-
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
భారత్తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు పాక్ యత్నం!
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది. ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. షాబాజ్ అధికారం చేపట్టిన తర్వాత భారత్తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని ఈనెల 28న భారత రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారితో పాటు ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా నాలుగేళ్ల విరామం తర్వాత పాక్ తమ జాతీయ దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. 1940లో లాహోర్ తీర్మానాన్ని ముస్లిం లీగ్ ఆమోదించింది. దీనికి గుర్తుగా సాధారణంగా మార్చి 23న పాకిస్తాన్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈసారి దీనిని మార్చి 28న నిర్వహించేందు సన్నాహాలు చేస్తున్నారు. 1940, మార్చి 22 నుండి మార్చి 24 వరకు లాహోర్లో జరిగిన సమావేశాల్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్.. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిలో భారతదేశంలోని ముస్లింల కోసం అధికారికంగా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనలో ఎక్కడా ‘పాకిస్తాన్’ అనే పదాన్ని ప్రస్తావించలేదు. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించిన తేదీని పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది. 1956 మార్చి 23న పాక్ అధికారికంగా తన మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీంతో పాకిస్తాన్ డొమినియన్ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్గా మారింది. 1960- 1968 మధ్య కాలంలో ఈ తీర్మానం ఆమోదం పొందిన స్థలంలో మినార్-ఎ-పాకిస్తాన్ నిర్మితమయ్యింది. దీనిపై తీర్మానానికి సంబంధించిన వివరాలు చెక్కారు. పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ కాంప్లెక్స్లో మార్చి 28న జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో విదేశీ దౌత్యవేత్తలు, భారతీయులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించనున్నారు. అనంతరం పాకిస్తాన్ హైకమిషనర్, ముఖ్య అతిథి ప్రసంగాలు చేయనున్నారు. -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్నగర్లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్ల టీకాలు అందించారు. -
యుద్ధం కన్న అనాథలు
ప్రపంచంలో ఎంతో మంది ఒక పూట తిండి కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు. – మదర్ థెరెసా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు. ఇరువైపులా ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అంతా యుద్ధ నష్టం గురించి, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే.. అభంశుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. జనవరి 6న (శనివారం) ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం (వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్) నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం.. నేను ఎందుకిలా అయ్యానో తెలియదు ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసిక. వయసు పన్నెండేళ్లు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు. ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలసి జీవిస్తోంది. నాటి ఘటనను తలచుకుని కుమిలిపోతూ.. తినేందుకు తిండి, సరైన రక్షణ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ‘‘అసలు వాళ్లెవరో, ఎందుకోసం ఇలా చేస్తున్నారో, మా అమ్మానాన్నను ఎందుకు చంపేశారో, నేను ఎందుకిలా బతకాల్సి వస్తోందో నాకు తెలియదు..’’ అంటూ మసిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమ్మానాన్నను కోల్పోయి.. ఈ చిన్నారి పేరు కరీనా. వయసు ఏడేళ్లు. ఉక్రెయిన్లోని చెర్నిగివ్ ప్రాంతంలోని ఓ గ్రామం. రష్యా యుద్ధం మొదలుపెట్టాక తమ ఊరిని విడిచిపోతున్న సమయంలో.. జరిగిన బాంబు దాడిలో కరీనా తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్లోని కీవ్ నగరంలో తమ బంధువుల ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, బాంబు దాడిలో అయిన గాయాలతో బాధపడుతూ గడుపుతోంది. ప్రపంచ యుద్ధాలతో ముమ్మరమై.. ► రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనాథ చిన్నారులను మిగిల్చాయి. అధికారిక అంచనాల ప్రకారమే.. అప్పట్లో పోలాండ్లో 3 లక్షలు, యుగోస్లే్లవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ► ‘యూనిసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికిపైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, నిలువనీడ లేక అవస్థ పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రినిగానీ, తల్లిదండ్రులు ఇద్దరినీగానీ కోల్పోయి అనాథలుగా బతుకీడుస్తున్నారు. ► అనాథలుగా మారినవారిలో సుమారు 6 కోట్ల మంది ఆసియా దేశాల్లో, 5 కోట్లకుపైగా ఆఫ్రికా, మరో కోటిన్నర మందికిపైగా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాల్లో ఉన్నారు. ► యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో.. ఆఫ్రికా ఖండంలోని సూడాన్, కాంగో, ఉగాండా, సోమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలా మంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతబట్టాల్సి వస్తోంది. ► సూడాన్లో అయితే ప్రతి వంద మంది చిన్నారుల్లో పది మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. ► ఇటీవల ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో.. వేల మంది మరణించారు. లక్షలాది మంది వలసపోయారు. ఈ యుద్ధంలో నూ పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలయ్యారు. ఏనాటి యుద్ధమైనా.. పిల్లలూ సమిధలే.. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే అన్నీ. చదువు కోసమో.. ఉద్యోగం కోసమో దూరంగా ఉంటున్నా..తల్లడిల్లేది వారి గురించే. అమ్మ ఒడికి, నాన్న చెంతకు చేరితేనే సాంత్వన. అలాంటి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతే.. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో.. మానవ నాగరికత మొదలైన నాటి నుంచీ జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరు.. ఏతోడూ లేకుండా కునారిల్లిపోతున్నవారు మరికొందరు. సరైనదారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే..‘దారి తప్పిన’వారి బతుకులు ఆగమైపోతున్నాయి. ఉక్రెయిన్లో రెండేళ్లుగా పిల్లల గోస రష్యా–ఉక్రెయిన్ ఒకప్పుడు ఒకే సోవియట్ యూనియన్లో భాగం. అందుకే ఇరు దేశాల మధ్య రాకపోకలూ, సంబంధ బాంధవ్యాలూ సాధారణమే. కానీ ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు, యుద్ధంతో ఇరువైపులా ఉండిపోయిన మరోదేశపు కుటుంబాలు ఆగమైపోయాయి. మరణించిన, వలస వెళ్లినవారి పిల్లలు, సైనికులు బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసినవారు.. ఇలా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ‘కిడ్సేవ్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్కు మిలటరీ సాయమేకాదు.. యుద్ధంతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. బలవంతంగా క్యాంపులకు చిన్నారులు 2022 ఫిబ్రవరి చివరివారం నాటికి ఉక్రెయిన్లో అనాథ పిల్లల సంఖ్య లక్ష వరకు ఉండగా.. ఆ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ సంక్షుభిత పరిస్థితుల్లో లెక్కలు తేల్చేదెలాగని, వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్ఫ్లిక్ట్ అబ్జర్వేటరీ సంస్థ గతంలోనే పేర్కొంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14 వేల ఉక్రెయిన్ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యూరప్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన యూదు చిన్నారులు వీరు. వారికి కొత్త జీవితం అందించడం కోసం 1921లో అమెరికాలోని న్యూయార్క్కు తరలించినప్పుడు హార్బర్లో తీసిన ఫొటో ఇది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ చొరవతో..ప్రత్యేక రోజుగా.. ఫ్రాన్స్కు చెందిన ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డెట్రెసెస్’ స్వచ్ఛంద సంస్థ చొరవతో యూనిసెఫ్ ఏటా జనవరి 6న ‘వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ డే’గా నిర్వహిస్తోంది.యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు.. వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించడం, వారిని ఆదుకోవడం లక్ష్యంగా చర్యలు చేపట్టడమే దీని లక్ష్యం. అనాథలను ఆశ్రమాల్లో చేర్చడంతోపాటు చదువుకోవడానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’
ఈరోజు చారిత్రాత్మక రోజు. నేడు ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2003 తర్వాత ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. టీమ్ ఇండియా విజయం కోసం దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు. నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని కోరుతూ మసీదులు, చర్చిలు, దేవాలయాలు, గురుద్వారాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. కంగారూలతో పోరుకు టీమ్ ఇండియా సైన్యం సిద్ధమైంది. గ్రాండ్ ఫైనల్ను వీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్టేడియంనకు తరలివస్తున్నారు. భారతదేశంలోని ప్రతిచోటా టీమ్ ఇండియా విజయం కోసం పూజలు చేస్తున్నారు. వారణాసిలోని విశ్వేశ్వరుని మొదలుకొని ఉజ్జయినిలోని మహాకాళీశ్వరుని వరకూ అందరు దేవుళ్లు భారత్ టీమ్ను ఆశీర్వదించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్లోని ముజఫ్ఫర్నగర్లో పదిమంది యువకులు భారత్ గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టబోమంటూ కఠిన ఉపవాస దీక్షకుదిగారు. శివచౌక్కు చేరుకున్న ఈ యువకులు అక్కడి శివాలయంలో పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ‘భారత్ ఈ మ్యాచ్లో గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టుకోబోమని, ఒక వేళ భారత్ పరాజయం పాలయితే ఇక తమ జీవితంలో ఎప్పటికీ క్రికెట్ చూడబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇది కూడా చదవండి: అహ్మదాబాద్లో పర్యాటకుల రద్దీ -
అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? ఎదురవుతున్న ఆటంకాలేమిటి?
విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. విద్యకుగల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దేశప్రజలంతా విద్యావంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మన భారతదేశం విషయానికొస్తే నవంబరు 11న(నేడు) జాతీయ విద్యాదినోత్సవం జరుపుకుంటారు. భారతదేశం అక్షరాస్యత విషయంలో ఘనమైన చరిత్రను కలిగివుంది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి పురాతన విశ్వవిద్యాలయాలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. చాణక్య, కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్, రామానుజన్, అమర్త్య సేన్ తదితర పండితులు, రచయితలు, కవులు, ఆలోచనాపరులను భారతదేశం ప్రపంచానికి అందించింది. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11 న దేశంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. నవంబరు 11న దేశంలోని విద్యా సంస్థలు సెమినార్లు నిర్వహించడంతో పాటు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాయి. అక్షరాస్యత ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. స్వతంత్ర భారతావనిలో విద్యావ్యవస్థకు పునాదులు పడటం మొదలుకొని, ఈ రంగంలో నేడున్న స్థితిగతులు.. ఇందుకు నాటి విద్యాశాఖ మంత్రి ఆజాద్ అందించిన సహకారాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో అక్షరాస్యత వాస్తవాలు ప్రపంచంలోని 135 దేశాలలో మహిళల అక్షరాస్యత రేటులో భారతదేశం 123వ స్థానంలో ఉంది. దేశంలో 60 లక్షల మంది పిల్లలు బడి బయట అంటే చదవుకు దూరంగా ఉన్నారు. దేశంలో ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. దేశంలో వయోజన అక్షరాస్యత రేటు 63%. ప్రపంచంలో అత్యధికంగా 287 మిలియన్ల(ఒక మిలియన్ అంటే 10 లక్షలు) నిరక్షరాస్యులైన వయోజనులకు నిలయంగా భారతదేశం ఉంది భారతదేశంలో బడి బయట ఉన్న పిల్లల్లో 47.78% మంది బాలికలే కావడం విశేషం. 1950లలో 10 మంది భారతీయుల్లో కేవలం ఇద్దరు మాత్రమే అక్షరాస్యులు. 2022నాటి విద్యా గణాంకాలు దేశంలో విద్యాభివృద్ధికి సూచికగా నిలిచాయి. 2018లో దేశంలో అక్షరాస్యత రేటు 74.4%కి చేరింది. దీనిని చూస్తే దేశంలో అక్షరాస్యుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలుస్తుంది. దేశంలో అక్షరాస్యత రేటు లింగం, ప్రాంతం, సామాజిక పరిస్థితులను అనుసరించి మారుతుంటుంది. 2018 నాటికి పురుషుల అక్షరాస్యత రేటు 82.4శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 65.8శాతం. అక్షరాస్యత రేటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విభిన్నంగా కనిపిస్తుంది. కేరళలో అక్షరాస్యత రేటు 96.2 శాతం. ఇది దేశంలోనే అత్యధికం. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదయ్యింది. ఇది 66.4శాతంగా ఉంది. ప్రభుత్వ విధానాలు, సామాజిక ఉద్యమాలు, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి తదితరాలతో దేశంలో అక్షరాస్యత రేటు పెరుగుతూ వస్తోంది. దేశంలో అక్షరాస్యత శాతం పెరిగేందుకు దోహదపడిన ప్రభుత్వ కార్యక్రమాలిలా ఉన్నాయి. జాతీయ అక్షరాస్యత మిషన్: ఇది 1988లో ప్రారంభమయ్యింది. ఇది వయోజనులకు ప్రాథమిక విద్యను అందించడం, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా వారిలో నిరక్షరాస్యతను నిర్మూలించడం లక్ష్యంగా పనిచేస్తోంది. సర్వశిక్షా అభియాన్: 2001లో ప్రారంభమయ్యింది. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. విద్యా హక్కు చట్టం: దీనిని 2009లో రూపొందించారు. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత , నిర్బంధ విద్యను తప్పనిసరి చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్: 2009లో ప్రారంభమయ్యింది. ఇది 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ మాధ్యమిక విద్యను అందించడంతో పాటు విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్: 2015లో ఇది ప్రారంభమయ్యింది. ఇంటర్నెట్ ద్వారా దేశ పౌరులలో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ విద్యావిధానం ప్రారంభమయ్యింది. అక్షరాస్యతాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు దేశఅక్షరాస్యతలో లింగ అంతరం కనిపిస్తోంది. ఇది బాలికలు, మహిళలు విద్య, సాధికారతను పొందకుండా అడ్డుపడుతోంది. ఈ అంతరానికి పలు సామాజిక నమ్మకాలు, ఆచారాలు కారణంగా నిలుస్తున్నాయి. అక్షరాస్యతలో ప్రాంతీయ అసమానత.. ఇది వివిధ రాష్ట్రాలు-ప్రాంతాల మధ్య వనరులు, అవకాశాల అసమాన పంపిణీని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్లో ఈ సవాళ్లు అధిగమించి భారత్ అక్షరాస్యత విషయంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిద్దాం! ఇది కూడా చదవండి: గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది? -
సిటీ ఓటేస్తదా.. టూరేస్తదా..
అసలే అర్బన్ ఓటర్ల నిరాసక్తత... దానికి తోడు వారాంతపు సెలవులు.. వెరసి అర్బన్ ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందా? అనే ఆందోళన రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో అర్బన్ ఓటింగ్ బాగా పుంజుకున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్పొరేట్ ఐటీ ఉద్యోగులు వారాంతపు సెలవుల్ని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా సొంతూర్లకు , హాలిడే టూర్స్కి చెక్కేస్తుంటారు. ఈ నేపధ్యంలో పోలింగ్ తేదీ నవంబరు 30 గురువారం కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే...4రోజుల పాటు లాంగ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అనే ఆలోచన వారిలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో పట్టణీకరణ జోరు కొనసాగుతోన్న నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. పటాన్ చెరు...ఓటర్ల జోరు... గత 2018తో తాజా 2023 మధ్య చూస్తే.. పటాన్ చెరులో ఓటర్ల సంఖ్యలో అత్యధికంగా 35శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి తన స్థానాన్ని నిలుపుకుంది. ఐటీ పరిశ్రమకు చిరునామాకు తోడుగా.. ఇటీవల వేగవంతమైన హౌసింగ్ బూమ్ కారణంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని శేరిలింగంపల్లిలో గతంలో 5,75,542 లక్షల మంది ఓటర్లు ఉండగా అది 21.2శాతం పెరిగి 6,98,079 లక్షలకి చేరింది. ఇది రాష్ట్ర వ్యాప్త సగటు అయిన 13.15శాతంపెరుగుదలతో చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగానూ... పట్టణ ఓటర్ల పెరుగుదల హైదరా బాద్ పశ్చిమ ప్రాంతాలకే పరిమితం కాలేదు. నకిరేకల్ (ఎస్సీ) 28శాతం, ఆసిఫాబాద్ (ఎస్టీ) 20, కామారెడ్డి 19, కరీంనగర్ 19, నిజామాబాద్ (అర్బన్) 18శాతంతో ఓటర్లు భారీగా పెరిగారు. తెలంగాణ లోని పాత పట్టణ కేంద్రాలైన ఖమ్మం 15, వరంగల్ పశి్చమ 15, వరంగల్ తూర్పు 16శాతం ఓటర్ల సంఖ్య పెరిగింది. గ్రేటర్ పరిధిలో స్వల్పమే... ఇందుకు భిన్నంగా హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా మాత్రమే పెరిగింది. నాంపల్లి, మలక్పేట్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, సనత్నగర్లో ఓటరు సంఖ్య పెరుగుదల శాతం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. రిజర్వుడ్ నియోజకవర్గాలుగా ఉన్న అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, మధిర, స్టేషన్ ఘనపూర్ కూడా సింగిల్ డిజిట్ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఇక అత్యల్పంగా ఓటర్ల వృద్ధి నమోదైన ప్రాంతం మెదక్లోని దుబ్బాక. ఈ నియోజకవర్గంలో కేవలం 2% ఓటర్లు మాత్రమే పెరిగారు. పట్టణ ఓటర్లు ఏం చేస్తారో ఓటింగ్ ఉదాసీనత’కు పేరొందిన పట్టణ ఓటర్ల సంఖ్య పెరగడంతో నేతల్లో ఒకింత ఆందోళన పెరి గింది. శని, ఆదివారాలు సెలవు ఉన్న ప్రైవేట్ కంపెనీల్లోని సిబ్బంది ఓటింగ్ రోజైన గురువారం కూడా కలిపి లాంగ్ వీకెండ్లో భాగం చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
అతిపిన్న వయసులోనే రికార్డులు, అవార్డులు
సాక్షి, అనకాపల్లి: అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున జన్మించిన అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన లాస్విక ఆర్య అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 6 నెలల వయస్సులో ‘వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో, 9 నెలల వయస్సులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ‘మెమొరి ఆఫ్ జీకే అవార్డు’ బంగారు పతకం, ప్రశంసాపత్రాలు సాధించి అందరి మన్ననలు పొందుతోంది. జాతిపిత మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, దేశంలో గల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫొటోలను గుర్తిస్తుంది. 1 నుంచి 20 వరకూ స్క్వెర్స్ను గుర్తించి ‘ మెమొరీ ఆఫ్ జనరల్ నాలెడ్జ్’ విభాగంలో ‘చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. అక్టోబర్ మొదటి వారంలో ‘లిటిల్ చాంప్–2023’’ ప్రశంసా పత్రాలు, ట్రోఫీ, బ్యాడ్జ్, మెడల్ను అందించారు. ఈ ఏడాది జూలైలో ‘ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డు’లో కూడా చిన్నారి స్థానం పొందింది. 9 నెలల వయస్సులో 4 నిమిషాల వ్యవధిలో 24 మానవ శరీర భాగాలు గుర్తించడంతో ‘మాక్సిమమ్ బాడి పార్ట్స్ ఐడెంటిఫైడ్ బై ఏ ఇన్ఫ్యాంట్’గా ప్రశంసాపత్రంతో పురస్కారాన్ని పొందింది. గతేడాది అక్టోబర్ 11న జన్మించిన లాస్విక ఆర్య ఏడాది కూడా పూర్తి కాకుండానే సాధిస్తున్న విజయాల పట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం తెలిపారు. తాను పుట్టిన ప్రపంచ బాలికల దినోత్సవానికి ఎక్కడా తీసిపోకుండా తాను సాధించిన విజయాలతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
సెలవైనా ఠంఛన్గా పింఛన్
సాక్షి, అమరావతి: సెలవు రోజైనా ప్రభుత్వం ఠంఛన్గా అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా 51,37,566 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,415.64 కోట్ల మొత్తాన్ని అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి పంపిణీకిగాను 65,78,854 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,813.60 కోట్ల విడుదల చేసింది. ఒకటో తేదీ ఆదివారం సెలవు అయినా.. సాయంత్రానికి 78.09 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మిగిలిన వారి కోసం ఐదోతేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకల్లేవ్!
దేశం మొత్తం(ఆ రాష్ట్రం మినహాయించి) అంగరంగ వైభవంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. కానీ, పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని జెండా పండుగకు దూరంగా ఉంచేశాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సైతం మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రమాద ఘటనల్లో 55 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. Visual of Pandoh Himachal Pradesh right now pic.twitter.com/KQ2Tn9sz9B — Go Himachal (@GoHimachal_) August 14, 2023 రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరిగాయని సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలాన్, సిమ్లా, మండి, హమిర్పూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విపత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంఢీగర్-సిమ్లా జాతీయ రహదారితో సహా ప్రధాన రహదారులు మూతపడ్డాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో విపత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొదట ఏడుగురు మరణించారు. శివమందిర్ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 17 మంది కాపాడామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు. That has happened in #Himachal to build a 4 Lane road the Govt. Bulldoze houses, shops, bussiness establishment in the name of development but In this Himalayan Ranges. But now Nature is taking revenge. The Roads are crumbling down. Location NH 5 , Solan India pic.twitter.com/hQii08aoTl — Ravi Rana (@RaviRRana) August 11, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
చనిపోయినా బతికుందాం!
మట్టిలో కలిసిపోయే గుండె ఇంకో మనిషిని బతికించగలదు. మంటల్లో కాలిపోయే కళ్లు మరో బతుకులో వెలుగు నింపగలవు. ఆయువు తీరిన దేహం మరొకరి ఆయుష్షు రేఖను పెంచగలదు. ఇందుకు ఒకటే దారి.. అదే అవయవదానం. అంపశయ్యపై ఉన్న వారి తలరాత మార్చాలన్నా.. చావు అంచుల్లో నించున్న వారిని తిరిగి బతుకు దారిలోకి తీసుకురావాలన్నా ఇదొక్కటే మార్గం. నేడు అవయవదాన దినోత్సవం. చనిపోయాక శరీర భాగాలను వృధా చేయడం కంటే మరో మనిషి కోసం వినియోగించడం మాధవ సేవ అని చెప్పే రోజు. అపోహలు వీడి ఓ చైతన్య కాగడాను ఊరూరా వెలిగించాల్సిన తేదీ. ఇచ్ఛాపురం రూరల్: మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అవే అవయవాలను దానం చేస్తే ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వులు నింపవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. సాధారణ మరణాల్లో నేత్రాలను తీసుకుంటారు. నమోదు ఇలా అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. జీవన్దాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా, రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా బ్రెయిన్డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీవన్దాన్ డాట్ జీవోవి డాట్ ఇన్’ వెబ్ సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది. సజీవమూర్తి కిరణ్చంద్ సోంపేట పట్టణం గీతా మందిరం కాలనీకి చెందిన మల్లారెడ్డి మోహన్, గిరిజా కల్యా ణిల ఒక్కగానొక్క కుమారుడు కిరణ్చంద్(16) జిల్లా వాసుల్లో నింపిన స్ఫూర్తి అనన్యసామాన్యం. 2023 ఏప్రిల్ 15న పదో తరగతి ఆఖరి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న కిరణ్చంద్ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే మెదడులో సమస్య వచ్చిందని, వెంటనే విశాఖపట్నం వెళ్లాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి రాగోలు జెమ్స్ ఆస్పత్రికి మార్చారు. వారం రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు, ఆర్గాన్ డొనేషన్ సమన్వయకర్తలు తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను దానం చేసి మరికొందరి బతుకుల్లో వెలుగులు నింపారు. 8 మంది జీవితాల్లో ‘చంద్ర’కాంతులు జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) సీఎఫ్గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 30న తలనొప్పితో బాధపడుతూ శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చంద్రకళ తలలో నరాలు చిట్లిపోయి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. దీంతో బ్రెయిన్డెడ్ అయిందని, ఈమె అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాలకు నూతన వెలుగులు ప్రసాదించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. భర్త శివను, ఇద్దరు కుమార్తెలను ఒప్పించడంతో జూన్ 1న అవయవదానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. -
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో యాక్టివ్ ప్రెజెన్స్కు పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి ఒక ఆసక్తికరమైన ఫోటో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ చెస్ డేని గుర్తు చేసుకుంటూ శుక్రవారం ఒక త్రోబాక్ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తాను చదరంగంతో పోజులిచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఈ రోజుల్లో, ఆన్లైన్ ద్వారా తన చెస్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లడించారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) ఈ సందర్బంగా టెక్మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్-2023 గురించి ప్రస్తావించారు,ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద అధికారిక ఫ్రాంచైజ్ చెస్ లీగ్. వాస్తవానికి ఇంటర్నేషనల్ చెస్ డే నాడు దీన్ని పోస్ట్ చేసి ఉండాల్సింది. ఈ కార్యక్రమం లైవ్లో చదరంగం ఆడతారా అని చాలా తరచుగా అడిగారు.. అందుకే నా జ్ఞాపకాల ఆల్బమ్ని పరిశీలిస్తుండగా, ఆగ్రాలో ఉన్నప్పటి ఈ ఫోటో దొరికింది అంటూ పేర్కొన్నారు. (Suchita Oswal Jain: 22ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) అన్నట్టు అది రోబోటిక్ బోర్డ్ కాదు, తన భార్య కెమెరా కోసం ఇచ్చిన పోజు! అని సరదాగా పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో నైపుణ్యాలను పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో తన ఒపెనింగ్ డీ4తో ఉండేదని ఇపుడు దానికి బదులుగా ఇపుడు స్టాండర్ట్ స్టెప్ e4తో గేమ్ స్టార్ట్ చేశానంటూ రాసుకొచ్చారు మహీంద్రా. ఈ ఫోటో ఎప్పటిలాగనే వేలకొద్దీ లైక్లు, కామెంట్లను సొంత చేసుకుంది. అలాగే "బెటర్ లేట్ నేనెవర్! హ్యాపీ లేటెడ్ #ఇంటర్నేషనల్ చెస్ డే! మీ హనీమూన్ చదరంగం ఫోజు, అద్భుతంగా ఉంది. మీ ప్రతి కదలిక మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది!" ఒక అభిమాని వ్యాఖ్యానించారు. "ఇది అద్భుతంగా ఉంది! వావ్.. స్ఫూర్తిదాయకం," అని మరొకరు రాశారు. -
ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ బిర్యానీదే
● ● జిల్లాలో 20 రకాలకుపైగా బిర్యానీలు లభ్యం ● నిమిషానికి పది బిర్యానీలు ఆర్డర్ పెట్టి తింటున్న వైనం ● శ్రీకాకుళం: బారసాల నుంచి దశ ది న కర్మల వరకు, పుట్టిన రోజు నుంచి పెళ్లిళ్ల వరకు ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ అంతా బిర్యానీలదే. ఈ వంటకం ఎంతబాగా కుదిరితే కార్యం అంత చక్కగా జరిగినట్టు. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ అంటే సిక్కోలు వాసులు లొట్టలేసుకుని తింటున్నారు. ఒకప్పుడంటే ఈ బిర్యానీ దొరకడం కష్టంగా ఉండేది గానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ఊళ్లలోనూ బిర్యానీ సెంటర్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 20 రకాల బిర్యానీలు దొరుకుతున్నాయి. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. ఎర్రటి మాంసం ముక్కలు కనిపిస్తే నే బిర్యానీ మజా ఇస్తుందనుకుంటే పొరపాటే.. పుట్టగొడుగుల నుంచి పన్నీరు వరకు, ఆవకాయ నుంచి గోంగూర వరకు పలు రకాల బిర్యానీలు చికెను, మటను బిర్యానీలకు గట్టి పోటీ ఇస్తున్నా యి. ఇటీవలే ప్లాంట్బేస్డ్ చికెన్, మటన్ పేరిట బిర్యానీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి శాకాహారమే. మాంసాహార విషయానికి వస్తే హైదరాబాదీ దమ్బిర్యానీతో పాటు పొట్లం బిర్యానీ, మటన్, ప్రాన్ బిర్యానీలంటూ రకరకాలు నోరూరిస్తున్నాయి. రూ.100 నుంచి రూ.700లకు పైబడి బిర్యానీ ధర ఉంది. జిల్లాలో నిమిషానికి 10 బిర్యానీలు ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ బిర్యానీకే ఆదరణ ఎన్నో రకాలు బిర్యానీలు ఉన్నా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఉన్న ఆదరణ ప్రత్యేకం. అన్ని బిర్యానీల్లో యాభై శాతం ఇవే వెళ్తాయి. వెజ్, నాన్ వెజ్ల బిర్యానీలలో దమ్కే ప్రథమస్థానం. – తపన్కుమార్, బాబూరావు,చెఫ్లు బిర్యానీ అంటే ఎంతో ఇష్టం ప్రతి వారం చివర్లో బిర్యానీ తప్పక తింటాను. బిర్యానీ అంటే అంత ఇష్టం. ఆహార ప్రియు ల అభిరుచి మేరకు తయారీ దారులు కూడా రకరకాల రుచులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది మావంటి వారికి సంతోషం. – ఇప్పిలి సురేష్, శ్రీకాకుళం -
యోగానంద నుంచి అయ్యంగార్ వరకూ.. యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే..
ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. యోగా చేయడం వలన కలిగే లాభాల గురించి తెలియజేయడమే యోగా దినోత్సవం ఉద్దేశం. యోగ విధానాలను మనదేశానికి చెందిన రుషులు, మునులు రూపొందించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సూత్రాలను అనుసరించడం ఎంతో అవసరమని వారు తెలియజేశారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ప్రముఖ గురువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమహంస యోగానంద పరమహంస యోగానంద తన పుస్తకం ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ కారణంగా సుపరిచితులయ్యారు. మెడిటేషన్, యోగా విధానాలను ఆయన ప్రపంచవ్యాప్తం చేశారు. ఇంతేకాదు పరమహంస యోగానంద యోగాకు సంబంధించిన తొలి గురువులలో ప్రముఖునిగా పేరొందారు. ఆయన తన జీవితంలోని అధిక భాగాన్ని అమెరికాలోనే గడిపారు. తిరుమలాయ్ కృష్ణమాచార్య ఈయన ‘ఆధునిక యోగ పితాచార్యులు’గా గుర్తింపు పొందారు. హఠయోగను మరింత విస్తృతంగా ప్రచారం చేశారు. ఈయన అనేక ఆయుర్వేద విషయాలను కూడా ప్రపంచానికి తెలియజెప్పారు. ధీరేంద్ర బ్రహ్మచారి ధీరేంద్ర బ్రహ్మచారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి యోగా గురువుగా పేరొందారు. ఈయన దూరదర్శన్ ద్వారా యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నించారు. దీనికితోడు ధీరేంద్ర బ్రహ్మచారి ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజీలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు నడుంబిగించారు. ఈయన యోగాకు సంబంధించి హిందీ, ఆంగ్లభాషల్లో అనేక గ్రంథాలు రాశారు. జమ్ములో ధీరేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం ఉంది. కృష్ణ పట్టాభి జోయిస్ ఈయన కూడా ప్రముఖ యోగా గురువుగా పేరొందారు. 1915 జూలై 26న జన్మించిన ఆయన 2009లో కన్నుమూశారు. ఈయన అష్టాంగ యోగ సాధనకు అమితమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. ఇతని వద్ద శిష్యరికం చేసిన పలువురు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. బీకేఎస్ అయ్యంగార్ బీకేఎస్ అయ్యింగార్ యోగా ప్రపంచంలో ఎంతో పేరు పొందారు. ‘అయ్యంగార్ యోగా’ పేరుతో ఒక స్కూలును నెలకొల్పారు. ఈ స్కూలు ద్వారా ఆయన లెక్కలేనంతమందికి యోగా శిక్షణ అందించారు. 2004లో టైమ్స్ మ్యాగజైన్ బీకేఎస్ అయ్యంగార్ పేరును ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతుల జాబితాలో చేర్చింది. మహర్షి మహేష్ యోగి మహర్షి మహేష్ యోగి బోధించే ‘ట్రాన్స్డెంటల్ మెడిటేషన్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుపొందింది. పలువురు సెలబ్రిటీలు ఈయన బోధించిన యోగ విధానాలను అనుసరిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త..హోటళ్లు ఆడ్వాన్ బుకింగ్ చేస్తే.. -
రక్త సారథులు.. ప్రాణ వారధులు
మదనపల్లె సిటీ : రక్తం ఎంత విలువైందో అందరికీ తెలిసిందే. ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలే కాపాడొచ్చు. అత్యవసర సమయంలోనే కాదు... పలువురు వ్యాధిగ్రస్తులకు పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. కరోనా సమయంలో తలసేమియా, సికల్సెల్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు ఒక యూనిట్ దొరకడం ఎంత కష్టంగా మారిందో చూశాం. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చుని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రక్తమిస్తే అనారోగ్యం పాలవుతామని అపోహ పడుతున్నారు. దీంతో రక్తనిల్వల కొరత ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంది. బ్లడ్బ్యాంకు నిర్వాహకులు శిబిరాల నిర్వహణ, దాతల కోసం తరచూ పలు సంస్థలను కోరుతూనే ఉన్నారు. అయినా స్పందన అంతంత మాత్రమే లభిస్తోంది. కొంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇవ్వడమే కాదు.. ఇప్పిస్తారు రక్తం ఇవ్వడమే కాదు. అవగాహన కల్పించి ఇతరులతో ఇప్పించడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో రెండో కోవకు చెందుతారు అబూబకర్సిద్దిక్. మదనపల్లె పట్టణంలో హెల్పింగ్మైండ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా అత్యవసర సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే వారికి రక్తం ఇస్తారు. ఇప్పటి రకు 38 సార్లు రక్తదానం చేశారు. సంస్థ తరఫున పదేళ్లలో సుమారు 18 వేల మందితో రక్తదానం చేయించారు. చిరు వ్యాపారి.. రక్తదానంలో మేటి మదనపల్లె పట్టణానికి చెందిన హర్షద్అలీ చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. స్నేహితుడు అనారోగ్యం పాలవడంతో ఓ గ్రూపు రక్తం అవసరం కావడంతో దొరకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. అప్పటి నుంచి రక్తంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశారు. ఆపద వస్తే .. వాలిపోతాడు స్వర్ణకారుడిగా పని చేస్తూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు మదనపల్లె పట్టణానికి చెందిన ఢంకనాచారి. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే తృప్తిలో ఎక్కడా ఉండదని నమ్మిన యువకుడు. బ్లడ్ బ్యాంకులో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అత్యవసరమైతే ఫోన్ చేస్తే చాలు రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 45 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు పొందాడు. చదువుకుంటూ.. రక్తదాతగా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన పుష్ప తిరుపతిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని తెలుసుకుంది. ఎవరికికై నా ఆపద వస్తే చాలు రక్తదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేసింది. రక్తదానం చేయడమే కాకుండా సహ విద్యార్థినులకు రక్తదానం గురించి అవగాహన కల్పిస్తుంది. స్ఫూర్తి ప్రదాత శివాజీ డిగ్రీ చదువుతూ రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివాజి. వివేకా ఆశయ ఫౌండేషన్ తరచూ నిర్వహించే రక్తదాన శిబిరాలు ఏర్పాటులో సహాయ, సహకారాలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చూస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివ. ఉద్యోగం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేశారు. -
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్కారులో బ్రేక్ఫాస్ట్కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
ఈ రోజు మీ నీడ మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది.. నేడు 'జీరో షాడో డే'
సూర్యుడు ఒక నిర్దిష్ట బిందువుకి చేరుకున్నప్పుడూ నీడలు అదృశ్యమవుతాయి. ఈ అరుదైన ఘటన సంవత్సరానికి ఒకసారి కనువిందు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు సార్లు సంభవిస్తుంది. సరిగ్గా సూర్యుడు భూమధ్య రేఖ పైన ఉన్నప్పుడూ సూర్యకిరణాలు భూమి ఉపరితలంపై లంబంగా పడతాయి. దీంతో పగటిపూట కొద్దిసేపు నీడలు కనిపించవు. దీన్ని ప్రపంచంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో గమనించవచ్చు. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మంగళవారం కోరమంగళ క్యాంపస్లో ఈ అరుదైన దృగ్విషయానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు సూరుడు నడినెత్తిపై ఉండగా ఇది జరగుతుందని, లంబంగా పడే కిరణాలు ఎటువంటి నీడను ఉత్పత్తి చేయవని బెంగళూరు అమెచ్యూర్ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం ట్వీట్లో తెలిపింది. జీరో షాడో అనేది.. భూమి అక్ష సంబంధ వంపు ఫలితంగా ఇలాంటి అరుదైన ఘటన సంభవిస్తుందని స్పష్టం చేసింది. సూర్యుని స్థానం ఏడాది పోడవునా మారుతుందని. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడూ అక్ష సంబంధం మారినప్పుడల్లా.. సూర్యని స్థానం మారి వేరు వేరు నీడలు ఏర్పడతాయని పేర్కొంది. అందువల్లే ఏడాది పొడవున వేర్వేరు నీడలు ఏర్పడతాయని తెలిపింది. సూర్యకిరణాలు వసంత రుతువు నుంచి శరదృతువు మధ్య సమయంలో భూమధ్యరేఖ వెంబడి 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు భూమిని తాకుతాయని ఫలితంగా నీడలు ఉండవని వివరించింది బెంగళూరు ఆస్ట్రోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్. ఈ జీరో డేకి గుర్తుగా ఆస్టోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ మంగళవారం కోర మంగళ క్యాంపస్లో ఈ ఖగోళ అద్భుతాన్నిప్రజలు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: ఓ తల్లి కిరాత చర్య..ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..) -
రోజుకు 24 గంటలు కదా! కానీ, అప్పట్లో 19 గంటలే! ఆసక్తికర అధ్యయనం
ఎంతకూ రోజు గడవడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒంటరిగా ఉన్నప్పుడో.. చేసేందుకు పనేమీ లేకపోయినప్పుడో... 24 గంటలు గడిచేదెప్పుడబ్బా అని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది! మరి రోజులో కేవలం 19 గంటలే ఉంటే? అదెలా అంటారా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే... భూమ్మీద రోజు నిడివి ఎన్నడూ స్థిరంగా లేదట. కోటానుకోట్ల ఏళ్ల కింద ఇప్పటి కంటే కనీసం ఆరు గంటలు తక్కువగా ఉండేదట! అంటే అప్పట్లో భూ భ్రమణానికి, అంటే తన చుట్టు తాను ఒకసారి తిరిగేందుకు 19 గంటలు మాత్రమే పట్టేదని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. మరిప్పుడు రోజుకు 24 గంటలు ఎందుకైనట్టు? భూమి నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుంటే దీనికి సమాధానమూ తెలుస్తుంది. భూమి ఉల్లిపాయ మాదిరిగా పొరలుగా ఉంటుందని, ఈ పొరల సంఖ్య నాలుగని చిన్నప్పుడే చదువుకున్నాం. మనముండేది క్రస్ట్ అని పిలిచే పై పొరలో. దీనికింద మాంటెల్, ఔటర్ కోర్, చివరగా భూమి మధ్య భాగంలో ఇన్నర్ కోర్ ఉంటాయి. ఇన్నర్ కోర్ సుమారు 1,220 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది దాదాపుగా ఘనస్థితిలో ఉన్న ఇనుప ముద్ద. ఇది తిరిగే వేగం, పద్ధతుల్లో వచ్చే తేడాలను బట్టి రోజు తాలూకు నిడివిలోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్పైన ద్రవ స్థితిలో ఉండే ఔటర్ కోర్ ఉంటుంది. ఇది సృష్టించే అయస్కాంత క్షేత్రాన్ని బట్టి ఇన్నర్ కోర్ వేగం, దిశ ఆధారపడి ఉంటాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కోట్ల ఏళ్లుగా ఇన్నర్ కోర్ దిశ, వేగం తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రోజు నిడివీ పెరుగుతూ వస్తోంది. ఆ లెక్కన 140 కోట్ల ఏళ్ల క్రితం భూ భ్రమణానికి 19 గంటలే పట్టేదని అంచనా. అధ్యయనం చేసిందిలా... భూమి లోపలి పొరలన్నీ వేటికవే వేర్వేరు దిశ, వేగాల్లో తిరుగుతూంటాయి. కొన్ని కదలికలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఇంకొన్ని పొరల గురుత్వాకర్షణ శక్తి ఆ క్షేత్ర ప్రభావాన్ని తగ్గిస్తూంటుంది. కచ్చితంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి శాస్త్రవేత్తలు పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపలి పొరల్లో ఏం జరుగుతోందో పరిశీలిస్తూంటారు. భూకంప తరంగాలు అన్ని పొరల ద్వారా ప్రయాణించగలవు. పొర మారినప్పుడల్లా వాటి వేగంలో మార్పులు వస్తూంటాయి. వాటి ఆధారంగానే ఆ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజాలున్నాయి, ఉష్ణోగ్రత, సాంద్రత ఎంత వంటి వివరాలు తెలుస్తూంటాయి. అలాగే భూమి ఇన్నర్ కోర్ వేగం, దిశల్లో వచ్చిన మార్పులు కూడా! పెకింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని వేల భూకంపాల వివరాలను సేకరించి పరిశీలించారు. 1960ల నుంచి ఇప్పటిదాకా భూమి ఇన్నర్ కోర్ను దాటుకుంటూ వెళ్లిన భూకంప తరంగాల తీరును విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2009కి ముందు ఈ తరంగాలు ఇన్నర్ కోర్ గుండా వెళ్లేందుకు పట్టిన సమయంతో పాటు ఆ తరంగాల రూపురేఖల్లోనూ గణనీయమైన మార్పులొచ్చాయి. ఇక 2009లో భూకంప తరంగాల ప్రభావం ఇన్నర్ కోర్పై దాదాపు లేకుండా పోయింది. అంటే 2009లో ఇన్నర్ కోర్ కూడా భూమితో సమాన వేగంతో తిరుగుతున్నట్లు అంచనా కట్టారు. 2009 తర్వాత భూమి కంటే తక్కువ వేగంతో తిరుగుతున్నట్టు భూకంపాల తరంగాల పరిశీలనలో వెల్లడైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 70 ఏళ్లకోసారి రివర్స్ ఈ అధ్యయనం ప్రకారం ఇన్నర్ కోర్ తిరిగే దిశ 70 ఏళ్లకోసారి మారుతూంటుంది. అలా చివరిసారి 1970 ప్రాంతంలో మారిందట. రోజు నిడివి, భూ అయస్కాంత క్షేత్రాల ద్వారా ఇది నిర్ధారౖణెంది కూడా. ఇలా ఇన్నర్ కోర్ తిరిగే దిశ, వేగంలో మార్పుల వల్ల భూ భ్రమణానికి పట్టే సమయంలోనూ తేడాలొచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్ వేగం తగ్గినప్పుడు మాంటెల్ తాలూకూ గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని, ఫలితంగా భూ భ్రమణ వేగం తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల రోజు నిడివి పెరుగుతుందన్నమాట. ఎంతో తెలుసా? ఏడాదికి సెకనులో 74,000వ వంతు! అలా 140 కోట్ల ఏళ్ల క్రితం 19 గంటలుండే రోజు నిడివి ఇప్పుడు 24 గంటలకు పెరిగిందని వివరించారు. అన్నట్టూ, భూమి ఇన్నర్ కోర్ ఆరేళ్ల సమయంలో ఒక మైలు దూరం అటు ఇటూ లోలకం మాదిరిగా ఊగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వైజాగ్ లో ఘనంగా ముగిసిన నేవీ డే వేడుకలు
-
ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు
-
షుగర్ వ్యాధికి జాగ్రత్తలే ఔషధం
అరసవల్లి: మధుమేహంగా పిలిచే షుగర్వ్యాధి.. తీపి పదార్ధాలు ఎక్కువ తినే వారిలో వస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్మకం. ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయా యం చేయకపోవడం, ఆహార నియంత్రణ లేకపోవడం వంటివి సమస్యగా పరిణమిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేసిన పరీక్షల్లో మాత్రమే చాలా మందికి షుగర్ వ్యాధి బయటపడుతోంది. ఈలోపే నష్టం జరిగిపోతోంది. కరోనా బాధితుల్లో ఎక్కువ మందికి షుగర్.. జిల్లాలో 1,34,303 మందికి కోవిడ్ పాజిటివ్ బారినపడ్డారు. కరోనా సోకిన తర్వాత ఎక్కువ శాతం మందికి షుగర్ వ్యాధి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అప్పటికే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉన్నవారు కోవిడ్ నుంచి సులభంగానే బయటపడ్డారు. నియంత్రణ లేని వారు ఐసీయూలో చేరారని, కొందరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో 49560 మంది షుగర్ వ్యాధి బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతోంది. 15 శాతం కేసులు పెరిగాయి.. జిల్లా జనాభాలో ఒకప్పుడు 8 శాతంగా ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు..ఇప్పుడు కరోనా తర్వాత 15 శాతం మంది పెరిగారు. ఆహారంలో కార్బోహైడ్రేడ్, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, పీచు కలిగిన పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి బరువు పెరగకుండా సహాయం చేస్తుంది. – డాక్టర్ కెల్లి చిన్నబాబు, షుగర్ వ్యాధి నిపుణుడు స్టెరాయిడ్స్ వాడితే ప్రమాదం షుగర్ వ్యాధి ఉన్నవారు స్టెరాయిడ్స్ మందులు వాడకూడదు. ఇవి వాడితే శరీరంలో ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కోవిడ్ బాధితులు స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్ల వారిలో షుగర్ మరింతగా పెరిగింది. పరిమిత మోతాదులో వాడితే ఏ మందూ హానిచేయదు. – డాక్టర్ ఎం.మనోజ్, ద్వారకామయి హాస్పిటల్ -
అంతర్జాతీయ టైగర్ డే-ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
ఒక రోజు.. ‘ముందుగా’ ముగిసింది
న్యూయార్క్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో ఒక రోజును పూర్తిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే గత నెల 29వ తేదీన 24 గంటలకు 1.59 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. అంటే కాస్త వేగంగా తిరిగి పుడమి కొత్త రికార్డును సృష్టించిందన్నమాట. దీంతో అతి తక్కువ రోజు( వన్ డే)గా జూన్ 29వ తేదీ నిలిచిపోనుంది. ఇలాంటి ఘటన మళ్లీ కొద్దిరోజుల వ్యవధిలోనే పునరావృతమవడం గమనార్హ ఈ నెల 26వ తేదీ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజున భూమి 1.50 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. సెకన్లో వెయ్యో వంతు కాలాన్ని మిల్లీ సెకన్గా లెక్కిస్తారు. భూమి తన భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్పంగా పెంచిందని పరిశోధకులు వాదిస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చే ఘటన 2021 ఏడాదిలో జరిగింది. ఆ ఏడాది ఒక నెల తక్కువ సమయంలో ముగిసిందని తేలింది. ఇలా జరగడం 1960ల దశకం తర్వాత ఇదే తొలిసారి కావడం ప్రస్తావనార్హం. అత్యంత తక్కువ సమయంలో రోజు ముగిసిన తేదీ కూడా అదే ఏడాదిలో నమోదవడం విశేషం. అదే ఏడాది జులై 19వ తేదీన 1.47 మిల్లీ సెకన్ల ముందుగానే భూమి ఒక చుట్టు చుట్టేసింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement