-
రాజీవ్కు మోదీకి తేడా ఏమిటీ?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆల్ ఇండియా రేడియో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో 1984లో జరిగిన ఢిల్లీ అల్లర్ల గురించి ప్రస్తావించారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆనాటి విషయాలను ప్రస్తావించడం ఆయనకు సమంజసమే కావచ్చు. కానీ ఆనాటి ఢిల్లీ అల్లర్లకు, 2002లో గుజరాత్లో జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లకు మధ్య ఎన్నో పోలికలున్న విషయాలను ఆయన మరచిపోయినట్లు ఉన్నారు. నాడు ప్రధాన మంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ, గుజరాత్ అల్లర్లప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నేడు ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ఇద్దరూ బాధ్యతా రహితంగానే వ్యవహరించారని చెప్పక తప్పదు. ఢిల్లీలో మూడు రోజులపాటు అల్లర్లు చెలరేగాక, గుజరాత్లో మూడు నెలలపాటు అల్లర్లు చెలరేగాయి. అదేమి చిత్రమోగానీ నవంబరు మూడవ తేదీన ఇందిరాగాంధీ అంత్యక్రియలతో కుళాయి నీళ్లు ఆపేసినట్లు ఢిల్లీ అల్లర్లు ఆగిపోయాయి. ‘ఓ మహా వృక్షం కూలినప్పుడు ప్రకంపనలు రావడం సహజమే’ అని బాధ్యతారహిత వ్యాఖ్యల ద్వారా ఢిల్లీ అల్లర్లను రాజీవ్ గాంధీ పరోక్షంగా ప్రోత్సహించగా, గోద్రాలో హిందువులను ఊచకోత కోసారని పదే పదే ప్రస్థావించడం ద్వారా నరేంద్ర మోదీ అల్లర్లను ప్రోత్సహించారు. 1985లో జనవరి నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఇందిరాంధీకి, భోపాల్ గ్యాస్ బాధితులకు సంతాపం తెలిపిన ప్రభుత్వం ఢిల్లీ అల్లర్ల బాధితులను విస్మరించింది. మోదీ ప్రభుత్వం కూడా గుజరాత్ అల్లర్ల బాధితులకు సంతాపం ప్రకటించలేదు. ఢిల్లీ అల్లర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మాసిపోయిన గాయాలను మళ్లీ రేపినట్లు అవుతుందంటూ తప్పించుకుంటూ వచ్చారు. మళ్లీ అల్లకల్లోలంగా మారుతున్న పంజాబ్లో శాంతియుత పరిస్థితులను స్థాపించేందుకు అకాలీ దళ్ చీఫ్ హెచ్ఎస్ లోంగోవాల్ను రాజీవ్ గాంధీ చర్చలకు ఆహ్వానించారు. అయితే ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు కమిషన్ను ఏర్పాటు చేస్తేనే వస్తానని ఆయన షరతు పెట్టారు. దాంతో తప్పనిసరై 1985, ఏప్రిల్ నెలలో ఢీల్ల అల్లర్లపై రంగనాథ్ మిశ్రా కమిషన్ను ఆయన ఏర్పాటు చేశారు. 1987లో ఆ కమిషన్ నివేదికను పార్లమెంట్కు సమర్పించింది. అయితే దానిపై పార్లమెంట్లో చర్చకు రాజీవ్ ప్రభుత్వం అనుమతించలేదు. గుజరాత్ అల్లర్లపై దర్యాప్తునకు నరేంద్ర మోదీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నానావతి కమిషన్ను ఏర్పాటు చేశారు. 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన నానావతి కమిషన్ రెండేళ్ల క్రితమే తన నివేదికను గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది. ఇప్పటివరకు ఆ నివేదికను బహిర్గతం చేయలేదు. దానిపైనా చర్చించలేదు. ఇలాంటి నివేదికలు అసెంబ్లీకి సమర్పించాక ఆరు నెలల్లోగా చర్చించాలన్నది నియమం. రెండు కమిషన్లు తేల్చిందీ ఏమీలేదని అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశ రాజకీయాలను కుదిపేసిన ఈ రెండు అల్లర్లలో దోషులెవరికీ శిక్ష పడలేదు. పైగా ఢిల్లీ అల్లర్లలో ప్రధాన నిందితులుగా ఆరోపణలను ఎదుర్కొన్న కాంగ్రెస్ నాయకులు హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్లను నాడు రాజీవ్ గాంధీ తన కేబినెట్లోకి తీసుకున్నారు. గుజరాత్లోని నరోదయా పాటియాలో జరిగిన ముస్లింల ఊచకోతకు కారణమైన నిందితులను రెచ్చగొడుతూ మాట్లాడినట్లు కాల్ డేటాలో తేలిన మాయా కొద్నానీని 2007లో మోదీ తన కేబినెట్లోకి తీసుకున్నారు. అటల్ బిహారి వాజపేయి అధికారంలోకి వచ్చాక నాటి ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు మరో కమిషన్ను వేశారు. ఆ కమిషన్ 2005లో పార్లమెంట్కు నివేదికను సమర్పించింది. దానిపై అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ కూడా జరిపింది. ప్రతిపక్షం డిమాండ్ మేరకు మన్మోహన్ సింగ్ నాటి సిక్కుల ఊచకోతకు క్షమాపణలు చెప్పారు. రేడియో కార్యక్రమంలో 1984 నాటి అల్లర్లను ప్రస్తావించిన మోదీ, తన హయాంలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు నివేదికను ఇప్పటికైనా చర్చకు అనుమతించాలి. నాడు రాజీవ్ను ఆదర్శంగా తీసుకున్న మోదీ నేడు మన్మోహన్ సింగ్ను కూడా ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది.....................ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ఇందిరాగాంధీ హత్య రోజు ఏం జరిగిందీ?
న్యూఢిల్లీ: సరిగ్గా ఈ రోజుకు 32 సంవత్సరాల క్రితం దేశ చరిత్రలో ఏం జరిగిందో అందరికి గుర్తుండే ఉంటుంది. అంటే 1984, అక్టోబర్ 31వ తేదీన మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీ గార్డులు కాల్చి చంపారు. పర్యవసానంగా ముందు ఢిల్లీలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీ నగరంలోనే 2,100 మంది సిక్కులు ఊచకోతకు గురికాగా, దేశవ్యాప్తంగా 2,800 మంది ఊచకోతకు గురయ్యారు. అనధికార లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీలో మూడువేల మంది సిక్కులు, దేశవ్యాప్తంగా 8 వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారన్నది అంచనా. ఆ రోజు సఫ్దార్జంగ్ రోడ్డులోని తన అధికార నివాసం నుంచి ఇందిరాగాంధీ బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా 9.20 గంటలకు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్ వెపన్ల ద్వారా ఆమెపైకి 30 తూటాలు పేల్చారు. అందులో మూడు తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా, 20 తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్కనుంచి లోపలికెళ్లి మరో పక్కనుంచి బయటకు దూసుకెళ్లాయి. ఏడు తూటాలు ఆమె శరీరంలో చిక్కుకున్నాయి. తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆస్పత్రి వర్గాలు ఆరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ధ్రువీకరించాయి. ఆరోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందిగాంధీ హత్య జరిగిన రోజున రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్ టూర్లో ఉన్నారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ నాలుగు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా, ఐదు గంటల ప్రాంతంలో జైల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత గంటలోపలే రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నుంచే సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు ఐదుగురు సిక్కు ప్రముఖులు చేసిన విశ్వప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు. అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ రచయిత పత్వంత్ సింగ్కు ఉదయం 10 గంటలకే ఇందిరాగాంధీ మరణం గురించి తెల్సింది. ఆయన వెంటనే జరగబోయే దారుణాల గురించి ఊహించారు. వెంటనే 1971లో బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధంలో హీరోగా గుర్తింపు పొందిన లెఫ్ట్ నెంట్ జనరల్ జగ్జీత్ సింగ్కు ఫోన్ చేసి సంప్రతించారు. అనంతరం వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పటి ఏకైక మార్షల్ అర్జున్ సింగ్, దౌత్యవేత్త గురుచరణ్ సింగ్. రిటైర్డ్ బ్రిగేడియర్ సుఖ్జీత్ సింగ్లను కలుసుకొని అల్లర్లు నిరోధించేందుకు ఏం చేయాలని మంతనాలు జరిపారు. అప్పటికీ ఇందిరాగాంధీ వర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న ఇందర్ కుమార్ గుజ్రాల్ (ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన)ను సంప్రతించాలని నిర్ణయించి ఫోన్ చేశారు. అప్పటికే ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెల్సింది. ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు నవంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ను కలసుకున్నారు. అల్లర్లను నివారించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎక్కువ సేపు మౌనం పాటించిన ఆయన సైన్యాన్ని రంగంలోకి దింపితే అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు. ‘సార్ ఇప్పటికే ఢిల్లీ తగులబడి పోతోంది. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే వందమందికిపైగా మత్యువాత పడ్డట్టూ వార్తలందుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపడానికి ఇంతకన్నా ఉద్రిక్త పరిస్థితులు ఏం కావాలి?’ అని వారు ప్రశ్నించారు. అయినా సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం తనకు లేదని జైల్సింగ్ సమాధానం ఇచ్చారు. హోం మంత్రి పీవీ నరసింహారావుతో మాట్లాడమని సూచించగా ఆయన కార్యదర్శి హోం శాఖకు ఫోన్ చేసి కనుక్కొన్నారు. హోం మంత్రి అత్యవసర సమావేశంలో ఉన్నారని, మాట్లాడడం సాధ్యం కాదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. చేసేదేమీ లేక ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు వెనుతిరిగి వచ్చారు. అదేరోజు ఈ ఐదుగురు సిక్కులు హోం మంత్రి పీవీ నరసింహారావును కలసుకొన్నారు. అప్పటి వరకు సైన్యాన్ని దింపేందుకు ఇష్టపడని ఆయన అప్పుడు సైన్యాని రప్పించేందుకు నిర్ణయించినట్లు, సాయంత్రానికల్లా సైన్యం రంగంలోకి వస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు సైన్యాన్ని రంగంలోకి దింపొద్దని ప్రధాని కార్యాలయం నుంచే హోం శాఖకు ఆదేశాలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సైన్యం, పోలీసులకు మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు పీవీ నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. ఆ విషయం ఆర్మీ ఏరియా కమాండర్, ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ను కలుసుకొని మాట్లాడుకుంటారని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సిక్కు ప్రముఖులు ప్రధాని రాజీవ్ గాంధీని కలసుకునేందుకు ప్రయత్నించారు. రాజీవ్ అప్పాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాజేష్ పైలట్ను కోరారు. సంతాపం తెలియజేసేందుకు ఇప్పిస్తాగానీ, సిక్కుల ఊచకోత అంశాన్ని చర్చిస్తానంటే మాత్రం ఇప్పియ్యనని ఆయన సమాధానం ఇచ్చారు. సంతాపం ఎలాగూ తెలియజేస్తాం, సిక్కుల ఊచకోత అంశం కూడా ముఖ్యమేకదా, దాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పడంతో అప్పాయింట్మెంట్ నిరాకరించారు. నవంబర్ రెండవ తేదీన ఢిల్లీ నగరం సైన్యం ఆధీనంలోకి వచ్చాక అల్లర్లు తగ్గాయి. తాము చెప్పినట్లు ముందుగానే ప్రభుత్వం స్పందించి ఉంటే చరిత్రలో ఇంత రక్తపాతం జరిగి ఉండేది కాదన్నది సిక్కు ప్రముఖుల వాదన. ఇదే అల్లర్ల విషయమై అప్పుడు రాజీవ్ గాంధీని మీడియా ప్రశ్నించగా ‘ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు ప్రకంపనలు రావడం చాలా సహజం’ అని వ్యాఖ్యానించారు. (ఐదుగురు సిక్కు ప్రముఖులు, ఇందర్ కుమార్ గుజ్రాల్ డైరీ, పలు విచారణ కమిషన్ నివేదికలు, పౌరహక్కుల సంఘాల నివేదికలు, అప్పటి పోలీసు అధికారులు వెల్లడించిన అంశాల ఆధారంగా ఇస్తున్న వార్తా కథనం ఇది)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement