-
ఆధార్ రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆధార్ పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని దీని ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందనేది పూర్తి అవాస్తవమని పేర్కొంది. 12 అంకెల ఆధార్ నెంబర్ను తప్పనిసరి చేసే సేవలను పరిమితం చేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. బ్యాంకు అకౌంట్లు, మొబైల్ కనెక్షన్లు, స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తీర్పుతో స్పష్టం చేసింది. ఈ తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ ఒక్కరే ఆధార్ చట్టంపై భిన్నమైన తీర్పు చెప్పారు. మిగిలిన వారంతా ఆధార్ రాజ్యాంగబద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని కోర్టు తెలిపింది. ఆదాయపు పన్ను (ఐటీ) దాఖలు, పాన్ (పీఏఎన్) నెంబరు కేటాయింపులో ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. పలువురు న్యాయ నిపుణులు ఈ తీర్పు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డారు. సెక్షన్ 57 అసంబద్ధం: సుప్రీం టెలికాం కంపెనీలతోపాటు, కార్పొరేట్ సంస్థలకు బయోమెట్రిక్ ఆధార్ డేటాను పొందేందుకు అనుమతించిన ఆధార్ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, పథకాలు, సేవల లబ్ధి కల్పించే) చట్టం – 2016లోని సెక్షన్ 57ను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆధార్ డేటా ఆర్నెల్ల కంటే ఎక్కువరోజులు దాచుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. జస్టి‹స్ చంద్రచూడ్ భిన్నమైన తీర్పునిచ్చారు. ఆధార్చట్టాన్ని పార్లమెంటులో ద్రవ్యబిల్లుగా ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటుగా ధర్మాసనంలోని ఇతర జడ్జీలు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఖన్విల్కర్లు దీంతో విభేదించారు. ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా లోక్సభ ఆమోదించడాన్ని సమర్థించారు. ఆధార్ ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని.. ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరేందుకు వీలుంటుందని ఈ నలుగురు పేర్కొన్నారు. ఆధార్ ఓ ప్రత్యేకమైన వ్యవస్థ అని.. దాన్ని అలాగే ఉంచేందుకు ప్రయత్నించాలని కేంద్రానికి సూచించారు. ‘ఆధార్ పేదలకు గౌరవాన్ని కల్పిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛకన్నా గౌరవం దక్కడం ముఖ్యం’ అని 1,448 పేజీల తీర్పులోని కొన్ని అంశాలను చదువుతూ జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు. ఓ మంచి పని జరుగుతున్నప్పుడు కాస్తంత చెడు జరగటం సహజమేనన్నారు. ‘పౌరులపై నిఘా పెంచేందుకే ఆధార్ను ప్రభుత్వం ప్రతిచోటా తప్పనిసరి చేస్తోందని పిటిషనర్ల వాదన. వ్యక్తిగత గోప్యత హక్కుకు విఘాతం కలుగుతోందంటున్నారు. ప్రభుత్వం ఆధార్ వ్యవస్థ భద్రతను మరింత కట్టుదిట్టంగా మార్చాలి’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్నట్లుగా.. జాతీయ భద్రత పేరుతో ఆధార్ డేటాను సేకరించే అంశాన్ని కిందిస్థాయి ఉద్యోగులకు కట్టబెట్టడం సరికాదని పేర్కొంది. కనీసం జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారికి అధికారాన్ని అప్పజెప్పాలంది. ఆధార్ చట్టబద్ధతపై మాజీ హైకోర్టు న్యాయమూర్తి కేఎస్ పుట్టుస్వామి సహా 31 మంది పిటిషనర్లు వేసిన వ్యాజ్యాలను గతంలోనే (మే 10వ తేదీ) విచారణ పూర్తిచేసిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. బీజేపీకి చెంపపెట్టు: కాంగ్రెస్ ప్రైవేటు సంస్థల చేతికి ఆధార్ డేటాను అందించే ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. ‘ఈ చట్టంలోని సెక్షన్ 57ను కోర్టు తప్పుబట్టడం హర్షదాయకం. ప్రైవేటు సంస్థలు ఆధార్ డేటాను తీసుకోవడం ఆపేస్తాయి’ అని ట్విట్టర్లో పార్టీ పేర్కొంది. ప్రైవేటు సంస్థలనుంచి ఆధార్ హక్కులను తొలగించడం.. అధికార బీజేపీకి చెంపపెట్టు అని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ విజయమిది: బీజేపీ ఆధార్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు.. పేదలకు, పేదల పక్షపాత మోదీ ప్రభుత్వానికి దక్కిన విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ఆధార్ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలన్నీ భగ్నమయ్యాయన్నారు.ఈ తీర్పు చారిత్రకమని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఆధార్ ద్వారా ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లీకేజీలు అరికట్టడంతో ప్రతిఏటా రూ.90వేల కోట్లు ఆదా అవుతున్నాయని ఆయన వెల్లడించారు. నిఘా అవాస్తవం: యూఐడీఏఐ ఆధార్ ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడం, నిరంతరం వారిపై నిఘా ఉంటుందన్న వార్తల్లో వాస్తవం లేదని యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) పునరుద్ఘాటించింది. ఆధార్ ద్వారా కల్పించే కనీస వివరాల ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలగదు. సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని వెల్లడించింది. పౌరులపై నిఘా ఉంచడం కూడా ఆధార్ వల్ల సాధ్యం కాదు. ఈ డేటాను కాపాడేందుకు కూడా ఆధార్ వద్ద పటిష్టమైన భధ్రతావ్యవస్థ ఉంది. పరిమిత ప్రభుత్వం రాజ్యాంగపరమైన విశ్వాసాన్ని ఆధార్ చట్టం కల్పిస్తోంది’ అని యూఐడీఏఐ సీఈవో అజయ్ అన్నారు. ద్రవ్యబిల్లు కాదు: జస్టిస్ చంద్రచూడ్ రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగొద్దనే ప్రభుత్వం ద్రవ్యబిల్లుగా మార్చి లోక్సభ ఆమోదంతో సరిపెట్టిందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 110లోని పలు నిబంధనలు.. ఆధార్ చట్టాన్ని ద్రవ్యబిల్లుగా పరిగణించడానికి పూర్తి వ్యతిరేకమన్నారు. ఆధార్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ‘మొబైల్ ఫోన్లు భారతీయుల జీవనంలో భాగమైపోయాయి. దీన్ని ఆధార్తో జతపర్చడం వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛలకు విఘాతం కలిగిస్తుంది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు వెంటనే వినియోగదారుల ఆధార్ డేటాను తొలగించాలి. బ్యాంకు అకౌంట్లను తెరిచేవారూ ఆధార్ వివరాలను పొందుపర్చడం సరికాదు. అంటే బ్యాంకు అకౌంట్ తెరిచే ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టేందుకు ఆయనేమైనా ఉగ్రవాదా?’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. వివిధ ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉండే ఆధార్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆధార్ ద్వారా సమాచార గోప్యతకు భంగం కలిగిస్తుందంటూ యూఐడీఏఐ కూడా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. ఆధార్ లేకుండా భారత్లో జీవించడం దాదాపు కష్టమేననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పౌరుడి ప్రతి వివరాన్ని ఆధార్తో జతపరుస్తూ పోతే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరుల డేటాకు భద్రతనిచ్చేందుకు యూఐడీఏఐకు సంస్థాపరమైన బాధ్యతలేమీ లేవన్నారు. వ్యక్తిగత గోప్యతను కాపాడలేని పక్షంలో ఇతర హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుందని.. దీనికి భద్రత కల్పించే సరైన చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటు వ్యవస్థదేనన్నారు. వాడివేడిగా వాదనలు.. అయినా! ఆధార్ చట్టబద్ధతపై విచారణ సందర్భంగా కోర్టు గదిలో.. కోర్టు బయటా వాడివేడి చర్చలు జరిగాయని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇవేవీ ఆధార్కు వ్యతిరేకంగానో, అనుకూలంగానో నిర్ణయం తీసుకునేలా తమపై ప్రభావితం చేయలేదని స్పష్టం చేసింది. ఆధార్తో అనుసంధానమైన భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగానే వ్యవహరించామని తీర్పు సందర్భంగా పేర్కొంది. మేధావుల దగ్గర్నుంచి.. సామాన్య ప్రజల వరకు ఇంటర్వ్యూలు, కథనాలు, గల్లీ చర్చల్లో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని కోర్టు తెలిపింది. ‘ఇరువర్గాల భావోద్వేగాలు, ఆవేశకావేశాలు, బాధలన్నింటినీ విచారణ సందర్భంగా అర్థం చేసుకున్నాం. పౌరులకు కల్పించిన హక్కులు, దేశభద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకునే మేం తీర్పును వెలువరించాం’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘విచారణ సందర్భంగా ఆధార్కు వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించిన అంశాలను పేర్కొన్నారు. ఆధార్కు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన వారేమో.. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందని వాదించారు’ అని జస్టిస్ సిక్రీ వెల్లడించారు. వ్యక్తిగత సమాచారం భద్రమే ఆధార్ కార్డు దారుల వ్యక్తిగత సమాచార భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని చట్టం ఇక నుంచి భద్రంగా ఉంచుతుందని,ప్రభుత్వంకాని, ప్రైవేటు సంస్థలు కాని దాన్ని పొందలేవని అభిప్రాయపడింది. అక్రమ వలసదారులకు వద్దు అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు జారీ కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడం కోసం అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందుతున్నారంది. ‘భద్రతా కారణాలు’ చెల్లవు ఆధార్ చట్టంలోని 33వ సెక్షన్ను కోర్టు కొట్టివేసింది. దేశ భద్రత దృష్ట్యా వ్యక్తుల ఆధార్ సమాచారాన్ని బలవంతంగా సేకరించడానికి ఈ సెక్షన్ ప్రభుత్వానికి అధికారం కల్పించింది.ఇప్పుడీ సెక్షన్ను కొట్టివేయడంతో భద్రతా కారణాలు చెప్పి ఆధార్ వివరాలు లాక్కోవడం కుదరదు. పాన్–ఆధార్ లింక్.. ఆధార్తో పాన్ నంబర్ అనుసంధానం 50 శాతానికి పైగా పూర్తయింది. ఆధార్తో పాన్ లింక్ను కోర్టు బుధవారం సమర్థించిన నేపథ్యంలో తాజాగా విడుదల అయిన నివేదికలో ఈ విషయం తేలింది. సోమవారం నాటికి 21,08,16,676 పాన్ నంబర్లు ఆధార్కు అనుసంధానం అయ్యాయి. ఇప్పటివరకు జారీ చేసిన 41.02 కోట్ల పాన్ కార్డుల్లో 40.01 కోట్ల కంటే ఎక్కువ కార్డులు వ్యక్తిగతమైనవి కాగా మిగతావి పన్ను చెల్లించే కంపెనీలు, ఇతర విభాగాల పేరిట ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుసంధానం గడువును ఆదాయపన్ను శాఖ గతంలో ఐదుసార్లు పొడిగించింది. ఆధార్ కేసు నడిచిందిలా... ఆధార్ రాజ్యాంబద్ధతపై న్యాయస్థానంలో దాఖలైన కేసు తొమ్మిదేళ్లు నడిచింది.ఆధార్ను వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా కోర్టులు భిన్న వ్యాఖ్యలు చేశాయి. చివరకు ఆధార్ రాజ్యంగబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు కొనసాగిన క్రమమిది ► 2009, జనవరి: యుఐడీఏఐ ఏర్పాటు. ► 2010, సెప్టెంబర్: తొలి ఆధార్ నెంబరు కేటాయింపు. ► డిసెంబర్: పార్లమెంటులో ఆధార్ బిల్లు. ► 2011 సెప్టెంబర్: 10కోట్లకు చేరిన ఆధార్ పొందిన వారి సంఖ్య. ► డిసెంబర్: ఆధార్ బిల్లుపై స్టాండింగ్ కమిటీ రిపోర్టు. ► 2012, నవంబర్: ఆధార్ చట్టబద్ధతను సవాలు చేస్తూ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి, మరికొందరు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు. ► 2013, నవంబర్: ఈ కేసులో ప్రతివాదులుగా చేరాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశం. ► 2015, అక్టోబర్: ఆధార్ స్వచ్ఛందమేనంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ► 2016, మార్చి 3: మళ్లీ లోక్సభకు ఆధార్ బిల్లు–2016. ఆర్థిక బిల్లుగా దీనికి ఆమోదం. ఆధార్ పొందిన వారి సంఖ్య 98 కోట్లు. ► సెప్టెంబర్: అమల్లోకి వచ్చిన ఆధార్ చట్టం. ► 2017,మే: ఆధార్ బిల్లును ఆర్థిక బిల్లుగా పరిగణించడంపై సుప్రీంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పిటిషన్. ► 2017, ఆగస్టు 24: వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ధర్మాసనం రూలింగ్. ► 2018, జనవరి 17: ఆధార్ కేసు విచారణను ప్రారంభించిన సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ► సెప్టెంబర్ 26: ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు. చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టివేత. -
‘నిర్భయ’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
దేశం నడిబొడ్డున అర్ధరాత్రి పారామెడికల్ విద్యార్థిని అతిక్రూరంగా లైంగిక దాడి చేసి చంపిన దోషుల భవితవ్యం నేడు తేలనుంది. మరణ శిక్ష రద్దు కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీం తీర్పు కోసం దేశం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్పై సోమవారం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. నిందితులకు ట్రయల్ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గతేడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్(29), పవన్ గుప్తా(22), వినయ్ శర్మ(23)ల తరపున పిటిషన్ దాఖలైంది. మరో నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్(31) కూడా దాఖలు చేయనున్నట్లు అతని తరపు న్యాయవాది తెలిపాడు. కాగా రివ్యూ పిటిషన్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్ల ఆధర్వ్యంలో ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును రిజర్వ్లో ఉంచింది. మరికొద్ది గంటల్లోనే తీర్పు వెలువడనుండటంతో ఉత్కంఠ నెలకొంది. మరణ శిక్షనే అమలు చేయాలని తీర్పిస్తుందా? లేదా? జీవిత ఖైదుగా మారుస్తుందా? అన్న చర్చ మొదలైంది. కాగా, 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు యువతి కన్నుమూసింది. కేసులో ఆరుగురు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెలువరించింది. -
జడ్జీలను ఎలా అభిశంసిస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభింశసన తీర్మానం చుట్టే గత వారం రోజులుగా కేంద్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏడు విపక్ష పార్టీలు సంయుక్తంగా అభిశంసన కోరుతూ 71 మంది ఎంపీల సంతకాలతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడికి ఓ తీర్మానం సమర్పించడం, దాన్ని వెంకయ్య నాయకుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ఇది అన్యాయమంటూ విపక్షాలు గోల చేయడం తదితర పరిణామాలన్నీ తెలిసినవే. ప్రస్తుతమున్న విధానం ప్రకారం ఓ సుప్రీం కోర్టు జడ్జీని అభిశంసించడం దాదాపు సాధ్యమయ్యేపని కాదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడం కోసమే అభిశంసన అంశంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో జడ్జీలకు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ మరింత సులవుగా ఉండాలి. ప్రస్తుతం కఠినంగా ఉండడం వల్ల అది పాలకపక్షానికి మాత్రమే ఉపయోగపడేలా ఉంది. సానుకూలంగా తీర్పు చెప్పకపోతే అభిశంసనతో తొలగిస్తామంటూ పాలకపక్షం సుప్రీం జడ్జీలను లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను పాలకపక్షం బెదిరించవచ్చు. అప్పుడు సదరు జడ్జీలు పాలకపక్షానికి సానుకూలంగా స్పందించవచ్చు. ‘జ్యుడీషియల్ స్టాండర్ట్స్ అండ్ అకౌంటబిలిటీ (న్యాయవ్యవస్థ ప్రమాణాలు, జవాబుదారితనం) బిల్’ను ఈ పాటికి ఆమోదించి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ బిల్లు గత రెండేళ్లుకు పార్లమెంట్లో దుమ్ముకొట్టుకుపోతోంది. ప్రస్తుత సుప్రీం జడ్జీలను అభిశంసించాలంటే నిర్దిష్ట సంఖ్యలో ఎంపీలు సంతకాలు చేసిన లేఖను లోక్సభ స్పీకర్కుగానీ, రాజ్యసభ చైర్మన్కుగానీ అందజేయాలి. దానిపై ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీ వేయాలి. ఆ విచారణ కమిటీ పార్లమెంట్కు నివేదిక సమర్పించాలి. ఆ నివేదికపై ఇరు సభల్లో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఓటింగ్. ఇరు సభలో మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు లేదా ఆ రోజు సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది సభ్యలు అనుకూలంగా ఓటు వేస్తేనే అభిశంసన చెల్లుతుంది. గతంలో ఏం జరిగిందీ! దేశంలోనే మొట్టమొదటి సారిగా జస్టిస్ వీ. రామస్వామిపై అభిశంసన ప్రక్రియను చేపట్టారు. ఆయన పంజాబ్, హర్యాన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు భారీగా ప్రభుత్వం సొమ్మును ఖర్చు పెట్టారని, అందులో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ కొంతమంది న్యాయవాదులు 1990లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సవ్యసాచి ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణల నుంచి విముక్తి పొందేవరకు విధులు నిర్వర్తించరాదంటూ ఆ లేఖపై స్పందించిన ముఖర్జీ, రామస్వామిని ఆదేశించారు. 1991లో ఆయనపై లోక్సభ అభిశంసనకు అనుమతించింది. దానిపై త్రిసభ్య కమిటీని స్పీకర్ నియమించారు. కమిటీ నివేదిక సమర్పించింది. దానిపై సభ్యులు మాట్లాడారు. రామస్వామి తరఫున కపిల్ సిబాల్ వాదించారు. 1993, మే 10న అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరగాలి. అప్పుడు ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. పాలకపక్ష కాంగ్రెస్ తన సభ్యులందరికీ తప్పనిసరిగా హాజరుకావాలనీ, అయితే ఓటింగ్లో పాల్గొనరాదని విప్ జారీ చేసింది. ఓటింగ్లో జడ్జీని అభిశంసించాలంటూ 196 ఓట్లు వచ్చాయి. ఒక్కరు కూడా రామస్వామికి అనుకూలంగా ఓటు వేయలేదు. తీర్మానం వీగిపోయింది. కారణం సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఓటు వేయకపోవడమే. ఓ జడ్జీని అభిశంసించడమంటే భారత దేశంలో ఎప్పుడూ ఓ రాజకీయమే. ఆ తర్వాత జస్టిస్ పీడీ దినకరణ్, జస్టిస్ సౌమిత్రా సేన్లకు వ్యతిరేకంగా కూడా అభిశంసనకు ప్రయత్నించారు. అయితే వారిరువురు కూడా పార్లమెంట్లో తీర్మానం పెట్టకముందే తమ పదవులకు రాజీనామా చేయడంతో వారిపై ఎలాంటి చర్యతీసుకోలేదు. రాజ్యసభ చేసినా వారిపై అభిశంసన కొనసాగాలే చట్టాన్ని మార్చాలంటూ అప్పుడు డిమాండ్ వచ్చింది. అభిశంసన తీర్మానం వీగిపోతుందని తెలిసి కూడా దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చిందంటే కూడా రాజకీయమే. దీన్ని వెంకయ్య నాయుడు తిరస్కరించారంటే సుప్రీం కోర్టుకు వెళ్లడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకున్న మార్గం. దాన్ని ఎవరు విచారించాలన్నది కూడా దీపక్ మిశ్రానే నిర్ణయిస్తారు కనుక కాంగ్రెస్కు సానుకూల నిర్ణయం రాకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా జడ్జీని ఒక్క బంగ్లాదేశ్లో తప్ప జడ్జీని అభిశంసించడమన్నది పార్లమెంట్ చేతుల్లోనే ఉంది. తమ దేశ రాజ్యాంగంలో నుంచి జడ్జీల అభిశంసనను 16వ రాజ్యాంగ సవరణ ద్వారా బంగ్లా సుప్రీం కోర్టు గత ఆగస్టు నెలలోనే తొలగించింది. అభిశంసన ప్రక్రియ ద్వారా న్యాయ వ్యవస్థను పాలకపక్షం బెదిరిస్తుందని, తద్వారా తనకూలంగా తీర్పులు చెప్పించుకుంటుందన్న కారణంగానే అభిశంసన ప్రక్రియను బంగ్లా ఎత్తివేసింది. -
సీజేఐను కలవనున్న ‘న్యాయ’ సంఘాల ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ప్రతిని«ధులు ఏప్రిల్ 5న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను కలవనున్నారు. ఈ మేరకు వారికి సీజేఐ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియామకం విషయంపై వారు సీజేఐతో చర్చించనున్నారు. ఇటీవల ఇదే విషయంపై న్యాయవాదులు రెండు రోజులపాటు తీవ్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ ఇరు సంఘాల ప్రతినిధులతో మాట్లాడనున్నారు. -
సమసిపోని సంక్షోభం.. జస్టిస్ చలమేశ్వర్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై నలుగురు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ ఆరోపణల నేపథ్యంలో నెలకొన్న సంక్షోభానికి ఇప్పట్లో తెరపడుతుందా? అంటే ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. రెబెల్ న్యాయమూర్తులతో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సమావేశం కావడం, వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో కొంత సానుకూల పరిష్కారం లభిస్తుందన్న అంచనాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో సీజేఐ ఈ నలుగురు న్యాయమూర్తులతో బుధవారం మధ్యాహ్న భోజన భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ భేటీకి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జే చలమేశ్వర్ హాజరుకాలేదు. ఆయనతో కలిసి ఆరోపణలు చేసిన మిగతా జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ భేటీకి వచ్చారు. రెబెల్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలకు ఈ లంచ్ భేటీలో చాలావరకు పరిష్కారం లభించే అవకాశముందని మొదట ఊహాగానాలు వెలువడ్డాయి. తీరా ఈ భేటీలో ఆరోపణలు ప్రధానంగా లేవనెత్తిన జస్టిస్ చలమేశ్వరే రాకపోవడం పలురకాల వాదనలకు తావిస్తోంది. న్యాయమూర్తులతో సీజేఐ మంగళవారం జరిగిన తేనీరు భేటీ వాడివేడిగానే సాగింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే లంచ్ భేటీలో కొంతమేరకు సానుకూల వాతావరణం ఏర్పడవచ్చునని, ఇది క్రమంగా సంక్షోభానికి తెరదించే దిశగా అడుగులు వేసేందుకు దారితీయవచ్చునని భావించారు. ప్రతి వారం ఓ న్యాయమూర్తి ఇంట్లో జరిగే విందుకు ఆ జడ్జీ ప్రాంతానికి చెందిన వంటకాలతో విందు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. నేటితో ఐదో రోజు.. సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, కీలకమైన కేసుల విచారణకు బెంచీలను ఏర్పాటు చేయడంలో సీనియర్ జడ్జీలను కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ జడ్జీలు పత్రికాముఖంగా దేశ ప్రజలకు స్పష్టం చేసి నేటితో ఐదు రోజులు అవుతోంది. వారి ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. పైగా బుధవారం ఎనిమిది కీలక కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆధ్వర్యాన ఐదుగురు సభ్యుల బెంచీని ఇవాళ (మంగళవారం) సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఎనిమిది కీలక కేసుల్లో ఆధార్ ఒకటికాగా, స్వలింగ సంపర్కలకు శిక్ష విధించే భారతీయ శిక్షాస్మతిలోని 377వ సెక్షన్ చెల్లుతుందా ? అన్నది రెండవ కేసు. ఐపీసీలోని అక్రమ సంబంధం సెక్షన్ ఇప్పటికీ చెల్లుతుందా? అన్నది మూడో కేసుకాగా, శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా, వద్దా ? అన్నది నాలుగో కేసు. ఇవి కాకుండా మరో నాలుగు కేసులు ముఖ్యమైనవి ఉన్నాయి. వీటి విచారణకు దీపక్ మిశ్రా నాయకత్వాన ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బెంచీలో సీనియర్ న్యామూర్తులైన జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసఫ్, మదన్ లోకుర్లో ఒక్కరు కూడా లేరు. ఈ నలుగురు న్యాయమూర్తులే చరిత్రలో మొట్టమొదటి సారిగా శుక్రవారం పత్రికా విలేకరుల ముందుకు వచ్చి సీజేఐ దీపక్ మిశ్రా తీరును ఆక్షేపించిన విషయం తెల్సిందే.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement