● ప్రజావేదికల్లో వివరాలు వెల్లడించిన డీఆర్డీవో
ఖానాపూర్: ఉపాధిహామీ పథకం కింద 2022– 23లో రూ.4,54,08,974తో చేపట్టిన పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బుధవారం రాత్రి 8 గంటల వరకు ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో విజయలక్ష్మి వివరాలు వెల్లడించారు. పనుల్లో భాగంగా రూ.4,22,11,212 నగదు కూలీలకు చెల్లించగా, రూ.29,97,762 మెటీరియల్ కోసం చెల్లించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ.4,61,84,115 నిధులతో చేపట్టిన పనుల రికార్డులను సంబంధిత అధికారులు తనిఖీ బృందానికి ఇవ్వలేదని పేర్కొన్నారు. అటవీ శాఖకు చెందిన రూ.86,68,541 పనుల రికార్డులు సైతం అందించలేదన్నారు. గతేడాది జరిగిన ప్రజావేదికలో రూ.23,81,371 విలువైన పనులకు సంబంధించి నిధుల దుర్వినియోగంపై క్వాలిటీ కంట్రోల్కు నివేదించామని తెలిపారు. దానికి సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. గతేడాది దుర్వినియోగమైన నిధుల నుంచి రూ.7,24,214 నగదు రికవరీ చేశామని తెలిపారు. అలాగే ఈ ఏడాది మొత్తం రూ.16,114 రికవరీకి ఆదేశించామని, రూ.39వేలు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈజీఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడి ఉంటుందని చెప్పడంతో వారిపై డీఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాబుదారీగా ఉండాలని, ఇలాంటి సమాధానాలు చెప్పొద్దని సూచించారు. ఎంపీపీ మోహిద్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, ఎస్టీఎం దత్తు, అంబుడ్స్మెన్ నవీన్, బీఏవో లక్ష్మణ్, ఎంపీడీవోలు మల్లేశ్, వనజ, ఏపీవోలు రమేశ్, ప్రమీల ఉన్నారు.