-
ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా!
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక ‘స్వర్గసీమ’పై జనవరి 28న ‘సాక్షి ఫ్యామిలీ’లో వచ్చిన రంగనాయకమ్మ గారి అభిప్రాయానికి ప్రతిస్పందన ఈనాటి దృష్టితో విమర్శించడం తగునా! - వి.ఎ.కె. రంగారావు, ప్రసిద్ధ సంగీత, నృత్య, కళా విమర్శకులు నాకు రంగనాయకమ్మ రాత దాదాపు ఆరున్నర దశాబ్దాల కిందటే తెలుసు. ఆమె తండ్రి దద్దనాల సత్యనారాయణగారు వెలమ కులస్థులకై నడిపే ‘పద్మనాయక’ పత్రికలో ఆమె రచనలు వస్తుండేవి - దద్దనాల రంగనాయకమ్మనే పేరుతో! ఆ తరువాత ముప్పాళ్ల రంగనాయకమ్మ, అటు పిమ్మట రంగనాయకమ్మ అన్న పేర్లతో వచ్చినవి కొన్ని -- అన్నీ కాదు -- చదివాను. వాటి బాగోగులను చర్చించే అదను యిది కాదు. వాటిలో కొన్ని బాగు, మరికొన్ని ఓగు అని నేను చెప్పితే అది కేవలం నా అభిప్రాయమే అవుతుంది. నాపై అభిమానం ఉన్నవారూ, అందున్న తర్కం సమంజసంగా ఉందనుకొన్న వారూ మెచ్చుకుంటారు. మిగతావారు నొచ్చుకుంటారు. ఎవరి అభిప్రాయాలూ నిత్యసత్యం కావు. ఆనాటికి సరిపోయే వ్యాఖ్యలు. రంగనాయకమ్మ తమ వ్యాసంలో ‘స్వర్గసీమ’ తీసిన దర్శక - నిర్మాత బి.ఎన్. రెడ్డిని దుయ్యబట్టారు. నా దృష్టిలోనే కాదు ఎందరి దృష్టిలోనో అది 11 వేల అడుగుల నిడివిలో దాదాపు పది మంచి పాటలు యిమిడ్చిన మంచి సాంఘికం. అందున్న నాయికను యీనాటి ఫెమినిస్టు దృష్టితో విమర్శించడం తగునా! 1940లలో స్త్రీలు అలానే పతిభక్తి కలిగి, భర్తకు అణిగిమణిగి ఉండుట విధాయకం అనుకొనేవారు కాదా! ఉంపుడుకత్తె పొమ్మంటేనే కావచ్చు తిరిగి వచ్చిన భర్తను ఆహ్వానించడంలో బిడ్డల భవిష్యత్తు పటిష్ఠం చేసుకోవడమూ ఒక భాగం కాకూడదా? ఆ నాయిక ఏడవక ఏడవక ‘ఎనిమిది మంది పెళ్లాలూ, పదహారు వేల ప్రియురాళ్లూ’ (నరకాసురుని చెర విడిపించిన కృష్ణుని భార్యలే వీరూ! నన్నెవరో అడిగినట్లు వాళ్ల మేరేజ్ సర్టిఫికెట్ నేను చూశానా అని అడగకూడదు మరి!) ఉన్న కృష్ణుని ముందే ఏడవాలా, అక్కడ రాముని బొమ్మ పెట్టించాలని దర్శకునికి తెలియదా? అన్నారామె. ఏ రాముడు? రాక్షసుని చెర విడిపించి, ‘నీ యిష్టమైన వాడితో వెళ్లు’ అని సీతతో అన్న రాముడా? నిండుచూలాలైన సీతను పిక్నిక్కి వెళ్లిరా అంటూ అడవిలో వదలి రమ్మని తమ్ముని ఆజ్ఞాపించిన రాముడా!! చేపల పులుసులో వేసే చింతపండు కలగూర పులుసులోనూ వేస్తారు. అది పాత చింతపండా, కొత్తదా అన్నదానిపైనే రుచి ఆధారపడి ఉంటుంది. ఆ సినిమా పాటల