పెదబయలు: రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలని ఏపీ గురుకులం సహాయ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పెదబయలు ఏపీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల లో పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఆంగ్ల మాధ్యమం టెస్ట్ బుక్స్ చదివించారు. విద్యార్థులు సమాధానాలు బాగా చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలంటే ముందు భయం లేకుండా ఉండాలని, తర్వాత ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి, మంచి దస్తూరి, కొట్టి వేతలు లేకుండా రాయడం, ముందుగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలని, తదితర విషయాలను వివరించారు. బైజూస్ యాప్ ఎలా ఉపయోగపడుతుందని, ఉపాధ్యాయులు ఎలా అవగాహన కల్పిస్తున్నారని 8వ తరగతి విద్యార్థులను ప్రశ్నించారు. ఉపాధ్యాయులు తరగతిలో చెప్పిన తర్వాత అదే పాఠాన్ని అనేకమార్లు చదవడం వల్ల సందేహం తీరుతుందని సమాధానమిచ్చారు. గతంలో సందేహం వస్తే మరలా టీచర్ను అడిగేవారమని, రోజూ సందేహాలు అడగడం ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు ట్యాబ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం మన బడి నాడు –నేడు ద్వారా సదుపాయాల కల్పన, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్య, విద్యా కానుక కిట్లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ, చదువుతోపాటు మంచి ఆరోగ్యం అందించేందుకు పౌష్టికాహారంతో కూడిన మెనూ అందిస్తున్నట్లు డిప్యూటీ కార్యదర్శి తెలిపారు. అనంతరం పాఠశాలలో సదుపాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు వేతనాలు పెంచాలని, తక్కువ వేతనాలతో పని చేస్తున్నామని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఆయనకు అందించారు. అల్లూరి జిల్లా నోడల్ ప్రిన్సిపల్ మూర్తి, స్థానిక ప్రిన్సిపాల్ శంకర్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గిరిజన గురుకులం రాష్ట్ర డిప్యూటీ
కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి