-
సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్లో అడుగు పెట్టిన 'సినిమా'
సినిమా చూపిస్త మావా.. నీకు సినిమా చూపిస్త మామా.. అంటూ తొలిసారి భారతీయులకు చలనచిత్రాన్ని పరిచయం చేశారు లూమియర్ సోదరులు. సరిగ్గా 127 ఏళ్ల క్రితం ఇదే రోజు(జూలై 7న) ఈ అన్నదమ్ములు భారతీయులకు మొట్టమొదటి సారి సినిమా వీక్షించే అవకాశం కల్పించారు. అది కూడా ఒకటో, రెండో అనుకునేరు.. ఏకంగా ఆరు సినిమాలు. అవి ‘ఎంట్రీ ఆఫ్ సినిమాటోగ్రాఫ్’, ‘ద సీ బాత్’, ‘అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్’, ‘ఎ డిమాలిషన్’, ‘లేడీస్ అండ్ సోల్జర్స్ ఆన్ వీల్స్’, ‘లీవింగ్ ద ఫ్యాక్టరీ’. 1896లో ముంబైలోని వాట్సన్ హోటల్లో ఈ సినిమాలను ప్రదర్శించారు. అప్పుడు టికెట్ ధర ఎంతనుకునేరు? కేవలం ఒక్క రూపాయి మాత్రమే! ఇండియాలోకి సినిమా అడుగుపెట్టిన ఈ అద్భుత క్షణాలను టైమ్స్ ఆఫ్ ఇండియా 'మిరాకిల్ ఆఫ్ ద సెంచరీ'గా అభివర్ణించింది. ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫర్లు అయిన ఈ లూమియర్ సోదరులు సినిమాలపై తమకున్న పట్టుకున్న పారిస్లో నిరూపించుకున్నాకే భారత్లో అడుగుపెట్టారు. 1896 జూలై 7న తొలిసారి సినిమా ప్రదర్శించగా దీనికి అద్భుత స్పందన లభించింది. వెంటనే వాళ్లు కోల్కతా, చెన్నై నగరాల్లోనూ సినిమా షోలు వేయడం ప్రారంభించారు. రెండో స్క్రీనింగ్ ముంబైలోని నొవాల్టీ థియేటర్లో జూలై 14న జరగ్గా ఒకేరోజు ఏకంగా 24 సినిమాలు ప్రదర్శించారు. ఆగస్టు 15 వరకు ఈ షోల ప్రదర్శన ఒక పండగలా జరిగింది. ఇండియన్స్ తీసిన సినిమాలు.. ఈ ఉత్సాహంతో హీరాలాల్ సేన్ అనే ఇండియన్ ఫోటోగ్రాఫర్ స్టీవెన్సన్స్ కెమెరా ఉపయోగించి స్టేజీ షోను చిత్రీకరించాడు. ఈ షోకి ద ఫ్లవర్స్ ఆఫ్ పర్షియా అని నామకరణం చేశారు. హెచ్ఎస్. భటవ్దేకర్ 1899లో ద రెజ్లర్స్ అనే డాక్యుమెంటరీ చిత్రీకరించాడు. ముంబైలోని హ్యాంగింగ్ గార్డెన్స్లో ఇద్దరు రెజ్లర్స్ తలపడ్డ పోటీని ఆయన లైవ్లో చిత్రీకరించాడు. ఇండియాలో ఇదే తొలి డాక్యుమెంటరీ సినిమాగా గుర్తింపు పొందింది. చలనచిత్ర పితామహుడు పూర్తి స్థాయిలో సినిమాను తీసి రిలీజ్ చేసింది మాత్రం దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913లో మరాఠీ భాషలో రాజా హరిశ్చంద్ర అనే మూకీ(సైలెంట్) సినిమా తీశాడు. అప్పట్లో ఇది సంచలన విజయం నమోదు చేసుకుంది. భారతీయ సినిమాకు ప్రాణం పోసిన ఈయనను చలనచిత్ర పితామహుడిగా చెప్పుకుంటారు. ఇండియాలో తొలి టాకీ సినిమా ఆలం అరా. అర్దేశిర్ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలైంది. అదే ఏడాది తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద కూడా రిలీజైంది. చదవండి: బిగ్బాస్ హౌస్లో ముద్దులాట.. తప్పు మీదైతే నన్నంటారేంటి? నటి ఫైర్ -
సౌత్ వర్సెస్ బాలీవుడ్.. ఐశ్వర్యరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘ఓ సినిమాను నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తాను’’ అన్నారు ఐశ్వర్యా రాయ్. ‘ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల పాపులారిటీ ఎక్కువగా ఉందనీ, ఉత్తరాదిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం చలాయిస్తుందనీ కొందరు అనుకుంటున్నారు. వీటిని మీరు అంగీకరిస్తారా?’ అనే ప్రశ్నలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్యకి ఎదురయ్యాయి. దీనిపై ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ– ‘‘ఏ రంగంలో అయినా పోటీ ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి మధ్య పోటీ ఉంటుంది. అయితే కళాకారుల మధ్య అలాంటి భేదాలుండవు. నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు. ఏ సినిమా అయినా భారతీయ చిత్రంగానే భావిస్తాను. ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చలాయిస్తుందనే అభిప్రాయాన్ని అంగీకరించను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా రాకపోతే వేరే ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. దక్షిణాదిలో మణిరత్నంగారు, శంకర్గారు.. వంటి పెద్ద దర్శకులతో మంచి సినిమాలు చేసే అవకాశం నాకు వచ్చింది’’ అన్నారు ఐశ్వర్య. -
ఆయన్ను చూస్తే చాలనుకున్నాను... సినిమా చేశాను
దిలీప్కుమార్ అందరూ మెచ్చిన నటుడు. భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన నటుడు. అంతటి లెజండరీ నటుడు మన తెలుగు హీరో కృష్ణంరాజు నిర్మించిన ‘ధర్మ్ అధికారి’లో నటించారు. ఇది కృష్ణంరాజు రెండు పాత్రల్లో నటించి, నిర్మించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’కి హిందీ రీమేక్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్రరావు హిందీ రీమేక్ని తెరకెక్కించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున తండ్రీ కొడుకులుగా బి. గోపాల్ దర్శకత్వం వహించిన ‘కలెక్టర్గారి అబ్బాయి’ హిందీ రీమేక్ ‘కానూన్ అప్నా అప్నా’లో దిలీప్ కుమార్ నటించారు. ఈ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలోనే తెలుగు నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించారు. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘రాముడు–భీముడు’ హిందీ రీమేక్ ‘రామ్ ఔర్ శ్యామ్’లోనూ దిలీప్కుమార్ నటించారు. తెలుగు నిర్మాతలు చక్రపాణి, బి. నాగిరెడ్డి నిర్మించగా, తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇలా తెలుగు చలనచిత్ర దర్శక–నిర్మాతలతో దిలీప్కుమార్కి అనుబంధం ఉంది. ఇప్పుడు దిలీప్కుమార్ భారతీయ సినీరంగాన్ని విషాదంలో ముంచి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనతో సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు, కృష్ణంరాజు, బి. గోపాల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన విశేషాల్లోకి వెళదాం... ► నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. నేల టికెట్ కొనుక్కుని మరీ ఆయన సినిమాలు చూసేవాణ్ణి. అలాగే నాకు దిలీప్ కుమార్గారంటే కూడా చాలా ఇష్టం. కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ అందరం దిలీప్ కుమార్గారు రోజుకి 18 లక్షలు తీసుకుంటారట, చాలా పెద్ద హీరో అని చెప్పుకునేవాళ్లం. అసలు దిలీప్గారిని లైఫ్లో దూరంగా అయినా నిలబడి చూడగలమా? అనుకునేవాణ్ణి. కానీ ఆయన సినిమాకి డైరెక్షన్ చేయగలిగాను. ► నాగేశ్వరరావుగారు, నాగార్జునగారు తండ్రీ కొడుకులుగా నా దర్శకత్వంలో వచ్చిన ‘కలెక్టర్గారి అబ్బాయి’ని ప్రొడ్యూసర్ ఏస్ఆర్ ఆంజనేయులుగారు హిందీలో రీమేక్ చేద్దామన్నారు. ఆ తర్వాత దిలీప్కుమార్తో ఈ సినిమా చేస్తున్నాం అని ఆయన అన్నారు. అసలు నాకేమీ అర్థం కాలేదు. ఇంత అదృష్టం మనకు దక్కుతుందా అనిపించింది. దూరంగా అయినా చూడగలుగుతామా? అనుకున్న నాకు ఆయన్ను డైరెక్షన్ చేసే చాన్స్ అంటే చాలా ఆనందంగా అనిపించింది. షాకింగ్గా కూడా అనిపించింది. ► ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఆంజనేయులుగారు నన్ను ముంబయ్ తీసుకెళ్లారు. దిలీప్కుమార్గారి ఇంటికి వెళ్లాం. వెళ్లగానే ఆయన కాళ్లకు దండం పెట్టాను. కాసేపయిన తర్వాత ‘ఏంటీ మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. డైరెక్టర్ ఏమీ మాట్లాడటంలేదు’ అని ఆంజనేయులుగారిని దిలీప్గారు అడిగారు. ‘అలా ఏం లేదు. మీకు పెద్ద ఫ్యాన్ ఆయన. మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట్లాడకుండా ఉండిపోయారు’ అంటే ఆయన నవ్వుకున్నారు. అలా ఆయనతో ‘కానూన్ అప్నా అప్నా’ సినిమా చేశాను. ► రీ టేక్ అని చెప్పడానికి టెన్షన్ పడిన సందర్భాలు లేవు. ఎందుకంటే దిలీప్గారు చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవారు. ఈ సినిమా కమిట్ అయినప్పుడు ‘గోపాల్.. తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్టయిందని నాకు తెలుసు. నాకున్న ఇమేజ్కి తగ్గట్టుగా కాకుండా వేరే ఏదైనా ట్రై చేద్దాం.. డిస్కస్ చేద్దాం’ అని చెప్పి, అప్పట్లో రాజేశ్ ఖన్నాగారి ‘ఆరాధన’కు రచయితగా చేసిన సచిన్ బౌమిక్ని పిలిపించారు. దిలీప్గారు కొన్ని సలహాలూ సూచనలూ ఇచ్చి, ‘నువ్వు ‘నో’ అంటే ‘నో’. నీకూ కరెక్ట్గా అనిపిస్తేనే పెట్టు. లేకపోతే వద్దు. ఎందుకంటే తెలుగు వెర్షన్ కోసం చాలా రోజులు వర్క్ చేశారు. ఆ కథ డిస్ట్రబ్ కాని మార్పులే చేద్దాం. లేకపోతే వద్దు’ అన్నారు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ► ‘నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.15 లోపు షూటింగ్కి వస్తాను. నా అలవాటు అది. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి’ అని ముందే మాతో అన్నారు. ఆయనకు తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేశాం. దిలీప్గారు బాగా షటిల్ ఆడేవారు. బాగా ఎక్సర్సైజులు కూడా చేసేవారు. అవన్నీ చేసుకుని చెప్పినట్లుగానే 12 గంటలకల్లా లొకేషన్లో ఉండేవారు. కంటిన్యూస్గా సాయంత్రం 3 గంటల వరకూ షూటింగ్ చేసినా బ్రేక్ కావాలనేవారు కాదు. 3 గంటల తర్వాత లైట్గా లంచ్ తిని, ఓ అరగంట రెస్ట్ తీసుకుని, మళ్లీ ఫుల్ ఎనర్జీతో షూటింగ్లో పాల్గొనేవారు. హైదరాబాద్లో, మదరాసులలో షూటింగ్ చేసినప్పుడు బస చేసిన హోటల్లో షటిల్ ఆడుకుని షూటింగ్కి వచ్చేవారు. ► అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అప్పుడు నాగేశ్వరరావుగారు వచ్చారు. దిలీప్గారు, ఆయన ఇద్దరూ కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. ఒకరినొకరు గౌరవించుకున్న తీరు చూసి, నాకు చాలా ముచ్చటేసింది. ► దిలీప్గారు ఎక్కువ టేక్స్ తీసుకునేవారు కాదు. ‘కానూన్ అప్నా అప్నా’కి ఖాదర్ ఖాన్ డైలాగ్ రైటర్. ఆయన ఒక పెద్ద క్యారెక్టర్ కూడా చేశారు. ఖాదర్ రాసిన వెర్షన్ తీసుకెళ్లి, దిలీప్గారు ఫైనల్గా ఒక వెర్షన్ రాసుకొచ్చేవారు. ఖాదర్ ఖాన్ రాసిన ఫ్లేవర్ పోకుండా చిన్న చిన్న మార్పులతో డైలాగులు రాసుకొచ్చేవారు. క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి ఆయన అలా చేసేవారు. అంటే.. ఎంత హోమ్వర్క్ చేసేవారో ఊహించవచ్చు. ► కానూన్ అప్నా అప్నా’ చేసిన కొంతకాలం తర్వాత ఓ సందర్భంలో చెన్నైలో దిలీప్కుమార్గారిని కలిశాను. గుర్తుపట్టి, ‘గోపాల్.. ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించారు. ఒక లెజండరీ నటుణ్ణి కోల్పోయాం. చాలా బాధగా ఉంది. ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చిన నటుడు – కృష్ణంరాజు ► ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు దిలీప్కుమార్. ప్రతి సినిమాలో ఆయన నటన ఎంతో గొప్పగా ఉంటుంది. వ్యక్తిగా కూడా చాలా గొప్పవారు. దిలీప్కుమార్కి నేను పెద్ద అభిమానిని. ‘బొబ్బలి బ్రహ్మన్న’ సినిమాలో యంగ్, ఓల్డ్ క్యారెక్టర్స్ నేనే చేసినప్పటికీ హిందీలో రీమేక్ చేయాలన్నప్పుడు పెద్ద వయసు పాత్రకు ధర్మేంద్రను, యంగ్ క్యారెక్టర్కు జితేంద్రను అనుకున్నాం. అలా అనుకున్నప్పటికీ దిలీప్కుమార్ అభిమానిగా ఆయన నటిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ నటిస్తారో లేదో అని సందేహం. కానీ దిలీప్కుమార్గారు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమా చూసి, నాకు ఫోన్ చేసి అభినందించారు. నటిస్తానని అన్నారు. అలా ‘ధర్మ్ అధికారి’ ఆరంభమైంది. ఇందులో యంగ్ క్యారెక్టర్ను జితేంద్ర చేశారు. ► సాధారణంగా దిలీప్కుమార్గారు సినిమా షూటింగ్కు మధ్యాహ్నం 12 గంటల మధ్యలో వచ్చేవారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఉదయం ఏడు గంటలకే సెట్స్కి వచ్చేవారు. ఇందులోని ధర్మ్ రాజ్ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నేనంటే ఆయనకు ఉన్న ఇష్టం కూడా ఆయన్ను సెట్స్కు రప్పించిందేమో! ‘భాయీజాన్’ అంటూ ఆప్యాయంగా హత్తుకునేవారు. ► ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఓ సందర్భంలో జితేంద్ర ఓ సన్నివేశానికి ఇంకా కాస్ట్యూమ్తో రెడీ కాలేదు. దిలీప్కుమార్గారు ఆలస్యంగా వస్తారని ఆయన అనుకున్నారు. కానీ ఆల్రెడీ వచ్చారని, షాట్కు రెడీ అయిపోయారని చెప్పాను. ‘దిలీప్గారు అప్పుడే వచ్చారా.. అబద్ధం చెప్పకు’ అని జితేంద్ర అన్నారు. ‘లేదు.. వచ్చారు’ అని చెప్పగానే అప్పటికప్పుడు జితేంద్ర షాట్కు రెడీ అయ్యారు. ► ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రం 100 డేస్ ఫంక్షన్కు దిలీప్గారు వచ్చారు. ఆయనతో పాటు ఆయన భార్య సైరా బానుని కూడా తీసుకువచ్చారు. నేను, దిలీప్, ఆమె ఒకే చోట పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు వేదిక మీద ఉన్న ‘బొబ్బిలి బ్రహ్మన్న’ పోస్టర్ చూసి, ఆయన ఎవరు? అని దిలీప్గారిని సైరా బాను అడిగారు. ‘నీ పక్కన ఉన్న అతన్ని అడుగు’ అని నన్ను చూపిస్తూ, ఆయన చమత్కరించారు. అప్పట్లో నేను యంగ్గా ఉన్నాను. పోస్టర్లో పెద్ద వయసున్న బ్రహ్మన్న గెటప్లో నన్ను గుర్తుపట్టలేకపోయారామె. యంగ్ రవి పాత్రను మాత్రమే నేను చేశానని ఆమె అనుకుని ఉంటారు. లెజెండ్ దూరమయ్యారు – కె. రాఘవేంద్రరావు భారతీయ సినిమా చరిత్రలో టాప్ లెజెండ్ దిలీప్కుమార్గారు. అన్ని రకాల పాత్రలు చేసిన గొప్ప నటుడు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ స్క్రిప్ట్ చదివి, సినిమా చూడగానే హిందీ రీమేక్లో నటించడానికి ఒప్పుకున్నారాయన. ఈ సినిమా షూటింగ్ అప్పుడు రాజమండ్రిలో చిన్న విలేజ్ దగ్గర ఓ ఇల్లు తీసుకున్నాం. అప్పుడు దిలీప్గారి భార్య సైరా బాను కూడా వచ్చారు. ఇద్దరూ చాలా సింపుల్ పర్సన్స్. ఒక గొప్ప వ్యక్తితో, గొప్ప నటుడితో సినిమా చేయడం నాకు హ్యాపీ అనిపించింది. ఇండియన్ ఇండస్ట్రీ ఒక లెజెండ్ని కోల్పోయింది. ప్రముఖుల నివాళి ‘‘ఒక శకం ముగిసింది. ఇక భారతీయ సినిమా అంటే దిలీప్కుమార్కి ముందు ఆ తర్వాత అనాలి’’ అంటూ దక్షిణ, ఉత్తరాది భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు దిలీప్కుమార్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లెజెండరీ యాక్టర్ దిలీప్కుమార్గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో దిలీప్కుమార్గారు ఒకరు. ఆయన ఒక యాక్టింగ్ ఇనిస్టిట్యూషన్. తన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సినీ సంపద. – చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమకు దిలీప్కుమార్గారి మరణం తీరని లోటు. ఒక నటుడిగా మొదలై స్టార్గా ఎదిగిన దిలీప్గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. అయితే వివిధ సందర్భాల్లో ఆయన్ను కలుసుకోగలిగినందుకు ఐ యామ్ బ్లెస్డ్. – మోహన్బాబు దిలీప్కుమార్ సార్ మనకు శాశ్వతంగా దూరమయ్యారనే వార్త నన్ను బాధించింది. ఆయన ఎప్పటికీ ఓ లెజెండ్. మన హృదయాల్లో దిలీప్గారి లెగసీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – వెంకటేశ్ ప్రపంచ సినిమాపై దిలీప్కుమార్ చెరగని ముద్ర వేశారు. గ్రేటెస్ట్ యాక్టర్. లెజెండ్స్ ఎప్పటికీ బతికే ఉంటారు – రవితేజ దిలీప్గారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్ అందరికీ ఓ ప్రేరణ. సినీ చరిత్రలో నిలిచిపోతారు. – మహేశ్బాబు భారతీయ సినీ పరిశ్రమ ఎదుగుదలలో దిలీప్కుమార్గారి పాత్ర విలువైనది. – జూనియర్ ఎన్టీఆర్ దిలీప్కుమార్గారి మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం. – రామ్చరణ్ దిలీప్కుమార్గారు భారతీయ సినిమాకు చేసిన కృషి అసమానమైనది. ఈ తరం యాక్టర్స్కే కాదు. భవిష్యత్ తరాల యాక్టర్స్కూ ఆయన ఓ స్ఫూర్తి. – అల్లు అర్జున్ ఒక ఇనిస్టిట్యూషన్ వెళ్లిపోయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రను రాస్తే అది కచ్చితంగా దిలీప్కుమార్కు ముందు, దిలీప్కుమార్ తర్వాత అన్నట్లు ఉంటుంది. – అమితాబ్ బచ్చన్ దిలీప్ కుమార్తో నేను ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాను. దిలీప్, సైరా బానులతో నాకు మంచి అనుబంధం ఉంది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలనే కాదు.. ఇతర సంగతుల గురించి కూడా మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయన సినిమాలు విడుదలైన ప్రతిసారీ సైరా నన్ను వాళ్ల ఇంటికి ఆహ్వానించేవారు. నేను వెళితే ‘‘మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు.. మన ‘మధుమతి’ (దిలీప్కుమార్ సరసన వైజయంతీ మాల నటించిన సినిమా) వచ్చారు’’ అని దిలీప్తో సైరా అనేవారు. అప్పుడు ‘ధనో వచ్చింది’ అని దిలీప్ అనేవారు. ‘గంగాజమున’ చిత్రంలో నేను పోషించిన పాత్ర పేరు ధనో. దిలీప్కుమార్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. తనతో కలిసి ఉండేందుకు ఆ అల్లాయే దిలీప్ను పిలిచాడని అనుకుంటున్నాను. – వైజయంతీ మాల నా ఆప్యాయమైన సోదరుడు దిలీప్కుమార్ని కోల్పోయాను. మా దిలీప్ ఉండటం ఆ స్వర్గానికే అదృష్టం. – ధర్మేంద్ర నా జీవితంలో ఓ తండ్రిలా ఉన్న దిలీప్ సార్తో నాకు ఎన్నో ప్రత్యేకమైన అనుభూతులు ఉన్నాయి. – సంజయ్ దత్ ఇండియన్ సినిమా అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఇలాంటి ప్రతిభాశాలి లేరు, రారు. – సల్మాన్ ఖాన్ అద్భుత నటన ద్వారా విలువైన, వెలకట్టలేని, ప్రత్యేకమైన బహుమతులను మాకు ఇచ్చిన యూసుఫ్ సాహెబ్కు ధన్యవాదాలు. నా దృష్టిలో మీరెప్పటికీ గ్రేటెస్ట్. సలామ్! – ఆమిర్ ఖాన్ ఈ ప్రపంచంలో చాలామంది హీరోలు ఉండొచ్చు. కానీ మా యాక్టర్స్ హీరో దిలీప్కుమార్ సారే. ఇండియన్ సినిమాలో ఆయన మరణంతో ఓ శకం సమాప్తమైపోయింది. – అక్షయ్కుమార్ -
బొమ్మ బంపర్ హిట్!
పైరసీతో సినీ రంగం నష్టపోతోందంటూ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. థియేటర్లకు వెళ్లి చూసే ప్రేక్షకుల సంఖ్యేమీ తగ్గడం లేదు. సినిమా కలెక్షన్లు అలవోకగా వందల కోట్లు దాటడమూ ఆగడం లేదు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం భయాల్లాంటివి ఎలా ఉన్నా .. సినీ ప్రేమికులు రేటెంతైనా సరే టికెట్టు కొనుక్కుని చూసేందుకు మొగ్గుచూపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. గతేడాదే సినిమాలపై ప్రేక్షకులు ఏకంగా రూ. 10వేల కోట్లపైగానే వెచ్చించారు. న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంటున్న సినిమా టికెట్ల అమ్మకాలు మళ్లీ జోరు అందుకుంటున్నాయి. పైరసీ కష్టాలు ఎలా ఉన్నా.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తేడా లేకుండా సినీ ప్రియులు .. రేటెంతయినా సరే టికెట్లు కొనుక్కుని థియేటర్లలో చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. గతేడాది గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఒర్మాక్స్ మీడియా అనే కన్సల్టింగ్ సంస్థ రూపొందించిన బాక్సాఫీస్ రిపోర్ట్ 2019 ప్రకారం.. భారతీయులు గతేడాది 103 కోట్ల సినిమా టికెట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 10,948 కోట్లు వెచ్చించారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 11.6 శాతం అధికం. 2018లో దేశీ సినీ ప్రియులు 94.5 కోట్ల టికెట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ. 9,810 కోట్లు వెచ్చించారు. అమ్ముడైన టికెట్లలో దాదాపు మూడో వంతు వాటా హిందీ సినిమాలదే ఉంది. 19 శాతం తమిళ సినిమాలు, 18 శాతం తెలుగు సినిమాల వాటా ఉంది. హాలీవుడ్, మలయాళం సినిమాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం.. సినిమాలు బంపర్ కలెక్షన్లు సాధించడంలో భాష ప్రధానంగా ఉంటోంది. ప్రభాస్ నటించిన సాహో (హిందీ, తమిళం, తెలుగు) బాక్సాఫీస్ ఆదాయాల్లో అత్యధికంగా 60 శాతం వాటా హిందీ నుంచే వచ్చినట్లు ఒర్మాక్స్ మీడియా సీఈవో శైలేష్ కపూర్ పేర్కొన్నారు. ఇక హృతిక్ రోషన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘వార్’ కలెక్షన్లలో గణనీయ భాగం తెలుగు వెర్షన్ నుంచి వచ్చాయని వివరించారు. ఈ నేపథ్యంలో చాలా మటుకు టాప్ 10 సినిమాలు.. బహుభాషల్లో విడుదలవుతున్నాయని కపూర్ చెప్పారు. హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగు, తమిళం, హిందీ తదితర పలు భారతీయ భాషల్లోకి డబ్ చేస్తున్నారని విశ్లేషించారు. ‘అవెంజర్స్ సినిమా బాక్సాఫీస్ ఆదాయాల్లో 40–45 శాతం వాటా హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లదే ఉంది. భారీ సినిమాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వాటి బాక్సాఫీస్ ఆదాయాల్లో సగటున 30–35 శాతం వాటా భారతీయ భాషల వెర్షన్ల నుంచే వస్తోంది. 1917 లాంటి చిన్న సినిమాలు ఇంగ్లీష్లో మాత్రమే విడుదలవుతున్నాయి’ అని కపూర్ చెప్పారు. హాలీవుడ్ చిత్రాలైనా .. బాలీవుడ్ సినిమాలైనా .. పలు భాషల్లో డబ్ చేసి, విడుదల చేస్తుండటం వల్ల టికెట్ల అమ్మకాలు.. తద్వారా బాక్సాఫీస్ ఆదాయాలు పెరుగుతున్నాయి. కంటెంటే కింగ్.. అయితే, సినిమాల కలెక్షన్లు పెరగడానికి కారణం పలు భాషల్లో రిలీజ్ చేయడం ఒక్కటే కాదని, కంటెంట్ కూడా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. స్టార్ హీరోలు, యాక్టర్లతో సంబంధం ఉండటం లేదని వివరించింది. హిందీ సినిమాలు.. కలెక్షన్ల కోసం తొలి వారాంతంపై ఆధారపడటమనేది దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. కేవలం తొలి వారానికే పరిమితం కాకుండా కంటెంట్ ఎంత బాగుంటే .. అంత ఎక్కువ కాలం థియేటర్లలో సినిమాలు నడుస్తున్నాయి. ‘గతంలో కహానీ (2012), క్వీన్ (2014) వంటి సినిమాల్లో పెద్ద స్టార్లు లేకపోయినా అవి రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం గొప్పగా ఉండేది. కానీ 2019 విషయం తీసుకుంటే పెద్ద స్టార్లెవరూ లేని చిచోరే సినిమా అలవోకగా రూ. 140 కోట్ల వసూళ్లు సాధించింది. సల్మాన్ ఖాన్ వంటి పెద్ద స్టార్ నటించిన దబాంగ్ 3కి సరిసమాన స్థాయిలో నిల్చింది. కనుక స్టార్లు లేరు కాబట్టి సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంటాయని అనుకోవడానికి లేదు. కంటెంట్ బాగుంటే చాలు.. ఆదాయాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది‘ అని కపూర్ చెప్పారు. స్టార్ యాక్టర్ల సినిమాలకు సాధారణంగానే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ, ఎంత కాలం నిలదొక్కుకోగలుగుతాయి అన్నది కంటెంట్ పైనే ఆధారపడి ఉంటోంది. దబాంగ్ 3 ఓపెనింగ్స్ రూ. 32 కోట్లతో పోలిస్తే చాలా తక్కువగా రూ. 6 కోట్ల ఓపెనింగ్స్తో ప్రారంభమైన చిచోరే.. ఆ తర్వాత అదర గొట్టే కలెక్షన్లు సాధించడం దీనికి నిదర్శన మని కపూర్ తెలిపారు. విదేశీ మార్కెట్ల లోనూ దూకుడు.. వసూళ్లు పెంచుకోవడానికి చిత్రాలను విదేశీ మార్కెట్లలోనూ పెద్ద ఎత్తున విడుదల చేసే ధోరణి పెరిగిందని కేర్ రేటింగ్స్ తెలిపింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ఖాన్ నటించిన దంగల్ సినిమా దీనికి నిదర్శనంగా పేర్కొంది. మొత్తం రూ. 1,968 కోట్ల వసూళ్లలో నాలుగింట మూడొంతుల వాటా విదేశీ మార్కెట్ల నుంచే వచ్చిందని వివరించింది. చైనా, మధ్యప్రాచ్యం, తైవాన్, మలేషియా, హాంకాంగ్, బ్రిటన్ వంటి దేశాల్లో భారతీయ సినిమాలకు ఆదరణ ఉంటోందని కేర్ రేటింగ్స్ తెలిపింది. మరోవైపు, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ వంటి ఓవర్–ది–టాప్ కంటెంట్ ప్లాట్ఫాంల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. థియేటర్లలో టికెట్ల రాబడి కూడా పెరగడం గమనార్హమని వివరించింది. ఒకదాని వల్ల మరో దానికి ముప్పు రాకుండా ఓటీటీ ప్లాట్ఫాంలు, థియేటర్లు కలిసి ముందుకు సాగగలవని పేర్కొంది. బాక్సాఫీస్పై ‘లిప్స్టిక్’ ప్రభావం: కేర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పెరగడానికి ‘లిప్స్టిక్’ ఎఫెక్ట్ కూడా కారణమని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో వినియోగదారులు .. విలాసవంతమైన భారీ కొనుగోళ్ల జోలికి పోకుండా.. చిన్న చిన్న సరదాలపై ఖర్చు పెట్టే ధోరణిని లిప్స్టిక్ ఎఫెక్ట్గా వ్యవహరిస్తారు. ఈ ప్రభావంతో పాటు కంటెంట్ మెరుగుపడటం, సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గడం కూడా పరిశ్రమకు తోడ్పడిందని కేర్ రేటింగ్స్ పేర్కొంది. సినిమాల సగటు ఆదాయం 15 శాతం పెరిగి రూ. 23 కోట్లకు చేరిందని వివరించింది. 2018లో ఏడు చిత్రాలు రూ. 100 కోట్ల వసూళ్ల మార్కును దాటగా 2019లో ఇది పదమూడుకు పెరిగింది. గతేడాది ఆరు బాలీవుడ్ సినిమాలు రూ. 200 కోట్ల మార్కును అధిగమించాయి. -
చిత్ర పరిశ్రమతో ‘మేక్ ఇన్ ఇండియా’ విస్తృతి
ముంబై: మన సంస్కృతిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లగల భారతీయ చిత్ర పరిశ్రమ.. ‘మేక్ ఇన్ ఇండియా’ను విస్తృత పరిచేందుకు సరైన మాధ్యమమని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. అసోచామ్ వెలువరించిన ‘డిజిటలైజేషన్ అండ్ మొబిలిటీ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే పుస్తకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న షారుఖ్ మాట్లాడుతూ, భారతీయ చిత్ర పరిశ్రమ మేక్ ఇన్ ఇండియాను విస్తృత పరచగలదన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement