Sakshi News home page

ఎంపీ ఎదుటే తగువులాట..!

Published Sun, Oct 1 2023 12:38 AM

వాగ్వాదానికి దిగిన నాయకులు - Sakshi

ఆదిలాబాద్: భైంసా బీజేపీలో ఇప్పటికే అంతర్గత కలహాలు కలవరపెడుతుండగా, శనివారం పట్టణంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ సోయం బాపురావు ఎదుటే స్థానిక నాయకులు తగువులాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. శనివారం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం విలేకరుల సమావేశం సందర్భంగా వేదికపై ఎంపీ సోయం, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రామారావుపటేల్‌, మోహన్‌రావుపటేల్‌, రవిపాండే, నారాయణ్‌రెడ్డి, కౌన్సెలర్‌ అనిత సూత్రావేతో పాటు ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు బాజీరావు కూర్చోగా అక్కడే ఉన్న అసెంబ్లీ కన్వీనర్‌ సాయినాథ్‌, గాలి రవి తదితరులు బాజీరావును వారించారు.

దీంతో ఎంపీ ఎదుటే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాను ఓబీసీ నాయకుడినని ప్రొటోకాల్‌ ప్రకారం కూర్చుంటే తప్పేంటని బాజీరావు ప్రశ్నించగా, పార్టీ కోసం ఏ పని చేశావంటూ అతడిని నిలదీశారు. ఇంత జరుగుతున్నా ఎంపీ సోయం వారిని సముదాయించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

కనిపించని జిల్లా అధ్యక్షురాలు...
భైంసాలో పార్టీ నియోజకవర్గ కార్యాలయ ప్రారంభోత్సవంలో జిల్లా అధ్యక్షురాలు రమాదేవి గైర్హాజరయ్యారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆమెకు తెలియకుండానే హడావిడిగా చేశారని సమాచారం. ఈ కారణంగానే ఆమె ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎంపీ సోయం బాపురావును ప్రశ్నించగా ఈనెల 3న ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆమె బిజీగా ఉన్నారని, అందుకే కార్యక్రమానికి రాలేదని చెప్పడం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement