-
పీకల మీదకొచ్చింది!
ముప్పు ముంచుకొచ్చినప్పుడు కాని మేలుకోకపోతే కష్టమే. పరిస్థితి చూస్తే అలానే ఉంది. పర్యావరణ మార్పులపై సంబంధిత పక్షాల సదస్సు తాజా సమావేశం (కాప్–28) ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ 12 దాకా దుబాయ్లో జరగనుంది. ఏటేటా ఐరాస ఆధ్వర్యంలో ఇది మొక్కుబడి తంతుగా మారిపోతున్న వేళ కొద్దిరోజులుగా వివిధ నివేదికలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితి విషమించిందని వెల్లడిస్తున్నాయి. రోజువారీ సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు తొలి సారిగా ఈ నవంబర్ 17న పారిశ్రామికీకరణ మునుపటి హద్దు దాటి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగా యన్న వార్త ఆందోళన రేపుతోంది. పుడమిపై కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు తాము పెట్టుకున్న లక్ష్యాల గురి తప్పుతూనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఎప్పటికప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రతిన చేస్తున్నా, నష్టనివారణకు నిధుల కొరత పీడిస్తూనే ఉంది. ఆహార అభద్రత మొదలు వ్యాధుల దాకా అనేక రకాలుగా వాతావరణ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి. ఆ నేపథ్యంలో వాతావరణ మార్పులపై తాజా నివేదికలు అలజడి సృష్టిస్తున్నాయి. పుడమి మీది ఒక శాతం అత్యంత ధనికులే మొత్తం ప్రపంచ జనాభాలోని 66 శాతం మంది కలగజేసేటంత భూతాపానికి కారణమని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తేల్చింది. ఇక, ‘కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ అంటూ గత వారం లాన్సెట్ వెలువరించిన 8వ వార్షిక నివేదిక ప్రజారోగ్యం, ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై పడే ప్రభావాన్ని కళ్ళకు కట్టింది. పర్యావరణ మార్పుకు ప్రధాన కారణాలైన శిలాజ ఇంధనాల వినియోగం లాంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే, ప్రజల ఆరోగ్యానికే పెను ప్రమాదమని లాన్సెట్ నివేదిక హెచ్చరిస్తోంది. భారత్కు సంబంధించి ఈ నివేదిక చెప్పిన అంశాలు, చేస్తున్న హెచ్చరికలు ఆలోచన రేపుతున్నాయి. మన దేశంలో 1986 – 2005 మధ్య కాలంతో పోలిస్తే, 2018 – 2022 మధ్య కాలంలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగాయట. ఇప్పటికే ఈ అధిక ఉష్ణోగ్రత పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు మలేరియా, డెంగ్యూ కేసుల్ని పెంచుతున్నాయి. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్, సెప్సిస్, కలరాలకు సానుకూలంగా తయారవుతున్నాయి. అలాగే, ‘బ్రోకెన్ రికార్డ్’ శీర్షికన ఐరాసా వెల్లడించిన తాజా నివేదిక సైతం పరిమితులు దాటి గ్రీన్హౌస్ వాయువుల విడుదల పెరిగిన కథను వివరించింది. వెరసి, ఉష్ణోగ్రతలు పారిశ్రామికీరణకు ముందు స్థాయి కన్నా 2 డిగ్రీలు, వీలుంటే 1.5 డిగ్రీలు మించి పెరగరాదని 2015 నాటి ప్యారిస్ ఒప్పందం (పీఏ)లో చేసుకున్న బాసలు చెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. నికరంగా కర్బన ఉద్గారాలు లేని ‘నెట్ జీరో’కు కట్టుబడతామని అనేక దేశాలు మాట ఇస్తున్నా, అది ‘విశ్వసనీయంగా’ లేదని తాజా నివేదిక తేల్చేసింది. భూతాపం పెంపును 1.5 డిగ్రీల లోపలకు నియంత్రించే అవకాశాలు నూటికి పద్నాలుగు వంతులేనట! 2021తో పోలిస్తే 1.2 శాతం ఎక్కువగా 2022లో ప్రపంచమంతా కలసి 57.4 బిలియన్ల కర్బన ఉద్గారాలను వెలువరించిందని లెక్క. అలాగే, కరోనాలో 4.7 శాతం తగ్గిన ఉద్గారాలు ఈ ఏడాది మళ్ళీ కరోనా ముందు స్థాయికి చేరిపోవచ్చని అంచనా. నిజానికి, పర్యావరణ మార్పు, ధనిక – బీద అసమానతలు విడదీయరాని జంట. ప్రధానంగా ధనిక దేశాల పాపానికి పేద దేశాలు బలి అవుతున్నాయి. పర్యావరణ మార్పు ప్రభావాన్ని మోస్తున్నాయి. ధనిక దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలనీ, చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలనీ కాప్28 లాంటి చోట్ల పేద దేశాలు ఒత్తిడి తెస్తున్నది అందుకే. కానీ, అతి తక్కువ సంఖ్యలోని ఆ ధనిక దేశాలే ప్రపంచ పర్యావరణ విధానాన్ని నిర్ణయిస్తుండడంతో పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. ఈజిప్ట్లో నిరుడు కాప్27 సదస్సులో ‘నష్ట పరిహార నిధి’ని ఏర్పాటు చేయాలంటూ ఒప్పందం కుదిరింది. స్వీయ కర్బన ఉద్గారాలు తక్కువే అయినా ధనిక దేశాల ఉద్గారాలతో నష్టపోతున్న బీద దేశాలను పర్యావరణ మార్పు ప్రభావాల నుంచి కాపాడేందుకు ఈ నిధిని ఉద్దేశించారు. ఆలోచన మంచిదైనా, ఆచరణకు వచ్చే సరికి ఆ నిధి ద్వారా డబ్బులు ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారనేది ఇప్పటికీ తేలనే లేదు. ఇంకా చిత్రమేమిటంటే– పర్యావరణానికి తూట్లు పొడిచే భారీ చమురు ప్రణాళికలు వేస్తున్న దుబాయ్లో కాప్28 సమావేశం జరగనుండడం! అలాగే, వాతావరణ సంక్షోభం, ప్రకృతి సంక్షోభం... ఈ రెంటినీ భిన్నమైన సవాళ్ళుగా భావిస్తూ, స్పందిస్తున్నాం. వాటి వల్ల సమాజంలో తలెత్తే సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రపంచమంతా చేస్తున్న ప్రమాదకరమైన తప్పు అదే! తీవ్ర వాతావరణ ఘటనలతో వర్ధమాన దేశాల్లో బాలికలకు నాణ్యమైన విద్య దెబ్బ తింటోందని ప్లాన్ ఇంటర్నేషనల్ నివేదిక మాట. పర్యావరణ బాధిత 30 దేశాల్లో ఏటా కనీసం 1.25 కోట్ల మంది బాలికలు అర్ధంతరంగా చదువుకు గుడ్బై చెప్పడానికి వాతావరణ మార్పులు కారణమవుతాయని ‘మలాలా ఫండ్’ సైతం హెచ్చరిస్తోంది. ఇలాంటి గణాంకాలెన్నో వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం. అందుకే, పర్యావరణ మార్పు గురించి మాటల కన్నా చేతలు ముఖ్యం. రానున్న దుబాయ్ సదస్సు లోనూ ప్యారిస్ ఒప్పందం తాలుకు అమలు తీరుతెన్నులపై ప్రపంచం మళ్ళీ చర్చిస్తుంది. ఈసారైనా మాటలు తగ్గించి, చేతలపై దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే, పర్యావరణంపై ప్రపంచం ఇప్పటికే గాడి తప్పింది. దుష్ఫలితాలూ చూస్తోంది. తాజా హెచ్చరికలు పెడచెవిన పెడితే మరిన్ని కష్టాలు తప్పవు. ప్రపంచానికి పరిష్కారం ఎడారి దేశంలోనూ ఎండమావిగా మారితేనే మానవాళికి నష్టం. -
అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవ కాలం(1850–1900) ముందు నాటి ఉష్ణోగ్రత కంటే 2022లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. 2022 సంవత్సరం ఇప్పటిదాకా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్–2022’ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. నివేదికలో ఏం వెల్లడించారంటే.. ► 2015 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తద్వారా కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు పెరిగాయి. ఈ గ్రీన్హౌజ్ వాయువులు 2021లో రికార్డు స్థాయిలో వెలువడ్డాయి. ► అంటార్కిటికాలో, యూరప్ల్లో హిమానీనదాలు కరిగిపోతున్నాయి. ► 2013 నుంచి 2022 దాకా సముద్రాల నీటిమట్టం ప్రతిఏటా సగటున 4.62 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. 1993– 2022 మధ్య రెట్టింపైంది. ► 2022లో అధిక ఉష్ణోగ్రతల వల్ల భారత్లో పంటల ఉత్పత్తి పడిపోయింది. పలు రాష్ట్రాల్లో అడవుల్లో కార్చిచ్చు వ్యాప్తించింది. ► పంటల ఉత్పత్తి పడిపోవడం, అదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభం కావడంతో భారత్ నుంచి గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొన్నాయి. ► వాతావరణ మార్పుల వల్ల భారత్లో గతేడాది వరదలు కొండ చరియలు విరిగిపడడం వల్ల 700 మంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 900 మంది బలయ్యారు. ► అస్సాంలో వరదల వల్ల 6.63 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ళీ గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాలు పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో ప్రతికూల మార్పులు కొనసాగుతూనే ఉంటాయని, అవి భూగోళంపై మానవళికి ముప్పుగా పరిణమిస్తాయని డబ్ల్యూఎంఓ సెక్రెటరీ జనరల్ ప్రొఫెసర్ పెటిరీ తలాస్ చెప్పారు. ► కరువు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొనే శక్తి ప్రపంచంలో 100కుపైగా దేశాలకు ఏమాత్రం లేదని అధ్యయనంతో తేలింది. -
కడలి కబళిస్తోంది!
- ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు - 1901–2010 మధ్య 19 సెంటీమీటర్లు పెరుగుదల - 2100 నాటికి మీటరు నుంచి 7 మీటర్లకు పెరిగే అవకాశం - భారత్ సహా చాలా దేశాల్లో తీర ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం అలలు అలలుగా ఎగసిపడే సాగర కెరటాలు నెమ్మదిగా భూమిని కబళిస్తున్నాయి. భూవాతావణం వేడెక్కేకొద్దీ ఏటికేడు సముద్ర మట్టం పెరిగిపోతూ తీర ప్రాంతాలకు ముప్పు ముంచుకొస్తోంది. 1901 నుండి ఇప్పటివరకూ దాదాపు 20 సెంటీమీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇటీవల ఈ పెరుగుదల వేగం బాగా పెరిగిందని చెబుతున్నారు. 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టం ఒక అడుగు నుంచి ఒక మీటరు వరకూ పెరగవచ్చని.. అదే ధ్రువప్రాంతాల్లోని మంచుదుప్పటి కరిగితే ఏడు మీటర్ల వరకూ కూడా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే చాలా దేశాల్లో తీర ప్రాంతాలన్నీ సముద్రంలో మునిగిపోతాయని చెబుతున్నారు. సుదీర్ఘ తీరం ఉన్న భారతదేశానికి, ఇందులోనూ లోతట్టు ప్రాంతమైన తూర్పు తీర ప్రాంతానికి ఎక్కువ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఎలా ఉంటాయి, ఎంత మేర పెరుగుతాయి, దాని పర్యవసానాలేమిటనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఆ అధ్యయనాలు, పరిశోధనలపై ఈ వారం సాక్షి ‘ఫోకస్’.