-
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ను ఆశించవచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం బలపడి రూ. 3,983 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 3,599 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసికవారీగా అంటే గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 4,096 కోట్లతో పోలిస్తే నికర లాభం 3 శాతం తగ్గింది. కాగా.. ఈ క్యూ4లో మొత్తం ఆదాయం 18 శాతం ఎగసి రూ. 26,606 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 22,597 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 10 శాతం మెరుగై రూ. 14,845 కోట్లను తాకింది. 2021–22లో రూ. 13,499 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. లక్ష కోట్లను దాటి రూ. 1,01,456 కోట్లకు చేరింది! అంతక్రితం ఏడాది రూ. 85,651 కోట్ల ఆదాయం అందుకుంది. భారీ డీల్స్ అప్ క్యూ4లో హెచ్సీఎల్ టెక్నాలజీస్ 13 భారీ డీల్స్ గెలుచుకుంది. వీటి విలువ 207.4 కోట్ల డాలర్లుకాగా.. వార్షికంగా 18 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ 3,674 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,25,944కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతంగా నమోదైంది. డీల్ పైప్లైన్ దాదాపు కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు కంపెనీ సీఈవో విజయ్కుమార్ పేర్కొన్నారు. గైడెన్స్ గుడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 6–8 శాతం వృద్ధి చెందగలదని హెచ్సీఎల్ టెక్ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండును ప్రకటించింది. వరుసగా 81వ త్రైమాసికంలోనూ డివిడెండును చెల్లిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్ షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,037 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్–ఉబర్ భారీ డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో భారీ డీల్కు వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, రైడ్ షేరింగ్ యాప్ ఉబర్ తెరలేపాయి. ఇరు సంస్థల మధ్య సోమవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25,000 యూనిట్ల ఎక్స్ప్రెస్–టి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాలను ఉబర్కు టాటా మోటార్స్ సరఫరా చేయనుంది. ఎక్స్ప్రెస్–టి ఈవీలను ప్రీమియం సేవల కింద ఉపయోగించనున్నట్టు ఉబర్ వెల్లడించింది. హైదరాబాద్సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఈ నెల నుంచే వీటిని నడుపుతామని తెలిపింది. దశలవారీగా డెలివరీలు.. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ సరఫరా విషయంలో వాహన తయారీ కంపెనీ, రైడ్ షేరింగ్ సంస్థ మధ్య దేశంలో ఈ స్థాయి డీల్ కుదరడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి నుంచే దశలవారీగా ఉబర్ ఫ్లీట్ పార్ట్నర్స్కు డెలివరీలను టాటా మోటార్స్ ప్రారంభించనుంది. దేశంలో పర్యావరణ, స్వచ్ఛ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేశ్ చంద్ర అన్నారు. ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ బ్రాండ్ను టాటా మోటార్స్ 2021 జూలైలో తెచ్చింది. ఈ బ్రాండ్ కింద ఎక్స్ప్రెస్–టి తొలి ఉత్పాదన. ఫేమ్ సబ్సిడీ పోను హైదరాబాద్ ఎక్స్షోరూం ధర.. ఎక్స్ప్రెస్–టి ఎక్స్ఎమ్ ప్లస్ రూ.13.04 లక్షలు, ఎక్స్టీ ప్లస్ రూ.13.54 లక్షలు ఉంది. -
నోకియాతో జియో బిగ్ డీల్..
-
అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా
న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ రంగంలో భారీ డీల్కు తెరతీసింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు రెండు గ్రూప్లు ప్రకటించాయి. వెరసి సిమెంట్ దిగ్గజాలు అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లతో కలిపి రూ. 80,000 కోట్లు(10.5 బిలియన్ డాలర్లు) వరకూ వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రూప్ వెల్లడించింది. కీలకమైన పోర్టులు, పవర్ ప్లాంట్లు, కోల్ మైన్స్ నిర్వహించే అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీవైపు దృష్టిసారించింది. ఈ బాటలో సిమెంట్ రంగంలోనూ గతేడాది ప్రవేశించింది. అదానీ సిమెంటేషన్ పేరుతో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా అదానీ గ్రూప్ దేశీయంగా సిమెంట్ రంగంలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది. కాగా.. సిమెంట్ తయారీకి ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్నుంచి వైదొలగనున్నట్లు గత నెలలో ప్రకటించింది. తదుపరి ఆదిత్య బిర్లా, జేఎస్డబ్ల్యూ గ్రూప్లతోపాటు.. అల్ట్రాటెక్ తదితర దిగ్గజాలతో చర్చలు నిర్వహిస్తూ వచ్చింది. డీల్ వివరాలివీ.. ► 17 ఏళ్ల క్రితం దేశీ కార్యకలాపాలు ప్రారంభించిన హోల్సిమ్ ఇండియా అంబుజా సిమెంట్స్లో 63.19% వాటా ఉంది. అంబుజాకు మరో లిస్టెడ్ దిగ్గజం ఏసీసీలో మెజారిటీ(50.05%) వాటా ఉంది. ఏసీసీలో హోల్సిమ్ మరో 4.48% వాటాను కలిగి ఉంది. ఈ వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ► అంబుజా సిమెంట్కు ఒక్కో షేరుకి రూ. 385, ఏసీసీ లిమిటెడ్కు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ చెల్లించనుంది. ► సెబీ నిబంధనల ప్రకారం రెండు సంస్థల సాధారణ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ను ప్రకటించవలసి ఉంటుంది. ► అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్ల ప్రస్తుత సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 70 మిలియన్ టన్నులు. ప్రత్యర్ధి సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షికంగా 119.95 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్ సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. దిగ్గజాల తీరిదీ ► ఏసీసీ 17 తయారీ యూనిట్లు, 9 సొంత అవసరాల( క్యాప్టివ్) విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లతో నెట్వర్క్ను విస్తరించింది. ► అంబుజా సిమెంట్స్ మొత్తం 31 మిలియన్ టన్నుల సామర్థ్యంగల 6 సమీకృత తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు సైతం ఏర్పాటు చేసింది. ► 2015లో ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్తో హోల్సిమ్ విలీనమైంది. లఫార్జ్హోల్సిమ్గా ఆవిర్భవిం చింది. ఏసీసీలో హోల్సిమ్ ఇండియాకుగల 24 శాతం వాటాను అంబుజా 2016 జూన్లో కొనుగోలు చేసింది. దీంతో ఏసీసీలో అంబుజా వాటా 50.05 శాతానికి చేరింది. క్వింటిలియన్లో అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 49 శాతం వాటా కొనుగోలు డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్(క్యూబీఎంఎల్)లో 49 శాతం వాటా ను సొంతం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఇందుకు గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా క్యూబీఎంఎల్, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్(క్యూఎంఎల్)తో వాటాదారులు, వాటా కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలుకి క్వింట్ డిజిటల్ మీడియా(క్యూడీఎంఎల్)తో సైతం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రాఘవ్ బల్ కంపెనీ క్యూబీఎంఎల్లో మైనారిటీ వాటా కొనుగోలు ద్వారా మీడియా బిజినెస్లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. క్యూబీఎంఎల్.. బ్లూమ్బెర్గ్క్వింట్ పేరుతో బిజినెస్ న్యూస్ డిజిటల్ ప్లాట్ఫామ్ను నిర్వహిస్తోంది. డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్ఫామ్ కోసమే అదానీ గ్రూప్తో డీల్ను కుదుర్చుకున్నట్లు క్యూడీఎంఎల్ తెలిపింది. కాగా, డీల్ విలువ తెలియలేదు., మార్గదర్శనం దేశీయంగా మా బిజినెస్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. తద్వారా దేశీయంగా తదుపరి దశ వృద్ధికి గ్రూప్ నాయకత్వం వహించగలదు. – జాన్ జెనిష్, సీఈవో, హోల్సిమ్ లిమిటెడ్ వృద్ధిపై విశ్వాసం సిమెంట్ రంగంలో విస్తరించే ప్రణాళికలు దేశ వృద్ధి అవకాశాలపట్ల మాకున్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచంలోనే భారత్ డిమాండు ఆధారిత ప్రధాన ఆర్థిక వ్యవస్థకాగా.. పలు దశాబ్దాలుగా సిమెంట్ తయారీలో రెండో ర్యాంకులో నిలుస్తోంది. – గౌతమ్ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement