-
వైఎస్ జగన్ అలా ఎన్నడూ చేయలేదు!
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటెలిజెన్స్ విభాగానికి ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేయలేదని, సచివాలయంలో, ప్రభుత్వ సమావేశాల్లో ఆయన కనిపించడం నాకు తెలిసినంతవరకు ఎన్నడూ జరగలేదని ఉమ్మడి రాష్ట్ర డీజీపీ కె. అరవిందరావు తేల్చి చెప్పారు. అలాగే వైఎస్ఆర్ కూడా చట్టానికి వ్యతిరేకంగా ఫలానా పని చేసిపెట్టాలని నిఘా అధికారులకు ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ వంటి ఘటనల్లో సీబీఐ అతిగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసు శాఖ అధికార పక్షానికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని కానీ పూర్తి అనుకూలత ప్రదర్శిస్తే పోలీసు ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఎఫ్ఐఆర్లో చేర్చిన పేర్లను చార్జిషీటులో పోలీసులు నమోదు చేయకపోతే ప్రైవేట్ కేసు పెట్టవచ్చన్నారు. హిందూమతం గురించి చదువుకున్నవారు ఎవరూ అసహనం చూపడానికి వీల్లేదని, నిజానికి మనవాళ్లు భగవద్గీత, ఉపనిషత్తులు చదవనందువల్లే ఈ మతఛాందస వాదం పుట్టుకొస్తోందంటున్న అరవిందరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... కర్కశమైన లాఠీ నుంచి పూర్తి విరుద్ధమైన ఆధ్యాత్మికత వైపు ఎలా వెళ్లిపోయారు? నాది ఆధ్యాత్మికం కాదండి. ఇది కూడా పోలీసు జాబే అనుకుంటున్నా. ప్రపంచం నుంచి దూరంగా వెళ్లిపోయి భగవంతుడు, సాధన అనే ధోరణిలో ఉండటమే ఆధ్యాత్మికత అనుకుంటాం. నా ఉద్దేశంలో భగవద్గీత, ఉపనిషత్తులు చదివినవారు ఎవరూ సన్యాసి కారు. కానీ భగవద్గీత చెప్పినవాడు ఒక సోల్జర్ కాగా దాన్ని విన్నవాడు కూడా సోల్జరే. విన్న తర్వాత నా ధర్మమేమిటి అని తెలుసుకుని యుద్ధం చేశాడు. అందుకే ప్రపంచం గురించి మనగురించి ఒక పెద్ద చిత్రణనిస్తుంది భగవద్గీత. ఆధ్యాత్మికత కూడా పోలీసు జాబే అని ఎందుకన్నానంటే ఉదాహరణకు దేశం ఉంది, మన దేశంలో ఒక సంస్కృతి ఉంది. ఈ సంస్కృతి దేశరక్షణకు అవసరం. దేశరక్షణ, సమగ్రత అనేవి కేవలం పోలీసులపైనో, ఆర్మీపైనో ఆధారపడి ఉండవు. సంస్కృతి బలంగా లేకపోతే దేశ సమగ్రత కూడా బలంగా ఉండదు. అందుకే నేను వాల్మీకి రామాయణం కూడా ఇంగ్లిష్లో చెబుతున్నాను. దేశంలో మత అసహనం, గోరక్షణ పేరిట దాడులు పెరగడంపై మీ వ్యాఖ్య? మత అసహనం చాలా తప్పు. హిందూమతాన్ని చదువుకున్నవారు ఎవరూ అసహనం చూపడానికి వీల్లేదు. మన తత్వంలో అసహనం అనే మాటేలేదు. నీవు దేవుడిని ఏ రూపంలోనైనా పూజించు అనే సిద్ధాంతం ఇదొకటే. నిజానికి మనవాళ్లు భగవద్గీత, ఉపనిషత్తులు చదవనందువల్లే ఈ మతఛాందస వాదం అనేది వస్తోంది. అవి చదివినవారు దాని జోలికి పోరు. ఈ మధ్య కంచ ఐలయ్య పుస్తకంతో పెద్దవివాదం పుట్టుకొచ్చింది కదా? ఐలయ్య కూడా కాస్త గీత దాటారు. ఆయన స్కాలర్. అలాంటప్పుడు వర్ణానికి, కులానికి మధ్య ఉన్న భేదాన్ని తాను తెలుసుకోవాలి కదా. శ్రీకృష్ణుడి నిర్వచనం ప్రకారం కంచ ఐలయ్య కూడా ఒక ద్విజుడు. అంటే బ్రాహ్మణుడు మాత్రమే కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మూడూ కలిపి ద్విజులు అని అర్థం. సేవలు చేసే వారు తప్ప మిగతా అందరూ ద్విజులే అని గీతార్థం. కాని ద్విజ వర్గంలో ఉండాల్సిన వారంతా తాము శూద్రులమని ఆపాదించుకుంటున్నారు. ఇదే పొరపాటు. అంతే తప్ప ఒక చిన్న కమ్యూనిటీని పట్టుకుని దేశాన్ని దోచుకుంటున్నారని అనడం పొరపాటు. వ్యాపారం లేకుండా ఏ సమాజమూ లేదు. బిజినెస్ లేకపోతే సమాజమే నిలవదు. వైఎస్ రాజశేఖరరెడ్డితో మీ పరిచయం ఎలా ఉండేది? మొదట్లో నేను ఆశ్చర్యపోయాను. అదనపు డీజీ ఇంటెలిజెన్స్గా నన్ను ఆయన నియమించినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. అంతకుముందు కడప జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉండేవాడిని. ఆయన అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన గౌరవానికి లోటు లేకుండా చేసేవాడిని. బహుశా అదే మనస్సులో ఉన్నట్లుంది. సీఎం అయ్యాక ఉన్నత పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయనతో మంచి సంబంధాలే ఉండేవి. ఆయన నన్ను పూర్తిగా విశ్వసించేవారు.. అలా విశ్వసించడం అంటే మనకు ఇక తిరుగులేనట్లే. వృత్తిగతంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఎవరైతే వ్యక్తులపై నమ్మకం ఉంచుతారో వారు గొప్ప మనుషులన్నమాట. సీబీఐ, పోలీసు శాఖ కాస్త పక్షపాతంతో వ్యవహరిస్తుంటాయి కదా? సీబీఐలో నేను ఎప్పుడూ పనిచేయలేదు కాబట్టి నేను చెప్పలేను. సొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ ఘటనలో నాపై కేసు విషయంలోనే నేను కొంత ఫీలయ్యాను. ఎందుకంటే ఆ చనిపోయిన వాడేం మహాత్ముడు కాదు. వ్యాపార వర్గాలను బెదిరించి కొల్లగొట్టడంలో రాటుదేలినవాడు. వాడు ఎలాంటి స్థితిలో చచ్చాడో మనకు తెలీదు. ఆ కేసు ఆధారంగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని పదవినుంచి దింపేయాలని భావించారేమో! కానీ సీబీఐ అందరినీ పట్టుకుని వేధించడం కాస్త అతి చర్య అనిపించింది. ఏపీలో, తెలంగాణలో పోలీసులు అధికారపార్టీ చెప్పిందే చేస్తున్నారని విమర్శలు..! రూలింగ్ పార్టీకి పోలీస్ శాఖ అంతో ఇంతో కాస్త అనుకూలంగానే ఉంటుంది. పూర్తిగా అయితే ఉండదు. అయితే పోలీసులపై నిందమోపడం ప్రతిపక్షం విధి. కొంత అనుకూలత ఉంటుందని నేను ఒప్పుకుంటాను. కానీ పూర్తిగా అధికారపార్టీకి అనుకూలంగా ఉండదు. అలా చేస్తే పోలీసు ఉద్యోగమే పోతుంది. పోలీసులు కొన్ని సందర్భాల్లో అధికారపార్టీ ఆదేశాలకు ప్రభావితం కావచ్చు. అలాగని సీఎం ఏది చెబితే దాన్ని పోలీసులు చేయాలని రూల్ ఏమీ లేదు. వైఎస్ఆర్తో సాన్నిహిత్యం ఉండేదికదా, ఆయన వైఖరి ఎలా ఉండేది? వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు ఇలాంటివి చేయమని ఎప్పుడూ చెప్పలేదండి. చట్టానికి వ్యతిరేకంగా ఫలానా పని చేసిపెట్టమని ఆయన ఎన్నడైనా చెప్పినట్లు నాకు గుర్తు లేదు. క్రమ విరుద్ధంగా ఆయన నాకు ఏదీ చెప్పలేదనే నేను అనుకుంటున్నాను. వైఎస్ జగన్ మీకు కానీ, సచివాలయానికి కానీ ఎన్నడైనా ఫోన్ చేసేవారా? అస్సలు లేదండీ. జీరో. ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. శాంతిభద్రతలకు సంబంధించి వైఎస్ జగన్ నాకు చెప్పిందంటూ ఏమీ లేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ప్రమేయం గురించి నాకు ఏమీ తెలీదు. ఆయన తొలినుంచి బిజినెస్ పనుల్లో ఉండేవారు కాబట్టి ఈ అంశంలో ఆయన పాత్ర గురించి నాకు తెలీదు. సచివాలయంలో, ప్రభుత్వ సమావేశాల్లో వైఎస్ జగన్ కనబడటం నాకు తెలిసి ఎప్పడూ లేదు. చాలావరకు ఆయన బెంగళూరులో ఉండేవారు. హైదరాబాద్లో ఆయన దాదాపు లేనే లేరు కదా. ముద్రగడ పద్మనాభం కదిలితేనే నేరమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన పాదయాత్ర చేస్తేనే అడ్డుకోవడం సరైందేనా? రాష్ట్రం విడిపోయింది కదా.. నాకు వివరాలు పూర్తిగా తెలీవు. పైగా హైదరాబాద్లో ఉంటున్నందున ఏపీ వార్తలు పేపర్లలో రావ డం తక్కువే. కానీ అలాంటి నిర్ణయాలు ఆ నిర్దిష్ట అధికారి వ్యక్తిగత నిర్ణయం మేరకే జరుగుతుంటాయి. అయితే ఆయన కదలడం వల్ల, పాదయాత్ర చేయడం వల్ల లక్షలా దిమంది కదిలి వస్తారా? మనకయితే తెలీదు. వైఎస్ జగన్ని విమానాశ్రయం రన్వే పైనే ఆపివేసిన ఘటన కూడా ఆ అధికారి వ్యక్తిగత అంచనాప్రకారమే జరిగి ఉంటుంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు పెట్టి, చార్జిషీట్లో చేర్చకపోవడంపై మీ వ్యాఖ్య? ఆ కేసు వివరాలు నాకు తెలీదు. కానీ అకడెమిక్గా చెప్పాలంటే, పోలీసులు అలా చేయకపోతే, ప్రైవేట్ వాళ్లు కేసు వేసుకోవచ్చు. పోలీసు కేసుకు ఎంత చట్టపరమైన చెల్లుబాటు ఉంటుందో ప్రైవేటు కేసుకు కూడా అంతే చెల్లుబాటు ఉంటుంది. కాబట్టి పోలీ సులు పేరు చేర్చలేదంటే పెద్దగా ఫీల్ కానక్కరలేదు. తెలుగు ప్రజలకు మీ సందేశం? తెలుగు ప్రజలం కాబట్టి, తెలుగు భాషను కూడా మనం నిలుపుకోవాలి. భాష ద్వారానే మన సంస్కృతి నిలుస్తుంది. అభినందించాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలందరూ కలిసే ఉన్నారు. దానికి రెండువైపులప్రభుత్వాలనూ అభినందించాలి. ప్రజలనూ అభినందించాలి. ఇలాంటి సామరస్య వాతావరణం ఇంకా కొనసాగాలన్నదే నా ఆశ. -
గీతలో అర్థం చేసుకున్నది ఆచరణలో...
శ్రీ కృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడా? లేక యుద్ధం చేయలేనని గాండీవాన్ని దించేసిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేశాడా? లేక నీ వెనుక నేనున్నాను... ధైర్యంగా యుద్ధం చేయమని ప్రోత్సహించాడా? ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రశ్నలకు అరటిపండు వలిచినంత సులువుగా సమాధానాలు చెబుతారు అరవిందరావు. ఒకప్పుడు రాష్ర్ట్రంలోని అరాచక శక్తుల ఆటకట్టించేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన ఈ విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారికి ఇప్పుడు ఇటువంటి ధర్మసూక్ష్మాలను బోధించగలగడం ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందాం... నేను అప్పుడూ ఇప్పుడూ ఎప్పడూ దేవుడిని పూజించలేదు. అయితే అప్పట్లో ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏమున్నదనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఇంటెలిజెన్స్లో పని చేస్తున్న కాలంలో కొందరిని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఒక తీవ్రవాది... ‘మాకు మీలాగ వందలాది దేవుళ్లుండరు, పిచ్చి బొమ్మలేవీ ఉండవు. ఒకే దైవం...’ అంటూ హేళనగా మాట్లాడాడు. అలాంటివే ఇంకొన్ని సంఘటనలు జరిగాక ఇంతకీ ఏ మతం ఏం చెబుతోందనే జిజ్ఞాస కొద్దీ బైబిల్, ఖురాన్, భగవద్గీత చదివాను. బైబిల్, ఖురాన్లు అర్థమైనంత సరళంగా భగవద్గీత అర్థం కాలేదు. దాంతో మహా మహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడిని ఆశ్రయించి సందేహాలు తీర్చుకున్నాను. ఏతావాతా నాకు తెలిసిందేమిటంటే... గీతలో కృష్ణుడు ఉపనిషత్తులు, వేదాంతాల సారాన్ని చెప్పాడు. అవి ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం చేసేలా ఉంటాయే తప్ప మూఢవిశ్వాసాలవైపు మళ్లించేలా ఉండవు. అందుకే నేను భగవద్గీతను మరింత బాగా చదివి, ఆకళింపు చేసుకున్నాను. నేను తెలుసుకున్నదానిని పదిమందికీ అర్థమయేలా నా మాటల ద్వారా... రాతల ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పటి విధులకు - అనంతరం విశ్రాంత జీవనంలో ఇప్పుడు నేను నిర్వర్తిస్తున్న బాధ్యతలకు ఎక్కడా పొంతన కనిపించినట్లు అనిపించదు. కానీ భగవద్గీత సారాన్ని గ్రహించడం వల్లనే విధ్యుక్తధర్మాన్ని ఆచరించడం సులువైందని నేను నమ్ముతాను. ప్రణాళిక ఏమీ లేదు... అంతా ఆచరణలోనే! నిజానికి విశ్రాంత జీవితాన్ని ఆధ్యాత్మికపథంలో గడపాలనే ఆలోచన కానీ, అందుకు ఓ ప్రణాళిక కానీ అప్పట్లో ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎప్పుడు కలిగిన ఆలోచనలను అప్పుడు ఆచరణలో పెట్టడం వల్లనే నా ప్రయాణం ఇప్పుడిలాంటి ప్రణాళికాబద్ధమైన దారిలోకి మళ్లింది. అమెరికాలో అయోమయాన్ని చూశాక! మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. వారి దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి భారతీయులలో నెలకొన్న అయోమయమే ఇలా పుస్తకాలు రాయించింది. అక్కడ స్కూళ్లలో పిల్లలకు అన్ని మతాల గురించి ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. అలా చెప్పేటప్పుడు హిందూమతం గురించి చెట్లను, పుట్టలను, విగ్రహాలను పూజిస్తారంటూ కొంత హేళనగా చెప్పడాన్ని గమనించాను. అది విన్న పిల్లలు పలు సందేహాలతో ఇంటికొచ్చి తల్లితండ్రులను అడుగుతుంటారు. వాటికి సమాధానం చెప్పలేక చాలామంది తల్లితండ్రులు నీళ్లు నములుతుంటారు. అప్పుడు హిందూమతం ఏమి చెప్తోందని విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్లు సరళంగా రాశాను. భగవద్గీతను ఎంతోమంది రాశారు. వాటిలో ఐదారు వెర్షన్లు చదివాను. పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాయాల్సిన అవసరం ఉందనిపించి నేనూ రాశాను. నలభైలలో మొదలైన జిజ్ఞాస నన్ను సంస్కృతం చదివేలా చేసింది. ఎం.ఎ, పిహెచ్డి చేశాను. రిటైరైన తర్వాత నా పిహెచ్డి గ్రంథం ‘ఉపనిషత్తుల్లోని జ్ఞానం గురించి వివేచన’ను పుస్తకరూపంలో తెచ్చాను. ఇప్పటివరకూ నేను మొత్తం ఏడు పుస్తకాలు రాస్తే, వాటిలో ఐదు విడుదలయ్యాయి. మరో రెండు ప్రచురణ దశలో ఉన్నాయి. అలాగే ఉపనిషత్తుల సారంపై నేను చెబుతున్న పాఠాలు అద్వైత అకాడమీ వెబ్సైట్లో ప్రసారమవుతున్నాయి. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత మొదలయ్యే రెండవ జీవితాన్ని చాలామంది నిరర్థకంగా గడుతుపుంటారు. అయితే ఈ దశను ప్రయోజనకరంగా మార్చుకోవడానికి నలభైలలోనే నాందిపడితే మంచిది. సమాజానికి ఏం చేయగలమనే వివేచనతో ఒక ఆలోచన మొదలైతే ఉద్యోగవిరమణ తర్వాత జీవితం నిరర్థకంగా మారకుండా సార్థకమవుతుంది’’ అంటున్న ఈ అరవిందుడి సూచన రేపో మాపో రిటైరవబోయే వారే కాదు... ఇప్పుడిప్పుడే ఉద్యోగజీవనంలోకి ప్రవేశిస్తున్న వారు కూడా ఆలోచించదగ్గది... ఆచరించ వలసినదీ! ఆయన మార్గమే నన్నూ నడిపిస్తోంది ఇప్పటి పిల్లల పాఠ్యగ్రంథాల్లో నీతికథలు ఉండడం లేదు. కనీసం తల్లితండ్రులైనా పిల్లలకు ఇంట్లో సుమతీశతకం, వేమన శతకం వంటివి నేర్పించడం లేదు. ఇది సరైన ధోరణి కాదని ఆయన వాపోతుంటారు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ మార్గాన్ని తీసుకోవడం వల్ల నాకు కూడా సౌకర్యంగానే ఉంది. ఉదయం వ్యాయామం నుంచి రాత్రి వరకు మా దైనందిన జీవితం ఓ క్రమపద్ధతిలో నడుస్తోంది. - రమ, అరవిందరావు సతీమణి గీతను అర్థం చేసుకుంటే పరిస్థితిని చక్కదిద్దే మెలకువ, స్వీయనియంత్రణ వస్తుంది. ఉద్యోగి, రాజకీయవేత్త, పరిపాలనాధికారి... ఎవరైనా సరే తమ రంగంలో రాణించడానికి దోహదం చేస్తుంది. భగవద్గీత చదువుతూ కాల్పులు, ఎన్కౌంటర్లు ఎలా చేస్తారని కొందరు సిద్ధాంతకర్తలు నన్ను విమర్శించారు. గీత చదవడం అంటే... ఆ వ్యక్తి అన్నీ వదులుకుని ఎవరు తమ మీద దాడి చేసినా చేయించుకోవాలని కాదు. తన కర్తవ్యాన్ని మరింత కచ్చితంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాడని అర్థం. - కె. అరవిందరావు, విశ్రాంత పోలీసు డెరైక్టర్ జనరల్ - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement