 బంతులు మిగిలుండగానే విజయతీరానికి చేరింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) స్టార్క్‌ 0; అభిõÙక్‌ శర్మ (సి) రసెల్‌ (బి) వైభవ్‌ 3; త్రిపాఠి (రనౌట్‌) 55; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) గుర్బాజ్‌ (బి) స్టార్క్‌ 9; షహబాజ్‌ (బి) స్టార్క్‌ 0; క్లాసెన్‌ (సి) రింకూ సింగ్‌ (బి) వరుణ్‌ 32; సమద్‌ (సి) శ్రేయస్‌ (బి) హర్షిత్‌ 16; సన్వీర్‌ (బి) నరైన్‌ 0; కమిన్స్‌ (సి) గుర్బాజ్‌ (బి) రసెల్‌ 30; భువనేశ్వర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్‌ 0; విజయకాంత్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 159. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–39, 4–39, 5–101, 6–121, 7–121, 8–125, 9–126, 10–159. బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–34–3, వైభవ్‌ 2–0–17–1, హర్షిత్‌ 4–0–27–1, నరైన్‌ 4–0–40–1, రసెల్‌ 1.3–0–15–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–26–2. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) విజయకాంత్‌ (బి) నటరాజన్‌ 23; నరైన్‌ (సి) విజయకాంత్‌ (బి) కమిన్స్‌ 21; వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 51; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 58; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (13.4 ఓవర్లలో 2 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–44, 2–67. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–0–28–0, కమిన్స్‌ 3–0–38–1, నటరాజన్‌ 3–0–22–1, విజయకాంత్‌ 2–0–22–0, హెడ్‌ 1.4–0–32–0, నితీశ్‌ రెడ్డి 1–0–13–0.

Minister Kakani Govardhan Reddy Challenges To Somireddy
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి

నెల్లూరు: బెంగళూరు రేవ్‌ పార్టీ అంశానికి సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పచ్చమంద’కు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వాతలు పెట్టారు. తనకు సంబంధాలు ఉన్నా, తనకు సంబంధించిన వారు ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చన్నారు కాకాణి. ఎవరో అనామకుడు తన కారు స్టిక్కర్‌ను జిరాక్స్‌ తీసి వాడుకుంటే అందులో తాను ఉన్నానంటూ పచ్చ మంద రాద్దాంతం చేస్తుందని కాకాణి ధ్వజమెత్తారు.‘నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా?’‘బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?, నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా. ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది. ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి. బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ? , రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది.బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు.రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది.కుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరాను.రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్’ అంటూ మండిపడ్డారు.‘రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి. నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు. యూత్ మినిస్టర్‌గా ఉండి క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది. నా పాస్ పోర్ట్ నెల్లూరులో ఉంది. కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని కాకాణి తెలిపారు.

Botsa Satyanarayana Slams Prashant Kishor Comments On Ap Election Results
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్‌

సాక్షి, విజయవాడ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీ లపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్‌ కిషోర్‌ కమర్షియల్‌ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు.వైఎస్సార్‌సీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తోందని అన్నారు మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ అయినా,ఐప్యాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్సార్‌సీపీ శాశ్వతమని తెలిపారు. కో ఆర్డినేషన్ కోసం ఐప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని, నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని అన్నారు. ఐప్యాక్ చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవని అన్నారు. ఐప్యాక్ ఓ జాబితా ఇస్తుందని,అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందని స్పష్టం చేశారు.‘ఎన్నికలు పూర్తయ్యాయి... భవితవ్యం బ్యాలట్ బాక్సులలో ఉన్నాయి. మేం గెలుస్తామని.. జూన్ 9 న ప్రమాణ స్వీకారం అని చెప్పాం. ఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాం. ప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారు. రాష్ట్ర విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నో‌కీలక మార్పులు తెచ్చాం. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన‌ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంవిద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారు. మాపై బురద జల్లుతున్నారు. విద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచన. మా విధానాలు నచ్షే పెద్ద ఎత్తున‌మాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాం. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదు.ప్రదాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. వాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?. చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలి. చంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు లోకేష్‌ విదేశాలికు వెళ్లారు. రాష్ట్ర ప్రజలని సంయమనం పాటించాలని కోరుతున్నా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండిభయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?రాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమే. ఎందుకు హర్రీ అండ్ వర్రీ. చంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకు వెళ్తే తప్పేంటి?. ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారు. భయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?. సీఎం జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి? వైఎస్ జగన్‌ అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి? ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదు.తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేదుమాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నా. మేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినాా చెప్పారా?. తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేకపోయారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని సీఎం జగన్ మాత్రమే అడిగారు సీఎం రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారు. నా తప్పులని దిద్దుకుంటానని అదికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదా?చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదుదేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాం. మా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగింది. గ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణం, వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాం. ప్రజలికు కావాల్సిన విధానాలని, సంస్కరణలనే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌కు మళ్లీ పట్టం కట్టారని మేం భావిస్తున్నాం.’ అని బొ త్స పేర్కొన్నారు.

విష్ణు మంచు, ముఖేష్‌ కుమార్, మోహన్‌బాబు, ప్రభుదేవా
ఆనందం.. ఉద్వేగం...

30న హైదరాబాద్‌లో ‘కన్నప్ప’ టీజర్‌... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్‌ రోల్‌లో ముఖేష్‌ కుమార్‌ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాన్స్‌ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్‌ టీజర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్‌బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్‌ను కాన్స్‌లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా ‘కన్నప్ప’ టీజర్‌ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్‌ ‘కన్నప్ప’ టీజర్‌ను ప్రదర్శించనున్నాం. జూన్‌ 13న ఈ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు విష్ణు మంచు.కాన్స్‌లో తొలిసారి... కాన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్‌ డి ఓర్‌’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోని ‘పామ్‌ డి ఓర్‌’ అవార్డుకు మెరిల్‌ స్ట్రీప్, జార్జ్‌ లూకాస్‌లను ఎంపిక చేశారు. కాగా కాన్స్‌ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్‌లోని యానిమేటెడ్‌ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్‌ డి ఓర్‌ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్‌ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్‌ నటి మెరిల్‌ స్ట్రీప్‌ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్‌ దర్శక–నిర్మాత జార్జ్‌ లూకాస్‌ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్‌... కెవిన్‌ కాస్ట్నర్‌ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్‌: యాన్‌ అమెరికన్‌ సాగ’. అమెరికన్‌ సివిల్‌ వార్‌కు ముందు ఉన్న పరిస్థితులు, వార్‌ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్‌ ‘హరిజన్‌: యాన్‌ అమెరికన్‌ సాగ’ను కాన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కడంతో కెవిన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్‌ కష్టపడుతున్నారని హాలీవుడ్‌ టాక్‌. ట్రంప్‌ బయోపిక్‌... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్‌ ట్రంప్‌ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్‌’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా, స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. సెబాస్టియన్‌ స్టాన్‌ ఈ చిత్రంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పాత్రపోషించారు. ఫిల్మ్‌ మేకర్స్‌ పొలిటికల్‌ మూవీస్‌ మరిన్ని చేయాలని కాన్స్‌ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్‌ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్‌ ఆన్‌ ట్రయిల్‌’. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్‌ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్‌లో భారతీయం... కాన్స్‌లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్‌ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్‌ వెళ్లారు. ఇక కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్‌ డి ఓర్‌ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్‌ వీ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్‌’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్‌ మేకర్‌ పాయల్‌ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. అలాగే ‘అన్‌ సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ ఫిల్మ్‌మేకర్‌ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్‌’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్‌ బిష్ణోయ్‌లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్‌ చేరుకున్నారు.

Indian stock market reaches 5 lakh crore dollars landmark ahead of election results
బీఎస్‌ఈ కంపెనీల సరికొత్త రికార్డ్‌ 5 లక్షల కోట్ల డాలర్లు

దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్‌ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ తొలిసారి 5 ట్రిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!ముంబై: బీఎస్‌ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్‌ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రికార్డ్‌ నెలకొల్పింది. వెరసి బీఎస్‌ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్‌ఈ విలువ 4 ట్రిలియన్‌ డాలర్లను తాకింది.ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లో యూఎస్‌ఏ, చైనా, జపాన్, హాంకాంగ్‌ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్‌ 2.3 శాతం బలపడగా.. మిడ్‌ క్యాప్‌ 16.3 శాతం, స్మాల్‌ క్యాప్‌ 11.5 శాతం ఎగశాయి. జర్నీ తీరిలా 2007 మే నెలలో ట్రిలియన్‌ డాలర్ల విలువను సాధించిన బీఎస్‌ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్‌ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్‌ డాలర్లతో యూఎస్‌ఏ టాప్‌ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్‌ తదుపరి నిలుస్తున్నాయి.మార్కెట్‌ విలువ మదింపులో మార్పులు లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్‌ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్వల్ప నష్టాలతో సరి.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్‌ సెషన్‌లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్‌ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్‌ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది.

Elon Musk Tweet About Microsoft New Recall Feature
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ సరికొత్త కంప్యూటర్లను ఆవిష్కరించింది. ఈ శక్తివంతమైన ఏఐ టూల్ గురించి సత్య నాదెళ్ల వివరిస్తున్న వీడియో బిలియనీర్ ఇలాన్ మస్క్ దృష్టిని ఆకర్శించింది.వీడియోలో సత్య నాదెళ్ల.. రీకాల్ ఫీచర్ అనే కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు చూసే, మీ కంప్యూటర్‌లో ప్రదర్శించే ప్రతి వివరాలను రికార్డ్ చేస్తుంది. డివైస్ నుంచి మీ మొత్తం హిస్టరీని సర్చ్ చేయడానికి, మళ్ళీ తిరిగి పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీగా పనిచేస్తుంది. మీ కంప్యూటర్‌లో మీరు చేసే ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి స్క్రీన్‌షాట్‌లను నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇది కేవలం కీవర్డ్ సర్చ్ కాదు, డాక్యుమెంట్ కాదు. గతంలోని క్షణాలను రీక్రియేట్ చేస్తుందని అన్నారు.ఈ వీడియో ఎక్స్ (ట్విటర్)లో భారీగా వైరల్ అయ్యింది. 24.3 మిలియన్లకంటే ఎక్కువ వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఇందులో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు.ఈ వీడియోపైన మస్క్ స్పందిస్తూ.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'బ్లాక్ మిర్రర్'ని ప్రస్తావిస్తూ, ఇది వ్యక్తుల జీవితాలపై దృష్టి పెడుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేస్తున్నాను అని కూడా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మస్క్ మాత్రమే కాకుండా కొందరు నెటిజన్లు కూడా కొత్త ఫీచర్‌ను విమర్శించారు.బ్లాక్ మిర్రర్ సిరీస్బ్లాక్ మిర్రర్ అనేది చార్లీ బ్రూకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. సమకాలీన సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించడానికి సాంకేతికత మరియు మీడియా థీమ్‌లను ఉపయోగిస్తుంది. ఇది ఒక రకమైన ఊహాజనిత కల్పన. ఇది 2011 నుంచి 2013 వరకు ఆరు సిరీస్‌లలో 27 ఎపిసోడ్‌లుగా ప్రసారమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో 2016, 17, 19, 23లలో నాలుగు సిరీస్‌లుగా ప్రసారం చేశారు. 2025లో ఏడో సిరీస్ విడుదలవుతుంది.This is a Black Mirror episode. Definitely turning this “feature” off. https://t.co/bx1KLqLf67— Elon Musk (@elonmusk) May 20, 2024

ACB raids ACP Uma Maheswara Rao residence Money Documents Seized
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు

సాక్షి, హైదరాబాద్‌ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసం, అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్‌ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, విశాఖపట్నంలోని బంధువులకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.సోదాల్లో భాగంగా ఉమామహేశ్వర ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. బంగారు ఆభరణాలు, సిల్వర్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ల్యాండ్‌ డాక్యుమెంట్లు సైతం పట్టుబడుతున్నాయి. ఉమామహేశ్వర్ రావు.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఓ పోలీస్‌ అధికారితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తన మామ ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్‌లో పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.కాగా అశోక్ నగర్‌లో సోదాలు జరిగే ప్రాంతానికి ఏసీపీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర చేరుకున్నారు. ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంటితో పాటు 7చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, తనిఖీలు పూర్తయిన తర్వాత మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement