-
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
-
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
కోల్ కతా: ఐపీఎల్ 7 లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ - కోల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడటంతో మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు. ఈడెన్ గార్డెన్ నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. ఈ రోజు ఆట సాధ్యం కాకపోవడంతో ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. -
కోల్కతాలో ‘కింగ్స్’ నిలిచేనా!
ఐపీఎల్-7 ఆరంభం నుంచి ఒకే తరహా దూకుడుతో అద్భుత ఫలితాలు సాధించిన జట్టు ఒకవైపు...తడబడుతూ ప్రయాణం సాగించినా, పట్టుదలతో పోరాడి దూసుకొచ్చిన జట్టు మరోవైపు... ఒకరికి బ్యాటింగ్ అపార బలమైతే, మరొకరి బౌలింగ్ ప్రత్యర్థులను కట్టి పడేసింది. లీగ్ దశలోనూ సమఉజ్జీలుగా నిలిచిన ఈ రెండు జట్లు మరో కీలక సమరానికి సై అంటున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి ఫైనల్పై కన్నేయగా... కోల్కతా నైట్రైడర్స్ గతంలో ఒకసారి ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. నేడు తొలి క్వాలిఫయర్ - నైట్రైడర్స్తో పంజాబ్ పోరు - అద్భుత ఫామ్లో ఇరు జట్లు - గంభీర్ సేనకు ఈడెన్ అనుకూలత కోల్కతా: అనూహ్య మలుపులు తిరుగుతూ, అద్భుత ప్రదర్శనలతో అభిమానులకు ఆకట్టుకున్న ఐపీఎల్-7 తుది దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్ల అనంతరం కీలకమైన తొలి క్వాలిఫయర్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, కోల్కతా జట్లు మంగళవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో తలపడనున్నాయి. అద్భుతమైన తమ బ్యాటింగ్ లైనప్పై కింగ్స్ ఎలెవన్ ఆధార పడుతుండగా... బౌలింగ్తోపాటు సొంతగడ్డ బలాన్ని నైట్రైడర్స్ నమ్ముకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్ర్కమించదు. శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు మరోసారి పోటీ పడుతుంది. సూపర్ సీజన్... - ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ అందరికంటే వేగంగా పరుగులు చేసింది. టోర్నీలో ఆ జట్టు రన్రేట్ 9.03 కావడం విశేషం. - పంజాబ్ ఆరుసార్లు 190కి పైగా పరుగులు చేసింది. అందులో మూడు సార్లు లక్ష్యఛేదనలోనే కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేస్తూ కింగ్స్ ఎలెవన్ రెండు సార్లు మాత్రం 150కంటే తక్కువ స్కోరు నమోదు చేయగా... ఛేజింగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. - వరుసగా నాలుగు అద్భుత ప్రదర్శనతో టోర్నీలో సంచలనం రేపిన మ్యాక్స్వెల్ జోరు గత కొన్ని మ్యాచ్లుగా తగ్గడం పంజాబ్కు ఆందోళన కలిగించే అంశం. కోల్కతాలో ఆడిన రెండు మ్యాచుల్లో అతను 15, 14 పరుగులే చేశాడు. అయితే మిల్లర్, సెహ్వాగ్, బెయిలీ, మానన్ వోహ్రా, వృద్ధిమాన్ సాహాలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. - బౌలింగ్లో పేసర్ సందీప్ శర్మ కీలకం కానున్నాడు. అతను తీసిన 17 వికెట్లలో 12 పవర్ ప్లేలో రావడం చూస్తే జట్టుకు శుభారంభం ఇస్తున్నాడని అర్థమవుతోంది. మరో వైపు మిచెల్ జాన్సన్ తన పదునైన బౌలింగ్ను ప్రదర్శిస్తే కోల్కతాకు కష్టాలు తప్పవు. మ్యాచ్ మ్యాచ్కూ మెరుగు... - లీగ్లో తొలి 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి ఒక దశలో పేలవంగా కనిపించిన నైట్రైడర్స్ ఆ తర్వాత వరుసగా 7 మ్యాచ్లు గెలవడం జట్టు ఫామ్ను సూచిస్తోంది. - అద్భుత ఫామ్తో ‘ఆరెంజ్ క్యాప్’ను అట్టి పెట్టుకున్న రాబిన్ ఉతప్ప వరుసగా 9 ఇన్నింగ్స్లలో 40కు పైగా స్కోర్లు చేయడం విశేషం. ఇక గత మ్యాచ్లో 22 బంతుల్లో 72 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్పైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. అతను మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడితే రైడర్స్ పని సులువవుతుంది. బ్యాటింగ్లో గంభీర్తో పాటు మనీశ్ పాండే, డస్కటే, షకీబ్, సూర్యకుమార్లపై జట్టు ఆధారపడింది. - రెండేళ్ల క్రితం అద్భుత బౌలింగ్తో కోల్కతాను విజేతగా నిలిపిన సునీల్ నరైన్ ఇప్పుడు మరోసారి జట్టు భారాన్ని మోస్తున్నాడు. అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న అతను పంజాబ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయగలడు. మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్ పేస్ భారాన్ని మోస్తుండగా, పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో షకీబ్, పీయూష్ చావ్లా పాత్ర కూడా కీలకం కానుంది. - ఇక ఈడెన్ గార్డెన్స్లో భారీ సంఖ్యలో జట్టుకు అభిమానుల అండ ఉండటం ఇలాంటి కీలక మ్యాచ్లో అదనపు బలం కానుంది. - జట్ల వివరాలు (అంచనా): పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్వెల్, మిల్లర్, సాహా, అక్షర్ పటేల్, రిషి ధావన్, శివమ్ శర్మ, సందీప్ శర్మ, మిచెల్ జాన్సన్. - కోల్కతా: గంభీర్ (కెప్టెన్), ఉతప్ప, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, డస్కటే, షకీబ్, సూర్య కుమార్, మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్, నరైన్, వినయ్ కుమార్/చావ్లా. మ్యాచ్కు వర్షం గండం! క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మైదానం నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. వర్షం వస్తూ, పోతూ అవాంతరం కలిగిస్తే కనీసం ఐదేసి ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. పూర్తిగా సాధ్యం కాకపోతే ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకుంటుంది. ‘తుది జట్టును ఎంపిక చేసుకోవడంలో మేం తీసుకుంటున్న జాగ్రత్తలే ఈ విజయాలు అందించాయి. స్థానం దక్కకపోయినా షాన్ మార్ష్లాంటి ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు. వ్యూహాల్లో పాలుపంచుకొని పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు’ - సంజయ్ బంగర్ (పంజాబ్ కోచ్) ‘తొలి దశతో పోలిస్తే కుదురుకోవడానికి సమయం తీసుకున్నాం. అయితే యువ ఆటగాళ్లతో పాటు అనుభవం ఉండటంతో మేము సాధించగలమనే నమ్మకం కలిగింది. ఫలితమే ఈ వరుస విజయాలు దక్కాయి’ - యూసుఫ్ పఠాన్, కోల్కతా ఆటగాడు -
ఈ ఒక్కటైనా గెలుస్తారా!
నేడు బెంగళూరుతో హైదరాబాద్ పోరు - ప్రత్యర్థి దూకుడును అడ్డుకునేనా! - ఓడితే కథ ముగిసినట్లే సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై వరుసగా ఓడటం గతంలో డెక్కన్ చార్జర్స్కు అలవాటుగా ఉండేది. తొలి సీజన్లో అన్ని మ్యాచ్లు ఓడిన ఆ జట్టు ఆ తర్వాత చాన్నాళ్లకు తొలి విజయం నమోదు చేసింది. ఇప్పుడు సన్రైజర్స్గా మారిన హైదరాబాద్ జట్టు ఈ సారి అదే తరహాలో పరాజయాల బాట పట్టింది. ఉప్పల్లోని ఆడిన మూడు మ్యాచ్లూ ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది. సీజన్లో ఇక్కడ మిగిలిన ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా అనేది చూడాలి. పటిష్టమైన బెంగళూరును ఓడిస్తే ఫ్యాన్స్కు సంతృప్తి దక్కవచ్చు. ఐపీఎల్లో గత మ్యాచ్ పరాజయంనుంచి కోలుకోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న హైదరాబాద్, ఈ మ్యాచ్లో ఓడితే ఈ ఏడాది లీగ్లో ముందంజ వేసే అవకాశానికి తెర పడినట్లే. మరో వైపు రైజర్స్ను ఓడిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు ఉండటంతో ఆర్సీబీ గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పేలవ ప్రదర్శన ఐపీఎల్-7లో ఆరంభంనుంచి కూడా ఏ ఒక్క మ్యాచ్లోనూ హైదరాబాద్ జట్టు తనదైన ముద్ర వేయలేకపోయింది. బ్యాటింగ్లో జట్టు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండు సార్లు భారీ స్కోర్లు నమోదు చేసినా అవి పరాజయానికే పనికొచ్చాయి. వ్యక్తిగతంగా చూస్తే డేవిడ్ వార్నర్ ఒక్కడే టి20 తరహా క్రికెట్ ఆడుతున్నాడు. 4 అర్ధ సెంచరీలు సహా అతను 375 పరుగులు చేశాడు. ఫించ్ రెండు హాఫ్ సెంచరీలు చేసినా ఆ రెండు సార్లూ టీమ్ ఓడింది. స్యామీ కూడా ఒక్క మెరుపు ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక భారత క్రికెటర్లు మాత్రం ఒక్కటీ చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోతున్నారు. కెప్టెన్సీనుంచి తప్పించినా గత మ్యాచ్లో ధావన్ బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేదు. బౌలింగ్లో భువనేశ్వర్ మెరుగ్గా ఉన్నా...చివరి ఓవర్లలో అతనూ తేలిపోతున్నాడు. జట్టు బలమైన స్టెయిన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం రైజర్స్ కష్టాలు పెంచింది. వ్యక్తిగతంగా, జట్టుగా రైజర్స్ సర్వ శక్తులూ ఒడ్డి అసాధారణ ప్రదర్శన కనబరిస్తేనే విజయావకాశాలు ఉన్నాయి. టాపార్డర్ కీలకం చెన్నైతో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో గెలుపుతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు కాపాడుకుంది. గత మ్యాచ్లో ప్రధాన ఆటగాళ్లు గేల్, డివిలియర్స్ చక్కటి ఇన్నింగ్స్ ఆడి గెలిపించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కోహ్లి మంచి ఫామ్లో లేకపోయినా...యువరాజ్ కూడా నిలదొక్కుకోవడంతో చాలెంజర్స్ పటిష్టంగా కనిపిస్తోంది. వీరందరూ సమష్టిగా రాణిస్తే బెంగళూరుకు భారీ స్కోరుకు అవకాశాలున్నాయి. బౌలింగ్లో స్టార్క్, ఆరోన్ మెరుగ్గా రాణిస్తున్నారు. భారత దేశవాళీ క్రికెటర్లలో ఈ సారి చక్కటి గుర్తింపు తెచ్చుకున్న లెగ్స్పిన్నర్ యజువేంద్ర చహల్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. -
రాయల్స్కు ముంబై బ్రేక్
పొలార్డ్.. వండర్ క్యాచ్ ముంబై ఆటగాడు పొలార్డ్ ఫీల్డింగ్లో అద్భుతం సృష్టించాడు. హర్భజన్ బౌలింగ్లో రాజస్థాన్ బ్యాట్స్మన్ కూపర్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద పొలార్డ్ నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. లాంగ్ ఆన్లో కూపర్ ఆడిన భారీ షాట్కు సిక్సర్ దిశగా అంతెత్తున దూసుకెళ్తున్న బంతిని ఒంటి చేత్తో అందుకున్న పొలార్డ్.. తనను తాను నియంత్రించుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటాడు. అయితే రెండు కాళ్లూ గాల్లో ఉండగానే బంతిని పైకి విసిరి, ఆపై మళ్లీ మైదానంలోకి దూకి బంతిని అందుకున్నాడు. గతంలోనూ పొలార్డ్ ఇలాంటి అద్భుతాలు చేసినా... ఈ మ్యాచ్లో పట్టిన క్యాచ్ నమ్మశక్యం కాని రీతిలో ఉంది. - కీలక మ్యాచ్లో ఓడిన రాజస్థాన్ - 25 పరుగులతో రోహిత్ సేన అద్భుత విజయం అహ్మదాబాద్: ప్లే ఆఫ్కు చేరువయ్యామన్న అతివిశ్వాసమో లేక ఈ సీజన్లో అంతగా రాణించలేకపోతున్న ముంబై ఇండియన్స్ను తక్కువగా అంచనా వేశారో గానీ.. కీలక మ్యాచ్లో నలుగురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రాజస్థాన్ తగిన మూల్యం చెల్లించుకుంది. ముంబై చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు ఇప్పటికే ‘తుది నాలుగు’లో ఆశలు దాదాపు అడుగంటిన ముంబై.. ఇక పోయేదేమీ లేదన్నట్లుగా పోరాడి రాజస్థాన్ దూకుడుకు బ్రేక్ వేసింది. సోమవారం ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మైక్ హస్సీ (39 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్స్లు), సిమ్మన్స్ (51 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్లు)లు అర్ధసెంచరీలతో శుభారంభాన్నివ్వగా... చివర్లో రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో విఫలమైన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ కరుణ్ నాయర్ (24 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్లు), టెయిలెండర్లు హాడ్జ్ (30 బంతుల్లో 40; 3 సిక్స్లు), ఫాల్క్నర్ (21 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు)లు రాణించినా ఇతర బ్యాట్స్మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎట్టకేలకు హస్సీ... ఏడు మ్యాచ్ల తరువాత తిరిగి తుదిజట్టులోకి వచ్చిన ముంబై ఓపెనర్ మైక్ హస్సీ సత్తా చాటాడు. సిమ్మన్స్తో కలిసి తొలి వికెట్కు 120 పరుగులతో అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ఈ క్రమంలో పవర్ప్లేలో 42 పరుగులు చేసిన ముంబై.. 10 ఓవర్లకు 76 పరుగులు చేసింది. ఆ తరువాత దూకుడు పెంచి అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న హస్సీ, సిమ్మన్స్ ఇద్దరూ ఒకే ఓవర్లో (15వ) అవుటయ్యారు. అయితే ఆ తరువాత పొలార్డ్ సహకారంతో కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. దీంతో చివరి పది ఓవర్లలో 102 పరుగులు రాబట్టుకున్న ముంబై.. రాజస్థాన్కు సవాలు విసిరే స్కోరును సాధించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రోహిత్ రనౌటయ్యాడు. వరుస విరామాల్లో వికెట్లు భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్కు ముంబై బౌలర్లు ఆరంభంలోనే ముకుతాడు వేశారు. మూడో ఓవర్లో ఉన్ముక్త్ చంద్ (2)ను అవుట్ చేసిన ప్రజ్ఞాన్ ఓజా.. తన మరుసటి ఓవర్లో వాట్సన్ (5)నూ వెనక్కి పంపాడు. ఆ వెంటనే శామ్సన్ (2)ను సాంటొకీ డగౌట్కు చేర్చాడు. అయితే వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు నుంచి కరుణ్ నాయర్ ఏమాత్రం వెరవకుండా ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో 47 పరుగులు వచ్చాయి. హర్భజన్ వేసిన 8వ ఓవర్లో పొలార్డ్ అందుకున్న అద్భుత క్యాచ్తో కూపర్ (5) వెనుదిరగడం, ఆపై గోపాల్ తన వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్ మరింత ఇక్కట్లలో పడింది. సాధించాల్సిన రన్రేట్ పెరిగి పోతుండడంతో భారీషాట్కు యత్నించి నాయర్ కూడా అవుటయ్యాడు. దీంతో 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాయల్స్.. గెలుపుపై ఆశలు కోల్పోయింది. చివర్లో హాడ్జ్, ఫాల్క్నర్లు ఎదురుదాడికి దిగి భారీషాట్లు ఆడినా అప్పటికే ఆలస్యమైంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్: మైక్ హస్సీ (సి) కూపర్ (బి) అంకిత్ శర్మ 56; సిమ్మన్స్ (సి) కూపర్ (బి) అంకిత్ శర్మ 62; పొలార్డ్ (నాటౌట్) 14; రోహిత్ శర్మ (రనౌట్) 40; ఎక్స్ట్రాలు 6, మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-120; 2-122; 3-178. బౌలింగ్: అంకిత్ శర్మ 4-0-23-2; కులకర్ణి 4-0-27-0; ఫాల్క్నర్ 4-0-47-0; కూపర్ 3-0-27-0; బిన్నీ 1-0-12-0; భాటియా 4-0-39-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: కరుణ్ నాయర్ (సి) సాంటొకీ (బి) హర్భజన్ 48; ఉన్ముక్త్ (సి) హస్సీ (బి) ఓజా 2; వాట్సన్ (సి) రాయుడు (బి) ఓజా 5; శామ్సన్ (సి) రాయుడు (బి) సాంటొకీ 2; కూపర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 5; అంకిత్ శర్మ (సి) రాయుడు (బి) గోపాల్ 4; బిన్నీ (స్టంప్డ్) తారే (బి) గోపాల్ 2; హాడ్జ్ (సి) రోహిత్ (బి) సాంటొకీ 40; ఫాల్క్నర్ (నాటౌట్) 31; భాటియా (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-17; 2-38; 3-42; 4-61; 5-66; 6-69; 7-75; 8-144. బౌలింగ్: బుమ్రాహ్ 3-0-23-0; సాంటొకీ 4-0-50-2; ఓజా 4-0-30-2; పొలార్డ్ 1-0-11-0; హర్భజన్ 4-0-13-2; గోపాల్ 4-0-25-2.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement