డుంబ్రిగుడ: అరకు ప్రాంతానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు అందుబాటులోకి తెచ్చామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు వై.మధుసూదనరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మండలంలోని కొర్రాయి అంజోడ సిల్క్ఫారం వద్ద నిర్మించిన ఎకో టూరిజం పార్కును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రా ఊటీగా గుర్తింపు పొందిన అరకు ప్రాంతంలోని పర్యాటక అందాలను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి సందర్శకులు భారీ తరలివస్తున్నారన్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఎకో టూరిజం పార్కుల్లో కాటేజీలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఫారెస్టు అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎఫ్వో కార్యాలయ భవనానికి శంకుస్థాపన
చింతపల్లి రూరల్: మండల కేంద్రంలో చింతపల్లిలో డివిజనల్ అటవీశాఖాధికారి కార్యాలయ, అతిథి గృహ భవనాలకు, కృష్ణాపురంలో ఎకో టూరిజం నిర్మాణ పనులకు ఏపీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.మధుసూదనరెడ్డి వర్చూవల్ విధానంలో ఆదివారం శంకుస్థాపన చేశారు. స్థానికంగా డీఎఫ్వో సూర్యనారాయణ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎఫ్వో మాట్లాడుతూ డివిజనల్ అటవీశాఖాధికారి కార్యాలయం, అతిథి గృహ నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1.50కోట్లు మంజూరు చేసిందన్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారన్నారు. కృష్ణాపురంలో ఎకో టూరింజం ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.25 లక్షలు వెచ్చించిందన్నారు. డిసెంబర్ మొదటి వారంలో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డీఎఫ్వో రాజు,గిరిజన సంక్షేమశాఖ డీఈ చాణిక్య, రేంజి అధికారులు పాత్రుడు, వీరేంద్ర, భార్గవ్వర్మ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.