కోసమేనా అని అడిగారు. పోట్లాటల కోసం, తెలివైన దోపిడీలు చూపడానికోసం, వొల్లీవొల్లని ముసుగులో సెక్స్ చూపడానికోసం సినిమాలు తీయగా లేనిది పాటల కోసం తీయకూడదా! పాటల విషయంలోనే ఆమె ముద్దపప్పులో కాలేశారు. ‘దునియా అంతా దుఃఖం బాబా, కళ్లు తెరిచి చూడు’ అని వారి ఉల్లేఖనం - సగం సైగల్ (దుఃఖ్కే అబ్ బీతత్ నాహి దిన్ - ‘దేవదాసు’), సగం కె.సి. డే (మన్కీ ఆంఖే ఖోల్ బాబా - ‘భాగ్యచక్ర’ ఉరఫ్ ‘ధూప్ఛా(వ్’). చివరి విషయం మాత్రం సత్యం శివం సుందరంలా నిత్యం. మరి నేను సరాగమాల వాడిని కదా! రచయిత్రులకూ ఒక జబ్బు ఉంది! - కె.ఎన్.టి. శాస్త్రి, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు రంగనాయకమ్మ సినిమా వాళ్లకి ఒక జబ్బు ఉంటుంది అన్న ‘రచన’ను చదివి, ఒక సినిమా దర్శకుడిగా స్పందించకపోతే, మా పురుష దర్శకులందరికీ అవమానమనిపించి, నా స్పందన! ‘స్వర్గసీమ’ చిత్రం బి.ఎన్. రెడ్డిగారు 1945లో తానే స్వయంగా రచించి, పెట్టుబడి పెట్టి, తీసిన సినిమా. డెబ్భై ఏళ్ల తర్వాత - దానిలోని స్త్రీ అలా ఏడ్చింది, ఇలా చేసిందని స్త్రీ వాదాన్ని మళ్లీ రంగనాయకమ్మ గారు చాదస్తంగా వేలెత్తి చూపితే, జీర్ణించుకోలేకపోతున్నాం. ఆమె మర్చిపోయిన అసలు సంగతేమిటంటే, ఆ కళాకారుణ్ణి ‘స్వర్గసీమ’ అనుకుని పాడుకున్న గృహము నుండి, బయటికి లాక్కున్నది కూడా ఒక స్త్రీ మూర్తి. ఆమెలో ఇమిడి ఉన్న కళాకారిణిని బయటకు తీసుకురావడం కోసం అతని కృషి కూడా ఉంది. దానికి ప్రతిఫలంగా, అతనితో కొన్ని రోజులు సరదాలు తీర్చుకుని, తనకు ఒక జీవనోపాధి దొరికిన తక్షణం ఈ కళాకారుణ్ణి పక్కన పెడుతుంది. ఆ కాలఘట్టంలో, ఇంటర్నెట్ - సెల్లు లేవు కాబట్టి, ఈ గృహిణి, ఇలా బట్టలు కుట్టుకుని ‘ఆదర్శ గృహిణి’గా ఉండిపోయిందేమో! బహుశా, ఆమెకు అవకాశాలు అందుబాటులో ఉండి ఉంటే, మరోలా ఏడ్చి ఉండేదేమో! నేటి స్త్రీలు, మన సినిమాల్లో దుమ్ము రేపేస్తుండడం మన రంగనాయకమ్మ గారికి తెలియదంటే, విడ్డూరంగా ఉండడమే కాకుండా కేవలం ఆమెకు అచ్చివచ్చిన విద్య (మగవారిని దుమ్మెత్తిపోయడం)ను ప్రదర్శించుకోవడానికే ఆమె ఈ వ్యాసాన్ని రచించిందని అనిపిస్తుంది. నేటి టీవీల్లో కనపడే భార్యామణులు, అత్తగార్లు ఎలా ప్రవర్తిస్తున్నారో కాస్త గమనించండి. వీరు సబలలు. మగవారిపై ఆధారపడకుండా తమ జీవనోపాధి వెతుక్కున్న స్త్రీమూర్తులు. ఇక్కడ అసలు సంగతేమిటంటే, ఆడ-మగ బొమ్మ-బొరుసులా -ఒక ఏకత్వానికి ప్రతిరూపమే కాకుండా ఒకరు లేక మరొకరు లేరనేది ప్రకృతి నియమం. ఈ విషయం రచయిత్రికి తెలియదంటే నమ్మలేము. పోతే, ఏ రంగంలోనైనా శక్తిసామర్థ్యాలను పెంపొందించుకుంటే, వారు స్వతంత్రంగా, కన్నీరు కార్చుకుంటూ, కుట్టుమిషన్కు పరిమితం కాకుండా ఉండవచ్చుగా? డెబ్భై సంవత్సరాలప్పటి కథను, ఆ కాలానికి అనువుగా తీసిన చిత్రం - ‘స్వర్గసీమ’. తీసినవారికి ఎలాంటి జబ్బులూ లేవు; ఆ కాలంలో వచ్చిన సినిమాను ఇలా స్త్రీ వాదంతో ఈ కాలంలో విమర్శించే రచయిత్రులకే జబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను 2002లో తీసిన ‘తిలదానం’ సినిమాలో కూడా భర్త వదిలి నక్సలైట్గా దూరమైతే, మా హీరోయిన్ ఏడుస్తూ ‘నరకాన్ని’ అనుభవిస్తూ ఉండగా, మామ చనిపోతే, ఇరుగుపొరుగు ‘ఈ ‘శని’కి దిక్కు-మొక్కు లేరు, ఈ కర్మ కాండలన్నీ మేమే చేయాల’ని విసుక్కుంటే, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆ శవానికి సంస్కారాలు వద్దని, అనాథ శవంగా మార్చురీకి పంపి తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. చెప్పొచ్చిందేమంటే, స్త్రీయెనా, పురుషుడైనా - తన వ్యక్తిత్వాన్ని నిలపెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ, తన జీవనోపాధికి ఒకరిపై ఆధారపడకుండా ఉంటే, స్వర్గసీమలు ప్రతి వాకిళ్లలోనూ కనబడతాయి. పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
ఒక ఆధునిక ఆంధ్ర వాగ్గేయకారుని చరిత్రము
వి.ఎ.కె. రంగారావు , ప్రసిద్ధ సంగీత, నృత్య, కళా విమర్శకులు బాలాంత్రపు రజనీకాంతరావుఎవరో యీ తరం వారికి తెలియకపోవచ్చును. అది వారి లేమి. పాఠ్యగ్రంథాలలో ఏవి ఉండాలో నిర్ణయించేవారి దృష్టిలోపం. ఆయన తెలుగు సంగీత సాహిత్యాలకూ, వెండితెరకూ, ఆకాశవాణికీ చేసిన సేవ, వేసిన కొత్తబాట గత నూరేళ్లలో మరొకరు చేయలేదు. సుమారు 65 ఏళ్ల క్రితం మద్రాసు ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రతిరోజూ ‘భక్తిరంజని’ కార్యక్రమం తెలుగులో వినవచ్చేది. కాస్త లలితమైన సంగీత సాహిత్యాలంటే అభిరుచి ఉన్నవారందరూ దినం తప్పక విన్న కార్యక్రమం అది. అందులో శాస్త్రీయ సంగీతం కాక పామరులకూ అందుబాటులో ఉండే లలిత సంగీత శైలిలో పొదగబడిన భక్తిమణులందు వినవచ్చేవి. నన్ను ఆకర్షించినవి రెండు పాటలు - ‘విన్నపాలు వినవలె వింత వింతలు’, ‘తందనాన భళా తందనాన’ అన్నవి. రెండోది కీర్తిశేషులు మల్లిక్ వరసా, గాత్రమూ అయితే, మొదటిది రజని వరస చేసి, భానుమతి చేత పాడించినది. నాకు యీ రెండు పాటల ద్వారానే రజని, మల్లిక్ల పేర్లు తెలియడం. అంతేకాదు. వీటి రచయిత అన్నమయ్య అన్న విషయమూ. నాలో పెరిగిన అన్నమయ్య కల్పవృక్షానికి బీజం యివయితే, దాన్ని ప్రోది చేసి పెంచి, పూవులు పూయించి, పిందెలు, కాయలు, పళ్లు కాయించినది శ్రీమల్లాది రామకృష్ణశాస్త్రి కథలు రెండూ వనమాలలే. ఆకాశవాణిని గీర్వాణివాణిగా, సంగీత సాహిత్యాభినయాల త్రివేణీ సంగమంగా వెలార్చినవి ఎన్నో సంగీత రూపకాలు. ‘దేవదాస్’, ‘బేహుల’, ‘లైలా మజ్ను’, ‘ధర్మచక్ర’, ‘ఉమర్ ఖైయామ్’ -- యివన్నీ రజనీ కృతులే. కేవలం శ్రవ్యమే అయినట్టి రేడియో ప్రసారాలలో అభినయం ఉండే అవకాశమేదీ అంటారా?‘పూలతీవ పొదరిళ్ల మాటుగా పొంచి చూచు శిఖిపింఛమదే’ అంటేనూ, ‘రాధా మాధవ ప్రేమారామము బృందావనము, రాసక్రీడా మనోజ్ఞధామము బృందావనము’ వింటేనూ, ‘ఊరకే మాధురులూరిపోతున్నాయి’ చదివితేనూ అందులో అభినయం అర్థం కాదా, వినబడదా, బుర్రకెక్కదా! రజనీ సాహిత్యపు సొంపులు, పాడించిన తీరులో యింపులు, స్వర సమ్మేళనలలో రకరకాల మేళవింపులూ తమ ప్రభావాన్ని తదుపరి వారిపై చూపాయి. రజని స్వర సాహిత్యాల సౌందర్యాన్ని తమకే చేతనైన ఒదుగుల పౌడరద్ది, తమరమర్చిన వాద్యగోష్ఠి అత్తరు పూసి పేరుగొన్న వారెందరో! వారిలో సీతా, అనసూయలు ప్రథములు (వలపులో, జాబిల్లి వస్తున్నాడు, ఊరకే మాధురులు). ఆ తరువాత ఎస్.రాజేశ్వరరావు, ఆయన దాపున ఆర్.బాలసరస్వతీదేవి (ఆలయమున, చల్లగాలిలో, కోపమేల రాధా), ఘంటసాల (మజ్నూ విలాపం, లైలా విశ్వరూపం). ఇక సూర్యకుమారి ప్రాణప్రతిష్ఠ చేసిన రజని శిల్పాలు ఎన్నని! ‘శతపత్ర సుందరి’, ‘ఇదె జోత’, ‘మాదీ స్వతంత్ర దేశం’, ‘స్వప్నజగతిలో’, ‘చిన్నదోయి నా హృదయనావ’. భానుమతి, రజని కలసి ‘పసిడి మెఱుంగుల తళతళలూ’ రికార్డిచ్చారు (రెండవ ప్రక్క బంకించంద్రుని ‘వందే మాతరం’). రజని అరుదుగా యితరుల రచనలకూ స్వరకల్పన చేశారు. బసవరాజు అప్పారావు గారి ‘యశోధరా విలాపం’ (లేపనైనా లేపలేదే-టి. సూర్యకుమారి) వాటిలో కౌస్తుభం. ఈ పాటకే మద్రాసు విద్వత్సభలో శ్రీమతి బ్రగా బెస్సెల్ భరతనాట్యాభినయం చూపగా ప్రభావితులై ప్రసిద్ధ తమిళ కవి వైరముత్తు అప్పటికప్పుడా వస్తువుపై ఒక పాట వ్రాశారు. ఇప్పటివారు ‘అరేబియన్ సంగీతం’ సినిమాలకు మొదటిమారుగా తెచ్చిన ఘనత ఏ.ఆర్. రహమాన్ది అంటారు. ప్రప్రథమంగా భారతీయ సంగీతానికి ఆస్కార్ గుర్తింపు తెచ్చిన ఘనత అతనిది. అరేబియా సంగీతం మనకు దింపినది రజనీది. రేడియోలో ‘ఉమర్ ఖైయామ్’ యీనాడు వినే యోగం లేదు. కాని రజని సంగీతం చేసిన ‘గృహప్రవేశం’ చిత్రంలో ‘కనవోహో కనవోహో’ వినండి. ఆ తరువాత ‘రత్నమాల’ చిత్రంలో చిలకపాట వినండి. రెండూ భానుమతి కంఠంలో వెలిగిన ఖర్జూరాలే. ఆ ‘గృహప్రవేశం’కి సహాయ సంగీత దర్శకునిగా పని చేసిన పెండ్యాల ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’లో ‘నా మనసెంతో నాజూకు’, సత్యం ‘భూలోకంలో యమలోకం’ చిత్రంలో ‘ఏదో ఏదో వింత పులకింత’ వినండి. రజనీ ప్రభావం ఘనత తెలియండి. ‘విప్రనారాయణ’లో రాజేశ్వరరావు ‘ఎందుకోయీ తోటమాలి’లోను యీ శైలి తెలుస్తుంది.మరొక విషయం - ‘స్వర్గసీమ’కు చూడామణిగా అలరిన ‘ఓహో పావురమా’ పాట గురించి నిర్మాత - దర్శకుడు బి.ఎన్. రెడ్డి, వాగ్గేయకారుడు రజని, పాడిన భానుమతి ఒక కాశీమజిలీ కథ చెబుతూ వచ్చారు నలభై ఏళ్లుగా. ‘బ్లడ్ అండ్ శాండ్’ సినిమాలో నటి రీటా హేవర్త్ పాడిన పాటకది అనుసరణ అని. శుద్ధ అబద్ధం. వారి ఉద్దేశమదైతే కావచ్చు. కానీ, ఆ పాటకూ, దీనికీ పోలికే లేదు. అది శ్పానిష్ పద్ధతి. ఇది అరేబియన్ శైలి. అరుదైన యీ ఖండికను సాంకేతిక నిపుణుడు విజయవర్ధన్ నాకు చూపించారు. రజని చేసిన యితర సినిమాలు - ‘లక్ష్మమ్మ’ (ఒక తిల్లానా, ఒక జావళి వినా అవి రికార్డింగ్కి సంగీతం సిద్ధం చేసిన ఘంటసాల ఎన్నికలు, పూర్వపు రచనలు), ‘పేరంటాలు’. అలాగే, ‘మానవతి’ చిత్రంలో కొన్ని పాటలు. మలయమారుత రాగం సినిమా కోసం పెండ్యాల గొప్పగా మలిచినది ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది’ అంటారు. నిజం. అయితే అంతకు ఏళ్లముందు అశరీరవాణి కోసం తయారు చేసి ‘మానవతి’ సినిమాలో యీ రాగంలోనే వినిపించిన ‘ఓ మలయ పవనమా!’ (ఎం.ఎస్.రామారావు, బాలసరస్వతీ దేవి) రజని సృష్టి. త్యాగరాజు సృష్టించిన అపూర్వ రాగాలలో ఒకటి రసాళి, ‘అపరాధములనోర్వ’ అన్న కీర్తనకు. సినిమా పేరుబట్టి మొదట మానవతి రాగంలోనే రజని ఒక పాట చేయాలనుకొన్నారట. కాని ఆ రాగం అతి పరిమితమైనది కావడం చేత ఆ ప్రయత్నం మాని దగ్గరి మేళకర్తయిన నాటకప్రియ రాగజన్యమైన రసాళిలో చేశానని వారే చెప్పారు. ఈ గానలహరి కథలో ఒక పిట్ట కథ. పి.మంగాపతి గ్రామఫోన్ కంపెనీలో రికార్డింగ్ ఆఫీసరుగా ఉన్నప్పుడు, ఒక ఎల్.పి. కోసం నన్ను ఆర్. బాలసరస్వతి, ఎస్. రాజేశ్వరరావు సంకలనం - నా దగ్గరున్న బొక్కిసమాధారంగా - చేయమని అడిగారు. అందులో యీ రసాళి రాగచిత్ర (మానవతి) గీతం ‘తన పంతమే తానిడువడు’ పెట్టాను. ఆ సంకలనంలో ఆ పాట ఉండకూడదని బాలసరస్వతి పట్టుపట్టారు. (తిథి అమావాస్యో, పౌర్ణమో అయివుంటుంది). ఆ పాట లేకపోతే నేను చేయను అన్నాను. అప్పుడు ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఆ తరువాత మరొకతను హెచ్.ఎం.వి. గద్దెనెక్కి, నాకు సంపూర్ణ స్వాతంత్య్రం యిచ్చిన తరువాత ‘అలనాటి అందాలై’ పూచింది. ఇక రజని పుస్తకాలు - ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము’ (1958). దీనితో ఆంధ్రుల సంగీత సాహిత్యాల చరిత్రావగాహన 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దానికి వచ్చింది. ఇప్పటికీ అందులో ఉన్న విషయాలు త్రోసిరాజన్న రచనలు రాలేదు.రజని గేయాలు ‘శతపత్ర సుందరి’ అన్న పేరుతో 1953లో వచ్చాయి. ఖరీదు- మూడు రూపాయలు. అప్పుడూ యిప్పుడూ వెలకట్టే స్తోమత ఉన్న వారి దృష్టిలో దాని విలువ ఒక అలీబాబా గుహ. మరొక పుస్తకం గురించి చెప్పి దీన్ని ముగిస్తాను. నూట యాభై క్షేత్రయ్య పదాలను ఆంగ్లీకరించి ‘మువ్వగోపాల పదావళి’ అన్న పేరుతో, ‘ఆమోర్స్ ఆఫ్ ది డివైన్ కౌహర్డ్ విత్ జింగ్లింగ్ బెల్స్’ అన్న ఉపనామంతో రజని (బి.వి.ఎస్.ఎస్ మణి వదాన్యంతో) 1994లో ప్రచురించారు. ఆ పుస్తకం నాకు ముందుగా పంపి, మద్రాసులో పుస్తకావిష్కరణ సభలో దాని గురించి ప్రసంగించమని ఆదేశించారు రజని. చిన్ననాటి నుంచి దక్షిణదేశపు సానులు సేలం అమ్మాకణ్ణు, ధనకోటి, కోయంబత్తూరు తాయి, తిరువిడైమరుదూర్ భవాని యిచ్చిన రికార్డుల వలన, చిన్నతనాననే ఎదురుగా పాడిన బెంగుళూరు నాగరత్నం, ఆడిన గడ్డిభుక్త సీతారామ్ వలన యివి నాకు ఎరుకే, అభిమానమే, గౌరవమే. అందులో కొన్ని తప్పులు నాకు కనబడ్డాయి. అవన్నీ సభలో ఏకరవు పెట్టాను. ఒక చదువుల పెద్ద నాతో గుసరుసలాడేడు ‘శుభం పలకరాజేజమ్మా అంటే..’ అని. రజని ఏం చేశారో తెలుసా? నా ప్రసంగం అయిన వెంటనే ఆయనంతట ఆయనే మైకు దగ్గరకు వచ్చి ‘రంగారావు చెప్పిన వాటిలో మూడు నా తప్పే. తక్కినవి పరిశీలించాలి’ అన్నారు. సభ చివరలో మళ్లీ పిలవకుండానే మైకు చేత పుచ్చుకొని ‘మరి రెండూ నా తప్పులే’ అన్నారు. నా చేత ఉతికింపించుకొన్న చదువుకొన్న వారు, పేర్ల ముందు పొడి అక్షరాలు తగిలించుకొన్న వారు ఎందరో! అందులో ఎందరిలా ఒప్పుకొనగల ధీరులు! అలా బహిరంగంగా చెప్పుకొని ఒప్పిన మహనీయుడు రజని! ప్రణమామ్యహం! ఆయన పాటలు, సంగీత రూపకాలు కొత్త వారిచే మథింపజేసి, అమృతం పుట్టించే బాధ్యత ఆకాశవాణిది, లలిత సంగీత ప్రియులది, మీదీ, నాదీ!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement