ముత్తూట్’ కేసు కొలిక్కి..?
మహారాష్ట్ర గ్యాంగ్ పనిగా గుర్తింపు
⇒ పోలీసుల అదుపులో ఇరువురు
⇒ మిగిలిన వారి వివరాలు సేకరణ
⇒ పరారీలో ఉన్న వారి కోసం గాలింపు
సాక్షి, హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ మైలార్దేవ్పల్లి బ్రాంచ్లో ఈ నెల 4న దోపిడీకి విఫలయత్నం చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర కేంద్రంగా పని చేసి న ఈ గ్యాంగ్కు చెందిన ఇద్దరు సభ్యుల్ని శుక్రవారం ముంబైలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
వీరి ద్వారా మిగిలిన వారి వివరాలు సేకరించారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కు చెందినదిగా భావిస్తున్న ఈ ముఠాలో కొందరు పాత నేరగాళ్లు, మరికొందరు కొత్తవాళ్లు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. 2003లో అబిడ్స్లోని రాజ్యలక్ష్మీ జ్యువెలరీస్లో దోపిడీ చేసిన అర్జున్శెట్టి గ్యాంగ్ సభ్యులూ వీరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
కీలకంగా మారిన కవర్..
మైలార్దేవ్పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో ఈ నెల 4 ఉదయం కొందరు దుండగులు తుపాకులు, తల్వార్లతో చొరబడ్డారు. సిబ్బంది అప్రమత్తమై అలారం నొక్కడంతో దుండగులు పరారయ్యారు. వీరు వినియోగించిన టవేరా వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్(టీఎస్12ఈబీ3711) తగిలించి వాడారు. ఈ వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్స్ పార్కింగ్లో వదిలి పారిపోయారు. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి.. వేలిముద్రలు సేకరించారు.
తనిఖీల్లో వాహనంలో దొరికిన ఓ కవర్ కీలక ఆధారంగా మారింది. దీనిపై మహారాష్ట్రలోని ఉస్మాన్బాద్లో ఉన్న వీర్సావర్కర్ చౌక్ చిరునామా ముద్రించి ఉంది. దీంతో దుండగులు ఆ ప్రాంతానికి చెందిన వారై ఉంటారని అనుమానించిన సైబరాబాద్ పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపారు.
స్థానికంగా విచారించడంతో పాటు అక్కడి పోలీసుల సహకారం తీసుకున్న సైబరాబాద్ పోలీసులు దుండగులు అక్కడి వారే అని, గతంలో పలు ప్రాంతాల్లో అరెస్టు అయ్యారని గుర్తించారు. ముమ్మరంగా గాలించి శుక్రవారం ముంబైలో సంతోష్, హర్షద్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన అధికారులు గ్యాంగ్కు సంబంధించి మిగిలిన వారి వివరాలూ సేకరించారు. ముత్తూట్ కార్యాలయంలో తుపాకీ పట్టుకుని సంచరించిన వ్యక్తి పేరు చింటు అని, టోపీ పెట్టుకుని పొడుగ్గా ఉన్న వ్యక్తి సర్దార్ అని గుర్తించారని తెలిసింది. ప్రస్తుతం వీరితో పాటు మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వాహనం.. గుజరాత్కు చెందినది..
దుండగులు వినియోగించిన టవేరా వాహనం గుజరాత్లోని వాల్సద్ ప్రాంతానికి చెందిన వినోద్ పురోహిత్కు చెందినదిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇతడిని ప్రశ్నించగా.. తన ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాన్ని గతేడాది డిసెంబర్లో కొందరు దొంగిలించారని చెప్పాడు. దీనిపై వాల్సద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. ఫైనాన్స్ మీద ఖరీదు చేసిన ఈ వాహనం పోయిందని ఓ ధ్రువీకరణ ఇవ్వాల్సిందిగా పురోహిత్ వాల్సద్ పోలీసుల్ని కోరాడు. అయితే వారు రూ.30 వేలు లంచం డిమాండ్ చేయడం, ఆ మొత్తం ఇవ్వకపోవడంతో కేసు ముందుకు కదల్లేదని చెప్పాడు. ఆ వాహనాన్నే వినియోగించి దుండగులు ముత్తూట్లో దోపిడీకి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.