-
దురలవాట్ల మీద అన్ని పాటలు రాసినా...నాన్నకు ఒక్క దురలవాటూ లేదు!
తెలుగు సినిమా పాటకు జానపద సొబగులు అద్దిన రచయిత అంటే - కొసరాజు రాఘవయ్య చౌదరే గుర్తుకు వస్తారు. ‘ఏరువాకా సాగారో...’ (‘రోజులు మారాయి’) అని రైతు జీవితం వర్ణించినా, ‘సరదా సరదా సిగరెట్టు...’ (‘రాముడు - భీముడు’) అని గిలిగింతలు పెట్టినా... ఆ పాటలు అప్పుడూ ఇప్పుడూ ఎవర్గ్రీన్. సినీ గీత రచనలో ఆద్యంతం తనదైన ముద్రను కొనసాగించిన ఈ ‘జానపద కవిసార్వభౌము’డి వర్ధంతి నేడు. అచ్చతెలుగు పల్లెటూరి జీవితాన్ని ప్రేమించి, ఆఖరు దాకా వేషభాషల్లో, రచనల్లో అలాగే జీవించిన ఈ ‘కవిరత్న’ జీవిత విశేషాల్లో కొన్ని ఆయన ఏకైక కుమారుడు - సినీ నిర్మాత 80 ఏళ్ళ కొసరాజు భానుప్రసాద్ మాటల్లో... ఇద్దరన్నదమ్ముల్లో పెద్దవాడు - మా నాన్న కొసరాజు గారు. మాది రైతు కుటుంబం. మా స్వగ్రామం - గుంటూరు జిల్లా అప్పికట్ల. ఆరేడేళ్ళ చిన్నవయసులోనే ఆయన పద్యాలు రాసేవారట, కవిత్వం చెప్పేవారట. అందుకని అప్పట్లో ఆయనను ‘బాలకవి’ అని పిలిచేవారట. గురువు గారు కొండముది నరసింహం పంతులు ప్రభావంతో రాయడం, పాడడం నేర్చుకున్న నాన్న గారికి ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి బాబాయ్ వరుస అవుతారు. వరించి వచ్చిన సినిమా ఛాన్సులు గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన ‘రైతుబిడ్డ’ (’39)లో నాన్నగారు అనుకోకుండా రచన చేశారు. నటించారు. అప్పుడు నాకు అయిదేళ్ళు. ఆయనకు అసలు ఎప్పుడూ మద్రాసులో సినీ రంగంలో స్థిరపడిపోవాలని ఉండేది కాదు. కొన్నేళ్ళ తర్వాత ‘పెద్దమనుషులు’ (’54), ఆ వెంటనే బి.ఏ. సుబ్బారావు ‘రాజు - పేద’ (’54), ‘రోజులు మారాయి’ (’55)తో దశ తిరిగింది. మద్రాసు వదిలేసి, సొంత ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడల్లా సినిమా ఛాన్స రావడం, పాటల విజయవంతం కావడం జరిగేది. చివరకు ‘రోజులు మారాయి’తో ఆయన మద్రాసులోనే రచయితగా స్థిరపడ్డారు. ఆయనకున్నది ఆ ఒక్క వ్యసనమే! ఒక రకంగా చెప్పాలంటే, నాన్న గారు కులాసా పురుషుడు. హాయిగా, ప్రశాంతంగా జీవించడం, దేనికీ చింతపడకుండా కాలం గడిపేయడం ఆయన లక్షణం. గమ్మత్తేమిటంటే, ధూమపానం మీద (‘సరదా సరదా సిగరెట్టు...’), మద్యపానం మీద (‘ఏసుకుందాం బుడ్డోడా...’), పేకాట మీద (‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...’) - ఇలా దురలవాట్ల మీద ఆయన చాలా పాటలు రాశారు. అవన్నీ ఇవాళ్టికీ సూపర్హిట్లే. ఆయనకు మాత్రం ఆ అలవాట్లేమీ లేవు. ఉన్న ఒకే ఒక్క వ్యసనం- పదే పదే కాఫీ తాగడం! చిత్ర నిర్మాణంలో... మా అమ్మానాన్నలకు నేనొక్కడినే సంతానం. బహుశా అందుకే కావచ్చు, గారాబం చేశారు. ఎకనామిక్స్లో నేను ఎం.ఏ చేశా. ఆ తరువాత మద్రాసు లా కాలేజ్లో బి.ఎల్. చదివా. కానీ, నాన్న గారి ప్రభావం వల్ల ఇరవై ఆరేళ్ళ వయసులోనే చిత్ర నిర్మాణంలోకి వచ్చా. పూర్తిస్థాయి నిర్మాతగా మారాక, యేడెనిమిది చిత్రాలు చేశా. ‘కవిరత్నా మూవీస్’ పతాకంపై తీసిన 3 చిత్రాలను (ఎన్టీఆర్తో ‘విశ్వరూపం’ (’81) వగైరా) నాన్న గారే సమర్పించారు. స్క్రిప్టు విని తన అభిప్రాయాలు చెప్పేవారు. పాటలన్నీ... జేబులో స్లిప్పుల్లో! ఆయన పాటలు రాసే విధానం గమ్మత్తుగా ఉండేది. ఆయన ఎక్కువగా నడిచేవారు. ‘ఈ కాస్త దూరానికి కారెందుకు?’ అంటూ, దర్శక - నిర్మాతల దగ్గరకు నడిచి వస్తానని అనేవారు. నడక ఆరోగ్యానికి మంచిదనేవారు. ఆయన జేబుల్లో ఎప్పుడూ స్లిప్పులు ఉండేవి. రోడ్డు మీద వెళుతున్నప్పుడైనా సరే ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, గబగబా వాటిలో రాసేసుకొనేవారు. అయిదొందలు, వెయ్యి రూపాయల పారితోషికంతో అంత అద్భుతమైన పాటలు రాశారంటే, ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. చరమాంకంలో ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ వచ్చింది. జరగాల్సిన దాని మీదే దృష్టి! నాన్న గారి నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే - మంచే కాదు, చెడు జరిగినా సరే దాని గురించే ఆలోచిస్తూ గడిపేవారు కాదు. ‘తరువాత ఏంటి? ఏం చేద్దాం?’ అనేవాళ్ళు. సినిమాలు తీస్తున్నప్పుడు నష్టాలే ఎక్కువసార్లు వచ్చినా, తరువాతి ప్రాజెక్ట్ గురించే ఆలోచించేవారు. ఆయనకు అంత తేలిగ్గా కోపం రాదు. మంచిగా చెప్పడమే కానీ, ఎవరినీ కోప్పడేవారు కాదు. పిల్లల పెంపకంలో కూడా ఆ రోజుల్లో ఆయనది చాలా చిత్రమైన పద్ధతి. ఎప్పుడూ క్రమశిక్షణ, కట్టుదిట్టమైన నియమ నిబంధనల లాంటివి లేవు. నన్నెప్పుడూ స్నేహితుడి లాగానే చూసేవారు. మా అబ్బాయి రంజన్కు కూడా చదువు విషయం బుజ్జగిస్తూ, చెబుతుండేవారు. సినిమాల కోసం నాన్న గారు దాదాపు వెయ్యి పాటలు రాశారనుకుంటా. వాటిలో ఇప్పటికి 800 దాకా పాటలు సేకరించగలిగాం. వచ్చే జూన్లో నాన్న గారి పుట్టినరోజు నాటికి, పుస్తకంగా తీసుకురావాలని మా ప్రయత్నం. ‘‘నాన్న గారెప్పుడూ చాలా సాదాసీదాగా, ధోవతి - లాల్చీ, పైన కండువాతో అచ్చ తెలుగు వేషధారణలో సామాన్యరైతులా ఉండేవారు. ఇంటి బయట వరండాలో అరుగు మీద బనీనైనా లేకుండా కూర్చొని హాయిగా పల్లెటూరి పద్ధతిలో ముచ్చట్లాడడం ఆయన అలవాటు.’’ సంభాషణ:: రెంటాల జయదేవ ఫోటోలు: వన్నె శ్రీనివాసులు, సాక్షి, చెన్నై -
స్వర్ణోత్సవ ‘రాముడు - భీముడు’కథ ఒకటి... బాక్సాఫీస్ హిట్లెన్నో!
కొన్నేళ్ళ పాటు కథారూపంలోనే ఉండిపోయి, నిర్మాతలెవరూ చిత్రరూపమివ్వడానికి ముందుకు రాని ఓ స్క్రిప్టు ఆ తరువాతెప్పుడో తెరకెక్కడం విచిత్రమే. అన్నేళ్ళు ఆగిన ఆ కథతో వచ్చిన సినిమా సూపర్ హిట్టవడం విశేషమైతే, ఇక ఆ కథ ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఆరు భాషల్లో రీమేకై, హిట్టవడం మరో విశేషం. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డల్లో ఒకరు అమాయకులు, మరొకరు దేనినైనా ఎదిరించి నిలిచే ధైర్యవంతులైతే ఎలా ఉంటుందనే ఆ ఇతివృత్తం ఇప్పటికీ సగటు బాక్సాఫీస్ సినీ సూత్రం. దాన్ని వాటంగా వాడుకొంటూ శ్రీదేవి ‘చాల్ బాజ్’ (1989) లాంటి ఎన్నో సినిమాలు ‘ఫ్రీ మేక్’లుగా వచ్చాయి. చాలామటుకు విజయాన్ని చవిచూశాయి. మరి, ఈ సినిమాలన్నిటికీ మూలం మన తెలుగు సినిమా కావడం మనకు గొప్పే కదా! ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు - భీముడు’ విడుదలై, ఇవాళ్టికి యాభై వసంతాలు నిండుతున్నాయి. ఆకట్టుకొనే అభినయం, అలరించే సంగీత సాహిత్యాలతో ఇవాళ్టికీ తీపిజ్ఞాపకమైన ఈ స్వర్ణోత్సవ చిత్ర విశేషాల్లో కొన్ని... ఓ తల్లికి ఇద్దరు పిల్లలు. అనుకోకుండా పుష్కరాల్లో ఒకడు తప్పిపోతాడు. మిగిలిన ఒక్కడూ అపురూపంగా పెరిగి అమాయకుడైతే, ఎవరికో దొరికిన రెండో పిల్లాడు బీదరికంలో పెరిగినా, ధైర్యవంతుడవుతాడు. పెరిగి పెద్దయిన వీళ్ళిద్దరూ చిత్రమైన పరిస్థితుల్లో ఒకరి స్థానంలోకి మరొకరు వెళతారు. అప్పుడు జరిగిన నాటకీయ సంఘటనలేమిటి? వారిద్దరూ అన్నదమ్ము లుగా ఎలా కలిశారు? దుర్మార్గుల ఆటలు ఎలా కట్టాయి? ఇదీ ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు - భీముడు’ చిత్ర కథాంశం. ఇది సాంఘిక చిత్రమే కానీ, రచయిత డి.వి. నరసరాజు మొదట దీన్ని జానపద కథగా అల్లారు. ‘ప్రిజనర్ ఆఫ్ జెండా’, వేదం వెంకట రాయశాస్త్రి రచన ‘ప్రతాపరుద్రీయం’ లాంటి వాటి స్ఫూర్తితో ఆ కథ అల్లారు. ఆ తరువాత ఈ జానపదాన్ని సాంఘిక కథగా మార్చారు. నలుగురైదుగురు దర్శక, నిర్మాతల దగ్గర తిరిగినా కెమేరా ముందుకు రాని ఈ కథ తాపీ చాణక్య దర్శకత్వంలో, డి. రామానాయుడు చేతిలో పడ్డాక, బాక్సాఫీస్ ఫార్ములా అయి కూర్చుంది. రీమేక్లో ఇదో రికార్డు!: ఇవాళ దేశంలోని అనేక భాషల్లో సినిమాలు నిర్మించి, శతాధిక చిత్ర నిర్మాతగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ స్థాయికి ఎదిగిన డి. రామానాయుడు ‘సురేష్ ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మించిన తొలి సినిమా ఈ ‘రాముడు - భీముడు’. అంతకు ముందు ఇతరుల చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ‘అనురాగం’ అనే ఓ చిత్రానికి పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకున్న ఆయన ఈ సినిమాతోనే పూర్తిస్థాయి నిర్మాతగా కెరీర్ను ప్రారంభించారు. అప్పట్లో 6 లక్షల బడ్జెట్లో ఎన్టీఆర్, జమున, ఎల్. విజయలక్ష్మి, ఎస్వీ రంగారావు, శాంతకుమారి ప్రధాన తారాగణంగా తయారైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇన్ని ప్రింట్లు, ఇన్ని కేంద్రాల్లో రిలీజులు లేని ఆ రోజుల్లోనే 30 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. దాంతో ఈ కథను తమిళం (ఎమ్జీఆర్తో ‘ఎంగ వీట్టు పిళ్ళై’), హిందీ (దిలీప్ కుమార్తో ‘రామ్ ఔర్ శ్యామ్’) భాషల్లో ‘విజయా’ నాగిరెడ్డి తీశారు. అలాగే, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ భాషల్లోకి ఈ చిత్రం రీమేకైంది. తెలుగు నుంచి అత్యధికంగా 6 భాషల్లోకి అధికారికంగా రీమేకైన సినిమా ఇవాళ్టికీ ఇదొక్కటే! రిపీట్ రన్స్లోనూ బాగా ఆడిన ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ కథగా మార్చి, హిందీలో ‘సీతా ఔర్ గీతా’, తెలుగులో ‘గంగ - మంగ’ లాంటివి వచ్చాయి. అనిల్ కపూర్ ‘కిషన్ కన్హయ్య’, శ్రీదేవి ‘చాల్బాజ్’ తరహాలో అనధికారిక ‘ఫ్రీ మేక్’లుగా వచ్చిన సినిమాలు కోకొల్లలు. ఆఖరుకు కొద్దిపాటి మార్పులు, చేర్పులతో సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణతో ‘రాముడు - భీముడు’ అన్న టైటిల్తోనే తెరకెక్కింది. తెరపై ఓ హిస్టారికల్ డాక్యుమెంట్: ఈ సినిమాలో ఎన్టీఆర్, శాంతకుమారి అక్కాతమ్ముళ్లు. సినిమా కథలో భాగంగా వారి తల్లితండ్రులుగా కూడా ఆ ఇద్దరే తెరపై పెయింటింగ్ల రూపంలో వయసు పైబడ్డ రూపంలో కనిపించడం విశేషం. వారిద్దరూ అలా జోడీగా కనిపించే సినిమా ఇదొక్కటే. నటుడు కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో ప్రత్యేకించి పాత్ర పోషణ చేయలేదన్న మాటే కానీ, సినిమా అంతటా ఎన్టీఆర్కు డూప్గా నటించారు. ఇక, పెండ్యాల బాణీల్లో వచ్చే స్ఫూర్తిదాయక గీతం ‘ఉందిలే మంచికాలం ముందు ుుందునా...’ (రచన- శ్రీశ్రీ), యుగళ గీతాలు ‘తెలిసిందిలే తెలిసిందిలే...’, ‘అదే అదే...’ (సినారె), హాస్య గీతాలు ‘సరదా సరదా సిగరెట్టు...’, ‘తగునా ఇది మామ..’ (కొసరాజు) ఇవాళ్టికీ సూపర్హిట్లే. కృష్ణానదిపై నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మిస్తున్న సమయంలో శ్రమకోర్చి మరీ అక్కడ ‘దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్...’ (కొసరాజు) పాటను చిత్రీకరించారు. ఎన్టీఆర్, ఎల్. విజయలక్ష్మి బృందంపై వచ్చే ఆ పాట ఆనాటి మన ‘ఆధునిక దేవాలయ’ నిర్మాణ దృశ్యాలకు ఇప్పుడు వెండితెరపై మిగిలిన ఓ హిస్టారికల్ డాక్యుమెంట్. త్వరలో... కలర్లో: నాలుగైదేళ్ళు రచయిత దగ్గరే మూలిగిన ఈ చిత్ర కథ తెరకెక్కిన వేళా విశేషమేమో కానీ, అటు ‘సురేష్ ప్రొడక్షన్స్’ అయిదు దశాబ్దాలుగా నిర్విరామంగా సినిమాలు తీస్తూ, 15 భారతీయ భాషల్లో 150 దాకా సినిమాలు తీసిన ప్రతిష్ఠాత్మక సంస్థగా ఎదిగింది. ఇటు ఈ కథాంశమూ దేశంలోని అనేక భాషల్లో పదే పదే తెరకెక్కుతూ వచ్చింది. అందుకే, రామానాయుడుకు ఈ సినిమా ఓ స్పెషల్. ‘‘నా సంస్థకు విత్తనమైన ఎన్టీఆర్ ‘రాముడు - భీముడు’నూ, ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఎన్నో కష్టాల్లో ఉండగా నా సంస్థను నిలబెట్టిన ఏయన్నార్ ‘ప్రేమనగర్’నూ మర్చిపోలేను’’ అని ప్రత్యేకించి పదే పదే ప్రస్తావిస్తుంటారు. ఈ కథను ఎన్టీఆర్ మనుమడైన ఈ తరం హీరో ఎన్టీఆర్తో మళ్ళీ తీయాలని ఆయన కోరిక. ఆ సంగతి ఆయన ప్రకటించారు కూడా. ఆ ప్రయత్నం ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో, అయిదు పదుల ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లోకి మారుస్తున్నారు. త్వరలోనే విడుదల చేసే పనిలో ఉన్నారు. ఓ కథకూ, సినిమాకూ అంతకన్నా అరుదైన గౌరవం ఇంకేముంటుంది! - రెంటాల జయదేవ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement