-
టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు ‘నో’
సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్టీ), ఏపీ టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదంది. ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయంలేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్ పరీక్ష నిర్వహణకు 8న నోటిఫికేషన్లు జారీచేశారని తెలిపారు. టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదన్నారు. టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ను ఖరారు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈనెల 28న తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
టెట్, టీఆర్టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. పరీక్షలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్లను నిలుపుదల చేయడం సరికాదన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందువల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చేయలేమన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్కు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
టీఆర్టీలో స్థానికత చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విషయంలో స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 317 జీవోను అమలు చేసింది. దీని ప్రకారం స్థానికతను నిర్థారించింది. అయితే ఇది ఇప్పటివరకూ ఉద్యోగులకే పరిమితమైంది. తాజాగా టీచర్ల నియామకంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్ళు చదివితే ఆ జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు. గతంలో 4–10 తరగతుల్లో ఎక్కడ నాలుగేళ్ళు చదివి ఉంటే దాన్ని స్థానికతగా చూసేవాళ్ళు. ఈ నిబంధనలో మార్పు వల్ల స్థానికత నిర్ధారణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. అప్పటి స్కూళ్ళు ఇప్పుడు లేవు! సాధారణంగా ప్రాథమిక విద్యను సమీపంలో ఉన్న స్కూల్లో పూర్తి చేస్తారు. 6వ తరగతి నుంచే సరైన రికార్డు ఉంటుంది. కాబట్టి 4 నుంచి 10 తరగతుల వరకు కనీసం నాలుగేళ్ళు ఎక్కడ చదివిందీ ధ్రువీకరించడం కొంత తేలికగా ఉంటుంది. ఇప్పుడు టీఆర్టీ పరీక్ష రాసే అభ్యర్థులు దాదాపు 15 ఏళ్ళ క్రితం ఒకటి నుంచి 5 తరగతి వరకు చదివి ఉంటారు. ఇందులో చాలా స్కూళ్ళకు అనుమతి కూడా లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఆ తర్వాత 6, 7 తరగతులు వేర్వేరు స్కూళ్లలో చదివిన వారున్నారు. ఇందులో కొంతమంది వేరే జిల్లాల్లోనూ చదివి ఉంటారు. దీనివల్ల ‘1 నుంచి 7వ తరగతి వరకు’ అనే నిబంధన కింద నాలుగేళ్ళు వరసగా ఏ జిల్లాలో చదివారనేది నిరూపించుకోవడం కష్టంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. 1–5 వరకు చదివిన ప్రాథమిక ప్రైవేటు స్కూళ్ళు అనేకం ఇప్పటికే మూతపడటం, కొన్నిటికి అనుమతి లేకపోవడంతో డీఈవో కార్యాలయాల్లోనూ వారి డేటా లభించకపోవడంతో స్థానికత నిరూపణ కష్టంగా ఉందని అంటున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల దృష్ట్యా, హాస్టళ్ళ కోసం ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల వేర్వేరు తరగతులు చదివిన వాళ్ళకూ ఈ సమస్య తప్పడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు జిల్లాల విభజన జరిగి కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల కూడా స్థానికత ఏదో చెప్పడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాన్–లోకల్కు అవకాశమే లేదు! రాష్ట్రవ్యాప్తంగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రోస్టర్ విధానం తర్వాత అనేక జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు ఒక్కటి కూడా లేకుండా పోయాయి. 16 జిల్లాల్లో ఎస్ఏ గణితం, ఏడు జిల్లాల్లో ఎస్ఏ ఇంగ్లీష్, మూడు జిల్లాల్లో ఎస్ఏ ఫిజికల్ సైన్స్, రెండు జిల్లాల్లో సోషల్ పోస్టులే లేవు. దీంతో ఈ జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేరే జిల్లాలో ఉండే పోస్టులకు నాన్–లోకల్ కేటగిరీ కింద పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే నియామకాల్లో స్థానికేతరుల కోటాను కేవలం 5 శాతానికే పరిమితం చేశారు. అంటే ఇతర జిల్లాల్లో కనీసం 20 పోస్టులు ఉంటేనే నాన్–లోకల్కు ఒక పోస్టు అయినా ఉంటుంది. కానీ ఏ జిల్లాలోనూ ఏ సబ్జెక్ట్కు సంబంధించి కూడా ఇన్ని పోస్టులు లేవు. అలాంటప్పుడు నాన్–లోకల్గా పరీక్ష రాసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నా స్థానికత తేలడం లేదు మహబూబాబాద్లో 1–5 వరకూ చదివాను. ఆ స్కూల్ ఇప్పుడు లేదు. ఆరు, ఏడు తరగతులు ప్రస్తుత వరంగల్ జిల్లాలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంటర్ వరకూ చదివాను. దీంతో నాలుగేళ్ళు ఎక్కడ చదివింది నిరూపించుకోవడం కష్టంగా ఉంది. – చదలవాడ నవీన్ (వరంగల్, టీఆర్టీ దరఖాస్తుదారు) స్థానికత నిబంధనపై ఆలోచించాలి 1 నుంచి 7 తరగతుల్లో నాలుగేళ్ళు ఎక్కడ చదివితే అక్కడి స్థానికులుగా పరిగణింపబడతారనే నిబంధన చాలామంది అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంది. నాన్–లోకల్ కోటాను తగ్గించడం వల్ల కూడా చాలా జిల్లాల్లో టీచర్ పోస్టులు పొందే అవకాశం ఉండటం లేదు. దీనిపై అధికారులు పునః సమీక్షించాలి. – రావుల రామ్మోహన్రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) -
పెరిగిన సిలబస్... ఆధునిక బోధనపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్ః ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు హాజరయ్యే అభ్యర్థులు లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా బోధన విధానాల్లో వస్తున్న మార్పులపై నిశిత పరిశీలన ఉండేలా ప్రశ్నలుంటాయని విద్యాశాఖ వెల్లడించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) అవగాహన పరిధిని విస్తృతంగా పరిశీలించాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్కు సంబంధించి 8వ తరగతి వరకూ కొన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతామని మొదట చెప్పినా, మెథడాలజీలో మాత్రం ఇంటర్మీడియేట్ స్థాయిలోని ఆలోచన ధోరణికి సంబంధించిన చాప్టర్లను జోడించింది. నవంబర్ 20 నుంచి జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి విద్యాశాఖ గురువారం పరీక్ష సిలబస్ను విడుదల చేసింది. ఏ చాప్టర్ నుంచి ఏయే ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని ఇందులో పేర్కొంది. ఎస్జీటీ పోస్టులకు పరీక్ష రాసే వారు 1–8వ తరగతి, స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేవారికి 1–10 తరగతులతో పాటు ప్లస్ టు నుంచి ప్రశ్నలు ఇస్తామని విద్యాశాఖ పేర్కొంది. జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పుల విషయంలో ప్రశ్నలుంటాయని తెలిపింది. ఈ క్రమంలో ఎస్జీటీలకు ఇచ్చే ప్రశ్నలు నిర్ణీత తరగతులు దాటి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే పరీక్ష కావడంతో టీఆర్టీకి ఈసారి ప్రత్యేకంగా శిక్షణ ఉండాలని అభ్యర్థులు అంటున్నారు. ప్రతీ ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. దీంతో ప్రతి ప్రశ్న కూడా కీలకంగానే భావిస్తున్నారు. మెథడాలజీపై గురి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నారు. దీనిపై పెద్దగా అభ్యంతరాలు రావడం లేదు. అయితే నవీన విద్యా బోధనపై 20 ప్రశ్నలు ఇస్తున్నారు. స్వాతంత్య్రం పూర్వం, తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, వివిధ విద్యా కమిషన్లు, సిఫార్సులు, చట్టాలపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఇస్తున్నారు. ’’స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల ఆలోచనల్లో విద్యా విధానం’’ అనే సబ్జెక్టుల్లోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఇవి అకడమిక్ పుస్తకాలతో సంబంధం ఉన్నవి కావని, జనరల్ నాలెడ్జ్గానే భావించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. విద్యార్థి, శిక్షణలో అభివృద్ధి అనే అంశంలో వివిధ రకాలుగా వస్తున్న మార్పులు, అధ్యయనాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. కేంద్ర విద్యా చట్టం, మార్పులు అనే అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండానే, జాతీయ విద్యా చట్టాలపై ప్రశ్నలు ఇస్తున్నారు. మేథమెటిక్స్లోనూ ఆలోచన ధోరణి ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాతకాలం విధానాలు కాకుండా, సరికొత్త పద్ధతిలో గణితం విద్యార్థులకు బోధించే ధోరణìలపై ప్రశ్నలు ఉంటాయని సిలబస్లో పేర్కొన్నారు. ఎస్ఏలకు 88 ప్రశ్నలు.. ఎస్జీటీలకు 160 ప్రశ్నలు ఎస్ఏలకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడిట్ స్థాయి వరకూ 88 ప్రశ్నలు ఇస్తున్నారు. దీనిపైనా స్పష్టత లేకుంటే ప్రిపరేషన్ సమస్యగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియేట్) స్థాయి ప్రశ్నలు ఇస్తామని చెప్పినా, ఇందులో కమ్యూనికేషన్ స్కిల్ పరీక్షకు సంబంధించినవి ఉంటాయా? సబ్జెక్టు నుంచి ఇస్తారా? అనే దానిపై స్పష్టత కోరుతున్నారు. టీచింగ్ విధానాలపై 32 ప్రశ్నలు ఇస్తున్నారు. రాష్ట్ర యూనివర్సిటీలు రూపొందించిన వివిధ బోధన పద్ధతుల నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు అన్ని కోణాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ సహా 18 సబ్జెక్టులకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ప్రతీ సబ్జెక్టు నుంచి 5కు మించకుండా ప్రశ్నలు ఇస్తున్నారు. మొత్తం 100 ప్రశ్నలను ఈ తరహాలోనే విభజించారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్కు 160 ప్రశ్నలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఇంటర్మీడియేట్ సిలబస్తో పాటు, కొత్త విద్యావిధానంపై తర్ఫీదు అవ్వాల్సిన అవసరం ఉందని సిలబస్ స్పష్టం చేస్తోంది. -
ఈ టీచర్లకు 30 శాతం పీఆర్సీ వర్తించదా?
సాక్షి, హైదరాబాద్: తాజా పీఆర్సీలో రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా కొత్తగా నియమితులైన టీచర్లకు భారీ నష్టం వాటిల్లనుంది. కిందిస్థాయి పోస్టు లో ఉండి, ఎస్ఏ పోస్టులకు ఎంపికైన టీచర్లకు పే ప్రొటెక్షన్ లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లనుండగా, నియామకాల్లో జాప్యం కారణంగా కొత్త పీఆర్సీ ద్వారా లభించాల్సిన ప్రయోజనాలు ఎక్కు వ మందికి దక్కకుండాపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా 8,792 మంది టీచర్లకు నష్టం వాటిల్లనుండటంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి పే ప్రొటెక్షన్ లేక నష్టం రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా ప్రభుత్వం 1,941 ఎస్ఏ పోస్టులను భర్తీ చేసింది. అందులో దాదాపు వెయ్యి పోస్టులకు ప్రస్తుతం స్కూళ్లలో ఎస్జీటీలుగా, భాషా పండితులుగా (ఎల్పీ) పని చేస్తున్నవారే ఎంపికయ్యారు. మిగతా పోస్టుల్లో కొత్తవారు ఎంపికయ్యారు. ఇలా ఎస్ఏ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరికి పలు కారణాలతో 2019లో నియామక పత్రాలు అందజేయగా, మరికొందరికి 2020లో నియామక పత్రాలు అందజేశారు. ఇంకొందరికైతే 15 రోజుల కిందటే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేశారు. వారిలో 95 శాతం మంది పంచాయతీరాజ్ టీచర్లే ఉన్నారు. అయితే వారికి ఇప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలోని కనీస మూల వేతనంతోనే వేతనాలను చెల్లించనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదేని ఉన్నత స్థాయి పోస్టుకు ఎంపికైనప్పుడు వారికి అంతకుముందు ఉద్యోగంలో వచ్చిన వేతనాన్ని కాపాడుతూ (పే ప్రొటెక్షన్ ఇస్తూ) ఉత్తర్వులిచ్చి కొత్త వేతనం ఖరారు చేస్తారు. అంతకుముందు వచ్చిన కనీస మూల వేతనానికి పీఆర్సీ అమలుతేదీ నాటికి ఉన్న డీఏ, ఫిట్మెంట్ను కలిపి కొత్త పోస్టులో కనీస మూల వేతనాన్ని ఖరారు చేస్తారు. కానీ ఇప్పుడు నియమితులైన పంచాయతీరాజ్ టీచర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. వాస్తవానికి 2013 డిసెంబర్ తరువాత ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని, సర్వీస్ మొత్తం లెక్కిస్తే నష్టం లక్షల్లో ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. నియామకాల్లో ఆలస్యంతో ఎక్కువ మందికి... 2017 టీఆర్టీ ద్వారా ఎస్జీటీ, ఎల్పీ, ఎస్ఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ)గా నియమితులైన 7,792 మంది టీచర్లకు తాజా పీఆర్సీలో ప్రకటించిన వేతన స్థిరీకరణలో కీలకమైన 30 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ అందని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన 2017 టీఆర్టీ నియామకాలను 2019 నుంచి 2021 వరకు సాగదీయడమే ఇందుకు కారణం. తాజా పీఆర్సీ ఇప్పుడు ప్రకటించినా 2018 జూలై 1 నుంచే అమల్లోకి రానుంది. కాబట్టి అప్పటివరకు సర్వీస్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే 30 శాతం ఫిట్మెంట్ ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత నియామకమైన వారికి నియమితులైన రోజు నుంచి లెక్కించి తాజా పీఆర్సీలో మినిమమ్ బేసిక్తో వేతనం ఖరారు చేసి, కరెస్పాండింగ్ పేస్కేల్ ఇస్తారు. ఒకవేళ వారు అంతకుముందే నియమితులై ఉంటే వారికి అప్పుడు ఉన్న ఇంక్రిమెంట్తో కూడిన మూల వేతనంపై 30.392 శాతం డీఏ, 30 శాతం ఫిట్మెంట్ వచ్చేది. కానీ వారు 2018 జూలై 1 నాటికి నియమితులు కాలేదు కాబట్టి ఇప్పుడు వారికి 30 శాతం ఫిట్మెంట్ వర్తించదు. పైగా ఇప్పుడు రూపొందించిన మాస్టర్ స్కేల్ ప్రస్తుతం ఉన్న 30 శాతం ఫిట్మెంట్తో కాకుండా 15 శాతం ఫిట్మెంట్తోనే రూపొందించినందున వారికి రెండు రకాలుగా కలిపి నెలకు ఐదారు వేల రూపాయల నష్టం వాటిల్లుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ–2017) ద్వారా నియమితులైన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)కు తాజా పీఆర్సీతో ఇప్పుడు రూ.31,040 కనీస మూల వేతనం రానుంది. అదే టీచర్ 2018 జూలై 1కి ముందు నియమితులై ఉంటే పాత స్కేల్పై 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.34,690 కనీస మూల వేతనం వచ్చేది. అలాగే అదే టీఆర్టీ ద్వారా స్కూల్ అసిస్టెంట్గా (ఎస్ఏ) నియమితులైన వారికి ఇప్పుడు రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. ఈ టీచర్ కూడా ముందే నియమితులై ఉంటే 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.47,240 వచ్చేది. 2017 టీఆర్టీ అయినప్పటికీ నియామకాల్లో ఆలస్యం కావడం వల్ల ఫిట్మెంట్ వర్తించకపోవడంతో ఒక్కో టీచర్ నెలకు నాలుగైదు వేలు నష్టపోనున్నారు. ఒక అభ్యర్థి 2008లో ఎస్జీటీగా ఎంపికయ్యారు. 2018 జూలై 1నాటికి ఆయన కనీస మూల వేతనం రూ. 31,460. ఆయన 2017 టీఆర్టీ ద్వారా ఎస్ఏగా ఎంపికయ్యారు. ఆయనకు ఇప్పుడు ఎస్ఏ పోస్టులో రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. అయితే పే ప్రొటెక్షన్ ఉంటే 2018 జూలై 1 నాటికి ఉన్న కనీస మూల వేతనంపై 30.392 కరువు భత్యం (డీఏ), 30 శాతం ఫిట్మెంట్ కలిపి రూ.51,320 కనీస మూల వేతనంగా వచ్చేది. అది లేకపోవడం వల్ల ఇంక్రిమెంటు కలుపుకొని నెలకు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లనుంది. న్యాయం చేయాల్సిందే టీఆర్టీ–2017లో భాగంగా రాత పరీక్ష, ఇతరత్రా నియామకాల ప్రక్రియ 2018 జూలై 1 నాటికి పూర్తయ్యింది. అయితే పోస్టింగ్లు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది. అందువల్ల వారికి 30 శాతం ఫిట్మెంట్ను వర్తింపజేసి న్యాయం చేయాలి. అలాగే పైస్థాయి పోస్టులకు ఎంపికైన టీచర్ల కోసం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలి. లేకపోతే వారు తీవ్రంగా నష్టపోతారు. – మానేటి ప్రతాప్రెడ్డి,టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చదవండి: ఉచిత నీటి పథకానికి తిప్పలెన్నో..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement