ఎప్పుడు చేరాలో.. ఎక్కడ చేరాలో?
ఒంగోలు వన్టౌన్ : ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎంసెట్ ఫలితాలు వెలువడినా కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించకుండా కాలయాపన చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంసెట్, ఈసెట్, లాసెట్, పాలిసెట్, ఈసెట్ పరీక్ష ఫలితాలు వెలువడి చాలా రోజులయ్యాయి.
ఈ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా మిగిలిన 30 శాతం సీట్లు యాజమాన్యం భర్తీ చేసుకోవాలి. ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సందిగ్ధంలో 25 వేల మంది
ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సుమారు 25 వేల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 19 ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు 7 వేల సీట్లున్నాయి. ఎంసెట్కు మొత్తం 11 వేల మంది హాజరయ్యారు. వీరిలో 8,800 మంది ఇంజినీరింగ్ కోర్సులకు, 2,200 మంది మెడిసిన్, అగ్రికల్చరల్ కోర్సులకు ప్రవేశ పరీక్షలు రాశారు. పాలిసెట్-2014కు జిల్లాలో 6,300 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్కు సుమారు 2 వేల మంది హాజరయ్యారు. ఈసెట్ ఫలితాలు వెలువడి ప్రవేశాలకు కౌన్సెలింగ్ పూర్తయినా విద్యార్థులకు సీట్లు కేటాయించలేదు. అదే విధంగా ఐసెట్, లాసెట్ ఫలితాలు వెలువడినా ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఎంత ఇస్తారో..
వృత్తి విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థులకు చెల్లించాల్సిన బోధనా రుసుంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం వల్లే ప్రవేశాల్లో జాప్యం జరుగుతోంది. ప్రధానంగా పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలు బోధనా రుసుంపై ఆధారపడే ఇంజినీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యార్థులకు బోధనా రుసుం చెల్లించే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏ ప్రభుత్వం బోధనా రుసుం చెల్లించాలన్న విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
వచ్చే నెల నుంచి తరగతులు జరిగేనా
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు నిర్వహించమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నింపాదిగా కౌన్సెలింగ్ నిర్వహించి కళాశాలల్లో ఆలస్యంగా అడ్మిషన్లు జరుగుతుండటంతో విద్యార్థులు విలువైన కాలాన్ని నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సుప్రీంకోర్టు ఇంజినీరింగ్ కళాశాలల్లో కచ్చితంగా ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావించగా వీలుపడలేదు.
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలంటే తొలుత ప్రభుత్వం బోధనారుసుం చెల్లించే విషయం తేల్చి ఆ మేరకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలి. అదే విధంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో బి-కేటగిరి కింద యాజమాన్యం కోటా 30 శాతం సీట్ల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. విసిగి వేశారిన విద్యార్థుల పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు.
యాజమాన్యాల్లో కలవరం
ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నందున స్థానికంగా ఉన్న కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయని వాపోతున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో స్పష్టతనిచ్చి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘ జిల్లా కో ఆర్డినేటర్ మద్దిశెట్టి శ్రీధర్ కోరుతున్నారు.