-
జననీ.. జయకేతనం
నల్లగొండ కల్చరల్, న్యూస్లైన్, డప్పుల దరువులు..కళాకారుల ఆటాపాటలతో యువత ఊర్రూతలూగింది. చిందుయక్షగానం..శ్రీకృష్ణార్జునయుద్ధం ఇక్కడి సాంస్కృతిక వైభవం చాటగా.. మరోవైపు నోరూరించే ఫుడ్కోర్టు భోజనప్రియులను ఆహ్వానించింది. ఇదీ..జిల్లాకేంద్రంలోని ఎన్జీకాలేజీలో జరుగుతున్న తెలంగాణ సంబురాలలో శుక్రవారం రాత్రి నెలకొన్న సందడి. అంతకుముందు ఉత్సవాలలో భాగంగా కలెక్టర్ టి.చిరంజీవులు జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించింది ఈ అపురూప క్షణం కోసమే అని పేర్కొన్నారు. తెలంగాణకు గొప్ప సాంస్కృతిక, సాహితీ వైభవం ఉందని, ఇక్కడి సంప్రదాయాలు పేరెన్నికగన్నవన్నారు. తెలంగాణ సాకారమైన సందర్భంగా వాటన్నింటినీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతోపాటు ఇక్కడి వంటలతో ఫుడ్కోర్టును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఎస్పీ రమారాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని, ఇంత పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా రెవెన్యూశాఖకు అభినందనలు తెలిపారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా లలిత సుమాంజలి గణపతి ప్రార్థన, కూచిపూడి నృత్యం, జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం పాటకు పాలబిందెల బాలు బృందం ఆధ్వర్యంలో ఉషారాణి, జిషిత, పాలబిందెల సాత్విక తదితరులు నృత్యం చేశారు. హైదరాబాద్కు చెందిన కళానృత్యనికేతన్ బిందు, అభినయ్ బృందం వారి రాచలీల, అన్నమాచార్య కీర్తన, ‘‘వచ్చెను అలివేలు మంగా, బ్రహ్మమొక్కటే’’ అంశాలు ప్రదర్శించారు. నల్లగొండ న్యూస్ స్కూల్ నుంచి గౌస్బాబా బృందం ఆధ్వర్యంలో భారత వేదమున నృత్యం పేరిట వెంకట్ బృందంతో పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..., శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన చింతల చెర్వునాగభూషణం బృందం చిందు యాక్షగానం.. శ్రీకృష్ణార్జున యుద్ధం నిర్వహించారు. ఆహా ఏమిరుచి... అంతకుముందు జిల్లా కలెక్టరు చిరంజీవులు కళాశాల మైదానం రెండవ భాగంలో నిర్వహిస్తున్న ఫుడ్కోర్టును ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన వంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాల్స్లో చికెన్, మటన్ దమ్బిర్యాని, చేపల పులుసు, సకినాలు, కారపప్పలు, పుల్లట్లు, సర్వపిండితో పాటు లడ్డూలు వగైరా అందుబాటులో ఉంచారు. పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు బారులు తీరి బిర్యాని, చేపల వంటకాలను ఆహా ఏమి రుచీ అంటూ ఆరగించారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఏజేసీ వెంకట్రావు, ఆర్డీఓ జహీర్, కొండకింది చినవెంకట్రెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సినీ దర్శకుడు ఎన్.శంకర్, టీజేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, టీఎన్జీఓ కార్యదర్శి వై.వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు ఖలీమ్, ఆదిరెడ్డి, శంకరమ్మ, రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రముఖులకు సన్మానం 60 ఏళ్ల కళ సాకారమైన సందర్భంగా జిల్లాలోని ప్రముఖులకు సన్మానించనున్నట్టు కలెక్టర్ చిరంజీవులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సన్మానం పొందే వారిలో హైకోర్టు జడ్జి ఈశ్వరయ్యగౌడ్, ఎ.రాజశేఖర్రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ సెక్రటరీ చోల్లెటి ప్రభాకర్, ప్రభుత్వ ఉద్యోగి కిషన్రెడ్డి, స్కాడ్రన్ లీడర్ ఆర్.జయసింహ, సినిమా డెరైక్టర్ ఎన్.శంకర్, సినీ పాటల రచయిత సుద్దాల అశోక్తేజ, పద్మ అవార్డు గ్రహీత గజం అంజయ్య, గజం గోవర్ధన్, పారిశ్రామికవేత్త మీలా సత్యనారాయణ. విద్యావేత్త కె.చినవెంకట్రెడ్డి, పాస్పోర్టు ఆఫీసర్ శ్రీకర్రెడ్డి, ప్రముఖ అడ్వకేట్ మహాముద్ అలీ, ఐబీసీ న్యూస్ ఛానల్ అధినేత ఏచూరి భాస్కర్, కళాకారులు వివేక్, ప్రముఖ సేవకులు జగిని కుశలయ్య, సాహితీ ప్రముఖులు కూరేళ్ల విఠలాచారి, సాంస్కృతిక ప్రముఖలు చల్లం పాండురంగారావు (ప్రజాన్యాటమండలి), సినిమా కమేడియన్ ఆర్టిస్టు వేణుమాధవ్, కార్టూనిస్ట్ శంకర్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి సురేందర్ ఉన్నారు. -
ఇది ప్రజా విజయం
గుండాల, న్యూస్లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరులను మరిచిపోతే మన లక్ష్యాన్ని మరిచిపోయినట్లేనని, తెలంగాణ ఏర్పాటు ఏ ఒక్కరిదీ కాదని.. ఇది ప్రజల విజయమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. గుండాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ.. వేణుగోపాల్ రెడ్డి, యాదన్న, యాదిరెడ్డి, శ్రీకాంతాచారి తదితరుల ఆత్మహత్యలన్నీ నిరసన రూపాలని అన్నారు. వారి త్యాగాలు ఉద్యమానికి ఊపిరిపోశాయని అన్నారు. 1969 నాటి సంఘటనలకు.. ఇప్పటి ఘటనలకు చాలా తేడా ఉందన్నారు. ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మె కూడా చారిత్రాత్మకమైనదని, ఇలాంటి ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి జయశంకర్, ఇతర అమరవీరుల సాక్షిగా కృషి చేస్తామని ప్రకటించారు. చదువుకున్న వారు మౌనంగా ఉంటే టైజం కంటే ప్రమాదమని అన్నారు. ప్రజలను చైతన్యం చేసేలా, తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకె ళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ ఊపిరి పోస్తే, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కదలించిందని అన్నారు. ఖమ్మంలో కేసీఆర్ దీక్ష చేపడితే.. ఆ దీక్షను న్యూడెమోక్రసీ ముందుకు నడిపిందని చెప్పారు. జేఏసీలో లేకపోయినప్పటికీ సీపిఐ నిర్వహించిన పోరాటం కూడా మరువలేనిదని అన్నారు. చివరి సమయంలో ప్రజలు సంఘటితంగా ఉండడ ంల వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, పంపకాల్లోనూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాల్సిన భాద్యత ఉందని అన్నారు. పోలవరం నిర్మాణంతో ఆదివాసీల మనుగడకు ముప్పు ఏర్పడిందని, ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గోదావరి జలాలలపై ఆంధ్రా ప్రాంతానికి హక్కు ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రాంతాన్ని ముంపు పేరుతో తరలించుక పోవడం సరైంది కాదన్నారు. గ్రామాల తర లిపుంపును నిలిపివేసేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు యాసారపు తిరుపతి, సాయన్న, డి.శ్రీను, నాగరాజు అద్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, రేగా కాంతారావు, ఊకె అబ్బయ్య, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం నాయకులు ఎన్.వెంకటపతిరాజు, న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నాయకులు ముక్తార్పాషా, ముక్తి సత్యం పాల్గొన్నారు. -
మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది
తూప్రాన్, న్యూస్లైన్: మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలోని లక్ష్మినర్సింహా ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నేరవేరిందన్నారు. బీజేపీ వల్లే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు. నాయకులు అవినీతిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏనాడు ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. కేవలం తమ ఆస్తులను కూడబెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులతో పాటు మెదక్ ఎంపీ అభ్యర్థిగా చాగన్ల నరేంద్రనాథ్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్లో ఇమడలేకపోయా: చాగన్ల కాంగ్రెస్ పార్టీ రౌడీల పార్టీ నరేన్ ట్రస్టు అధినేత, బీజేపీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి చాగన్ల నరేంద్రనాథ్ విమర్శించారు. కాంగ్రెస్ కోసం తన వంతు కృషి చేశానన్నారు. తన సొంత నిధులతో ప్రజా సేవ చేస్తుంటే కొందరు అది సహించేకపోయారన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్రెడ్డిని తనపైకి పురిగొల్పారన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుపడ్డారన్నారని, ఎమ్మెల్యే నర్సారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి తూప్రాన్ వచ్చిన సందర్భంగా స్టేజీపైకి రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారన్నారు. ఈ విషయాన్ని సీఎం గమనించి తనను స్టేజీ పైకి పిలిపించారని గుర్తుచేశారు. దీంతో తాను కాంగ్రెస్లో ఇమడలేనని గ్రహించి ప్రజల అభీష్టం మేరకే బీజేపీలో చేరానని వివరించారు. -
సోనియా చొరవతోనే తెలంగాణ
నర్సాపూర్రూరల్, న్యూస్లైన్: అమరుల త్యాగ ఫలితం, సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ఆత్మ బలి దానాలు చేసుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్నారన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీ రాజ్య సభలో మెలిక పెట్టి బిల్లును అడ్డుకునేందుకు కుట్రపన్నిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరిచి, రాహుల్గాంధీని ప్రధాన మంత్రి చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపై ఉందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రిని ముందుగా స్థానిక నేతలు మాజీ ఉపముఖ్యమంత్రి జగన్నాథరావు విగ్రహం వద్ద ఘనంగా సన్మానించి ఓపెన్టాప్ జీపులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ గాంధీ, బాబూజగ్జీవన్రామ్, వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ర్యాలీలో కార్యకర్తలు బ్యాండ్ మేళాలతో నృత్యం చేయడంతో పాటు పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, శ్రీధర్గుప్తా, చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ లలిత, శ్రీనివాస్గౌడ్, అనిల్గౌడ్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు .. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు తెలిసి సమాచారం వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం లేదన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ నిర్ణయమే తుది నిర్ణయమని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా కొత్త ముఖ్యమంత్రి నియమించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారన్నారు. కొత్త కాలనీల అభివృద్ధికి నిధులు నర్సాపూర్ నియోజకవర్గం కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి భవనానికి రూ. 11 కోట్లు విడుదలయ్యాయని, దీంతో పాటు వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి రూ. 98 లక్షలు, మం డలాల్లోని కొత్త కాలనీల అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే చెక్డ్యాంల నిర్మాణానికి, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ మంజూరుకు నిధులు, హత్నూర, కౌడిపల్లి, కొ ల్చారం మండలాలకు రూ. 7. 50 కోట్లు, ని యోజకవర్గంలోని చెరువులు, కుంటల అభివృద్ధికి రూ. కోటి 8 లక్షలు, బీటీ రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం నిధులు విడుదలైనట్లు మంత్రి చెప్పారు. ఏడుపాయల జాతరను పురస్కరించుకొని ప్రభుత్వం సింగూర్ నుంచి నీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటోందన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి నర్సాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నర్సాపూర్లో 100 పడకల ఆస్పత్రి భవనంతో పాటు జూనియర్ కళాశాల భవనం, హత్నూర, శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం మండలాలకు సంబంధించిన బీటీ రోడ్ల మరమ్మతులు, తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, కాంగ్రెస్ పా ర్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు వెల్దుర్తి: నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం వెల్దుర్తిలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి హాస్టల్ బాలికలతో మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులు, యువకుల పోరాటాలు, బలిదానాలకు స్పందించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం మంత్రి బాలికలతో జై సోనియాగాంధీ, జై తెలంగాణ అంటూ నినాదాలు చేయించారు. మంత్రి వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు. -
పోరాటాల ఫలితమే తెలంగాణ
జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లుది కీలకపాత్ర టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ హన్మకొండ సిటీ, న్యూస్లైన్ : ఉద్యమకారులు, ప్రజల నిరవధిక పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ర్ట కన్వీనర్ అల్లం నారాయణ అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. పార్లమెం ట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడాన్ని పురస్కరించుకుని టీజేఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్టులు నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. అనంత రం జర్నలిస్టులు తెలంగాణ ఆటపాటలతో ర్యాలీ నిర్వహిం చి, కాళోజీ విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిం దన్నారు. అలాగే బీజేపీ ముందు నుంచి చెప్పిన మాట పై నిలబడిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీతో పాటు అన్ని జేఏసీలు, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు కలిసి వచ్చాయన్నారు. ఎంఎల్ పార్టీలు, మావోయిస్టు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశాయని, న్యాయవాదులు కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు జిల్లా ప్రజలు కీలకపాత్ర పోషించారని, స్వరాష్ట్ర సాధన కోసం రాజకీయాలకతీతంగా ఇక్కడి వారంతా ఐక్యంగా ఉద్యమించారన్నారు. ప్రధానంగా జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యం చేశారని, రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న సీమాంధ్ర పక్షపాతి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి జిల్లాలోని రాయినిగూడెంలో ముచ్చెమటలు పట్టించారని చెప్పారు. ఉద్యమానికి అండగా నిలిచారు : పరిటాల మలిదశ తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు అండగా నిలి చారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన జర్నలి స్టులు చిరకాలం గుర్తుంటారని పేర్కొన్నారు. తెలం గాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావా ల న్నారు. ర్యాలీలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్కుమార్, నగర అధ్యక్షుడు రాంకిషన్, ప్రధాన కార్యదర్శి సోమయ్య, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు, కళాకారుల జేఏసీ జిల్లా కన్వీనర్ దారా దేవేందర్, కళాకారుడు గద్దర్ సాంబయ్య, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కోశాధికారి రమణ, జిల్లా కన్వీనర్ కూన మహేందర్, నాయకులు గటిక విజయ్కుమార్, బీఆర్ లెనిన్, పీవీ.కొండల్రావు, దొంతు రమేష్, నూర శ్రీనివాస్, సుధాకర్, ప్రెస్క్ల బ్ ప్రధాన కార్యదర్శి దుంపల పవన్కుమార్, డెస్క్ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శంకేసి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, నాయకులు కెంచ కుమారస్వామి, నుగునూతుల యాకయ్య పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement