-
Sagubadi: మండుటెండల్లోనూ కన్నుల పండుగగా.. సౌరాష్ట్ర ‘ఫుడ్ ఫారెస్ట్లు’
నరోత్తం భాయ్ జాదవ్.. చిన్న రైతు. కరన్షి అభయ్సింగ్ పర్మర్.. పెద్ద రైతు. వీరిది గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరానికి 150 కి.మీ. దూరంలోని బొటాడ్ జిల్లా. వీరు 9 నెలల క్రితం చెరొక ఎకరంలో 5 దొంతర్ల పంటల అడవి సాగునుప్రాంరంభించారు. సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో ఎకరానికి 2 టన్నుల ఘనజీవామృతం వేస్తూ, 10–15 రోజులకోసారి ద్రవజీవామృతం డ్రిప్, పిచికారీ చేస్తూ తొలి ఏడాదే గణనీయంగా ఆదాయం పొందుతున్నారు. ఎత్తుమడులపై కొలువుదీరిన ఈ వత్తయిన ఉద్యాన తోటలు చూపరులకు కన్నుల పండుగ చేస్తున్నాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ఈ 5 లేయర్ మోడల్ క్షేత్రాలను మార్చి 31న సుమారు 500 మంది రైతులకు స్వయంగా చూపించి ఆశ్చర్యచకితులను చేశారు. ఈ క్షేత్రాలను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు గ్రౌండ్ రిపోర్ట్. బొటాడ్ జిల్లాలో వార్షిక సగటు వర్షపాతం 500–600 ఎం.ఎం. మాత్రమే. ఎక్కువ మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. పత్తి, గోధుమ, సోంపు తదితర పంటలను ఏక పంటలుగా అక్కడి రైతులు రసాయనిక పద్ధతిలో పండిస్తారు. అయితే, పాలేకర్ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, ఇతరత్రా పంటలతో కూడిన 5 దొంతర్ల సాగు అల్ప వర్షపాత ప్రాంంతాల్లో సైతం రైతులకు ఏడాది పొడవునా పౌష్టికాహార భద్రతను, ఆదాయ భద్రతను అందిస్తాయని ఈ ఇద్దరు రైతులు రుజువు చేస్తున్నారు. ఈ సుసంపన్న క్షేత్రాలను స్వయంగా రైతులకు చూపించిన సుభాష్ పాలేకర్.. అందుకు దోహదం చేసిన ప్రకృతి సేద్య సూక్ష్మాలను రైతులకు విశదీకరించారు. 3 రోజుల శిక్షణా శిబిరంలో ప్రతి చిన్న విషయాన్నీ విడమర్చి చెప్పి, నోట్సు రాయించారు. శ్రద్ధగా రాసుకున్న ప్రతినిధుల్లో సాధారణ రైతులతో పాటు ఇద్దరు డాక్టర్లూ ఉండటం విశేషం. 5 అడుగుల బెడ్లపై 70 పంటలు! నరోత్తమ్ భాయ్ జాదవ్ (96872 57381– హిందీ/గుజరాతీ) స్వగ్రామం గుజరాత్ బొటాడ్ జిల్లా రాంపూర్ తాలూకాలోని నగనేశ్. ఆయనకు 5 ఎకరాల నల్లరేగడి మెట్ట భూమి ఉంది. 2017 నుంచి పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 9 నెలల క్రితం ఒక ఎకరంలో.. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు, పక్కన 3 అడుగుల వెడల్పున కాలువలు ఏర్పాటు చేశారు. బొ΄్పాయి, చెరకు, అరటి, మునగ, చిక్కుడు, కంది, జామ, సొర, కాకర, టొమాటో, మిరప, పసుపు, గాజర్, ఉల్లి, శనగ, తులసి, సోంపు, బీట్రూట్, ముల్లంగి, ఆకుకూరలతో పాటు కొబ్బరి, బాదం, అంజీర, జీడిమామిడి, సీతాఫలం, రామాఫలం, బత్తాయి, దానిమ్మ, అవకాడో తదితర పండ్ల మొక్కల్ని కూడా నాటారు. నరోత్తమ్ ఫుడ్ ఫారెస్ట్లో రైతులతో సుభాష్ పాలేకర్ బెడ్లపై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప, కాకార వంటి పంటలను పాకించారు. పంట వ్యర్థాలతో బెడ్లపై మొక్కల మధ్య ఆచ్ఛాదన చేశారు. బెడ్లపైన పంటలకు నాలుగు డ్రిప్ లైన్ల ద్వారా బోరు నీటిని అందిస్తున్నారు. పంటలన్నీటినీ ఒకేసారి కాకుండా 3 నెలల్లో దశల వారీగా నాటామని రైతు నరోత్తమ్ వివరించారు. ‘నా భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా రోజువారీ తోట పనుల్లో భాగస్వాములవుతారు. ఒక కూలీ కూడా పనిచేస్తుంటారు. హైవే పక్కనే ఉండటం వల్ల పంట ఉత్పత్తులను తోట దగ్గర కొన్ని అమ్ముతాం. మిగతా వాటిని అహ్మదాబాద్లో గురు, ఆదివారాల్లో అమ్ముతున్నాం. కిలో రూ. 80 నుంచి 140 ధరకు నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నాం..’ అన్నారాయన. 5 లేయర్ మోడల్ పంటల సాగుకు ఎకరానికి అన్నీ కలిపి రూ. 3,50,000 పెట్టుబడి పెట్టగా.. ఇప్పటి వరకు 9 నెలల్లో రూ. 2,87,000 ఆదాయం వచ్చిందని, మరో మూడు నెలల్లో పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ఆదాయం వస్తుందని నరోత్తమ్ ధీమాగా చె΄్పారు. పండ్ల చెట్లు పెరిగిన తర్వాత ఏడాదికి ఆదాయం రూ. 6 లక్షలకు పెరుగుతుందన్నారు. సుమారు 70 రకాల ఉద్యాన పంటలను 5 దొంతర్లలో సాగు చేస్తుండటం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. కనువిందు చేసిన పంటల అడవి కరన్షి అభయ్సింగ్ పర్మర్ (99793 59711 హిందీ/గుజరాతీ) స్వగ్రామం బొటాడ్ జిల్లా రాంపూర్ తహశిల్ వెజల్క. 40 ఎకరాల ఆసామి. మెట్ట వ్యవసాయం. 2019 నుంచి పాలేకర్ పద్ధతిలోనే సేద్యం అంతా. 5 ఆవులు ఉన్నాయి. 6 వేల లీటర్ల జీవామృతం ట్యాంకు కట్టి, నేరుగా డ్రిప్ డ్వారా జీవామృతం పది రోజులకోసారి పంటలకు ఇస్తున్నారు. పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. 20 ఎకరాల్లో బీటీ పత్తి వేస్తారు. 5 ఎకరాల్లో పచ్చిగడ్డి, గోధుమ, మిగతా పొలంలో మొక్కజొన్న, శనగ,పెసర, జిలకర, సోంపు వంటి పంటలు వేస్తారు. గుజరాత్లోని వెజల్క గ్రామంలో కరన్షి సృష్టించిన దట్టమైన పంటల అడవి ఒక ఎకరంలో 9 నెలల క్రితం పాలేకర్ పద్ధతిలో 5 దొంతర్ల నమూనాలో అనేక పంటలను 5 అడుగుల వెడల్పు బెడ్స్పై డ్రిప్తో సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు ఏర్పాటు చేసి 20 పంటలను సాగు చేస్తున్నారు. బెడ్స్పై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప తీగలను పాకించారు. కరన్షికి చెందిన నల్లరేగడి భూమిలో ఏర్పాటైన 5 లేయర్ తోటలో ఎత్తుగా, ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఎదిగిన మధుబిందు అనే దేశీ రకం బొప్పాయి చెట్లు, అరటి గెలలు, ఎత్తుగా ఎదిగిన దేశీ టొమాటో పొదలు, వంగ చెట్లు కన్నుల పండుగ చేస్తున్నాయి. ఆ చెట్లకు ఉన్న కాతను చూసి రైతులు అవాక్కయ్యారు. మార్చి ఆఖరు నాటికి చుట్టూతా ఒకటి అరా పొలాల్లో సోంపు, గోధుమ పంటలు మాత్రమే కోతకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అనేక పంటలతో పచ్చగా ఉంది కరన్షి తోట మాత్రమే. సుభాష్ పాలేకర్ ఈ ఫుడ్ ఫారెస్ట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే అద్భుతం అని అభివర్ణించారు. రైతు కరన్షి మాట్లాడుతూ, తాను 9 నెలల క్రితం మొదట చెరకు నాటానన్నారు. తర్వాత నాలుగు అడుగులకు ఒకచోట అరటి, బొ΄్పాయి, మునగ, మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి, అవిశ,పోక, తమలపాకు, ఆపిల్, ఉల్లి, గాజర్ తదితర మొక్కలు పెట్టుకుంటూ వచ్చానన్నారు. అంచుల్లో దుంప పంటలు పెట్టానన్నారు. ఏ పంటైనా మార్కెట్ ధర కన్నా రూ. 20 ఎక్కువ ధరకు అమ్ముతున్నామన్నారు. ఈ 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్ను ఎకరంలో నిర్మించడానికి ఇప్పటి వరకు రూ. 1,40,000 ఖర్చు చేశానని, 9 నెలల్లో రూ. 1,38,000 ఆదాయం వచ్చిందన్నారు. మరో 2 నెలల్లో మరో రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందన్నారు. ఈ ఫుడ్ ఫారెస్ట్లో టొమాటో, వంగ మొక్కలు మనిషి ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నప్పటికీ వాటికి వైరస్ ఆశించటాన్ని గమనించిన రైతులు పాలేకర్ను వివరణ అడిగారు. నల్లరేగడి భూమిలో నీటిని ఎక్కువగా ఇవ్వటమే ఇందుకు కారణమని పాలేకర్ అన్నారు. డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలన్నారు. పంటల అడవులు.. పలు ప్రత్యేకతలు.. నేల: నల్లరేగడి (ఏ నేలలోనైనా చేయొచ్చు) విస్తీర్ణం: 1 ఎకరం. ఎరువు: సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో సాగు. చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల ఘన జీవామృతం (పాలేకర్ ఎకరానికి 400 కిలోలు చాలంటున్నా రైతులు 2 టన్నులు వేశారు). బెడ్లు: 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు (బెడ్ల మధ్య 3 అడుగుల దూరం). గడ్డీగాదంతో ఆచ్ఛాదన ముఖ్యం. ఎత్తు మడులపై ఏ పంటైనా పండించొచ్చు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా తట్టుకుంటాయి. పంటల వైవిధ్యం: ఖాళీ లేకుండా 20–70 వరకు వత్తుగా 4 వరుసలుగా రకరకాల ఎత్తు పెరిగే సీజనల్, దీర్ఘకాలిక పంటలు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, దుంపలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్య పంటలు, పప్పుధాన్యాలు, చెరకు.. బెడ్లపైనే ‘వై’ ఆకారపు ఇనుప ఫ్రేమ్లకు ప్లాస్టిక్ తాళ్లు కట్టి అనేక రకాల తీగజాతి కూరగాయల సాగు. దేశీ వంగడాలు: పంట ఏదైనా దేశీ విత్తనమే. ప్రతి రైతూ విత్తన రేతే. డ్రిప్: బెడ్లపై 4 లైన్ల డ్రిప్ (మన నేలలకు డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలు: పాలేకర్). 10 రోజులకోసారి నీటితోపాటు ద్రవ జీవామృతం. పిచికారీ: 15 రోజులకోసారి ద్రవజీవామృతం. అవసరాన్ని బట్టి కషాయాలు. దిగుబడి: నిరంతరం. పూర్తయ్యే పంట పూర్తవుతుంటే విత్తే పంట విత్తుకోవాలి. అనుదినం పనితో పాటు ఏడాది పొడవునా పౌష్టికాహార, ఆదాయ భద్రత. మార్కెటింగ్: రైతే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకే అమ్మకం. ఆదాయం: తొలి ఏడాదే రూ. 2 లక్షల ఆదాయం. ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల ఆదాయం. రైతు కరన్షి పర్మర్ ప్రతి రైతుకూ ఫుడ్ ఫారెస్ట్! 5 దొంతర్ల ఫుడ్ ఫారెస్ట్ నమూనా ఒక అద్భుతం. ఆహార సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అందించే ఫుడ్ ఫారెస్ట్ రైతు కుటుంబానికి ఎంతో అవసరం. కనీసం ఒక ఎకరంలో ఏర్పాటు చేసుకోవాలి. అనేక పంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ తినటం, మిగతా పంటలను నేరుగా వినియోగదారులకే తాము నిర్ణయించిన ధరకు అమ్ముకోవటం ద్వారా ఏడాది పొడవునా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, మసాలా దినుసులు, చివరకు చిరుధాన్యాలను కూడా పండించుకోవటానికి ఈ నమూనాలో అవకాశం ఉంది. చెరకు సాగు చేసుకొని ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు. నీరు నిలవని,సున్నపు రాళ్లు లేని భూముల్లో (రాళ్ల భూమైనా ఫర్వాలేదు) ఫుడ్ ఫారెస్ట్ను 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు చేసి, వాటి మధ్యన 3 అడుగుల కాలువలు తవ్వుకోవాలి. బెడ్స్ తయారు చేసుకోవడానికి ముందే వర్షం పడినప్పుడు లేదా తడులు పెట్టి అయినా రెండు సార్లు కలుపు మొలిపించి, నిర్మూలిస్తే ఆ తర్వాత ఇక కలుపు సమస్య ఉండదు. దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం సరిపోతుంది. అయితే, గుజరాత్ రైతులు అందుబాటులో ఉంది కాబట్టి 2 వేల కిలోలు వేశారు. దేశీ విత్తనాలు, రకాలే వాడాలి. నర్సరీ మొక్కలు వద్దు. సొంతంగానే మొక్కలను తయారు చేసుకొని నాటుకోవాలి. స్వావలంబన ద్వారా రైతులు అన్ని విధాలుగా సుస్థిరత సాధించాలి. 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్ల ద్వారా ఎకరానికి తొలి ఏడాదే రూ. 2 లక్షల (ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల) ఆదాయం పొందుతున్న ఈ రైతుల నుంచి దేశంలో రైతులందరూ స్ఫూర్తి పొందాలి. – పద్మశ్రీ గ్రహీత డా. సుభాష్ పాలేకర్ (98503 52745) -
‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%!
'వాతావరణంలోకి విడుదలయ్యే మొత్తం ఉద్గారాల్లో వ్యవసాయం, ఆహార సంబంధిత ఉద్గారాల వాటా 31% అని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రకటించగా.. ఇవి 60% మేరకు ఉంటాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా‘‘ సుభాష్ పాలేకర్ అంచనా వేస్తున్నారు. పశువుల ఎరువు/ వర్మీ కంపోస్టు/ కంపోస్టు వంటివి ఏటా ఎకరానికి 10 టన్నుల మేరకు వేస్తుండటం కూడా భూతాపం విపరీతంగా పెరగడానికి ఓ ముఖ్య కారణంగా అందరూ గుర్తించాలని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, ఆహార రంగాల ఉద్గారాలు తగ్గాలంటే.. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకం కూడా మాని, రైతులందరూ సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని అనుసరించాలన్నారాయన. భవిష్యత్తులో పెను తుపాన్లు, కరువులను తట్టుకోవాలన్నా.. పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలన్నా ఇదొక్కటే మార్గమన్నారు. దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు తాను చెప్పిన పద్ధతిలో సాగు చేస్తున్నారని, సుసంపన్న దిగుబడులిస్తున్న వారి క్షేత్రాలే ఇందుకు నిదర్శనాలన్నారు. రోగ కారకం కాని ఆహారం విలువను వినియోగదారులు గుర్తించి ఉద్యమ స్ఫూర్తితో రైతులను ప్రోత్సహిస్తేనే పర్యావరణహితమైన వ్యవసాయం విస్తరిస్తుందని పాలేకర్ స్పష్టం చేస్తున్నారు. భారతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (ఐసిఎఆర్–మేనేజ్)లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న డా‘‘ పాలేకర్తో ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..' • పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులపై మీరు చాలా ఏళ్లుగా స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? డా. పాలేకర్: శిక్షణా శిబిరాల ద్వారా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా లక్షలాది మంది సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని సోషల్ మీడియా (వెబ్సైట్, యూట్యూబ్, వాట్సప్) ద్వారా నేర్చుకుంటున్నారు. నీతి ఆయోగ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో విస్తారంగా రసాయనిక ఎరువులతో పాటు ఎకరానికి ఏటేటా పది టన్నుల చొప్పున పశువుల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు కూడా వాడకుండా.. నేను చెప్పినట్లు అనేక నమూనాల ప్రకారం పంటలు పండిస్తున్నారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసిన వారు తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి తగ్గకుండా దిగుబడులు పొందుతున్నారు. రసాయనాలు వాడకుండా.. నేలలో పోషకాలను రూపుమార్చి మొక్కల వేర్లకు అందించేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి బెస్ట్ మైక్రోబియల్ కల్చర్ను వినియోగిస్తే చాలు. • దేశంలో ఎంత మంది రైతులు మీ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు? డా. పాలేకర్: సుమారు 70 లక్షల మంది రైతులు అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకుంటూ, వాట్సప్ ద్వారా సందేహాలు తీర్చుకుంటున్నారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చాలా మంది ఫాలో అవుతున్నారు. నీతి ఆయోగ్ నా టెక్నాలజీతో కన్విన్స్ అయ్యింది. హైదరాబాద్లోని ‘మేనేజ్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధిస్తున్న రైతుల క్షేత్రాలను నేనే స్వయంగా రైతులకు చూపిస్తున్నాను. మొన్న వికారాబాద్ జిల్లాలో విజయరామ్ సాగు చేస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ క్షేత్రాన్ని వందలాది మందికి చూపించాను. ఈ నెల 24,25 తేదీల్లో అహ్మదాబాద్ దగ్గర క్షేత్ర సందర్శన ఉంది. నేను రూపాయి పారితోషికం ఆశించకుండా ఉచితంగానే కర్బన ఉద్గారాలు లేని వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నాను. • పర్యావరణ సంక్షోభంపై దుబాయ్లో ఇటీవల ముగిసిన శిఖరాగ్రసభ ‘కాప్28’లో వ్యవసాయ ఆహార వ్యవస్థల ఉద్గారాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది కదా..! డా. పాలేకర్: అవును. చైనా, అమెరికా తర్వాత మన దేశమే ఎక్కువ ఉద్గారాలను వెలువరిస్తున్నది. కానీ, భారత ప్రభుత్వం సంతకం చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. • మన దేశపు తలసరి ఉద్గారాలు తక్కువ. గతం నుంచీ ఎక్కువగా కాలుష్యానికి కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు విపత్తులకు నష్టపోతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం ఇవ్వాలని, ఆధునిక టెక్నాలజీ ఇవ్వాలని మన దేశం అడుగుతోంది కదా..! డా. పాలేకర్: సంపన్న దేశాలు ఏమీ విదల్చటం లేదు కదా. పైగా, కుట్రపూరితంగా కాలుష్య కారక ఫ్యాక్టరీలు మనలాంటి దేశాల్లో పెట్టిస్తూ, వస్తువుల్ని ఆ దేశాలు కొనుక్కుంటున్నాయి. దీర్ఘకాలిక పంటైన బాస్మతి బియ్యం కిలో పండించడానికి 5,600 లీటర్ల నీరు ఖర్చవుతోంది. స్వల్పకాలిక వరి రకాలతో కిలో బియ్యం పండించడానికి 2,500 లీటర్ల నీరు ఖర్చవుతోంది. పైగా వరి పొలాల్లో నీటిని నిల్వగట్టటం వల్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు, శిలీంద్రనాశన రసాయనాల వల్ల పెద్ద ఎత్తున మిథేన్ వంటి అత్యంత ప్రమాదకర ఉద్గారాలు వెలువడుతున్నాయి. సంపన్న దేశాలు డబ్బులు ఇచ్చే వరకు మనం ఈ ఉద్గారాలు వెలువరించటం మానుకోకూడదా? రసాయనిక వ్యవసాయం ఒక్కటే కాదు.. సేంద్రియ ఎరువుల వల్ల కూడా పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతూ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. గాలిలో ఉద్గారాలు 280 నుంచి 480 పీపీఎంకి పెరిగాయి. ఫలితం ఇప్పటికే చూశారుగా ప్రకృతి విపత్తులు ఎలా పెరిగిపోయాయో. గత ఏడాది గోధుమల దిగుబడి 30% తగ్గిపోయింది. గడచిన ఏడాది అంతా యూరప్లో, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మనం వ్యవసాయ ఉద్గారాలు తగ్గించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే.. మున్ముందు చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. వాటి కోసం ఎదురుచూద్దామా? ఎఫ్.ఎ.ఓ. చెప్తున్నట్లు అన్ని రకాల ఉద్గారాలలో వ్యవసాయ ఆహార వ్యవస్థ వెలువరిస్తున్న ఉద్గారాలు 31% కాదు, 60%కి పైగా ఉంటాయి. నేనంటాను.. విపత్తుల నుంచి రక్షించుకోవాలంటే వెంటనే మనం ఉద్గారాలు తగ్గించేందుకు పనిని ప్రారంభించాలి. దేశంలో రసాయనిక వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని కూడా వెంటనే నిషేధించాలి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు, రైతులు, ముఖ్యంగా రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తిని డయాబెటిస్, కేన్సర్, కరోనా వంటి జబ్బుల పాలవుతున్న వినియోగదారులైన ప్రజలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. • రసాయనిక ఎరువుల తయారీలో శిలాజ ఇంధనాలు వాడుతారు కాబట్టి ప్రమాదమే. సేంద్రియ ఎరువులతో ప్రమాదం ఎలా? డా. పాలేకర్: ఎకరానికి ప్రతి ఏటా 20 బండ్ల లేదా 10 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టు వేస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం కన్నా కూడా ఇది అనేక రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడినది. అందుకే రైతులు పట్టించుకోవటం లేదు. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, కంపోస్టు, నూనెగింజల తెలగ పిండిని పొలాల్లో వెదజల్లబడుతుంది. అందులో నుంచి కర్బనం విడుదలై ఆక్సీకరణం చెంది కార్బన్ డయాక్సయిడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ వంటి హరిత గృహ విష వాయువులు వెలువడి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.03% మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ సేంద్రియ ఎరువులు వాడినా నేలల్లో హ్యూమస్ (జీవన ద్రవ్యం) ఏర్పడటం లేదు. ఈ విధంగా రసాయనిక ఎరువుల వల్లనే కాకుండా టన్నుల కొద్దీ వేసే పశువుల ఎరువు వల్ల కూడా పెద్ద మొత్తంలో ఉద్గారాలు వెలువడుతున్నాయి. అందువల్లనే, వ్యవసాయ ఆహార ఉద్గారాలు ఇతరత్రా మొత్తం ఉద్గారాల్లో 60%కి పైగా ఉంటాయని నా అంచనా. • మీరు కూడా ఆవు పేడతో తయారు చేసిన ఘనజీవామృతం, జీవామృతం వాడమంటున్నారు కదా..? డా. పాలేకర్: ఈ రెండూ సేంద్రియ ఎరువులు కాదు. నేలలో రసాయనాల వల్ల అంతరించిపోయిన సూక్ష్మజీవరాశిని పెంపొందించే మైక్రోబియల్ కల్చర్లు మాత్రమే. ఎకరానికి ఏటా మహా అయితే 400 కిలోల ఘన జీవామృతం చాలు. ‘సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి’ ద్వారా ఒక్క గ్రాము కర్బన ఉద్గారాలు వెలువడవు. నేను చెప్పినట్లు చేస్తే మారిన మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు. పది శాతం నీటితోనే ఆరుతడి పద్ధతిలో మిథేన్ వెలువడకుండా వెద వరి సాగు చేయొచ్చు. • పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే మాటకు బదులు ‘సుభాష్ పాలేకర్ కృషి’ అని అంటున్నారెందుకని? డా. పాలేకర్: పెట్టుబడి లేకుండా పనులు జరగవు. మనం పొలంలో పనిగట్టుకొని చేసే వ్యవసాయ పనులేవీ ప్రకృతిలో ఉండవు. అలాంటప్పుడు ప్రకృతి వ్యవసాయం అనటం సరికాదు అనిపించి పేరు మార్చాను. ‘సుభాష్ పాలేకర్ కృషి’ పద్ధతి అని పిలవమని చెబుతున్నాను. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్, మేనేజ్ తదితర సంస్థలన్నిటికీ చెప్పాను. • పర్యావరణ అనుకూల సాగు పద్ధతుల వ్యాప్తి నెమ్మదిగా ఉండటానికి కారణం? డా. పాలేకర్: ప్రభుత్వాలతో పాటు ప్రజలు చైతన్యవంతులై పోషకాల సాంద్రతతో, ఔషధ గుణాలతో కూడిన ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులు పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. డయాబెటిస్, కేన్సర్ వంటి జబ్బుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది అవసరమని వాళ్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. యూరప్, అమెరికాలో ప్రజలు ఈ విషయం గుర్తించి జాగ్రత్తపడుతున్నారు. మన ప్రజలూ గుర్తెరగాలి. • రైతులకు శిక్షణా శిబిరాలేమైనా పెడుతున్నారా? డా. పాలేకర్: రంగారెడ్డి జిల్లాలోని రామచంద్రమిషన్ ఆవరణలో 6 వేల మంది రైతులకు 2024 ఏప్రిల్లో పది రోజుల శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నాం. దీనికి సహకరించమని టీటీడీని కోరుతున్నాం. (డా. సుభాష్ పాలేకర్: వాట్సప్– 98503 52745, palekarsubhash@yahoo.com / spk.org.in) - ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు -
గులాబీ క్షేత్ర దినోత్సవానికి ప్రవేశం ఉచితం!
8, 22 తేదీల్లో ప్రకృతి సేద్యంపై విజయరామ్ శిక్షణ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతిపై సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ (సేవ్) ‘సేవ్’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయదారులు విజయరామ్ ఈ నెల 8న తిరుపతిలో, 22న రాజమహేంద్రవరంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారికి, భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకునే వారికి అవగాహన కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం, అంతర పంటల ద్వారా అధికాదాయం పొందటం, పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవటం, వాన నీటి సంరక్షణ పద్ధతులు, వ్యవసాయంలో దేశవాళీ ఆవు, ఎద్దు ప్రాధాన్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రవేశ రుసుము రూ. వంద. శిక్షణ సమయం ఉ. 9 నుంచి సా. 5 గంటల వరకు. ఆసక్తి గల వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. మార్చి 8 (ఆదివారం)న తిరుపతిలో.. వేదిక: ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియం, తిరుపతి రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 88849 12344, 94495 96039, 86889 98047 మార్చి 22 (ఆదివారం)న రాజమహేంద్రవరంలో.. వేదిక : శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం, జామ్పేట, రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 94495 96039, 86889 98047, 99498 00201. 16న తమిళనాడులో గులాబీ క్షేత్ర దినోత్సవం బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) ఆధ్వర్యంలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దొడ్డమంచి గ్రామంలో గల తెలుగు రైతు మంజునాథ్ (79821 17354) కు చెందిన వన్య ఫార్మ్స్లో మార్చి 16, సోమవారం నాడు సేంద్రియ గులాబీ పూల సాగుపై క్షేత్ర దినోత్సవాన్ని (రోజ్ ఫీల్డ్ డే) నిర్వహించనుంది. సేంద్రియ పద్ధతుల్లో గులాబీలను సాగు చేస్తూ ఆయన మునగను అంతరపంటగా సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా సాగు చేయబోతున్నారు. రైతు క్షేత్రంలో గులాబీల సేంద్రియ సాగును ప్రత్యక్షంగా రైతులకు చూపించడం, సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఐఐహెచ్ఆర్ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి అవకాశం కల్పించడం ఫీల్డ్ డే లక్ష్యం. ఉ. 9 గంటల నుంచి జరిగే ఈ క్షేత్ర దినోత్సవంలో రైతులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. అయితే, 89192 71136 నంబరుకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సుస్థిర లాభసాటి వ్యవసాయంపై 3 నెలల కోర్సు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల–ఆయకట్టు అభివృద్ధి శాఖ, నీరు–భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధనా సంస్థ (వాలంతరి–రాజేంద్రనగర్) ఆధ్వర్యంలో ‘భూమి, నీటి యాజమాన్యంతో సుస్థిరమైన లాభసాటి వ్యవసాయం’పై 3 నెలల రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి ఈ నెల 5వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 నుంచి జూన్ 9 వరకు కోర్సు కాలం ఉంటుంది. ఇంటర్/ఐటిఐ/డిప్లొమా చదివిన 18–30 ఏళ్ల వయసులో గ్రామీణ యువతీ యువకులు అర్హులు. కోర్సు రుసుము రూ. 5 వేలు. ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఆదర్శ రైతుగా ఎదగవచ్చు లేదా వ్యవసాయ కన్సల్టెంట్గా స్థిరపడవచ్చు. దరఖాస్తు ఫాం, ఇతర వివరాలకు సంబంధిత వెబ్సైట్ చూడండి. 8న కొర్నెపాడులో సూపర్ నేపియర్ సాగుపై శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పశుగ్రాసాల సాగు, ప్రత్యేకంగా సూపర్ నేపియర్ గడ్డి సాగు, పశుపోషణపై మార్చి 8(ఆదివారం)న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. సూపర్ నేపియర్ కణుపులను ఉచితంగా పంపిణీ చేస్తారు. గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ డా. సి.హెచ్. వెంకట శేషయ్య, పాడి రైతు విజయ్ (గుంటూరు) రైతులకు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
అన్నదమ్ముల అపూర్వ సేద్యం
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్మాన్పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్మాన్పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్లో హైదరాబాద్లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది. దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు.. ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు. రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు. పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎన్డిఎల్ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్ఎన్ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు. షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు. మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు. ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం.. కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు. గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్మాన్పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు! – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) వెయ్యి లీటర్ల బ్యారెల్స్లో జీవామృతం సరఫరా అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు. దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు. ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. – ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్మాన్పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు -
జీరో బడ్జెట్... ఖర్చు లేని సాగు
జీరో బడ్జెట్ వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పూర్వ పద్ధతుల వైపు మళ్లాల్సి ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో దేశ వ్యవసాయ స్థితిగతులను ప్రస్తావిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార – వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) పెట్టుబడులు, రసాయన ఎరువులు అవసరం లేని సహజ వ్యవసాయం చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా సాగు పద్ధతి అమలు చేస్తున్నారని చెప్పారామె. వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్, రైతు సంఘాలు కలసి కర్ణాటకలో దీన్నో ఉద్యమంలా చేపట్టాయని, తర్వాత కొన్ని రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరించాయని ఆమె తెలిపారు. ఇదివరకే ఈ పద్ధతిని అనుసరించాల్సిందిగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు సూచించటం గమనార్హం. జీరో బడ్జెట్.. అంటే!! సంక్షిప్తంగా చెప్పాలంటే ఖర్చు లేని వ్యవసాయమన్న మాట. విత్తనాలకు, ఎరువులకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లో కొనుగోలు చేసి వాడాల్సినవి ఏమీ వుండవు. మట్టిలోని సూక్ష్మ జీవులు, వానపాములే మొక్కల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. విత్తనాలను కూడా రైతులే తమ పంట నుంచి తయారు చేసుకుంటారు. ఎరువులు చల్లే పని లేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే భూమికి బలాన్నివ్వవచ్చు. అందుకే ఈ సాగు పద్ధతిలో ఖర్చులుండవు. కాబట్టే జీరో బడ్జెట్ ఫార్మింగ్గా పిలుస్తున్నారు. పాలేకర్ చెబుతున్నదేమిటి? దేశీ ఆవు పేడ, మూత్రంతో భూసారం పెంచే ద్రావణాలు (బీజామృతం, జీవామృతం) తయారు చేసుకుని భూమికి తిరిగి జవసత్వాలను అందించడం, రసాయనిక అవశేషాలు లేని ఆహారాన్ని పండించుకోవడం పాలేకర్ పద్ధతిలోని ప్రత్యేకత. పొడి సున్నం, పొడి మట్టి, బెల్లం, బావి / బోరు / నది నీరును కూడా ఈ ద్రావణాల్లో కలుపుతుంటారు. ‘భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. పోషకాలను మొక్కల వేళ్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చేది సూక్ష్మ జీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం ఇచ్చి.. వీలైన పద్ధతిలో మల్చింగ్ చేస్తే చాలు’అంటారు పాలేకర్. పొలంలో పలు రకాల అంతర పంటలు వేయడం ద్వారా పంటల జీవ వైవిధ్యాన్ని పెంపెందుకునే వీలుండటం ఈ పద్ధతిలోని మరో ప్రత్యేకత. పండ్ల తోటల సాళ్ల మధ్య అడుగు లోతు కందకాలు తీయడం ద్వారా వాననీటి సంరక్షణ చేపట్టడం, ఆ విధంగా పంటను కరువు పరిస్థితులను తట్టుకునేలా చేయడం ఇంకో ప్రత్యేకత. రైతాంగ ఆత్మహత్యల నివారిణి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది రైతులు అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుంచి విముక్తమయ్యారని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గతంలో ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నాణ్యమైన, పోషక – ఔషధ విలువలతో కూడిన సహజాహారం పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుందని సూచించారు. కేంద్రం ఇప్పుడు దానికే మొగ్గుచూపుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రసంగం చెబుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement