-
ఉప్పు తగ్గిస్తే ఆ సమస్య తగ్గుతుంది..
టోక్యో: మనం తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదుని తగ్గిస్తే రాత్రి వేళల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన (నొటోరియా) చేయాల్సిన అవసరం తగ్గుతుందని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 315 మందిని పరీక్షించగా.. ఉప్పును ఎక్కువగా తీసుకున్న వారితో పోలిస్తే తక్కువ తీసుకున్న వారిలో టాయిలెట్కి వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. నొటోరియాతో బాధపడేవారు ఆహా రంలో స్వల్ప మార్పులు చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని వర్సిటీకి చెందిన మాత్సో టొమాహిరో తెలిపారు. ఉప్పు తీసుకోవడం వల్ల దప్పిక ఎక్కువగా ఉంటుందని, దీంతో ఎక్కువ నీటిని తాగుతామని ఫలితంగా రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. -
ఆ ‘రాళ్ల దెబ్బల’ నుంచి రక్షించుకోండి!
అందరికీ ఆరోగ్యాన్నిచ్చేవే అయినా కొందరికి అవి కాస్త ప్రతికూలంగా పనిచేస్తాయి. అలా పాలు, పాలకూర వంటివి కొందరికి కిడ్నీలో రాళ్లను ఏర్పరచుతాయి. అలాగే పైన పల్చటి పొర ఉండే టమాటా కాస్తా... టెంకాయి పైన టెంకలాంటి రాయిని కిడ్నీలో ఏర్పరుస్తుంది. ఇలా కిడ్నీలకు వచ్చే మరో ప్రమాదం రాళ్ల రూపంలో ఉంటుందన్నమాట. వాటి వల్ల కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ రాళ్ల దెబ్బలనుంచి కిడ్నీలను కాపాడుకోవాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. అదే చేస్తుంది ఎంతో మేలు. పెద్ద ప్రమాదాన్నే నివారించే ఆ చిరు జాగ్రత్తలివే... (చదవండి: అర్థంచేసుకోకపోతే.. కిడ్నీ ఒక పెద్ద పజిల్) ►రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్ను విసర్జించాల్సి ఉంటుంది కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. ►ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. ► క్యాల్షియం సప్లిమెంట్లనూ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల çసూచనల మేరకు ఆహార నియమాలను పాటించాలి. ►ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ. ► ఆరెంజ్ జ్యూస్కు క్యాల్షియం ఆక్సలేట్ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్లను ఎక్కువగా తీసుకోకూడదు. ►కూల్డ్రింకులను అస్సలు తాగకూడదు. కిడ్నీకి గండం... మందులూ, మద్యం మూత్రపిండాల ఆరోగ్యానికి గండంగా పరిణమించేవి మామూలుగా మనం వాడే మందులు, కొందరు అలవాటుగా తీసుకునే మద్యం. మీరు చాలసార్లు వినే ఉంటారు... చీప్లిక్కర్ కిడ్నీలను కొట్టేస్తుందని. సాధారణంగా ఒంటిని శుభ్రపరచడం అన్నది కిడ్నీల పని కదా. చీప్లిక్కర్లో మత్తును సమకూర్చడానికి వేసే వివిధ రకాల రసాయనాలను రక్తం నుంచి తొలగించడానికి కిడ్నీలు తమ సామర్థ్యానికి మించి కష్టపడతాయి. అలా మలినాలనూ, కాలుష్యాలనూ తొలగిస్తూ, తొలగిస్తూ, తమ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్గా చెబుతుంటారు. ఇదే పరిణామం మద్యం వల్ల కూడా వస్తుంది. వాస్తవానికి మద్యం అంటేనే కూడా బాటిలెత్తు కాలుష్యం. ఆ కలుషిత పదార్థాలను తొలగించే ప్రక్రియను నిరంతరాయం చేస్తూ చేస్తూ కిడ్నీలు అలసిపోతాయి. ఇక ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్గా మనం పేర్కొనే మందులతోనూ ఇదే అనర్థం కలుగుతుంది. ఆ మందులలోని మలినాలను తొలగించడానికి కిడ్నీలు కష్టపడతాయి. మందులలోని ఆ మాలిన్యాలను తొలగించేలోపే మళ్లీ వేసుకున్న మందులలోని మలినసంద్రం మళ్లీ మూత్రపిండాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతటి కష్టాన్ని ఓర్చలేక అవి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కండిషన్లకు దారితీస్తాయి. అలాంటప్పుడు కృత్రిమంగా మనిషి జీవించి ఉండగలిగే మేరకు మాత్రమే ఒంట్లోని కాలుష్యాలను యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియ ‘డయాలసిస్’తో నిత్యం నరకబాధలను చూస్తూ రోజుల ప్రాతిపదికన రోగులు తమ ప్రాణాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడకుండా నిండా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవితం గడపాలంటే రెండంటే రెండు కిడ్నీలను పదిలంగా చూసుకుంటే చాలు. ఆ రెండు కిడ్నీలే నిండు నూరేళ్లు! సంతోషాల క్యాలెండర్ లెక్కల్లో వెరసి వెయ్యేళ్లు!! -
బ్యాలెగ్స్ యోగా
యోగా జీవితంలో రెండు కాళ్ల మీద నిలబడాలంటే ముందు ఒక కాలి మీద నిలబడటం నేర్చుకోవాలి. బేలెన్సింగ్. మనసు, దేహం, ఘటన... వీటి మధ్య సమన్వయం లేకపోతే అడుగు తడబడుతుంది. బేలెన్స్ కోల్పోతుంది. తప్పటడుగు పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే మనసును లగ్నం చేసి యోగా చేయాలి. మరీ ముఖ్యంగా– ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసనం వేయాలి. ఇది నేరుగా చేయాల్సిన ఆసనం. కష్టం అనిపిస్తే ఆసరా సహాయంతో కూడా చేయవచ్చు. ఇది చేయాలంటే ముందుగా సమస్థితిలో నిలబడండి. ఇప్పుడు ఎడమకాలి మీద నిలబడి కుడికాలును ముందు నుంచి తీసుకొని బొటనవేలును లేదా పాదాన్ని కుడిచేతితో పట్టుకుని శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ చేస్తూ పైకి లేపాలి. మోకాలు నిటారుగా ఉండేటట్లుగా భూమికి సమాంతరంగా వచ్చేటట్లుగా ప్రయత్నించాలి. ఎడమచేతిని నడముకు పక్కన సపోర్ట్గా పెట్టుకుని కాలిని ఇంకొంచెం పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయవచ్చు. 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడికాలి పాదాన్ని నెమ్మదిగా కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండో కాలిమీద నిలబడి చేయాలి. సపోర్ట్ కావాలనుకుంటే కుర్చీ లేదా డైనింగ్ టేబుల్ ఇంకా బాగా చేయాలంటే కిటికీ గ్రిల్ ముందు నిలబడి కిటికీ సపోర్ట్ తీసుకుంటూ కాలుని అంచెలంచెలుగా పైకి తీసుకువెళ్లవచ్చు. యోగావగాహన ఆసనం పూర్తి స్థాయిలో చేయగలిగితేనే ఉపయోగం లేకపోతే ఫలితం ఉండదు అనేది కేవలం అపోహ మాత్రమే. పూర్తిగా శరీరాన్ని వంచినవారికి ఎంత ఉపయోగం ఉంటుందో కొంచెం వంచినవారికి కూడా అంతే ఉంటుంది. ప్రయత్నం లోపం లేకుండగా నూటికి నూరుశాతం చేసినపుడు కండరాలు, అంతర్గత అవయవాల మీద ప్రభావం ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటుంది. శక్తిలోపం లేకుండా చేయాలి. శక్తిని పెంచి క్రమక్రమంగా ఎక్కువ చేస్తూ పోవడానికి ప్రయత్నించాలి. మొదటి వారం 5 శాతం, 2వ వారం 10 శాతం ఎక్కువ చొప్పున ఎఫర్ట్ పెడుతూ పోవాలి. మలవిసర్జన, మూత్ర విసర్జన బాగా జరిగిన తరువాత జీర్ణాశయం పెద్ద ప్రేగులు, మూత్రాశయం ఖాళీ అవుతాయి కాబట్టి దాని ప్రభావం యోగసాధన మీద ఉండి బాగా చేయగలరు. మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేసి ఆసనాలు, ప్రాణాయామాలు చేయడం మంచిది. యోగా చేయడానికి ముందు స్నానం చేసి చర్మాన్ని శుభ్రం చేయడం వల్ల చర్మంలో ఉన్నటువంటి చమట గ్రంధులు శుభ్రపడటంతో తెరుచుకుంటాయి. దీని వల్ల శరీరంలోని మలిన పదార్థాలు చర్మం ద్వారా విసర్జింబడి చర్మం ప్రకాశవంతం అవుతుంది. ఈసారి సమస్థితిలో నిలబడి కుడికాలును ముందు నుంచి పైకి తీసుకువెళ్లే బదులు కుడిపక్క నుండి వీలైనంత పైకి తీసుకుని వెళ్లాలి. కొత్తగా సాధన చేసేవారికి మోకాలు వంపు లేకుండా చేయడం సాధ్యం కాకపోవచ్చు. దాని వల్ల నిరుత్సాహ పడకుండా రెండు వారాలు సాధన చేస్తే పురోగతి కచ్చితంగా ఉంటుంది. ఈ రెండు ఆసనాలను సాధన చేయడంలో ఇబ్బందులు ఎదుర్కునే వారు కుర్చీ సాయంతోనూ ఇలా చేయవచ్చు. ఇలా ఆసరా తీసుకోవడం వల్ల కలిగే లాభాలలో ఎటువంటి మార్పు ఉండదు. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
చెప్పుకోలేని కష్టం
ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎవరికని చెప్పాలి? ఆడవాళ్లకు ఆఫీసుల్లో సరైన బాత్రూమ్స్ ఉండవు. ఇంటిసామాన్లు తెచ్చుకునేటప్పుడు... బయటి పనులు చేసుకునేటప్పుడు... రోడ్ల మీదికి వెళ్లినప్పుడు... ఆడవాళ్లకు టాయిలెట్లు ఉండవు. ఆపుకునీ, ఆపుకునీ నరకయాత పడటమే కాకుండ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇది చెప్పకోలేని కష్టం. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎవరికని చెప్పాలి? మహిళల్లో మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు చాలా తరచుగా వస్తుంటాయి. ఇందులో ముఖ్యమైనది మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడం. దీంతోపాటు తమ ప్రమేయం లేకుండా మూత్రం కారిపోవడం (యూరినరీ ఇన్కాంటినెన్స్) కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అనే సమస్యతో కూడా చాలామంది మహిళలు బాధపడుతూ ఉంటారు. మూత్ర సంబంధిత వ్యాధులలో ఇది తీవ్రమైనదిగా వైద్యులు పేర్కొంటారు. ఎందుకంటే ఇది నేరుగా కిడ్నీతో ముడిపడి ఉంటుంది. ఇవే కాకుండా మూత్రంలో చీము సమస్యతో బాధపడేవారూ ఉంటారు. మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, చలిజ్వరం వంటి లక్షణాలతో కూడా చాలా మంది మహిళలు వైద్యులను సంప్రదిస్తుంటారు. సాధారణ ఇబ్బందిగా మొదలయ్యే మూత్ర సంబంధిత సమస్యలు ఆ తర్వాత వ్యాధిగా మారి తరచూ ఇబ్బంది పెడుతుంటుంది. ఈ క్రమంలో మూత్రం నుంచి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంటుంది. వయసు రీత్యా వచ్చే సమస్యలు స్త్రీలు ఈ సమస్యతో చిన్నప్పటి నుంచే బాధపడుతున్నట్లయితే యాంటీబయాటిక్స్తో అప్పటికప్పుడు సమస్య నుంచి ఉపశమనాన్ని ఇప్పించడంతో సరిపెట్టకూడదు. ఇన్ఫెక్షన్ సమస్యకు అసలు కారణాలని పేరెంట్స్ ద్వారా వైద్యులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే వారు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల అవయవాలలో పుట్టుకతోనే వచ్చే మార్పుల (కంజెనిటల్ అనామలీస్) వల్ల మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అసలు కారణం తెలుసుకోకుండా ఎన్నిసార్లు చికిత్స ఇప్పించినప్పటికీ ఏమాత్రం ఉపయోగం ఉండదు సరికదా... ఏకంగా మూత్రపిండాలే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే యువతుల్లో, కొత్తగా పెళ్లైన మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సాధారణమని చెప్పవచ్చు. కొత్తగా పెళ్లయిన వాళ్లకి హనీమూన్ సిస్టయిటిస్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఇక వయసు పైబడిన మహిళల్లో (పోస్ట్ మెనోపాజల్ ఉమన్లో) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వచ్చే సమస్యే. దీనికి కారణం నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే హార్మోన్ల ప్రభావమే. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపం వల్ల మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండటంతో అది మాటిమాటికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. అంతేకాకుండా ఈ హార్మోన్ల లోపం వల్ల మూత్రాశయంలోని కణాలకు రోగకారకమైన బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. ఈ సమస్య ఎన్ని రకాలు మూత్ర మార్గంలో వివిధ ప్రదేశాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, వాటి స్థానాన్ని బట్టి పేర్లను నిర్ణయిస్తారు. ఈ పేర్లను బట్టి ఇన్ఫెక్షన్ సరిగ్గా ఏ స్థానంలో ఉందో గుర్తుపట్టడానికి వైద్యులకు వీలవుతుంది. దాన్ని బట్టే చికిత్స కూడా ఆధారపడి ఉంటుంది. మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. అలాగే మొదటిసారి మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ప్రైమరీ ఇన్ఫెక్షన్ అనీ, మళ్లీ మళ్లీ రావడాన్ని పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా లేదా రికటెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. ఇవేకాకుండా మరికొన్ని తీవ్రమైన సమస్యలు కూడా మహిళలు ఎదుర్కొంటారు. యూరినరీ ఇన్కాంటినెన్స్... అంటే మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం అన్నది పురుషుల కంటే స్త్రీలలో కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కొంతమందిలో కాన్పులు కష్టమైనవారికి, స్థూలకాయంతో... హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న వారికి, అలాగే మరికొంతమందిలో మెనోపాజ్ (రుతుక్రమం) ఆగిపోయిన తర్వాత ఈ సమస్య తలెత్తుతుంది. ఇంకొంతమందిలో అవసరం లేకుండానే మూత్రాశయ కండరాలు సంకోచిస్తుంటాయి. దీనివల్ల కూడా మాటిమాటికీ మూత్రం రావడం జరుగుతుంది. అలాగే మూత్రాశయానికి సంబంధించిన నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. 55 ఏళ్లలోపు వయసున్న 50 శాతం మంది మహిళలు యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కు లోనవుతుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ అందులో పది శాతం మంది కూడా వైద్యులను సంప్రదించడానికి ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం సిగ్గు, బిడియం. దీనివల్ల చాలా మంది మహిళలు తమ బాధలను తమలోనే నొక్కిపెట్టుకుంటారు. సమస్య తీవ్రమైనప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదిస్తుంటారు. ఈ సమస్య అంత పెద్దది కాకపోయినప్పటికీ ఇటు మానసికంగానూ, అటు శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒక్కోసారి పెల్విస్కు ముప్పు ఏర్పడి, దాని చుట్టూ ఉండే అనుబంధ కండరాలకు మూత్రం వల్ల ఏర్పడిన పచ్చితో చర్మ సంబంధిత అలర్జీలు కూడా వస్తాయి. సమస్య తీవ్రత పెరిగి సర్జరీకి దారితీయవచ్చు. ఈ బ్యాక్టీరియానే కారణం... యూరినరీ ఇన్ఫెక్షన్కు పూర్తి చికిత్స అందించకపోతే కిడ్నీలపైన కూడా ప్రభావం చూపుతుంది. మూత్ర విసర్జక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురవడానికి ప్రధానమైన కారణం ‘ఈ-కొలి’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయటి వాతావరణంలోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది మూత్ర విసర్జన మూత్రనాళాల్లోకి వెళ్తుందో అప్పుడు దీనివల్ల కిడ్నీకి అత్యంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇందులోని ‘క్లెబిసియల్లా, ఇంటరోకోకస్ ఫైకలిస్’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేసేవి. యాంటీబయాటిక్స్లాంటి మందులకు కూడా ఇవి లొంగవు. మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేసవి కాలంలోనే వస్తుంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా డీహైడ్రేషన్కు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముప్పు వాటిల్లుతుంది. దాంతో మంచినీరు కిడ్నీలకు అందక అవి శరీర మలినాలతో కూడా మూత్రమార్గాన్ని సరిగా శుద్ధి చేయలేకపోతాయి. దాంతో ఇన్ఫెక్షన్స్ పేరుకుపోయి మంట పుట్టడం, నొప్పి రావడం, మూత్రం కొద్దికొద్దిగా వస్తూ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఇతర సమస్యలుంటే ఇంకా ప్రమాదం సాధారణంగా ఈ సమస్యకు డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. అయితే సమస్యకు కారణమైన బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్కు లొంగడం లేదు. అంతేకాకుండా డయాబెటిక్, హైబీపీ పేషెంట్లలో ఈ సమస్య తలెత్తితే దాని ప్రభావాన్ని తగ్గించడం వైద్యులకు పెద్ద సవాలే. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడటానికి పెద్ద మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని వారి శరీరం తట్టుకోలేదు. అప్పటికే వారు తమతమ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులను వాడుతూ ఉంటారు. దీనివల్ల ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది పేషెంట్లు ఈ మందుల ప్రభావాన్ని తట్టుకోలేక మధ్యలోనే వాటిని ఆపేస్తుంటారు. దానివల్ల ఆ సమస్య లోలోపలే తీవ్రమై ఏకంగా కిడ్నీకే ఎసరు పెట్టేస్తుంది. దాంతో డయాలసిస్ లేదా మూత్రపిండాల మార్పిడి తప్ప వేరే మార్గం లేని ప్రమాదకర పరిస్థితి తలెత్తే అవకాశం ఏర్పడుతుంది. షుగర్ పేషెంట్స్ సాధారణం కన్నా కాస్త ఎక్కువగా నీళ్లను శరీరానికి అందిస్తుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అలాగే దీని బారి నుంచి కాపాడుకోవచ్చు కూడా. నిర్ధారణ పరీక్షలు... సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ అదే సమస్య మళ్లీ మళ్లీ వస్తుంటే మాత్రం నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. అది ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకోవాలి. ఆ అంశాల మీదే నిర్దిష్టమైన చికిత్స ఆధారపడి ఉంటుంది. ఆ పరీక్షలు : సీయూఈ యూరిన్ కల్చర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సీటీ, ఎమ్మారై ఎక్స్రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) సిస్టోస్కోప్ (యూటీఐ) రక్తపరీక్ష (కిడ్నీ ఫెయిల్యూర్) చికిత్స: సాధారణంగా వచ్చే మూత్ర వ్యాధులకు మందులతోనే డాక్టర్లు సరిపెట్టేస్తారు. ఒకవేళ సమస్య అసాధారణం అనిపిస్తే కాస్త ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇస్తారు. సమస్య ఇంకాస్త ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, పరీక్షలు నిర్వహించి, అందుకు అనుగుణంగా చికిత్స పద్ధతిని అవలంబిస్తారు. పుట్టుకతో వచ్చే లోపాలకు, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు అవసరమైతే సర్జరీ చేసి... ఆయా లోపాల్ని సరిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూత్రావయవాల్లో టీబీ వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ డాక్టర్కి అనుమానం వస్తే టీబీ క్రిముల కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేసి, చికిత్సను అందిస్తారు. నివారణే మేలు... శరీరానికి తగినంత మంచినీరు అందించకపోవడమే మూత్ర సంబంధిత వ్యాధులకు కారణమని వైద్యులు అంటున్నారు. ఆధునిక మహిళల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ, కీలక బాధ్యతలు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. భోజనం విషయం ఎలాగున్నప్పటికీ కనీసం మంచినీరు తాగేంత తీరిక కూడా వారికి ఉండటం లేదు. దాంతో మహిళల్లోనే మూత్ర సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మాంసాహారాన్ని ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేయాలి. కాఫీ, టీ, జంక్ఫుడ్స్ లాంటి వాటి జోలికి వెళ్లకూడదు. ప్రాంతాల్లోని వారితో పాటు పట్ణణాల్లోని స్లమ్స్లో నివసించే మహిళలు కూడా శుభ్రత పాటించేలా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రయత్నించాలి. మల, మూత్ర విసర్జన తర్వాత నీటితో శుభ్రం చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలి. ఇలాంటి ప్రాథమిక సూత్రాలు పాటిస్తే కనీసం చేతులారా సమస్యను కొని తెచ్చుకునే బాధ తప్పుతుందని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్ టాయిలెట్స్ లేనందువల్ల సమాజానికే కాదు... ఒంటికీ నష్టం. ఇది ఆడవాళ్లలో ఎక్కువ. పురుషులూ, మగపిల్లలూ ఆరుబయటైనా మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ మహిళలు అలా చేయరు. వాళ్లకు ఆ అవసరంపై ‘సాక్షి ఫ్యామిలీ’ ఎన్నో సార్లు కథనాలు ప్రచురించింది. పెద్దలూ, ఆలోచనాపరులు, స్వచ్ఛందసేవాసంస్థలు, అధికారులు, యువత ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి మహిళలకు టాయిలెట్ సౌకర్యాలను కల్పించేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు ‘సాక్షి’ తన వంతు కృషి చేస్తోంది. పురుషులతో పాటు మహిళలకూ టాయిలెట్స్ సమకూర్చేందుకు జరిగే కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది ‘సాక్షి’.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement