-
ఓ డాక్టరమ్మ.. చిట్టీలిచ్చే సార్లు ఎప్పుడత్తరు..!
సాక్షి, వరంగల్: ‘ఎంజీఎంల మంచిగ సూత్తరట’ అని ఎవరో అంటూంటే విని వచ్చాడు భీంరావు. అతడిది కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ గ్రామం. 8:20కి బస్సు దిగాడు. త్వరత్వరగా వెళ్లి ఓపీ దగ్గర పేరు రాయించుకునేందుకు లైన్లో నిల్చున్నాడు. అప్పటికే తనకంటే ముందు ఓ పదిమంది లైన్లో ఉన్నారు. ఓ వైపు తీవ్రమైన కడుపునొప్పి. అరగంట దాటింది. ‘ఓ డాక్టరమ్మ.. చిట్టీలిచ్చే సార్లు ఎప్పుడత్తరు’ అని అడిగాడు భీంరావు. ‘వస్తారు’ అని సమాధానమిచ్చింది నర్సు. అలా దాదాపు మరో గంట గడిచింది. సరిగ్గా పదింటికి వచ్చారు ఓపీ చిట్టీలు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు. కంప్యూటర్లు ఆన్ చేసి, అందులో పనిచేసే వాళ్లకు తెలిసిన వాళ్లకు, వెనుకవైపు కిటికీ నుంచి ఇంకా బాగా తెలిసిన వాళ్లకు.. ఇలా భీంరావు వంతు వచ్చే సరికి అరగంట పట్టింది. అప్పటికి క్యూలైన్ మరింత పెరిగింది. ఓపీ చిట్టీ అందుకొని డాక్టర్ రూమెక్కడమ్మా.. అని అడుగుకుంటూ పరిగెట్టాడు భీంరావు. ఇలా ఒక్క భీంరావు మాత్రమే కాదు. ఎంతోమంది నిత్యం ఓపీ చిట్టీల దగ్గర ఎదురుచూడాల్సిందే! నిత్యం వేలాది మంది ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. అంత మంచి పేరున్న ఆస్పత్రిలో కొందరి కారణంగా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొంతమంది సిబ్బంది నెల రోజులుగా సమయపాలన పాటించకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రతీ సోమ, మంగళ, బుధవారాల్లో రోగులు కొన్ని సందర్భాల్లో వైద్యులను కూడా కలవకుండానే వెనుదిరుగుతున్నారు. ఒకవేళ కలిసినా స్కానింగ్, రక్త, మూత్ర పరీక్షలు చేయాల్సి ఉంటే సమయం సరిపోక మరో రోజు తిరిగి ఆసుపత్రికి వస్తున్నారు. లేదంటే తెలిసిన వారింట్లో, బంధువుల ఇంట్లో తలదాచుకొని తెల్లవారి వస్తున్నారు. అసలే మళ్లీ కరోనా వేరియంట్ రూపు మార్చుకుంది. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మాట అటుంచితే సమయానికి వైద్యున్ని కలిసే అవకాశం కూడా దొరకట్లేదు. రోగులకు ఇక్కట్లు.. రోగులకు సమయానుకూలంగా సేవలందించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనబడుతోంది. సోమవారం రూమ్ నంబర్ 3 (ఓపీ చిట్టిలు ఇచ్చే విభా గం) నుంచి అర కిలో మీటరు మేర రెండు క్యూ లైన్లు ఉండడాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది. దీనికి కారణం ఏంటని వివరాలు ఆరా తీయడంతో కంప్యూటర్ అపరేటర్లు ఆలస్యంగా వస్తున్నారని తెలిసింది. దీంతో పాటు రోగులను పరీక్షించాల్సిన ప్రత్యేక డాక్టర్ల స్థానంలో చాలామంది పీజీ వైద్యులే ఉన్నారు. చాలా మంది వైద్యులు తమ సొంత క్లినిక్లపై దృష్టి సారించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆసుపత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటు కంప్యూటర్ ఆపరేటర్లు, అటు వైద్యుల సమయపాలన లేమితో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిలబడలేక మరింత నడుంనొప్పి మామూనూరు క్యాంప్ సమీపంలోని జక్కలోది నుంచి ఆసుపత్రికి వచ్చా. గత సోమవారం వచ్చినప్పటికీ భారీ క్యూలైన్ ఉండడంతో నిల్చోలేక అవస్థలు పడ్డా. ఈ సోమవారం కూడా అదే పరిస్థితి కనిపించింది. నడుం నొప్పి విపరీతంగా ఉండడంతో చూపించుకునేందుకు వచ్చా. ఇంకా నా చేతికి ఓపీ చిట్టి రాలేదు. క్యూలైన్ ఉండడంతో ఇంకా మరింత నడుంనొప్పి కలుగుతోంది. – వరమ్మ, జక్కలోది గ్రామం 70 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చా.. దాదాపు 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా. కీళ్ల నొప్పులు ఉండడంతో వైద్యుడితో పరీక్షించుకునేందుకు వచ్చా. ఉదయం ఎనిమిది గంటలకే చేరుకున్నా అప్పటికే లైన్ పెద్దగా ఉంది. 8.30కు రావాల్సిన కంప్యూటర్ ఆపరేటర్లు రాకపోవడంతో గంటన్నరపాటు లైన్లోనే నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బాగా కాళ్లు గుంజినై. – బక్కయ్య, దంతాలపల్లి మండలం, బొడ్డలడ గ్రామం -
అమ్మలకు భరోసా !
నిత్యం అక్కడ సమస్యలు రాజ్యమేలుతాయి...కనీస సౌకర్యాలు లేక గర్భిణులు, బాలింతల ఆక్రందనల ఘోష అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి అక్కడి నుంచి శిశువుతో క్షేమంగా ఇంటికి చేరుకుంటుందన్న భరోసా లేదు. నవమాసాలు మోసి, శిశువులకు జన్మనిచ్చిన ముగ్గురు తల్లులు... బిడ్డల ఎడబాటుతో నరకయాతన అనుభవించారు. ఆస్పత్రి నుంచి ముగ్గురు పిల్లలు మాయమవగా ‘సాక్షి’ చొరవతో ఒక బిడ్డ తిరిగి తల్లిచెంతకు చేరింది. మిగతా ఇద్దరు తల్లులూ గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. పడకలు చాలకపోవడంతో ఒకే మంచంపై చిరిగిన పరుపులపై ఇద్దరేసి చొప్పున చికిత్స పొందే దుస్థితి ఉంది. గర్భిణులకు పూర్తిస్థాయిలో భోజనం అందడంలేదు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఇలా ఎన్నో సమస్యలు ఆ దవాఖానాలో రోగులపై దండెత్తుతున్నాయి. ఘోషా ఆస్పత్రిలో ఉన్న సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఉప్పాడ స్వరాజ్యలక్ష్మి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మారారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు, పలు వార్డుల్లో కలియ తిరిగి గర్భిణులు, బాలింతలు, వారికి సహాయం చేసేందుకు వచ్చినవారితో మాట్లాడి, సమస్యలు పరిష్కరిస్తానని, మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గర్భిణులు,బాలింతలు, వైద్యులతో డీఎంహెచ్ఓ సంభాణ ఇలా సాగింది. డీఎంహెచ్ఓ: అమ్మా నాపేరు ఉప్పాడ స్వరాజ్యలక్ష్మి. నేను డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నాను, మీసమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మీదగ్గరకు వచ్చాను. నీపేరేంటి , ఎక్కడనుంచి వచ్చావు? గర్భిణి జ్యోతి: అమ్మా నాపేరు జ్యోతి. మాది బొండపల్లి గ్రామం. తనిఖీకోసం వచ్చాను. డీఎంహెచ్ఓ: మీ దగ్గరలో ఆస్పత్రి ఉంది కదా... అక్కడ తనిఖీలు చేయడం లేదా? జ్యోతి: అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారని వచ్చాను. డీఎంహెచ్ఓ: మీకు దగ్గరలో ఏ ఆస్పత్రి ఉంది. సేవలు బాగా అందిస్తున్నారా? జ్యోతి: మాకు దగ్గరలో బొండపల్లి పీహెచ్సీ ఉంది. అక్కడబాగానే వైద్య సేవలు అందిస్తున్నారు. డీఎంహెచ్ఓ: డాక్టర్ గారు మీపేరేంటి, రోజుకు ఎంతమంది గర్భిణులను పరీక్షిస్తున్నారు? డాక్టర్ : మేడమ్ నాపేరు సుధ. రోజుకు 50 మంది వరకు గర్భిణులను పరీక్షిస్తున్నాను. డీఎంహెచ్ఓ : అందరికీ మీరు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించగలుగుతున్నావా, లేక అదనంగా ఇంకో వైద్యురాలు కావాలా? డాక్టర్ సుధ: మేడమ్ నాతోపాటు , ఇంకో వైద్యురాలు సహాయంగా ఉంటే గర్భిణులకు ఇంకా మెరుగైన సేవలు అందించగలం. డీఎంహెచ్ఓ: కౌన్సిలర్ గారు మీపేరేంటి, రోజుకు ఎంతమందికి కౌన్సెలింగ్ చేస్తున్నారు కౌన్సెలర్ గోపాల్రావు: మేడమ్ నా పేరు గోపాల్రావు. రోజుకు 30 నుంచి 40 మంది వరకు హెచ్ఐవీపై కౌన్సెలింగ్ ఇస్తున్నాను. డీఎంహెచ్ఓ: ఏప్రిల్ నెల నుంచి ఎంత మంది హెచ్ఐవీ గర్భిణులు ప్రసవించారు. గోపాల్రావు: మేడమ్ ఏప్రిల్ నుంచి ఇంతవరకు 23 మంది హెచ్ఐవీ గర్భిణుల ప్రసవాలు జరిగాయి డీఎంహెచ్ఓ : బిడ్డకు ఎన్ని సంవత్సరాలలో లోపు హెచ్ఐవీ ఉందని నిర్ధారిస్తున్నారు? గోపాల్రావు: 18 నెలలు వయస్సు వచ్చినప్పుడు బిడ్డనుంచి శాంపిల్ తీసి నిర్ధారణకోసం ముంబైకి పంపిస్తాం డీఎంహెచ్ఓ: డాక్టర్ గారు మీపేరేంటి, రోజుకు ఎంతమందిరోగులు సుఖవ్యాధులతో వస్తున్నారు? డాక్టర్ : మేడమ్ నాపేరు మీసాల వేణుగోపాల్. రోజుకు 10 నుంచి 15 మంది వరకు సుఖవ్యాధి, సంబంధిత ఇతర వ్యాధులతో వస్తున్నారు. డీఎంహెచ్ఓ: సూపరింటెండెంట్ గారు ఆస్పత్రిలో సౌకర్యాలు ఏవిధంగా ఉన్నాయి? సూపరింటెండెంట్ రవిచంద్ర: మేడమ్ ఆస్పత్రిలో ప్రస్తుతం 100 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రి మేడపైన150 పడకలు గైనిక్ బ్లాక్ నిర్మాణంలో ఉంది. ఒకటిరెండు నెలల్లో పూర్తి కానుంది. గైనక్ బ్లాక్ అందుబాటులోకి వస్తే మొత్తం 250 పడకలు ఏర్పాటవుతాయి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు డీఎంహెచ్ఓ: రోగులను వేరే ఆస్పత్రి ఎక్కువగా రిఫర్ చేస్తున్నారటా... నిజమేనా? సూపరింటెండెంట్ : అత్యవసరమనుకుంటేనే రిఫర్ చేస్తున్నాం. లేదంటే చేయడం లేదు డీఎంహెచ్ఓ: ఏమ్మా...నీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చావు, నీచేతిలో ఉన్నది పాపా ? ... బాబా? బాలింత తల్లి బంగారమ్మ: అమ్మ నాపేరు బంగారమ్మ. మాది జొన్నవలస. మా పాప కాన్పు కోసం ఇక్కడకు తీసుకువచ్చాను. పాప పుట్టింది. డీఎంహెచ్ఓ: ఇక్కడ బాగానే చూస్తున్నారా? మందులు ఏవైనా కొనుగోలు చేశారా? బంగారమ్మ: బాగానే చూస్తున్నారమ్మా, మందులు కొనమని చెప్పలేదు. డీఎంహెచ్ఓ: 108 వాహనంలో వచ్చారా, ఆటోలో వచ్చావా? బంగారమ్మ: ఆటోలో వచ్చానమ్మ డీఎంహెచ్ఓ:108 వస్తుందని తెలియదా, ఎవరూ చెప్పలేదా? బంగారమ్మ: నాకు ఏవరూ చెప్పలేదు తల్లి, నా అల్లుడి తమ్ముడికి ఆటో ఉంటే, ఆ ఆటో పట్టుకుని వచ్చాం. డీఎంహెచ్ఓ: మీ పాపకు బ్యాంకు ఖాతా ఉందా? బంగారమ్మ: లేదమ్మా డీఎంహెచ్ఓ : ఏమ్మా నీపేరేంటి, మీదేఊరు ? గర్భిణి ఆదిలక్ష్మి: మేడమ్గారు నాపేరు ఆదిలక్ష్మి . మాది సాలూరు. తనిఖీచేయించుకోవడానికి వచ్చాను. డీఎంహెచ్ఓ: సాలూరులో సీహెచ్సీ ఉంది కదా, ఇంత దూరం నుంచి ఎందుకు వచ్చావు? ఆదిలక్ష్మి: అక్కడ ఆపరేషన్ చేయాలంటే ఇక్కడకే రిఫర్చేస్తారు. ఆ సమయంలో సకాలంలో రాలేంకదా మేడమ్. అందుకే ఏ ఇబ్బంది ఉండదని, ఇక్కడ తనిఖీ చేయించుకోవడానికి వచ్చాను. డీఎంహెచ్ఓ : ఏమ్మా ఈ రోజు గర్భిణులకు ఏ ఆహారం ఇచ్చారు, నీపేరేంటి? డైట్ సూపర్వైజర్: మేడమ్ గారు నాపేరు లక్ష్మి. గర్భిణులకు అన్నం, పప్పు, సాంబారు, అరటి పండు ఇచ్చాం. డీఎంహెచ్ఓ: ఏమ్మా... ఆస్పత్రిలో మీకు సంబంధించిన వారెవరున్నారు ? గర్భిణి తల్లి అన్నపూర్ణ: అమ్మా నాపేరు అన్నపూర్ణ. మా అమ్మాయికి ఆస్పత్రిలో ప్రసవం అయింది. డీఎంహెచ్ఓ: మీ అమ్మాయికి ఇక్కడ ఇచ్చిన భోజనం పెడుతున్నావా. ఇంటి నుంచి తెచ్చిన భోజనం పెడుతున్నావా? అన్నపూర్ణ: ఇంటినుంచి తెచ్చిన తోట కూర అన్నం పెట్టాను. డీఎంహెచ్ఓ: ఇక్కడ పప్పువంటి మంచి ఆహారం ఇస్తారు కదా? అన్నపూర్ణ: పప్పు తినకూడదు కదమ్మా... అందుకే పెట్టడం లేదు డీఎంహెచ్ఓ: ఎవరన్నారు పప్పు తినకూడదని? అన్నపూర్ణ: ఇక్కడ వాళ్లే అన్నారమ్మా. డీఎంహెచ్ఓ: పప్పు తినవచ్చు. పప్పు తింటే కంటే తల్లి పాలు ఇవ్వగలదు. డీఎంహెచ్ఓ: ఏమ్మా నీపేరేంటి, ఏ గ్రామం నుంచి వచ్చావు? బాలింత శ్రీవాణి: మేడమ్గారు నాపేరు శ్రీవాణి, మాది దేవుపల్లి గ్రామం. డీఎంహెచ్ఓ: నీకు బ్యాంకు ఖాతా ఉందా? బాలింతశ్రీవాణి: లేదు మేడమ్. డీఎంహెచ్ఓ: డాక్టర్ , నర్సులు బాగా చూస్తున్నారా? శ్రీవాణి: బాగానేచూస్తున్నారు. డీఎంహెచ్ఓ: డాక్టర్ గారు మీపేరేంటి, ఎంతమందిపిల్లలకు ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్నారు? డాక్టర్ : మేడమ్ నాపేరు సుజాత. ఎస్ఎన్సీయూలో 16 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. డీఎంహెచ్ఓ: ఎక్కువుగా ఏ వ్యాధితో వస్తున్నారు? డాక్టర్ సుజాత: బరువు తక్కువతో పుట్టిన పిల్లలు ఎక్కువగా వస్తున్నారు మేడమ్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement