-
చిన్నారులందరికీ ఎంఆర్ టీకా తప్పనిసరి
అనంతపురం మెడికల్: జిల్లా వ్యాప్తంగా 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులందరికీ మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేయించాలని జాయింట్ కలెక్టర్ రమామణి తెలిపారు. ఎంఆర్ క్యాంపెయిన్కు సంబంధించి లయన్స్ క్లబ్ అందజేసిన ప్రచార సామగ్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తేదీ వరకు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ఇతరత్రా ప్రాంతాల్లో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలన్నారు. ఆశకార్యకర్తలకు జూన్,జూలై ఇన్సెంటివ్ను త్వరగా విడుదల చేయాలని డీఎంఅండ్హెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీఐఓ పురుషోత్తం, డీపీఎంఓ డాక్టర్ అనిల్కుమార్, పీఓడీటీ సుజాత, యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్స్ దిలీప్కుమార్, రితీశ్ బజాజ్, డెమో ఉమాపతి, డిప్యూటీ డెమో నాగరాజు, గంగాధర్, హెచ్ఈఓ సత్యనారాయణ, డీపీహెచ్ఎన్ రాణి, హెచ్ఈఈఓ లక్ష్మినరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తల్లులూ మరవొద్దు..
– ఎంఆర్ టీకాతో తట్టు, పొంగు నివారణ – ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్రత్యేక డ్రైవ్ – 10.69 లక్షల మందికి లబ్ధి – జిల్లాకు చేరుకున్న వ్యాక్సిన్ – ఏర్పాట్లను పూర్తి చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ 49,200 : దేశంలో ఏటా మీజిల్స్ (తట్టు)తో మరణిస్తున్న చిన్నారులు 10,69,345 : ఎంఆర్ టీకా వేయించేందుకు జిల్లాలో గుర్తించిన పిల్లలు 5,00,000 : జిల్లాకు తొలి విడతగా చేరిన వ్యాక్సిన్ డోస్లు 5009 : స్కూల్ సెషన్లు 4127 : ఔట్రీచ్ సెషన్లు 80 : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 15 : సామాజిక ఆరోగ్య కేంద్రాలు 2 : ఏరియా ఆస్పత్రులు 1 : హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి 1 : అనంతపురం సర్వజనాస్పత్రి 19 : ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు 586 : ఆరోగ్య ఉప కేంద్రాలు మీజిల్స్ (తట్టు), రుబెల్లా (పొంగు).. వైరస్ కారణంగా వచ్చే ఈ భయంకర వ్యాధులు.. ఎంతో మంది చిన్నారులను బలిగొంటున్నాయి. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సులువుగా వ్యాపిస్తుంది. గర్భిణులకు రుబెల్లా వైరస్ సోకితే పుట్టబోయే బిడ్డకు అంధత్వం, అంగ వైకల్యంతో పాటు మానసిక ఎదుగుదల ఉండదు. ఒకప్పుడు పోలియో మహమ్మారి చిన్నారులను చిదిమేసింది. ఇప్పుడు మీజిల్స్, రుబెల్లా దాని స్థానాన్ని ఆక్రమిస్తోంది. చిన్నారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనంతపురం మెడికల్/ఆత్మకూరు: దేశ వ్యాప్తంగా తట్టు, పొంగు వైరస్ వల్ల ప్రతి 15 వేల మంది చిన్నారుల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారు. దీనిపై సమరభేరి మోగించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మహమ్మారిని 2020 సంవత్సరానికి అంతం చేయాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లక్ష్యం మేరకు ఈ వ్యాధులను నివారించేందుకు ‘ఎంఆర్ వ్యాక్సిన్’ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. యునిసెఫ్ సహకారంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ఎంఆర్ (మీజిల్స్, రుబెల్లా) క్యాంపెయిన్ చేపట్టడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులు, బాలబాలికలకు టీకా ఇచ్చేందుకు కార్యచరణ రూపొందించారు. మీజిల్స్ మీజిల్స్ (తట్టు) అనేది ప్రాణాంతక అంటువ్యాధి. చిన్నారుల్లో వైకల్యం/మరణాలకు ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఈ వ్యాధి సోకిన వారు దగ్గడం, తుమ్మడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. న్యుమోనియా, డయేరియా (అతిసారం), మెదడు çసంబంధిత ప్రాణాంతక రోగాలతో పిల్లలు బాధపడుతుంటారు. ఎక్కువ జ్వరంతో కూడిన ఎర్రటి దద్దుర్లు, దగ్గు, ముక్కు కారడం (జలుబు), కళ్లు ఎర్రబడడం ‘మీజిల్స్’ లక్షణాలు. రుబెల్లా గర్భం దాల్చిన తొలి దశలో రుబెల్లా ఇన్ఫెక్షన్తో కంజెనైటల్ (పుట్టకతో సంక్రమించే) రుబెల్లా సిండ్రోమ్ (సీఆర్ఎస్) కలుగుతుంది. అది గర్భస్థ, నవజాత శిశువులపై అతి తీవ్రమైన, ప్రాణాంతకమైన పరిణామాలను చూపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన గర్భిణులకు పుట్టిన చిన్నారుల్లో కళ్లు (నీటి కాసులు, శుక్లం), చెవులు, మెదడు (చిన్న తల, బుద్ధిమాంద్యం), గుండె సంబంధిత లోపాలు ఎక్కువగా ఉంటాయి. రుబెల్లా సోకిన గర్భిణులకు గర్భస్రావం, గర్భవాతం, మృత శిశువు జన్మించడం వంటివీ కలగవచ్చు. ఎంఆర్ క్యాంపెయిన్ ఇలా మీజిల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఆరు వారాల పాటు చేపడతారు. ఇప్పటికే టీకాలు వేయాల్సిన పిల్లల వివరాలను సేకరించారు. ప్రతి బృందంలో ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశ కార్యకర్తలు, ఒక అంగన్వాడీ కార్యకర్త ఉంటారు. తొలి రెండు వారాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, ఆ తర్వాత రెండు వారాలు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో టీకాలు వేస్తారు. ఐదో వారంలో అర్బన్ ప్రాంతాల్లో, చివరి వారంలో టీకా వేయించుకోని వారిని గుర్తించి వేస్తారు. జిల్లాకు చేరుకున్న 5 లక్షల డోస్లు జిల్లాలో 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు బాలబాలికలు 10,69,345 ఉన్నట్లు గుర్తించారు. 11,86,973 డోస్ల వ్యాక్సిన్ అవసరమని ఇండెట్ పెట్టారు. తొలి విడతగా 5 లక్షల డోస్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని డీఎంహెచ్ఓ కార్యాలయంలోని వ్యాక్సిన్ సెంటర్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రతి పది మందికి ఒక వైల్ : ఎంఆర్ టీకా ఉన్న ఒక వైల్తో పది మందికి టీకాలు వేయొచ్చు. ఇందుకు ప్రత్యేకంగా తయారు చేసిన సిరంజీలు వాడుతున్నారు. ఒకరికి వాడిన సిరంజి మరొకరికి వినియోగించకుండా టీకా మందు నింపగానే నిర్దేశిత పరిమాణం వల్ల లాక్ అయ్యేలా ఈ సిరంజిలను తయారు చేశారు. నాలుగు రకాల టీకా కేంద్రాలు ఎంఆర్ వ్యాక్సినేషన్ జరిగే సమయంలో నాలుగు రకాల టీకా కేంద్రాలను ఆరోగ్యశాఖ ఏర్పాటు చేయనుంది. – విద్యా సంస్థల వద్ద టీకా కేంద్రాలు: 200 మంది చిన్నారులకు ఒక సెషన్ చొప్పున 5,009 సెషన్స్ చేపట్టనున్నారు. – ఔట్ రీచ్ టీకా కేంద్రాలు: సాధారణ టీకా కార్యక్రమం జరిగే క్రమవారీ అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాలు/పట్టణ ప్రాంతాల్లో అదనపు కేంద్రాలు ఉంటాయి. ఇలాంటివి 4,127 గుర్తించారు. 150 మంది చిన్నారులకు ఒక సెషన్ నిర్వహిస్తారు. – సంచార టీకా కేంద్రాలు: ఊరూరా తిరిగి పని చేసుకునే వాళ్లను, తాత్కాలిక సెటిల్మెంట్లను కవర్ చేయడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. జిల్లాలో ఇలాంటి 329 ప్రాంతాలను గుర్తించారు. – ఆస్పత్రి ఆధారిత కేంద్రాలు: పీహెచ్సీ, సీహెచ్సీ, ప్రైవేట్ క్లినిక్లు. ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి బుధ, శనివారం వ్యాక్సినేషన్ ఉంటుంది. ఇప్పుడు సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో పీహెచ్సీల్లో ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారు. టీకాల పట్టికలోకి ‘ఎంఆర్’ వ్యాక్సిన్: చిన్న పిల్లలకు వేసే టీకాల పట్టికలోకి త్వరలో కొత్త వ్యాక్సిన్ చేరుతోంది. ఇప్పటి వరకు 9 నెలల నుంచి 12 నెలల వయసున్న చిన్నారులకు మీజిల్స్ నివారణ కోసం డోస్–1 వేసేవారు.16 నెలల నుంచి 24 నెలల మధ్యలో డోస్–2 వేసే వారు. రుబెల్లాకు మాత్రం మందులేదు. కొద్ది మంది మాత్రమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేయించుకునే వారు. ప్రస్తుతం రెండింటికీ కలిపి ఒకే టీకా మందులు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టీకాల కార్యక్రమంలో ఆగస్టు తర్వాత ‘ఎంఆర్’ను చేర్చనున్నారు. ఇలా ఉంటే ‘టీకా’ వేయించొద్దు ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో మీజిల్స్ టీకా వేయించి ఉన్నా ఇప్పుడు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలి. అధిక జ్వరం, ఇతర తీవ్రమైన వ్యాధులు (స్పృహలో లేకపోవడం, అపస్మారక స్థితిలో ఉండడం), ఆస్పత్రుల్లో చేరిన చిన్నారులు, గతంలో మీజిల్స్, రుబెల్లా టీకా వల్ల తీవ్రమైన అలర్జీ, రియాక్షన్కు గురైన వారికి వేయించొద్దు. ఎంఆర్ వ్యాక్సిన్పై ఎలాంటి సందేహాలు ఉన్నా ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అందరి సహకారం తీసుకుంటున్నాం ప్రభుత్వం ఎంఆర్ టీకాలు ఉచితంగా అందజేస్తోంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని భవిష్యత్లో పిల్లలకు వచ్చే ఈ వ్యాధుల నుంచి కాపాడుకోవాలి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆరు వారాల పాటు ఈ క్యాంపెయిన్ ఉంటుంది. దీనిపై ఇప్పటికే వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాం. అన్ని శాఖల సహకారం తీసుకుని ముందుకెళ్తున్నాం. - డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ పకడ్బందీగా ఏర్పాట్లు ఎంఆర్ వ్యాక్సిన్లను ఇప్పటికే అన్ని ప్రాంతాలకూ పంపించాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నాం. ఎంఆర్ క్యాంపెయిన్ ముగిసిన తర్వాత చిన్నారులకు ఇచ్చే రెగ్యులర్ టీకాల పట్టికలో ఈ వ్యాక్సిన్ను చేర్చబోతున్నాం. కోల్డ్ చెయిన్ స్టోరేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, టీకా వేసిన తర్వాత ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాం. - డాక్టర్ పురుషోత్తం, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి తప్పనిసరిగా ‘ఎంఆర్’ వేయించండి పోలియోను నిర్మూలించిన తరహాలోనే మీజిల్స్ రుబెల్లాపై ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తోంది. ఈ వ్యాధులు సోకితే చిన్న పిల్లల్లో రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు. ఎంఆర్ క్యాంపెయిన్ చేపట్టి అందరికీ ఒకేసారి వేయడం వల్ల అందరికీ రక్షణ ఉంటుంది. రుబెల్లా మీజిల్స్ వ్యాధి వల్ల దృష్టిలోపం, మెదడువాపు, అతిసారం, జ్వరం వంటి రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించండి. - డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, చిన్న పిల్లల వైద్యుడు, సర్వజనాస్పత్రి
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్ఫోన్తో హై బీపీ!
- ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
- అనంత్నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
- పద్ధతి ప్రకారం పరిహారం
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
Advertisement