వీడని మిస్టరీ!
► జయలలిత వీలునామా అపహరణ
► లొంగిపోయిన యువకుని విచారణ
► జయ ఆస్తుల పత్రాలకేనా అని అనుమానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్ చేసిన సంఘటనకు అసలైన కారణం వెలుగులోకి రాకపోగా జయ ఆస్తుల వీలునామా అపహరణకు గురైనట్లు అనుమానిస్తున్నారు. నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్లోకి గత నెల 23వ తేదీన 11 మంది గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సెక్యూరిటీగార్డు ఓం బహదూర్ను హత్యచేశారు. అనంతరం ఎస్టేట్ అద్దాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి నగదు, నగలు, కొన్ని డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. జయలలిత గదిలో మూడు సూట్కేసులు పగులగొట్టిన స్థితిలో ఖాళీగా పడి ఉన్నాయి. ఆ సూట్కేసులో ఏమి ఉండేవి, దుండగులు వాటి నుండి ఏమీ ఎత్తుకెళ్లారో వివరాలు స్పషం కాలేదు.
జయలలితకు చెందిన ఐదు చేతి గడియారాలు మాత్రమే దొంగతనానికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దోపీడీ, హత్యకు కేరళకు చెందిన కిరాయి ముఠాను ప్రయోగించినట్లు మాత్రం రుజువైంది. ఈ కేసులో సంతోష్స్వామి (39), దీపు (32), సతీషన్ (42), ఉదయకుమార్ (47)ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా జయలలిత వద్ద ఒప్పుడు కారు డ్రైవర్గా పనిచేసిన సేలంకు చెందిన కనకరాజ్, అతని స్నేహితుడు కోయంబత్తూరుకు చెందిన సయన్ తదితర 11 మంది పాత్ర ఉన్నట్లు కనుగొన్నారు. వీరిలో కనకరాజ్ కారు ప్రమాదంలో మృతి చెందడం, మరో అనుమానితుడు సయన్ తీవ్రగాయాలతో కోవై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం కేసు తీవ్రతను పెంచింది.
ఇదిలా ఉండగా పోలీసులు గాలిస్తున్న మనోజ్ను పోలీసులు అరెస్ట్ చేశారని, కాదు కాదు రెండు రోజులకు ముందే కేరళ పోలీసుల సమక్షంలో ఆయన లొంగిపోయాడని బిన్నవాదనలు వినపడుతున్నాయి. నీలగిరి పోలీసులు కేరళకు వెళ్లి మనోజ్ను స్వాధీనం చేసుకుని కొడనాడుకు తెచ్చారు. అతన్ని నాలుగు గంటలపాటూ విచారించారు. అక్కడి నుండి కొత్తగిరి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి డీఐజీ దీపక్ దామోదర్ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో విచారించారు. కొడనాడులో హత్య, దోపిడీల్లో కనకరాజ్, సయన్ల తరువాత మనోజ్ ముఖ్యమైన నిందితుడగా భావిస్తున్నారు.
కనకరాజ్, సయాన్ల పరిస్థితి తనకు ఏర్పడుతుందనే భయంతోనే మనోజ్ పోలీసుల ముందు లొంగిపోయాడని అంటున్నారు. సంఘటన జరిగిన రోజున మనోజే ముందుగా ఎస్టేట్ గేట్ ఎక్కి బంగ్లాలో ప్రవేశించినట్లు విచారణలో తేలింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటలకు నీలగిరి జిల్లా మేజిస్ట్రేటు నేర విభాగం కోర్టులో మనోజ్ను ప్రవేశపెట్టగా 15 రోజుల రిమాండ్ పడింది. దీంతో అతన్ని కోవై సెంట్రల్ జైలులో పెట్టారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం కేరళ పోలీసులు అరెస్ట్ చేసిన బిజిత్తాయ్, జమ్షీర్ల కోసం వెళ్లిన తమిళనాడు పోలీసులు ఇంకా ఊటీకి చేరుకోలేదు. అలాగే మరో ఇద్దరిని సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొడనాడు ఎస్టేట్ దోపిడికి పథక రచన చేసిన కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అనేక రహస్యాలు వెలుగుచూడక మిస్టరీగా మారింది.
రూ.200 కోట్ల ఆస్తులు, వీలునామా అపహరణ :
కాగా, పట్టుపడిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కొడనాడు ఎస్టేట్ నుండి రూ.200 కోట్ల విలువైన సొత్తుతోపాటూ జయ రాసిన వీలునామా సైతం అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. జయలలిత తన ఆస్తులపై సవివరమైన వీలునామాను రాసినట్లు సమాచారం. తన మరణానంతరం కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఏమి చేయాలని అందులో పేర్కొన్నట్లు భావిస్తున్నారు. ఈ వీలునామా జయలలిత గదిలోని సూట్కేసులో భద్రం చేసిందని అంటున్నారు.
పగులగొట్టిన సూట్కేసుల నుండి వీలునామాను ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కోవై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సయన్ కోలుకుంటే కీలకమైన సమాచారం లభిస్తుందని పోలీసులు ఎదురుచూస్తున్నారు. అయితే మంగళవారం అకస్మాత్తుగా సయన్కు శ్వాసకోస ఇబ్బంది తలెత్తగా పోలీసులు బెంబెలెత్తిపోయారు. అయితే ఇంతలోనే సద్దుమణిగింది.కాగా నిందితుల్లో ఒకరైన సామిల్లు యజమాని ఒకరు దుబాయ్కు పారిపోవడం పోలీసులను అందోళనకు గురిచేసింది.