-
ఆక్సిజన్ కుంభకోణంపై సీఐడీ చార్జ్షీట్!
వరంగల్: వరంగల్కు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆక్సిజన్ కుంభకోణాన్ని 2013లో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తేగా.. విషయ తీవ్రతను గమనించిన సీఐడీ అధికారులు 2015లో కేసు నమోదు చేశారు. నెలలు, ఏళ్ల తరబడిగా విచారణ చేసిన అధికారులు శుక్రవారం ఎట్టకేలకు కుంభకోణం జరిగిన విధానంపై చార్జ్షీట్ దాఖలు చేశారు. 2007 నుంచి 2013 వరకు జరిగిన ఆక్సిజన్ టెండర్ విధానంలో నాలుగు కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.180కు సరఫరా జరిగే ఆక్సిజన్ టెండర్ను రూ.385 కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ కుంభకోణానికి సహకరించిన 13 మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులతోపాటు వరంగల్ తులసీ ఏజెన్సీ నిర్వాహకులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. సంచలనంగా మారిన ఆక్సిజన్ దందా... ఆక్సిజన్ కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఏకంగా ఓ సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి ఏసీబీకి పట్టుబడడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎంజీఎం ఆస్పత్రి పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. అసలు ఆక్సిజన్ కాంట్రాక్టర్ లక్షల రూపాయలు సూపరింటెండెంట్కు లంచం ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఏం జరుగుతుంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం విజిలెన్స్, సీఐడీ విచారణకు ఆదేశించింది. అధికారులపై కేసు నమోదు.. ఆక్సిజన్ కుంభకోణంలో తులసీ ఏజెన్సీ నిర్వాహకులు నరహరి బిందురెడ్డి, నరహరి మనోహర్రెడ్డి, 2007 నుంచి 2013వ వరకు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పని చేసిన 13 మంది అధికారులను నిందితులుగా చార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆ కాలవ్యవధిలో పని చేసిన డాక్టర్ రఘురాం, అశోక్కుమార్, ఏ.ఎన్.ఆర్ లక్ష్మి, బలభద్ర పా త్రుని శ్యాంసుందర్రావు, తుంగతుర్తి సురేందర్, డాక్టర్ సత్యదేవ్, నరేంద్రకుమార్, బెంజీమెన్ సామెల్, కొండ్రు నాగేశ్వర్రావు, సుద్దాల లక్ష్మి రాజం, పిల్లి సాంబశివరావు, గంధన్ శేషాచారి నరసింహన్, వరికొటి విష్ణుమోహన్లను నిందితులుగా చార్జ్షీట్లో పేర్లు నమోదు చేశారు. కుంభకోణం వెలుగుచూసింది ఇలా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెండర్ల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వేలాది మంది పేద ప్రజలకు సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల్లో ఆక్సిజన్ టెండర్ కీలకంగా మారింది. ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో 2013 మే నెలలో ఆస్పత్రిలోని ప్రధాన వార్డులకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేస్తున్నారు.. ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించిన ప్రతినిధులకు ఖంగుతినే విషయాలను గమనించాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లో రూ.180కు లభించే ఆక్సిజన్ సిలిండర్ను ఏకంగా డబుల్ ధరకు రూ. 385కు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి కొడుతున్న విషయాన్ని గమనించి 2013 మే 17వ తేదీన ఆక్సిజన్ ‘టెండర్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో సిలిండర్లో ఎంత కెపాసిటీ గేజ్తో ఆక్సిజన్ నింపాలి.. ఎంత గేజ్తో నింపుతున్నారు అనే విషయం సమగ్రంగా వచ్చింది. ఈ కథనాన్ని ఆసరా చేసుకున్న అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ.. కాంట్రాక్టర్ మనోహర్రెడ్డి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆతర్వాత కాంట్రాక్టర్ మనోహర్రెడ్డి.. 2013 జూలై నెలలో డాక్టర్ రామకృష్ణకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలింది.. ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 2007 నుంచి 2013 వరకు ఆస్పత్రిలో నామినేషన్ పద్ధతిన టెండర్ కేటాయించడంతోపాటు సరఫరా చేసిన సిలిండర్లకు సైతం అద్దె కట్టించుకున్నారు. ఈ విషయం సైతం ‘సాక్షి’ కథనంలో క్షుణ్ణంగా వచ్చింది. ఒక్కో సిలిండర్కు అదనంగా రూ.190తోపాటు, 2007 నుంచి 2013 వరకు ఎంజీఎం ఆస్పత్రి నుంచి రూ.35.29 లక్షల అద్దె చెల్లించినట్లు.. ఈ రకంగా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల దోపిడీ జరిగినట్లు గుర్తించారు. -
రేపటి వ్యాపారం
జీవన కాలమ్ రాబోయే కాలంలో అందమైన, చూడముచ్చటయిన, నాజూకు అమ్మాయిలూ మోసుకు తిరగగల ఆక్సిజన్ సిలెండర్లు మార్కెట్లోకి వస్తాయి. అంతేకాదు. వీటితో పాటు అవినీతి కూడా వెల్లివిరుస్తుంది. కల్తీ ఆక్సిజన్ కూడా వస్తుంది. తెల్లారి లేస్తే మనం పేపర్లలో సల్మాన్ఖాన్ జింకని చంపిన కేసులో నిర్దోషిగా బయట పడిన కథలూ, ఆమీర్ఖాన్ భార్య ఈ దేశంలో ఉండడం భయంగా ఉందన్న కథలూ చదివి ఆనందిస్తాం. కాని అందరూ చదవాల్సిన, తెలు సుకొనవలసిన, తెలిసినా ముఖం చాటేసే నాయకులకు ఈ పాటికే తెలిసిన సత్యాలను తెలుసుకోము. మొన్న పేపర్లో 11వ పేజీలో ఓ చిన్న వార్తని ఓ మూల ప్రకటించారు. ఇది మానవాళి వణికిపోతూ పట్టించుకోవలసిన సంగతి. ‘‘రాబోయే కాలంలో మనుషులు పరిశుభ్రమైన గాలిని పీల్చడానికి తమ తమ ఆక్సిజన్ సిలెండర్లను మోసుకు తిరగాల్సిన రోజులు వస్తాయి’’అని జాతీయ హరిత ట్రిబ్యునల్ అధ్యక్షులు స్వతంతర్ కుమార్గారు సిమ్లాలో అన్నారు. మన దేశంలో - మన తాతలకాలంలో -గ్రామా లలో మండించే ఎండల్లో ఏ ఇంటి ముందునిలిచినా ‘చల్ల’ని హర్ధికంగా ఇవ్వడాన్ని విన్నాం. ఇప్పుడు ‘చల్ల’మాట దేవుడెరుగు పరిశుభ్రమైన మంచినీటికే దిక్కులేదు. ఇప్పుడిప్పుడు దాదాపు ప్రతీ వ్యక్తి తమ తమ మంచినీటి సీసాల్తో కనిపించడం మనకి అలవాటైన దృశ్యం. తాగే నీటిని పట్టుకు తిరిగే రోజు వస్తుందని నా చిన్నతనంలో నేను అనుకోలేదు. మరి 60 ఏళ్లలో అంటే మన పిల్లల తరంలోనే స్నానం చేయడానికి సరిపోయే నీరు కరువౌతుందని ఆ మధ్య ఒకాయన చెప్పారు. ఏవో రసాయన పదార్ధాలతో ఒంటిని తుడుచుకోవడం ఫ్యాషన్గా మారుతుందట. ఇది గ్లామర్ కోసం కాదు. గతిలేక అన్నాడీయన. పారిశ్రామిక ప్రగతిని సాధించిన ఈ రెండు శతాబ్దాలలోనే లక్షల సంవత్సరాలు ఈ భూమిని జీవనయోగ్యంగా ఉంచిన వనరులు, వాతావరణం క్రమంగా భయంకరంగా భయంకరమైన వేగంతో కలుషితమైపోతున్నాయి. మానవులు ఈ భూమిని వాడుకునే లేదా దుర్వినియోగం చేసే వేగంతో భూమి తనని తాను పునరుద్ధరించుకునే వేగం పుంజుకోలేకపోతోంది. ఈ భూమి వయసుతో పోలిస్తే మానవుని వయసు హాస్యాస్పదమైనంత అల్పం. ఇటు కన్ను తెరిచి అటు మాయమయేటంత ప్రిదిలిపోయే సరుకు, ఈ స్వల్ప వ్యవధిలోనే కొన్ని లక్షల తరాల సంక్షేమాన్ని, కొన్ని కోట్ల సంవత్సరాలుగా కాపాడే ఈ భూమిని ఎంత అనా లోచితంగా, స్వార్ధపూరితంగా, ముందు చూపులే కుండా దుర్వినియోగం చేస్తున్నాడో తలుచుకుంటే - ఇది నేనన్న మాట కాదు- మానవునికీ చెద పురుగుకీ తేడా లేదు. ఇది క్రూరమయిన ఉపమానం కావచ్చు. కాని ఇదే నిజం. అయితే ఇవన్ని మాటల్లో స్వతంతర్ కుమార్ చెప్పలేదు. ఇక వ్యాపారులు, రాజకీయ నాయకులు, స్వార్థ పరులు ఆక్సిజన్ సిలెండర్లు వ్యాపారంలోకి దిగితే? బజార్లో అమ్మకానికి పెట్టే ఈ సిలెండర్లలో ఉండవల సినంత సరుకు లేకుండా అమ్మితే? ఆక్సిజన్ని కలుషితం చేస్తే? నిద్రపోయే పక్క ప్రయాణికుడి సిలెండర్ను దొంగ ఎత్తుకుపోతే? అల్లుడుగారికి కట్నంగా 60 స్వచ్ఛమైన ఆక్సిజన్ సిలెండర్లను మామగారు పిల్లతో సహ బహూకరిస్తే? మంత్రులకు, వారి చెంచాలకు ఉచితంగా లెక్కలేనన్ని సిలెండర్ల పంపిణీని చట్టబద్ధం చేస్తే? సిలెండర్ల గొడౌన్లలోనే కుంభకోణం జరిగితే? తెలుగు భాషకీ కొత్త నుడికారం వస్తుందని నా నమ్మకం. ఎవరైనా సహాయం చేస్తే, ‘‘ఆహా! సమ యానికి రామారావు ఆక్సిజన్ సిలెండర్లాగ తారసపడ్డా డయ్యా’’. ఎవరైనా నిష్టూరంగా ప్రవర్తిస్తే: ‘‘ఒరేయ్! చేతనయితే ఆక్సిజన్ సిలెండర్వికా. అంతేకాని ఖాళీ సిలెండర్లా వీపుమీద స్వారీ చెయ్యకు’’, ‘‘ఈ గోవింద రావు చిల్లులు పడిన సిలెండరు లాంటివాడు. బయటికి కనిపిస్తాడు. కాని లోపల ఉత్త డొల్ల.’’ ఇన్ని విషయాల్ని ఇంతగా వివరించి చెప్పలేని ఆ కాలపు పెద్దలు, ఇంతగా చెప్పవలసిన రోజులు వస్తాయని తెలీక ‘‘ఈ భూమి దేవత. దాన్ని గౌరవిం చండి. కూల్చిన ప్రతీ చెట్టుకీ ప్రాయశ్చిత్తం చేసి ప్రత్యా మ్నాయాన్ని కల్పించండి’’ అని మొరపెట్టుకున్నారు. ఇప్పుడు మన నాయకులు లక్షల, కోట్ల మొక్కల్ని నాటించడమే పనిగా రంగంలోకి దూకారు. కెమెరాలు పోటీలు పడి చూపుతున్నాయి. నాటడం వరకూ బాగానే ఉంది. కాని అవి బతకడానికి నీరు? బతికించే నాథుడు? గడిచే ప్రతీ నిమిషం ఈ భూమి మీద మానవుడు సజావుగా బ్రతికే ఒక తరం వనరుల్ని ధ్వంసం చేస్తోం దట. రాబోయే కాలంలో లాభసాటి వ్యాపారం అంద మైన, చూడముచ్చటయిన, నాజూకు అమ్మాయిలూ మోసుకు తిరగగల, మంచి డిజైన్లలో ఆక్సిజన్ సిలెం డర్లు మార్కెట్లోకి వస్తాయి. అంతేకాదు. వీటితో పాటు అవినీతి కూడా వెల్లివిరుస్తుంది. కల్తీచేసే ఆక్సిజన్, చిల్లు సిలెండర్లు, టోకు వ్యాపారం, సిలెండర్ పేలుళ్లు, కాంట్రాక్టుల్లో కుంభకోణాలు. 2జి కుంభ కోణం వీరుడు ఏ.రాజాగారి అబ్బాయి ఇప్పటినుంచే ఆ ప్రయత్నంలో ఉంటారని నా నమ్మకం. (వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement