-
టూకీగా ప్రపంచ చరిత్ర
సృష్టిలోని సంఘటనల గురించే తప్ప, ‘సృష్టికర్త’ను గురించి తలబాదుకునే ప్రయాసకు చైనీయులు పూనుకోలేదు. సృష్టిని గురించి క్రీ.పూ. 3000 నాటి నుండో అంతకు పూర్వం నుండో కలిగిన ఆలోచనల్లో బాగా ప్రచారంలో ఉండే సిద్ధాంతం కుప్లంగా - ‘‘ఆకాశమూ భూమీ అనే రూపాలు ఏర్పడక ముందు సర్వం నిరాకారంగా, అస్పష్టంగా ఉండేది. అందువల్ల ఆ స్థితిని అనంతమైన ప్రారంభంగా స్వీకరిస్తాం. ఆ అనంత ప్రారంభం నుండి శూన్యం జనించింది. ఆ శూన్యం నుండి విశ్వం ఏర్పడింది. విశ్వం నుండి అన్నిటికీ అధారభూతమైన ‘శక్తి’ కొన్ని పరిమితులకు లోబడి జనించింది. స్పష్టంగా, తేలిగ్గా ఉండేది పైకి తేలి అంతరిక్షం అయింది. చిక్కగా బరువుగా ఉండేది గట్టిపడి భూమిగా ఏర్పడింది. భూమి అంతరిక్షాల సారమే ‘ఎన్, యాంగ్’లు. ఈ రెంటినీ వేరు చేస్తూ మధ్యగా నిలుచున్న శక్తి ‘పాన్ గు’. అతని కాళ్ళు భూమి మీద నిలదొక్కుకున్నాయి. అతని తలమీద ఆకాశం నిలబడింది.’’ ఇందులో గమనించవలసింది ఏమంటే - పాన్ గు సృష్టికర్త కాడు. అనంత ప్రారంభానికి ఒక ప్రతినిధి మాత్రమే. ఇందుకు కొంత భిన్నమైంది రెండవ సిద్ధాంతం. దాని ప్రకారం - ‘‘ఒక తండ్రి, అతని భార్య, నలుగురు సంతానం గల ఒక కుటుంబం ఈ విశ్వాన్ని ఉరువుల ప్రాతిపదికన (ఐటెమ్ వైజ్) విడదీసి, ఆయా స్థానాల్లో నిలబెట్టారు. వాళ్లు ఆ పదార్థాలను చలనంలో పెట్టారు; కాలాన్ని విభజించారు; ఆకాశాన్నీ భూమినీ వేరుచేశారు; పర్వతాలకూ, నదులకూ నామకరణం చేశారు.’’ మూడవది - ‘‘మొదట అంతా చీకటి. సూర్యచంద్రులు పుట్టలేదు. నలుగురు దేవతల వల్ల పర్వతాలూ నదులూ తెలిసేంత వెలుగు ప్రసరించింది. ఆ నలుగురు దేవతలు రుతువులు. మరోసారి దేవతలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. సూర్యుడూ చంద్రుడూ వెలిశారు. దేవతలు ఆకాశాన్ని పైకి లేపారు. దాన్ని పట్టుకునేందుకు ఐదు పోట్లను ఏర్పాటుచేశారు. ఆ పోట్లే ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు, తెలుపు, నలుపు రంగులు. ఆ ఐదుపోట్లే పంచభూతాల పరిణామం.’’ భూమ్యాకాశాలను వేరు చేసి, వాటి మధ్య అనధికారిక ప్రయాణాలను నియంత్రించిన ఘనత ఒక పౌరాణిక చక్రవర్తికి ఆపాదించేది నాల్గవ సిద్ధాంతం. మొత్తంమీద, చైనా పౌరాణిక ప్రతిపాదనల్లో తేడా ఎంతున్నా, కొన్నిట్లో దేవతలకు స్థానం దొరికినా, ఏవొక్క తత్వంలోనూ ‘సృష్టికర్త’కు తావు దొరకలేదు. క్రీ.పూ. 5వ శతాబ్దంలో పుట్టి, బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించిన ‘కన్ఫూసియన్’ సిద్దాంతం సామాజిక ప్రవర్తనకు ప్రాధాన్యత ఇచ్చిందేగానీ, జన్మలూ పునర్జన్మలూ దేవతల వంటి విషయాలను తాకదు. క్రీ.పూ. 3 నుండి క్రీ.శ. 1 దాకా కన్ఫూసియన్ సిద్ధాంతానికి భిన్నంగా సాగిన ‘టావోయిజం’లో వేరు చేసేందుకు వీలుగానంత ముద్దగా పితరులూ, దేవతలూ, దయ్యాల రాసి ఏర్పడింది. కారణం ఏదైనా, క్రీ.శ. 800ల్లో బౌద్ధం ప్రవేశించేదాకా చైనాలో ఆలయాలు అరుదు. ఆ దేశంలో ఇప్పటికి వెలుగుజూసిన దేవాలయాలు రెండే రెండు. మొదటిది క్రీ.పూ. 1600 ప్రాంతంలో ‘షాంగ్ వంశం’నాటి ‘టాయ్జోంగ్’ ఆలయం. రెండవది క్రీ.పూ. 206దిగా గుర్తించబడిన ‘హన్ వంశం’ నాటి ‘టియాన్’ ఆలయం. క్రీ.పూ. 8వ శతాబ్దం పరిసరాల్లో బౌద్ధమతం చైనాలో ప్రవేసించి, అనతికాలంలోనే చైనా మొత్తాన్ని దావానలంలా కబళించింది. ‘సృష్టికర్త’ను ఖాతరు చెయ్యని తన పురాతన తాత్విక నేపథ్యానికి అతి చేరువగా ఉన్న కొత్త సిద్ధాంతం కావడం వల్లనేమో, చైనీయులు బౌద్ధమతాన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర - 65
ఆచారాలు-నమ్మకాలు అతని గుహాచిత్రాల విషయానికొస్తే - రాతియుగం చివరి దశకి చెందిన చిత్రాల్లో గూడా కేవలం తనకు ఇష్టమైన వేట జంతువులే కనిపిస్తాయి తప్ప, చెట్లూ గుట్టలూ, కొండలూ వాగులూ, సూర్యుడూ చంద్రుడూ వంటి చిత్రీకరణ కనిపించదు. కనీసం తనకు భయాన్ని కలిగించే క్రూర జంతువుల బొమ్మలైనా కనిపించవు. చెట్లూ గుట్టలవంటి జడ పదార్థాలుగానీ, సూర్యుడూ చంద్రుడూ వంటి ప్రకృతి శక్తులు గానీ అతనికి సర్వసాధారణమైన దృశ్యాలే తప్ప, తన ప్రయోజనానికి ఏ మాత్రం పనికొచ్చేవి కావని అతని భావన. అతని కుండేది కడుపు నింపుకోవాలనే ఆశ, తనను తాను కాపాడుకునే ఉపాయం. గుహల చీకట్లలో బొమ్మ వేస్తే, అలాంటి జంతువు తనకు వేటగా దొరుకుతుందని అతడి నమ్మకం. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. కాలక్రమేణా ఆశతో ‘భయం’ జతగట్టి, నమ్మకమనేది ఆశలూ భయాల సమ్మేళనంగా రూపొందింది. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. ‘భయం’ అనేది ఎప్పుడు పుట్టుకొచ్చింది? పాత రాతియుగం మానవునికి భయమనేది లేదా? - ఎందుకులేదు; తప్పకుండా ఉంది. ఒకసారి వలను తప్పించుకున్న పిట్టలు మరోసారి ఆ ప్రదేశంలో వాలవు. ఒకసారి ఉచ్చులు తప్పించుకున్న జంతువు తిరిగి ఆ తావుకు వెళ్ళక తప్పనప్పుడు జంకుతుంది. బెదురు అనేది పక్షుల్లో, పశువుల్లోనే తెలుస్తూంటే, మరి మనిషికి అది ఉండదని ఎలా అనుకోగలం? జోగాడే పాప మెట్లమీదికి చకచకా పాకిపోతుంది. దిగే వాటం తెలిసిందాకా దిగటానికి జింక కెవ్వున ఏడుస్తుంది. మేధోపరంగా పక్షులూ, పశువులూ, పసికూనల కంటే ఎదిగిన ఆ మానవునికి భయం ఎందుకుండదు? క్రూరజంతువులంటే భయం; పాము కాటేస్తుందని భయం; అలవిగానంత పెద్దదిగావుండే ఏనుగు నలగదొక్కుతుందనే భయం - ఇలాంటి ఎన్నెనో భయాలు ఉండేవుంటాయి. కానీ, భయానికి కారణమైన జంతువులేవీ అతని చిత్రాల్లో కనిపించవు. అలాంటి ప్రమాదాలు తనకు ఎదురవ్వాలని అతని కోరిక కాకపోవడంతో చిత్రించేందుకు సమ్మతిపడి ఉండకపోవచ్చు; లేదా, చెట్టూ గుట్టలూ తదితర నిరుపయోగమైన దృశ్యాలకు మల్లే, ప్రమాదాలను గూడా సర్వసాధారణమైనవిగా భావించాడో ఏమో! కాలక్రమేణా వేటాడే పరికరాల్లో నాణ్యత, వైవిధ్యం పెరిగింది. వేటాడే పద్ధతులూ, నైపుణ్యం పెరిగింది. పెద్దపెద్ద జంతువులను వేటాడే సమయంలో వేటగాళ్ళ గుంపుకు దిశానిర్దేశం ఇచ్చేందుకు తగినంత అనుభవం సంపాదించిన నాయకత్వం అవసరమయింది. మేధోసంపత్తిలో వ్యక్తికీ వ్యక్తికీ మధ్య పెద్దగా తారతమ్యం ఏర్పడని కాలంలో ఆ నాయకత్వం సహజంగా వయసులో పెద్దవాడైన వ్యక్తికి దక్కుతుంది. ఇంటాబయటా ఆ గుంపు కొన్ని కట్టుబాట్లతో నడుచుకునేలా అదుపు చేసే బాధ్యత కూడా అతని భుజానికే ఎత్తుంటారు. దానివల్ల, ఆ పెద్దమనిషి పట్ల ప్రత్యేకమైన గౌరవం ఏర్పడి వుండక తప్పదు. అతనికి వేటలో పాల్గొనే శక్తి ఉడిగినా, సలహాలూ హెచ్చరికల రూపంలో అతని అనుభవం గుంపుకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు, అతని స్థానం ఎప్పటిలాగే కొనసాగక తప్పదు. భాషకు విస్తృతి పెరగడం వల్ల, అతని విశ్రాంతి సమయం పిల్లలకు వేట అనుభవాన్ని మాటల ద్వారానూ ఆటల ద్వారానూ నేర్పించే కాలక్షేపంతో, ఆ వృద్ధుడు గురువుగా పరిణమించాడు. పితామహుడు, నాయకుడు, గురువు స్థానాలన్నిటికీ ఒకడే కావటంతో, తదుపరి కాలంలో ఆ స్థానానికి ఒక హోదా ఏర్పడి ఉండాలి. అతనికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఆచారాల పేరుకు రెండవ వాయి కూర్పుగా చేరుండాలి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర - 64
ఆచారాలు-నమ్మకాలు ‘శవసంస్కారం’ ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. మొదటిది శవాన్ని చెట్టుమీదికి చేర్చడం. మహాభారతం విరాటపర్వంలోని ‘శమీవృక్ష సంఘటన’ ద్వారా ఇలాంటి పద్ధతి ఒకటుండేదని మనకు తెలుస్తుంది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతుందని వినికిడి. నేలను తవ్వేందుకు తగిన సాధనాలు లేకనో, తవ్వకానికి ఆ నేల అనుకూలించకనో ఈ ఆచారం ఏర్పడి వుండొచ్చు. రెండవది, ఆర్య సంతతి అనుసరించే శవదహనం. లోతైన గోతిని తొలిచే అవకాశం లేక, లోతు తక్కువైన గోతిలో పాతిపెడితే, పై మట్టిని కుక్కలూ నక్కలూ తేలిగ్గా తొలగించి, శవాన్ని పూర్తిగానో ముక్కలుముక్కలుగానో ఎత్తుకొచ్చి కొరుకుతున్న బీభత్సానికి తీవ్రమైన ప్రతీకారంగా శవాన్ని దహించటానికి చేసుకున్న నిర్ణయంతో ఈ పద్ధతి ఉనికిలోకి వచ్చి వుండొచ్చు. ఇక మూడవది, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా అనుసరించే శవఖననం. అంటే, నక్కల వంటి జంతువులకు తోడే ఆస్కారం లేనంత లోతుగా శవాన్ని పాతిపెట్టడం. ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ‘శవసంస్కారం’లో పై మూడు పద్ధతులే కాక, మరో విచిత్రమైన పద్ధతి కూడా భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి తక్కువ సంఖ్యాకులైన పారసీలు లేదా పారసీకులు ఇప్పటికీ ఆచరిస్తున్న పద్ధతి. వీళ్ళు పూనా, బొంబాయి నగరాల్లోనూ, వాటి పరిససరాల్లోనూ నివసిస్తున్నారు. ప్రార్థనా సంబంధమైన కార్యక్రమాల్లో వాళ్ళు ఉచ్చరించే మంత్రాలు అవెస్టాలోనికి కావడం వల్ల, వీళ్ళను ఒకనాటి జొరాస్ట్రియన్లుగా భావించొచ్చు. శవాన్ని ఎత్తై భవనం పైకప్పుకు చేర్చి, దాన్ని రాబందులకు ఆహారం అయ్యేలు వదిలెయ్యడం వీళ్ళ ఆచారం. చనిపోయిన తరువాత గూడా తన శరీరం ఏదోవొక ప్రాణికి ఉపయోగపడాలన్న సంకల్పం ఇందులో కనిపిస్తుంది. తీవ్రమైన ప్రతీకార ధోరణిగా కనిపించే ఆర్యుల ‘దహన’ పద్ధతికి సంపూర్ణమైన విరుద్ధదృవంగా కనిపించేది పారసీల పద్ధతి. మొత్తంమీద, పద్ధతి ఏదైనా, శవసంస్కారమనే ఆచారం మూలంగా మానవుడు జంతువు నుండి సంపూర్ణంగా వేరుపడి, తన స్థాయిని ఎన్నో అంతస్తులు పెంచుకున్నాడు. ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనుసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ఆచారాలూ నమ్మకాలూ కలగాపులగంగా పెన వేసుకున్న దశలో జీవిస్తున్న మనకు వాటిలో ఒకదాన్నుండి మరొకదాన్ని విడదీయడం సులభం కాకపోయినా, చరిత్రలో మానవుని తొలిమెట్టుకు వెనుదిరిగితే వాటి విడివిడి పునాదులు స్పష్టంగా గోచరిస్తాయి. గరిష్టమైన స్థాయికి ఎదిగిన మెదడుకన్నా, దాని సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే అవసరం ఆ మానవునికి కలుగలేదు. ‘ఇదిగో జింక - దీన్ని పడగొట్టడం ఎలా ? అదిగో ఉడుత - దాన్ని పట్టుకోవడం ఎలా?’ వంటి తక్షణ ప్రయోజనాలూ, ‘అది కీకారణ్యం. అందులో క్రూరమృగాలుండొచ్చు; ఇది చిక్కటి పొద. ఇందులో పాము దాక్కోనుండొచ్చు’ వంటి జాగ్రత్తలకు మాత్రమే అతని ఆలోచన పరిమితం. ఐనా, అతనికి జ్ఞాపకాలూ, కలలూ ఉండేవని అతడు ఆచరించిన శవసంస్కారం, అతడు వేసిన గుహాచిత్రాలు నిరూపిస్తున్నాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర - 63
ఆచారాలు-నమ్మకాలు సింహం కలలోకొచ్చిన ఏనుగు, తిరిగి మెలకువలోకి రాకుండా, అదే నిద్రలో చనిపోతుందనేది ఒక నమ్మకం. ఏనుగు కాదుకదా, మాటలొచ్చిన మనిషైనా నిద్రలో హఠాత్తుగా చనిపోతే, తను ఏ కల కారణంగా అంతటి అవాంతరానికి గురయ్యాడో చెప్పుకోలేడు. పైగా, జంతువులకు కలలుగనే స్థోమత ఉందో లేదో మనకు తెలీదు. కలలు కనాలంటే అనేక సోపానాలుగా పనిచేయగల స్థాయికి మెదడు ఎదిగుండాలి. మైకంలోకి జారిపోయిన మనిషికి ‘ఉలుకూ లేదు, పలుకూ లేదు’ అంటుంటాం. పలుకు అనేది స్పృహలో ఉంటే తప్ప జరగని చర్య. ఉలుకు అంటే అసంకల్పిత చర్య. బాగా నిద్రలో వున్న మనిషికి ఎక్కడైనా ఏదైనా చురుకు తగిలితే మెలకువలోకి రాకుండానే దూరంగా సర్దుకుంటాడు. లేదా చేత్తో రుద్దుకుంటాడు. అది అసంకల్పిత చర్య. ఈ రెండు చర్యలు మెదడు అనే పదార్థం శరీరంలో ఏర్పడిన ప్రతి జీవిలో కనిపిస్తాయి. సందర్భ శుద్ది లేకుండా ఎవరైనా మాట్లాడితే - ‘మన లోకంలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. లేదా ‘స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. అంటే మాట్లాడడం అనే చర్య స్పృహలోనూ జరుగుతుంది, స్పృహ తగ్గినప్పుడూ జరుగుతుంది కానీ, స్పృహ కోల్పోయినప్పుడు జరగదు అని మనందరికీ తెలుసు. దీన్నిబట్టి, మనిషి మెదడు స్పృహ, మగత, లేదా మత్తు, మైకం అనే సోపానాల్లో పనిచేయగల స్థాయికి ఎదిగిపోయిందని తెలుస్తుంది. ఏళ్ల తరబడి సంపాదించిన అనుభవాలను విశ్లేషించి, ప్రోగు చేసుకుని, ఎన్నో ఏళ్లు గడిచేదాకా దాచుకుని, అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఆలోచనతో అనుసంధానం చేసే ప్రక్రియ ‘స్పృహ’. ఆలోచనా సంబంధంగా కాకుండా, దాచుకున్న సమాచారాన్ని అస్తవ్యస్తంగా వెళ్లగక్కే ప్రక్రియ ‘మగత’. ఇది కలలో దృశ్యంగానూ జరగొచ్చు, ప్రేలాపనలోనూ జరగచ్చు. ఈ రెండే కాకుండా మరిన్ని సోపానాల్లో ఆరోహణ, అవరోహణ చేయగల సమర్థత మనిషిలోని పెద్దమెదడుకు ఏర్పడింది. అందువల్లే మనిషికి ‘కల’ అనే ఒక అవస్థ సాధ్యపడింది. ఉదాహరణకు - మందలో తనతోటి జంతువొకటి చనిపోతే, ఆ ఎడబాటు మందలో మిగతా జంతువులకు ఎంతసేపు గుర్తుంటుందో చెప్పలేం. చావును వాసనబట్టే శక్తి ఉందిగాబట్టి అది చనిపోయిందని తెలుసుకోగలవు. అయినా దాన్ని అక్కడే వదిలేసి దూరంగా తొలగిపోతాయి. చంటిబిడ్డ చనిపోయినప్పుడు, చావు వాసన తెలిసికూడా, కడుపు తీపితోనో లేక తిరిగి ప్రాణం తెచ్చుకుంటుందనే ఆశతోనో రెండు మూడు రోజులదాకా శవం దగ్గరే కాపలా కాచే జంతువులు కూడా కనిపిస్తాయి. ఆ స్వల్పమైన వ్యవధి దాటిపోయిన తరువాత ఆ జంతువు జ్ఞాపకాల్లో ఆ బిడ్డ ఎన్నిరోజులు నిలుస్తుందో మనకు అర్థం కాదు. ఆ విషయంగా జంతువు ప్రవర్తనకూ, మనిషి ప్రవర్తనకూ పోలిక లేనంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం పాత రాతియుగం కాలానికే ఏర్పడిందని మనం కచ్చితంగా చెప్పుకోవచ్చు. సన్నిహితుల్లో ఎవరైనా చనిపోతే, వాళ్ల జ్ఞాపకాలు మనిషిని ఏళ్ల తరబడి వెంటాడడమే కాదు,అడపాదడపా వాళ్లు కలలో కనిపించడం కూడా కద్దు. పాత రాతియుగం మనిషి కూడా చనిపోయిన నేస్తానికి తిరిగి ప్రాణం వస్తుందనే ఆశతో కొంతకాలం దాకా కాచుకుని గడిపి వుండొచ్చు. నిరాశతో శవాన్ని వదిలేసి ముందుకు సాగిపోయిన తరువాత కూడా జ్ఞాపకాల దాడిని తట్టుకోలేక శవమున్న చోటికి తిరిగిరాగానే - కుక్కలూ, నక్కలూ, కాకులూ, గద్దలూ ఛిద్రం చేసిన దృశ్యాన్ని సహించలేక, తనకు కావలసినవారి మృతదేహం వాటి బారిన పడకుండా చూసే మార్గాలను ఆలోచించే అవసరం అప్పుడు కలిగుండొచ్చు. ఆ ఆలోచన ఫలితంగా పుట్టిన ఆచారమే ‘శవసంస్కారం’. ఈ సంస్కారం ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. (సశేషం) రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర..48
రచన: ఎం.వి.రమణారెడ్డి నాగరికత చైనాలోని ‘హ్వాంగ్ హో’ లేదా ‘ఎల్లో నది’ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది ‘చైనా నాగరికత’. ఈ నది ‘బేయన్హార్' పర్వతశ్రేణిలో పుట్టి, కొన్నిచోట్ల ఉత్తరానికీ, కొన్నిచోట్ల దక్షిణానికీ మెలికలు తిరుగుతూ, చివరకు తూర్పుముఖంగా సాగి పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. దీని మలుపుల్లో అత్యంత ప్రధానమైన ‘ఆర్డోస్ వంపు’ చైనా నాగరికతకు పీఠం. ఇప్పుడు బీడుభూమిగా మారిన ‘టారిం నది’ లోయ క్రీ.పూ. 7000 కాలం నాటి నాగరికతకు మూలస్థానమనీ, క్రమంగా అది ఎల్లో నదిని అనుసరించి తూర్పుదిశగా జరిగిందనీ చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశంలో లాగే పురాతన చరిత్రకు సంబంధించిన విశేషాల్లో కల్పనలూ, అతిశ,ఞక్తులూ, మహాత్మ్యాలూ కొల్లలుగా కలిసిపోయిన చైనా గాథలను ఆధారం చేసుకుని వాస్తవ చరిత్రను నిర్మించడం అసాధ్యమైన ప్రయత్నం కావడంతో, చైనా నాగరికతను గురించి కూడా చరిత్ర అందుకోగలిగింది చాలా స్వల్పమే. శిథిలాలను బట్టి, ఆర్డోస్ వంపులో వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని జీవించిన గ్రామాలు విస్తారంగా ఉండేవనీ, వాళ్ళు జొన్న పైరును ప్రధానంగా సాగుచేసేవాళ్ళనీ తెలుస్తూ వుంది. క్రీ.పూ. 3000 ప్రాంతంలో ఇది పట్టుగూళ్ళకు ప్రపంచంలో మొదటి స్థావరంగా ఏర్పడడం మినహా, మిగతా విషయాల్లో వాళ్ళ జీవితం ఇతర నాగరికతలకు పోలిందే. ప్రధానమైన ఈ నాలుగు నాగరికతలకు తోడు, ఎక్కడో విసిరేసినట్టు మరో రెండు నాగరికతలు - ఒకటి ఉత్తర అమెరికాలోని మెక్సికోలో, రెండవది దక్షిణ అమెరికాలోని పెరూలో - అభివృద్ధికావడం అబ్బురపాటు కలిగించే విషయం. విస్తీర్ణంలో చిన్నవైనా, పురాతనత్వంలో ఇవి తక్కినవాటికి ఏమాత్రం తీసిపోయేవిగావు. అమెరికా ఖండంలో మానవుని పరిణామం జరుగలేదనీ, దక్షిణాసియా నుండి చైనా, కొరియా, సైబీరియాల మీదుగా కొత్తరాతియుగం మానవుడు మొదట ఉత్తర అమెరికా, ఆపైన దక్షిణ అమెరికా చేరుకున్నాడని ఇదివరకే మనం అనుకున్నాం. అదే మానవుడు ఇంతగా ఎదిగి, ఆ కొత్తనేల మీద వ్యవసాయదారుడై నాగరికతను నెలకొల్పుతాడని మనం ఊహించైనా ఉండం. కానీ అది జరిగింది. ‘యాండియెన్' పేరుతో పిలువబడే పెరూ దేశపు నాగరికతలో క్రీ.పూ. 7000 నాడే మొక్కజొన్న, పత్తి పైర్లను సాగుచేశారు. చిన్నసైజు ఒంటెల్లా కనిపించే ‘ల్లామా'లను పెంపుడు జంతువులుగా పోషించారు. అదే సమయంలో మెక్సికో దేశపు దక్షిణభాగంలో ‘ఆజ్టెక్' పేరుతో పిలువబడే నాగరికతలో మొక్కజొన్న, గుమ్మడికాయలు సాగయ్యాయి. మరింత ఆశ్చర్యం కలిగించే విశ్లేషణ ఏమిటంటే - పురాతన నాగరికతలకు మూలమైన ప్రజలందరూ నల్లజాతీయులేగానీ ఏవొక్క తావులోనూ తెల్లజాతీయులు కాకపోవడం. ‘‘చర్మంరంగు గోధుమ ఛాయ (చామనఛాయ) దగ్గరినుండి మసకతెలుపు వరకు పలు వైవిధ్యాలుండే ద్రవిడులు దక్షిణభారతదేశం నుండి కొత్తరాతియుగంలో బయలుదేరి, సముద్ర తీరాల వెంట పొడవాటి పట్టీలా విస్తరిస్తూ, ఒకవైపు ఈజిప్టు, స్పెయిన్ ప్రాంతాలనూ, మరోవైపు పసిఫిక్ తీర ప్రాంతాలనూ చేరుకుని మనం ఈనాడు ‘నాగరికత' అని పిలుస్తున్నదానికి మూలపురుషులైనార’’ని డార్విన్ సమకాలికుడైన ప్రఖ్యాత యాంత్రోపాలజిస్టు థామస్ హెన్రీ హక్స్లే చెప్పింది నిజమేనేమో! ఈ విస్తరణను ‘బెల్ట్ ఆఫ్ హక్స్లే’గా ‘ది ఔట్ లైన్ ఆఫ్ హిస్టరీ’లో హెచ్.జి.వెల్స్ ప్రస్తావించారు. కానీ, మన దురదృష్టంకొద్దీ, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రాకకు ముందటికాలం చరిత్రలో ఉత్తరభారతదేశానికున్న ప్రాముఖ్యత దక్షిణాదికి కరువయింది. (సశేషం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement