-
డబుల్ అను‘గృహమే’దీ?
ఇదీ.. సంక్షేమ రంగంలోనే మేలిమలుపుగా దేశవ్యాప్త చర్చకు దారితీసిన ‘డబుల్ బెడ్రూం ఇళ్ల’పథకం ప్రస్తుత పరిస్థితి. ‘సింగిల్ కాదు.. డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాం.. అదీ పూర్తి ప్రభుత్వ ఖర్చుతోనే!’.. అని ప్రభుత్వం చెప్పడంతో నిరుపేదలు తమ ఊహలకు రెక్కలు తొడిగారు. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ (ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్) కాలనీ తరహాలోనే తమకూ కొత్త జీవితం వస్తుందని ఆశపడ్డారు. ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల నిర్మాణానికి వ్యూహరచన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. కానీ, ఇప్పటివరకు మంజూరైన ఇళ్లు మాత్రం 2.76 లక్షలే. వీటిలో నిర్మాణం పూర్తయింది సగం కంటే తక్కువే. అదీగాక ఇళ్లు పూర్తయినా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది ఇంకా తక్కువే. వీటికితోడు అన్ని సదుపాయాలు కల్పించిన ప్రాంతాల్లోనూ ఇళ్లు పంపిణీ చేయకపోవడం శోచనీయం. ఇన్ని అడ్డంకులు దాటుకుని తీరా కేటాయింపులు చేసే సమయంలో రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేస్తుండటంతో నిరుపేదల ఆశలు అడియాసలవుతున్నాయి. ఫలితంగా సమున్నత పథక లక్ష్యం పక్కదారి పట్టే పరిస్థితి కనిపిస్తోంది. – శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి దొంగలతో.. మళ్లీ మొదటికి.. మెదక్ జిల్లా రామాయంపేటలో చాలాకాలం క్రితమే 300 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ ఉన్న ఇళ్ల కంటే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే నిధుల కొరత ఉండటంతో మౌలిక సదుపాయాల కల్పనలోనూ జాప్యం చేశారు. ఈలోగా ఆ ఇళ్లలో దొంగలు పడి విద్యుత్ వైర్లను పూర్తిగా ఎత్తుకుపోయారు. దీంతో అన్ని ఇళ్లకు మళ్లీ వైరింగ్ చేయాల్సిన పరిస్థితి. ఈ మొత్తాన్ని ఎవరు భరించాలో స్పష్టత లేక అధికారులు తల పట్టుకుంటున్నారు. మరుగుదొడ్డిలో.. ఏడాదిగా.. మెదక్ జిల్లా రామాయంపేటలో డబుల్ బెడ్రూం ఇల్లు కోసం రామలక్ష్మి ఎదురుచూస్తోంది. మూడేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకుంది కూడా. అయితే ఆమెకు ఎక్కడా నిలువ నీడ లేక ఇప్పుడు కొడుకుతో కలిసి ఆర్ అండ్ బీ శాఖ వదిలేసిన అతిథి గృహంలోని మరుగుదొడ్డిలో నివాసం ఉంటోంది. భర్త చనిపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో ఏడాది కాలంగా ఈ మరుగుదొడ్డిలో కాలం వెల్లదీస్తోంది. ఉన్న ఇల్లు ఖాళీ చేసి.. మేం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. మేం ఇతరుల స్థలంలో రేకులతో షెడ్డు వేసుకుని చలికి వణుకుతూ, వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్నాం. ఉన్న ఇళ్లు పోయి, డబుల్ బెడ్రూం రాక అవస్థలు పడుతున్నాం. –లాల్కోట రాజు, చౌదరిపల్లి, మహబూబ్నగర్ ప్రతి చోటా రాజకీయ స్వార్థం వద్దు ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా అర్హులకు చేరేలా పకడ్బందీ మెకానిజం ఏర్పాటు చేయాలి. కానీ రాష్ట్రంలో అలా కనిపించడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలోనూ నిజమైన నిరుపేదలను గుర్తించే బాధ్యతను అధికారులకు అప్పగించాలి. కానీ రాజకీయ సిఫారసు ఉంటేనే డబుల్ బెడ్రూం అయినా, మరోటి అయినా వచ్చే పరిస్థితి ఉంది. చాలాచోట్ల ఇళ్లు పూర్తయినా పంపిణీ చేయడం లేదు. ప్రతి పనిలో రాజకీయ స్వార్థం చూసుకోవడం వ్యవస్థకు మంచిదికాదు. –జస్టిస్ కె. చంద్రకుమార్ కొత్త ఇళ్లు.. పాత పడిపోయినా.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 720 ఇళ్ల నిర్మాణం ఎప్పుడో పూర్తయింది. మౌలిక సదుపాయాలకు నిధులు లేక పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. ఈలోగా ఇంటి అద్దాలు, ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. ఆశావహుల సంఖ్య వేలల్లో, ఇళ్లు మాత్రం వందల్లో ఉండటంతో ఆలస్యమవుతోందని చెబుతున్నారు. నిలువ నీడ కోసం.. నిలువెల్లా కనులై.. కామారెడ్డిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఈ నిరుపేద దంపతులు నిలువెల్లా కనులతో ఎదురుచూస్తున్నారు. ఊరూరా తిరుగుతూ చిరు వ్యాపారం చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు అండ్రాసి సాయవ్వ, రంగయ్యలు. ఇప్పుడు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు వీళ్లు వెళ్లని ఆఫీసు, కలవని అధికారి లేడంటే అతిశయోక్తి కాదు. తొలి అడుగు పడిందిలా.. 2015 తొలినాళ్లలో సికింద్రాబాద్ బోయిగూడలో ఐడీహెచ్ కాలనీతోపాటు మరో నాలుగు మురికివాడల్లో ఇరుకుగదులు, కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇళ్లలో ఉంటున్న వారిని ఒప్పించి రూ.37 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టు పద్ధతిన 33 బ్లాకుల్లో ప్రతి ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వంటగది రెండు బెడ్రూంలను కేవలం 11 నెలల్లో నిర్మించి 396 మందికి అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7.90 లక్షలు, డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు ఇతర సదుపాయాల కోసం రూ.1.33 లక్షల చొప్పున ఖర్చు చేసి యాభై ఏళ్ల మురికివాడను క్లాస్ కాలనీగా తీర్చిదిద్దారు. జీహెచ్ఎంసీ చొరవతో చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రాష్ట్రమంతటా డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం 2015 నవంబర్లో ప్రకటించింది. పేదలను వదిలి.. నాయకులకు.. మహబూబ్నగర్లో ఏటా నీటమునిగే బస్తీల్లో శిథిలావస్థకు చేరిన పేదల కోసం దివిటిపల్లిలో 1,024 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. అయితే ఇందులో ఇప్పటికే 100 ఇళ్లను ముఖ్యనాయకుల సిఫారసుల మేరకు కేటాయించారు. మిగిలిన ఇళ్లను వార్డు, ఇతర ముఖ్యుల సూచన మేరకు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కేటాయింపుల కోసం భారీగా డబ్బులు వసూలు చేయడం, కొందరిని అరెస్ట్ చేయడం, మంత్రి పీఏ కుమారుడి ఆత్మహత్య లాంటి ఘటనలతో ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. ఫలితంగా అవన్నీ ఇప్పుడు పిచ్చిమెక్కలతో నిండిపోయాయి. కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో మౌలిక సదుపాయాల పనులు నిలిపేశారు. -
అభివృద్ధి, సంక్షేమాల దిక్సూచి
సమగ్ర కుటుంబ సర్వే తేల్చిన వాస్తవాలు దేశ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ సమాజపు సంక్లిష్టతకు, మౌలిక సమస్యలకు అద్దం పట్టింది. అది ఇచ్చిన వాస్తవిక అంచనాలు నూతన రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశన చేయడమే కాదు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకమైన సూక్ష్మస్థాయి ప్రణాళికా రచనకు దోహదపడేవిగా ఉన్నాయి. నూతన రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా భూమి, నీరు, నీడ, ఉపాధుల కోసం తపిస్తున్నారని సర్వే నిగ్గు తేల్చింది. ఆ లక్ష్యాల సాధనకు అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సమగ్ర కుటుంబ సర్వే... తెలంగాణ సామాజిక స్వభావాన్ని ఒక్క రోజులో అద్దం పట్టి చూపేందుకు చేసిన బృహత్ యత్నం. ఒక్క హైదరాబాద్ మినహా కాస్త అటూ ఇటుగా తెలంగాణ జన జీవితాన్ని సర్వే ఫలితాలు ప్రతి బింభించాయి. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిం చిన తెలంగాణ రాష్ట్రం ‘స్వయం నిర్ణయం - అర్హులకే సంక్షే మం’ లక్ష్యంతో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ధనిక, పేద తేడాలు లేకుండా వీధి, పల్లె, పట్నం, నగరం ప్రతిచోటా సాగింది. గత అంచనాలకు కాలదోషం పట్టిం చిన ఈ సర్వే వాస్తవికతకు అతి దగ్గరగా ఉన్న తాజా అంచనాలను ప్రభుత్వం చేతుల్లో ఉంచింది. తెలంగాణ జనాభాలో బీసీ కులాలు 51.08%, బీసీ కులాలు 112%, ఉన్నత కులాలు 21.50%, దళితులు 17.50%, గిరిజను లు 9.91%, మైనారిటీలు 14.46%గా ఈ సర్వే తేల్చింది. అంతేకాదు దళితుల్లోని 56 ఉప కులాలు, గిరిజనుల్లోని 16 తెగలు, మైనారిటీల స్థితిగతులను సైతం వివరంగా వెల్లడించింది. ఈ వివరాలన్నీ అప్పుడే సర్కారు లెక్క ల్లోకి చేరిపోయాయి. కొత్త రాష్ట్రం సరికొత్త లక్ష్యంతో ముందుకు సాగడానికి సమగ్ర కుటుంబ సర్వే తాజా అంచనాలు సోపానాలు కాగలుగుతాయనడంలో సందే హం లేదు. కాకపోతే సర్వే తిరుగులేని విధంగా తేల్చి చెప్పినట్టుగా ప్రజలకు ప్రధానంగా కావాల్సింది భూమి, నీళ్లు, నీడ, ఉపాధులేనని గుర్తించి వాటిని కేంద్రంగా చేసుకుని పక్కాగా పథక రచన చేసి, తగు కేటాయిం పులు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. అదే జరిగితే బంగారు తెలంగాణ స్వప్నం సాకారం సు సాధ్యమే అవుతుంది. సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యమూ నెరవేరుతుంది. వెనుకబడిన తరగతులు సగానికి పైగానే రాష్ట్ర జనాభా 3.63 కోట్లుగానూ, అందులో సగానికిపైగా వెనుకబడిన తరగతుల వారేనని (బీసీలు) సర్వే తేల్చిం ది. మొత్తం బీసీల జనాభా 1,85,61,856 లక్షలు (51.08%). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 136 బీసీ కులాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో అవి 112 కులాల కు తగ్గాయి. ఇంత పక్కాగా బీసీల జనాభా తేల్చటం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. 2011 జనాభా లెక్కల్లో తెలంగాణలోని ఎస్సీల జనాభా 15.44%గా నమోదు కాగా, తాజా సర్వేలో అది 17.50% శాతమని తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలలో 62 ఉప కులాలుండగా, తెలంగాణలో అవి 56 ఉప కులాలకు తగ్గాయి. మొత్తం ఎస్సీల జానాభా 63,60,158 (17.50%). 2011 లెక్కల్లో గిరిజన జనాభా 9.34%గా ఉండగా, ఈ సర్వేలో అది 9.91%గా నమోదయింది. ఉమ్మడి రాష్ట్రంలో 36 గిరిజన తెగలుండగా, కొత్త రాష్ట్రంలో 16 గిరిజన తెగలు మాత్రమే ఉన్నాయి. తాజా సర్వేలో తెగల వారీ లెక్కలు తేలటంతో వారి అభివృద్ధికి, సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేసి, సూక్ష్మ స్థాయి ప్రణాళికలను అమలుపరచే అవకాశం లభించింది. ‘భూమి’ చుట్టూ తిరిగిన సర్వే ఈ సర్వే ఫలితాలన్నీ ప్రధానంగా భూమి చుట్టే తిరిగాయి. తెలంగాణ పది జిల్లాల్లో గుంటెడు సాగు భూమి కూడా లేని కుటుంబాల సంఖ్య 69.19 లక్షలు (మొత్తం కుటుంబాలు 1,01,93,027). అంటే సాగు భూమి 31 శాతం మందికే పరిమితమైందని తేలింది. వీరిలో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాలు 9.67 లక్షలు. ఒకటి నుంచి రెండెకరాలలోపు 6.83 లక్షలు, 2-3 ఎకరాల మధ్య 5.73 లక్షలు, 3-4 ఎకరా మధ్య 3.62 లక్షలు, 4-5 ఎకరాల మధ్య ఉన్న కుటుంబాలు 3 లక్షలున్నాయి. 6.84 లక్షల కుటుంబా లకు ఐదెకరాలకుపైగా భూములున్నాయి. బోర్లు, బావులే సేద్యానికి ప్రాణాధారం తెలంగాణలో బోర్లు, చెరువులు, కుంటలు, కాల్వలు, ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తం 69.13 లక్షల ఎక రాల్లో సేద్యం సాగుతుండగా, అందులో 28.49 లక్షల ఎకరాలకు బోర్లు, 15.85 లక్షల ఎకరాలకు బావులే దిక్కు. కృష్ణా, గోదావరి, మూసీ కాల్వలతో సాగవుతు న్నది కేవలం 8.97 లక్షల ఎకరాలే. రాష్ట్రంలో అత్య ధికంగా మహబూబ్నగర్లో 11.08 లక్షల ఎకరాలు సాగవుతుండ గా అందులో 6.24 లక్షల ఎకరాలకు బోరు నీళ్లే ఆధారం. ఇక బావుల నీటితో సేద్యం చేసే జిల్లాల్లో కరీంనగర్ది మొదటి స్థానం (5.36 లక్షల ఎకరాలు). నాగార్జునసాగర్ ఎడమకాలువ సాగునీరు అందే జిల్లాల్లో నల్లగొండ (2.27 లక్షల ఎకరాలు) తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. బోరు బావుల సేద్యంలో (4.14 లక్షల ఎకరాలు) ఈ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రైతాంగ జీవనం వర్షాధారమేనని స్పష్టమైంది. కాబట్టి భారీ నీటి ప్రాజెక్ట్ల నిర్మాణం, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్ర మాలతో పాటు బోర్లు, బావులకు సరిపడా విద్యుత్తును అందించడం తెలంగాణ ప్రభుత్వం ముందు అతి పెద్ద సవాలుగా నిలుస్తోంది. అందరికీ గూడు అందరాని కలగానే... రాష్ట్రంలో 1,01,93,027 కుటుంబాలుండగా వారిలో 24,90,594 మందికే పక్కా ఇళ్లు ఉన్నట్లు (24%) సర్వేలో తేలింది. మిగతా వారిలో 24,58,341 కుటుంబాలు (24%) అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. మొత్తం కుటుంబాల్లో 44%, అంటే 45,02,101 కుటుంబాలు ఒకే గది ఇంట్లో నివసిసున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల న్నిట్లో మొత్తం 3,24,312 కుటుంబాలవి ప్లాస్టిక్ పైక ప్పున్న తాత్కాలిక నివాసాలే. పెంకు లేదా రాతి పైకప్పు ఉన్న ఇళ్లలో 7,41,492 కుటుంబాలు నివసిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14,49,462 కుటుంబాలు కరెంటు సదు పాయానికి నోచుకోక, కిరోసిన్ దీపాల మసక వెలుతు రులోనే వెళ్లదీస్తున్నాయి. కరెంట్ సదుపాయం లేని కుటుంబాలు అధికంగా నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 41% కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం లేదు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో 42,10,019 కుటుంబాలకు ఆ సదుపాయం లేకపోవడం గమనార్హం. మరుగుదొడ్ల సదుపాయం లేని జిల్లాల్లో వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలు ముందు నిలిచాయి. మెట్రోపాలిటన్ నగరంగా చెప్పు కుంటున్న హైదరాబాద్లో కూడా ఇప్పటికీ 45,901 కుటుంబాలకు మరుగుదొడ్డి సదుపాయం లేకపోవడం మింగుపడని చేదు వాస్తవం. చెలిమె నీళ్లతో గొంతు తడపాల్సిందే అందరికీ తాగునీరు అత్యధికులకు అందని ఎండమా విగానే నేటికీ మిగిలిందన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని సర్వే బయటపెట్టింది. రాష్ట్రంలోని 69% ప్రజలు మంచి నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో 1.83 లక్షల కుటుంబాల దాహార్తిని తీర్చేవి చెలిమ నీళ్లేననేది నమ్మలేని నిజం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే నల్లా నీళ్లు ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో 4.14 లక్షల కుటుంబాలు తాగునీటికి బావులపైన, 9.40 లక్షల కుటుంబాలు చేతిపంపులపైన ఆధారపడుతున్నాయి. 3.43 లక్షల కుటుంబాలు బోర్లు, మరో 8.16 లక్షల కుటుంబాలకు బావులే దాహం తీరుస్తున్నాయి. 4.48 లక్షల కుటుంబాలు మంచి నీటి క్యాన్లను కొనుక్కొని గడుపుకుంటున్నాయి. కుటుంబ పెద్దగా ‘ఆమె’ కుటుంబంలో మహిళల ప్రాధాన్యం క్రమంగా పెరుగు తున్న పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. 18,48,208 లక్షల కుటుంబాలకు మహిళలే కుటుంబ పెద్దలుగా వ్యవ హరిస్తున్నట్లు తాజా సర్వే నిగ్గు తేల్చింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో మహిళలు 2.47 లక్షల కుటుంబాల ను ముందుండి నడిపిస్తుండటం విశేషం. ఉమ్మడి కుటుంబాల విషయానికి వస్తే ఆరుగురు సభ్యులున్న కుటుంబాలు మొత్తం 5.14 లక్షలు. మహబూబ్నగర్ 94,164 కుటుంబాలతో ఆ విషయంలో ముందున్నది. అలాంటి కుటుంబాలు ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా, కేవలం 18,131 ఉన్నాయి. ఆరుగురికి మించి ఉన్న కుటుంబాలు రాష్ట్రంలో 3.56 లక్షలు. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 1.16 లక్షలు, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 8,057 ఉన్నాయి. కారు యోగం నూటికి ముగ్గురికే పది జిల్లాల్లో ప్రతి 100 మందిలో కారున్నవారు కేవలం ముగ్గురే. 22 మందికి ద్విచక్ర వాహనాలు, ఒక్క శాతానికి మాత్రం ట్రాక్టర్లు ఉన్నాయి. అత్యధిక వాహనాలను బ్యాంకు రుణాలతో తీసుకోవటం వల్ల అవి సొంత వాహనాలుగా నమోదు కాలేదన్న వాస్తవం సర్వేను బట్టి అర్థం అవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 44 లక్షల వాహనాలు ఆర్టీఏలో నమోదు కాగా, సమగ్ర సర్వేలో వాహన యజమానుల సంఖ్య కేవలం 10,21,899గా తేలడం విశేషం. మరీ చిత్రంగా ఆ రెండు జిల్లాల్లో నమోదైన కార్లు రెండు లక్షలు కూడా లేవు. మొత్తంగా రంగారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలు వాహనాల యాజమ్యానంలో అగ్ర స్థానంలో ఉన్నాయి. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ సంబంధ యంత్రాలు ఉన్న జిల్లాల్లో నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలు ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడైంది. పట్టణాల్లోనే ఉపాధి అవకాశాలు తెలంగాణ జిల్లాల్లో పట్టణాలు, నగరాలే ఉపాధి కేంద్రాలుగా మారాయి. పరిశ్రమలు, సేవా సంస్థల కేంద్రీకరణతో ప్రైవేటు ఉపాధి అవకాశాలన్నీ దాదాపు అక్కడే కేంద్రీకృతమైన పరిస్థితి నెలకొంది. ప్రైవేటురంగ ఉపాధి కల్పనలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తంగా 15,55,009 మంది ప్రైవేటు ఉద్యోగులుగా నమోదు కాగా, అందులో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 4,99,948 మంది ఉన్నారు. పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లా నిజామాబాద్లో ప్రైవేటు రంగం కేవలం 72,882 మందికే ఉపాధిని కల్పిస్తోందని తేలింది. పల్లెలు జబ్బులకు నిలయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7.58 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో, 32 వేల మంది క్యాన్సర్ తో, 1.17 లక్షల మంది గుండె జబ్బుతో, 69 వేల మంది పక్షవాతం, 75 వేల మంది ఆస్తమా, 66 వేల మంది ఫ్లోరోసిస్, 37 వేల మంది ఫైలేరియాతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అత్యధిక బాధితులు కరీంనగర్లో ఉండగా, అత్యల్ప బాధితులు హైదరాబాద్లో ఉన్నట్లు తేలింది. తెలంగాణ జనాభాలో 4% క్యాన్సర్తో, 16% హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. క్షయతో 1% శాతం, పక్షవాతంతో 9%, ఎయిడ్స్తో 1%, ఆస్తమాతో 10%, ఫ్లోరోసిస్తో 9%, పైలేరియాతో 5% బాధపడుతున్నట్లు తేలింది. రోగుల నిష్పత్తిలో కరీంనగర్ తొలిస్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే గుండెజబ్బుల తీవ్రత పెరిగింది. కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు గుండెపోటు, క్యాన్సర్ వ్యాధుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మారిన జీవన శైలితో పల్లెల్లోనూ వ్యాధులు విజృం భిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గుండె, నరాలు, క్యాన్సర్ సంబంధమైన వ్యాధులు అధికంగా నమోదయ్యాయి. గుండె సంబంధమైన వ్యాధుల విషయంలో కరీంనగర్ 18,631, వరంగల్ 17,367, నల్లగొండ 17,211, ఖమ్మం 13,601 కేసులతో ముందున్నాయి. ఆహారం, ఆరోగ్యం విషయంలో పట్టణ ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా వ్యాధి నివారణ, నిర్మూలన దిశగా ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్న ట్లు స్పష్టమైంది. అంటువ్యాధుల తీవ్రత కూడా పల్లెల్లోనే ఎక్కువగా ఉంటోంది. కాబట్టి గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలను, పౌష్టిక ఆహారాన్ని అందించడంపై, అవగా హన కల్పించడానికి సత్వర ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన తక్షణ ఆవశ్యకతగా మారింది. సమగ్ర సర్వేకు సమష్టి కృషి తోడైతేనే... ఆరు దశాబ్దాల ఉద్యమ అనంతరం సాకారమైన తెలంగా ణలోని అన్ని వర్గాలు సంతులిత అభివృద్ధితో, సామ రస్యంతో జీవనం సాగించాలంటే.. సర్వే నివేదిక ఆధా రంగా సర్కారు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. భూమి, నీరు, నివాసం, ఉపాధి, విద్య, వైద్యం తదితర ముఖ్య రంగాల్లో ఆశించిన ప్రగతి లేదని సమగ్ర కుటుంబ సర్వేలో నిగ్గు తేలింది. దృఢ సంకల్పంతో సర్వేను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ తొలి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల, వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయడమే బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావడానికి ఏకైక మార్గం. - శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, చీఫ్ రిపోర్టర్, ‘సాక్షి’, హైదరాబాద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement