గ్రహాలతో గేమ్స్ ఆడారు!
థీమ్.. త న న
ఎడ్గార్ కేసీ అమెరికన్ క్రిస్టియన్. భవిష్యత్తులో ఏం జరగబోతోందన్నది.. కొన్ని క్షణాలు అలా కళ్లు మూసుకుని చెప్పేయగలడు! పూర్వజన్మలు, పునర్జన్మలు ఆయనకు కొట్టిన పిండి. అమెరికా ఆర్థిక వ్యవస్థ 1929లో కుప్పకూలుతుందని జోస్యం చెప్పింది ఇతడే! కేసీ.. దేవుడితో డైరెక్టుగా మాట్లాడతాడని పేరు. ‘ది స్లీపింగ్ ప్రాఫెట్’ అని కూడా ఆయన్ని అనేవారు. మార్చి 18న కేసీ 140 వ జయంతి. ఈ సందర్భంగా.. కాలగతిని ముందే ఊహించిన పదిమంది జ్ఞానుల మహా జోస్యాలివి! .
టైటానిక్ దుర్ఘటన
మోర్గాన్ రాబర్ట్సన్ అమెరికన్ రచయిత. 1898లో ‘ఫ్యుటిలిటీ, ఆర్ ది రెక్ ఆఫ్ ది టైటాన్’ అనే నవల రాశారు. ఆ నవల్లో ‘టైటాన్’ అనే పేరు గల నౌక ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుఖండాన్ని ఢీకొని, మునిగిపోతుంది. నవల బయటికి వచ్చిన పద్నాలుగేళ్లకు 1912లో నిజంగానే ‘టైటానిక్’ అనే నౌక ఉత్తర అట్లాంటిక్లో మంచుఖండాన్ని ఢీ కొని, మునిగిపోయింది! ఆ దుర్ఘటనలో 1500 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. నవల్లోని నౌకకు, నిజమైన నౌకకు మరికొన్ని పోలికలు ఉండడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు నౌకల సైజు, స్పీడు ఒకటే! రెండు నౌకలూ ఏప్రిల్ నెలలోనే మునిగిపోయాయి! ఇంకా విచిత్రం ఏంటంటే... రియల్ ౖటైటానిక్ నిర్మాణమింకా డిజైన్ కాకముందే, మోర్గాన్ నవల్లోకి ‘టైటాన్’కి అదే రూపం వచ్చేయడం! టైటానిక్ ఘటన తర్వాత మోర్గాన్ను ఎవరో అడిగారు.. ‘మీకేమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా?!’ అని. మోర్గాన్ నవ్వి ఊరుకున్నారు. తర్వాత మూడేళ్లకు ఆయన చనిపోయారు.
అమెరికా ఆర్థిక సంక్షోభం
ఎడ్గార్ కేసీ 1920ల నాటి పాపులర్ మిస్టిక్. దేవుడితో తన ప్రార్థనల ద్వారా నేరుగా సంభాషించేవాడని అంతా నమ్మేవారు. ‘ట్రాన్స్’ (ధ్యానంలాంటి మెలకువ)లో ఉన్నప్పుడు ఈయన జోస్యం చెబుతుండేవారు. ఉడ్రోవిల్సన్, థామస్ ఎడిసన్ వంటి మహామహులే ఈయన దగ్గర జోస్యం కోసం చెయ్యి చాచారు. అయితే ఎవరూ అడక్కుండానే ఎడ్గార్ కేసీ 1929లో అమెరికాను బికారిని చేయబోయే మహా ఆర్థిక విపత్తు గురించి నాలుగేళ్ల ముందు నుంచే జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన చెప్పినట్లే... ఆ ఏడాది న్యూయార్క్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కోటీ 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆకలి తీర్చుకోడానికి అమెరికా పౌరులు ఉచితంగా లభించే ప్రభుత్వ గంజి కోసం బారులు తీరి నిలబడవలసి వచ్చింది. ఎడ్గార్ కేసీ తన మరణాన్ని కూడా ముందే ఊహించాడు. మరో మూడు రోజుల్లో తాను చనిపోతానని 1945 జనవరి 1న ప్రకటించాడు. జనవరి 3న గుండెపోటుతో చనిపోయాడు.
ప్రచ్ఛన్న యుద్ధం
బ్రిటన్ నుంచి విముక్తి పొందిన 60 ఏళ్లకు అమెరికాలో 1840లలో అంతర్యుద్ధం మొదలైంది!! అదే సమయంలో రష్యాలో జార్ చక్రవర్తుల నిరంకుశ పాలన సాగుతోంది. రెండు దేశాలూ వేటి తలనొప్పులలో అవి ఉన్నాయి. ఈ రెండు రాజ్యాలూ భవిష్యత్తులో అగ్రదేశాలుగా ఎదుగుతాయని, ఆధిపత్యం కోసం రెండు దేశాల మధ్య కోల్డ్వార్ జరుగుతుందని ఎవరూ ఊహించరు. కానీ ఫ్రెంచి రాజకీయ శాస్త్రవేత్త అలెక్స్ డి టొక్వీల్ 1840 నాటి తన పుస్తకం ‘డెమోక్రసీ ఇన్ అమెరికా’ పుస్తకంలో ఈ విషయం రాశారు. రష్యన్లు, అమెరికన్లు.. రాబోయే కాలంలో ఒకర్ని మించి ఒకరు ఎదిగేందుకు పోటీ పడతారని స్పష్టమైన విశ్లేషణ కూడా అందులో చేశారు. ఆయన చెప్పినట్లే 20 వ శతాబ్దంలో... అణ్వాయుధాలు సమకూర్చుకోవడంలో, అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో, అంతర్జాతీయంగా ప్రభావం చూపించుకోవడంలో అమెరికా, రష్యా.. ఒక యుద్ధంలా ఎత్తుకు పై ఎత్తులు వేసుకున్నాయి.
చంద్రునిపై తొలి అడుగు
19వ శతాబ్దపు ఫ్రెంచి నవలా రచయిత జూల్స్ వెర్న్ 1865లో ‘ఫ్రం ది ఎర్త్ టు మూన్’ అనే చిన్న సైన్స్ ఫిక్షన్ కథ రాశారు. అందులో మనిషి తొలిసారి చంద్రుణ్ణి చేరుకుంటాడు. జూల్స్ వెర్న్ ఊహించినట్లే వందేళ్ల తర్వాత 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టాడు. అదొక్కటే కాదు, ‘ఫం ది ఎర్త్ టు మూన్’ పుస్తకంలో రాసిన విధంగానే రియల్ అపోలో మిషన్ కూడా సాగింది! అపోలోలో ప్రయాణించిన వ్యోమగాముల సంఖ్య, ఆ రెండు రాకెట్లు ఫ్లోరిడా నుంచే లాంచ్ అవడం.. సేమ్ టు సేమ్! ఇంకా అద్భుతం ఏంటంటే.. వ్యోమగాములు అంతరిక్షంలో బరువు కోల్పోయినట్లుగా అనుభూతి చెందారని కూడా జూల్స్ వెర్న్ రాయడం! అప్పటికింకా... ఖగోళ శాస్త్రవేత్తలకే ఆ సంగతి తెలీదు!
గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్
మానవజాతి జాతకపిత నోస్ట్రడామస్. మహామహుల జనన మరణాలను, ఘోర దుర్ఘటనలను శతాబ్దాలకు ముందే ఆయన ఊహించారు. ఈ ఫ్రెంచి కాలజ్ఞాని.. క్రీ.శ. 3797 వరకు లోకంలో జరగబోయే సంఘటనలను సైతం ప్రవచించారు. వాటిల్లో అతి ప్రధానమైనది లండన్ అగ్ని ప్రమాదం. 1555లో నొస్ట్రడామస్ రాసిన పుస్తకం ‘లె ప్రొఫిటీస్’ లో.. ‘66’లో లండన్ కాలిపోతుంది. చుక్క నెత్తురు కూడా లేకుండా ఆవిరైపోతుంది’ అని రాసి ఉంది. అందులో ఉన్నట్లే 1666లో లండన్లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి 70 వేల ఇళ్లు బూడిదయ్యాయి. 80 వేల మంది ప్రాణాలు ఆవిరయ్యాయి! 1789 నాటి ఫ్రెంచి విప్లవాన్ని కూడా నోస్ట్రడామస్ సరిగ్గా ఊహించారు. ప్రభువులు కారాగారాలకు, ప్రజలు పంజరాల బయటకు వెళ్తారని రాశారు. ఆయన రాసినట్లే.. ఫ్రెంచి విప్లవంలో పాలకులు పాలితులయ్యారు. పాలితులు పాలకులయ్యారు.
వైర్లెస్ నెట్వర్క్ (వై–ఫై)
సెర్బియన్– అమెరికన్ ఇంజినీరు నికోలా టెస్లా..కు ‘ఇరవయ్యవ శతాబ్దాన్ని కనిపెట్టిన వ్యక్తి’గా పేరుంది. ఆధునిక విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసింది ఇతడే. 1909లో టెస్లా, ‘న్యూయార్క్ టైమ్స్’కు ఇంటర్వూ్య ఇస్తూ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి తన ఆలోచనల్ని షేర్ చేసుకున్నాడు. త్వరలోనే వైర్లెస్గా మెసేజ్లను ఇచ్చిపుచ్చుకునే అతి తేలికైన, ఎవరైనా ఆపరేట్ చేయగలిగిన సాంకేతిక పరిజ్ఞానం మానవుడికి అందుబాటులోకి రాబోతోంది’ అని చెప్పాడు. అప్పటికింకా మెబైల్ టెక్నాలజీ అన్న భావనే ఊపిరి పోసుకోలేదు! ఆ తర్వాత 84 ఏళ్లకు 1973లో తొలి మొబైల్ టెలిఫోన్ వచ్చింది. తర్వాత 18 ఏళ్లకు 1991లో వై–ఫై వచ్చింది. ఇంతదూరం టెస్లా ఎలా ఆలోచించాడన్నదే వండర్!
అవయవాల మార్పిడి
రాబర్ట్ బాయల్ రసాయన శాస్త్రవేత్త. ఆంగ్లో–ఐరిష్ తత్వవేత్త. ‘ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ’ గా గుర్తింపు పొందారు. వాయువుల స్వభావాన్ని తెలిపే ‘బాయల్స్ లా’ ఆయనదే. 1660లో ఆయన ఒక వ్యాసం రాస్తూ, భవిష్యత్తులో అవయవ మార్పిడితో వ్యాధులను నయం చేయడం వైద్యశాస్త్రానికి సాధ్యం అవుతుందన్న ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన అలా ఊహించిన 300 ఏళ్ల తర్వాత 1954లో డాక్టర్ జోసెఫ్ ముర్రే, డాక్టర్ డేవిడ్ హ్యూమ్ తొలి కిడ్నీ మార్పిడి ఆపరేష¯Œ ని విజయవంతగా నిర్వహించారు.
అణుబాంబు దాడులు
మనిషి అణుబాంబును కనిపెట్టినట్టు, ఆ అణుబాంబుల దాడిలో నగరాలు ధ్వంసమైనట్లు 1914లో బ్రిటన్ రచయిత హెచ్.జి.వెల్స్ ‘ది వరల్డ్ సెట్ ఫ్రీ’ అనే పుస్తకంలో రాశారు. అందులో రాసినట్లే ఆ పుస్తకం రాసిన 28 ఏళ్లకు మహన్హట్టన్ ప్రాజెక్టుతో అమెరికా అణుబాంబులను తయారుచేసింది. తర్వాత మూడేళ్లకు 1945లో జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులను ప్రయోగించింది. ఆ దాడిలో 2 లక్షల 26 వేల మందికి పైగా మరణించారు!
వరల్డ్ వైడ్ వెబ్ (డబ్లు్య.డబ్లు్య.డబ్లు్య)
అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ 1909 ఆటో బయోగ్రఫీలో తన మరణ సమయం గురించి రాసుకున్నారు. ఆ తర్వాత అది నిజమైంది! ట్వైన్ 1835 నవంబర్ 30 జన్మించారు. అంతకు కాస్త ముందే ఆకాశంలో హేలీ తోక చుక్క కనిపించింది. హేలీ తోక చుక్క ప్రతి 75 లేదా 76 సంవత్సరాలకు కనిపిస్తుంది. ట్వైన్ తన 75వ యేట ఆ విషయాన్ని రాస్తూ, ‘హేలీ తోక చుక్క కనిపించిన రోజు నేను పుట్టాను. మళ్లీ ఆ తోక చుక్క కనిపించిన రోజు మరణిస్తాను’ అని రాసుకున్నారు. సరిగ్గా అలాగే 1910 ఏప్రిల్ 21న ఆయన మరణించారు! ఇదొక్కటే కాదు, ఇంటర్నెట్ను కూడా ట్వైన్ ముందే ఊహించారు! దానికి ఆయన పెట్టిన పేరు ‘టెలెక్ట్రోస్కోప్’. 1898లో ‘ఫ్రం ది లండన్ టైమ్స్’ అనే సైన్స్ ఫిక్షన్ రాస్తూ, అందులో టెలెక్ట్రోస్కోప్ అనే వ్యవస్థతో ప్రపంచమంతా అనుసంధానమైపోతుంది అని రాశారు! తర్వాత 90 ఏళ్లకు టిమ్ బెర్నర్స్లీ ‘వరల్డ్ వైడ్ వెబ్’ను ఆవిష్కరించారు!
యుద్ధ ట్యాంకు
డావించీ సకలకళా వల్లభుడు. సైంటిస్ట్, ఆర్టిస్ట్, మేథ మెటీషియన్, మ్యుజీషియన్... అన్నీ. వీటన్నిటితో పాటు కాలజ్ఞాని! 1480ల నుంచి ఆయన చనిపోయిన ఏడాది అయిన 1519 వరకు ఆయన రాసుకున్న నోట్స్లో కొన్ని ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయి! గీతల్లో ఆయన రూపకల్పన చేసిన ఆవిష్కరణలు ఎన్నిటినో ఇప్పుడు మనం చూస్తున్నాం. మానవాళి యుద్ధట్యాంకును కనిపెట్టడానికి 400 ఏళ్ల ముందే తన గీతల్లో ఆయన యుద్ధట్యాంకు బొమ్మను గీశారు! ప్యారాచూట్ను కూడా 300 ఏళ్లకు మందే డావించీ ఊహించి, రేఖామాత్రంగా సూచించారు.