బీఆర్‌ఎస్‌ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్‌ | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్‌

Published Mon, Mar 25 2024 1:45 AM

- - Sakshi

కేసీఆర్‌ అవినీతికి నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం

టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌

ఆదిలాబాద్‌: దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన సాగిందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. పట్ట ణంలోని జేకే ఫంక్షన్‌హాల్‌లో జిల్లా అధ్యక్షుడు తిలక్‌రావు అధ్యక్షతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పార్లమెంట్‌ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతికి నిలు వెత్తు నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచాయన్నారు.

కేంద్రప్రభుత్వ గుర్తింపు పొందిన జాతీయస్థాయిలోని స్వతంత్ర సంస్థ ఆడిటింగ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, అమలు సరిగాలేదని, నిధుల వినియోగం సక్రమంగా లేదని చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కంపెనీ నుంచి కేసీఆర్‌ అందినకాడికి దండుకున్నారని విమర్శించారు. అవసరానికంటే అదనంగా ఖర్చు చేసి పనులు చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు దశాబ్దాల క్రితం కట్టారని అవన్నీ నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం పనులు మాత్రం ఆదిలోనే పునాదులు కదులుతున్నాయన్నారు. కోట్లాడి తెచ్చిన రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలనతో అవినీతి పెరిగిపోయిందన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యం
పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా టీజేఎస్‌ శ్రేణులు పనిచేయాలని కోదండరామ్‌ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్‌ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసి పోడు భూములు, డీ 27, డీ28 కాలువల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతకముందు నాయకులు కోదండరామ్‌ను సన్మానించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు సర్దార్‌ వినోద్‌, దుర్ము, గోనె శ్రీనివాస్‌, బెనహర్‌ సిరాజ్‌, రాజేశ్వర్‌రెడ్డి, లింగన్న పాల్గొన్నారు.

నిర్వహణ లేకనే ‘కడెం’కు ప్రమాదం..
కడెం ప్రాజెక్ట్‌ నిర్వహణను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం నెలకొందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు. కడెం ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. వరద గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ ఇంజినీర్లు మొదట కట్టిన ప్రాజెక్టుల్లో కడెం ఒకటన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కడెంను పట్టించుకోకపోవడంతో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిందని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, మరమ్మతు చేయిస్తోందని తెలిపారు. కడెం ప్రాజెక్ట్‌కు బ్యాలెన్సింగ్‌ రిజర్వార్‌గా ఎగువన కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తే ఆయకట్టును స్థిరీకరించవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయన వెంట టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు తిలక్‌రావు ఉన్నారు.

ఇవి చదవండి: సార్‌.. గిరాకీల్లేవ్‌!

Advertisement

తప్పక చదవండి

Advertisement