-
‘డూప్లికేటుగాళ్లు’పై ఆర్డీఓ విచారణ
జూలూరుపాడు : అటవీ భూముల్లో పోడు నరికి సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బోగస్ పట్టాలు జారీ చేసిన వారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‘డూప్లికేటుగాళ్లు’ అనే శీర్షికన ఈనెల 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి బోగస్ పట్టాదారు పాసు పుస్తకాలపై విచారణ చేపట్టాలంటూ కొత్తగూడెం ఆర్డీఓ అమయ్కుమార్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూలూరుపాడు తహశీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ బుధారం విచారణ చేపట్టారు. బోగస్ పట్టాతో మోసపోయిన వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా సురేష్, అతని భార్య ఉమ ఆర్డీఓను కలిశారు. తాము మోసపోయిన వైనాన్ని ఆయనకు వివరించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గుగులోతు సరోజ, బాదావత్ విజయ, గుగులోతు సుజాత, భూక్యా జ్యోతి పేరు మీద ఉన్న బోగస్ పట్టాలను ఆర్డీఓ పరిశీలించారు. పట్టాపాస్ పుస్తకాలపై ఉన్నవి కలెక్టర్, భద్రాచలం ఐటీడీఓ పీఓ సంతకాలు కావని, ఇవి ఫోర్జరీ అని గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వ ముద్ర కూడా కాదని తేల్చారు. పట్టాపాస్ పుస్తకాలపై పోడు రైతు భార్యాభర్తల ఫొటోలు ఉండాలి కానీ, ఒకరిది మాత్రమే ఉందన్నారు. వీటిపై అప్పటి జూలూరుపాడు తహశీల్దారు డి.నాగుబాయి పేరుతో సంతకం చేసి ఉందని చెప్పారు. ఈ పట్టా పాస్ పుస్తకాలు ఎవరిచ్చారని బాధిత రైతులను ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా అనిల్ ఎకరానికి రూ.10 వేలు చొప్పున తీసుకుని చేయించాడని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తుంటే మీరేందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై వారు సమాధానం ఇస్తూ తమకు ఏమీ తెలియదని, అనిల్ చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చామని తమగోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, పట్టాలు తిరిగి ఇవ్వాలని కోరారు. గుగులోతు సరోజ భర్త గుగులోతు నరసింహారావు మూడెకరాలకు రూ.30 వేలు, మల్లయ్య అనే రైతు తమ పెద్ద కూతురు బాదావత్ విజయ పేరు మీద పట్టా చేసినందుకు ఐదెకరాలకు రూ.50 వేలు, చిన్న కూతురు గుగులోతు సుజాత పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఇచ్చినందుకు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు, భూక్యా జ్యోతి భర్త రాంబాబు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు పట్టా పాస్ పుస్తకాల కోసం భూక్యా అనిల్కు ఇచ్చినట్లు వివరించారు. తమతోపాటు వినోభానగర్, ఏన్కూరు మండలంలోని అక్కినాపురంతండా, కేసుపల్లి, నాచారం గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి పట్టాలు చేయిస్తానని అనిల్ డబ్బులు తీసుకున్నాడని తెలిపా రు. దీంతో ఆర్డీఓ వీరి నుంచి స్టేట్ మెంట్ను రికార్డు చేయాలని తహశీల్దారు తోట విజయలక్ష్మి ఆదేశించారు. దీంతో ఆర్ఐలు బాధిత పోడు రైతుల నుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్థానిక ఎస్సై ఎన్.గౌతమ్ను పిలిపించి ఈ కేసు విషయాన్ని ఆర్డీఓ చర్చించారు. కఠిన చర్యలు తప్పవు బోగస్ పాస్ పుస్తకాలు ఇప్పించిన భూక్యా అనిల్ అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులను ఆర్డీఆఓ దేశించారు. దీనికి భూక్యా అనిల్ తనపై కావాలనే తమ గ్రామానికి చెందిన ఓ పోడు రైతు వీరందరితో ఫిర్యాదు చేయించాడని చెప్పడంతో ఆర్డీఓ స్పందించారు. వీరిద్దరిని అదుపులోకి విచారించాలని, నిజ నిజాలు తెలుస్తాయని ఎస్సైతో అన్నారు. విచారణ అనంతరం ఆర్డీఓ విలేకరులతో మాట్లాడారు. పట్టా పాస్పుస్తకాలు బోగస్విగా గుర్తించామని తెలిపారు. జూలూరుపాడు మండలంలో 1,090 మందికి పోడు పట్టాలు ఇచ్చామని, వీరికి 3301.73 ఎకరాలు భూమి కేటాయించామని అన్నారు. వినోభానగర్ గ్రామంలో 32.46 ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ అయ్యాయని తెలిపారు. ఏనిగ్జిర్-6లో నమోదు చేసి, స్కానింగ్ కూడా జరిగిందని, అయితే ఇంకా 30 నుంచి 40 మాత్రమే నమోదు కాలేదని అన్నారు. బోగస్ పట్టా పాస్ పుస్తకాలపై కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు చెందిన సంతకాలు మాత్రం కావని అన్నారు. అదేవిధంగా డీఎఫ్ఓ సంతకం అవునో కాదో తనకు తెలియదని, అప్పటి తహశీల్దారు డి.నాగుబాయి సంతకం చేశారని తెలిపారు. ఖాళీ పాస్ పుస్తకాలు ఎలా బయటకు పోయాయని అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఇలాంటి బోగస్ పట్టా పాస్ పుస్తకాలు చాలా ఉండే అవకాశం లేకపోలేదని, పూర్తి స్థాయిలో విచారణ జరగిన తర్వాత తెలుస్తుందని అన్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. -
‘తెలంగాణ’కే మాఫీ
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో పంటరుణాల మాఫీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఐదు దశల్లో అర్హుల జాబితాను తుది రూపునకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న జిల్లా యంత్రాంగం కొత్త అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన తుది అర్హుల జాబితాను రెండు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి బ్యాంకర్లను ఆదే శించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రుణమాఫీ, ఆధార్ అనుసంధానంపై జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అర్హుల జాబితా రూపకల్పనలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతులకు మాత్రమే జిల్లాలో రుణమాఫీ వర్తింపజేయాలని, అది కూడా తెలంగాణ రికార్డుల్లో నమోదై ఉన్న భూమి అయి ఉండాలని చెప్పారు. రుణమాఫీ పొందే రైతుల భూ వివరాలతో ఆధార్కు అనుసంధానాన్ని పది రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. పంట రుణాల మాఫీ వర్తించే జాబితాపై గ్రామాల్లో సామాజిక తనిఖీని వేగవంతం చేసి రెండు రోజుల్లో ముందస్తు జాబితాను సిద్ధం చేసి పంపాలని , మిగిలిన రైతుల నుంచి ఆధార్ నంబర్లు స్వీకరించి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అన్ని వివరాలను సరిచూసుకుని రైతుల చివరి జాబితాను సిద్ధం చేయాలన్నారు. రుణమాఫీ పట్టికలో రైతుల పేర్లకు ఎదురుగా భూమికి సంబంధించిన వివరాలు, పాస్ పుస్తకం నంబర్, ఖాతా నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం, రెవెన్యూ గ్రామం తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. సత్తుపల్లి, తల్లాడ, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ కుంభకోణంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మండలాల్లో రైతుల జాబితా తయారీలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పంట రుణమాఫీ పొందాలంటే ఆ రైతు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తుండాలని, భూములు కూడా తెలంగాణలోనే ఉండాలని స్పష్టం చేశారు. రీ షెడ్యూల్ చేసిన రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని, అయితే ఈ విషయంపై ఏం చేయాలన్నది ప్రభుత్వానికి లేఖ రాస్తామని వెల్లడించారు. ఒకరైతు ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో రుణం పొంది ఉంటే... ఎక్కువ మొత్తం రుణంగా పొంది ఉన్న బ్యాంకులో రుణమాఫీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రెండో ప్రాధాన్యతగా మొదటిసారి రుణం పొందిన బ్యాంకుకు ఇవ్వాలన్నారు. నగరాల్లో బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు పొందిన అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇక బంగారం విషయానికి వస్తే ఆ రుణాలు పంటల కోసమే తీసుకున్నట్టుగా రైతుల నుంచి ధ్రువీకరణ తీసుకున్న తర్వాతే అర్హుల జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం ధనుంజయ్, స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ఏపీజీవీబీ జీఎం నారాయణ, డీసీసీబీ సీఈవో నాగచెన్నారావు, వ్యవసాయ శాఖ జేడీ భాస్కర్రావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసనాయక్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్డీవోలు సంజీవరెడ్డి, అంజయ్య, అమయ్కుమార్, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇక హరిత వనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ హరిత వనం కానుంది. కార్పొరేషన్ పరిధిలో 40-45 పార్కులు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటికి ప్రహరీలు నిర్మించేందుకు నిధులు కూడా విడుదలయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ ఖాళీ స్థలాలను పార్కులుగా మారుస్తామని, మూడునెలల్లో జిల్లా కేంద్రంలో వీటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెపుతున్నారు. మరోవైపు ఖమ్మం నగర శివార్లలో ఒక పెద్ద పార్కు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆయన ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు. కబ్జా కోరల నుంచి రక్షించేందుకే... జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముమ్మరమయినప్పటికీ ఖాళీగా ఉన్న స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఇందులో ప్రభుత్వ భూములు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు కబ్జాకు గురయిన వాటిని పక్కనపెడితే... ఇప్పటికీ కార్పొరేషన్ ఆధీనంలోనే కొన్ని ఖాళీ స్థలాలున్నాయి. వీటిని రక్షించాలన్న ఆలోచనతో పాటు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు ఈ ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్గా ఇలంబరితి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హోదాలో ఇలా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది కార్పొరేషన్ పరిధిలో 40-45 స్థలాలను గుర్తించారు. ఇప్పుడు వీటికి ప్రహరీ గోడలు ఏర్పాటు చేయించేందుకు యుద్ధప్రాతిపదికన రూ.1.65 కోట్లు కేటాయించారు. ఇందులో సగం 13వ ఆర్థిక సంఘం నిధులు కాగా, మరో సగం కార్పొరేషన్ నిధులు. వీటితో గుర్తించిన ఖాళీ స్థలాలకు ప్రహరీల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయిన తర్వాత వాటన్నింటినీ పార్కులుగా మార్చనున్నారు. జీహెచ్ఎంసీ తరహాలో... ఈ పార్కులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని పార్కుల తీరులోనే నిర్వహిస్తామని అధికారులు చెపుతున్నారు. కాలనీ, రెసిడెంట్స్ అసోసియేషన్లకు ఈ పార్కుల నిర్వహణ బాధ్యత అప్పగించనున్నారు. కొంత మున్సిపల్ నిధులు, మరికొంత అసోసియేషన్ నిధులతో ఈ పార్కులు నిర్వహిస్తారు. పార్కు విస్తీర్ణాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరు వాచ్మెన్లను కూడా నియమించనున్నారు. ఇక.. నగర శివార్లలో భారీ పార్కు నిర్మాణానికి కూడా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్కుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కూడా గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి పాలకవర్గం కొలువుదీరితే ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చేందుకు ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయేమో అన్న ఆలోచనతో జిల్లా కలెక్టర్ తన హయాంలోనే ఈ పార్కులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఐఏఎస్ ఉంటేనే మేలు ఇక, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి ఉంటేనే మంచిదనే కోణంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే కార్పొరేషన్ అయినా ఖమ్మం నగరం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో పాటు యేటా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ను ఖర్చు పెట్టాల్సి ఉండడంతో ఈ పోస్టును ఐఏఎస్లకు అప్పగిస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, వరంగల్ తరహాలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వ స్తుండడం గమనార్హం. -
కుటుంబ సర్వే కంప్యూటరీకరణ భేష్
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ విజయవంతమైందని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. కలెక్టరేట నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆయన శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర కుటంబ సర్వే వివరాలు కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియ తొలుత నిదానంగా ప్రారంభమైనప్పటికీ రాను రాను వేగం పుంజుకుందన్నారు. చక్కటి ప్రణాళికతో కంప్యూటీకరణ పూర్తి చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ప్రశంసించారని తెలిపారు. కంప్యూటరీకరణను అంకితభావంతో పూర్తిచేసిన జేసీ సురేంద్రమోహన్, జడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, డీఐఓ శ్రీనివాస్, ఆర్డీవో, తహశీల్దార్లు, కళాశాలల యజమానులు అభినందనీయులని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలు చేసేందుకు సర్వే వివరాలు దోహదం చేస్తాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో జయప్రకాష్నారాయణ్, ఎన్ఐసీ డీఐఓ శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది ఖాసిం, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గురువులే మార్గదర్శకులు
ఖమ్మం: భావి పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్ది దేశానికి విలువైన మానవ వనరులను తయారు చేసే గురువులే సమాజ దిశా నిర్దేశకులని కలెక్టర్ కె. ఇలంబరితి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్జీవో ఫంక్షన్హాల్లో శుక్రవారం గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యాబోధన చేయడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే వారే గురువని అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల ప్రభావం కూడా ఉంటుందని అన్నారు. బాల్యంలో విద్యాబోధన చేసిన గురువులను స్ఫూర్తిగా తీసుకున్నవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ప్రతి ఒక్కరిపైనా గురువు ప్రభావం ఉంటుందని, ఉత్తమ గురువు లభించిన శిష్యుడు ఎంతో అదృష్టవంతుడని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ గురువులను ఎంపిక చేయడం అనవాయితీ అని, అయితే ఈ ఎంపిక కార్యాలయాల్లో కాకుండా వచ్చే సంవత్సరం నుంచి నేరుగా పాఠశాలలకు వెళ్లి అక్కడి నుంచే ఎంపిక చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాద్యాయులు అంకిత భావంతో పనిచేసి మెరుగైన విద్యాప్రమాణాలు సాధించేందుకు పాటుపడాలని కోరారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ విద్య వ్యాపారమయమైన ఈరోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ గురువులు ఉన్నందునే గ్రామీణ ప్రాంతాల నుంచి మెరికల్లాంటి విద్యార్థులు బయటకు వస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి ప్రభావం ఉంటుందన్నారు. నిస్వార్థంతో పనిచేసే గురువులకు ఎప్పటికీ విలువ ఉంటుందని చెప్పారు. వరంగల్ ఆర్జేడీ బాలయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు సంపూర్ణ అక్షరాస్యత సాధనలో భాగస్వామ్యులు కావాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులతోపాటు, గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో డీఈవో రవీంద్రనాధ్రెడ్డి, ఆర్వీఎం పీవో బి. శ్రీనివాసరావు, ఖమ్మం, మధిర డిప్యూటీవోలు బస్వారావు, రాములు, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి మల్లికార్జున్శర్మ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement