-
కబూతర్.. ఆ.. జా.. .జా..
ఒకప్పుడు చక్రవర్తుల రాచకార్యాలు చక్కబెట్టిన ‘వేగు’చుక్క.. ప్రేమ రాయాబారాలు విజయవంతంగా నడిపి చెలి హృదయాన్ని కానుకగా తెచ్చి ఇచ్చిన ప్రేమ పావురం.. ఆపై కవుల కావ్యాలలో హుందాగా విహరించింది. సినీవినీలాకాశంలో పాటై.. ఎగిరిపోయే కపోతమై.. పరవశించింది. కాంక్రీట్ వనం కబూతర్ జా..జా.. అని కసురుతున్నా.. నేనూ పక్కా హైదరాబాదీనే అంటూ గూడుకట్టుకుని వేలాడుతోంది. పట్నవాసంలో.. ఆకాశహర్మ్యాల్లో హుందాగా బతుకుతున్న వారికి మాత్రం ఈ ప్రేమపావురాల మీద కన్నుకుట్టింది. కువకువ సడులతో సందడి చేసే శాంతి కపోతాలపై.. భరించలేని శబ్ద తరంగాలతో దాడి చేసి బెదరగొడుతున్నారు. జాలీలు బిగించి ఉసురు తీస్తున్నారు. నాలుగు గింజలు విదిలిస్తే శాంతి పావురాలు మన జోలికి రావన్న వాస్తవం తెలియక వాటిని చెదరగొడుతున్నారు. విశాల నగరంలో కాసింత జాలి కరువవ్వడంతో ఎటు ఎగిరిపోవాలో దిక్కు తోచక కపోతబాలలు బిక్కుబిక్కుమంటున్నాయి. అపార్ట్మెంట్లకు జాలీలు సిటీలోని చాలా అపార్ట్మెంట్లకు జాలీలను బిగిస్తున్నారు. ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నుంచి పావురాలు లోనికి రాకుండా సన్నటి జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. బాల ్కనీలకు కూడా మెష్లను పెట్టేస్తున్నారు. అదేమిటని అడిగితే.. పావురాల బెడద అంటున్నారు. ‘సందు దొరికితే చాలు...లోపలికి వచ్చేస్తున్నాయి. కిచెన్లో, బాత్రూంలో ఎక్కడ కాస్త చోటు కనపడినా గూళ్లు కట్టి గుడ్లు పెట్టేస్తున్నాయి. చూస్తూ..చూస్తూ గుడ్లతో ఉన్న గూళ్లని బయట పడేయలేం కదా! అందుకే జాలీలు పెట్టుకున్నాం’ ఓ మహిళ ఆవేదన. పావురం.. శాంతికి చిహ్నం. ఎవరికీ హాని చేయని ఈ పక్షి అపార్టుమెంటు వాసులకు శత్రువైపోవడం వెనుకున్న కారణం ఒకటే.. ఆహారం.‘కడుపు నిండా తిండి దొరికితే.. పావురం మీ ఇంటికి రాదు’ అని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వారు అంటున్నారు. మొన్నామధ్య ఉప్పల్లో కొన్ని అపార్ట్మెంట్లలో జాలీలను బిగించడం వల్ల వాటిల్లో చిక్కుకుని కొన్ని పావురాలు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అధికారులు అపార్ట్మెంట్ వాసులపై కేసులు పెట్టారు. వెంటనే జాలీలను తొలగించారు. ‘పొద్దున లేవగానే అపార్ట్మెంట్ కింద శుభ్రం చేయాలి. పావురాలు తెచ్చే చెత్తాచెదారం, వాటి రెట్టలతో చండాలమైపోతుంది. అపార్ట్మెంట్లో వాచ్మెన్ పనంటే మట్టి తగలకుండా బతకడం అనుకొని వచ్చాం. కానీ.. ఇక్కడ పావురాల పెంటంతా ఎత్తిపోసే సరికి ప్రాణం పోతోంది’ అంటూ సనత్నగర్లోని ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ వాపోయాడు. టెక్నాలజీ సాయంతో... కొన్ని ప్రాంతాల్లో సంపన్నవర్గాలవారు ఓ అడుగు ముందుకేసి పావురాలకు సౌండ్ ట్రీట్మెంట్ షాక్ ఇచ్చారు. అపార్ట్మెంట్, భవంతుల్లో ఆ మిషన్ను ఏర్పాటు చేయడంతో పావురాలు అటువైపు కన్నెత్తి చూడవు. ఆ మిషన్ని నుంచి వచ్చే ఒక రకమైన శబ్దం వల్ల పావురాలు వాటంతటవే వెళ్లిపోతాయి. అయితే ఆ మిషన్వల్ల నివాసితులకు కూడా కొన్ని ఇబ్బందులు రావడంతో వాటిని తొలిగించేశారు. ఇక లాభం లేదని వాళ్లు కూడా జాలీలనే ఆశ్రయించారు. నాలుగు గింజలే.. పరిష్కారం పావురమంటే అందరికీ ఇష్టమే. కానీ.. అది మా అపార్ట్మెంట్పై వాలితే మాత్రం నచ్చదంటున్నారు కొందరు. ఆకాశంలో హాయిగా ఎగిరిపోయే పావురాలను చూసి ఆనందిస్తాం కానీ.., మా నట్టింట గూడు కడితే భరించలేమంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది వైల్ట్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. లక్షల రూపాయలు వెచ్చించి మెష్లు, మిషన్లు పెట్టే బదులు నాలుగు గింజలతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. ‘మొదట్లో చాలా అపార్ట్మెంట్లకు వెళ్లి చెబితే ఎవరూ నమ్మలేదు. ఇక లాభం లేదని డెమో ఇచ్చాం. అపార్టుమెంట్ టైపై గింజలు ఆహారంగా చల్లి వచ్చాం. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల అపార్టుమెంట్ ఆవాసంగా ఉన్న కపోతాలు గూడు, గుడ్లు సర్దుకుని బయటకు వెళ్లిపోయాయి. ఇక అప్పటి నుంచి ఆ అపార్ట్మెంట్వాసులు అదే ఫాలో అయ్యారు. కర్మాన్ఘాట్, హిమాయత్ నగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో మొత్తం ఇరవై అపార్ట్మెంట్లలో పొద్దున ఏడింటికల్లా టైపైన పావురాలకు ఆహారం వేస్తున్నారు. ప్రస్తుతం వారి ఇళ్లకు పావురాలు రావడం లేదు’ అంటూ తమ సక్సెస్ గురించి చెప్పారు ఓ అధికారి. నాన్ బెయిలబుల్ కేసు పొరపాటునో, కావాలనో పావురాన్ని చంపినా.. దాని చావుకి కారణమైనా.. బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసు పెడతారు. మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తారు. రూ.25 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకటీ అరా తప్ప ఇళ్లలోకి వచ్చి మనుషుల్ని ఇబ్బంది పెట్టే పావురాలు చాలా అరుదు. చేతనైతే నాలుగు గింజలు వేయాలి. లేదంటే ఊరుకోవాలి. అంతేగానీ.. వాటికి హానీ తలపెడితే మాత్రం చట్టం కఠినంగా శిక్షిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్లో బోలెడన్ని పిచ్చుకలు, పిట్టలు కనిపించేవి. వాటిని కూడా ఇలాగే తరిమి వేయడం వల్ల ఇప్పుడు పిల్లలకు వాటిని పుస్తకాల్లో చూపించాల్సి వస్తుంది. పావురాలపై ప్రేమ చూపకపోతే.. భవిష్యత్తులో వాటిని కూడా పుస్తకాల్లోనే చూసుకోవాల్సి వస్తుంది. - స్వామి స్వయం భగవాన్దాస్ స్టేట్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ మీ అపార్ట్మెంట్కీ వస్తాం... ప్రతి రోజు ఉదయం ఏడింటికి నాలుగు దోసిళ్ల జొన్నలు, బియ్యం, పుట్నాలు, సజ్జలు చల్లితే చాలు.. అవి తినేసి వెళ్లిపోతాయి. మర్నాడు పొద్దున ఏడింటి వరకూ ఆ ఛాయలకు కూడా రావు. హైదరాబాద్లో పావురాలకు ఆవాసాలుగా మారిన అపార్ట్మెంట్లు వేల సంఖ్యలో ఉన్నాయి. వాళ్లందరికీ పావురాలు శత్రువులుగా కాకుండా.. స్నేహితులుగా మారాలంటే వాటి చిట్టి బొజ్జ నింపడం ఒకటే పరిష్కారం. మిషన్లు పెట్టడం, మెష్లు బిగించడం.. అన్నీ చట్టారీత్యా నేరమే. ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించే హక్కు మనకెంత ఉందో.. పక్షులకూ అంతే ఉంది. వాటి హక్కుని ఏమాత్రం భంగం కలిగించినా శిక్షకు అర్హులవుతారు. ఒక సమస్య నుంచి బయటపడడానికి మరో పెద్ద సమస్యలో ఇరుక్కోవడం అంటే ఇదే. పావురాల సమస్యపై సాయమేమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. - మహేశ్ అగర్వాల్, వైల్ట్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో స్పెషల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్: 9394005600 -
కారుణ్యవాది
మహేశ్ అగర్వాల్తో జాగ్రత్తగా ఉండాలి! పిట్టలకీ, పాములకి మనిషి రక్తం సెట్ కాదు కాబట్టి మనల్ని వదిలేశారు కానీ... లేకుంటే వాటిక్కూడా మనచేత రక్తదానం చేయించేవారు! అంత ప్రేమ ఆయనకి... మూగజీవులంటే! పందేల కోసం కోళ్లని, జోస్యాల కోసం చిలకల్ని, పతంగులు ఎగరేసి పక్షుల్నీ... టార్చర్ పెడుతుంటే ఈ న్యాయవాది అస్సలు సహించలేరు. ముందు... వాటికి మందు రాస్తారు. తర్వాత... వాటి తరఫున వాదిస్తారు. ఎనిమిదేళ్లుగా ఆయనకు ఇదే పని. ఇప్పుడూ ఈ పని మీదే సింగపూర్ వెళుతున్నారు. ‘మనుషుల బారి నుంచి మూగప్రాణుల్ని కాపాడ్డం ఎలా?’ అని ప్రసంగించబోతున్నారు. ఆయన మాటల్ని చెవికెక్కించుకుంటే చాలు... మానవ కారుణ్యానికి సంకేతాల్లా వన్యప్రాణులు పదికాలాల పాటు హాయిగా జీవిస్తాయి. ఇదే ఈవారం ‘ప్రజాంశం’. సంక్రాంతి పండగ వస్తోందంటే.. ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాలు మన కళ్ల ముందుంటాయి. కాని మహేశ్ అగర్వాల్కి మాత్రం గాలిపటాలకు ఉపయోగించే మాంజా దారాల మధ్య చిక్కుకున్న పక్షులు కనిపిస్తాయి. గాయాలపాలైన పక్షుల వివరాలు తెలిసిన వెంటనే ఆగమేఘాలమీద వచ్చి వాలిపోయి, వాటికి ప్రథమ చికిత్స చేసి, అవి మళ్లీ గాల్లోకి ఎగిరేవరకూ నిద్రపోడు. అలాగే ఎక్కడైనా పాము ఉందని తెలిసినా వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. బందీలుగా ఉన్న రామచిలుకలు, పాలపిట్టలు, కుందేళ్లు, తాబేళ్లు... వేటి గురించి తెలిసినా మహేశ్ అగర్వాల్ ‘రెస్క్యూ ఆపరేషన్’ మొదలవుతుంది. వాటిని మళ్లీ వాటి వాటి స్థానాలకు చేర్చిన తర్వాత అతని పని పూర్తవుతుంది. పసితనం నుంచే వన్యప్రాణుల్ని ప్రేమించిన మహేశ్ వాటి మనుగడ కోసం కూడా కృషి చేస్తున్నారు. వన్యప్రాణుల్ని చంపినవారు... పాతికవేలు జరిమానా చెల్లించి, మూడేళ్లు జైలుశిక్ష అనుభవించాలి. అంతేకాదు, వీరికి బెయిల్ కూడా దొరకదు. ఇంత కఠిన చట్టాలున్నా చాలాచోట్ల వీటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీరు రంగంలోకి దిగకముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది... అంటారు మహేశ్ అగర్వాల్. ‘‘పదేళ్లక్రితం మార్కెట్లో కూరగాయలతో పాటు కుందేళ్లు, ఉడుములు, పావురాలు, రామచిలుకలు, తాబేళ్లను అమ్మేవారు. మేం కేసులు పెట్టడం మొదలెట్టాక పరిస్థితి మారింది. 2005లో భారత ప్రాణమిత్ర సంఘ్లో సభ్యుడిగా చేరాను. అంతకు ముందువరకూ ఒంటరిగానే పనిచేసేవాడిని. ప్రస్తుతం ఈ సంస్థలో 200 మంది వరకూ సభ్యులున్నారు. రాష్ర్టంలోని అన్నిప్రాంతాల్లో మావాళ్లు అందుబాటులో ఉంటారు. వన్యప్రాణికి హాని జరుగుతోందన్న విషయం తెలిసిన నిమిషాల్లోనే, ఎంతటి మారుమూల గ్రామానికైనా మా వాళ్లు అందుబాటులోకి వస్తారు. మా నెట్వర్క్ వల్ల ఇప్పటివరకూ 1100 పాముల్ని, 93 పాలపిట్టల్ని, 8000 పావురాల్ని రక్షించాం. వీటితో పాటు వందల సంఖ్యలో రామచిలుకలు, నెమళ్లు, కుందేళ్లు, అడవిపందుల్ని కూడా రక్షించాం. మేం వెళ్లేసరికి వాటిని చంపేసినా, బంధించినా వారిపై కేసుల్ని పెట్టించి శిక్ష పడేవరకూ పోరాడాం’’ అని చెప్పారు మహేశ్ అగర్వాల్. ఎడ్వకేట్ కమ్ సేవ... హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మహేశ్కి చిన్నప్పటి నుంచీ పక్షులంటే ప్రాణం. ఆ ప్రేమే ఆయనను ఈ సేవాపథంలోకి నడిపించింది. భారత ప్రాణమిత్ర సంఘ్, సహయోగ్ వంటి స్వచ్ఛందసంస్థలలో ఈయన చేస్తున్న సేవల్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. ‘‘వన్యప్రాణులకు హాని కలిగించకూడదన్న విషయం అందరికీ తెలుసు. కాని వాటికి సంబంధించిన చట్టాల గురించి చాలామందికి తెలియదు. ముందుగా అందరికీ అవగాహన రావడం కోసం ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. గాలిపటాలకు మాంజా దారం వాడడం వల్ల ఎన్ని పిట్టలకు గాయాలవుతున్నాయో తెలిపేందుకు చాలా స్కూళ్లకు తిరిగి కౌన్సెలింగ్ ఇచ్చాం. ఎక్కడైనా పాము కనిపించినా మాకు వెంటనే ఫోన్కాల్ వస్తుంది. మా రెస్క్యూ టీం వాటిని పట్టుకుని, అటవీశాఖ అధికారులు సూచించిన ప్రాంతాలలో విడిచిపెడుతుంది’’ అంటూ ఈ ప్రాణి ప్రేమికుడు చెప్పే మాటలు చాలామందిని ఆలోచింపజేశాయి. ఆ ప్రభావమే కావొచ్చు ఇప్పుడు చాలామంది ఇళ్లలో చిలకల పెంపకం తగ్గిపోయింది. పాలపిట్ట...రామచిలుక ఏటా దసరా పండక్కి పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందనే నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవాలనుకునేవారు అడవిలోని పాలపిట్టల్ని పట్టుకొచ్చి చెట్టుకి కట్టేసి అందరికీ చూపించి డబ్బులు తీసుకుంటున్నారు. ‘‘పాలపిట్ట మన రాష్ట్ర పక్షి. పచ్చని చెట్లమధ్య హాయిగా తిరిగే ఈ పక్షి... మనిషి చేతుల్లో పడిందంటే రోజుల వ్యవధిలోనే చనిపోతుంది. చాలామంది వేటగాళ్లు దసరాపండగ ఒక్కరోజు డబ్బు సంపాదనకోసం వాటిని వాడుకుని పడేస్తున్నారు. అందుకే దసరా వచ్చిందంటే మా టీమ్ చాలా అలర్ట్గా ఉంటుంది. వీటితోపాటు రామచిలుకల రెక్కలు కత్తిరించి, కాళ్లకు ఫెవిక్విక్ అంటించి, వాటిని జోస్యం చెప్పడానికి ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించేవారు మన కంటపడుతుంటారు. ఆ సమాచారం మాకు అందగానే, వాళ్లను అరెస్టు చేసేవరకూ వదలం. ప్రమాదంలో ఉన్న వన్యప్రాణుల్ని రక్షించి మా చెంతకు చేర్చినవారికి ట్రావెల్ ఖర్చులు ఇచ్చేస్తాం. అలాగే రెగ్యులర్గా ఇలాంటి సమాచారం అందించేవారిని ప్రాణమిత్రలో సభ్యులుగా చేర్చుకుంటాం’’ అని వివరించారు మహేశ్. కోడిపందేలు... జంతుబలులు... సంక్రాంతికి గోదావరి జిల్లాలలో జరిగే కోడిపందేల గురించి తెలిసిందే. ఆ జూదగాళ్లపై కేసులు పెట్టాలన్న ఆలోచన ఆచరణలోకి వచ్చేవరకు మహేశ్ అగర్వాల్ నిద్రపోలేదు. ‘‘ఒక పక్క ప్రాణమిత్ర సంఘ్, మరో పక్క సహయోగ్, ఏపి వైల్డ్లైఫ్ క్రైమ్ బ్యూరో ఇంకోపక్క... వన్యప్రాణి సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో పోరాడుతున్నాయి. అయినా అక్కడక్కడా దారుణాలు జరిగిపోతున్నాయి. వీటి సంగతి ఇలా ఉంటే జాతర పేరుతో చేసే జంతుబలులు మరో వైపు... వరంగల్లోని సమ్మక్క సారక్క జాతరలో వందల సంఖ్యలో జంతుబలులు ఉంటాయి. ఒకసారి జాతర సమయంలో మా టీమ్ అక్కడ ఏర్పాటు చేసిన ఓ వినూత్న కార్యక్రమం అందరినీ ఆలోచింపచేసింది. ‘ప్రాణి రక్తం చిందించడం వల్లే దేవుడు కరుణిస్తాడనుకుంటే మేకల్ని, దున్నపోతుల్ని బలి ఇవ్వడం దేనికి? మీరే స్వయంగా రక్తదానం చేస్తే మరింత మంచి ఫలితాలను చూస్తారు’ అని చెప్పి అక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. మా మాటల్ని అర్థం చేసుకున్న కొందరు యువకులు రక్తదానం చేశారు’’ అని చెబుతున్న ఈ న్యాయవాది మాటలు విన్నవారికి వన్యప్రాణులపై తప్పకుండా ప్రేమ పెరుగుతుంది. సింగపూర్ వేదికగా... ఈ నెల 13న సింగపూర్లో జరగబోయే ‘ఏసియా ఫర్ యానిమల్స్’ కార్యక్రమానికి మన రాష్ర్టంలో మహేశ్ అగర్వాల్కు ఆహ్వానం వచ్చింది. ‘‘భవిష్యత్తులో వన్యప్రాణిపై ఎవరి చెయ్యీ పడకుండా ఉండేందుకు మా వంతు కృషి చేస్తాం. మాతో మీరు కూడా చేయి కలిపితే ఆ మూగజీవుల మనుగడకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు... అంటున్న మహేశ్ అగర్వాల్తో మనం కూడా చేయి కలిపి, వన్యప్రాణుల సంరక్షణలో పాలుపంచుకుందాం. - భువనేశ్వరి రెండు రోజులక్రితం అనంతపురం నుంచి ఎవరో అడవిపందుల్ని పట్టుకుని అమ్ముతున్నట్టు ఒక ఫోన్కాల్ వచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం అక్కడ లోకల్గా పనిచేసే వారికి మహేశ్ సమాచారం అందించారు. వారు రెస్క్యూ చేసి అడవిపందుల్ని పట్టుకున్నవారిని అరెస్టు చేయించారు. మనిషికి పాతికవేలు చొప్పున ముగ్గురు నిందితులు 75 వేల రూపాయల జరిమానా చెల్లించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సాక్షి ఆఫీస్లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
Play Offs లోకి ఆర్సిబీ
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement