-
సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!
ఏపీ రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. కరువును తట్టుకునే ప్రత్యేక పద్ధతి (డ్రాట్ ప్రూఫింగ్ మోడల్)లో పంటలు సాగు జరుగుతోంది. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, బీడు భూముల్లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని పలువురు చిన్న, సన్నకారు రైతులు నిరూపిస్తున్నారు. పొలం మొత్తాన్నీ దుక్కి చేయకుండా.. ప్రతి 3 అడుగుల దూరంలో ఒక అడుగు భూమిని తవ్వి 5 రకాల పంట విత్తనాలను విత్తుతున్నారు. 2023 ఆగస్టులోప్రారంభమైన ఈ సరికొత్త పద్ధతిలో అనేక జిల్లాలకు చెందిన 56 మంది రైతులు 20 సెంట్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫ్ సాగు చేస్తున్నారు. ఇద్దరు రైతుల అనుభవాలతో కూడిన కథనం.. కాలువ రాకపోయినా పంట వచ్చింది.. రైతు ఆదిలక్ష్మి ఇలా చెప్పారు.. ‘‘మాకు అరెకరం పొలం ఉంది. ఇక్కడ అందరూ మిరపే వేస్తారు. మేమూ మిరపే వేసేవాళ్లం. రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మిరపలో అంతరపంటలు కూడా సాగు చేశాం. సాగర్ కాలువ నుంచి ఇంజన్తో తోడుకొని తడి పెట్టేవాళ్లం. గత ఏడాది 7 క్వింటాళ్లు ఎండు మిరప పండింది. రూ. 50 వేల నికారాదాయం వచ్చింది. వర్షాలు లేక ఈ సంవత్సరం కాలువ ఒక్కసారే వచ్చింది. అందుకని మిరప వేయలేదు. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు.. కరువును తట్టుకొని పండే డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు పెట్టాం. ఈ పంటలకు ముందు మేలో నవధాన్య (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) పంటలు చల్లాం. వర్షం లేక సరిగ్గా మొలవలేదు. మళ్లీ జూలైలో వేశాం. వర్షానికి మొలిచింది. పెరిగినాక కోసి, గొడ్లకు మేతగా వాడుకున్నాం. వరుసగా మూడేళ్లుగా నవధాన్య పంటలు వేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే.. భూమి బాగా గుల్లబారింది. నవధాన్య పంటలు వేయని పక్క పొలంలోకి వెళ్లి మట్టి చేత్తో తీయాలంటే చాలా కష్టపడాలి. మా పొలంలో సులువుగానే మట్టి తీయొచ్చు. పొలం దున్నకుండానే, 3 అడుగులకు ఒక చోట అడుగు నేలను గుల్లగా తవ్వి, గత ఏడాది అక్టోబర్ 27న 5 రకాల విత్తనాలు నాటుకున్నాం. ప్రధాన పంటగా మధ్యలో ఆముదం లేదా కందిని నాటాం. దానికి నాలుగు వైపులా చిక్కుడు, అలసంద, అనుములు, సజ్జలు విత్తుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తన గుళికలు తయారు చేసుకొని నాటుకున్నాం. సీడ్ పెల్లటైజేషన్ చేయటం వల్ల భూమిలో విత్తుకున్న తర్వాత మొలక శాతం బాగుంటుంది. ఒకవేళ వర్షం రాకపోయినా లేదా మనం నీళ్లు పెట్టటం లేటైనా ఆ విత్తనం చెడిపోకుండా ఉంటుందని పెల్లటైజేషన్ చేశాం. విత్తనం పెట్టిన కొద్ది రోజులకు తుపాను వానకు విత్తనాలు మొలిచాయి. విత్తనం పెట్టేటప్పుడు అరెకరంలో 200 కిలోల ఘనజీవామృతం వేశాం. రెండుసార్లు ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. తర్వాత మరో రెండు సార్లు వాన వచ్చింది. అదే వాన సరిపోయింది. మిరపకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. మిరపకు రెండు రోజులు నీరు లేకపోతే వడపడిపోయి ఎండిపోతుంది. డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు అలా కాదు. నీరు లేకపోయినా చాలా వరకు జీవ కళ ఉంటుంది. అదీకాక, మేం చేసిన విత్తన గుళికలుగా చేసి వేసినందు వల్ల, భూమిలో వేసిన ఘనజీవామృతం వల్ల, ద్రవ జీవామృతం పిచికారీ వల్ల పంటలు ఎదిగాయి. ప్రధాన పంటతో పాటు పెట్టిన అనుములు, చిక్కుళ్ల వల్ల ఉపయోగం ఏమిటంటే.. ఈ తీగలు పాకి నేలపై ఎండపడకుండా కప్పి ఉంచి కాపాడటం, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడింది. సజ్జ ద్వారా రూ. 8,000లు వచ్చాయి. సజ్జ ఇంకా తీయాల్సి ఉంది. చిక్కుళ్లు,సొర కాయలు, దోసకాయల ద్వారా మరో ఆరేడు వేలు ఆదాయం వచ్చింది. సజ్జ బాగా పెరగటంతో నీరు లేక కంది సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికి అన్నీ కలిపి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఆముదాలు ఒక బస్తా వరకు వస్తాయి. పనులు మేమే చేసుకుంటాం. ఖాళీ ఉన్న రోజుల్లో కూలికి వెళ్తాం. బెట్టను తట్టుకొని పంట పండించుకోవచ్చని, ఎంతో కొంత దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది..’’ – ఎం. ఆదిలక్ష్మి (83091 18867), ఈపూరు, పల్నాడు జిల్లా బీడులోనూ పంటలు.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాళ్ళ గ్రామానికి చెందిన రంగస్వామి బిఎస్సీ బీఈడీ చదువుకొని తమ రెండెకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్వవసాయం చేస్తున్నారు. ఒక ఎకరంలో సపోట, మామిడి చెట్లు ఉన్నాయి. మరో ఎకరంలో టొమాటో, మిర్చి, వంగ, గోరుచిక్కుడు పంటలను బోరు నీటితో సాగు చేశారు. రెండో పంటగా వేరుశనగ, కంది, ముల్లంగి తదితర పంటలు వేశారు. రెండెకరాల్లో సగటున ఏడాదికి రూ. లక్షా 70 వేల వరకు నికరాదాయం పొందుతున్నట్లు తెలిపారు. సపోట, మామిడి తోటలో మూడు ఏళ్లుగా దుక్కి చేయని 30 సెంట్ల విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫింగ్ మోడల్లో 2023 డిసెంబర్లో ప్రయోగాత్మకంగా సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద, కంది, ఆముదం పంటలను సాగు చేశారు. 3 అడుగుల దూరంలో ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి, ఘనజీవామృతం వేసి విత్తనాలు విత్తారు. మామిడి ఆకులతో ఆచ్ఛాదన చేశారు. వారానికోసారి బక్కెట్లతో పాదికి 2,3 లీటర్ల నీరు పోశారు. మూడు నెలల వ్యవధిలో అలసంద, అనుములు అమ్మితే రూ. 2 వేల దాకా ఆదాయం వచ్చింది. పశుగ్రాసం రూపంలో మరో రూ. 3 వేల ఆదాయం వచ్చింది. రూ. 2 వేల గోరుచిక్కుళ్లు పండాయి. తమ ఇంటి కోసం, బంధువులకు వినియోగించారు. సజ్జ పక్షులు తిన్నాయి. కంది, ఆముదం పంటలు కోయాల్సి ఉంది. పంటలకు నీరు పోస్తున్నందున మొక్కల మధ్యన 3 అడుగుల ఖాళీలో గడ్డి పెరుగుతోంది. ఆ గడ్డిని కోసి ఆవులు, గేదెలకు వేస్తున్నారు. డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ పంటలతో వదిలేసిన భూమిని దుక్కి చేయకుండానే.. పంటలు పెట్టుకునే చోట తవ్వి విత్తనాలు పెట్టుకొని తిరిగి సాగులోకి తెచ్చుకోవచ్చని, ఎంతో కొంత పంట దిగుబడి తీసుకోవచ్చని రంగస్వామి అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రంగస్వామి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో వర్షాలు తగ్గినా పంట పెరగుదల బాగా కనిపిస్తోంది. రంగస్వామి ప్రకృతి వ్యవసాయం చూసి రంగస్వామి (88869 60609) తండ్రి కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. -
పంగాసియస్.. కేరాఫ్ ఏపీ
పంగాసియస్గా పిలిచే ఈ చేపకు వెన్ను ముల్లు తప్ప చూద్దామంటే మరో ఎముక కనిపించదు. పైగా నీచు వాసన రాదు. దీంతో చేసే ఏ వంటకమైనా చాలా మృదువుగా.. రుచికరంగా ఉంటుంది. తింటే ఇట్టే జీర్ణమైపోతుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని ఇష్టపడని వారుండరు. అందుకే స్టార్ హోటల్స్తోపాటు సాధారణ హోటళ్లలోనూ ఈ చేప వంటకాలకు డిమాండ్ ఎక్కువ. అపోలో ఫిష్గా దీనిని ఎక్కువగా వండుతారు. వియత్నాంలో పుట్టిన ఈ చేపలు మన ప్రాంతంలో పెరిగే ఏటి జెల్లను పోలి ఉంటాయి. దేశీయంగా వీటిని పంగా, పంగస్, అపోలో, వెండి చేప అని కూడా పిలుస్తారు. సాక్షి, అమరావతి: పంగాసియస్ చేపల సాగులోను.. అధిక దిగుబడులు సాధించడంలోను దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 50 వేల హెక్టార్లలో ఈ చేపల్ని పెంచుతుండగా.. అందులో 20 వేల హెక్టార్లు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. ఏటా 80 లక్షల టన్నుల పంగాసియస్ చేపలు ఉత్పత్తి అవుతుండగా.. వాటిలో 30నుంచి 35 లక్షల టన్నులు ఏపీ నుంచే దిగుబడి వస్తుండటం గమనార్హం. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వీటి సాగు విస్తరించి ఉంది. స్థానికంగా ఈ చేపల వినియోగం కేవలం 2 శాతమే కాగా.. మిగిలిందంతా పొరుగు రాష్ట్రాలకే ఎగుమతి అవుతోంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్కు 10 లక్షల టన్నుల వరకు వెళుతోంది. బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్లోనూ వీటికి డిమాండ్ ఎక్కువే. నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోగలవు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ చేపలు ఎలాంటి తెగుళ్లు, వ్యాధులనైనా తట్టుకుంటాయి. మొప్పలు కాకుండా వీటికి ఉండే గాలి తిత్తుల ద్వారా గాలి పీల్చుకుంటాయి. నీటిలో ఆక్సిజన్ తగ్గినప్పుడు నీటి ఉపరితలానికి చేరి వాతావరణంలోని ఆక్సిజన్ను తీసుకుంటాయి. ఎలాంటి వాతావరణంలో అయినా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. వేసిన ప్రతి పిల్ల బతకడం వీటి ప్రత్యేకత. రెండేళ్లలో మూడు పంటలు తీస్తున్నారు. గరిష్టంగా ఏడాది పాటు పెంచగలిగితే ఒక్కో చేప 3నుంచి 4 కేజీల వరకు పెరుగుతుంది. ఎకరాకు సైజును బట్టి 12 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పోషకాలు పుష్కలం ప్రొటీన్స్, ఐరన్, జింక్, కాల్షియం, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే ఈ చేపల్లో కార్బోహైడ్రేట్స్, సోడియం తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల చేపలో ప్రొటీన్ 15.2 గ్రాములు, కొవ్వు 2.9 గ్రాములు, కార్బోహైడ్రేట్స్, యాష్ గ్రాము, నీరు 60 గ్రాములు, 89 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. హాని కల్గించే కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అధికంగా ఉండే కాల్షియం ఎముకలు, కీళ్ల బలోపేతానికి, సేంద్రియ ఆమ్లాలు కంటిచూపు మెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ను నిరోధిస్తాయి. బ్రూడర్ కేంద్రం ఏపీలోనే.. కేంద్రీయ మంచినీటి మత్స్య పరిశోధనా సంస్థ (భువనేశ్వర్)కు అనుబంధంగా కృష్ణా జిల్లా కానూరు వద్ద గల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం పంగాసియస్ బ్రూడర్గా కేంద్రం గుర్తింపు పొందింది. 2013లో వియత్నాం నుంచి తీసుకొచ్చిన బ్రూడర్స్ ద్వారా తల్లి చేపలను ఉత్పత్తి చేసి కనీసం 4 ఏళ్లపాటు పెంచి పిల్లలను ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన 30–40 గ్రాముల సైజు పిల్లలను హేచరీలకు ఇస్తుంటారు. హేచరీల్లో మరో మూడేళ్ల పాటు సీడ్ ఉత్పత్తి జరుగుతుంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సీడ్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 టన్నుల బ్రూడర్స్ ఉన్నాయి. ఏటా 100 లక్షల సీడ్ అవసరం కాగా.. 50 లక్షల సీడ్ ఈ కేంద్రం అభివృద్ధి చేసిన బ్రూడర్స్ నుంచే ఉత్పత్తి చేస్తారు. అపోలో ఫిష్గా, ఫిష్ స్టాటర్స్గా ఉపయోగించే ఈ చేపకు స్టార్ హోటల్స్ నుంచి సాధారణ హోటల్స్ వరకు డిమాండ్ ఎక్కువ. ఈ కారణంగానే వీటికి అపోలో ఫిష్ అనే పేరొచ్చింది. పదేళ్లుగా ఇదే సాగు పదేళ్లుగా వంద ఎకరాల్లో పంగాసియస్ సాగు చేస్తున్నా. మిగిలిన చేపలతో పోలిస్తే వీటి సాగులో ఏమాత్రం నష్టాలు ఉండవు. కేజీ, కేజీన్నర సైజులో చేపలు పట్టుబడి చేస్తా. ఎకరాకు 9నుంచి 12 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. మంచి ఆదాయం వస్తుంది. – ఉమాశంకర్రెడ్డి, రైతు, గుడివాడ, కృష్ణా జిల్లా బ్రూడర్స్ ఉత్పత్తిలో.. పదేళ్లుగా పంగాసియస్ తల్లి చేపల(బ్రూడర్స్)ను ఉత్పత్తి చేస్తున్నాం. జన్యుపరమైన సమస్యలు లేకుండా వీటిని అభివృద్ధి చేసి హేచరీలకు ఇస్తున్నాం. వీటి సాగు, దిగుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2013లో 200 బ్రూడర్స్ తీసుకొచ్చాం. ప్రస్తుతం 6వేల కిలోల బ్రూడర్స్ ఉన్నాయి. – బి.శేషగిరి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్రాంతీయ మత్స్య పరిశోధనా కేంద్రం -
ప్రతికూలతలను తట్టుకునే ‘కుద్రత్–3’
ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రకాశ్ సింగ్ రఘువంశీ రూపుకల్పన చేసిన కుద్రత్–3 రకం కంది ప్రతికూల వాతవరణ పరిస్థితులను ధీటుగా తట్టుకొని అధిక దిగుబడులనిస్తూ అనేక రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తోందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పప్పుధాన్యాల విభాగం పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డా. యు.పి. సింగ్ తెలిపారు. హెక్టారుకు 36 క్వింటాళ్ల కందుల దిగుబడినిచ్చే ఈ రకం యూపీతోపాటు బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందిందన్నారు. భూతాపం వల్ల మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈ రకం రైతులకు స్థిరమైన భరోసానిస్తుందని కుద్రత్–3 ఆవిష్కర్త రఘువంశీ అంటున్నారు. దీని పంటకాలం 235 రోజులు. వంద గింజల బరువు 17.57 గ్రాముల బరువు తూగుతాయి. వివరాలకు.. ప్రకాశ్ సింగ్ రఘువంశీ – 98392 53974, 70203 07801. -
‘సార్వా’త్రా సంతోషం..
ఆకివీడు: ఖరీఫ్ పంట పండింది. రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రకృతి అనుకూలించకపోయినా, అతివృష్టిలోనూ అధిక దిగుబడుల సాధనలో జిల్లా రైతాంగం విజయం సాధించారు. మెట్ట ప్రాంతంలో మాసూళ్లు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి సాధించారు. కొన్నిచోట్ల ఎకరానికి 53 బస్తాల దిగుబడి వచ్చింది. డెల్టా ప్రాంతంలో కోతలు పారంభమయ్యాయి. వ్యవసాయశాఖ, గంణాంక శాఖ అధికారులు దిగుబడులపై అంచనాలు వేస్తున్నారు. ర్యాండమ్ పద్ధతిలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సరాసరి దిగుబడి 35 బస్తాల నుంచి 40 బస్తాల వరకూ వస్తున్నట్లు అంచనా వేశారు. డెల్టాలో దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కొన్ని మండలాల్లో దిగుబడులు భారీగా ఉంటే, చేపల చెరువులు ఉన్న గ్రామాల పరిధిలో దిగుబడి స్వల్పంగా తగ్గిందని రైతులు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అధిక దిగుబడులు జిల్లాలో ఖరీఫ్లో 2,58,118 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. దీనిలో మెట్ట, డెల్టా ప్రాంతాల్లో సాగు ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగులో 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లక్ష్యంగా నిర్ణయించగా, లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖరీఫ్లో ఎంటీయూ 1061, 1064, 1121, 1156, 1153,సంపత్ వంగడంతో పాటు అక్కడక్కడా స్వర్ణ రకం సాగు చేశారు. ఈ రకాల్లో 1061, 1064 వంగడాలు అధిక దిగుబడులు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అతివృష్టిని అధిగమించి ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. ఖరీఫ్ సాగును ఆలస్యంగా చేపట్టిన డెల్టా ప్రాంతంలో వరి సాగుకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఒకటి రెండుసార్లు నారు పోసుకోవాల్సి వచ్చింది. వరి పొట్ట, పాలు, పూత దశలో ఉండగా భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత తెగుళ్లు వేధించాయి. దోమ విజృంభించింది. అయినా అన్ని ఒడిదుడుకులనూ ఈ సార్వా సమర్థంగా ఎదర్కొంది. దోమ ఉధృతి ఎదురైనప్పుడు రైతులు ఆందోళన చెందకుండా పరిమితికి మించకుండా పురుగు మందులు వినియోగించారు. తూర్పు గాలులకు దోమ తుడిచిపెట్టుకుపోయింది. 8 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు.. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభ్తుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో 203 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాల ద్వారానూ, 108 కేంద్రాలను వెలుగు ప్రాజెక్టు ద్వారా డ్వాక్రా మహిళలకు కేటాయించారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలను గిడ్డంగి సౌకర్యం ఉన్న సొసైటీలకు అధికంగా ఇవ్వడంతో ధాన్యం నిల్వ ఉంచే అవకాశం ఏర్పడింది. వెలుగు కేంద్రాల వద్ద కూడా మార్కెట్ యార్డు గొడౌన్లు, స్థానిక గొడౌన్లను వినియోగించుకుంటున్నారు. డెల్టా ప్రాంతంలో వరి కోతలు మొదలు కావడంతో ధాన్యం ఇకపై ముమ్మరంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం.. ఈ ఏడాది సార్వా సీజన్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కష్టమొచ్చిన ప్రతిసారీ భరోసా ఇచ్చింది. పెట్టుబడి కోసం అక్టోబర్లో రైతు భరోసా అందించడంతో అన్నదాతలు కొన్ని ఖర్చులకు ఆ మొత్తాన్ని వినియోగించుకోగలిగారు. అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ప్రతికూల పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఫలితంగా దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. 40–45 బస్తాల దిగుబడి.. జిల్లాలో ఖరీప్ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే మెట్టలో 45 బస్తాల పైబడి దిగుబడి వచ్చింది. డెల్టాలో మాసూళ్లు ప్రారంభమవుతున్నాయి. అక్కడక్కడా పంటకోత ప్రయోగంలో సరాసరి 40 బస్తాల దిగుబడి వస్తోంది. అతివృష్టి సంభవించినా వరిసాగుకు నష్టం కలగలేదు. – గౌసియా బేగం, జిల్లా వ్యవసాయాధికారి, ఏలూరు 90 కేంద్రాల్లో కొనుగోళ్లు.. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా 90 కేంద్రాల్లో కొనుగోలు జరుగుతోంది. డెల్టాలో మాసూళ్లు ప్రారంభం కావడంతో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. – వర కుమార్, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల శాఖ, ఏలూరు 40 బస్తాలొస్తుంది.. ఖరీప్పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రకృతి కరుణించింది. ఎకరానికి 40 బస్తాలు వస్తాయని ఆశిస్తున్నాం. కంకులు బలంగా ఉండటంతో దిగుబడి బాగుంటుంది. – ఎరిచర్ల ప్రభాకరరావు, చెరుకుమిల్లి దిగుబడి బాగుంది.. ఖరీఫ్ దిగుబడి బాగుంది. అధిక వర్షాలకు తీవ్రంగా నష్టం వస్తుందని బాధపడ్డాం. ఆ విధంగా జరగలేదు. నష్టాలను అధిగమించినట్లే. పంట బాగుండటంతో ఆనందంగా ఉంది. – జంపన అర్జునరాజు, కౌలు రైతు, అయిభీమవరం -
పత్తి/కంది.. మధ్యలో పచ్చిరొట్ట
మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేర్లు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన వేలాది మంది పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న అతి కొద్ది మంది ప్రకృతి వ్యవసాయదారులు కూడా అదృష్టవశాత్తూ అక్కడ ఉన్నారు. రసాయనాలను త్యజించి, నేలతల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్న అద్భుత ప్రకృతి వ్యవసాయదారుల్లో సుభాష్ శర్మ ఒకరు. ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పొలం అంతా ఇలాగే వేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించే వినూత్న పద్ధతిని ఆయన గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మతో ‘సాక్షి సాగుబడి’ ఇటీవల ముచ్చటించింది. ముఖ్యాంశాలు.. సుభాష్ శర్మకు 60 ఏళ్లు. వ్యవసాయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదకి తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడు, రైతుశాస్త్రవేత్త. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన అనుభవం, ప్రజ్ఞలతో ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించుకున్నారు. కరువుకు, పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మహారాష్ట్ర విదర్భలోని యవత్మాల్ జిల్లా (చోటి గుజారి) వితస గ్రామ వాస్తవ్యుడైన ఆయనకు 19 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న సుభాష్ శర్మ 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకుని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. ఆయనకున్న 13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దులు మేయడానికి కేటాయించి మిగతా పది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. పత్తి/కంది సాళ్ల మధ్యలో పచ్చి రొట్ట సాగు పత్తి లేదా కంది సాగులో సుభాష్ శర్మ అధిక దిగుబడులు పొందుతున్న పద్ధతి ఆసక్తికరంగానే కాదు.. రైతులెవరైనా సులభంగా అనుసరించడానికి వీలుగానూ ఉంది. రెండు సాళ్లలో పత్తి లేదా కంది పంట, వాటి పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలను సాగు చేస్తారు. ప్రతి సాలుకు మధ్య 2 అడుగుల దూరం ఉంటుంది. ఈ ఐదు సాళ్లు 10 అడుగుల స్థలంలో ఉంటాయి. అంటే.. 4 అడుగుల్లో పంట, 6 అడుగుల్లో పచ్చిరొట్ట పెరుగుతాయి. పత్తి లేదా కంది సాళ్ల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. సాధారణంగా పత్తి సాగు చేసేరైతులు 4“2 అడుగుల దూరం పాటిస్తారు. 2“1.5 అడుగుల దూరాన వేస్తున్నందున ఎకరానికి వేసే మొక్కల సంఖ్య గానీ దిగుబడి గానీ తగ్గబోదని, ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయని సుభాష్ శర్మ అన్నారు. పచ్చిరొట్ట పంటలుగా ఎకరానికి 4 కిలోల సజ్జ, 6 కిలోల అలసంద, 15 కిలోల జనుము విత్తనాలను కలిపి వరుసలుగా బోదెలపై విత్తుతారు. పత్తి లేదా కంది సాళ్లలో కలుపును అతి చిన్నగా ఉన్నప్పుడే మనుషులు పీకేస్తారు లేదా కుర్ఫీతో తీసేస్తారు. నెలకోసారి కలుపు తీసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. మరీ అవసరమైతే పంట తొలిదశలో గుంటక తోలుతారు. కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కలుపు తీత ఖర్చు 80% తగ్గుతుందని సుభాష్ శర్మ తెలిపారు. పచ్చిరొట్ట పంటలున్న సాళ్లలో కలుపు తియ్యరు. 45–50 రోజులు పెరిగిన తర్వాత పచ్చిరొట్ట పంట మొక్కలను, కలుపును కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ తర్వాత 30–35 రోజులు గడచిన తర్వాత మరోసారి కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఈ రెండు సార్లూ ఆచ్ఛాదనగా వేసే పచ్చిరొట్ట మూరెడు ఎత్తున వస్తుంది. కాబట్టి, ఆచ్ఛాదనతో సత్ఫలితాలు వస్తున్నాయి. పంటలో పచ్చిరొట్ట సాగుతో అనేక ప్రయోజనాలు పంటల సాళ్ల పక్కనే పచ్చిరొట్టను పెంచి ఆచ్ఛాదన చేయటం వల్ల చాలా స్థలం వృథా అయినట్లు పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి బహుళప్రయోజనాలు నెరవేరతాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను రైతులు సరిగ్గా అర్థం చేసుకోవాలని సుభాష్ శర్మ అంటారు. పొలం బెట్టకు రాకుండా భూమిలో తేమను పచ్చిరొట్ట పంటలు కాపాడతాయి. కోసి వేసిన ఆచ్ఛాదన వల్ల నేలలోని తేమ ఆరిపోకుండా ఉండటమే కాకుండా, వాతావరణంలో నుంచి నీటి తేమను ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం గ్రహించి భూమికి అందిస్తుంది. ఫలితంగా వానపాములు, సూక్ష్మజీవులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వర్తిస్తూ నేలను సారవంతం చేస్తూ ఉంటాయి. పత్తి లేదా కంది మొక్కల వేర్లు పక్కన ఉన్న పచ్చిరొట్ట ఆచ్ఛాదన కిందికే చొచ్చుకు వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతోపాటు పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా పచ్చిరొట్ట సాగు వల్ల పత్తి లేదా కంది పంట దిగుబడి పెరుగుతుంది. పచ్చిరొట్ట ఆచ్ఛాదనతో ప్రయోజనాలు.. 1. పంట పక్కనే పచ్చిరొట్టను కూడా పెంచడం వల్ల సూర్యరశ్మి పూర్తిగా వినియోగమవుతుంది. ఆచ్ఛాదన వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం ఇనుమడిస్తుంది. 2. పొలం అంతటా వత్తుగా పంటలు ఆవరించి ఉండటం వల్ల, ఆచ్ఛాదన వల్ల వర్షాలకు భూమి పైపొర మట్టి కొట్టుకుపోకుండా రక్షింపబడుతుందని తెలిపారు. 3. పచ్చిరొట్ట పంటలు ఎర పంటగా పనిచేస్తాయి. జీవ నియంత్రణ వల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి 75 మిత్రపురుగులకు 25 శత్రుపురుగుల చొప్పున పెరుగుతుంటాయని.. మిత్రపురుగులు శత్రుపురుగులను తింటూ వాటి సంతతిని అదుపు చేస్తూ ఉంటాయి. పురుగుల మందులు, కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చంతా రైతుకు మిగిలిపోతుందని సుభాష్ శర్మ తెలిపారు. సూరజ్ సూటి రకం పత్తి గులాబీ పురుగును సైతం తట్టుకుంటుందన్నారు. 4. భూమిలో తేమ ఆరిపోకుండా ఎక్కువ కాలం నీటి ఎద్దడి రాకుండా చూస్తుంది. పత్తి వేర్లకు బోజనంతోపాటు తేమ కూడా దొరుకుతుంది. వర్షాలు మొహం చాటేసి మరీ ఇబ్బంది అయినప్పుడు ఒకటి, రెండు తడులు ఇస్తున్నామని సుభాష్ శర్మ తెలిపారు. పత్తి లేదా కంది సాళ్లు వేసిన చోట వచ్చే పంటకాలంలో పచ్చిరొట్ట పంటలు వేస్తామని, ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు చల్లిన చోట పత్తి లేదా కంది పంటలు వేస్తూ పంటమార్పిడి చేస్తుంటామన్నారు. పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడి పత్తిని పచ్చిరొట్టతో కలిపి సాగు చేసే ప్రయోగంలో.. సూరజ్(సూటి రకం) పత్తి తొలి ఏడాది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడో ఏడాదికి 12 క్వింటాళ్లకు పెరిగింది. మరో రెండు, మూడేళ్లలో 20 క్వింటాళ్లకు పెరుగుతుందని సుభాష్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నల్లరేగడి నేలలో ఇది ఒకటి, రెండు తడులు ఇచ్చే పద్ధతిలో దిగుబడి వివరాలు. పూర్తిగా వర్షాధారంగా ప్రయోగాత్మక సాగు వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా, కంది స్థానిక సూటి రకాలను విత్తి 15–20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పద్ధతి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొని సాగు చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందవచ్చని తెలిపారు. (సుభాష్ శర్మ–హిందీ– 94228 69620,డా. రాజశేఖర్(సి.ఎస్.ఎ.)–తెలుగు– 83329 45368) ప్రకృతి సేద్యంలో శాస్త్రీయతను రైతులు అర్థం చేసుకోవాలి పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో అనేక రకాల పచ్చిరొట్టను సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు భూసారం పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పత్తి మాదిరిగానే కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయాలు చాలా కీలకం. రైతులు మనసుపెట్టి ప్రకృతి సేద్యంలో దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పొరబడకూడదు. రసాయనిక వ్యవసాయంలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి, అధికాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయదారుడు, రైతు శాస్త్రవేత్త, వితస, యవత్మాల్, మహారాష్ట్ర ఎక్కడ కురిసిన వాన అక్కడే ఇంకాలి నల్లరేగడి భూమి అయినప్పటికీ ఏ గజం స్థలంలో పడిన వర్షాన్ని ఆ గజంలోనే ఇంకింపజేయడం సుభాష్ శర్మ ప్రత్యేకత. ఏ పంటనైనా బోదెలపైనే సాగు చేస్తారు. బోదెల మధ్యలో ప్రతి మీటరుకూ అడ్డుకట్ట వేసి జల స్తంభన చేస్తారు వేసవికి ముందు నుంచే ఇలా వాన నీటి సంరక్షణ ఏర్పాటు చేస్తారు. మరీ కుండపోత వర్షం కురిస్తే పంట ఉరకెత్తకుండా అడ్డుకట్టలను తాత్కాలికంగా తొలగించి, వరద నీరు పోయిన తర్వాత మళ్లీ కట్టలు వేస్తారు. ఏడాదిలో ఏ సీజన్లోనైనా అకాల / సకాల వర్షాలన్నిటినీ ఒడిసిపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి నీటి బొట్టునూ పొలంలో ఎక్కడికక్కడే ఇంకింపజేస్తారు. దీంతో భూగర్భ జలాలకు లోటుండదు. అయినా చాలా పొదుపుగా మరీ అవసరమైతేనే ఒకటి, రెండు తడులు ఇస్తూ పత్తి, కంది, కూరగాయలను సాగు చేస్తారు. భూమిలో ఎకరానికి 4 టన్నుల చొప్పున దిబ్బ ఎరువు వేసి కలియదున్నుతారు. ఆ తర్వాత పంట ఏదైనా సరే బోదెలు తోలి, బోదెలపైన విత్తనాలు వేసి సాగు చేస్తారు. విత్తనాలతో పాటే ప్రతి పాదులో దోసెడు తాను స్వయంగా తయారు చేసుకున్న ‘అలౌకిక్ ఖాద్’ను ఎకరానికి టన్ను చొప్పున వేస్తారు. బోదెలపై 2 సాళ్లలో పత్తి మొక్కల మధ్యలోని 3 సాళ్లలో ఏపుగా పెరుగుతున్న పచ్చిరొట్ట. వర్షపు నీరు పొలంలోనే ఎక్కడికక్కడే ఇంకింపజేసేందుకు బోదెల మధ్య వేసిన అడ్డుకట్టలు కంది మధ్య పచ్చిరొట్టను 2 సార్లు కోసేసిన తర్వాత ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement