తానూరు: ప్రమాదవశాత్తు గాయపడిన వృద్ధురాలు బుధవారం మృతిచెందింది. ఎస్సై సందీప్ వివరాల ప్ర కారం.. మండల కేంద్రానికి చెందిన హెగ్డె చంద్రబాయి(68) వారంరోజులుగా చలి జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి మంటకాగేందుకు పోయివద్ద పడుకుంది. ప్రమాదవశాత్తు నిప్పుంటుకోవడంతో కేకలు వేసింది. కుటుంబ సభ్యులు గమనించి మంటలు ఆర్పివేసి చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. మృతురాలి కుమారుడు పాండురంగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్ననట్లు వెల్లడించారు.
జ్వరంతో మహిళ మృతి
నేరడిగొండ: మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోలంకి మౌనిక(36) జ్వరంతో మృతి చెందింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెను మహారాష్ట్రలోని యవత్మాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం క్రితం నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ రిమ్స్లో సైతం చికిత్స చేయించినప్పటికీ నయం కాకపోవడంతో మహారాష్ట్రకు తరలించినట్లు పేర్కొన్నారు. మృతురాలికి భర్త గోవన్ సింగ్తో పాటు ముగ్గురు కుమారులున్నారు.
ఫిట్స్తో ఒకరి మృతి
లక్ష్మణచాంద: ఫిట్స్తో ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పుట్టి లింగన్న (38) వ్యవసాయంతో పాటు చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆరేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన తమ సంఘం సభ్యులతో కలిసి చింతల్చాంద సమీపంలోని గోదావరిలో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో మూర్ఛ రావడంతో గమనించిన గ్రామస్తులు వెంటనే ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం కొద్ది గంటల తరువాత లింగన్న మాములు స్థితికి రావడంతో మళ్లీ సాయంత్రం 4గటంల ప్రాంతంలో చింతల్చాంద గోదావరికి ద్విచక్ర వాహనంపై చేపలు పట్టడానికి బయలుదేరాడు. ద్రోణ ఉన్నత పాఠశాల సమీపంలో మూర్ఛ రావడంతో రోడ్డు పక్కనే ఉన్న వరి పొలంలో పడిపోయాడు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో అక్కడే మృతి చెందాడు. భార్య పుట్టి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. లింగన్నకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు.
చెరువులోపడి యువకుడు..
భైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులోపడి భూమన్న (35) మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం భూమన్న గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లగా కాలుజారి నీటిలో పడి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బావిలోపడి యువకుడు మృతి
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన సూర రాజేశ్వర్(25) వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఈ నెల 10న గ్రామ సమీపంలోని తన బాబాయి వరి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. బుధవారం ఉదయం మృతదేహం బయటకు తేలింది. రాజేశ్వర్కు ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై భీంరావు పేర్కొన్నారు.