-
కంచికి చేరని కథ
పద్ధతిగా వండితే సినిమా కథ కూడా పులిహోర వండినంత తేలికే. అయితే సమస్యేమిటంటే ఒక్క పులిహోరకి వందమంది వంటవాళ్లు తయారవుతారు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉప్పు, కారం, పులుపు కలిపేస్తారు. చివరికి అది పులిసిపోతుంది. జనం పుట్బాల్ ఆడుతారు. వెనుకటికి ఒకాయన రామాయణం తీయబోయి పొరపాటున మహా భారతం తీసేశాడు. కథ మీద కూర్చోగానే బంధుమిత్రులంతా వచ్చి తలా ఒక వేషం వేస్తామన్నారు. ఏ ఒక్కరూ కూడా కోతుల వేషం కానీ, రాక్షసుడి వేషం కానీ వేయరట. దాంతో రామాయణాన్ని మార్చి మహాభారతాన్ని తీసారు. కథా చర్చలన్నీ ఇలాగే మంటెక్కువై పెనం మీది దోసెల్లా మాడిపోతుంటాయి. సినిమా కథలో వున్న సౌలభ్యమేమంటే కథలోకి ఎవరైనా ఇట్టే దూరిపోతారు. టీ ఇచ్చే అబ్బాయి కూడా ఒక యాక్షన్ సీన్ చెప్పి వెళ్లిపోతాడు. కామెడీ సీన్లన్నీ నిర్మాత బావమరిది చెపుతాడు. సెంటిమెంట్ని నిర్మాత కోడలు యాడ్ చేస్తుంది. పాటలు ప్రొడ్యూసర్ బాల్య స్నేహితుడు రాస్తాడు. ఎవడి పనులు వాళ్లు చేసేస్తూ వుంటే మూల దర్శకుడికి, రచయితకి ఏం చేయాలో తెలియక వీలైతే నీళ్లు లేదంటే బఠాణీలు నములుతుంటారు. వెనుకటికి ఒకాయన తన కుక్కని హీరోగా పెట్టి సినిమా తీద్దామనుకున్నాడు. దాని ప్రత్యేకత ఏమంటే అడిగిన వాళ్లకి షేక్హ్యాండ్ ఇస్తుంది. అడగని వాళ్ల మీద పడి కరుస్తుంది. అందువల్ల దానికి ఫైటింగ్లు బాగా వచ్చని యజమాని నమ్మకం. చెయ్యిని షేక్ చేసింది, కాలు కూడా షేక్ చేస్తుంది కాబట్టి డాన్స్ కూడా బాగా వచ్చినట్టే. అయితే కుక్కకి దేన్ని హ్యాండ్ అంటారో, దేన్ని లెగ్ అంటారో అని రచయితకి సందేహమొచ్చింది. డౌట్ అడిగేవాణ్ని డౌట్ లేకుండా తన్నాలని నిర్మాత ఫిలాసఫి. అందువల్ల ఆ రచయితని తన్ని తరిమేసి కొత్త రచయితని తెచ్చారు. అతను మూగవాడు. ఏదీ అడగడు, చెప్పడు. కుక్కతో ముహూర్తం షాట్ తీసి గ్రాఫిక్స్తో రెండు, గ్రాఫిక్స్ లేకుండా రెండు సీన్లు తీశారు. లైట్ల వేడికి కుక్కకి మంటపుట్టి కెమెరామన్ కండపట్టుకు లాగింది. ఆ రోజుకి ప్యాకప్.మరుసటిరోజు ఈ విషయం జీవకారుణ్య సంఘం వాళ్లకి తెలిసి కుక్కని ఏకాకిని చేసి మనుషులంతా హింసిస్తున్నారని అపార్థం చేసుకుని నిర్మాత దగ్గర నుంచి లైట్ బాయ్ వరకూ దుడ్డుకర్రలతో బాది కుక్కని పట్టుకుపోయారు. హీరో లేకుండా సినిమా తీయడం ఎలా అని నిర్మాత ఆలోచిస్తూ వుంటే ఒక జపాన్ టెక్నో వచ్చి రోబో కుక్కని తయారుచేసి ఇచ్చాడు. ఒరిజినల్ కుక్క బాడీ లాంగ్వేజీని అర్థం చేసుకోవడం ఈజీ. కానీ రోబోకి ఏ స్విచ్ నొక్కితే అరుస్తుందో, కరుస్తుందో తెలియలేదు. తెలుసుకునేలోపు నిర్మాత ఇల్లూవాకిలి, పిల్లామేక, గొడ్డూగోదా అన్నీ అమ్మేశాడు. చివరికి రోబోడాగ్ మిగిలింది. అయితే దానికి విశ్వాసం లేదు. ఛార్జింగ్ పెట్టకపోతే ఇష్టమొచ్చినట్టు కరిచేది. ఒళ్లంతా కట్లతో ఫిల్మ్నగర్లో ఎవరైనా కనిపిస్తే ఆయనే కుక్క నిర్మాత. - జి.ఆర్. మహర్షి -
యాసలు వేరైనా.. మనమంతా ఒక్కటే..
గాయకుడు గోరటి వెంకన్న కోస్తా, రాయలసీమ, తెలంగాణ.. ప్రాంతాలు, రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటేనని, తెలుగు భాషలోని భావం ఒక్కటేనని సినీ గేయ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. కుబుసం, బతుకమ్మ, ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, పీపుల్స్.. వంటి 80కుపైగా చిత్రాల్లో పాటలు రాశారాయన. ప్రజా సమస్యలపై తన వాణి వినిపించారు. నిద్రపోతున్న సమాజాన్ని తన కలం, గళంతో తట్టిలేపి, నూతనోత్తేజాన్ని కల్పించటంలో ఆయన తీరే ప్రత్యేకం. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న జెక్ఫెస్ట్-15కు వచ్చిన వెంకన్న శుక్రవారం కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. - గుడ్లవల్లేరు సాక్షి : గాంధీ సిద్ధాంతాలు ప్రస్తుతం అమలవుతున్నాయంటారా.? వెంకన్న : ఆధునిక యుగంలో గ్రామాలను నగరాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. దేశంలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ప్రధానమంత్రులు బాగా కృషి చేస్తున్నారంటే అమలవుతున్నట్టే కదా.. సాక్షి : దేశాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వెంకన్న : అమెరికాలోని ఎక్కువ శాతంగా ఉన్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భారతీయులే. వారిని మనదేశానికి రప్పించాలి. అలాగే, వనరులను సమృద్ధి పరుచుకోవటంలోనూ ప్రభుత్వాలు ముందుకు సాగాలి. విద్య, వైద్య రంగాల్ని వ్యాపార ధోరణితో కాకుండా పవిత్రమైన బాధ్యతగా చేపట్టాలి. సాక్షి : నేటి సాంకేతిక పరిజ్ఞానంపై మీ కామెంట్.. వెంకన్న : దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ఆ పరిజ్ఞానమే నేడు పక్కదారి పడుతోంది. అంతర్జాలంలో అశ్లీలత పెరిగిపోతోంది. సాక్షి : నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి? వెంకన్న : కులమత భావాలను తగ్గించుకుని మానవత్వాన్ని పెంచుకోవాలి. గురజాడ, శ్రీశ్రీ వంటి రచనల సారాన్ని అవపోసన పట్టాలి. సాక్షి : నేటి సమాజంపై సినిమా ప్రభావం ఉందంటారా.. వెంకన్న : సినిమా కల్చర్ వల్ల అంత ఉపయోగమేమీ లేదు. పిల్లల్లో అతి తగ్గాలి. ఎక్కువ సినిమాల్లో మానవీయత నశిస్తోంది. సాక్షి : తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం..... వెంకన్న : కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. రాష్ట్రాలు వేరైనా అంతా తెలుగువారమే. తెలుగు ప్రజల నుంచే పుట్టినట్టుగా నేను సినిమాల్లో పాటలు రాశాను. రాజకీయ ఉచ్చులో పడకూడదు. తెలుగు వారమంతా ఒక్కటే అనేది గుర్తుంచు కోవాలి. యాసలు తేడా ఉన్నా తెలుగు భాషలో భావం ఒక్కటే. సాక్షి : మీరు సానుకూలంగా, వ్యతిరేకంగా స్పందించే అంశాలు ఏమిటి? వెంకన్న : నేను శ్రమను గౌరవిస్తాను. మనుషుల ప్రాణాలను సైతం హరించే థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాలను వ్యతిరేకిస్తాను. వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. గోరటి వెంకన్న -
క్షణ క్షణం రాగం - అనుక్షణం అనురాగం
ఇంద్రగంటి జానకీ బాల, ప్రముఖ రచయిత్రి - గాయకురాలు ఏ సామాన్య గుణానికైనా కొన్ని మినహాయింపులుంటాయి. కళాకారులు - వారు గాయకులైనా, కవులైనా - వచన రచన చేసే రచయిత(త్రు)లైనా పరస్పరం అసహనం - కించిత్ ఈర్ష్య, స్పర్ధ కలిగి ఉంటారనేది లోకసహజంగా అనుకునే విషయం. ఈ లోకవాక్యానికి రజనీకాంతరావుగారు పూర్తిగా మినహాయింపు. రజనిగారు అనేక సాహిత్య ప్రక్రియల్లోనూ, రకరకాల సంగీత రీతులలోనూ నిష్ణాతులు. అయితే ఆయన పాటల గురించి, ప్రత్యేకంగా లలిత గీతాల గురించి ఇక్కడ మాట్లాడాలనిపిస్తోంది. ఆయన పాటరచన, దానికి ఆయన కూర్చే బాణీ చాలా విలక్షణంగా ఉంటాయి. ఒక ప్రత్యేకత గల లిరిసిస్ట్! అపారమైన సంగీతంతో మనసు నిండి ఉండడం వల్ల రాగం - భావం జంటగా ఒక పాటై బయటికి వచ్చి ఆయన గళంలో పలుకుతుంది. అది ఒక తిరుగులేని కళారూపమై అందర్నీ అలరిస్తుంది. ఆయన పాటలు చాలా సున్నితంగా, సులభశైలిలో ఉన్నట్లనిపిస్తాయి గానీ పాడి ఒప్పించటం కష్టంగానే అనిపిస్తాయి. అయినా రజని సినిమాల్లో చేసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. నాకు చిన్నప్పటి నుంచీ రజనీ గారి పాటలు వినడం, పాడడం అలవాటుంది. స్కూలు రోజుల్లో ‘మాదీ స్వతంత్ర దేశం...’, ‘ఇదె జోతా - నీకిదె జోతా...’, ‘పసిడి మెరుగుల తళతళలు...’ లాంటి పాటలు తరచూ పాడే సందర్భాలుండేవి. 1970లో ఆలిండియా రేడియో (విజయవాడ)లో లలిత సంగీతం పాడేందుకు ఆడిషన్ ప్యాసయ్యాను. అప్పటికి రజని విజయవాడ స్టేషన్ డైరక్టర్గా రాలేదు. రేడియోలో ‘గీతావళి’ కార్యక్రమం కోసం పాటలు ఎంపిక చేసుకోవాలంటే ఆయన పాటలు ఆకర్షణీయంగా ఉండేవి. ‘రజని’ పాటలుగా ఆయన గీతాలు రేడియోలో మారు మ్రోగుతూ ఉండేవి. సాలూరి రాజేశ్వరరావు పాడిన ‘ఓ విభావరీ...’ గ్రామ్ఫోన్ రికార్డు ఆనాటి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించింది. ఇందులో సమాసాలు, పదబంధాలు వినూత్నంగా ఉంటాయి. ‘‘ఓ విభావరీ - / నీ హార హీర నీలాంబర ధారిణీ/ మనోహా రిణీ - ఓ విభావరీ’’ అంటూంటే ఆ ఊహ మనకందని లోకాలలో విహరింప చేస్తుంది. దానికనుగుణంగా రాగం తీగెలు సాగుతుంది. అలాగే ‘చల్లగాలిలో యమునా తటిపై, శ్యామ సుందరుని మురళీ...’. ఇదీ సాలూరి రాజేశ్వరరావు పాడిన పాటే. ఇందులో - ‘‘తూలిరాలు వటపత్ర మ్ముల పయి/ తేలి తేలి పడు అడుగులవే/ పూల తీవ పొదరిండ్ల మాటగ / పొంచి చూడు శిఖి పింఛమదే -’’ అంటూ పాటలోనే బొమ్మకట్టి, కళ్ల ముందుంచి, అద్భుత దృశ్యాన్ని మనోఫలకంపై ముద్రిస్తారు. రజనీగారి పాటలో సాహిత్యం - సంగీతం చెట్టాపట్టాలేసుకుని నడిచే నర్తకీమణుల్లా మెరిసిపోతూంటాయి. శృంగారం, దేశభక్తి, ప్రకృతి, భక్తి - వేటికవే అందంగా పలుకుతాయి ఆయన లలిత గీతాల్లో. ‘‘హాయిగ పాడుదునా సఖీ -/ ఆకసమందున రాకా చంద్రుడు/ నా కౌగిలిలో నీ సౌందర్యము/ కాంచలేక నా మబ్బుల లోపల/ పొంచి చూసి సిగ్గున తలవంచగ - హాయిగ పాడుదునా!’’ ఇక, దేశభక్తి రజనీగారికి వెన్నతో పెట్టిన లక్షణం. దేశ స్వాతంత్య్రం ప్రకటించగానే పాట, ఆంధ్రరాష్ట్రం లభించగానే పాట, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాట - ఇలా అన్ని సందర్భాల లోనూ ఆయన పాటలు రాశారు. ‘‘పసిడి మెరుంగుల తళతళలు / పసిమి వెలుంగుల మిలమిలలు/ గౌతమి కృష్ణల గలగలలు/ గుడి జేగంటల గణగణలు -’’ అంటూ ఆ శుభ సమయాన్ని ఉత్తేజంగా ప్రకటిస్తారు. ‘‘మరునిముసము మనదో - కాదో/ మధువానవో - మధుపా మధుపా’’ అని మరొక్కసారి తాత్వికంగా అంటారు. ‘పోయిరావే కోయిలా’ అంటూ కోయిలకు వీడ్కోలు చెబుతారు. ఇలా చెప్పాలంటే రజనీ గారివి ఎన్ని భావాలు! ఎన్ని ఊహలు! ఎంత వేదన - ఎంత ఆవేదన! ఎంత ప్రేమ - ఎంత అభ్యుదయం - ఎంత సమ భావం! ఇవన్నీ కలిసి ‘రజని’, ఆయన పాటలూ!! మళ్లీ మొదటికొస్తే, 1980లలో రజనీగారి పుట్టిన రోజు ఉత్సవంగా విజయవాడలో జరిగి నప్పుడు నేను ఆయన పాటలు రెండు పాడాను. ఆ రెండూ మా తమ్ముడు సూరి కుమారస్వామి ట్యూన్ చేశాడు. ఒకటి ‘నటన మాడవే మయూరి’. రెండోది ‘పోయి రావే కోయిలా.’ అవి విని రజని గారు బాగున్నాయని నన్ను అభినందించారు. నా లాంటి సామాన్య గాయకురాలు పాడిన పాటలు కూడా ఆనందంగా స్వీకరించి, బాగా పాడాననడం ఆయన హృదయ సంస్కారం. -
వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది!
పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ పత్రికా సంపాదకులు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి రాయడానికీ, చెప్పడానికీ నాకున్న అర్హత ఏమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు సంగీతం రాదు. అయితే, సంగీతాన్నీ, మంచి పాటనూ ఆస్వాదించడం వచ్చు. నేను టీనేజ్లో ఉండగా విన్న ఒక సినిమా గీతం ఆయన పట్ల నాకు ఆరాధనను పెంచింది. అది - ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట. ఆయన స్వరకల్పన చేసిన ఆ పాట తలుచుకుంటే, ఇవాళ్టికీ భలేగా ఉంటుంది. ముఖ్యంగా, ఆ పాటకు ముందుగా వచ్చే ఆ ‘హమ్మింగ్’ లాంటిది భానుమతి పాడిన తీరు, ఆ రకంగా దానికి వరుస కట్టిన రజనీ గారి ప్రావీణ్యం ఇప్పటికీ నిత్యనూతనమే. ఆ రకంగా ఆ రోజుల నుంచే నేను ఆయన సంగీతానికీ, పాటకూ అభిమానిని. ఆ తరువాత జర్నలిజమ్లోకి వచ్చాక బెజవాడకు వెళ్ళినప్పుడు జర్నలిస్టు మిత్రులు నండూరి రామమోహనరావు, సి. రాఘవాచారి, ఉషశ్రీ లాంటి వారితో కలుస్తుండేవాణ్ణి. అలా రజనీగారిని కూడా చాలాసార్లు వ్యక్తిగతంగా కలిశాను. అయితే, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. పైగా అప్పట్లో నేను ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో పనిచేసేవాణ్ణి. అందువల్ల కొంత వెసులుబాటు ఉండేది. రజనీ గారిని ఎప్పుడు కలిసినా, కేవలం పది నిమిషాలే మాట్లాడుకున్నా సరే, అందులోనూ సంగీతం వినిపించకుండా, మాట్లాడేవారు కాదు. సామాన్య సంభాషణల్లో కూడా అలా సంగీతాన్ని ప్రస్తావించడం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం. నిజం చెప్పాలంటే, సంగీతం లేని రజనీని ఊహించలేమంటే నమ్మండి. మనకున్న కళాకారుల్లో, సాహిత్యవేత్తల్లో ఇటు సంగీతం, అటు సాహిత్యం - రెండింటిలోనూ ప్రావీణ్యం ఉన్నవారు ఈ తరంలో, నాకు తెలిసినంత వరకు రజనీ ఒక్కరే! ఒక తరం వెనక్కి వెళ్ళి చూస్తే, సంగీత, సాహిత్యాల్లో అంతటి మహానుభావుడు - హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు. రజనీ గారిలో మరో గొప్పదనం - ప్రకృతిలో, పశుపక్ష్యాదులలో కూడా సౌందర్యాన్నీ, కవిత్వాన్నీ చూసే విభిన్నమైన చూపు. పశువులు, పక్షుల అరుపులో కూడా సంగీతం చూశారాయన. అందుకు ఆయన చేసిన సంగీత రూపకం ‘కొండ నుంచి కడలి దాకా’ ఒక ఉదాహరణ. కీచురాళ్ళ చప్పుడులోనూ సౌందర్యం, సంగీతం, శ్రావ్యతను చూడడం రజనీ ప్రత్యేకత. 1970లలో అనుకుంటా... ఆ సంగీత రూపకానికి గాను ఆయనకు జపాన్ వాళ్ళదనుకుంటా... అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ నాకు ఎదురైన ఒక స్వీయానుభవం ప్రస్తావించాలి. ఒకరోజు మాటల సందర్భంలో ఆయన మా ఇంట్లోని కుక్కకు కూడా సంగీతం వచ్చు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాకొకసారి వినిపించండి అన్నాను. సరే అన్నారు. వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఆ పెంపుడు కుక్కను పక్కనపెట్టుకొని, ‘సా’ అని రాగం తీశారు. గమ్మత్తుగా అది కూడా ‘సా’ అంటూ ఆ ఫక్కీలోనే అంది. అలాగే, ‘రి’. ఎక్కడా ఎగుడుదిగుళ్ళు లేకుండా రజనీ గారి ఇంటి పెంపుడు కుక్క ‘సరిగమ పదనిస’లు అన్నీ పలికినట్లు నాకు అనిపించింది. పాటలైతే పాడలేదు కానీ, ఆ కుక్క స్వరాలు పలుకుతున్నట్లు గ్రహించాను. ఆ వెంటనే ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో ఆ ‘సంగీతం పాడే కుక్క’ గురించి ప్రత్యేకంగా ఒక ఫీచర్ రాసి, ప్రచురించాను. ‘ఏ గూటి చిలక ఆ గూడి పలుకు’ అని మనకో జాతీయం ఉంది. సరిగ్గా అలాగే, ఇక్కడ సంగీతపు గూటి కుక్క, ఆ గూటిలోని సంగీతాన్నే పలికిందన్నమాట. ఇవాళ ఒక్కసారి తెలుగునాట సంగీత పరిణామక్రమాన్ని సింహావలోకనం చేసుకుంటే, శాస్త్రీయ సంగీతం కాస్తా లలితసంగీతంగా రూపం మార్చుకొని, ప్రవర్తిల్లడం ఒక పరిణామ దశ. ఆ పరిణామంలో దేవులపల్లి కృష్ణశాస్త్రితో సహా కొందరు సాహిత్యకారులు, సంగీతజ్ఞుల పాత్ర ఉంది. వారితో పాటు రజనీ గారిది కూడా లలిత సంగీతావిర్భావంలో ఒక ముఖ్యపాత్ర. అలాగే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం డెరైక్టర్గా కూడా ఆయన నూతన పథగామి అయ్యారు. ఆకాశవాణిలో మామూలు స్థాయిలో మొదలైన ఆయన కేంద్ర సంచాలకుడి స్థాయి వరకు ఎదిగారు. సాధారణంగా ఆ స్థాయికి వచ్చాక, చాలామంది మునుపు చేసినవారి మార్గాన్నే అనుసరిస్తూ, ఒక మూసలో వెళ్ళిపోతుంటారు. కానీ, రజనీ గారు అలా కాదు. వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ‘భక్తి రంజని’ లాంటివెన్నో రజని గారి కంట్రిబ్యూషనే! అలాగే, యువకులు, కొత్తవాళ్ళలోని ప్రతిభను పసిగట్టి, వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేక లక్షణం ఆయన సొంతం. అలా ప్రతిభకు పట్టం కట్టే సంప్రదాయానికి ఆయన ఒరవడి పెట్టారు. ఇతరులకు కూడా ఆ విషయంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వ్యక్తిగతంగా చూస్తే, వయసులో నా కన్నా రజనీ గారు చాలా పెద్ద. అయినా, నన్నెప్పుడూ ఆయన స్నేహదృష్టితో చూసేవారు. ఆయన, రచయిత మహీధర రామమోహనరావు, నేను కలిసి, సరదాగా మాట్లాడుకున్న క్షణాలు, ఫోటోలు దిగిన క్షణాలు నాకిప్పటికీ గుర్తే! ఆయనకు వయసు మీద పడ్డాక ఎప్పుడైనా కలిసినప్పుడు, ‘కులాసాగా ఉన్నారా’ అని నేను అడిగితే, ఆయన నన్ను గుర్తుపట్టానని చెప్పడానికి బదులుగా కావాలని - ‘నేను... పొత్తూరి వెంకటేశ్వరరావును’ అంటూ ఉంటారు. నేను వెంటనే, ‘అవును. మరి నేనేమో బాలాంత్రపు రజనీకాంతరావును’ అని నమస్కరిస్తుంటా. ఆ మాటతో ఇద్దరం హాయిగా నవ్వుకుంటాం. నిండు చంద్రుడి లాంటి ఆయన నవ్వుకు మరో వసంతం నిండుతున్నందుకు ఆనందిస్తున్నాను. స్నేహసంగీతం పరిమళించే ఈ శతాయువు తెలుగు లలిత సంగీత ప్రపంచంలో చిరాయువు! (సంభాషణ - రెంటాల జయదేవ) -
అలా ఆ కథలు రాశాను...
జ్ఞాపకం 1988 నాటి మాట. అప్పుడు నేను రాసిన ‘అగ్ని సరస్సు’ కథాసంపుటి ఆవిష్కరణ సభకు ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం, విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య వచ్చారు. మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా ఉన్న ఆ సభలో వాళ్లిద్దరూ నాకో సూచన చేశారు. ‘తెలుగు కథ ఆవిర్భవించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావొస్తోంది. కానీ ఇంత వరకు మన పక్కనే మనతో పాటే కలసిమెలసి బతుకుతున్న ముస్లిముల జీవన స్థితిగతుల మీద మాత్రం ఎవరూ రాయలేదు. ఆ పని సత్యాగ్ని చేయగలుగుతాడనే నమ్మకం ఉంది. ఇక మీదట ఆయన రాసే కథలు ఆ లోటును పూరిస్తాయి’ అని ప్రకటించారు. అప్పుడే నాలో ముస్లిం కథలు రాయాలనే ఆలోచన మొదలైంది. అప్పటికి తెలుగు కథాసాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన రచయితలు అనేకమంది ఉన్నారు కానీ ఎవరూ ముస్లిం కథ రాయడానికి పూనుకోలేదు. వారికి ముస్లిములతో పైపై పరిచయాలు తప్ప వారి జీవితాలపై లోతైన అవగాహన లేకపోవడం కూడా కారణం కావచ్చు. అలాగే ఇస్లాం మతసిద్ధాంతాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న వాళ్ల జీవితాల గురించి రాస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం కూడా కారణం కావచ్చు. అందుకే అప్పటి వరకు అది ఒక చీకటి కోణంగానే మిగిలి పోయిందనేది నా భావన. ఆ లోటు భర్తీ కోసం నేను నా జీవితంలో జరిగిన, నేను అత్యంత సన్నిహితంగా చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ముస్లిం కథలు రాయడానికి ఉపక్రమించాను. 1989లో నేను రాసిన (తొలి ముస్లిం) కథ ‘పాచికలు’ ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ప్రచురితమైంది. తర్వాత రాసిన కొన్ని కథలు ‘గీటురాయి’ పక్షపత్రికలో ప్రచురితమయ్యాయి. ఇస్లాం మూల సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం లేక విమర్శించడమో పనిగా కాకుండా వాటిని ఆసరా చేసుకొని కొనసాగుతున్న ముస్లిం స్త్రీల బాధల గాథలకు అక్షర రూపమివ్వడమే నా కథల ప్రధాన ఉద్దేశ్యము. అయితే నా కథలకు కొనసాగింపుగా నా తరువాతి రచయితలెవరూ అంత తొందరగా దీన్ని అందుకోలేదు. మూడు సంవత్సరాల తర్వాత బాబ్రీ మసీదు విధ్వంసంతో కొందరు యువ రచయితల హృదయాల్లో అణగారి ఉన్న ఆవేదన, ఆవేశము ఒక్క పెట్టున బహిర్గతమై ముస్లిం సమాజ స్థితిగతుల మీద కథలు రాయడం మొదలుపెట్టారు. అది పెరిగి పెద్దదై ముస్లిం వాదంగా స్థిరపడి ఇప్పటికీ కొనసాగుతోంది. - షేక్ హుసేన్ సత్యాగ్ని (తెలుగులో తొలి ముస్లిం కథలు ‘పాచికలు’ రచయిత)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ‘గంట’కు రూ.100.!
Advertisement