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ సాధారణంగా సముద్ర మట్టాలు స్థిరంగా ఉంటాయని భావిస్తుంటాం. కానీ భూమి చరిత్రను చూస్తే సముద్ర మట్టాల్లో పెనుమార్పులు సంభవించిన విషయం స్పష్టమవుతోంది. భూగోళం దాదాపు లక్ష సంవత్సరాల విరామాలతో మంచు యుగం నుంచి మంచు యుగానికి పయనిస్తూ ఉంది. మధ్యలో ఉష్ణకాలం వస్తూంటుంది. అయితే చివరి మంచు యుగం పతాకస్థాయిలో ఉన్నపుడు ఉత్తర అమెరికా ఖండంలో అత్యధిక భాగం మంచుతోనే నిండి ఉండేది. అప్పుడు సముద్ర మట్టం ఇప్పటికన్నా 400 అడుగులు తక్కువగా ఉండేది. ప్రస్తుతం మనం మంచు యుగాల మధ్య ఉష్ణకాలంలో ఉన్నాం. అంటే.. ఇప్పుడు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతూపోతాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గడం మొదలవుతాయి. కానీ మానవ కల్పిత వాతావరణ మార్పులు ఈ చక్రాన్ని మారుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో సముద్ర మట్టాల్లో మార్పులు చాలా నెమ్మదిగా సంభవించేవని, కొన్ని వేల ఏళ్లు పట్టేవని.. కానీ ఇప్పుడు భూతాపం పెరుగుతుండటం సముద్ర మట్టాలు వేగంగా పెరగడానికి కారణమవుతోందని అంటున్నారు. శరవేగంగా పెరుగుతున్న మట్టాలు భూతాపం పెరిగి ధ్రువాల్లో మంచు దుప్పటి కరిగిపోతుండడం, వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కి వ్యాకోచించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లేసియర్లు కరుగుతుండటం వంటి పరిణామాల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1901–2010 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం సగటున 19 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు వాతావరణ మార్పులపై ప్రపంచ సంఘం (ఐపీసీసీ) ఐదో అంచనా నివేదిక ఇటీవల వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 1901–2010 మధ్య ఏటా సగటున 1.7 మిల్లీమీటర్ల చొప్పున సముద్ర మట్టం పెరిగినట్లు అంచనా. అయితే 1971–1993 మధ్య ఈ పెరుగుదల సగటున ఏడాదికి 2.0 మిల్లీమీటర్లుగా ఉండగా.. 1993–2010 మధ్య ఏడాదికి 3.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈ లెక్కన గత రెండు దశాబ్దాల్లో సముద్ర మట్టం వేగంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అలల కొలతల నివేదికలు, ఉపగ్రహాల ద్వారా పరిశీలనతో ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇక ఇతర సముద్రాలతో పోలిస్తే 2003 నుంచి ఉత్తర హిందూ మహాసముద్ర మట్టం రెండు రెట్లు ఎక్కువగా పెరిగిందని జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ మేగజైన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. అంతకుముందు దశాబ్దకాలంలో ఇక్కడి సముద్ర మట్టం పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఉపగ్రహాల ద్వారా రెండున్నర దశాబ్దాల పాటు సేకరించిన సముద్ర ఉపరితల కొలతల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ హవాయి సీలెవల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఇప్పటికే బంగ్లాదేశ్లో నాలుగో వంతు భూభాగం నీట మునిగింది. చైనా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పలు తీరప్రాంతాలూ మునిగాయి. ఇక మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో కోల్కతా వద్ద రివర్ డెల్టా సుందర్బన్ మడ అడవులు నీటి మునిగిపోయాయి. భూతాపం 2 డిగ్రీలు పెరిగినట్టయితే సముద్ర మట్టం 4.7 మీటర్లకు.. 4 డిగ్రీలు పెరిగితే 9 మీటర్ల వరకు పెరిగే అవకాశముంది. 2050 నాటికి 4 కోట్ల మందికి ముప్పు ఈ శతాబ్దం చివరి నాటికి.. అంటే 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం కనిష్టంగా 28 సెంటీమీటర్ల నుంచి గరిష్టంగా 98 సెంటీమీటర్ల వరకూ పెరగవచ్చని ఐపీసీసీ అంచనా. గ్రీన్ల్యాండ్ మంచు దుప్పటి పూర్తిగా కరిగినట్లయితే సముద్ర మట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది. అదే జరిగితే లండన్ నగరం సముద్రంలో మునిగిపోతుంది. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే భారత తీరంలో 13,973 చదరపు కిలోమీటర్ల భూభాగం సముద్రంలో మునిగిపోతుందని అంచనా.. అదే నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగితే 60,497 చదరపు కిలోమీటర్ల భూమి సముద్రం పాలవుతుందని ఇటీవల జర్నల్ ఆఫ్ త్రెటెన్డ్ టాక్సా మేగజైన్లో ప్రచురించిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగితే అంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణా మడ అడవుల ప్రాంతం ముప్పావు భాగానికి పైగా మునిగిపోతుంది. పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ వనాలు సగానికిపైగా మునిగిపోతాయి. సముద్ర మట్టం ఆరు మీటర్లకు పైగా పెరిగితే గోదావరి, కృష్ణా మడ అడవులు, సుందర్బన్ అడవులతో పాటు గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు సగానికి పైగా సముద్ర గర్భంలో చేరుతాయి. చిల్కా సరస్సు, పులికాట్ సరస్సు సహా ఏడు రక్షిత ప్రాంతాలు సగానికి పైగా నీట మునుగుతాయి. సముద్రమట్టం పెరుగుదల వల్ల 2050 నాటికి భారత దేశంలో 4 కోట్ల మంది జనాభాకు ముప్పుగా పరిణమిస్తుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక గతేడాది హెచ్చరించింది కూడా. ముఖ్యంగా ముంబై, కోల్కతా నగరాల ప్రజలకు ముంపు ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. తూర్పు తీరానికే ముప్పు ఎక్కువ భారతదేశంపై సముద్ర మట్టం పెరుగుదల ప్రభావంపై ఇటీవల రాజ్యసభలో ఒక సభ్యుడు ప్రశ్నించగా.. కేంద్ర భూగోళశాస్త్రాల శాఖ మంత్రి జవాబిచ్చారు. ఈ అంశంపై అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నామని.. సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం పశ్చిమ తీరం కన్నా.. లోతట్టు ప్రాంతంలో ఉన్న తూర్పు తీరం మీద ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తీర ప్రాంతాలు వరద ముంపునకు గురవడం పెరుగుతోందని పేర్కొన్నారు. గత పాతికేళ్ల అధ్యయనం ప్రకారం భారత తీర ప్రాంతం కోతకు గురయ్యే స్వభావం 38.5 శాతంగా ఉందని వెల్లడించారు. ఈ కోతను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని, కేంద్రం సాంకేతిక సహకారం అందిస్తోందని వివరించారు. వందేళ్లలో విశాఖ సగం మునుగుతుంది! ఇక రాబోయే వందేళ్లలో మన దేశంలోని కోల్కతా, ముంబై, కొచ్చి, విశాఖపట్నం తదితర తీర ప్రాంత నగరాలు సముద్రంలో మునిగిపోయే అవకాశముందని వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత తీర ప్రాంతాల్లోని పెద్ద నగరాల్లో ఒకటైన కోల్కతా వద్ద సముద్ర మట్టం వేగంగా పెరుగుతోంది. అక్కడ ఏటా సగటు సముద్ర మట్టం పెరుగుదల 5.74 మిల్లీమీటర్లుగా నమోదైంది. దాని తర్వాతి స్థానంలో కొచ్చి ఉంది. ఇక్కడ సముద్ర మట్టం ఏటా 1.75 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. ఇక ముంబై వద్ద 1.25 మిల్లీమీటర్ల చొప్పున, ఆంధ్రప్రదేశ్లోని తీర నగరం విశాఖపట్నంలో 1.09 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. దేశంలో సముద్ర ముంపు ప్రమాదమున్న నాలుగో నగరం విశాఖ పట్నమే కావడం గమనార్హం. మొత్తంగా భారతదేశపు సముద్ర మట్టాలు ఏటా సగటున 1.30 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. సముద్రమట్టం పెరగడానికి కారణాలేమిటి..? కరుగుతున్న మంచు ఖండాలు భూగోళం ఉష్ణోగ్రత పెరగడాన్ని భూతాపం (గ్లోబల్ వార్మింగ్)గా అభివర్ణిస్తున్నారు. భూగోళం ఉష్ణోగ్రత పారిశ్రామీకరణ ముందు నాటికన్నా ఇప్పడు ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగింది. దీనివల్ల ధ్రువ ప్రాంతాల్లోని మంచు ఖండాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్లేసియర్లు కరుగుతూ ఆ నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోంది. వాతావరణంలో కర్బన శాతం పెరగడం ఇదే రీతిలోనే కొనసాగితే.. ప్రస్తుతం 14.5 డిగ్రీల సెల్సియస్గా ఉన్న సగటు ఉష్ణోగ్రత కొన్నేళ్లలో 27 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల భూమి మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే భూమి మీదున్న మంచు అంతా కరిగిపోవడానికి మరో ఐదు వేల సంవత్సరాల సమయం పడుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడెక్కుతున్న సముద్ర జలాలు ఇంట్లో పొయ్యి మీద కాచే నీళ్లు మరుగుతున్నప్పుడు అవి పైకి ఉబికిరావడం మనకు తెలుసు. అలాగే భూ వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కుతున్నాయి. వాతావరణ మార్పు వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలో 90 శాతాన్ని సముద్ర జలాలే స్వీకరిస్తున్నాయి. ఫలితంగా సముద్ర జలాలు వ్యాకోచించి.. నీటిమట్టం పెరుగుతోంది. సముద్ర మట్టాల పెరుగుదలలో మూడో వంతు కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనినే ‘థర్మల్ ఎక్స్పాన్షన్’అని వ్యవహరిస్తున్నారు. దేశాలకు దేశాలే మాయమవుతాయి భూమిపై ఉన్న మంచు మొత్తం కరిగితే చాలా దేశాల రూపురేఖలు మారిపోతాయి. కొన్ని దేశాలకు దేశాలే మునిగిపోతాయి. ఇక సముద్రాల మధ్య ఉండే ద్వీప దేశాలైతే పూర్తిగా నీటిపాలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంచు అంతా కరిగి సముద్ర మట్టం పెరిగితే వివిధ ఖండాల రూపురేఖలు ఎలా మారతాయో అంచనాలతో మ్యాపులు తయారు చేశారు. అందులో ఆసియా ఖండం మ్యాపు ఇది. దీని ప్రకారం.. చైనాలో అరవై కోట్ల మంది నివసించే ప్రాంతం నీట మునుగుతుంది. 16 కోట్ల మంది జనాభా గల బంగ్లాదేశ్ మొత్తం సముద్ర గర్భంగా మారుతుంది. భారత తీర ప్రాంతాన్ని చాలా వరకూ సముద్రం కబళిస్తుంది. గుజరాత్ సగమే మిగులుతుంది. అది కూడా ఒక దీవిగా మారిపోతుంది. పశ్చిమ తీరం కన్నా తూర్పు తీరం ఎక్కువగా మునిగిపోతుంది. కోల్కతా నుంచి కన్యాకుమారి వరకూ చాలా తీర ప్రాంతం అదృశ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు చాలా వరకూ నీటిపాలవుతాయి. భూమి కూడా నిస్సారమవుతుంది చివరి మంచు యుగం పది వేల ఏళ్ల కింద ముగిసింది. అప్పట్లో సముద్ర మట్టాలు పెరగడం మొదలైనపుడు భూమి మీద కేవలం 50 లక్షల మంది మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్లు సముద్ర తీరాల వెంట భారీ నగరాల్లో నివసించలేదు. కాబట్టి సముద్ర మట్టాల పెరుగుదల ఇంతవరకు మానవాళి మీద తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ చూపలేదు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో భారీ నగరాలు నిర్మితమయ్యాయి. కోట్లాది మంది తీర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సముద్ర మట్టం నాలుగు అడుగులు పెరిగితే ఒక్క భారతదేశంలోనే 50 వేల మందికిపైగా జీవితాలు ముంపు బారిన పడతాయి. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల తీర ప్రాంతాలు మునగడమే కాదు.. తుఫానులు భూభాగంలోకి మరింత దూరం చొచ్చుకురావడం, తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సారవంతమైన పంట భూముల కిందకు ఉప్పు నీరు చేరి అవి నిరుపయోగంగా మారడం వంటి పరిణామాలూ సంభవిస్తాయి. నివారించడానికి ఏం చేయాలి? ఇప్పటికే భారీ మొత్తంలో కర్బన వాయువులు వాతావరణంలో చేరిపోయాయి. వాటిని తగ్గించడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత పారిశ్రామిక రంగం పరిస్థితులను బట్టి ఆ వాయువులు ఇంకా పెరగడం ఖాయం. అంటే మున్ముందు మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం అనివార్యం. అయితే ఈ పెరుగుదల వేగాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టాలి. వాతావరణంలో కర్బన వాయువుల విడుదలను తగ్గించాలి. అడవులు, చెట్లు విరివిగా పెంచాలి. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్రంలో సైటో ప్లాంగ్టన్ మొక్కలు చనిపోకుండా చూడాలి. ఉన్న మంచు అంతా కరిగిపోతే..? భూమి మీద ప్రస్తుతం దాదాపు యాభై లక్షల ఘనపు మైళ్ల మంచు ఉంది. అందులో అత్యధికంగా అంటార్కిటికా, గ్రీన్లాండ్లలోనే ఉంది. అది మొత్తం కరిగిపోతే సముద్ర మట్టాలు 230 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. భారతదేశం కన్నా రెట్టింపు ఉన్న అంటార్కిటికా ఖండం మొత్తాన్ని ఒక మైలు మందం ఉన్న మంచు దుప్పటి కప్పి ఉంది. అది కరిగితే సముద్ర మట్టం ఏకంగా 200 అడుగులు పెరుగుతుంది. అయితే అంటార్కిటికా ఖండంలోని చాలా మంచు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ.. పశ్చిమ అంటార్కిటికా మంచు దుప్పటి కూలిపోయే దశకు చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కరిగి సముద్రంలో కలిస్తే సముద్ర మట్టం 11 అడుగులు పెరుగుతుందని అంచనా. ఇక గ్రీన్లాండ్లో విస్తరించి ఉన్న మంచు అంతా కరిగితే 23 అడుగుల మేర సముద్ర మట్టం పెరుగుతుంది. ఇది వేగంగా కరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. అంటార్కిటికా, గ్రీన్లాండ్లలో కాకుండా మిగతా మంచు అంతా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల గ్లేసియర్లు, మంచు కొండల్లో ఉంది. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఆ మంచు కూడా వేగంగా కరుగుతోంది. దాంతో చాలా దేశాల సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతాయి.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణదాత ఆ పోలీసు
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
ఈ పాపం ఎవరిది?
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement