'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ | Sakshi
Sakshi News home page

'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

Published Tue, Dec 19 2023 1:44 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ‘నన్ను ఆదరించి గెలిపించిన ఆదిలాబాద్‌ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తా. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ప్రతీ వార్డులో స్వయంగా పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటా.

ఎమ్మెల్యే నిధులతో పాటు అవసరమైతే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. ఎమ్మెల్యేతో సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్‌ నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వందలాది మంది ఫోన్‌ చేసి సమస్యలను ఎమ్మెల్యేకు నివేదించారు. వాటిని ఓపిగ్గా ఆలకించిన ఆయన పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు.

ప్రశ్న: మున్సిపల్‌ పరిధిలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌, ఎన్టీఆ ర్‌ చౌక్‌ ప్రాంతాల్లో తోపుడు బండ్లు రోడ్డుకు దగ్గరగా ఉంచడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి..? (చంద్రశేఖర్‌, రిటైర్డ్‌ టీచర్‌, న్యూహౌసింగ్‌ బోర్డు)
ఎమ్మెల్యే: పట్టణంలో ఈ సమస్య ఉన్నది వాస్తవమే. గత పాలకుల హయాంలో రోడ్లు ఇరుకుగా నిర్మించారు. దీంతో చిరు వ్యాపారులు తో పుడు బండ్లను రోడ్లపైకి తీసుకొచ్చి విక్రయాలు జరిపిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ట్రాఫిక్‌ పోలీసులు, మున్సిపల్‌ అధికారులతో మాట్లాడుతాను.

ప్రశ్న: తిర్పెల్లి కాలనీ సమీపంలో జాతీయ రహదా రిపై మురుగునీరు ప్రవహించడంతో పాటు గుంతలు ఉన్నాయి. దీంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారుతోంది. (కళ్యాణ్‌, శ్రీరాంకాలనీ)
ఎమ్మెల్యే: మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కరించేలా చూస్తాను.

ప్రశ్న: టాక్లీ నుంచి బేల వరకు గల రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. మహారాష్ట్రకు చెంది న లంబాడాలు బేలలోని పలు గ్రామాలకు వలసవచ్చి రెవెన్యూ అధికారులకు ముడుపులిచ్చి అడ్డదారిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం పొందుతూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు.. (సంతోష్‌, టాక్లీ)
ఎమ్మెల్యే: ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహించి వాటి పరిస్థితులను తెలుసుకుంటాను. అలాగే నకిలీ ధ్రువీ కరణ పత్రాలను జారీచేయకుండా రెవెన్యూ అధికారులను ఆదేశిస్తా.

ప్రశ్న: నాకు నిజామాబాద్‌ జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. రూ.10లక్షలు ఖర్చైంది. ఉన్న ప్లాటు అమ్మేశాను. సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా సాయం అందలేదు. (సాయికుమార్‌, హౌసింగ్‌బోర్డు )
ఎమ్మెల్యే: కొత్త ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేశాక వాటి ప్రకారం ఆర్థిక సాయమందించేందుకు తప్పకుండా కృషి చేస్తాను.

ప్రశ్న: రాత్రి సమయంలో వైద్యం కోసం రిమ్స్‌ ఆసుపత్రికి వెళితే ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లమని అక్కడి వైద్యులు సూచిస్తున్నారు. (హిదాయత్‌ పఠాన్‌, బొక్కల్‌గూడ)
ఎమ్మెల్యే: రిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడి, రాత్రి డ్యూటీలో డాక్టరేవరున్నారో, అక్కడి సమస్యలేంటో తెలుసుకుని ఇంకోసారి జరుగకుండా తగు చర్యలు తీసుకుంటాను.

ప్రశ్న: ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం అంకాపూర్‌ పంచాయతీ పరిధిలో కొత్తగా ఏర్పడిన చిన్నమారుతిగూడలో తాగునీరు, రోడ్లు, కరెంట్‌ వంటి వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. సౌకర్యాలు కల్పించేలా చూడాలి.(గణపతి, సురేష్‌, సిడాం మారుతీ, చిన్నమారుతీగూడ, అంకాపూర్‌)
ఎమ్మెల్యే: త్వరలోనే మండల అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శిస్తాను. అక్కడి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సాధ్యమైనంతవరకు కృషి చేస్తాను. ఇప్పటికే పాయల్‌ పౌండేషన్‌ ద్వారా బోరు వేయించాము.

ప్రశ్న: మాకు ప్రభుత్వమిచ్చిన ప్లాట్లలో సీపీఐ నాయకులు గుడిసెలు వేయించారు. వాటిని తొలగించాలని కమిషనర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. (గాలిపెల్లి నాగన్న, మావల)
ఎమ్మెల్యే: మున్సిపల్‌ అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకునేలా చూస్తాను. ఈ నెల చివరిలోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.

ప్రశ్న: ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మా పల్లెకు బస్సులు రావడం లేదు..? (సురేష్‌, అంకాపూర్‌ జీపీ)
ఎమ్మెల్యే: ఈ విషయమై ఆర్టీసీ అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహిస్తాం. రహదారి సౌకర్యం ఉండి ఆర్టీసీ సదుపాయం లేని గ్రామాలకు బస్సులు నడిపించేలా చర్యలు చేపడతాం. అన్ని గ్రామాలకు బస్సులు వచ్చేలా చూస్తాను.

ప్రశ్న: టీచర్స్‌ కాలనీలోని అడాణేశ్వర్‌ మందిర్‌ ప్రాంతంలో రహదారి, నీటి సమస్య తీవ్రంగా ఉంది..? (మధుకర్‌, టీచర్స్‌కాలనీ)
ఎమ్మెల్యే: మీ కాలనీ సమస్యలు ఇదివరకే నా దృష్టి కి వచ్చాయి. ఇటీవలే మున్సిపల్‌ అధికారులతో మాట్లాడాను. రోడ్ల నిర్మాణంతోపాటు నీటి సరఫరా అయ్యేలా చర్యలు చేపడతాం.

ప్రశ్న: పట్టణంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించారు. దీంతో పాదాచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను పరిష్కరించాలి.. (కేతిరెడ్డి గంగారెడ్డి, కై లాస్‌నగర్‌)
ఎమ్మెల్యే: ఈ విషయమై పోలీసు, మున్సిపల్‌ అధి కారులతో సమీక్ష నిర్వహిస్తాం. వారం పది రో జుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఆక్రమణల విషయమై, వీధి వ్యాపారుల సముదాయం గురించి కూడా రివ్యూచేస్తాం.

ప్రశ్న: మా కాలనీలో సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. రహదారి సమస్యతో సతమతం అవుతున్నాం... (రాంరెడ్డి, టీచర్స్‌ కాలనీ)
ఎమ్మెల్యే: త్వరలోనే వార్డును విజిట్‌ చేసి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా.

ప్రశ్న: మా కాలనీతో పాటు మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుధ్యం లోపించింది. దీంతో జనం రోగాల బారిన పడుతున్నారు..?(శ్రీనివాస్‌, శాంతినగర్‌)
ఎమ్మెల్యే: పట్టణంలోని శాంతినగర్‌తో పాటు అన్ని వార్డుల్లో పారిశుధ్య సమస్య తలెత్తకుండా మున్సిపల్‌ అధికారులను ఆదేశిస్తాం. అదనపు సిబ్బందిని సైతం నియమించైనా సమస్యను పరిష్కరిస్తాం.

ప్రశ్న: కాలనీకి సంబంధించిన మురుగు నీరంతా నా ఇంటి ముందు వచ్చి చేరుతోంది. వాసన భరించలేకపోతున్నాం. మున్సిపల్‌ అధికారుల కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..( కార్తికేయ, కేఆర్‌కే కాలనీ)
ఎమ్మెల్యే: మున్సిపల్‌ అధికారులతో మాట్లాడతాం. కేఆర్‌కే కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ సమస్యలు తలెత్తకుండా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందిస్తాం. కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

ప్రశ్న: కాలనీలో ఎవరైన మరణించినప్పుడు అంతి మ యాత్ర కోసం అవస్థలు ఎదురవుతున్నా యి. శ్మశానవాటిక లేకపోవడంతో రోడ్డు పక్క న దహన సంస్కారాలు చేయాల్సి వస్తోంది.. ?(దోని జ్యోతి, శ్రీరాంకాలనీ)
ఎమ్మెల్యే: కాలనీలో శ్మశానవాటిక ఏర్పాటు కోసం అధికారులతో మాట్లాడతాం. దీనికి సంబంధించి స్థల సేకరణ చేపట్టి నిర్మాణం కోసం కృషి చేస్తా.

ప్రశ్న: మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో చాలా ఇబ్బందవుతుంది. కొత్త రోడ్డు నిర్మించాలి (రవీందర్‌, చిచ్‌దరి ఖానాపూర్‌)
ఎమ్మెల్యే: సంబంధిత శాఖల అధికారులతో మాట్లా డి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా. త్వరలోనే రోడ్డును కూడా పరిశీలిస్తా.
ఇవి చ‌ద‌వండి: ఇటు సీతక్క‌కు, అటు దుద్దిళ్ల‌కు స‌వాలుగా లోక్‌స‌భ ఎన్నిక‌లు!

Advertisement

తప్పక చదవండి

Advertisement