-
తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో ఆయనే!
తొంభై మూడేళ్ల వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని అలరించిన ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో,నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. తెలుగు సినీరంగంలో అక్కినేని ‘ఎక్కని ఎత్తుల్లేవు. వెళ్లలేని దూరాల్లేవు.’ జనన మరణాల మధ్య రెప్పపాటు జీవితకాలంలో, మన చూపు తిప్పుకోకుండా మన నలరించిన ఎందరో మహానుభావుల్లో ప్రముఖులు... తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. నాటక రంగం నుంచి నటరాజు వరప్రసాదమైన ‘అభినయ’ కళ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించి, తొంభై మూడు సంవత్సరాల వయసు వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని అలరించి, తెలుగు హృదయాలలో చిరంజీవిగా కొలువై ఉన్న నటనావతంసుడీయన. పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వంటివి అక్కినేనిని అలంకరించి తమ గౌరవాలను ఇనుమడింప చేసుకున్నాయి. తన కళని తర్వాత తరాలకి కూడా వారసత్వంగా అందించి అక్కినేని నాగార్జున వంటి సూపర్ స్టార్ని, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వంటి స్టార్లని తయారు చేసి ‘అక్కినేని’ జయభేరి తరతరాలుగా నినదించేలా చేయడం సామాన్యమైన విషయం కాదు. 1950 నుంచి 60ల మధ్యలోనే ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే దర్శక, నిర్మాతలు హైదరాబాద్కి వచ్చి తీయా’లని నిర్దేశించ గలిగిన ‘ఖలేజా’ ఉన్న ఏకైక తెలుగు సూపర్ స్టార్ అక్కినేని. 1970ల మధ్య గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో, నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. అదే ‘గుండె ధైర్యం’తో తన తొంభై ఏళ్ల వయసులో ప్రెస్ మీట్ పెట్టి తనకు క్యాన్సర్ సోకిందనీ, మరెంతో కాలం బతకననీ చెప్పగలగడం స్ఫూర్తి దాయకం. పై మూడు సంఘటనలూ, వయసు మారిందే గానీ, ఆయన వన్నె ఏ మాత్రం తగ్గ లేదని నిరూపించాయి. ‘ఆడపిల్లలకి చదువులెందుకు? పెళ్లిళ్లు చేసి ఓ అయ్య చేతిలో పెట్టి పంపెయ్యక’ అనే పాత కాలపు భావజాలం సమాజంలో అధికంగా ఉన్న రోజుల్లో ‘చదువుకున్న అమ్మాయిలు’ అనే టైటిల్తో స్త్రీలకు విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపేలా చిత్రం చేయడం ఆయన ప్రోగ్రెసిన్ థాట్ ప్రాసెస్కి తార్కాణం. ఈనాటి ‘వుమెన్ ఎంపవర్మెంట్’ ట్రెండ్కి బీజం వేసిన సాంఘిక కార్యకర్తల్లో అక్కినేని కూడా ఒకరు. విగ్గు, మేకప్పు లేకుండా ఇంట్లోంచి కాలు కూడా బైటికి కదపలేని కళాకారులకి ఆయన ‘సీతారామయ్య గారి మనవరాలు’ మారుతున్న సినిమా మేకింగ్ విలువలకి ఒక గొప్ప పాఠం. స్టార్ హీరోగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న రోజుల్లో ‘సుడిగుండాలు’ వంటి చిన్న పిల్లల మానసిక సమస్య మీద చిత్రాన్ని నిర్మించి, నటించడం ఆయన సామాజిక బాధ్యతకి, ప్రభావవంతమైన ఆలోచనా పరిణతికి నిదర్శనం. దసరా బుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ఆత్మగౌరవం, అగ్నిపుత్రుడు, సూత్ర ధారులు, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు, దేవదాసు, మాంగల్యబలం, విప్రనారాయణ, సువర్ణ సుందరి, కీలుగుర్రం... ఇలా ఏ జోనర్లో చూసినా తెలుగు సినిమా కీర్తి కిరీటంలో అక్కినేని పాదుకొచ్చిన కలికి తురాళ్లు కనిపిస్తాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి మల్టీ స్టారర్లతో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని ఇతోధికంగా పెంచడం కూడా ఆయన చేసిన కృషిలో ఒక భాగం. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పడం, చలన చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించడం... కొన్ని లక్షలమంది కళాకారుల కలలని సాకారం చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి. ‘‘అక్షరం నేర్చుకోలేదని బాధ ఉంది’’ అని చెప్తూనే, నిరంతర విద్యార్థిగా తెలుగు, తమిళ, హిందీ, ఉర్దూ్ద, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడడం, రాయడం, నేర్చుకుని, ‘అక్కినేని ఆలోచనలు (అ, ఆలు)’ వంటి వచన కవితా సంపుటిని ప్రచురించడం ఆయనలోని క్రమశిక్షణకి, విద్యారంగం పట్ల గౌరవానికి దర్పణం. ముళ్లపూడి వెంకటరమణ గారన్నట్లు–అక్కినేని నాగేశ్వరరావు / ఎక్కని ఎత్తుల్లేవు / వెళ్లలేని దూరాల్లేవు. ఆయన కీర్తి, ప్రభావం, ప్రతిభ ప్రయాణించే కాలంలో మన జీవిత కాలం ఒక చిన్న మజిలీ మాత్రమే. ఆయనే శాశ్వతం. శతమానం భవతి. అక్కినేని అభిమానులకి ఆయన శత సంవత్సర జయంతి శుభాకాంక్షలు. వి.ఎన్. ఆదిత్య వ్యాసకర్త ప్రముఖ సినీ దర్శకుడు (నేటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం) -
ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్
దేడ్ కహానీ - ధూమ్ 2 తెర మీద: ఓ పోలీసాఫీసరు ‘ఎ’ అనే పెద్ద అంతర్రాష్ట్రీయ దొంగని పట్టుకోవడానికి ఓ అమ్మాయిని దొంగగా ప్రవేశపెడతాడు. ఆమె ఆ దొంగని పడేయడానికి, నమ్మించడానికి విపరీతంగా అంగాంగ ప్రదర్శన చేస్తుంది. తనని తాను అర్పించుకుంటుంది. మోతాదు మించి రొమాన్స్ చేస్తుంది. ఆ క్రమంలో ఆ దొంగతో నిజంగానే ప్రేమలో పడిపోతుంది. తెర వెనుక: ఆ పోలీసు పాత్రధారి దొంగగా ప్రవేశపెట్టే అమ్మాయి అతనికి నిజ జీవితంలో కాబోయే భార్య. నిశ్చితార్థం అయ్యి, పెళ్లి జరగబోయే ముందు తీసిన సినిమా. ఆ దొంగ బాలీవుడ్లో మోస్ట్ డిజైరబుల్, హ్యాండ్సమ్ హీరో హృతిక్. ఆ అమ్మాయి భారతీయ సౌందర్యాన్ని ప్రపంచ వేదికపై ప్రశంసించేలా చేసిన సుందరి ఐశ్వర్యారాయ్. ఆ పోలీసాఫీసరు, నిజ జీవితంలో ఆమె కాబోయే భర్త... అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్. ఎంతో ప్రొఫెషనలిజమ్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రల్లో పాత్రధారులు నటించలేరు. ఆ ప్రొఫెషనలిజమే బాలీవుడ్ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానానికి ఎగరేసుకుపోతోంది. పర్సనల్ లైఫ్లో ఎవరు ఎవరికి ఏమైనా కానీ, తెర మీద పాత్ర ఏం చేయాలో, ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇచ్చేయడంలో బాలీవుడ్ని మించిన పరిశ్రమ భారతదేశంలో లేదు. ప్రేక్షకులు కూడా అలాగే ప్రేమిస్తారు ఆ పరిశ్రమని. తెలుగులో ఓ పెద్ద నటుడి కూతురు హీరోయిన్ అవ్వాలంటే అభిమానులు ఒప్పుకోరు. ఆ వంకన ఇంట్లోవాళ్లూ ఒప్పుకోరు. ఫ్యాషన్కి, ప్రతిభకి, క్యారెక్టర్నీ పర్సనల్ ఇమేజ్నీ ముడిపెట్టడం వల్లే దక్షిణాది సినిమా చాలా విషయాల్లో వెనకబడిపోతూ ఉంటుంది (ఇది నా వ్యక్తిగత పరిశీలన మాత్రమే. ఎవరి అభిప్రాయం వాళ్లది. చర్చలకు తావు లేదు). ‘ధూమ్’ మొదటి భాగం హిట్ అయిన ఆనందంలో జాన్ అబ్రహాం పాత్రలో హృతిక్ రోషన్ని పెట్టి, అదే దర్శక నిర్మాతలు సంజయ్ గధ్వీ, ఆదిత్య చోప్రాలు అందించిన ఫక్తు కమర్షియల్ చిత్రం ‘ధూమ్ 2’. ఇది సర్వ రుచుల సమ్మేళనం! ముప్ఫై అయిదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రానికి 150 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంటే హిందీ సినిమా ఎక్కడుంది మిలీనియమ్లో?! హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ల అధర చుంబనాలు, అర్ధనగ్న ప్రదర్శనలతో పాటు తెరమీద నుంచి కళ్లు పక్కకి తిప్పనివ్వని విజువల్స్, థ్రిల్స్, చేజులు, అడుగడుగునా వీడియో గేమ్స్ని మించిపోయిన బ్రెయిన్ గ్రేమ్స్, కాళ్లని క్షణం కూడా కుదురుగా ఉండనివ్వని పాటలు... వెరసి బాగా ఆకలి మీదున్నప్పుడు పెట్టిన బఫే భోజనం ‘ధూమ్ 2’. మొదటి భాగం ‘ధూమ్ మచాలే’ అన్న పాటతో పూర్తవుతుంది. అందులో ఈషా డియోల్ ప్రత్యేక ఆకర్షణ. ఇదే పాటతో ‘ధూమ్ 2’ మొదలవుతుంది. సిక్స్ప్యాక్ బాడీతో హృతిక్ రోషన్ స్ప్రింగ్లా కదులుతూ చేసిన అద్భుతమైన డ్యాన్స్తో ‘ధూమ్ అగైన్’ అంటూ టైటిల్స్ పడుతుండగా పాట! దాన్ని మించి నైరోబీ ఎడారిలో రైలులో ప్రయాణిస్తున్న బ్రిటిష్ రాజ కుటుంబీకుల వద్ద నుంచి వారి కిరీటాన్ని అత్యంత లాఘవంగా ఎత్తుకెళ్లే ఎపిసోడ్తో హీరో హృతిక్ రీ ఇంట్రడక్షన్! ఈ రెండూ ప్రేక్షకుణ్ని సినిమాలోకి లాక్కెళ్లిపోతాయి. తెరకు కళ్లు అప్పగించేలా చేస్తాయి. ఆ తర్వాత సినిమా ముగిసే వరకూ ఆ ఆసక్తి కొనసాగుతుంది. సన్నివేశాన్ని బట్టి హృతిక్ వేసే మారువేషాలు చాలా ఆకట్టుకుంటాయి. జెంటిల్మేన్ చిత్రంలో అర్జున్ పాత్ర చేసే దొంగతనాల మాదిరిగా ఈ చిత్రంలోనూ దొంగతనాలు తీర్చిదిద్దినట్టు ఉంటాయి. మొదటి భాగంలో కథకి, సెంటిమెంట్కి ఈ చిత్రంలో ప్లేస్ లేదు కానీ... సెకెండాఫ్లో హృతిక్, ఐశ్వర్య పాత్రల మధ్య కాస్త సెంటిమెంటును టచ్ చేశారు. ఈ సినిమా కథ చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు. చూడాల్సిందే. అయినా మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇది ఓ దొంగ కథ. అతన్ని పట్టుకోవ డానికి ప్రయత్నించే పోలీసుల కథ. పోలీసుల తరఫున దొంగ దగ్గర చేరి, అతని ప్రేమలో పడి వచ్చిన పని నెరవేర్చలేకపోయిన ఓ అమ్మాయి కథ. సెకెండాఫ్లో బిపాసా బసు మంచి ఆకర్షణ. మొదటి భాగంలో నటించిన రిమీసేన్ కూడా ఇందులో అభిషేక్ భార్యగానే కంటిన్యూ అయ్యింది. రాజేష్ రోషన్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాలు కాకుండా... హృతిక్తో బయటి నిర్మాతలు, దర్శకులు తీసిన చిత్రాల్లో పెద్ద హిట్... ధూమ్ 2 ఒక్కటే. ఈ చిత్రంలో కథ కన్నా స్క్రీన్ప్లే బలం ఎక్కువ. విజయకృష్ణ ఆచార్య ధూమ్కి, ధూమ్ 2కి రచయిత. ‘ధూమ్ 3’కి రచనతో పాటు దర్శకత్వం కూడా చేశాడాయన. హాలీవుడ్ సినిమాల తరహా హైటెక్ దొంగతనాల కథ ఇది. దాన్ని స్కేల్లో నిర్మించే సాహసం చేసిన ఘనత ఆచార్యదే. బ్రెజిల్లో షూటింగ్ జరుపుకున్న తొలి హిందీ చిత్రం ఇది. పెపె జీన్స్, కోకో కోలా సంస్థలు బ్రాండ్ అంబాసిడర్లుగా చిత్రాన్ని ప్రమోట్ చేశాయి. 1800 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని బైక్ రేసులు కుర్రకారును అమితంగా ఆకర్షించేలా ఉన్నాయని, వాటిని తొలగించడం మంచిదని ముంబై కమిషనర్ హై కోర్టులో పిటిషన్ పెట్టారంటే... ఈ చిత్రం యువతనెలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య చోప్రా నిర్మించే అన్ని చిత్రాల్లోనూ ఒక పాత్రలో తప్పనిసరిగా కనిపించే అతని తమ్ముడు ఉదయ్చోప్రా ఇందులోనూ నటించాడు. అభిషేక్ బచ్చన్కి అసిస్టెంట్గా కనిపించి నవ్వించాడు. బిపాసా ద్విపాత్రాభినయం ఓ మంచి ట్విస్టు ఈ చిత్రంలో. హృతిక్, ఐశ్వర్యలిద్దరూ చాలా బరువు తగ్గారట ఆదిత్య చోప్రా సూచనల మేరకు. పాత్రకు తగ్గ షేప్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ లేకపోతే పాత్రధారుల్ని ఆ పాత్రలో పెట్టనని ఆయన ఖరాఖండిగా చెబుతుంటారు. నిర్మాత కథ ఇవ్వడం, మేకింగ్లో తన టీమ్కి కావలసిన స్వేచ్ఛనిస్తూనే... చిత్రం అనుకున్న స్థాయిలో రావడానికి అహర్నిశలూ శ్రమించడం తెలుగు పరిశ్రమలో కూడా ఉంది. ముళ్లపూడి వెంకట రమణగారు నిర్మాత, రచయిత. ఎమ్మెస్ రాజు కథకుడు, నిర్మాత (దర్శకుడు కాకముందు). శ్యామ్ప్రసాద్ రెడ్డి కథకుడు, నిర్మాత. ఆయన తండ్రి ఎమ్మెస్ రెడ్డిగారు అఫీషియల్గా స్క్రీన్ మీద పేరు వేసుకోకపోయినా ఆయన కూడా నిర్మాత, రచయిత. ఇంకా రామా నాయుడుగారు, అశ్వినీదత్, అల్లు అరవింద్, నాగబాబు, సురేష్బాబు, స్రవంతి రవికిశోర్, బూరుగుపల్లి శివరామ కృష్ణ, దిల్రాజు... ఇలా నాకు తెలిసిన కొంతమంది నిర్మాతల చిత్రాల్లోనే టీమ్ వర్క్ కనిపిస్తోంది తప్ప మిగిలిన చిత్రాల్లో కనిపంచట్లేదు. టీమ్ వర్క్ లేని చిత్రాలు ఆడవచ్చు. కానీ ఆడినా ఆడకపోయినా ఆ సినిమాలు ఆ నిర్మాతలను క్యాషియర్లుగానే చూస్తాయి. లేదా క్యాష్ ఈయరు గానే నిరూపిస్తాయి. వేరే వాళ్ల మెదడు మీద బెట్టింగ్ కాయడం పొగరు. అదే తన డబ్బుతో పెట్టుబడి పెట్టి, కొద్దిమందితో కలిసి కష్టపడి చేసి, ఆ ప్రొడక్టుని మార్కెట్లో పెడితే... దానికి దాదాపు ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువ. అయినా మన నిర్మాతలు ఆ కష్టాన్ని ఇష్టపడరెందుకనో! ఆదిత్య చోప్రా విజయవంతమైన దర్శకుడే కాదు... అంతకంటే విజయవంతమైన నిర్మాత అవ్వడానికి కారణం, మన తెలుగు నిర్మాతల బాట పట్టడమే అని నా అభిప్రాయం. అందుకు ఒక సాక్ష్యం.. ధూమ్ 2. ఇంతకుముందు మీకలా అనిపించకపోతే, ఓసారి ఆ సినిమాని మళ్లీ చూడండి. నాతో ఏకీభవించి తీరతారు! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
షేక్స్పియర్ బాహుబలి!
దేడ్ కహానీ - ఓంకార * షేక్స్పియర్ నవలకు చిత్రరూపం. * అవార్డులందుకున్న చిత్రరాజం. * విశాల్ ప్రతిభకు తార్కాణం. ఈవారం సినిమా గురించి రాసేముందు చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పి తీరాలి. 1998, 99 మధ్య ప్రాంతాల్లో ఇందిరా పార్క్ దగ్గరలో నివాసం ఉంటూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండేది శిరీష అనే నా విజయవాడ స్నేహితురాలు. చాలా బాగా చదివేది. అలాగే సినిమాలన్నా, వాటిని చూసి విశ్లేషించడమన్నా తనకు యమా ఇష్టం. ట్రైలర్ చూసి ఆ కథని ఊహిం చెయ్యడం, ట్రైలర్ చూసి ఆ సినిమా ఆడుతుందో లేదో కరెక్ట్గా చెప్పగలగడం ఆమె ప్రత్యేకతలు. తను ఇంగ్లిషు లిటరేచర్ బాగా చదివేది. నేనోసారి అడిగాను... ఇంగ్లిషు సాహిత్యంలో ఇవాళ్టి సినిమాలకి పనికొచ్చే కథలేమన్నా ఉన్నాయా అని. ఒక్కక్షణం కూడా ఆలో చించకుండా టక్కున చెప్పింది షేక్స్పియర్ డ్రామాలున్నాయ్ అని. నాకు కొద్దిగా ఐడియా ఉంది గానీ, అవి అంత మోడరన్ అనిపించలేదెప్పుడూ. తను ఎందుకలా అందో అని, నాకు తెలుగులో ఒక్కో షేక్స్పియర్ డ్రామాని కథలాగ చెప్పమన్నాను. రోజూ సాయంత్రం నాలుగు నుంచి అయిదు మధ్య ఇందిరా పార్కు రోడ్డు మీద, వాళ్లింటి వరండాలో, ఎదురుగా ఉన్న బేకరీలో... రోజుకొక షేక్స్పియర్ డ్రామాని కథలాగ చెప్పేది. ఒకరోజు మాక్బెత్, ఒకరోజు ఒథెల్లో, ఇంకోరోజు హామ్లెట్, ఇంకోరోజు కింగ్లియర్, ఏ మిడ్ సమ్మర్ నైట్స్డ్రీమ్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, మచ్ ఎడో అబౌట్ నథింగ్, యాజ్ యూ లైక్ ఇట్, ట్వెల్త్ నైట్, రోమియో అండ్ జూలియట్, ద ట్రాజెడీ ఆఫ్ జూలియస్ సీజర్ ఇత్యాదివి ఓ పదిహేను రోజుల పాటు ఓపిగ్గా నేరేట్ చేసింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవాళ్టి తరానికి ఆమోదయోగ్యమైన సినిమా అవుతుందని నాకనిపించలేదు ఆ రోజు. అదే తనకి చెప్పి షేక్స్పియర్ కథల చర్చ ఆపేశాను. 1600వ టైమ్లో రాసిన డ్రామా ఇవాళ్టి జీవితంలో ఎలా జరుగుతుందనేది నాకర్థమయ్యేది కాదు. ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవుతాడని! నా ఆలోచన పూర్తిగా తప్పని నిరూపించాడు దర్శకుడు, రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్. బాలీవుడ్లో మిలీనియమ్ సంచలనం అతను. సంగీత దర్శకుడిగా పద్దెనిమిది సినిమాలు చేశాక... ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందాక... బాగా బిజీగా ఉన్న టైములో రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి... మళ్లీ వాటితో పాటు సంగీత దర్శకత్వం తనే చేస్తూ... దర్శకుడిగానూ, సంగీత దర్శకుడి గానూ రెండేసి అవార్డులు అందుకుంటున్న ఈతరం మేధావి విశాల్. పది సినిమాలు తీసి ఆరు నేషనల్ అవార్డ్స్ అందుకున్న దర్శకుడు. షేక్స్పియర్ నాటకాలలో మాక్బెత్ని ‘మక్బూల్’గా, ఒథెల్లోని ‘ఓంకార’గా, హామ్లెట్ని ‘హైదర్’గా రూపొందించి ఈ తరం ప్రేక్షకులకి 1600వ శతాబ్దపు మానవ బంధాల మధ్యనున్న భావో ద్వేగాల రుచి చూపించి సక్సెస్ అయ్యారు విశాల్. షేక్స్పియర్ నాటకాలు చాలా మంది పాఠకులు చదివే ఉంటారు. కానీ చాలామంది ప్రేక్షకులు చదవరు. 1600లోనే ఒథెల్లో నాటకాన్ని ఒక చిన్న కథానిక నుంచి స్ఫూర్తి పొంది రాసినట్టు చెప్పుకొచ్చారు షేక్స్పియర్. 2000 తర్వాత దానిని సినిమాగా స్ఫూర్తి పొందడంలో తప్పేముంది! ఇంకో విశేషం ఏంటంటే, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా మాట్లాడుకుంటున్న మన తెలుగు సినిమా ‘బాహుబలి’... ‘ఓంకార’ చిత్రంలో హీరో అజయ్ దేవ్గన్ పదవి పేరు. మహారాష్ట్రలో ‘భాయి’, తమిళ నాడులో దళపతి, నాయగన్... ఇవన్నీ మాఫియా లేదా రౌడీల బాస్ల సర్వ నామాలు. అలా ఉత్తర్ప్రదేశ్లో బాహు బలి అంటారు ఒక రౌడీ లీడర్ని. ఆ పదవి అజయ్ దేవ్గన్ పోషించిన ఓమీ భాయ్ది. అతనికి ఇద్దరు అనుచరులు... లంగ్డా త్యాగి, కేశు. ఈ ఇద్దరిలో తన తర్వాత ఎవరిని బాహుబలిని చేయాలన్న ప్రశ్న వచ్చినపుడు, అప్పటివరకూ ఓమి తర్వాత స్థానం తనదే అని భావిస్తున్న త్యాగిని కాదని, కేశుని బాహుబలిని చేస్తాడు ఓమి. తనేమో రాజకీయ నాయకుడౌతాడు. దీంతో త్యాగికి కడుపు మండి ఓమి భార్యకి, కేశుకి అక్రమ సంబంధం సృష్టించి... ఓమి చేతనే ఆమె హత్యకు గురయ్యేలా చేస్తాడు. భార్యని చంపేసిన తర్వాత ఓమికి... త్యాగి భార్య ద్వారా నిజం తెలిసి తనను తానే హతమార్చు కుంటాడు. చాలా బరువైన కథ. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన చిత్రం ఇది. ఉత్తర్ప్రదేశ్లోని చిన్న చిన్న టౌన్షిప్స్లో ఉండే వాతావరణాన్ని తీసుకుని చేశారు. డైలాగ్స్ కూడా సినిమా కోసమని సెన్సార్ చేసేయకుండా... సహజంగా రౌడీలు మాట్లాడే బూతులు, యాసతో రాయించుకోవడం వల్ల ఈ సినిమాని కుటుంబ సమేతంగా భారతీయులు అంతగా ఆదరించలేక పోయారు. అయితే సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, విశాల్ భరద్వాజ్, అజయ్ దేవ్గన్లను మాత్రం అవార్డులు వరించాయి. యూరప్ దేశాలలోను, అమెరికాలోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ భాషలోని బూతులు సరిగా అర్థం కాకపోవడం వల్ల అనుకుంటా, నాక్కూడా ఈ సినిమా అంత ఎబ్బెట్టుగా అనిపించలేదు. కానీ హిందీలో మారుమూల గల్లీ భాష అర్థం అయ్యేవాళ్లు మాత్రం ఆడవాళ్లని, పిల్లల్ని చూడద్దని రికమెండ్ చేసేలా ఉంటుందిట స్క్రిప్టు. విజువల్గా ఇది కొంచెం డార్క్ సినిమా. డార్క్ సినిమాల లుక్ని లైక్ చేసే ప్రేక్షకులు వేరు. వాళ్లు ఎక్కువ ఎ సెంటర్ ప్రేక్షకులు. బి, సిలలో సినిమా కళకళలాడుతూ గ్లామరస్గా కనిపించాలి భారతదేశంలో. సైఫ్ అలీఖాన్ పోషించిన లంగ్డా త్యాగి పాత్ర మొదట హీరోకి నమ్మిన బంటులా ఉంటుంది. తర్వాత విలన్లా మారుతుంది. నటనకు చాలా అవకాశ మున్న పాత్ర. ఈ పాత్రని మొదట ఆమిర్ ఖాన్ చేస్తానని ముందుకొచ్చాట్ట. తర్వాత డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో సైఫ్ని వరించింది. గత రెండు వారాలుగా ఈ శీర్షికలో 2006లో విడుదలైన సినిమాల గురించి రాస్తున్నాను. అవి ఫనా, కార్పొరేట్... ఇప్పుడు ఓంకార. విశేషమేమిటంటే... ‘ఫనా’లో చేసిన కాజోల్, ‘కార్పొరేట్’లో చేసిన బిపాషాబసు, ‘ఓంకార’లో చేసిన కరీనాకపూర్... వీళ్లు ముగ్గురూ 2007లో ఉత్తమ నటి అవార్డుకు పోటీపడ్డారు. కరీనా కపూర్ అవార్డును గెలిచింది. ఈ చిత్రంలో త్యాగి భార్యగా నటించిన కొంకణాసేన్శర్మ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. నటీనటుల నటనా పటిమకి ఇంతకన్నా మంచి కొలమానం ఏముంటుంది? పెట్టిన డబ్బుకు మూడింతలు వసూలు చేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు, ప్రశంసకుల విమర్శలు అన్నీ పొంది తనకంటూ ఓ స్థానాన్ని ఈ చిత్రమూ, దీని దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఇద్దరూ ఏర్పరచుకున్నారు. కొత్తగా దర్శకులు అవ్వాలనుకునే చాలామందికి కనువిప్పు కలగాల్సిన అంశం ఏమిటంటే... పాత సాహిత్యంలో భావాలు, పాత్రల ప్రవర్తన, వాటి మధ్య సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) చాలా బలంగా ఉంటాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈతరం జీవనశైలిలో ఆ పాత్రల్ని ప్రవేశపెట్టి, అటువంటి కాన్ఫ్లిక్ట్నే క్రియేట్ చేస్తే ఇప్పుడూ ఆ కథలు కిక్కిస్తాయి. పాత కథ తీయమంటే పీరియడ్ కథలే తీయక్కర్లేదు. ఆ సాహిత్యాన్ని చదవాలి. ఈ కాలానికి వాటి సారాన్ని అప్లయ్ చేసు కోవాలి. అప్పుడు ప్రేక్షకుడు ఆదరిస్తాడు. ఇది హిందీలో కొత్త తరంలో వచ్చిన, అంటే మిలీనియమ్లో దర్శకులైనవాళ్లు ఆచరించి నిరూపిస్తున్న నిజం. తెలుగులో కొత్త దర్శకులు ఎక్కువమంది ఫెయిల్ అవుతుండడానికి కారణం సాహిత్యం మీద అవగాహన లేకపోవడం, సమాజం గురించి అసలేమీ తెలియకపోవడం, కనీసం రోజూ న్యూస్ పేపర్ చదివే అలవాటైనా చాలామందికి లేకపోవడం, పాత్రలు, పాత్ర ప్రవర్తన, చిత్రణ, భావోద్వేగాల కొలతలు తెలియకపోవడం, నాటకాలు, కవితలు, కథలు, నవలలు ఎక్కువగా తెలియకపోవడం, కొరియన్ సినిమాలే జీవితంగా బతికేయడం. విశాల్ భరద్వాజ్ని చూసి సాటి దర్శకులే కాదు, సంగీత దర్శకులు కూడా చాలా నేర్చుకోవాలి. కొత్త పథానికి, పాత భావానికి మధ్య వారధి విశాల్. ఆ రూట్లో ఓంకారం పలికించిన ప్రణవ నాదం విశాల్. పి.ఎస్.: షేక్స్పియర్ నాటకాలు సినిమాలకి బాగా పనికి వస్తాయని చెప్పిన నా స్నేహితురాలు ప్రస్తుతం వాళ్లాయన అనిల్, కూతురితో పాటు బెంగళూరులో సెటిల్ అయ్యారు. తన జడ్జిమెంట్ని మరోసారి అభినందిస్తూ... మళ్లీ వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
యెద యెదలో రగిలిన స్ఫూర్తి
దేడ్ కహానీ - రంగ్ దే బసంతీ ‘‘మరగకపోతే రక్తం కాదది, నీటితో సమానం. దేశానికి పనికిరాకపోతే యువత కాదది, నిర్వీర్యం’’ అని అర్థం వచ్చేలా టైటిల్ పడింది. చాలా అర్థవంత మైన సినిమా చూడబోతున్నానని అర్థం అయ్యింది. గంటా ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకెన్ల దగ్గర వచ్చే ఒక సన్నివేశం - అనూహ్యమైనది. అది రాసిన రచయితలకి, తీసిన దర్శకుడికి, అభిమాని కానివాడు ప్రేక్షకుడే కాడు. భారత స్వాతంత్య్ర సమరయోధుల్ని చంపే బాధ్యతని నిర్వర్తిస్తున్న బ్రిటిషు పోలీసు అధికారి చర్చ్కి వెళ్లి జీసస్ దగ్గర ఏడవడం, తను చంపుతున్న సమర యోధులు చిరునవ్వుతో దేశం కోసం ప్రాణాలని అర్పిస్తుంటే, వారికి అతను అభిమానిగా మారడం... ఒక పక్క పాలకుల ఆజ్ఞ, మరోపక్క మానవ హృదయం - ఈ సంఘర్షణని ఇంత అందంగా చూపించిన సినిమా, ఈ నేపథ్యం ఉన్న కథల్లో ఎక్కడా లేదు. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా దేశభక్తిని హీరోని చేసి పాలకుల్ని విలన్లని చేస్తుంది. అది సాధారణ కాన్ఫ్లిక్ట్. కానీ దేశభక్తికి విధి నిర్వహణకి సమానంగా అంతః సంఘ ర్షణని చూపించడం అసాధారణ కాన్ఫ్లిక్ట్. ఇప్పటివరకూ - స్వాతంత్య్ర పోరాట యోధుల కథలు పూర్తిగా పీరియాడికల్ సినిమాలుగానూ, ఈనాటి యువతరం కథలు పూర్తిగా మోడరన్గానూ అంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు తీస్తూ వచ్చారు. కానీ మొదటి సారి ఆనాటి యువ దేశభక్తులైన హీరోల కథని, ఈనాటి అల్లరి చిల్లరి యువ హీరోల కథని కలిపి ఒకే కథగా అల్లుకో వడం, అందుకు సూత్రధారిగా ఒక బ్రిటిష్ అమ్మాయి పాత్రనే సృష్టించడం... నిజంగా అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచనకి ఫలితమే... ‘రంగ్ దే బసంతి’. దాన్ని నిర్మించి, దర్శకత్వం వహించిన వ్యక్తి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. హీరోగా నటించింది... తన పాత్ర చుట్టూ కథ, కథనాలు పరిభ్రమించాలనుకోకుండా, మంచి కథ, కథనాలతో ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండాలనుకునే ఆమిర్ఖాన్. నాకు తెలిసి... ఇలా ఆలోచించి సినిమాలు ఓకే చేసే హీరో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన ఒక్కరే. ఇలాంటి కథలు చేయడానికి అంగీకరించే పెద్ద హీరోల్ని అభినందించి తీరాలి. ఈ దశాబ్దన్నరలో బాలీవుడ్లో మూసధోరణి పోయి ప్రేక్షకులు ఆదరించేలా మంచి కథలు వస్తున్నాయి. ఈ విషయం ఒక్కో సినిమా వచ్చి వెళ్తున్నప్పటికంటే, ఈ వ్యాసం రాయడం కోసం వరసగా ఆ సినిమాలు మళ్లీ చూస్తున్నప్పుడు బాగా తెలుస్తోంది నాకు. ఇక ‘రంగ్ దే బసంతి’ విషయానికి వద్దాం. న్యూఢిల్లీలో నివాసముంటున్న పంజాబీ కుటుంబంలో పుట్టిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా యురేకా ఫోర్బ్స్ కంపెనీలో వాక్యూమ్ క్లీనర్లు అమ్మేవాడు. తర్వాత ఒక అడ్వర్టయిజింగ్ కంపెనీని పెట్టి కోక్, పెప్సీ, టయోటా, బీపీఎల్ కంపెనీలకి యాడ్స్ తీశాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్తో ‘అభీ బేబీ’ అనే మ్యూజిక్ వీడియో తీశాడు. 2001లో అమితాబ్ ప్రధాన పాత్రలో, మనోజ్ బాజ్పాయ్ సహనటుడిగా ‘అక్స్’ అనే సినిమా తీశాడు. అక్స్ అంటే రిఫ్లెక్షన్. ఈ దర్శకుడు తన ఆలోచనలని తెరమీదకి సరిగా రిఫ్లెక్ట్ చేయలేడు అనిపించింది ‘అక్స్’ చూసి. కానీ అమితాబ్కి అవార్డుల పంట పండింది. అర్థం కాకపోతే అవార్డులెక్కువొస్తాయేమో అనుకున్నాను నా ఇగోని శాటిస్ఫై చేసుకోడానికి. ఆ తర్వాత రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ సినిమాలు తీశాడు మెహ్రా. అంతే... ఫిదా అయిపోయాను అతడి టాలెంట్కి. తను రిటైరైపోయినా ఈ రెండు సినిమాలూ చాలు తనని తరతరాలు గుర్తు పెట్టుకోడానికి. నేను, నాలాంటి చాలామంది దర్శకులు జీవితాంతం టైర్ అవుతూనే ఉండాలి తన సినిమాల స్థాయిని అందుకోడానికి. అందుకే ‘భాగ్ మిల్కా భాగ్’ చూసిన తర్వాత నా ఫేస్బుక్లో పెట్టాను- ‘‘సిగ్గేస్తోంది, దర్శకుడైన పదేళ్లలో ఇలాంటి సినిమా ఒక్కటి కూడా ఇంకా తీయనందుకు’’ అని. దటీజ్ ఓం ప్రకాష్ మెహ్రా. మళ్లీ రంగ్ దే బసంతి విషయానికి వద్దాం. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో బ్రిటిష్ జనరల్గా ఇండియాలో పనిచేసిన మెకిన్లే మనవరాలు, స్యూ మెకిన్లే బ్రిటన్ టెలివిజన్ చానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పని చేస్తూ ఉంటుంది. తాతగారు రాసుకున్న డైరీ చదివితే అందులో భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహామహుల బలిదానాలు, వాటి పర్యవసానాలు ఉంటాయి. దానిని ఫిల్మ్ చేసి, ఆ కథల్ని ప్రజలకి చూపించాలని ఆశ పడుతుంది. చానల్ ఓనర్ని అడిగితే, అవి బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ రిజెక్ట్ చేస్తుంది. దాంతో ఎలాగైనా తన తాతగారి డైరీ కథల్ని సినిమాగా తెరకెక్కిస్తానని చాలెంజ్ చేసి ఢిల్లీ వస్తుంది స్యూ. అక్కడ తన ఫ్రెండ్ సోనియాని (సోహా అలీ ఖాన్) కలుస్తుంది. సోనియా ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతుంటుంది. ఆమె స్నేహితులు డీజే, కరణ్, అస్లమ్ఖాన్, సుఖీరామ్... నలుగురూ పరమ అల్లరి మూక. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే ఆధునిక మెట్రో నగరాల యువతలాగ ఉంటారు. వీళ్ల స్నేహితుడు అజయ్సింగ్ రాథోడ్ ఆర్మీలో యుద్ధ విమానాల పైలట్. అతి కష్టమ్మీద తన భారత స్వాతంత్య్ర సమర వీరుల కథలో ముఖ్య పాత్రలకి ఈ అయిదుగురినీ ఒప్పిస్తుంది స్యూ. కానీ వాళ్లకి దేశమంటే లెక్కలేదు. నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం లేదు. రేపు ఎలా ఉండాలో అన్న ఆలోచన లేదు. ఈరోజు బావుంటే చాలు... అంతే. అలాంటి వారిని నెమ్మదిగా దేశభక్తుల, అమరవీరుల పాత్రలు, ఆలోచనలు కొంచెం కొంచెం ప్రభావితం చేస్తాయి. వాళ్లెందుకు ప్రాణ త్యాగం చేసి చిరునవ్వుతో దేశం కోసం చనిపోయారు అన్న ఆలోచన నుంచి... మనం దేశం కోసం ఎలా బతకాలి అని ఆలోచించే స్థాయికి చేరుకుంటారు. అవినీతితో ఆవిరైపోయిన నీతిని సమాజంలో నింపడానికి కంకణం కట్టుకుంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ల స్నేహితుడు అజయ్ మిగ్-21 యుద్ధ విమానం నడుపుతూ మరణించడం వాళ్లని కుంగదీస్తుంది. గత పదిహేను సంవత్సరాలలో 206 మిగ్ యుద్ధ విమానాలు కూలిపోయాయి, 78 మంది ఆర్మీ పైలట్లు అసువులు బాశారు, 1964 నుంచి మన దేశం వాడుతున్న మిగ్ విమానాల పనిముట్ల దిగుమతిలో జరుగుతున్న స్కామ్... ఈ విమానాలు నాసిరకంగా తయారై మన సైనికుల ప్రాణాలు పోవడానికి కారణం అని తెలుసుకున్న ఈ నలుగులూ తమ స్నేహితుడి మృతికి కారణమైన రక్షణ మంత్రిని చంపేస్తారు. తీవ్ర వాదులుగా ముద్రపడతారు. చివరికి ఆకాశవాణిలో నిజాన్ని నేరుగా ప్రజలకి వివరిస్తారు. అయినా పోలీసుల చేతిలో హతమౌతారు. పరాయివాడి పాలన కోసం అసువులు బాసిన వీరులలాగే చిరునవ్వులు చిందిస్తూ, వారి పాత్రలు తమలో నింపిన స్ఫూర్తిని మొత్తం యువతరానికి రేడియో ద్వారా పంచుతూ, స్వ పరిపాలనలో అవినీతి రాజకీయ నాయకుల రాక్షస ఘాతానికి బలై పోతారు. ఇది కథా? ఒక సినిమా కథా? కాదు... జీవితం. ఇది వాస్తవం. వ్యవస్థలో చెడుని మనం కూకటివేళ్లతో సహా పెకలించి మార్పును తేలేం. కానీ మనం మారడం ద్వారా వ్యవస్థలో మార్పు దానంతట అదే వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపు. రేపు కాకపోతే ఎల్లుండి. మారాలన్న ఆలోచన మనకి ఉండాలి. అంతే. బాధ్యతారాహిత్యంగా ఉన్న యువతకి దిశానిర్దేశం చేసేవాడు వట్టి సినిమా దర్శకుడు మాత్రమే కాడు. సమాజానికి దార్శనికుడు కూడా. రాజ్కుమార్ హిరానీ తర్వాత ఆ కోవలోకి వచ్చే రెండో వ్యక్తి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా అని కచ్చితంగా చెప్పొచ్చు. అతుల్ కులకర్ణి, సిద్ధార్థ, అతిథి పాత్రలో మాధవన్ చాలా బాగా నటించి మెప్పించారు. ఎ.ఆర్.రెహమాన్ పాటలు అత్యద్భుతం. నిజానికి ఆస్కార్కి రెండు ట్రాక్స్ నామినేట్ అయ్యాయి కూడా. ఇవన్నీ ఏమో కానీ, నేను మాత్రం వీలు చూసుకుని రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దగ్గరకెళ్లాలి అని నిర్ణయించుకున్నా. సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడానికి కాదు. అది నాకూ కాస్తో కూస్తో వచ్చు. అయినా వెళ్లాలను కుంటున్నాను. దేనికో తెలుసా? ఒక సినిమాని ఎలా ఊహించాలో, మనకొచ్చే కొన్ని వందల థాట్స్లో ఏ థాట్ని సినిమాగా మలచాలో, ఒక దర్శకుడు ఒక వస్తువులో మంచి కథ ఉందని ఎలా గ్రహి స్తాడో, అలాంటి కథని ఎలా ఎంచు కుంటాడో నేర్చు కోవడానికి. వచ్చే వారం మరో మంచి సినిమాతో కలుద్దాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
కనులు చూడలేని ప్రపంచం
దేడ్ కహానీ - బ్లాక్ ‘‘కళ్లున్న ప్రతి వాళ్లూ కలలు కంటారు-’’ అని టీచర్ క్లాసులో పాఠం చెబుతోంది. విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు. అంతలో హా అని ఒక గర్జనతో కూడిన అరుపు వినిపించింది. మిచెల్ అనే అంధ విద్యార్థిని. మతిస్థిమితం, వినికిడి శక్తి కూడా సరిగాలేని ఆమెని మనిషిగా మలచిన టీచర్ దేవరాజ్ సహాయ్ ఆమెకి ట్రాన్స్లేటర్గా క్లాస్రూమ్లో పక్కనే కూర్చుని ఉన్నాడు. సహాయ్ వల్లే మిచెల్ అందరు పిల్లల్తోపాటు గ్రాడ్యుయేషన్ వరకూ వచ్చింది. ‘నో’ అని అర్థం వచ్చేలా ఆమె అరిచిన అరుపుకి పాఠం చెప్తున్న టీచరు, వింటున్న పిల్లలు, పక్కనే కూర్చున్న సహాయ్ అందరూ ఉలిక్కిపడి ఆమెవైపు చూశారు. మిచెల్, సహాయ్ చేయి పట్టుకుని ఏదో సంజ్ఞ చేసింది. సహాయ్ టీచర్తో ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు. ‘‘మీరు చెప్పిన విషయంతో నేను ఏకీభవించను అంటోంది టీచర్’’. టీచర్ మిచెల్ని నించోమంది. తన అభ్యంతరం ఏమిటో చెప్పమంది. మిచెల్ ఆంగికంతో అభినయం చేస్తుంటే సహాయ్ వాచికంతో చెప్పాడు - ‘‘కళ్లున్నవాళ్లు మాత్రమే కలలు కంటారన్నది తప్పు. కళ్లున్నవాళ్లు బయటి ప్రపంచాన్ని మాత్రమే చూస్తారు. కానీ, మనసున్నవాళ్లు లోపల మరో ప్రపంచాన్ని చూస్తారు. కలల్ని మనసుతో మాత్రమే చూడగలం. కళ్లు మూసుకున్నాకే మనసు తలుపులు తెరుచుకుని కలలు బైటకొస్తాయి. నాకు కళ్లు లేవు. కానీ నేను రోజూ కలలు కంటాను. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడతాను’’ అంది మిచెల్. టీచర్తో సహా అందరూ చప్పట్లు కొట్టారు - ఆ సన్నివేశాన్ని థియేటర్లో చూస్తున్న ప్రేక్షకులతో సహా. ఒక పెద్ద బంగ్లా. మిచెల్ చెల్లెలి నిశ్చి తార్థం. పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, మిచెల్, ఆమె చెల్లెలు, వాళ్ల తల్లిదండ్రులు, మిచెల్ ట్రాన్స్లేటర్ కమ్ టీచర్ సహాయ్.. అందరూ భోజనాలకి కూర్చున్నారు. మిచెల్ చెల్లెలు అందరినీ ఉద్దేశించి మాట్లా డటం ప్రారంభించింది. నాకీ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి. చాలా ఏళ్లుగా చెప్పుకోలేని విషయాలున్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఆరేళ్ల వయసున్నప్పుడు నేను, మిచెల్ ఆడు కుంటూ పరుగెత్తాం. ఇద్దరం కిందపడ్డాం. ఇద్దరమూ ఏడ్చాం. అమ్మ, నాన్న ఇద్దరూ కంగారుగా గార్డెన్లోకి వచ్చారు. మిచెల్ని ఎత్తుకున్నారు. ఊరడిస్తూ లోపలికి తీసు కెళ్లారు. నాకూ దెబ్బతగిలింది. ఎత్తుకో మని చేతులు చాపి ఏడుస్తున్నాను. కానీ ఎత్తుకోలేదు ఆ దెబ్బ ఇంకా మానలేదు. ఇవాళ్టికీ అలాగే ఉంది. నేనూ చేతులు జాపి హత్తుకోమని అలాగే ఉన్నాను. ఇప్పటికీ అమ్మ, నాన్న మిచెల్ని కంటికి రెప్పలా చూస్తూనే ఉన్నారు. అన్నీ సవ్యంగా ఉండి, అందంగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. అమ్మానాన్నల ప్రేమను అక్క మిచెల్ మాత్రమే పొందింది. అది అదృష్టవంతురాలు. తల్లి దండ్రుల ప్రేమకి నోచు కోని నేను నిజ మైన వికలాంగురాలిని’’ - ఈ ప్రసంగం మొత్తాన్నీ సహాయ్ సంజ్ఞల ద్వారా మిచెల్కి అనువదిస్తూనే ఉన్నాడు. ఆమెలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. చెల్లెల్ని తనెంత ప్రేమించిందో ఆమె రాసుకున్న ప్రసంగాన్ని సహాయ్కిచ్చింది. అతను చదివి వినిపించాడు. చుట్టూ ఉన్న పాత్ర లన్నీ, నిందించిన చెల్లెలితో సహా కన్నీళ్లు పెట్టుకున్నాయి - ఈ దృశ్యం చూస్తున్న మనలాంటి ప్రేక్షకులతో సహా. అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు చూసి చెప్పమన్నారు. నేను రెండు మెతుకులు శాంపిల్ చూపించాను. ఉడికిందా? మనసు తడిసిందా? కడుపు నిండా, గుండె నిండా ఆ అనుభూతిని అనుభవించాలని ఉందా? అయితే సంజయ్లీలా భన్సాలీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘బ్లాక్’ చిత్రం చూసెయ్యాల్సిందే. 2005లో విడుదలైన ఈ చిత్రం ‘ఎ’ సెంటర్లలో కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, 2 నేషనల్ అవార్డులు, 11 ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుని రికార్డులు సృష్టించింది. మానసిక అపరిపక్వత, అంగవైకల్యం జీవితంలో ఎదగడానికో, అనుకున్నది సాధించడానికో అవరోధాలు కాదు అని నమ్మిన సహాయ్ (అమితాబ్), మిచెల్ అనే చిన్న పాపకి ట్యూటర్గా చేరతాడు. ఆమె కన్నుల్లో అంధకారాన్ని ఏమీ చేయలేకపోయినా, లోపలున్న అంధకారాన్ని తొలగించి, ఆత్మజ్యోతిని అతడు వెలి గించడమే ఇతివృత్తం. అసహనం, చిరాకు కలగలిసిన ఓ తాగుబోతు సహాయ్. మిచెల్ (రాణీముఖర్జీ)ని ఆమె కుటుంబ సభ్యులు, సభ్యసమాజం ఒక విక లాంగురాలిగా, మతిస్థిమితం లేని దానిగా సానుభూతితో చూడకుండా, ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్ లా చూడాలని తాపత్రయపడటం, అతని సహాయంతో మిచెల్ తన వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ఎదిగిన వైనం చూసి తీరాల్సిందే. అంధురాలిగా రాణీముఖర్జీ, ఆమె ఉన్నతికై తాపత్రయపడే సహాయ్గా అమితాబ్ బచ్చన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటాయి. నిజానికి రాణీముఖర్జీ ప్రొఫెషనల్ అండ్ సీజన్డ్ ఆర్టిస్ట్. ఆమె బాగా చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్ననాటి మిచెల్గా నటించిన బాలనటి ఆయేషా కపూర్ కూడా రాణీ అంత బాగా చేయడం విశేషం. ఆ పాత్ర తాలూకు స్వరూప స్వభావాలని ముందు చిన్ననాటి పాత్రయే ప్రేక్షకులకి రుచి చూపిస్తుంది కాబట్టి ఆమె రాణించడం పెద్ద సవాలు. ఆ సవాలును స్వీకరించి చక్కగా సక్సెస్ సాధించింది ఆయేషా కపూర్. అలా ఆమెకి రెండు మార్కులు ఎక్కువే వేయొచ్చు. అయితే వీళ్లందరితో ఇంత బాగా చేయించిన ఘనత మాత్రం దర్శకుడు సంజయ్లీలా భన్సాలీదే. ఆయన ఈ చిత్రాన్ని మలిచిన తీరు అమోఘం! ఈ చిత్రంలోనే కాదు... చిత్ర నిర్మాణం వెనుక కూడా కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని... పాత్ర చాలా చాలెంజింగ్గా ఉంది కాబట్టి దానికి న్యాయం చేయగలనో లేదో అని రాణీముఖర్జీ ఈ పాత్రని ఒప్పుకోవ డానికి మొదట చాలా తటపటా యించిందట. ఈ చిత్రానికి ముందు ఎ.ఆర్.రెహ్మాన్ని సంగీత దర్శకుడిగా అనుకున్నారట. కానీ ఆ సమయానికి ఆయనకి ఖాళీ లేక మాంటీశర్మని ఫిక్స్ అయ్యారట. ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ (రిషికపూర్ కొడుకు), ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్కపూర్ (అనిల్కపూర్ కూతురు) ఇద్దరూ ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయ దర్శకులుగా పనిచేశార్ట. హెలెన్ కెల్లెర్ ఆత్మకథని చదివి, ఆమె ఇన్స్టిట్యూట్కి వెళ్లి ఇంకొంత రీసెర్చ్ చేసి సంజయ్లీలా భన్సాలీ ఈ కథని తయారుచేసుకున్నాట్ట. 2013లో టర్కీ భాషలో ‘బెనిమ్ డున్యమ్’ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇలాంటి ఎన్ని విశేషాలు ఉన్నా... ఈ చిత్రం ద్వారా భన్సాలీ ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం తర్వాతే ఏదయినా. మానసి కంగా అయినా, శారీరకంగా అయినా వైకల్యాన్ని జయిస్తే కైవల్యం సిద్ధిస్తుందన్న వాస్తవాన్ని అందమైన దృశ్య రూపంలో చూపించిన ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement