-
జనరల్ డయ్యర్ను గాంధీ ఎందుకు క్షమించారు?
జలియన్వాలాబాగ్ మారణకాండలో ప్రధాన పాత్రపోషించిన బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ భారతీయుల మధ్య విద్వేషాలను కూడా రగిలించాడని అంటారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ పదేపదే జనరల్ డయ్యర్ను క్షమిస్తూ వచ్చారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ దేశానికి అహింస, క్షమాగుణాలతో కూడిన భిన్నమైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా మహాత్మా గాంధీ తిరిగి డయ్యర్ను క్షమించారు. ‘డయ్యర్ను క్షమించడం ఒక వ్యాయామం’ మహాత్మా గాంధీ మాట్లాడుతూ ‘నేను జనరల్ డయ్యర్కు సేవ చేసినా, అమాయకులను కాల్చి చంపడంలో అతనికి సహకరించినా అది పాపం అవుతుంది. అయితే అతను ఏదైనా శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతన్ని క్షమించి, సాయం అందించడం అనేది నాలో క్షమాగుణం పెరిగేందుకు, ప్రేమను పెంచుకునేందుకు ఒక వ్యాయామంలా ఉపకరిస్తుంది’ అని పేర్కొన్నారు. మరోచోట గాంధీ.. ‘డయ్యర్ కొన్ని శరీరాలను మాత్రమే నాశనం చేశాడు. మరికొందరైతే ఒక జాతి యొక్క ఆత్మను చంపడానికి ప్రయత్నించారు. జనరల్ డయ్యర్పై వ్యక్తమైన కోపం చాలావరకు తప్పు దిశగా సాగిందని నేను అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. డయ్యర్ పక్షవాతానికి గురైనపుడు.. డయ్యర్ తన జీవితపు చివరి దశలో పక్షవాతానికి గురైనప్పుడు గాంధీ స్నేహితుడొకరు ‘అతని అనారోగ్యానికి జలియన్వాలాబాగ్ మారణకాండనే కారణమని’ అన్నారు. భగవద్గీతను నమ్మిన గాంధీ దీనిపై హేతుబద్ధంగా స్పందించారు. ‘జలియన్వాలాబాగ్లో అతను సాగించిన మారణకాండకు అతనికి వచ్చిన పక్షవాతానికి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. అటువంటి నమ్మకాలను మీరు కలిగివుంటారా? అయితే నాకు వచ్చిన విరేచనాలు, అపెండిసైటిస్, తేలికపాటి స్ట్రోక్కు.. నేను కొందరు బ్రిటీషర్లపై వ్యక్తం చేసిన తీవ్ర నిరసనే కారణమని అంటే నాకు బాధ కలుగుతుంది’ అని అన్నారు. డయ్యర్ను కలవాలని ఆకాంక్ష ‘నా హృదయంలో డయ్యర్పై ఎలాంటి దురుద్దేశం లేదు. నేను అతనిని వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నాను. అయితే అది కేవలం నా ఆకాంక్షగానే మిగిలిపోయిందని’ గాంధీ పేర్కొన్నారు. మనలో ద్వేషం లేకపోవడం అంటే దోషులను స్క్రీనింగ్ చేయడం కాదని గాంధీ స్పష్టం చేశారు. ‘మనం ఇతరులు చేసిన నేరాలను మరచిపోయి, వారిని క్షమించామని చెబుతున్నప్పటికీ, కొన్ని విషయాలను మరచిపోతే పాపం అవుతుంది’ అని గాంధీ పేర్కొన్నారు. 'జలియన్ వాలా ఊచకోతకు కారకులైన డయ్యర్, ఓ డయ్యర్(జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్)లను మనం క్షమించగలం. కానీ మనం ఆనాటి ఘటనను మరచిపోలేం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
జాతి గుండెపై మానని గాయం..
భారత దేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన ‘జలియన్ వాలాబాగ్’ మారణకాండ. బ్రిటీష్వారి దురహంకారానికి వెయ్యిమందికి పైగా భారతీయులు బలయ్యారు. దేశంలో ఆంగ్లేయుల పాలన ఎన్ని ఆకృత్యాలతో కూడి ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగి నేటితో 97 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకుందాం.. ఎక్కడ, ఎలా.. ఏప్రిల్ 13, 1919 ఆదివారం రోజున ఉత్తర భారత దేశంలోని అమృత్సర్ పట్టణంలో ఉన్న జలియన్ వాలా బాగ్ అనే తోటలో ఈ ఘటన జరిగింది. ఆరోజు సిక్కులకు ఎంతో ఇష్టమైన వైశాఖి పండుగ. ఈ సందర్భంగా దాదాపు 20వేల మంది సిక్కులు, హిందూ, ముస్లింలు సమావేశమయ్యారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోటకు చుట్టూ గోడలు, చిన్నచిన్న ద్వారాలు మాత్రమే ఉన్నాయి. వైశాఖి పండుగ సందర్భంగా సమావేశమయినప్పటికీ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారు. రౌలత్ చట్టాన్ని రద్దు చేయాలని వారంతా నినదించారు. ఇలా వేల మంది ఒకేచోట సమావేశమై శాంతియుతంగా ప్రసంగిస్తుండగానే అనూహ్యంగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కాల్పులు.. ఈ సమావేశం గురించి సమాచారం అందుకున్న అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడు. సాయుధులైన సైన్యం జలియన్ వాలాబాగ్ గేట్లకు ఎదురుగా నిలబడ్డారు. వెంటనే అక్కడివారిపై కాల్పులు జరపాల్సిందిగా డయ్యర్ ఆదేశించాడు. దీంతో వారు విచక్షణారహితంగా అమాయకులైనవారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ఏకధాటిగా పది నిమిషాలపాటు విచక్షణారహితంగా సైన్యం కాల్పులు కొనసాగించింది. దాదాపు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకుల్లోని తూటాలు అన్నీ అయిపోయేంత వరకు ఈ కాల్పులు కొనసాగాయి. చివరకు మందుగుండు అయిపోవడంతో సైన్యం కాల్పులు ఆగిపోయాయి. ఎటూ వెళ్లలేక.. ఈ అనూహ్య ఘటనతో జలియన్ వాలాబాగ్లో సమావేశమైన ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు. బుల్లెట్ల దాడినుంచి రక్షించుకునేందుకు తలోదిక్కుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. తోటలోని గేట్లవైపు వెళ్లి బయటపడదామని చూశారు. కానీ గేట్లు మూసి ఉండడం, తెరిచి ఉన్న ద్వారాల దగ్గర నిలబడి సైన్యం కాల్పులు జరపడంతో వారంతా తూటాలకు బలయ్యారు. మరోవైపు బయటికి వెళ్లేందుకు దారిలేక, లోపలే ఉండి ప్రాణాలు కాపాడుకోలేక కొందరు అక్కడే ఉన్న బావిలోకి దూకారు. దీనివల్ల కూడా కొందరు మరణించారు. ఇలా ఓ వైపు తూటాలకు కొంతమంది, మరోవైపు బావిలోదూకడం వల్ల, తొక్కిసలాట వల్ల మరికొందరు మరణించారు. అప్పటివరకు శాంతియుతంగా సాగిన సమావేశం రక్తసిక్తమైంది. వెయ్యి మందికిపైగా మృతి.. ఈ కాల్పుల్లో 379 మంది మాత్రమే మరణించినట్లు బ్రిటిష్ అధికారులు తేల్చారు. వారి అంచనా ప్రకారం 1,100 మంది గాయపడ్డారు. అయితే అసలు అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఇక్కడ దాదాపు 1,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. వేల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో చిన్న పిల్లల దగ్గరినుంచి వృద్ధుల వరకు ఉన్నారు. వారిలో ఆరువారాల చిన్నారి కూడా ఉండడం మరో విచారకర అంశం. కానీ ఈ వాస్తవాల్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను తక్కువగా చూపి ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. డయ్యర్ కారణంగానే.. ఈ ఘటనకు ప్రధాన బాధ్యుడు బ్రిగేడియర్ జనరల్ డయ్యర్. ఆయన దురహంకారపూరిత నిర్ణయం మూలంగానే ఈ మారణకాండ చోటుచేసుకుంది. సమావేశమైన ప్రజల్ని అణచి వేయడానికి అక్కడికి చేరుకున్న డయ్యర్ కాల్పులు జరిపేముందు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సమావేశం శాంతియుతంగా జరుగుతోందని, వారంతా నిరాయుధులని తెలిసినా అమాయకులపై కాల్పులు జరపమని ఆదేశించి డయ్యర్ ఈ మారణహోమానికి ప్రధాన నిందితుడిగా నిలిచాడు. ఈ ఘటనపై డయ్యర్ స్పందిస్తూ తాను ఈ సమావేశాన్ని ఆపేందుకే వెళ్లానని, అయితే అంతమందిని అదుపులో పెట్టడం కష్టం కాబట్టి కాల్పులకు ఆదేశించానని వ్యాఖ్యానించాడు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ డయ్యర్ ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అందని సాయం.. కాల్పుల్లో వందలాది మంది మరణించడంతోపాటు, వేలాది మంది గాయపడ్డప్పటికీ వారికి వెంటనే ఎలాంటి వైద్య సాయం అందలేదు. కాల్పులు జరిపిన అనంతరం డయ్యర్, అతడి సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డయ్యర్ ప్రయత్నించలేదు. దీనిపై డయ్యర్ మాట్లాడుతూ వారికి వైద్య సేవలు అందించడం తన కర్తవ్యం కాదు కాబట్టి ఆ పని చేయలేదని చెప్పాడు. డయ్యర్ చర్యను కొందరు బ్రిటిష్ పాలకులు సమర్ధించారు. కానీ ఈ చర్యను ఖండిస్తూ బ్రిటీష్ పార్లమెంటు తీర్మానం చేసింది. విన్స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యపై విచారణ సాగుతుండగానే డయ్యర్ ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. స్మారక చిహ్నం ఏర్పాటు.. వందలాది మంది మృతికి కారణమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్వాతంత్య్ర ఉద్యమం మరింత విస్తృతమయ్యేందుకు ఈ ఘటన దోహదపడింది. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల జ్ఞాపకార్థం 1961 ఏప్రిల్ 13న స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. ప్రతిఏటా ఇదేరోజు స్థూపంవద్దే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు జలియన్ వాలాబాగ్ మృతులకు నివాళులర్పిస్తారు. -
స్వాతంత్య్ర జ్వాల...
జలియన్వాలా బ్రిటిష్ పాలనపై భారతీయుల తిరుగుబాటుకు తక్షణ ప్రేరణ... జలియన్వాలా బాగ్ దురంతం. ఈ ఘోర ఘటన తర్వాతే గాంధీజీ సహాయ నిరాకరణ మొదలైంది. నిరాకరణ నిరసన అయ్యింది. నిరసన సత్యాగ్రహం అయింది. సత్యాగ్రహం ఆయుధం అయ్యింది. ఆ ఆయుధమే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది. ‘అన్ని యుద్ధాలనూ అంతం చేయడానికి చేస్తున్న యుద్ధం’ అంటూ మొదటి ప్రపంచ యుద్ధంలో నినాదం ఇచ్చిన ఇంగ్లండ్, ఆ తరువాత భారతీయుల మీద మాత్రం తన యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అందుకు నిలువెత్తు నిదర్శనమే జలియన్వాలా బాగ్ దురంతం (ఏప్రిల్ 13, 1919). గ్రేట్వార్ ముగిసిన కొన్ని నెలలకే ఈ ఘోరాన్ని ఇంగ్లండ్ చరిత్ర పుటల్లో నమోదు చేసింది. రెండువేల మంది దేశభక్తుల రక్తంతో తడిసిన నేల అని జలియన్వాలా బాగ్ స్మారక స్తూపం మీద రాసి ఉంటుంది. పిలుపు అందుకుంది పంజాబీలే! జలియన్వాలా బాగ్ నెత్తుటి కాండకు ఉన్న నేపథ్యాన్ని తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్వార్ చరిత్ర దగ్గరకు నడవాలి. నాటి భారత రాజకీయ, స్వాతంత్య్రో ద్యమ సన్నివేశాలను, మనోభావాలను శోధించాలి. ఆ యుద్ధంలో సిక్కులు చూపించిన తెగువను జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ప్రపంచ సంగ్రామంలో 13 లక్షల మంది భార త సైనికులు పాల్గొన్నారు. మొత్తం 74,000 మంది చనిపోయారు. మిగిలిన భారత భూభాగాల కంటే పంజాబ్.. బ్రిటిష్ జాతికి మరింత సేవ చేసిందనే చెప్పాలి. యుద్ధం ఆరంభించే సమయానికి (1914) భారత వలస సైన్యంలో సిక్కుల సంఖ్య దాదాపు లక్ష. ‘యుద్ధంలో చేరి వీరత్వం ప్రదర్శించ’మంటూ ఇంగ్లండ్ ప్రభుత్వంలో వార్ కార్యదర్శి లార్డ్ కిష్నర్ ఇచ్చిన పిలుపునకు గాఢంగా స్పందించిన వారు పంజాబీలే. కిష్నర్ ప్రకటన తరువాత పంజాబీ సైనికుల సంఖ్య 3,80,000కు చేరుకుంది. అంతేకాదు, రెండుకోట్లు యుద్ధ నిధి ఈ ప్రాంతం నుంచి వెళ్లింది. పది కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిటిష్ ప్రభుత్వం విక్రయించిన వార్ బాండ్లను తీసుకున్నది కూడా పంజాబీలే. కానీ యుద్ధంలో వీరు అనుభవించిన వేదన వర్ణనాతీతం. ‘‘... రోజూ వేలమంది మనుషులు చనిపోతున్నారు... చూడబోతే యుద్ధం ముగిసే సరికి రెండు వైపులా ఒక్కరు కూడా మిగిలేటట్టు లేరు. అప్పుడు శాంతి నెలకొనకుండా ఉంటుందా?’’ అంటూ ఇషేర్సింగ్ (59వ సిఖ్ రైఫిల్స్ దళ సభ్యుడు) పంజాబ్లోని తన మిత్రుడికి రాసిన లేఖ (మే 1, 1915) లోని ఈ మాటలు ఆ వేదనకు ఒక నిదర్శనం. భారతదేశం మొత్తం మీద ప్రతి 150 మందికి ఒకరు యుద్ధానికి వెళితే, ప్రతి 28 మంది పంజాబీలకూ 1 సిపాయి వంతున ప్రపంచ యుద్ధంలో పోరాడాడు. గాంధీజీపై అనిబిసెంట్ ఆగ్రహం! ఆ ఘోర యుద్ధంలో వలస భారత సైనికులను ఉపయోగించుకోవడం మీద ఆనాటి స్వాతంత్య్రోద్యమ నేతలలో ఏకాభిప్రాయం లేదు. చెప్పాలంటే గట్టి వ్యతిరేకతే ఉంది. యుద్ధం చేస్తున్న ఇంగ్లండ్ అవసరాలను తీరుస్తానంటూ ముందుకొచ్చిన గాంధీజీ సైతం విమర్శలపాలు కావలసి వచ్చింది. ఊరికి 20 మంది బలశాలురైన యువకులు చేరాలంటూ గుజరాత్ ప్రాంతమంతా గాంధీజీ పాదయాత్ర చేశారు. మొత్తానికి నలభై మంది మాత్రం చేరారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకో వలసిందిగా సర్దార్ పటేల్ను గాంధీజీ కోరినా ఆయన నిరాకరించడం విశేషం. అహింసా సిద్ధాంతం వదిలి గాంధీజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనిబిసెంట్కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. గాంధీజీని ఆమె ‘రిక్రూటింగ్ సార్జెంట్’ అని ఎద్దేవా చేశారు. అయినా గాంధీజీకి ఒక ఆశ. ఆ యుద్ధంలో బ్రిటన్కు సహకరిస్తే, భారతీయుల ‘స్వరాజ్యం’, ‘స్వయం పాలన’ కోరికలకు కదలిక వస్తుందని అనుకున్నారు. కానీ యుద్ధంతో సతమత మవుతున్న ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకోవాలన్నది చాలామంది తీవ్ర జాతీయవాదుల ఆశయం. అందులో గదర్ పార్టీ ప్రధానమైనది. ఈ పార్టీలో ఎక్కువ మంది పంజాబ్, బెంగాల్ ప్రాంతాల నుంచి వచ్చినవారే (తెలుగు ప్రాంతం నుంచి దర్శి చెంచయ్య వెళ్లి ఈ పార్టీలో పనిచేశారు). 1857 తరహాలో 1915 ఫిబ్రవరిలో ఒక తిరుగుబాటు తేవాలన్న యోచన కూడా బలీయంగా ఉంది. ఇలాంటి విస్తృత పథకానికి వ్యూహం పన్నినవారు అమెరికా, జర్మనీ దేశాలలో ఉండి భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్నవారే. ఇందుకు 1914 నుంచి 1917 వరకు చాలా కృషి జరిగింది. కానీ గదర్ పార్టీలోకి గూఢచారులు చొచ్చుకుపోవడం వల్ల రహస్యాలు బయటకు పొక్కి పథకం విఫలమైంది. డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం -1915 ఈ పరిణామాల ఫలితమే. దీనికి కొనసాగింపు సెడిషన్ కమిటీ 1918. సిడ్నీ రౌలట్ (న్యాయమూర్తి) దీని అధ్యక్షుడు. జర్మన్, బొల్షివిక్-భారత తీవ్ర జాతీయవాదుల మధ్య సంబంధాలను వెలికి తీయడం కూడా ఈ కమిటీ విధులలో ఒకటి. అలా వచ్చింది రౌలట్ చట్టం. దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగమే జలియన్వాలాబాగ్ దురంతం. బాగ్ ఘటనకు బీజం ఇక్కడే! ఒక పక్క అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తూనే, మరోపక్క గ్రేట్వార్లో బ్రిటిష్ వారికి సాయం చేయాలని గాంధీజీ యోచించారు. సరిగ్గా ఈ అంశం మీదే ఉద్యమకారులు రెండు వర్గాలయ్యారు. అహింసా పథానికీ, భూగోళాన్ని రక్తంతో తడుపుతున్న మొదటి ప్రపంచ యుద్ధానికి చేయూతనివ్వడానికీ పొంతన లేదన్నదే తీవ్ర జాతీయవాదుల అభిప్రాయం. అయినా గాంధీజీ అహింసాయుత పంథాలోనే ఎక్కువ మంది కాంగ్రెస్వాదులు నడిచారు. పంజాబ్ ప్రముఖులు డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ గాంధీజీ అహింసా ప్రబోధాలను విశ్వసించినవారే. ఈ ఇద్దరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఏప్రిల్ 10, 1919న అరెస్టు చేసి, రహస్య ప్రదేశంలో ఉంచింది. గాంధీజీ అహింసను ప్రజలకు తెలియచేసే క్రమంలో... అరెస్టయిన వీరి విడుదల కోసం హింసాత్మక ఉద్యమం మొదలైంది. మైఖేల్ ఓడ్వయ్యర్ అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్. అమృత్సర్ మిలిటరీ కమాండర్ - బ్రిగేడియర్ రెజినాల్డ్ డయ్యర్. సత్యపాల్, కిచ్లూ అరెస్టయిన రోజునే అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ (పంజాబ్) నివాసం ఎదుట ఆందోళన జరిగింది. కాల్పులు జరిగాయి. ముగ్గురు బ్యాంక్ అధికారులను కార్యాలయాల్లోనే జనం హత్య చేశారు. ఏప్రిల్ 11న మార్సెల్లా షేర్వుడ్ అనే మహిళా మిషనరీని సైకిల్ మీద నుంచి పడేసి చంపారు. ఈ పరిణామాల తరువాత సత్యపాల్, కిచ్లూలను విడుదల చేసి, సైనిక శాసనం విధించారు. అప్పుడే, అంటే ఏప్రిల్ 13న సిక్కుల పండుగ ైవె శాఖి వచ్చింది. సైనిక శాసనం గురించి తెలియని గ్రామీణ ప్రాంతాల సిక్కులు ఏటా అక్కడ జరిగే ఉత్సవానికి హాజరయ్యారు. ఆ ఉత్సవం తరువాతే సభ జరుగుతుందని గూఢచారుల ద్వారా జనరల్ డయ్యర్కు సమాచారం అందింది. డయ్యర్కు పార్లమెంట్ ప్రశంస! నిజానికి బాగ్లో కాల్పులు జరిపే ఉద్దేశం డయ్యర్కు లేదని నిక్ లాయిడ్ (ది అమృత్సర్ మేసకర్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ వన్ ఫేట్ఫుల్ డే) అనే చరిత్రకారుడు అంటాడు. 90 మంది బలగం (బలూచీ, గూర్ఖా దళాలు)తో నగరంలో సైనిక శాసనం అమలును పర్యవేక్షిస్తున్నాడు డయ్యర్. ఆరేడు ఎకరాల బాగ్లో జరుగుతున్న సభ దగ్గరకు కూడా వచ్చాడు. అక్కడ 15 వేల నుంచి 25 వేల వరకు అక్కడ జనం ఉండడం గమనించి, వెంటనే కాల్పుల నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘట్టం రక్తదాహానికీ ప్రబల నిదర్శనం. అమానవీయతకు, వలసవాదానికీ మధ్య ఉండే బంధాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చేసిన రక్తరేఖ. ఈ దురంతానికి పాల్పడిన డయ్యర్ను నాటి బ్రిటిష్ పార్లమెంట్ శ్లాఘించడమే విచిత్రం. టాగూర్ తిరిగి ఇచ్చేశారు! జలియన్వాలా బాగ్ కాల్పులు ప్రపంచ చరిత్రలోనే ఒక ఘోర ఉదంతం. చరిత్ర మీద కనిపించే దీని జాడే అందుకు నిదర్శనం. కాల్పుల సమాచారం తెలియగానే రవీంద్రనాథ్ టాగూర్ తన సర్ బిరుదును త్యజించారు (మే 22న గానీ ఘటన సంగతి బెంగాల్ చేరలేదు, గాంధీజీకి జూన్లో ఈ సంగతి తెలిసింది). జనరల్ డయ్యర్ను శిక్షించాలని బ్రిటిష్ ప్రముఖుడు విన్స్టన్ చర్చిల్ ప్రతినిధుల సభలో (జూలై 8, 1920న) కోరడం విశేషం. అమృత్సర్ అమానుషానికి బాధ్యునిగా ప్రసిద్ధికెక్కిన ఓడ్వయ్యర్ను మార్చి 13, 1940న లండన్ నగరంలో ఉన్న క్యాక్స్టన్ హాలులో రెండు దశాబ్దాల తరువాత ఉధమ్సింగ్ కాల్చి చంపాడు. పసితనంలో చూసిన ఆ బీభత్సం అతడిని ఈ హత్యకు పురికొల్పింది. తరువాత ఇంగ్లండ్ దమననీతి ఎలాంటిదో చూడండంటూ జర్మన్ అనుకూల దేశాలు తరువాత జలియన్వాలా బాగ్ దురంతం గురించి ప్రపంచమంతటా ప్రచారం చేశాయి. కొసమెరుపు: 1961, 1983 సంవత్సరాల్లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ జలియన్వాలా బాగ్ను సందర్శించారు. అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి ఘటించి వెనుదిరిగారు. అక్టోబర్ 13, 1997న మళ్లీ భర్త ప్రిన్స్ ఫిలిప్తో కలసి వచ్చారు. డయ్యర్ కుమారుడు చెప్పిన దానిని బట్టి ఫిలిప్ ఈ సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న సంస్మరణ ఫలకం మీద అంకెను చూసి ఇంతమంది మరణించలేదని నాకు తెలిసిందని ఆయన వ్యాఖ్యానించాడు. బ్రిటిష్రాణి ‘మన గతం ఇబ్బందికరమైనది....’ అని కొన్ని మాటలు చెప్పి వెళ్లారు. ఫిబ్రవరి, 2013లో నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా జలియన్వాలా బాగ్ను సందర్శించాడు. మృతులకు నివాళి ఘటించాడు. ఈ ఘోర దురంతం మీద బ్రిటిష్ నేతల నుంచి సాంత్వన వాక్యాలు వస్తాయని ఎదురు చూసినవారికి నిరాశే ఎదురైంది. - డా॥గోపరాజు నారాయణరావు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement